Showing posts with label Praveen Kumar IPS Issue. Show all posts
Showing posts with label Praveen Kumar IPS Issue. Show all posts

Friday, August 8, 2014

దళిత విద్యార్థుల నిరసన By ప్రొఫెసర్ జి. హరగోపాల్


Updated : 8/7/2014 4:11:53 AM
Views : 239
ఒకవైపు విద్యావ్యవస్థ, న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పేదలకు, దళితులకు వ్యతిరేకంగా బలీయమౌతున్నప్పుడు..పాములు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఉంటాయో మనకు తెలియాలి కదా! ప్రజాస్వామ్య విలువల మీద, దళితచైతన్యం మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నప్పుడు, వామపక్ష విద్యార్థులు విద్యా కాషాయీకరణ మీద నిర్వహించిన చర్చలో దళిత విద్యార్థులు భాగం కావాలా వద్దా అనేది దళితఉద్యమం చర్చించుకోవలసిన అంశం. 

రెండు రోజుల క్రితం (5-8-2014) హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సం ఘం వారు విద్య-కాషాయీకరణ మీద మాట్లాడమని పిలిచారు. వామపక్ష విద్యార్థుల మీటింగ్ కాబ ట్టి కుడిపక్ష విద్యార్థి సంఘం (Right Wing) నిరసన తెలిపే అవకాశం కొంత ఉంది. అయినా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి వల్ల చాలా వరకు అలాంటి సంఘటనలు అరుదు. ఈ ప్రసంగానికి విద్యార్థులు చాలా సంఖ్యలోనే గుమిగూడారు.

నా ప్రసంగం ప్రారంభమౌతూనే నలుగురు దళిత విద్యార్థులు నినాదాలు రాసిన ప్లకార్డులు పట్టుకొని సభలో లేచి నిలబడ్డారు. అందులో ముఖ్యంగా ఒకటి- ప్రవీణ్ కుమార్‌పై మీరు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వండి, రెండు- మానవ హక్కుల నాయకుడిగా కులాన్ని గుర్తిస్తారా లేదా? ఈ రెండు అంశాల మీద చాలా కాలంగా వాదవివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రవీణ్‌కుమార్‌కు సంక్షేమ స్కూళ్ల ఉపాధ్యాయుల మధ్య ఏర్పడ్డ ఘర్షణ ముఖ్యమంత్రి జోక్యంతో సమసిపోయిందని మిత్రులు చెప్పారు. దాంతో వివాదం పూర్తయ్యిందని నేను భావించాను. కానీ అది ఇంకా ఏదో రూపంలో కొనసాగుతున్నది.ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. 

దాదాపు మూడు దశాబ్దాల కాలం అధ్యాపకుడిగా పని చేసిన విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన తెలపడం ఒక కొత్త అనుభవం.నిరసనకు స్పందనగా విద్యార్థులు అలా చేయడా న్ని నేను తప్పుపట్టడం లేదని, ఒక సభలో దళిత విద్యార్థులు అధ్యాపకుడిని ప్రశ్నించడం ఒకరకంగా ఆహ్వానించవలసిందేనని, మేము చెప్పిన పాఠాలు మళ్లీ మాకే అప్పజెప్తున్నారని అంటూ, ఒక విద్యార్థి సంఘం ఒక అంశం మీద ప్రసంగించడానికి పిలిచినప్పుడు, దళిత విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నల మీద మాట్లాడడం సబబుకాదన్నాను.దళిత విద్యార్థులు నన్ను ప్రత్యేకమైన చర్చకు పిలిస్తే ఈ అంశాల మీద సమగ్రంగా మాట్లాడుకోవచ్చని చెప్పాను. దాంతో విద్యార్థులు ప్రసంగం వినడానికి కూర్చున్నారు.

ఈ నిరసనలో నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, కొంత చికాకు పరిచింది కమ్యూనిస్టులు ఆకుపచ్చ గడ్డిలో దాక్కున్న ఆకుపచ్చని పాములు అనే నినా దం. ఈ అంశం అక్కడ ఎందుకు లేవదీయవలసి వచ్చిందో, దానికి ప్రవీణ్‌కుమార్ సంఘటనకు ఏం సంబంధమో నాకు అర్థం కాలేదు. దానికి స్పంది స్తూ డాక్టర్ అంబేద్కర్ చేసిన విప్లవము-ప్రతీఘా త విప్లవం అనే వ్యాసాన్ని అందరూ చదవాలని సూచించాను.

దళిత చైతన్యం వెల్లివిరిసిందని భావించిన ఉత్తరప్రదేశ్‌లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీలు ఎన్నికల్లో పెద్దఎత్తున దెబ్బతినడమే కాక బీజేపీ ఏకంగా 73ఎంపీ సీట్లు గెలుచుకున్నది. బీజేపీ, దానివెనక ఉన్న మతతత్వశక్తుల గురించి అందరికి తెలుసు. ఏ మత సాలెగూడు నుంచి మన దేశం బయటపడాలని అంబేద్కర్ తపించాడో ఆ సాలెగూడు ఈరోజు చాలా విస్తృతంగా అల్లుకుంది. ఆరు, ఏడు దశాబ్దాల దళిత ఉద్యమం, ఆ ఉద్యమ విజయాలు ఏమైనట్టు? అంబేద్కర్ భావజాలం విస్తృతంగా చర్చకు వచ్చి,ఆ ప్రభావం దాదాపు అన్ని రంగాలకు విస్తరించినప్పుడు, మతోన్మాద రాజకీయాలు ఎందుకు ఇంత బలపడినట్టు? ఈ ప్రశ్న మనం అడగాలా వద్దా? దానికి కారణాలు వెతకాల వద్దా? అనే సవాలు మనముందు ఉంది. 

రెండు వారాల కిందట మద్రాసు దళిత సంఘా లు నిర్వహించిన ఒక సదస్సుకు ప్రారంభోపన్యాసం చేయడానికి నన్ను, పి.ఎస్.కృష్ణన్ గారిని పిలిచారు. ఈ సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం మద్రాసు హైకోర్టు అడ్వొకేట్స్ కొందరు అడ్వొకేట్స్ ఫర్ సోషల్ జస్టిస్ అనే పేర ఏర్పడి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్‌ను రద్దు చేయవలసిందిగా సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశారు.సాధారణ పరిస్థితిలో ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చేదే. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఏదైనా జరగవచ్చు! ఈ చట్టాన్ని రద్దు చేస్తే దళితులకు తిరుగులేని అన్యా యం జరుగుతుంది. చుండూరు కేసును కొట్టివేసిన న్యాయవ్యవస్థ తీరుతెన్నులు ఏమిటో.. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల దళితులకు బాగా తెలుసు. ఈ చట్టానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలని మద్రాసు సభ తీర్మానించింది.

విద్య కాషాయీకరణలో భాగంగా భగవద్గీతను బోధించాలని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడుతున్నాడు. భగవద్గీతలో రెండు అంశా లు చాలా ప్రభావవంతమైనవి. ఒకటి-వర్ణవ్యవస్థ భగవంతుడి ఆదేశంగా మనుషులు అసమానులని ప్రతిపాదిస్తూ కులవ్యవస్థను సమర్థించడం; రెండు- మనుషులు తమ తమ బాధ్యతలను నిర్వహిస్తూ శ్రమ ఫలితాలను భగవంతుడికి వదిలివేయాలనేది. అంటే హక్కులు అనే భావనకు భగవద్గీతలో స్థానం లేదు. ఈ మధ్య ఈ రాజకీయాలను విశ్వసించే వారు ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేసే విదేశీయులకు హిందూమతం, అలాగే భారతీయ ఆచారాలను పునరుద్ధరించడానికి తాము చేస్తున్న కృషి గురించి ప్రసంగాలు చేస్తున్నారు. 

ఒకవైపు విద్యావ్యవస్థ, న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పేదలకు, దళితులకు వ్యతిరేకంగా బలీయమౌతున్నప్పుడు..పాములు ఎక్కడ ఉన్నాయో, ఎక్క డ ఉంటాయో మనకు తెలియాలి కదా! ప్రజాస్వా మ్య విలువల మీద, దళిత చైతన్యం మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నప్పుడు, వామపక్ష విద్యార్థులు విద్యా కాషాయీకరణ మీద నిర్వహించిన చర్చలో దళిత విద్యార్థులు భాగం కావాలా వద్దా అనే ది దళిత ఉద్యమం చర్చించుకోవలసిన అంశం. 

haragopal
తెలంగాణ రాష్ట్రంలో విప్లవ ఉద్యమాల వలన వివిధ సామాజిక, పౌరహక్కుల ఉద్యమాల వల్ల కారంచేడు, చుండూరు లాంటి దుర్మార్గాలు జరగడానికి అంత అవకాశం లేదు. మొత్తం దేశంలో దళిత ఆత్మగౌరవానికి హిందూ ముస్లింల సఖ్యతకు, ఇది వికాసం చెందడానికి కావలసిన చారిత్రక సంద ర్భం తెలంగాణలో ఉన్నది. దళితుల తరఫున నిలబడే ప్రముఖ దళిత నాయకులే కాక, చాలా ప్రజాస్వామిక గొంతులున్నాయి.అద్భుతమైన దళిత వాగ్గేయకారులున్నారు.కమ్యూనిస్టుల గురించి మనం ఏం మాట్లాడినా, సామాజిక మార్పు కోసం చాలామంది యువకులు ప్రాణత్యాగం చేశారు.

పార్లమెంటరీ వామపక్షాలలో, అలాగే విప్లవ రాజకీయాలలో పొరపాట్లు ఉండవచ్చు. దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. కానీ వాళ్లను దాక్కున్న పాములు అనడం ఏం న్యాయం?
విద్యార్థులు నిరసన తెలపడం ఒకవైపున అనుభవమైతే, మొన్న ఒక దళిత మిత్రుడి అభినందన సభ కు వెళితే, దళిత నాయకుడు జె.బి. రాజుగారు హరగోపాల్ గారూ మీ గురించి మా వాళ్లు కొన్ని అపవాదులు నా దగ్గరికి వచ్చి చెబుతుంటారు. నేను మాత్రం ఆయన మనవాడు అని చెప్పి పంపిస్తుంటానని అన్నాడు. అలాగే మద్రాసులో కొందరు దళిత మిత్రులు మీ మీద ఫేస్‌బుక్‌లో దళిత వ్యతిరేకిగా ప్రచారం జరుగుతున్నది. అయినా మీ పట్ల మాకు గౌరవం తగ్గలేదని అన్నారు. బహుశా సంధి కాలంలో జీవించడం వల్ల పరస్పర విరుద్ధ అనుభవాల నుంచి జీవనయానం జరగడం ఒక గొప్ప అనుభవమే.
Namasete Telangana Telugu News Paper Dated: 07/08/2014 

Sunday, August 3, 2014

ప్రవీణ్‌కుమార్ ఉదంతపు ప్రశ్నలు - టంకశాల అశోక్


దళితుడైన తెలంగాణ ఐపిఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌కు గురుకుల పాఠశాలల డైరెక్టర్ హోదాలో అక్కడి ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడిన సమస్య, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జోక్యంతో సమసిపోయినట్లు వార్తలు సూచించాయి. అది నిజంగా సమసిపోయినట్లయితే సంతోషించవలసిందే. కాని అట్లా జరిగిందా అన్నది ఒక ప్రశ్నయితే, ఇటువంటి విషయాలలో ముడిబడి ఇతర ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటిని చర్చించుకోవటం అవసరం.
ఈసారి స్కూళ్లు తెరిచిన తర్వాత సుమారు రెండు వారాలు గడిచినా గురుకుల పాఠశాలల్లో పిల్లల హాజరీ నాల్గవ వంతుకు మించలేదు. దళిత విద్యార్థుల విషయంలో అట్లా జరగటం చూసి ఆందోళన చెందిన ప్రవీణ్‌కుమార్ ఆ విషయమై టీచర్లను మందలించి, అందుకు బాధ్యులనుచేస్తూ వారి వేతనాలను ఎందుకు కత్తిరించకూడదో వివరించాలంటూ నోటీసు జారీచేసారు. దానితో వివాదం తలెత్తింది. ఎక్కువ వివరాలలోకి వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకోవాలంటే, విద్యార్థులు దళితులు, వారి బాగుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరంభించిన గురుకుల పాఠశాలలు అవి. డైరెక్టర్ అయిన అధికారి దళితుడు. పిల్లలు రెండువారాలైనా స్కూళ్లకు రాకపోవటం ఆయనకు సహజంగానే ఆందోళన కలిగించింది. కనుక చర్యలు తీసుకోవాలనుకున్నారు. రెండవ వైపునుంచి చూస్తే, విద్యార్థులు దీర్ఘకాలిక సెలవుల తర్వాత ఆలస్యంగా రావటం ఎప్పుడూ జరిగేదేనన్నది ఉపాధ్యాయ సంఘాల వాదన. అది అవాంఛనీయమేనని వారూ అంగీకరిస్తున్నారు. అయితే అందుకు తమ జీతాలను కత్తిరించబూనటమేమిటన్నది వారి ప్రశ్న.
ఇట్లా మొదలైన వివాదంలోకి అసలు విషయంతో నిమిత్తం లేని వేర్వేరు అంశాలు వచ్చి చేరాయి. సమస్య చిలికి చిలికి గాలివానగా మారింది. ప్రవీణ్‌కుమార్ దళితుడు గనుక ఉపాధ్యాయులు, వారి మద్దతుదారులు కులదృష్టితో ఇదంతా చేస్తున్నారని, దళిత విద్యార్థుల పట్ల కూడా వారికి శ్రద్ధలేదన్న మాటలు ఇటునుంచి రాగా, సదరు అధికారి ఐపిఎస్ అయినందున పోలీస్ లక్షణాలతో వ్యవహరిస్తున్నారని, లోగడ తెలంగాణ ఉద్యమం, ఇతర ఉద్యమాల విషయంలోనూ అట్లాగే ప్రవర్తించాడని, ఈ తరహా లక్షణాలకు కులంతో సంబంధం ఏమిటని అవతలివారు వాదించారు. ఇది ఎంతటి చిక్కుముడో ఎవరైనా గ్రహించవచ్చు. దానిని అట్లాగే వదిలివేసినట్లయితే పరిస్థితి బహుశా చేయిజారి ఉండేది. ఆ మాటను గ్రహించి కావచ్చు ముఖ్యమంత్రి జోక్యంచేసుకుని రెండువైపులా మాట్లాడి సర్దుబాటుచేసారు. కాని బయట చర్చ ఆగలేదు. ఉభయ శిబిరాల మధ్య అవగాహనలు పెరగలేదు. సమస్య వౌలిక రూపంలో పరిష్కారంకాలేదు. ఈ వ్యాసం రాయటానికి కారణం అదే. వాస్తవానికి ఈ తరహా సమస్యలు, చర్చలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ తలెత్తుతుండేవి. అధికార వ్యవస్థలోనే గాక, ఆ వ్యవస్థకు బయటి సమాజంలోనూ కన్పించేవి. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం మొదటి ఉదంతం తెలంగాణలో చోటుచేసుకున్నా మునుముందు అక్కడనే మరిన్ని గాని, రెండవవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగాని ఇటువంటివి జరగబోవని ఎవరూ చెప్పలేరు.
అందువల్ల ఇది జాగ్రత్తగా ఆలోచించి చర్చించుకోవలసిన విషయమవుతున్నది. ఇందుకు పరిష్కారం పలానా అని ఇక్కడ చెప్పబోవటం లేదు. కాని ఇటువంటివి ‘అందరూ’జాగ్రత్తగా ఆలోచించి చర్చించుకోవలసిన విషయాలంటూ ఒక అస్పష్టమైన జనరల్ వ్యవహరణా సూత్రాన్ని మాత్రం చెప్పి ఊరుకోవలసి వస్తున్నది. అంతకన్న ఎక్కువ ముందుకు వెళ్లటం సమస్య. ఎంత నిష్పక్షపాతమైన వైఖరి తీసుకున్నా అటునుంచో, ఇటునుంచో ఒక రంగునద్దే పరిస్థితి మొదటినుంచీ ఉంది. ఆ కారణంగా ప్రజాస్వామిక చర్చ అన్నది స్వేచ్ఛగా జరగకుండా కుంచించుకుపోతున్నది. ఇది అంతిమంగా ఇరువర్గాలకు, ప్రజాస్వామిక విలువలకు, దీర్ఘకాలిక సామాజిక పురోగతికి హానికరమవుతుంది. ఒక నిర్దిష్ట వివాద సందర్భంలో ఒకరిదో, మరొకరిదో పైచేయి కావచ్చుగాక. కాని అది నిజమైన అర్థంలో ఎవరూ సంతోషించలేనిదే. ఎందుకంటే ఇరువురికీ హానికరమే గనుక. ఇక, పరిమిత స్థాయిలోనైనా కొంత ఆలోచన ఇక్కడ చేయక తప్పదు. ఈ తరహా సమస్య తెలంగాణలో తలెత్తటం, అదికూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన కొన్ని వారాలలోనే జరగటం విచారాన్ని కలిగిస్తున్నది. తెలంగాణ చిరకాలంగా వివిధ ఉద్యమాలు, చైతన్యాల సమాజం. వాటి ప్రభావం ఏదో ఒక స్థాయిలో లేని వర్గమంటూ అక్కడ లేదు. అందుకది దేశవ్యాప్తంగా గుర్తింపుపొందింది. ఇది ఒకటికాగా, దశాబ్దకాలానికి పైగా సాగిన ఈ విడత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఈ అన్నివర్గాల ప్రజలు క్రియాశీలంగా పాల్గొన్నారు. కలిసి పాల్గొన్నారు. ఉద్యమాలు కొత్త అవగాహనలను కలిగించి, కొత్త విలువలను కూడా సృష్టిస్తుంటాయి.
అటువంటి స్థితిలో ప్రవీణ్‌కుమార్ వర్సస్ ఉపాధ్యాయుల వివాదం ఎందుకు తలెత్తింది? ఒకవేళ తలెత్తినా ఉభయులు కలిసి ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? ఆ పని చేయకపోగా తమ మాటలు, చేతలతో వివాద పరిధిని విస్తరించి మరింత జటిలం ఎట్లాచేసారు? అవగాహనలు, కొత్త చైతన్యాలు, విలువలు ఎవరికి లోపించినట్లు? లేక ఇరువురికీనా? తెలంగాణలో సామాజిక సంబంధాలలో, అధికార యంత్రాంగానికి- సిబ్బందికి మధ్య సంబంధాలలో కొత్త విలువలు రావాలి. సమస్యల పరిష్కారం (కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్)లో సంబంధిత వర్గాలన్నీ ఒక కొత్త సంస్కృతిని పెంపొందించాలి. ‘బంగారు తెలంగాణ’, ‘తెలంగాణ నిర్మాణం’అనే దృక్పథాలలో (కానె్సప్ట్) ఆర్థికమైన వస్తుపర (మెటీరియల్) అభివృద్ధికే కాదు. విలువలపరమైన అభివృద్ధికి కూడా చోటు ఉండేట్లు సకలజనులూ జాగ్రత్తపడకపోతే అది నిజమైన బంగారు తెలంగాణ ఎంతమాత్రం కాబోదు. అది మెటీరియలిస్టు ‘బంగారు లోహపు తెలంగాణ’ అయితే కావచ్చు గాని, ‘బంగారు విలువల తెలంగాణ’ కాగల అవకాశం ఉండదు. ఇది అందరూ గుర్తిస్తారని ఆశించాలి.
ప్రవీణ్‌కుమార్ వర్సస్ ఉపాధ్యాయుల తరహా సమస్యలు ఇది మొదటిసారికాదని పైన చెప్పుకున్నాము. వీటి విషయంలో ముందుగా అందరూ స్వయంగా తమలోని కొరతలను ఎటువంటి భేషజాలు, దాపరికాలు లేకుండా ఒప్పుకోవాలి. ఈ విధమైన వివాదాలు, వాటికి మూలం లో అండర్ కరెంట్స్‌వలె ఉండే ధోరణుల పరిష్కారానికి అది ముందస్తు షరతు వంటిది. ఏమిటా కొరతలు? మాటలెన్ని మాట్లాడినా సమాజంలో అధిక సంఖ్యాకులకు దళితుల పట్ల చిన్నచూపు ఉందన్నది వాస్తవం. ఇందుకు చదువుకున్నవారు, పట్టణవాసులు, నాగరికులమనుకునేవారు, రకరకాల ఉద్యమాలలో పాల్గొనే వారినుంచి ఆఖరుకు కమ్యూనిస్టుల వరకు కూడా మినహాయింపులు లేవు. ఆ బేసిక్ ఇన్‌స్టింక్ట్ వంటివి సూటిగానో, ముసుగులోనో వ్యక్తమవుతాయ. నిజమైన రీతిలో మినహాయింపు అయినవారు కొద్ది శాతంలోనే ఉన్నారు. ఇది నేను ఇన్ని దశాబ్దాలలో స్వయంగా గమనించిన మీదట చెప్తున్న మాట. మరొకవైపు దళితులలో ఈ స్థితి పట్ల సహజంగానే, న్యాయమైన రీతిలోనే తీవ్రమైన నిరసన ఉంది. అది ప్యాసివ్‌గానో, యాక్టివ్‌గానో తిరుగుబాటుగా వ్యక్తమవుతున్నది. అదే సమయంలో, ఈ కోణంతో నిమిత్తం లేని అంశాలకు కూడా దానిని జోడించి మాట్లా డే ధోరణి కూడా కన్పిస్తుంది. అది అణచివేత, పీడననుంచి అందుకు స్పందనగా వచ్చే అఫెన్సివ్ లక్షణం కావచ్చు. కనుకనే అందులో సాధారణమైన సమదృష్టికి ఇర్రేషనల్‌గా తోచే ఎలిమెంట్ ఉండవచ్చు. ఆ విధమైన తర్కంతో అటువంటి స్పందనలను జస్టిఫై చేయటం ఒక స్థాయిలో మనం చూస్తున్నదే. కాని ఇది ఎదుటివారిని ఆలోచింపజేసి, తమ పొరపాటును గుర్తించి సరిదిద్దుకునే విధంగా ప్రేరేపిస్తుందా? చర్చించవలసిన విషయం.
ఆ విధమైన దీర్ఘకాలిక క్రమాలను (ఒకవేళ అట్లా జరుగుతుందనుకున్నా) అట్లుంచితే, యధాతథంగా, తమవద్ద ఒకవేళ కొరతలు ఉన్నప్పటికీ వాటిని వదులుకోవటం గాక, జనరల్ పీడన కోణాన్ని దానితో నిమిత్తం లేని సందర్భాలకు జోడించటం మరొక కొరత అవుతూ వస్తున్నది. ఎస్సీ చట్ట దుర్వినియోగం విమర్శ వస్తున్నది అందుకే. నిరసనలలోని అవాంఛనీయ ఉప ఉత్పత్తి ఇది.ఇరువర్గాల వైపున కనిపించే ఈ పరిస్థితి మూలంగా సమస్యలు పరిష్కారం కాకపోవటం, సంబంధాలు సవ్యంగామారకపోవటం, సమాజం ప్రజాస్వామికం, నాగరికంగా మారకపోవటం (ఇవి వౌలిక ఆర్థిక, సామాజిక సంబంధాలతో నిమిత్తం గలవి) సరేసరి కాగా, ప్రస్తుత వివాదాల వంటి వాటిని స్వేచ్ఛగా చర్చించుకునే ప్రజాస్వామిక అవకాశం కుంచించుకు పోతున్నది. స్వల్పకాలంలో కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ లేదు, దీర్ఘకాలంలో పరివర్తనా లేదు.కనుక ఈ రకరకాల ప్రశ్నల గురించి అందరూ ఆలోచించటం అవసరం.

Andhra Bhoomi Telugu News Paper Dated : 3/07/2014 

Thursday, July 10, 2014

గురుకులంలో కలకలం..! By ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి


Updated : 7/10/2014 11:32:10 PM
Views : 188
మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్తారు. కానీ ప్రవీణ్‌కుమార్ లాంటి వాళ్ళు ఆ పనిచేస్తే భరించలేరు. మనదేశంలో ప్రతిచర్యకూ ఒక సామాజిక కోణం ఉంటుంది! మా వూరు కరీంనగర్ జిల్లా యాస్వాడలో దాదాపు మూడు నాలు గు దశాబ్దాల కిందట ఉస్మాన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన పూర్తిపేరు ఏమి టో చాలామందికి తెలియదు. ఆయన మా వూరి బడిలో చెప్రాసీ. రోజూ పొద్దున్నే వచ్చి స్కూలు ఆవరణ శుభ్రంచేసి గంట కొట్టడం ఆయన పని. కానీ ఆయన ఆ పనితో పాటు ఒక కొత్త సామాజిక బాధ్యతను కూడా తలకెత్తుకున్నాడు. మా వూరి లో పిల్లలందరినీ బడిలో చేర్పించడం, చేరినవాళ్ళు మధ్యలో బడి మానేయకుండా చూడడం ఒక ఆదర్శంగా పెటుకున్నాడు. పొద్దున్నే స్కూల్ పని ముగించుకుని ఆయన వూరి మీద పడే వాడు. ముఖ్యంగా దళితులు, బడుగువర్గాలు ఉండే వాడలకు వెళ్ళేవాడు. కనిపించిన ప్రతి పిల్లవాన్ని తీసుకొచ్చి బడిలో చేర్చేవాడు. పిల్లలు ఏడ్చి గోల చేసినా, తల్లిదండ్రులు అడ్డుకుని గొడవ చేసినా వినకుండా ఈడ్చుకెళ్ళి బడిలో పడేసేవాడు.

మళ్ళీ ఏ సాయంకాలమో వచ్చి తల్లిదండ్రులకు నచ్చజెప్పేవాడు. చదువు ప్రాముఖ్యా న్ని వివరించేవాడు. ఉస్మాన్ అంటే ఆ కాలంలో బడిపిల్లలకు టెర్రర్. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎవరో తెలియకపోయేది, కానీ ఉస్మాన్ మాత్రం ప్రతి ఇంట్లో తెలుసు. కొద్దికాలం తరువాత ఉదయం ఉస్మాన్ వాడవాడా తిరుగుతూ సైకిల్ గంట మోగిస్తే చాలు పిల్లలంతా ఆయన వెంట పొలోమని వెళ్ళేవారు. ఆయన కషి వల్ల యాస్వాడలో 1980 నాటికి ప్రతి ఇంట్లో కనీసం ఒకరైనా చదువుకున్నవాళ్ళో, ఉద్యోగస్తులో ఉండేవాళ్ళు. 1982లో ఆ వూరు మానే రు డ్యాంలో మునిగిపోయింది. గ్రామస్తులు ఎవరికీ తోచిన వూరికి వాళ్ళు వెళ్ళిపోయి స్థిరపడారు. కొద్దికాలానికి ఉస్మాన్ చనిపోయారు. ఆ తరువాత ఎంద రు చదువుకుని ఉద్యోగాల్లో చేరారో తెలియదు. అట్లాంటి వారెవరూ నాకు తారసపడలేదు. కానీ ఒక్క ఉస్మాన్ వల్ల ఊరు బాగుపడిందని మాత్రం పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటారు. 

ఊరును బాగు చేయడం ఉస్మాన్ పనికాదు. ఉద్యో గ బాధ్యత అసలే కాదు. అలాగే ఆయన పెద్దగా చదువుకోలేదు. కానీ చదువు విలువ, అందునా కింది కులాల్లో చదువుకున్న ప్రాధాన్యాన్ని గుర్తించినవ్యక్తి. ఆయన ఒక వ్యక్తిగా కనబరచిన చిత్తశుద్ధి, కార్యదక్షత, సామాజికస్ఫూర్తి వందలాది కుటుంబాలకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది.

బహుశా వాళ్ళంతా ఆయనను ఎన్నటికీ మరిచిపోరు. అలాగే ఎస్.ఆర్. శంకరన్ కూడా. శంకరన్ గారు జీతం కోసం కాక ప్రజల జీవితాలను మార్చడం కోసం పనిచేసిన ఐఏఎస్ అధికా రి. జీవితాంతం దళితుల, ఆదివాసుల కోసం పనిచేసిన వ్యక్తి. వారి బతుకులు మార్చాలంటే చదువును అందుబాటులోకి తేవాలని తపించినవ్యక్తి. చదువం బడి మాత్రమే కాదని, చదువుకోవడానికి కావాల్సి న పరిస్థితులు, పరిసరాలు కూడా అని నమ్మిన వ్యక్తి. ఇవన్నీ వెలివాడల్లో ఉండే దళితులకు, గూడేల్లో, గుడిసెల్లో ఉండే ఆదివాసులకు ఉండవు. కాబట్ట్టి వారికి అన్ని వసతులతో ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుచేసి చదివించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆయన సూచన మేరకు 1987లో ప్రభుత్వం సాంఘిక సంక్షే మ ఆశ్రమ పాఠశాలాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్నప్పుడే కాదు ఆ తరువాత కూడా ఆయన స్వయంగా ఆ పాఠశాలలను సందర్శించేవారు.విద్యార్థులకు, అధ్యాపకులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పేవారు. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, ఆయన పట్ల ఇప్పటికీ ఆ వర్గాల్లో ఎనలేని గౌరవాన్ని కలిగించాయి. ఆ గౌరవ భావానికి సూచికగానే ఆయన చిత్రపటాన్ని సంక్షేమ ఆశ్రమ విద్యార్థులు ఎవరెస్టు మీద నిలబెట్టారు. 

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ కూడా అదే తరహాలో పనిచేయాలనుకున్నాడు. ప్రవీణ్ కుమార్‌తో నాకు ఉస్మాన్‌తో, శంకరన్ గారితో ఉన్నం త పరిచయం కూడా లేదు. పోలీసు కాబట్టి పరిచ యం చేసుకునేంత చనువు కూడా లేదు. తెలంగాణ దళితుల్లో నుంచి వచ్చిన మొదటి తరం ఐపీఎస్ అధికారి అని తెలుసు. తెలంగాణ నుంచి ఇప్పటికీ పోలీసుశాఖలో ఆయన స్థాయిలో ఒకరిద్దరే దళిత ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎటువంటి అభియోగాలు లేకుండా వత్తి నిబద్ధతకు మారుపేరుగా ఉన్నారు. ప్రవీణ్ కూడా చాలామంది దళితుల్లాగే సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళలో ఉండి అక్కడి చీదరింపులు భరించిన వ్యక్తి.

సమాజం దళితులను ఎలా చూస్తుందో అనుభవంలో తెలుసుకున్న వ్యక్తి. ఎన్నో ప్రయాసలు పడి చదువుకున్న వ్యక్తి. విద్యార్థి దశలోఅందరు దళితుల్లాగే ప్రగతిశీల రాజకీయాల్లో చురుకైన నాయకుడుగా ఉండేవాడు. తరువాత పోలీసుగా మారిపోయాడు. ఆయన కూడా ప్రజల పట్ల ఉద్యమాలపట్ల అందరు పోలీసు అధికారుల్లాగే వ్యవహరించాడు. కొన్నిసందర్భాల్లో కఠినంగా కూడా ఉన్నా డు. అది వేరే చర్చ. పోలీసుల్లో మంచి వారిని ఎంచ డం కష్టం. కానీ చాలామంది కంటే ముందుగానే అందులో ఇమిడిఉన్న ఘర్షణను అర్థం చేసుకున్నా డు. తనంతట తానుగా పోలీసు విధుల నుంచి బయటకువచ్చి సాంఘిక సంక్షేమ శాఖను ఎన్నుకున్నాడు. ఎస్ .ఆర్. శంకరన్‌ను ఒక ఆదర్శంగా పెట్టుకుని ఆయన సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నేరుగా ఇంతకాలం వివక్షకు గురవుతూ వస్తున్న తన వర్గానికి సేవ చేయాలని, వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపాలని అనుకుని ఉండవచ్చు.

గడిచిన రెండేళ్ళ కాలంలో నిజంగానే ఆ సంస్థ రూపురేఖలు మారిపోయాయి. బోధన, ఫలితాలతో పాటు అనేక కొత్త ప్రయోగాలు, ప్రణాళికల ద్వారా విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ముఖ్యం గా దళితవర్గాల్లో ఒక విశ్వాసాన్ని నింపారు. అన్నీ సజావుగా ఉన్నాయనుకున్న తరుణంలో ఒక చిన్న సర్క్యులర్ ద్వారా ఆయన ఇప్పుడు దోషిగా నిలబడిపోయారు. నిజానికి ఆయన ఒక ఉస్మాన్‌లాగే ఆలోచించారు. పాఠశాలలు మొదలైన తరువాత పదిరోజులు గడిచినా పిల్లలు రాకపోవడం, హాజరు లేకపోవడం ఏమిటని నిలదీశారు. గురుకుల విద్యాసంస్థల్లో పనిచేసే అధ్యాపకుల వత్తిధర్మాల్లో అదొకటి.

పిల్లలకు, తల్లిదండ్రులకు వారొక కౌన్సిలర్‌గా ఉండాలి. వారి బాగోగులు కూడా చూసుకోవాలి. వాళ్ళను ప్రోత్సహించి ఎదుగుదలకు కషి చేయాలి. అందుకే అక్కడి టీచర్ విద్యార్హతలు జీతభత్యాలు, పని నిబంధనలు వేరుగా ఉంటాయి. సాధారణ స్కూల్ టీచర్ల కంటే వీళ్ళ విధులు వేరుగా ఉంటాయి. వాళ్ళు కేవ లం టీచర్లు మాత్రమే కాదని హౌస్ పేరెంట్స్‌గా విద్యార్థులకు తల్లిదండ్రుల లోటును తీర్చేవారిగా ఉండాల ని నిబంధనలు చెపుతున్నాయి. సొంత పిల్లలను జూన్ 12న బడికి పంపే ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలెవరూ బడికి రాకపోతే ఏమయ్యిందో వాకబు చెయ్యలేకపోయారు. వేసవి సెలవులకు వెళ్ళిన 77 వేల మంది విద్యార్థుల్లో కేవలం 11 వేలమంది మాత్రమే వచ్చారు. సగానికి సగం పాఠశాలల్లో సగం మంది కూడా తిరిగి రాలేదు. దాదాపు ఇరవై స్కూల్‌లలో ఒక్కరు కూడా రాలేదు. సహజంగానే ఈ తరంలో కొందరైనా తనలాగే చదువుకుని ఎదగాలనుకునే వాడికి ఇది ఆందోళన కలిగిస్తుంది.

ఒక అధికారిగా నెల తిరిగేసరికి జీతం తీసుకునే ముందు అది గుర్తు చేయడమే ప్రవీణ్ చేసిన తప్పు అయింది. అలా గుర్తుచేసి వారం రోజులు జీతం ఆగిపోతే జీవితమే ఆగిపోయినంత ఆందోళన వ్యక్తమైంది. ఆయన పోలీ సు అధికారి అని అందరికీ హటాత్తుగా గుర్తొచ్చింది. తుపాకీ నీడన పాఠాలు చెప్పలేం అని పంతుల్లంతా వాపోతున్నారు. అలా వాపోయిన వారికి మద్దతునీయడం ప్రజాస్వామ్యవాదుల ధర్మం. నిజంగానే ఆయన అధ్యాపకుల మీద తుపాకీ ఎక్కుపెట్టి పాఠలు చెప్పమని అంటే ఆయనను కచ్చితంగా శిక్షించాలి. అలా జరిగిందా అనేది కూడా విచారించాలి. ఆయన తుపాకీ ఎక్కుపెట్టాడో లేదో కానీ మన విద్యార్థులు, మేధావులు, బుద్ధిజీవులు మాత్రం ఆయన మీద తూటాలు పేల్చుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రవీణ్ పని విధానాన్ని, వత్తి నేపథ్యాన్ని సిద్ధాంతీకరించే పనిలో పడిపోయారు. పనిలో పనిగా ఒక ఐఏఎస్ తరగతి గదిలోకి రావొచ్చు, తనిఖీ చేయవచ్చు కానీ ఐపీఎస్ ఎలా తనిఖీ చేస్తాడు అంటూ అక్కడ కూడా కులవ్యవస్థ మాదిరి నిచ్చెన మెట్లు నిర్మించే పనికి పూనుకున్నారు. అంతే తప్ప బడికి రాకుండా ఆగిపోయిన వేలాదిమంది జీవితాల సంగతి ఏమిటనిఏ ఒక్కరూ అడగడం లేదు. వారిని పాఠశాలకు రప్పించే బాధ్యత సంస్థకు ఉన్నదో లేదో చెప్పడం లేదు. 

ఇది ఒక్క గురుకులాలకే పరిమితం అయిన సమ స్య కాదు. మొత్తంగా విద్యావ్యవస్థలో ఈ నవీన కులవ్యవస్థ రాజ్యం ఏలుతోంది. స్థాయిని బట్టి, మనుషుల సంపదను, హోదాను బట్టి పాఠశాలలు ఉన్నా యి. ఇప్పటికే సంపన్నులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రైవేటు పాఠశాలల్లోనే పిల్లల్ని చదివిస్తున్నారు. సగానికంటే ఎక్కువమంది బడిపిల్లలు ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఉన్నారు. ప్రభుత్వరంగంలోనూ ఇటువంటి అసమాన అంతస్తులున్న విద్యావ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు దళిత వాడలుగా మారిపోయాయి. వాటిల్లో చదువుతున్నవాళ్ళు ఎక్కువగా దళిత బహుజనులు, నిరుపేదలే ఉంటున్నారు. ఇటువంటి అంతరాలులేని కామన్ స్కూలింగ్ రావాలని విద్యావేత్తలు చాలాకాలంగా కోరుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన విద్య ఉంటుందని అదే పనిగా చెపుతున్నారు. ఇది కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా ఉంటుందని, తెలంగాణలో భవిష్యత్తులో కేవలం ఆశ్రమ పాఠశాలలే ఉంటాయని అందులో భోజన వసతితో పాటు అధునాతన వసతి సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెపుతున్నారు. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందిస్తామని అంటున్నారు.

అది పునర్నిర్మాణానికి మొదటిమెట్టు అని ఆయన అంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఇటువంటి అసమానతలులేని విద్యావిధానాన్ని హామీ ఇచ్చింది. సీమాంధ్ర దోపిడీదారుల చేతుల్లో మన విద్యావ్యవస్థ దెబ్బతిన్నది కాబట్టి, కార్పొరేటు దోపిడీ పెరిగిపోతున్నది. కాబట్టి తెలంగాణ కావాలని ఈ ఉపాధ్యాయులే ఊరూరా తిరిగి ఉద్బోధించారు. ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ సాధనకు కషి చేశారు. పునర్నిర్మాణానికి కూడా పునరంకితమవుతామని చెపుతున్నారు.

విద్య ద్వారా నే వికాసం అనేది ఇప్పటికే రుజువైంది. తెలంగాణ పునర్వికాసం కూడా తరగతి గదిలో మొదలవ్వాలి. దానికి తెలంగాణ మొత్తాన్ని ఒక గురుకులంగా మార్చాలి. ఇక్కడి వరకు టీచర్లకు పెద్దగా పేచీ లేకపోవచ్చు. కానీ అది నెరవేరాలంటే ముందుగా బడిలో పిల్లలుండాలి. ప్రవీణ్ కుమార్ చెప్పింది కూడా అదే. పోలీసు కదా పాపం ఆయనకు భారతీయ సమాజం గురించి, అందులో నిచ్చెనమెట్ల గురించి పెద్దగా తెలియక పోవచ్చు. మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్తా రు. కానీ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఆ పనిచేస్తే భరించలేరు. మనదేశంలో ప్రతి చర్యకూ ఒక సామాజిక కోణం ఉంటుంది! 

Namasete Telangana Telugu News Paper Dated:11/07/2014