Showing posts with label గాలి వినోద్ కుమార్. Show all posts
Showing posts with label గాలి వినోద్ కుమార్. Show all posts

Monday, July 21, 2014

కొలంబియాలో అంబేద్కర్‌ - ప్రొ. గాలి వినోద్‌కుమార్‌


Published at: 20-07-2014 01:19 AM
భారత రాజ్యాంగకర్త, ప్రపంచ మేధావి డాక్టర్‌ అంబేద్కర్‌ను యూరోపియన్‌, అమెరికన్‌ సమాజాలు గుర్తించినంతగా భారతదేశం గుర్తించ లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1953 జనవరి 12న అంబేద్కర్‌కు గౌరవ డాక్టరేట్‌ పట్టా డి.లిట్‌ను ప్రదానం చేసింది. ఆ సందర్భంగా ‘అంబేద్కర్‌ స్వయం ప్రతిభావంతుడు, గొప్ప న్యాయకోవిదుడు, శాసనకర్త, అణ గారిన జాతుల విముక్తి ప్రదాత’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివర్ణించింది. భారతదేశంలోని మరే విశ్వవిద్యాలయమూ మన రాజ్యాంగ నిర్మాతను, ఆయన బ్రతికి ఉన్న కాలంలో, సముచిత రీతిలో గౌరవించలేదు.
అంబేద్కర్‌ను సమున్నతంగా గౌరవిస్తోన్న పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో అమెరికాలోని కొలంబియా వర్సిటీని ముందుగా చెప్పుకోవాలి. బరోడా మహారాజు ఇచ్చిన ఉప కార వేతనంతో యువ అంబేద్కర్‌ ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీ కోసం ఆయన 1913 జనవరి 20న ఆ విశ్వవిద్యాలయంలో ప్రవేశించారు. ఆ ప్రవేశ ప్రాధాన్యాన్ని పురస్కరించుకుని కొలంబియా ఏటా జూలై 13న అంబేద్కర్‌ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తోంది. అంబేద్కర్‌ పేరుతో ఒక అధ్యయన పీఠాన్ని, ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాక కొలంబియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. తమ విద్యార్థులయిన ప్రపంచ మేధావుల విద్యా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాటి. ఇది చాలా అరుదైన గౌరవం. ఇటువంటి సమున్నత గౌరవాన్ని పొందిన ప్రపంచ మేధావులలో మన అంబేద్కర్‌ ఒకరు. కొలంబియా వర్సిటీ వలే మరికొన్ని ప్రతిష్ఠాత్మక పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు కూడా అం బేద్కర్‌ పేరిట అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేశాయి. అయితే ఈ దేశంలో, చివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైతం అంబేద్కర్‌ పేరుతో ఒక్క అధ్యయన కేంద్రమూ ఏర్పాటుకాక పోవడం బాధాకరమే (అయితే ఉస్మానియా పి.జి. న్యాయకళాశాల కొంతలో కొంత ఈ బాధ్యత నెరవేర్చింది. గత ఏడాది ఉస్మానియా వర్సిటీలో అంబేద్కర్‌ పేరుతో ఒక కొత్త గ్రంథాలయాన్ని నిర్మించారు. న్యాయ కళాశాల ముఖ ద్వారం వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్ట మొదటిదైన డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ పీఠం అనే పరిశోధన కేంద్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 11న ప్రారంభించడం జరిగింది). కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబే ద్కర్‌ చదివింది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే (1913 నుంచి 1916 వరకు). తన విద్యాభ్యాస కాలంలో ఆ విశ్వవిద్యాలయంలో సామాజిక, మానవీయ శాస్త్రాలలో ఆచార్యులుగా ఉన్న జాన్‌డ్యూయి, షాట్‌ వెల్‌, రాబిన్‌సన్‌, ఎడ్విన్‌ సెలిగ్‌ మాన్‌, క్లార్క్‌ సీగెర్‌, మారె, పాట్‌ బిల్‌, చూడ్‌విక్‌, గిడ్డింగ్స్‌, సిమ్‌కోవిచ్‌, గోల్డెన్‌విసెర్‌లను ఆయన తన ప్రతిభాపాటవాలతో ముగ్ధులను చేశారు.
కొలంబియాలో విద్యార్థిగా అంబేద్కర్‌ రోజూ 18 గంటల పాటు నిరంతర అధ్యయనంలో గడిపేవారు. బరోడా మహారాజు ఇచ్చిన ఉపకార వేతనం సరిపోకపోవడంతో అంబేద్కర్‌ ఒక్క పూట మాత్రమే భోజనం చేసి రెండోపూట ఒక బ్రెడ్‌తోనే సరిపెట్టుకునేవారు. మాస్టర్‌ డిగ్రీని ఉన్నత ప్రతిభతో పూర్తిచేసిన వెంటనే 1915లోనే ‘ప్రాచీన భారత వాణిజ్యం’ అనే అంశంపై ఒక పరిశోధనా పత్రాన్ని అంబేద్కర్‌ సమర్పించారు 1916లో ‘నేషనల్‌ డివిడెండ్‌ ఆఫ్‌ ఇండియా: ఏ హిస్టారిక్‌ అండ్‌ అనాలిటికల్‌ స్టడీ’ అనే మరో పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఈ రెండే గాక, 1916లోనే ‘క్యాస్ట్స్‌ ఇన్‌ ఇండియా : దేయిర్‌ మెకానిజం, జెనిసిస్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌’ అనే ప్రతిభావంతమైన పరిశోధనా పత్రాన్ని కూడా అంబేద్కర్‌ రచించారు (తదనంతర కాలంలో ఆయన రాసిన ‘కులనిర్మూలన’ అనే సుప్రసిద్ధ గ్రంథానికి ఈ పరిశోధనా పత్రమే నాంది). ఈ మూడు పరిశోధనా పత్రాలు కొలంబియా ఆచార్యుల ప్రశంసలను ఎంతగానో పొందాయి. కొందరు ఆచార్యులు అంబేద్కర్‌ గౌరవార్థం విందు కూడా ఇచ్చారు.
కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నకాలంలో పాశ్చాత్య సమాజాన్ని అంబేద్కర్‌ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ సమాజంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాన హక్కులు మొదలైన ప్రజాస్వామిక విలువలు ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తితోనే ఎలాంటి అసమానతలు లేని నవ భారత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో భారత రాజ్యాంగ రచనా బాధ్యతలను చేపట్టడానికి అంబేద్కర్‌ అంగీకరించారు. తన ఆశయాలను సంపూర్ణంగా రాజ్యాంగంలో పొందుపర్చే అవకాశాలు ఆయనకు పూర్తిగా లభించలేదన్నది ఒక కఠోర వాస్తవం. అయితే మన సమాజంలో 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగం ద్వారా కొన్ని ముఖ్యమైన ప్రజాస్వామిక హక్కుల్ని కల్పించడంలో అంబేద్కర్‌ కృతకృత్యులయ్యారు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మౌలిక విలువల్ని తాను బౌద్ధ ధర్మం నుంచి స్వీకరించానే కానీ ఫ్రెంచ్‌, అమెరికన్‌ విప్లవాల నుంచి కాదని ఆయన ఒక సందర్భంలో స్పష్టం చేశారు. తన ఆచార్యుడు జాన్‌ డ్యూయి ప్రభావంతో మానవహక్కుల, మానవ విలువల స్ఫూర్తిని రాజ్యాంగంలో ఆయన పొందుపర్చారు. రాజకీయ అధికారాన్ని సాధించడమే ముఖ్యం కాదని, ఎలాంటి అసమానతలు లేని సమాజాన్ని నిర్మించినపుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని అంబేద్కర్‌ అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ వాదం కాదని, మైనారిటీలకు స్వేచ్ఛ, సమాన హక్కుల్ని కల్పించడమేనని ఆయన పేర్కొన్నారు. అసమానతలకు ఆలవాలంగా ఉన్న సనాతన ధర్మంతో కాకుండా సమత, మానవత, సమాన విలువలతో కూడిన ప్రజాస్వామ్యం కావాలని భారతరాజ్యాంగం ద్వారా అంబేద్కర్‌ ఆశించారు.
అలాంటి సమున్నత విలువల్ని డాక్టర్‌ అంబేద్కర్‌ పాశ్చాత్య సమాజంలో పొందారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి చదువును పూర్తిచేసుకొని భారత్‌కు వచ్చిన వెన్వెంటనే ఆ మేధావికి అడుగడుగునా అవమానమే జరిగింది. ఉండడానికి ఇల్లు, తాగడానికి నీళ్ళు దొరకలేదు. అమెరికాలో ఆఫ్రికన్‌ అమెరికన్‌లు రంగు బేధంతో పడుతున్న బాధలు, భారతీయ సమాజంలో కుల వివక్షతో అట్టడుగు వర్గాల వారు అనుభవిస్తున్న బాధలు వెయ్యి రెట్లు ఎక్కువ అని అంబేద్కర్‌ అన్నారు. అమెరికాలో నల్ల జాతి విముక్తి పోరాటాలకు ఆయన పూర్తి మద్దతు పలికారు. అమెరికాలో శ్వేత, నల్ల జాతీయుల మధ్య సం బంధాలు యజమాని- బానిస సంబంధాలు కాగా భారతీయ సమాజంలోని అంటరానివారుగా పిలవబడే వారి దుస్థితి మహా ఘోరమైనదని అంబేద్కర్‌ అన్నారు.
ఎందుకంటే భారత్‌లో వ్యవస్థీకృతమైన నిషేధాజ్ఞలే కాకుండా, మానసికమైన నిషిద్ధాలు కూడా ఉన్నాయి. కులం పేరుతో సకల మానవీయ విలువలూ మంటగలిసిపోయినందున కులవ్యవస్థను నిర్మూలించాల్సిందేనన్న భావనకు అంబేద్కర్‌ వచ్చారు. ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక సమాజం ఏ పునాదులపై నిర్మించబడాలనే విషయమై తన గురువు జాన్‌ డ్యూయీ బోధనలు అంబేద్కర్‌కు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తితోనే, మను ధర్మం పునాదిగా నిర్మించబడిన భారత సమాజాన్ని సమానత, మానవతా విలువలు కల్గిన సమాజంగా (భారత రాజ్యాంగం పునాదిగా) పునర్నిర్మించాలని డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశించారు.
పీడిత జన విముక్తికి అంబేద్కర్‌ చూపిన మార్గం ఒక్క భారత్‌లోనే కాదు, యావత్‌ ప్రపంచానికి స్ఫూర్తినిస్తోంది. 21వ శతాబ్దం అంబేద్కర్‌ శతాబ్దంగా ప్రపంచం గుర్తించింది. ప్రపంచ పీడిత మానవాళిని విముక్తపరిచేది అంబే ద్కరిజం మాత్రమేనని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కొలంబియా విశ్వవిద్యాలయం కూడా ప్రపంచ విముక్తికి అంబేద్కర్‌ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తించి గౌరవించింది.
మరి అంబేద్కర్‌ పెంపొందించిన రాజ్యాంగ విలువలను పట్టించుకోకుండా ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌’ నిర్మాణం ఎలా సాధ్యమవుతుందో మన ప్రస్తుత పాలకులే చెప్పాలి. కొలంబియా విశ్వవిద్యాలయం స్ఫూర్తితో ప్రతి భారతీయ విశ్వవిద్యాలయమూ అంబేద్కర్‌ ఆలోచనల గొప్పతనాన్ని గుర్తించాలి. ఇది జరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామిక సమాజానికి మన దేశంలో పునాదులు పడుతాయి. అటువంటి సమతా సమాజ నిర్మాణమే మన రాజ్యాంగ నిర్మాతకు మనం అందించే నిజమైన నివాళి.
ప్రొ. గాలి వినోద్‌కుమార్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం
(జూలై 20న, అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్‌ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా)

Andhra Jyothi Telugu News Paper Dated: 20/07/2014 

Wednesday, November 6, 2013

'సీమ'కు అంబేద్కర్ స్ఫూర్తి - గాలి వినోద్ కుమార్

రాష్ట్ర విభజన జరగనున్న నేపథ్యంలో, సమైక్యాంధ్ర అనే తప్పుడు అవగాహనతో కాకుండా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ రాయలసీమ విద్యావంతులు ఉద్యమించడం హర్షణీయం. 'ఏ ఉద్యమమైనా తన లక్ష్యం నుంచి పక్కదారి పట్టిందంటే అది విద్యావంతుల తప్పు. దాన్ని సరిచేయాల్సి ంది విద్యావంతులే' అని డాక్టర్ అంబేద్కర్ అన్నారు. మరి సీమాంధ్ర ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సరిచేయాల్సింది, ఈ దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించాల్సిందీ విద్యావంతులే. విద్యావంతులైన యువత, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు సంఘటితంగా ఉద్యమించడం ద్వారానే తెలంగాణ రాష్ట్ర కల నిజం కాబోతున్నది. కాగా అటు సమైక్యవాదమైనా, ఇటు ప్రత్యేకవాదమైనా కేవలం సెంటిమెంట్ మీద మాత్రమే నడుస్తున్నాయి. భాష అనే సెంటిమెంట్‌తో మనమంతా తెలుగువారం కాబట్టి బలవంతంగానైనా కలిసుండాలనే సమైక్య సెంటిమెంట్ కానీ, మా ప్రాంతం వెనుకబడింది కాబట్టి విడిపోదామనే బలవంతపు విడివాదం కానీ శాస్త్రీయ పరిష్కారాన్ని అందించవు. సెంటిమెంట్‌లను పక్కనబెట్టి శాస్త్రీయంగా ఏ ప్రాంతానికీ నష్టం లేకుండా విభజన సమస్యకు కేంద్రం పరిష్కారం చూపి ఉంటే సీమాంధ్ర ప్రజలు ఇంతగా ఆందోళన చేసేవారు కాదు.
ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయన్న దూర దృష్టితోనే చిన్న రాష్ట్రాల ప్రవక్త డాక్టర్ అంబేద్కర్ 1954లో మొదటి ఎస్సార్సీ చైర్మన్ జస్టిస్ ఫజల్ అలీకి ఒక లేఖ రాశారు. 'కేవలం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే అది దేశ అంతర్గత భద్రతకు ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ఈ దేశంలో వేల సంఖ్యలో వివిధ భాషలు మాట్లాడే కులాలు, ప్రాంతాలు, జాతులు, తెగలు ఉన్నాయి. వారంతా తమ భాష పునాదిగా రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తే దేశం ముక్కలవుతుంది. ఒక రాష్ట్రం, ఒక భాష, రెండు కోట్ల జనాభాతో స్థానిక ప్రజల భాషా సంప్రదాయాలను, సహజ వనరులను పరిరక్షిస్తూ పరిపాలన విభజన కోసం, అన్ని రంగాల్లో 'వాటా' పొందే విధంగా రాష్ట్రాల విభజన జరగాలి. అంతే తప్ప కేవలం 'సెంటిమెంట్' పునాదిగా రాష్ట్ర విభజన జరగరాదు' అని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు. మరి జాతీయ రాజకీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్రాల విభజన పట్ల శాస్త్రీయ, జాతీయ విధానం లేకపోవడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒకవేళ ఈ రెండు పార్టీలకు జాతీయ విధానం ఉంటే దేశవ్యాప్తంగా 22 వెనుకబడిన ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు ఏనాడో పరిష్కారాన్ని చూపి వుండేవి. పరిపాలనా సౌలభ్యానికి, ప్రజల సమగ్ర అభివృద్ధికి ఉత్తరప్రదేశ్‌ను నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్న బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్‌ను జాతీయ రాజకీయపక్షాలు రెండూ అంగీకరించలేదు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఆ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానాన్ని పట్టించుకోని కేంద్రం ఇప్పుడు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి పూనుకున్నది. కాంగ్రెస్, బీజేపీలు రెండూ విభజనకు మద్దతిస్తున్నాయి. ఉత్తరాది ఆధిపత్యాన్ని శాశ్వతంగా దక్షిణాదిపై చెలాయించడానికే కాదా? కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికే అయితే రాష్ట్ర విభజన సమస్యను ఇంత జటిలం చేయడం ఎందుకు? మూడుప్రాంతాల నాయకులను కూర్చోబెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీగానీ ఎందుకు అందించలేకపోతున్నాయి?
ఉత్తర, దక్షిణాది ప్రాంతాల మధ్య సమతుల్యత, పరిపాలనా విభజన జరగాలంటే రాష్ట్రాల విభజన ఉత్తర, దక్షిణాది ప్రాంతాల్లో సమానస్థాయిలో ప్రాతినిధ్యం ఉండే విధంగా జరగాలని డాక్టర్ అంబేద్కర్ 1955లోనే సూచించారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేస్తే తమకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందని దక్షిణాది ప్రజలు భావించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ఒత్తిడికి లొంగిన జస్టిస్ ఫజల్ అలీ, అంబేద్కర్ సూచనలను పెడచెవిన పెట్టారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 22 వెనుకబడ్డ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కొనసాగడానికి ప్రధాన కారణం అంబేద్కర్ సూచనలను మొదటి ఎస్సార్సీ పాటించకపోవడమే. నాటి అంబేద్కర్ సూచనలు నేటి మన రాష్ట్ర విభజన సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్నందించగలవు.
రెండు కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం, ఒక భాష పునాదిగా 8 కోట్లకు పైగా జనాభా కల్గిన ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర నాలుగు రాష్ట్రాలుగా విభజించవచ్చు. కేవలం హైదరాబాద్ మీదనే ఆధారపడకుండా కోస్తాకు విజయవాడ/గుంటూరు/ ఒంగోలు రాజధానిగాను, రాయలసీమకు కర్నూలు/ అనంతపూర్/ తిరపతి రాజధానిగాను, ఉత్తరాంధ్రకు విశాఖపట్నం/ శ్రీకాకుళం/ విజయనగరం రాజధానిగా అభివృద్ధి చెందుతాయి. అలాగే హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా చేయడంతోపాటు అంబేద్కర్ సూచించినట్టు దేశానికి రెండో రాజధానిగా చేయడం వలన దేశ ప్రయోజనాలు, దక్షిణాది ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరతాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. ప్రపంచ నగరమైన హైదరాబాద్‌ను పది జిల్లాలకే పరిమితం చేయడంవలన ప్రతిష్ఠ దెబ్బ తిని అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఉంది.

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీ విద్యార్థి, యువత బలిదానాల నేపథ్యంలో ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రంపై యువత కోటి ఆశలు పెట్టుకున్నది. ఆ ఆశలు సాకారం కావాలంటే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య సూత్రాలు, సమసమాజం నిర్మాణం పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. అయితే తెలంగాణ ఉద్యమ నాయకత్వ స్థానంలో అగ్రకులాల వారే ఉన్నారు. రేపు అధికారం వాళ్ళ చేతుల్లోకి పోయే అవకాశం ఉంది. ప్రత్యేక రాయలసీమ ఉద్యమమూ అంబేద్కర్ ఆలోచనలు లేని వర్గాల చేతుల్లో ఉంది. అటు సమైక్య ఉద్యమమూ అగ్రకులాల వారి చేతుల్లో ఉంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటు అన్నారు డాక్టర్ అంబేద్కర్. కానీ ఆయన ఆశించిన తోడ్పాటు తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యం కాదు. అందులో సామాజిక న్యాయం కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేవలం భాష ఒక్కటైనంత మాత్రాన ఒక్క రాష్ట్రంగానే ఉండాలనుకోవడంలో ఔచిత్యం లేదు. ఆంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ అస్తిత్వాలు, యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా ఉన్నవారిలో రాయలసీమకు చెందినవారి సంఖ్య తక్కువేమీ కాదు.
అయినా ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి రాయలసీమ అందించిన తోడ్పాటు నిర్ణయాత్మకమైనది. అయినా 1953 నుంచి ఆ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. ఇందులో రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రుల పాత్ర కూడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన ఒప్పందాలకు కారకులైనవారు, వాటిని ఉల్లంఘించినవారూ అగ్రకులాలకు చెందిన నాయకులే. మరి ఈ కులాల నాయకత్వంలో రేపు ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాలు ఏర్పడినా పెద్దగా ఉపయోగం లేదు. అయితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంతోనే రాయలసీమ సమగ్ర అభివృద్ధి ముడివడి ఉన్నందున అంబేద్కర్ ఆలోచనలతో బహుజనుల నాయకత్వంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కొనసాగితేనే ప్రత్యేక రాష్ట్రంతో పాటు సామాజిక న్యాయం రాయలసీమ ప్రజలకు దక్కుతుంది.

- గాలి వినోద్ కుమార్
చైర్మన్, సామాజిక తెలంగాణ జేఏసీ

Andhra Jyothi Telugu News Paper Dated: 07/11/2013