Showing posts with label చిక్కుడు ప్రభాకర్. Show all posts
Showing posts with label చిక్కుడు ప్రభాకర్. Show all posts

Wednesday, September 26, 2012

రాష్ట్రం ఇవ్వకపోతేనే నక్సలిజం - చిక్కుడు ప్రభాకర్



వాస్తవంగా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే నక్సల్స్ సమస్య ఏర్పడదు. దేశంలో ఎక్కడైనా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేత తీవ్రత వల్లనే ఆ ఉద్యమం పుడుతుంది. జార్ఖండ్‌లోనైనా, పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోనైనా నక్సల్ ఉద్యమం ఉధృతమైంది అవి చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి కాదు. బీహార్, మధ్యప్రదేశ్‌లలో అవి అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి 25 ఏళ్ళకు ముందే ఆ ఉద్యమం వేళ్ళూనుకుని ఉంది. 

చిన్న రాష్ట్రాలలో నక్సలిజం పెరుగుతుంది. ఛత్తీస్‌గఢ్-జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతనే అక్కడ నక్సలిజం పెరిగింది. తెలంగాణపై లోతైన అధ్యయనం చేయాలని దేశ హోం శాఖ మంత్రి షిండే చిలుకపలుకులు పలికారు. ఇవి అతని సొంత వాక్యాలు కావు. ఇవి యాదృచ్ఛికం కూడా కావు. ఈ పలుకులు తెలంగాణను నిరంతరం దోచుకుంటున్న సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు నాలుగు దశాబ్దాలుగా వల్లె వేస్తున్న పలుకులే. కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యులు లగడపాటి రాజగోపాల్ హోం మంత్రి షిండేకి పంపిన లేఖలోని మాటలుగా భావించవచ్చు

. అలాగే నక్సలిజానికి పుట్టినిల్లు 'ఉత్తరాంధ్ర' అని, నేటికీ ఉత్తరాంధ్ర మొత్తం నక్సలిజం ఆవరించుకుని ఉందనే విషయం ఈ కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నారు. తెలంగాణ మనోభావాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తొలి రోజుల నుంచి తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం, తమకే కావాలని దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఒక రాష్ట్ర ఏర్పాటుకు ఇంత సుదీర్ఘమైన పోరాటం జరిగిన ప్రాంతం దేశంలోనే లేదు.

గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు దేశంలోని వివిధ ప్రజాఉద్యమాలకు 'నక్సల్స్ అనుకూల ఉద్యమాలు'గా ముద్ర వేసి ప్రభుత్వం అణచివేస్తోంది. రైతాంగం, విద్యుచ్ఛక్తి, విత్తనాలు, గిట్టుబాటు ధర అడిగినా, కార్మికులు వేతనాల పెంపుకొరకు, యాజమాన్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడినా, తమ భూములు, తమ నీరు, తమ సంపద తమకే దక్కాలని ప్రజలు పోరాటం చేసినా, వాటిలో నక్సలైట్లు ఉన్నారని ఆరోపణ చేస్తూ పాలకులు తీవ్ర అణచివేతకు పూనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమాన్ని కూడా నక్సల్స్ అనుకూల ఉద్యమంగా ముద్రవే యడం, తెలంగాణ రాష్ట్రమేర్పడితే నక్సలైట్లు పెరుగుతారనే ప్రచారం చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నవారు సీమాంధ్ర కాంగ్రేస్ నాయకులే. వీరికి ఆ ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం, వైఎస్ఆర్‌సిపి నాయకులు కూడా తోడయ్యారు.

శ్రీకాకుళ పోరాటం తర్వాత సుదీర్ఘకాలం తెలంగాణలో ఈ పోరాటం నడిచిన మాట వాస్తవమే. కానీ నేడు తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం తాత్కాలికంగా 'లోతైన వెనకంజ' వేసింది. నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి కావూరి, రాయపాటి, లగడపాటిల వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏదుర్కొనేందుకు రెండు వితండ వాదాలను ప్రచారం చేస్తున్నారు. ఒకటి-తెలంగాణ రాష్ట్రమేర్పడితే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని, రెండు-తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం దేశ సమగ్రతకు భంగకరమని, పై రెండు విషయాల్లో ఏ ఒక్కటి కూడా శాస్త్రీయమైనది కాదు. వాస్తవంగా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే నక్సల్స్ సమస్య ఏర్పడదు.

దేశంలో ఎక్కడైనా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేత తీవ్రత వల్లనే ఆ ఉద్యమం పుడుతుంది. జార్ఖండ్‌లోనైనా, పక్కనే ఉన్న చత్తీస్‌గఢ్‌లోనైనా నక్సల్ ఉద్యమం ఉధృతమైంది అవి చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి కాదు. అవి బీహార్, మధ్యప్రదేశ్‌లలో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి 25 ఏళ్ళకు ముందే ఆ ఉద్యమం వేళ్ళూనుకుని ఉంది. చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి మిలటరీ వికేంద్రీకరణ పె రిగి అణ చివేత తీవ్రమయి ఆ ఉద్యమాలు వెనుకంజ వేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఎనిమిది ఏళ్ళ తర్వాత 1964లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 1968 నాటికి ఉధృత రూపం దాల్చింది. 1969 సంవత్సరం నాటికి తెలంగాణలో దాదాపు సంవత్సరకాలం ప్రభుత్వ వ్యవస్థ పనిచేయలేనంతగా ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష వెల్లువెత్తింది. సరిగ్గా అపుడే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని మన్నెంలో సాయుధపోరాటం మొదలయింది. 1967 ఫిబ్రవరిలో పశ్చిమబెంగాల్‌లోని 'నక్సల్‌బరి' గ్రామంలో సంతాల్ గిరిజనుల తిరుగుబాటు ప్రేరణతో శ్రీకాకుళ ఉద్యమం వచ్చింది. దేశ వ్యాప్తంగా అనే క ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమాలు వెలిశాయి. ఆ తర్వాత ఆ ఉద్యమంలో వచ్చిన చీలికలు దేశ వ్యాప్తంగా పాయలు, పాయలుగా సాయుధ పోరాటాన్ని నడిపించాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాయుధ పోరాటాలు నడిపించిన ఎంసీసీ, పీపుల్స్‌వార్ పార్టీలు విలీనమై సుమారు 31 వేల మంది సాయుధ శక్తితో నేడు దేశంలోనే అతిపెద్ద నక్సలైట్ పార్టీ (సీపీఐ మావోయిస్టు)గా అవతరించింది.

శ్రీకాకుళ పోరాటాన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, హోం మంత్రి జలగం వెంగళరావులు తీవ్రంగా అణచివేశారు. ఆ ఉద్యమ అణచివేతతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కూడా తీవ్రంగా అణచివేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నిరంతరం కొనసాగించాలనుకున్న కాంగ్రెసు పాలకులు నేటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగానే తయారైనారు. నాటి శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్న నాయకులలో చారుమజుందార్ అవగాహనను కలిగిన కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని వర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించింది. కానీ చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవ రావు. దేవులపల్లి వెంకటేశ్వర రావు నాయకత్వంలోని పార్టీలు నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యానికి అవరోధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని భావించారు.

తెలంగాణ ప్రాంత భౌతిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని ఎంఎల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బేషరతుగా సమర్థించింది. నాటి నుంచి 1995లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలయ్యే నాటికి పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల చాలా స్పష్టమైన, లోతైన అవగాహన కలిగి ఉన్నది. తొమ్మిది పార్టీలతో కలిసిన జనశక్తికి కానీ, పైలా వాసుదేవరావు నాయకత్వంలోని న్యూడెమొక్రసీకి కానీ ఈ పోరాటం పట్ల స్పష్టమైన అవగాహన లేదు. వాటికి ఈ ప్రాంత పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన లేకపోవడంతో తెలంగాణా ఉద్యమాన్ని వారు సమర్థించలేదు. కానీ, జనశక్తి నుంచి 'కులం' విషయం మీదనే చీలిన నాటి 'మారోజు వీరన్న' నాయకత్వంలోని పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో 'దళిత-బహుజనుల రాజ్యాధికార' లక్ష్యంతో ముందుకు కదిలింది.

మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉధృతమయ్యే సమయానికి పీపుల్స్‌వార్‌పార్టీ 'గెరిల్లా జోన్ పర్‌స్పెక్టివ్'ను అభివృద్ధి పరుస్తూ, ఉత్తర తెలంగాణను ప్రాథమిక దశకు, దక్షిణ తెలంగాణను సన్నాహక దశకు చేర్చింది. 1997 నాటికి తెలంగాణ అభివృద్ధి మీద ఒక్క స్పష్టమైన 'ప్రజా ప్రత్యామ్నాయం' పేరుతో డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఆ డాక్యుమెంట్ వెలుగులో విశాల ప్రజారాసులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వారు పోరాడుతున్నారు. నాడు చండ్రపుల్లారెడ్డి వారసత్వంలోని ఏర్పడిన పార్టీలోని ఒక వర్గం, న్యూడెమొక్రసీ, సిపిఎం,సిపిఐలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించగా, జనశక్తి తన అవగాహనను మార్చుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించింది. కాలక్రమేణా నేడు ఒక్క సిపిఎం పార్టీ తప్ప, మిగతా కమ్యూనిస్టు పార్టీలన్నీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తున్నాయి.

చిన్న రాష్ట్రాలు మిలిటరీ వికేంద్రీకరణకు అనువుగా ఉంటాయని, ప్రజా ఉద్యమాలను సులువుగా అణచివేసేందుకు ఇవి దోహదపడుతాయని సిపిఐ మావోయిస్టు రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ 2010 జనవరిలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈశాన్య భారతదేశంలోని త్రిపుర, మిజోర ం, నాగాలాండ్, అసోం, మేఘాలయ రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఉండడం మూలానే అక్కడి ప్రజాఉద్యమాలను ఆ ప్రభుత్వాలు సులభంగా అణచివేయగలుగుతున్నాయని ఆయన చెప్పారు. సీమాంధ్ర సంపన్నవర్గాల చేతిలో గురవుతున్నందున చిన్న రాష్ట్రమే అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ను తాము సమర్థిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష మేరకు తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని తెలిపారు. నేడు నక్సల్స్ ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడడానికి పూర్వమే బలమైన ఉద్యమకేంద్రాలుగా ఉన్నాయి. నేడు రాంచీని మిలిటరీ బే స్‌గా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లో ఆ ఉద్యమం మీద తీవ్ర అణచివేత కొనసాగుతున్నది.

ఇక రెండవ కారణమైన దేశ సమగ్రతకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసలు ఎటువంటి సంబంధం లేదు. స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశంలో 13 రాష్ట్రాలుండగా, నేడు అవి 29 రాష్ట్రాలుగా ఏర్పడినాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి దేశసమగ్రతకు ఎటువంటి సంబంధం ఉన్నది? ఈ ప్రాంతం ప్రజలు దేశంనుంచి విడిపోతామని ఏమైనా అంటున్నారా? స్వపరిపాలన పేరుతో భౌగోళిక తెలంగాణను కోరుతున్న వారు కొందరైతే, స్వపరిపాలనతో పాటు స్థానిక వనరులు, స్థానిక ప్రజలకు సమపాళ్ళలో దక్కాలని ఈ ప్రాంత ప్రజానీకం పోరాడుతున్నారు.

ఇలాంటి ప్రచారాలు సీమాంధ్ర సంపన్నులు కుట్రపూరితంగా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక ్సల్ సమస్య పెరగదు. కానీ, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఇలా సాగతీత వలన ఇక్కడి ప్రజలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చే స్తారు. కేసీఆర్‌తో చర్చలు, కోర్ కమిటీ భేటీలన్నీ సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించడానికే. ఈ ఆర్భాటాలన్నీ 'జీవ వైవిధ్య సదస్సు'ను సజావుగా జరపడం కోసమే గానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కాదు.

సీమాంధ్ర సంపన్న వర్గాల కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగదీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజా ఉద్యమాల ఉధృతి తాత్కాలికంగా ఉపశమిస్తుందే గాని నక్సలిజం పెరుగుతుందన్న పాలకులు ప్రచారంతో అర్థంలేదు. తెలంగాణ ఏర్పాటును మరింతగా సాగదీస్తే ఈ పోరాటం మరింతగా ఉధృతమై నక్సలైట్ ఉద్యమం పెరగడానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

- చిక్కుడు ప్రభాకర్
Andhra Jyothi News Paper Dated : 27/09/2012 

Monday, January 23, 2012

ఆస్తిపరుల 'అరకు డిక్లరేషన్' - చిక్కుడు ప్రభాకర్


ఆస్తిపరుల 'అరకు డిక్లరేషన్'

- చిక్కుడు ప్రభాకర్

స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మన రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇటీవల విశాఖ మన్యంలోని అరకులోయలో మూడు రోజుల పాటు పర్యటించారు. గిరిజనులతో నృత్యాలు చేశారు. గిరిజనుల అభివృద్ధి కొరకు బాధ్యత గల ప్రజా ప్రతినిధులుగా సమాలోచనలు జరిపారు. పర్యటన ముగింపు సమావేశం విశాఖపట్నంలోని పార్క్ హోటల్‌లో ఘనం గా జరిగింది. అనంతరం మంత్రులు తమ అంతర్గతంగా ఉన్న విషయమైన బాక్సైట్ నిల్వలను వెలికితీయడం గురించి మన్యం ప్రజలకు సందేశమిచ్చారు. 

మన్యంలో పరిశ్రమలు పెట్టడం ద్వారానే, బాక్సైట్ నిల్వలను అన్‌రాక్, జిందాల్ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారానే ఏజెన్సీ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తమ ప్రభుత్వ పన్నాగాన్ని బయటపెట్టారు. నిజానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మన మన్యంలోని బాక్సైట్ నిల్వలను పైన ప్రస్తావించిన కంపెనీలకు కట్ట బెట్టేందుకు ఎపియండిసిని రంగంలోకి దించింది. అలాగే బయ్యారంలోని ఇనుపరాతి ఖనిజాన్ని వైఎస్ అల్లుడు అనిల్‌కుమార్ బినామీ సంస్థ అయిన రక్షణ స్టీల్స్‌కు కేటాయించేందుకు కూడా ఎపియండిసిని వాడుకున్నారు. 

రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఖనిజ నిల్వలను గిరిజనులకు, గిరిజన సహకార సంఘాలకు కేటాయించాలి. లేదూ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజా ప్రయోజనాలకి ఉపయోగించేలా ప్రభుత్వమే స్వయంగా ఆ ఖనిజ నిల్వలను వెలికి తీయాలి. ఈ మేరకు 1991లో 'గనులు, ఖనిజ అభివృద్ధి చట్టం-1957'ను భారత ప్రభుత్వం సవరించింది. 

ఈ సవరణ - సదరు చట్టంలోని సెక్షన్ 11(5)-ను 1997లో సుప్రీం కోర్టు తీర్పు ఒకటి మరింతగా చట్టబద్ధం చేసింది. 'సమతా రవి వెర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం' కేసులో ఇచ్చిన ఆ తీర్పులో 'ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఎటువంటి ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దని' సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ విలువైన సంపదను దక్కించుకొనేందుకు జిందాల్, అన్‌రాక్, రక్షణ ఇత్యాది కంపెనీలు జాయింట్ వెంచర్ నాటకాన్ని మొదలుపెట్టాయి. 

ఈ కంపెనీలు షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఏర్పాటు చేయబోయే కంపెనీల తతంగమంతా ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుమీద గనులను దక్కించుకున్న గాలి సోదరులు వ్యవహారంలాగే ఉం టుంది. ఎపియండిసికి ఉన్న అవకాశాన్ని తమకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు ఈ కంపెనీలు 98 లేదా 99 శాతం వాటా కలిగివుండి ఎపియండిసికి 2 లేదా 1 శాతం వాటాను కల్పిస్తాయి. 

దరిమిలా ఆ ప్రభుత్వ సంస్థ పేరు మీద లభించిన గనుల లీజును తమకు అనుకూలంగా ఉపయోగించుకుని లక్షల కోట్ల రూపాయల విలువైన బాక్సైట్, ఇనుపరాతి ఖనిజాన్ని తవ్వుకునేందుకు కుట్ర పన్నాయి. పై మూడు కంపెనీలు ఎపియండిసిని తమ బినామి సంస్థగా మార్చుకున్నాయి. 'హై పవర్ కమిటీ'ల పేరుమీద కమిటీలు వేసి, వాటిల్లో తమకు అనుకూలమైన ఉన్నతాధికార వర్గానికి ప్రాతినిధ్యం కల్పించి ఆఘమేఘాల మీద ఎపియండిసికి ఆ ఖనిజ తవ్వకాల లీజు దక్కేలా అలనాటి వైఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. 

ఈ ఎపియండిసి నాటకానికి తెరవెనుక ఉన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కాగా ఆ తతంగాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించింది ఆయన కుమారుడు, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. దశాబ్దాల తరబడి సున్నపురాయి, గ్రానైట్, బెరైటీస్ లీజుల అక్రమ వ్యవహారాలలో తలపండిన వైఎస్ కుటుంబం ఆ అనుభవంతోనే గాలి సోదరులకు ఓబులాపురం ఇనుపరాతి గనులను కట్టబెట్టింది. 

అదే అనుభవం ద్వారా తన అల్లుని బినామీలయిన జగ్గయ్యపేట మండలం జయంతిపురం గిరిజనులైన తేజావత్ బద్రు నాయక్, శంకర్ నాయక్‌లకు ఖమ్మం జిల్లా, బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామంలోని 24.80 హెక్టార్లలోని ఇనుపరాతి ఖనిజాన్ని ఎపియండిసి ముసుగులో రక్షణ స్టీల్స్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. అదే అనుభవంతోనే ఎపియండిసి ముసుగులోనే అన్‌రాక్, జిందాల్‌లకు అపార బాక్సైట్ నిల్వలు కలిగిన వేలాది ఎకరాల అటవీ భూమిని కట్టబెట్టింది. గుత్త పెట్టుబడిదారులకు కొండంత ధనం దోచిపెట్టి, ఎపియండిసికి గోరంత చెందే విధంగా ఉన్న ఈ జాయింట్ వెంచర్ ఒప్పందాలేవీ పారదర్శకంగా జరగలేదు. మన్యం ప్రజలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. 

ఈ విషయమై గత ఐదారేళ్ళుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతున్నారు. ఆ తవ్వకాల వల్ల తమ జీవనాధారం పోవడమే కాకుండా పర్యావరణం పూర్తిగా విధ్వంసమవుతుందని వారు హేతుయుక్తంగా వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఆ అడవి బిడ్డల మీద నిర్బంధాన్ని ప్రయోగించాయి. అయినా కార్పొరేట్ కంపెనీలేవీ మన్యంలో అడుగుపెట్టకుండా గిరిజనులు అడ్డుకున్నారు. 

గనుల తవ్వకాల విషయమై అటవీ గ్రామాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సివుంది. అయితే ప్రస్తావిత కార్పొరేట్ కంపెనీలేవీ ఆ గ్రామాలకు వెళ్ళనేలేదు. విశాఖపట్నంలోనే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఓ తతంగం నిర్వహించాయి. బాక్సైట్ తవ్వకాలకు అనుగుణంగా అభిప్రాయం చెప్పించారు. బాధిత గ్రామాల ప్రజలు ఆ కంపెనీలకు, వాటికి మద్దతునిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయినా ఆ కంపెనీలు లక్షల కోట్ల రూపాయల సంపదను దక్కించుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 

ఆ ప్రయత్నాలలో భాగంగా 'సుప్రీమ్ సాధికార కమిటీ' పేరుతో గతనెల 15, 16 తేదీల్లో ముగ్గురు సభ్యుల కమిటీ ఒకటి విశాఖ ఏజెన్సీలో పర్యటించేందుకు ప్రయత్నించింది. గిరిజనులు, కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మొదలైనవి ఆ కమిటీ పర్యటనకు వ్యతిరేకంగా మన్యం బంద్‌ను నిర్వహించాయి. అన్‌రాక్, జిందాల్ కంపెనీలు ప్రభుత్వంతో కుమ్మక్కై మన్యంలో వేలాది పోలీసు బలగాలను దించాయి. అయినా ప్రజలు ఆ కమిటీ పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ తీవ్ర ప్రతిఘటనకు బిత్తరపోయిన ఆ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, సుప్రీమ్ సాధికార కమిటీ సభ్యులు హెలికాప్టర్‌లో రెండు రోజులు మన్యం మీద చక్కర్లు కొట్టారు. ఎలాగైనా మన్యం ప్రజలను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ఆ ప్రయత్నాలలో భాగమే రాష్ట్ర శాసనసభ స్పీకర్ మనోహర్ నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిల అరకులోయ పర్యటన. అరవై యేళ్ళ స్వాతంత్య్రంలో మన్యం ప్రజలకు కనీస సదుపాయాలు సమకూర్చేందుకు ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టలేదు. ప్రతి వేసవిలో డయేరియా, ప్రతి వర్షాకాలంలో మలేరియాతో వేలాది గిరిజనులు చనిపోవడం పరిపాటిగా ఉంది. ఆ విషాదాలను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు నేడు 'అరకులోయ డిక్లరేషన్' పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 

ఆదివాసీయేతర సామాజిక వర్గాలకు కల్పిస్తోన్న కొన్ని సౌకర్యాలనైనా గిరిజనులకు మన ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. అడవుల్లో శతాబ్దాల తరబడి నివసిస్తున్న గిరిజనులకు కనీస వ్యవసాయ సదుపాయం కల్పించలేదు. దశాబ్దాల తరబడి 'పోడు' కొట్టుకొని ఆ భూ ములలోనే వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజనులకు సదరు భూములపై హక్కులు కల్పించలేదు. 

ఆ భూములకు సాగునీటి సదుపాయం కల్పించకపోవడం వల్ల వర్షాకాలంలో గింజలు చల్లి ప్రకృతి మీద ఆ«ధారపడి పండిన ధాన్యంతో సంవత్సరంలో ఆరునెలలు కాలం వెళ్ళబుచ్చుతూ, మిగతా ఆరునెలల పాటు అడవిలో దొరికే గడ్డలు, పండ్లు, కాయలను గిరిజనులు భుజించుతున్నారు. ఫలితంగా వారి ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్త్రీలలో 12 శాతం, పురుషులలో 13 శాతం ఉండాలి. అయితే ఇది గిరిజన స్త్రీలలో 6 శాతం, పురుషులలో 8 శాతం మాత్రమే ఉంటుంది. ఇంతగా అనారోగ్యం పాలవుతున్నా గిరిజనులకు కనీస పోషక విలువలను కూడా ప్రభుత్వం అందించలేకపోతోంది. 

'అరకు డిక్లరేషన్' పేరుతో ప్రభుత్వ, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు ఆడుతున్న నాటకమంతా బాక్సైట్ తవ్వకాలకు ప్రజలను సంసిద్ధ పరచడానికే. గిరిజనుల సంక్షేమంపై శ్రద్ధ ఆ చర్యలో ఏమీ లేదు. మన్యం వాసులను సానుకూలం చేసుకొనేందుకే గిరిజనుల అభివృద్ధితో కూడిన 'అరకు డిక్లరేషన్'ను విడుదల చేశారు. జిందాల్, అన్‌రాక్‌ల లీజులను రద్దుచేసి మన్యం గిరిజనుల వైపు నిలబడాల్సిన ప్రజా ప్రతినిధులు ఆ కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరించడం శోచనీయం. ఓబులాపురం గనుల విషయంలో కూడా 2006 సంవత్సరంలో శాసన సభా కమిటీ ఈ విధంగానే వ్యవహరించింది; 

గాలి సోదరులు చట్ట విరుద్ధంగా చేస్తోన్న గనుల తవ్వకాలకు మద్దతు పలికి ప్రజల ధనాన్ని దోచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు అలా వ్యవహరించకుండా గిరిజనుల పక్షాన నిలబడాల్సిన మన ప్రజాప్రతినిధులు కార్పొరేట్ కంపెనీలకు సానుకూలంగా వ్యవహరించడాన్ని పౌర సమాజం ప్రశ్నించాలి. లేని పక్షంలో ఆ కార్పొరేట్ కంపెనీల అక్రమాలకు మన్యం గిరిజనులు బతుకులు ఛిద్రమవుతాయి. 'అరకు డిక్లరేషన్' ముసుగులో విలువైన బాక్సైట్ తవ్వకాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకించాల్సిన నైతిక బాధ్యత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపై ఉంది. 

- చిక్కుడు ప్రభాకర్
Andhra Jyothi News Paper Dated 24/1/2012 

Monday, September 19, 2011

సర్వజనుల కర్తవ్యం -చిక్కుడు ప్రభాకర్ Andhra Jyothi 20/09/2011


సర్వజనుల కర్తవ్యం
-చిక్కుడు ప్రభాకర్

ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంది. నాయకత్వ శక్తులు విడివిడిగా ఉన్నాయి. తెలంగాణ బిడ్డలు ఇప్పటికే ఇంచుమించు 700 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజాపోరాటం సకలజనుల సమ్మె రూపంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక డిమాండ్‌గా ముందుకొ చ్చింది. నాలుగుకోట్ల ప్రజల కర్తవ్యాన్ని మరోసారి గుర్తుచేస్తూ 2009 నవంబర్ 30నాటి స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరుతూ అమరుల ఆశయాలను గుర్తుచేస్తున్న తరుణంలో నేను రాసిన వ్యాసం (ఆగస్టు 16న) ప్రచురించబడింది.

నా రాజకీయ అవగాహనకు అనుగుణంగా వందలాది యువకిశోరాలు తమ ప్రాణాలర్పించి తెలంగాణలో ఒక కారంచేడు, చుండూరు, నీరుకొండ, వేంపెంట జరుగకుండ చూశా రు. తెలంగాణలో దొరల, బడా పెట్టుబడిదారుల, పాలెగాళ్ళ రాజ్యం రాకుండా ఎలా పోరాటం చేశారో వివరిస్తూ, 'ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణ స్ఫూర్తితోనే తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ అగ్రనాయకునిగా తెలంగాణ జెఏసిల సమన్వయ ఫ్రంట్ నేతగా, తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శిగా ఆ వ్యాసం రాశాను.

నేను 'తొలిమెట్టు', 'ముందు షరతు' అన్నాను కాని భౌగోళిక తెలంగాణలోనే అన్నీ సాధ్యమవుతాయని అనలేదు. అననివి అన్నట్లు ఊహించుకోవడం, ఆ వ్యాసంలో ఉన్న 'భౌతిక వాస్తవికత'కు దూరంగా ఆలోచించడమే అవుతుంది. ఏ ఉద్యమానికైనా అం తిమ లక్ష్యసాధనకు నిర్దిష్ట ఎత్తుగడలుంటాయి. అందులో భాగమే 'సకలజనుల సమ్మె'గా ఇప్పటికీ కట్టుబడివున్నాను. నా వ్యాసానికి స్పందిస్తూ మిత్రులు ఉ.సా.(ఆగస్టు 19న),డాక్టర్ జిలుకర శ్రీనివాస్ (ఆగస్టు 29న), పాపని నాగరాజు, వెంకట నారాయణ (సెప్టెంబర్ 6న) వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలకు నా స్పందనే ఈ వ్యాసం.

ఏ విషయాన్నైనా సమగ్ర పరిశీలన చేసి స్వీయాత్మకతకు గురికాకుండా, వస్తుగతంగా విశ్లేషణ చేయడమే మార్క్సిస్టు విశ్లేషణ అంటారు. మరి నేను ప్రస్తావించిన మిత్రుల విశ్లేషణ అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉద్యమం తొలి ఫలితాలు, అంతిమ ఫలితాలు ఉన్నట్లే ఉద్యమ తొలి లక్ష్యం, అంతిమ లక్ష్యం ఉంటుంది. అంతిమ లక్ష్యపు ఫలితానికి తొలి లక్ష్యం ముందు షరతుగా ఉంటుంది తప్ప దశల సిద్ధాంతంగా చెప్పడం లేదు. రూపం-సారం రెండిటినీ సమగ్రంగా పరిశీలించినప్పుడే ఆ విషయంపై సమగ్ర అవగాహనగా ఉంటుంది.

గత ఏప్రిల్‌లో సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులతో తెలంగాణ ప్రాంత సూడో సామాజికవాదులు కుమ్మక్కయ్యారు. ఈ విషయంలో అగ్రభాగాన నిలబడుతున్న మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకొందరు చోటా మోటా నాయకులు కేంద్రంలోని తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి దొరల తెలంగాణ వద్దని, ఇస్తేగిస్తే సామాజిక తెలంగాణ ఇవ్వాలని వితండవాదం చేస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమానికే చిచ్చుపెట్టే ప్రయత్నమిది. వారిబాటనే నడిచే కొందరు, సామాజిక తెలంగాణ ఉద్యమకారుల్లాగా ముందుకు వచ్చి, ఇప్పుడు తెలంగాణ కనుక వస్తే సామాజిక తెలంగాణ రావాలని అంటున్నారు.

దొరల తెలంగాణ వద్దని అనడం వెనక తెలంగాణ రాకుండా అడ్డుపడే కుట్ర దాగి ఉన్నది. నిజమైన సామాజిక పునాది కలిగిన ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణలోనే సామాజిక కులాలకు న్యాయం జరుగుతుందని, నిజమైన సామాజిక పునాది భావజాలాన్ని విస్తృతంగా ఉద్యమంలో చొప్పిస్తూ, నిర్మాణంలోనూ ఈ విషయాన్ని అగ్రభాగాన నిలబెడుతూ ఉద్యమక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఉద్యమంలో ప్రతి మలుపును సమగ్రంగా పరిశీలించి ఉద్యమ ఉధ్ధృతికి పాటుపడుతున్నాం.

నా వ్యాసం, ఒక టీవీ చర్చలో నేను చెప్పిన విషయానికి భిన్నంగా ఉన్నట్లు ఉ.సా.రాశారు. నాడు తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ అనే 'ఐక్య సంఘటన' ఏర్పాటులో ఉద్యమ మౌలిక అంశాలయిన 'తెలంగాణ వనరుల రక్షణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమించాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నాను; తెలంగాణ జెఏసిల సమన్వయ ఫ్రంట్‌లోను, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటులోను అదే విషయాన్ని కొనసాగిస్తున్నాను; సామాజిక న్యాయపునాదిని పటిష్టపరచుకుంటూ వరంగల్ డిక్లరేషన్ స్ఫూర్తిని కొనసాగిస్తూనే చేతనైనంతగా ఉద్యమానికి నాయకత్వం వహించే ప్రయత్నం చేస్తున్నాను. అంతే తప్ప ఉ.సా.గారంత సమయస్ఫూర్తి కలిగిలేను. ఉ.సా.వాదిస్తున్న సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకోగలను.

అమరుడు మారోజు వీరన్న మాటలను ఉ.సా.తన వ్యాసాలలో ప్రస్తావిస్తుంటారు. వీరన్న అనుసరించిన సిద్ధాంతాన్నే ఇప్పటికీ అమలుపర్చుతున్నానని ఉ.సా. అంటారు. కాని ఆ స్ఫూర్తిని నా వ్యాసంపై తన స్పందనలో చూపలేకపోయారు. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా మన దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించాలని వీరన్న చెప్పారు. అది సాధించాలంటే హిందూ అగ్రవర్ణ బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాల భూస్వామ్యాన్ని తొలగించాలని, మన స్థల కాల పరిస్థితులకు అనుగుణంగా ఎంఎల్ఎంను జోడించాలని చెబుతూ లక్ష్య సాధనకు సంపూర్ణ ఎత్తుగడలు రూపొందించుకునే సమయంలో వీరన్న అమరుడయ్యారు. ఆయనంటే మాకు గౌరవమున్నది.

అయితే వీరన్న బతికుండగా విడుదల చేసిన సూర్యాపేట డిక్లరేషన్‌కు, ఉ.సా. నేతృత్వంలో గత ఏడాది జనవరి 21న విడుదల చేసిన హైదరాబాద్ డిక్లరేషన్‌కు వ్యత్యాసముంది. హైదరాబాద్ డిక్లరేషన్ లో ఇలా ఉంది: 'ఉత్తరప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించడానికి ఇటీవల కాంగ్రెస్ చేసిన అగ్రకుల రాజకీయ ఎత్తుగడల్ని చిత్తు చేయడానికి మాయావతి సారథ్యంలోని బీఎస్పీ మూడు రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధమేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కార్యరూపం దాల్చితే ఏక కాలంలో మూడుచోట్ల భౌగోళిక రాష్ట్రాలతో పాటు బహుజన రాష్ట్రాలు కూడా ఏర్పడుతాయి. 1996లో శ్రామిక దళిత బహుజన సామాజిక తెలంగాణ వాదుల సారధ్యంలో ఉద్యమం మొదలైంది.

కనుక ఆ ఉద్యమం భౌగోళిక, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమంగా నడిచింది. వారి సారధ్యంలోనే తెలంగాణ ఏర్పడితే, అది సామాజిక తెలంగాణ ప్రజారాజ్యంగానే ఆవిర్భవిస్తుంది'. ప్రజా ఉద్యమ శక్తులు ముందుకు తెచ్చిన భౌగోళిక-సామాజిక తెలంగాణ ఉమ్మడి ఎజెండాని స్వీకరించకుండా కనీసం రాజకీయరంగంలో వారి ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టకుండా నూతన రాజకీయశక్తులు (నవ తెలంగాణ, ప్రజారాజ్యం) తాను ప్రతిపాదించిన సామాజిక న్యాయ ఎజెండాను సొంతం చేసుకొని అధికారంలోకి రాలేకపోయాయని ఉ.సా. బాధపడ్డారు. నిజానికి ఆయన సిద్ధాంతం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు.

ఈ కొత్త రాజకీయ శక్తులు అధికారంలోకి వచ్చినా అటు సీమాంధ్రలోగానీ, ఇటు తెలంగాణలో గానీ అణగారిన, వెనుకబడిన కులాలకు, మైనారీటీలకు దక్కేది ఏమీ లేదు. గతంలో 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం'అనే ఈ వర్గవాద సిద్ధాంతం ఏ ప్రాంత ప్రజలకూ ఒరగబెట్టిందేమీ లేదు. ఆ సిద్ధాంతమే ఆంధ్రప్రదేశ్ పేరుమీద సీమాంధ్ర అగ్రవర్ణ భూస్వామ్య పెట్టుబడిదారులకు స్వర్గ ధామం నేర్పాటు చేసింది.

అలాగే ఉ.సా. ప్రవచిస్తున్న ప్రత్యేక తెలంగాణలో ప్రజారాజ్యం సిద్ధాంతం తెలంగాణలోని దళిత, వెనుకబడిన, మైనారిటీలకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా, ఆయా సామాజిక కులాలలోని ప్రజలను దోచి అధికారంలోకి వచ్చిన, వస్తున్న వారికీ ఉపయోగపడుతుంది. పాలక వర్గంలోని శక్తులను, ప్రజా ఉద్యమ శక్తులను ఒకే గాటన కట్టేస్తూ, పాలకవర్గాల పంచన చేరిన శక్తులను మోసే ప్రయత్నాన్ని డాక్టర్ జిలుకర శ్రీనివాస్ చేస్తున్నారు.

తను మోస్తే తనకు సంతృప్తికావచ్చు కానీ, తన జాతి మొత్తం మోస్తుందని కితాబునివ్వడం గతం, వర్తమానం, భవిష్యత్‌ను నిరాకరించడమే అవుతుంది. నేను పైన చెప్పినట్లు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షగా ముందుకు వచ్చిన 'సకలజనుల సమ్మె'లో పాల్గొని దళిత, వెనుకబడిన, మైనారిటీ వర్గాల హక్కుల రక్షణ ఉద్యమించడం ద్వారా సాధ్యమవుతుందని అన్నాను. అంతేకాని కేసీఆర్‌తోనో, చంద్రబాబుతోనో, కిరణ్‌కుమార్‌రెడ్డితోనో అధికారం కొరకు పొత్తుపెట్టుకొని అంటకాగమని చెప్పలేదు.

అలాగే గత పదిహేనేళ్ళుగా ప్రతి ఎన్నికలలోను అగ్రకులాల నాయకులతో చెట్టాపట్టాలేసుకొని అధికారంలోకి ఎక్కించేందుకు కృషి చేస్తూ, ఆఖరుకు అత్యంత అవినీతిపరునిగా చరిత్రలోకెక్కిన అగ్రకుల పాలెగాన్ని కూడా గెలిపించమని కోరిన నాయకత్వాన్ని మోస్తూ, ఇదే పోరాటమని, ఈ చదరంగమే జాతి వికాసానికి తోడ్పడుతుందని వాదించడం ద్వారా తను ఎవరి పంచన చేరుతున్నారో శ్రీనివాస్ గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు ఈ రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చేందుకు దళిత, వెనుకబడిన, మైనారిటీలను ఓట్లుకాసే చెట్లుగానే చూశాయన్నది ఒక కఠోర వాస్తవం. ఆ వర్గాల సమగ్ర వికాసం కోసం కనీస కృషి చేయలేదు.

అటువంటివారితో ఏఏ రూపాలలో ఒప్పందాలు చేసుకున్నా అవి సీమాంధ్ర, తెలంగాణ పెద్దమనుషులు చేసుకున్న ఆరు సూత్రాల, అష్ట సూత్రాల ఒప్పందాల మాదిరిగానే బుట్ట దాఖలవుతాయి. శ్రీనివాస్ ప్రతిపాదించిన అంశాలన్నీ రాజ్యాంగ బద్ధంగా ఒప్పందం చేసుకున్నా, అమలు కానివ్వని చరిత్ర నేటి పాలకులది. ఒక రాజ్యాంగ ఆమోదం లేకుండా చేసుకునే ఒప్పందాలు, పథకాలు 'నీటి బుడగలు'గానే మాయవమవుతాయనే చారిత్రక వాస్తవాన్ని ఉన్నత విద్యావంతులు, సామాజిక ఉద్యమకారులు అందరూ గ్రహిస్తారని ఆశిస్తున్నాను.

అటు ఉత్తరప్రదేశ్‌లోను, ఇటు తెలంగాణలోను అగ్రవర్ణ సంపన్న పాలకులతో గానీ లేదా ఆయా సామాజిక కులాలలోని అభివృద్ధి చెంది అధికారాన్ని చేజిక్కించుకున్న పాలకులతోగాని చేసుకున్న ఒప్పందాలను ఆ తరువాత అమలుపరచలేదు. ఉద్యమం ద్వారా మాత్రమే దళిత, వెనుకబడిన, మైనార్టీ వర్గాల వారి హక్కులకు రక్షణ కలుగుతుంది. ఈ పాలకుల నైజాన్ని డాక్టర్ అంబేద్కర్ నాడే గ్రహించారు. 1952లో రాజ్యసభలో భూమి సమస్య పరిష్కారం గురించి మాట్లాడుతూ 'ఈ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు నా ప్రజలకు దక్కని రోజున ఈ రాజ్యాంగాన్ని తగుల బెట్టాలి;

అలా తగులబెట్టే వారిలో మొదటివ్యక్తిగా తానే ఉంటానని' అన్నారు. ఈ దేశ ప్రజలకు ఆ హక్కులేవీ దక్కలేదు. కనీసం రాజ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు కూడా నెరవేరలేదు. ఇందుకు కారకులైన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే 'సకలజనుల సమ్మె'లో పాల్గొనడం మన అందరి కర్తవ్యంగా భావించాలి.

నిజమైన సామాజిక న్యాయ పునాది కల 'ప్రత్యేక ప్రజాస్వామ్య తెలంగాణ'లోనే దళిత, వెనుకబడిన, మైనార్టీవర్గాల వికాసం ఉంటుందనే సమగ్ర అవగాహన కలిగివుండాలి. ఉద్యమంతో దాగుడు మూతలు ఆడే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైతే మడమ తిప్పే ప్రయత్నం వారు చేస్తారో, అక్కడ నుంచి నిజమైన ఉద్యమ శక్తులుగా ఉద్యమ ఉద్ధృతిని పెంచే విధంగా తెలంగాణ ప్రజలందరు చేస్తున్న పోరాటానికి 'వ్యాన్ గార్డ్' పాత్ర మనం పోషించాలి. సకల జనుల సమ్మెను సర్వజనుల ఉద్యమంగా మార్చి తెలంగాణ అమరుల కలలను సాకారం చేద్దాం.

-చిక్కుడు ప్రభాకర్
తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శి

Sunday, September 4, 2011

అడవిపై హక్కు ఆదివాసీలదే - చిక్కుడు ప్రభాకర్ Jun /16/2011Andhra Jyothi



దేశంలోని ఖనిజ సంపదంతా బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు యుపిఏ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను ఆదివాసీలకు దక్కకుండా మన రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు చట్టాలను పూర్తిగా తానే తుంగలో తొక్కుతున్నది. పేదవానికి ఇంటి నిర్మాణం కొరకు 100 చ. గజాల భూమిని, కడుపు నింపుకునేందుకు హెక్టారు వ్యవసాయ భూమి కేటాయించకుండా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం ధనికులకు మాత్రం ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా లక్షలాది హెక్టార్ల ప్రజల భూమిని, అందులోని సంపదను అప్పనంగా కట్టబెడుతున్నది.

పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌ఘడ్ ప్రాంతంలో దాదాపు 30,000 హెక్టార్ల ఇనుప ఖనిజం కలిగిన భూమిని జిందాల్‌కు కేటాయించగా, అక్కడి ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి ఆ సంపద తమకే దక్కాలని జిం దాల్‌ను తరిమికొట్టారు. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా రిలయన్స్, ఎస్.ఆర్, జైస్వాల్, అలాయడ్స్, వేదాంత, టాటా లాంటి బడా కంపెనీలకు విలువైన ఇనుప ఖనిజాన్ని కట్టబెట్టిన ఆయా ప్రభుత్వాలు, ప్రజల పోరాటాలకు తలొ గ్గి కొన్ని కంపెనీలతో ఒప్పందాలను రద్దుచేసుకున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాలోని బయ్యారం నుండి విశాఖ జిల్లాలోని చింతపల్లి, గూడెం కొత్తవీధి, అరకులోయలలో విస్తరించివున్న ఇనుపరాతి ఖనిజం, బాక్సైట్‌లతో పాటు నిన్న దుంబ్రిగూడలో ఆదివాసులు వ్యతిరేకించిన చైనాక్లే (కాల్షియేట్) తవ్వకాల వరకు లక్షల కోట్ల అటవీ సంపదను ప్రభుత్వ రంగ సంస్థయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎ.పి.యం.డి.సి) ప్రభుత్వం నుండి గనులను సొంతం చేసుకొని ఆ తర్వాత బడాపెట్టుబడిదారులకు, గుత్తపెట్టుబడిదారులకు, అడవి ప్రాం తంలోని బినామీలకు కట్టబెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ది. ఇందులో భాగమే దుంబ్రిగూడ చైనాక్లే తవ్వకాలు. అందుకే ఆదివాసీ ప్రజలు ఇటువంటి బినామీలకు ప్రజాప్రతినిధులు మ ద్దతు ఇవ్వడం వలన వారి మీద దాడులకు పాల్పడుతున్నారు.

ఎ.పి.యం.డి.సి. 5-1-2009న ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలలో మాత్రమే ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో, వరంగల్ జిల్లాలోని గూడూరు మండలంలోని నిక్షిప్తమయివున్న లక్షలాది కోట్ల విలువైన కోట్ల కొలది మెట్రిక్ టన్నుల ఇనుపరాతి ఖనిజం ఉపయోగించుకుని స్టీల్‌ప్లాంట్ నిర్మించేందుకు ముందుకు రావాలని బడాపెట్టుబడిదారులను కోరింది. జాయింట్ వెంచర్‌లో నిర్మించే ఈ ప్లాంట్‌లో తనది 2 శాతం వాటాగా, మిగతా 98 శాతం వాటా ప్రైవేట్ రంగానిదిగా నిర్ధారిస్తూ అటవీ ప్రజల సంపదంతా బడాపెట్టుబడిదారులకు దారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది.

26 జనవరి 1950 ప్రకారం నోటిఫై చేసిన ఈ ప్రాంతాలు పూర్తిగా ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాలు. ఇందులో ల్యాండ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ యాక్ట్ 1959, సెక్షన్ 3 ప్రకారం ఇక్కడి భూములను ఆదివాసేతరులెవరూ కొనేటందుకుకాని, లీజుకు తీసుకునేందుకుగానీ అనుమతిలేదు. ఇదే విషయాన్ని 1/70 చట్టం కూడా ధృవీకరిస్తుంది. ఇంకా లోతుల్లోకి వెళితే అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు తప్ప ఇతరులెవరికి అటవీ సంపదను లీజుకు ఇవ్వవద్దని "సమరతావి మరియు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1997'' కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పింది.

పై చట్టాలేవి పరిగణలోకి తీసుకోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ.పి.యం.డి.సి.కి ఈ గనులను కేటాయించడం, ఈ సంస్థ ప్రైవేట్ సంస్థయిన (వై.ఎస్.ఆర్. కుటుంబానికి చెందిన) రక్షణ స్టీల్స్‌కు 24-02-2009న జీ.వో.నెం. 69/2009 ద్వారా ఇనుప రాతి ఖనిజం పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు విడుదల కాగా, ఆ తర్వాత రోజునే (25-02-2009) ఎ.పి.యం.డి.సి. రక్షణ స్టీల్స్‌తో ఇనుపరాతి ఖనిజ పంపిణీ ఒప్పందం చేసుకున్నది.

మైన్స్ మరియు మినరల్ చట్టం 1957 (కజీn్ఛట్చజూ ఈ్ఛఠ్ఛిజూౌఞఝ్ఛn్ట - ఖ్ఛజఠజ్చ్టూజీౌn అఛ్టి 1957)లో సెక్షన్ 11 మైనర్, మేజర్ గనుల కేటాయింపును నిర్దేశిస్తుంది. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1991లో సెక్షన్ 11(5)గా చట్టసవరణ జరిగిందేమిటంటే ఏజెన్సీ ప్రాంతంలోని మైనర్, మేజర్ గనులన్నీ గిరిజనులకు, గిరిజన సొసైటీలకు మాత్రమే కేటాయించాలి. అలాగే ప్రభుత్వరంగ సంస్థలకు కూడా కేటాయించవచ్చు తప్ప గిరిజనేతరులకు కేటాయించవద్దని చెబుతున్నది.

ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించవచ్చనే చట్టం లొసుగును ఆసరా చేసుకుని ఆదివాసులు, గిరిజనులు ఎందరో ఆ ప్రాంతంలో దరఖాస్తు చేసుకున్నా, వారి దరఖాస్తులను కనీసం పరిశీలించని ప్రభుత్వం జూన్ 30, 2010న ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలంలోని దాదాపు 56,690 హెక్టార్ల భూమిని ఎ.పి.యం.డి.సి.కి రిజర్వ్ చేస్తున్నట్లుగా జీవో 64/2010 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు, స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు రాజీలేని పోరాటం చేయగా, ఇంకొకవైపు గిరిజనుల న్యాయవాదులు జీ.వో 64/2010ని రద్దు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, డిసెంబర్ 12, 2010న పై జీవోను రద్దు చేస్తూ, జీవో నెం 126/2010ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఎ.పి.యం.డి.సి.కి నోటీసునిచ్చి దాని నుండి ఎటువంటి అభ్యంతరాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతనే పై సంస్థకు గనుల రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు జీ.వో.నెం. 126/2010ని విడుదల చేయగా, వైఎస్ఆర్ కుటుంబ సంస్థయిన రక్షణ స్టీల్స్ తన దోపిడీని కొనసాగించేందుకు జీ.వో.నెం. 126/2010 రద్దు చేయాల్సిందిగా డిసెంబర్ 16న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ జీవో రద్దుకు నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం, తుది తీర్చు వచ్చేవరకు మూడో వ్యక్తులెవరికీ ఆ గనులు కేటాయించవద్దని "యథా - తథాస్థితి'' (ఖ్ట్చ్టిఠట ఛిౌ)ని కొనసాగించాల్సిందిగా ఆదేశించింది.

ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉద్దేశపూర్వకంగానే కేసును చూసీ చూడనట్లు వదిలేశారని, వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఈ గనులు ఆదివాసీలకు దక్కకూడదనే ప్రయత్నంలో భాగంగానే న్యాయస్థానంలో గట్టివాదనలు చేయలేదని, "స్టేటస్-కో''ను ఎత్తివేసేందుకు ప్రయత్నం చేయడం లేదని విమర్శలు వినిపించాయి. అది నిజమేనని కాలం నిరూపిస్తున్నది కూడా. అలాగే ప్రజల ఆస్థిని కాపాడే సంస్థలయిన ఎ.పి.ఐ.ఐ.సి, ఎ.పి.యం.డి.సి.లు బడాపెట్టుబడిదారుల, గుత్తపెట్టుబడిదారులకు బినామీ సంస్థలుగా మారాయి. ప్రభుత్వ భూములను, అపారమైన గనుల సంపదను తాము దక్కించుకోవడం, తమ ద్వారా గుత్తపెట్టుబడిదారులకు, రాజకీయ బలం కలిగిన వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేయడం పరిపాటయింది.

ముఖ్యంగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఈ సంస్థలు ఆయన కుటుంబ సభ్యుల సంస్థల చేతిలో కీలుబొమ్మలయ్యాయి. 2005 సంవత్సరంలో బయ్యారం మండలంలోని రామచంద్రపురం, మొట్ల తిమ్మాపురం గ్రామాలలో బ్రదర్ అనిల్ కుమార్ బినామీలకు 24 హెక్టార్ల ఇనుపఖనిజం కేటాయించగా, వారు 20 సంవత్సరాలలో తవ్వుకోవలసిన ఖనిజాన్ని కేవలం అయిదు సంవత్సరాలలోనే త్వరగా, అపరిమితంగా పరిమిట్లు ఇచ్చి వారికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు తమ వాటాలను వారి నుండి మింగారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆ గనుల మీద విచార ణ జరిపించగా వేలాది కోట్ల రూపాయల ఖనిజం అక్రమంగా తవ్వుకున్నట్లు నిర్ధారణ కాగా, ఆ లీజును తాత్కాలికంగా ప్రభు త్వం రద్దు చేసింది. ఆ లీజులను తిరిగిపొందేందుకు బ్రదర్ అనిల్ కుమార్ మనుషులు "డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ'' కార్యాలయంలో తిష్టవేసి అధికారులమీద ఒత్తిడి తెస్తూనే వున్నారు. ఇంకొకవైపు గార్ల మండలంలోని సిరిపురం గ్రామంలో లక్షలాది కోట్ల రూపాయల విలువైన బైరైటీస్ గనులను వైఎస్ బామ్మర్ది కడప నగర మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ సమీప బంధువులు ఎమ్మెల్యేలు, ఎంపీలయిన మేకపాటి సోదరులు బినామీ ట్రైబల్ సొసైటీలు సృష్టించి గత ఆరు సంవత్సరాలుగా వేలాది కోట్ల రూపాయల ఖనిజం తవ్వుకుంటున్నారు. ఈ సొమ్ముతో వై.ఎస్.ఆర్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నది.

దేశంలోని అత్యంత ధనవంతునిగా మారేందుకు తెలంగాణ ప్రాంతంలోని బయ్యారం విలువయిన ఇనుపరాతి ఖనిజాన్ని ఎ.పి.యం.డి.సి.ద్వారా దక్కించుకుని స్టీల్ ప్లాంట్ ముసుగులో ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు పన్నిన కుట్రను తెలంగాణ ప్రజలు వమ్ముచేశారు. తాను దోపిడీ చేసిన సొమ్ముతో ఆ గనులను మళ్ళీ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న వైఎస్ కుటుంబాన్ని ప్రభుత్వం సమర్ధవంతంగా పోరాడి న్యాయ స్థానం విధించిన "యథా - తథ స్థితి''ని ఎత్తివేయించాలి.

బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, గూడూరు మండలాల్లో నిక్షిప్తమయిన ఇనుపరాతి ఖనిజాన్ని స్థానిక ఆదివాసీలకు, గిరిజనులకు కేటాయించి ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలి. అలాగే ఈ గనులను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు వారికి శిక్షణనివ్వాలి. ఏ ముడిసరకు అయితే ఆ ప్రాంతంలో వుంటుందో, ఆ ప్రాంతంలో ఆ ముడిసరకు ఆధారిత పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా ఆ పరిశ్రమను దీర్ఘకాలికంగా అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతాం. ఇందులో భాగంగానే పారిశ్రామికంగా వెనుకబడివున్న వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసీ ప్రాంతాలలో 10,000 టన్నులు రోజుకు (10,000 ఖీౌnn్ఛట ఞ్ఛట ఛ్చీడ) ఇనుము ఉత్పత్తి చేయగల స్టీల్ ప్లాంట్లను నిర్మించేందుకు గిరిజనులకు సహకరించాలి. అప్పుడే ఈ ప్రాంతాలలోని దాదాపు 50,000ల ఆదివాసీ, ఆదివాసేతర యువతీ యువకులకు ఉపాధి లభిస్తుంది.

ఈ విధంగా అటవీ సంపదను, ఆదివాసులకు, గిరిజనులకు కేటాయించడం ద్వారా స్వతంత్ర భారతదేశంలోని ఆదివాసుల్లో- తాము అడవిలోని కట్టె పుల్లలు మాత్రమే కాదు, అటవీ సంపదలోను తమ హక్కు ను దక్కించుకున్నవాళ్లమనే విశ్వాసం పెరుగుతుంది. వారి అభివృద్ధికి మహానుభావులు చేసిన చట్టాలు ఉపయోగంలోకి వస్తాయి. ఇలా జరగకపోతే లాల్‌ఘడ్‌లు, కలింగనగర్‌లు, బయ్యారంలు, దుంబ్రిగూడ పోరాటాలు మరింత ఉధృతమై "ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారకముందే'' కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరచి ఆదివాసీ, గిరిజనులకు ఆ సంపదను దక్కేందుకు కృషి చేసి వారి కొరకు ఏర్పాటు చేసిన చట్టాలను అమలు చేయించాలి. ఈ ప్రయత్నం ద్వారా ప్రత్యక్షంగా ఆదివాసి, గిరిజన ప్రాంతాలను పరోక్షంగా రాష్ట్ర, దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి.

- చిక్కుడు ప్రభాకర్

తొలి లక్ష్యం 'భౌగోళిక'మే - చిక్కుడు ప్రభాకర్ Andhra Jyothi 16/08/2011


తొలి లక్ష్యం 'భౌగోళిక'మే
- చిక్కుడు ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉద్ధృతమౌతోంది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఉద్యమకారులు 'దొరల తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ' కావాలని అంటున్నారు. వీరివలే ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న మానవ సమగ్ర వికాస భావజాల స్ఫూర్తిమంతులైన నాయకులు ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కావాలని అంటున్నారు. ఈ రెండో వర్గం వారు ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ వచ్చేవరకు భౌగోళిక తెలంగాణ వద్దని అనడం లేదు; భౌగోళిక తెలంగాణ కొరకు కూడా పోరాడాలనేదే వారి భావన. ఈ నేపథ్యంలో భౌగోళిక, సామాజిక, ప్రజాస్వామిక, దొరల తెలంగాణ వాదనల గురించి సమగ్రంగా చర్చించాల్సిన అవసరమున్నది.
ప్రత్యేక తెలంగాణను కోరుకొంటోన్న నాలుగు కోట్ల ప్రజల వాస్తవ చరిత్ర, వర్తమాన గమనాన్ని చర్చించకుండా భవిష్యత్‌ను అర్థవంతంగా నిర్వచించుకోలేం. రకరకాల తెలంగాణాల గూర్చి చర్చించే ముందు రెండు ముఖ్య విషయాలను ప్రస్తావించుకోవల్సివుంది. అవి: (అ) 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ, భారతదేశంలో విలీనమయ్యేనాటికి కొన్ని శతాబ్దాలుగా రాజుల పాలనలో ఉన్నది. 1948 నుంచి 1956 వరకు స్వతంత్ర రాష్ట్రంగాఉన్న ఈ ప్రాంతం దొరల పాలనలో ఉన్నది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిననాటి నుంచి రెండు దశాబ్దాలపాటు దొరల పాలనలోనే మగ్గింది.
ఈ దొరలు, సీమాంధ్ర భూస్వాములు, పెట్టుబడిదారులు, ఉన్నతాధికార వర్గం అందరూ కలిసి తెలంగాణ జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన కులాలవారిని మనుషులుగా చూడలేదన్నది వాస్తవం. సీమాంధ్రుల పాలననుంచి విడివడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికై 1969లో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ ఉద్యమాన్ని పాశవికంగా అణచివేశారు. దాదాపు నాలుగువందల మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
1971 పార్లమెంటరీ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి అత్యధిక స్థానాలను గెలుచుకున్నది. అయితే ఆ 'సమితి' నాయకత్వం సీమాంధ్ర భూస్వాములు, పెట్టుబడిదారులతో కుమ్మక్కవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోయింది. తత్ఫలితంగా నేటివరకు మనప్రాంతంలోనే మనం రెండవ తరగతి పౌరులుగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1969 ఉద్యమంలో అగ్రభాగాన నిలబడిన విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి వర్గాలవారు తెలంగాణలోని భూస్వామ్య దౌష్ట్యాలకు వ్యతిరేకంగా పోరాటాలను కొనసాగించారు.
గ్రామాల్లో దొరలు పీడిత ప్రజల మీద చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటాల ఫలితంగానే 1978 నాటికి గ్రామ గడీలలోని దొరలు పట్టణాలకు వలసపోయారు. ఆ పోరాటాలు పల్లెలలోని పీడిత ప్రజలందరినీ ఏకం చేసి అంటరానితనం, వెట్టి, బాలకార్మిక వ్యవస్థను పారదోలగలిగింది. దళిత, ఆదివాసి, గిరిజన, వెనుకబడిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించ సాగారు.
భూమిలేని నిరుపేదలకు దొరల భూములను పంచడాన్ని అరికట్టే క్రమంలో ప్రభుత్వ భద్రతా దళాలు వందలాది పోరాటకారులను కాల్చి చంపాయి. 1995 నాటికి ఆ భూములను ఎస్‌సి కార్పొరేషన్, బిసి కార్పొరేషన్ మొదలైన సంస్థల ద్వారా కొని దొరలకు వాటి విలువ చెల్లించింది. ఆయా భూములను వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలకు కేటాయించడం వల్ల తెలంగాణ గ్రామ భూ సంబంధాలలో మార్పు వచ్చింది కానీ నిరుపేదలకు భూమి దక్కలేదు.
(ఆ) తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తెలంగాణ జిల్లాల్లోని పరిశ్రమలు, హైదరాబాద్ నగరంలోని పరిశ్రమలను మూయించి వేశారు. ఆ పరిశ్రమలకు చెందిన వేలాది ఎకరాల భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులకు చౌకగా విక్రయించారు. అలా దక్షిణ తెలంగాణలోని లక్షలాది ఎకరాల భూములను నేడు రియల్ఎస్టేట్ బిల్డర్స్, సినిమా స్టూడియోలు, రిసార్ట్స్, వివిధ పరిశ్రమలకు, ఫామ్ హౌజ్‌లకు ప్రభుత్వం కేటాయించింది. మణికొండ, కోకాపేట, నానక్‌రామ్‌గూడలో మైనారిటీల, దళితుల, వెనుకబడినవర్గాలవారి భూములు సీమాంధ్ర పెట్టుబడిదారుల పరమయ్యాయి.
దీంతో తెలంగాణలోని స్థానిక భూస్వాములు కనుమరుగయిపోయి 'నయా భూస్వామ్యం' ఆవిర్భవించింది. ఇది తెలంగాణ ప్రజల పట్ల గుదిబండగా తయారైంది. ఈ నయా భూస్వామ్యం వేలకోట్ల రూపాయల ఆస్తులు కలిగి హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని దక్షిణ, ఉత్తర భారతదేశాలను శాసిస్తున్నది. సీమాంధ్రకు చెందిన ఈ నయా భూస్వాములు తెలంగాణను సకలం దోచుకొని కుబేరులయ్యారు. ఈ ప్రాంత జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన కులాల వారికి కూడు, గూడు, గుడ్డ కలిగి హుందాగా జీవించే అవకాశం లేకుండా చేశారు.
అలాగే జంటనగరాలలోని 30 శాతం ముస్లిం ప్రజల సకల జీవనోపాధి వనరులు, అవకాశాలను సీమాంధ్రవారే స్వాధీనం చేసుకున్నారు. ఈ నయా సంపన్నుల అరాచకాల వల్ల ముస్లింల బతుకులు అతలాకుతలమయ్యాయి. నవ యవ్వనంలోని బాలికలను వృద్ధులైన అరబ్ షేక్‌లకు అమ్ముకోవల్సిన దుస్థితి హైదరాబాద్ ముస్లింలకు ఏర్పడింది. ఒక గ్రామీణ తెలంగాణకు చెందిన వేలాది ప్రజలు కన్న ఊరికి దూరమై ఎక్కడో ఉన్న నగరాలలో హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడుతున్నారు.
అంతేకాదు తెలంగాణ పోరాటం పట్ల అమానవీయ దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. వేలాది పోలీసు బలగాలను తెలంగాణలో మొహరించి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న విద్యార్థులను అణచివేస్తున్నారు. వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడడమంటే తెలంగాణ ప్రాంత 90 శాతం ప్రజలు హుందాగా జీవించడానికి అడ్డుపడడమే.
ఇందుకు కారకులైన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడడం మన అందరి తక్షణ కర్తవ్యం అనేది వాస్తవం. అటువైపు ప్రజలందరూ కదులుతున్నదీ వాస్తవం. ఇటువంటి తరుణంలో సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడి తొలుత భౌగోళిక తెలంగాణను సాధించుకోవాలి; ఆ క్రమంలోనే ఉద్యమ శక్తులు కోరుకొంటున్నట్లు సామాజిక, ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణను సాధించుకోవచ్చును.
కాగా సామాజిక ఉద్యమ శక్తులు ఒక వితండవాదం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో అగ్రవర్ణాల పాత్ర ఉన్నది కాబట్టి రేపు రాబోయే తెలంగాణ వారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి సామజికశక్తుల్లో చేతుల్లో ఉండే సామాజిక తెలంగాణ కావాలి. ఒక వేళ తెలంగాణ రాకున్నా ఫర్వాలేదు కాని తెలంగాణ వద్దు అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటాన్ని బలహీనపరుస్తున్నారు. అయితే సామాజిక తెలంగాణ గూర్చిగాని, సామాజిక న్యాయం గూర్చిగాని సామాజిక ఉద్యమ శక్తులు తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నది శూన్యం. సామాజిక న్యాయపునాదిగా అభివృద్ధి చెందే తెలంగాణ గూర్చి, సామాజిక తెలంగాణ గూర్చి సంగ్రహంగా చెబుతున్నారు కానీ సమగ్రంగా చెప్పడం లేదు.
సామాజిక న్యాయపునాది లేదా సామాజిక తెలంగాణ అంటే 'ఈ ప్రాంతంలో దొరికే సకల వనరులు, ఉద్యోగాలు, ఉత్పత్తి సాధనాలు, రాజకీయ పదవులు మొత్తం జనాభాలోని ఆయా కులాల నిష్పత్తి ప్రకారం స్వేచ్ఛగా అందరికీ అందే అవకాశం కలిగిన తెలంగాణ'గా తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అంశాన్ని విస్మరిస్తున్నారు.
అలాగే అటువంటి తెలంగాణలో 'సామ్రాజ్యవాద, బహుళజాతి, బడా పెట్టుబడిదారుల దోపిడీ లేకుండా స్వయం సమృద్ధి సాధిస్తూ ఈ ప్రాంత ప్రజలు రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలుజరిగి స్వేచ్ఛగా జీవించే ప్రజాస్వామిక తెలంగాణ కావాలని ప్రజాస్వామిక తెలంగాణను కోరే శక్తులంటున్నాయి. సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల కబంధ హస్తాల నుంచి భౌగోళిక తెలంగాణ సాధించుకున్న తర్వాతనే ఉద్యమ శక్తులు అంటున్న సామాజిక లేదా ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాని ఇప్పుడెలా సాధ్యం?
సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు తెలంగాణ రైతాంగానికి సంబంధించిన భూమి, నీటిని దశాబ్దాలుగా కొల్లగొడుతున్నారు. తత్కారణంగా భూమిలేని నిరుపేదలకు భూమి దక్కలేదు. నీటిపారుదల సదుపాయాలను అభివృద్ధి చేయలేదు. పరిశ్రమలన్నీ మూసేశారు. సింగరేణి లాంటి పెద్ద పరిశ్రమలో 80 శాతం అధికారులు సీమాంధ్రకు చెందిన వారుండడం ద్వారా ఓపెన్‌కాస్ట్ గనులు పెరిగి కార్మికులు రోజురోజుకు తగ్గుతున్నారు. ఇప్పటికే 1,25,000నుంచి 60,000 కుదించబడినారు.
ఈ కార్మికులలో 95 శాతం దళిత, అణగారిన కులాలకు చెందిన వారన్నది వాస్తవం. తెలంగాణ ప్రజలకు కనీస వనరులు దక్కాలన్నా సీమాంధ్ర భూస్వామ్య ఆధిపత్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి 'భౌగోళిక తెలంగాణ'ను సాధించుకోవల్సిందే. స్వాతంత్య్రానికి పూర్వం అంబేద్కర్ 'ఈ దేశ స్వాతంత్య్రంలో మా వాటా ఎంత? స్వాతంత్య్రం వస్తే మా అణగారిన కులాలకు దక్కేదేమిటని' బ్రిటీష్ పాలకులను, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. మన సమాజంలో కుల వ్యవస్థ బలంగా ఉండి శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా జరిగిందనేది వాస్తవం.
పునాదిలో కులం, వర్గం రెండూ ఉండడం ద్వారా జమిలిగా చేసే మహత్తర పోరాటం ద్వారా ఆ రెండు వ్యవస్థలను నిర్మూలించగలుగుతాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కుల మతవర్గాల తేడా లేకుండా పోరాడి ప్రజలు డిసెంబర్ 9 ప్రకటనను సాధించుకున్నారు. సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మావోయిస్టులు ఉన్నారని, వారి ఎజెండానే టిఆర్ఎస్ అమలుచేస్తుందనే ప్రచారం చేసి కేంద్రాన్ని నమ్మించారు. నిజమేమిటి? తెలంగాణ పోరాటం ప్రజా పోరాటం.
అందులో ఒక భాగమే రాజకీయాలు, రాజకీయ పార్టీలు తప్ప సమస్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షేనన్నది ఉద్దేశపూర్వకంగా సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆ విషయాన్ని దాటవేస్తున్నారు. ఏమైనా డిసెంబర్ 9 ప్రకటన అమలుకు జరుగుతోన్న పోరాటం కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో మనమందరం ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఏకోన్ముఖ పోరాటం నడపాల్సిన అవసరం ఉన్నది. ఆ పోరాటం ద్వారానే కేంద్రం దిగివస్తుంది. రేపు సామాజిక తెలంగాణగా కానీ, ప్రజాస్వామిక తెలంగాణగా కానీ రూపుదిద్దుకునేందుకు మంచి 'భౌతిక పునాది' ఇక్కడ ఉన్నది.
నాలుగు కోట్ల ప్రజలు సమృద్ధిగా జీవించే సకల వనరులు ఉన్నాయి. ఈ వనరుల ద్వారా తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేసుకొని దేశానికేకాక ప్రపంచానికే ఆదర్శం కావచ్చు. ఈ మహత్తర అవకాశాన్ని వదిలి వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చరిత్రలో తప్పుచేసిన వారిగా మిగిలిపోతాం. కనుక భౌగోళిక తెలంగాణ ఏర్పాటు సామాజిక లేదా ప్రజాస్వామిక తెలంగాణకు మొదటి మెట్టుగా లేదా ముందు షరతుగా భావించి సకల ప్రజల సమ్మెను జయప్రదం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలి.
- చిక్కుడు ప్రభాకర్