Showing posts with label కొలకలూరి ఇనాక్. Show all posts
Showing posts with label కొలకలూరి ఇనాక్. Show all posts

Sunday, February 2, 2014

సంఘాన్ని చదివిన సాహతీవేత్తను' - ఇంటర్వ్యూ: డా.జిలుకర శ్రీనివాస్, స్కైబాబ -


 
New 
 
0 
 
0 
 
 

కవి, కథకులు, నవలాకారులు, నాటక రచయిత, విమర్శకులు, వినూత్న పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఇనాక్. సమాజంలోని అట్టడుగు వర్గంలోంచి ప్రభవించిన ఇనాక్ సమాజంలోని చీకటి కోణాల్ని తన రచనల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. ఈ సాహితీ స్రష్టకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా 'వివిధ' పాఠకుల కోసం ఆయనతో విపులమైన ఇంటర్వ్యూ..
ఇనాక్ గారూ! మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అభినంద నలు. మీ సాహిత్యసేవకు తగినగౌరవం లభించిందని భావిస్తున్నారా?
- నా సాహిత్యానికి గాను పద్మశ్రీ లాంటి అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నాకే కాదు, తెలుగు భాషకే గౌరవంగా భావిస్తున్నాను.
జాషువా, మీరు ఒకే జిల్లా నుంచి వచ్చారు. మీ మీద ఆయన ప్రభావం ఉందా? ఆయనతో మీ పరిచయం గురించి చెప్పండి?

- జాషువా పుణ్యాత్ముడు. మహానుభావుడు, మహాకవి. మా పల్లెల్లో ఆయనొక సజీవ చైతన్య దైవం. ఆయన్ని చూడటం, తాకటం గొప్ప అనుభవం. ఆయన నివసించే ఇంటిని చూడటం ఒక ఆరాధన. కవి అంటే మా జనంలో గొప్ప గౌరవం. జాషువాను చూసే నాలో కవి కావాలన్న బీజం పడింది. మా పల్లెల ప్రజలు ఆయన పట్ల చూపే భక్తి ప్రేరణ నన్ను రచయితను చేసింది. ఆయన సాహిత్యమంతా నా 18 ఏళ్లకు చదివేశాను. నేనేమయినా రాస్తే కరుణశ్రీ చూచేవారు. సవరించేవారు. ప్రోత్సహించేవారు.
నేను అప్పట్లో పద్యాలు రాసేవాణ్ణి. నా పద్యాలు చదివిన విజ్ఞులు జాషువా రచనలాగో, కరుణశ్రీ రచనలాగో ఉందనేవాళ్లు. అట్లా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా పద్యాలు నావిగా ఉండాలి. ఆ ప్రభావాల నుంచి తప్పించుకోవటానికి పద్యం రాయటం మానేశాను. వచనం నన్ను ఆదరించింది. నా పద్యం నేను రాసినట్లే ఉంటుందని ఇప్పుడెవరైనా 'ఆది ఆంధ్రుడు' చదివితే గుర్తిస్తారు.

అంబేద్కరిజం తెలియని రోజుల్లోనే కులానికి వ్యతిరేకంగా రాశానని మీరొకచోట రాసుకున్నారు..
- మా తాతను మునసబు కొట్టి చంపాడు. అట్లా చంపి ఉండకూడదని నా పసి మనస్సు ఏడ్చింది. అది నా మొదటి కథ- ఉత్తరం. నాకప్పటికి 15 ఏళ్లు. నేనప్పటికి అంబేద్కరును ఎరగను. నా ఆకలి, నా అస్పృశ్యతా వ్యధ, నా చుట్టూ జీవితాలు చూచి దుఃఖంతో ఆక్రోశించటానికి నా సాహిత్యం అండయింది. నా సాంఘిక జీవితాన్ని, నన్ను పీడించిన సమాజ ధోరణిని గూర్చి రాశాను. నేను రాసింది పుస్తకాలు చదివి కాదు, సంఘాన్ని చదివి.
క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన మీరు తెలుగు సాహిత్యంలో ఎలా స్థిరపడ్డారు?

- క్రైస్తవులంటే ముఖ్యంగా మాలమాదిగలే కదా! వాళ్లు ప్రధానంగా ఉండేది- అప్పట్లో పల్లెల్లోనే. ఆ పల్లెలకు అప్పట్లో తెలుగు తప్ప సంస్కృతం, ఇంగ్లీషు అంతగా రావు. నేను పల్లె ప్రాణిని కాబట్టి తెలుగు ఇష్టమయింది.
అభ్యుదయ,విప్లవ సాహిత్యం ఉధృతంగా వస్తున్న రోజుల్లో ఆ ప్రభావంలో మీరు కొట్టుకుపోలేదు. స్వతంత్రమైన సాహితీ వ్యక్తిత్వంతోపాటు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని మీ రచనల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు? వర్గ కేంద్రమైన సాహిత్యం పట్ల మీరెందుకు ఆకర్షితులు కాలేదు?
- వర్గ కేంద్రమైన సాహిత్యం నాకిష్టమే. వర్ణ ప్రాంగణంలోని సాహిత్యం నన్ను బాధిస్తుంది. నా సాహిత్యంలో అభ్యుదయం విప్లవం - రెండు ధోరణులూ ఉంటాయి. వీటిపైన వీటికంటే ఎక్కువగా కులం నా గోల. నా గొడవ. దానీ పీడ నాకు వాస్తవం. ఆర్థికంగా పీడితులతోపాటు కుల, మత, వృత్తి పీడితులు నాకు సాహిత్యం ప్రసాదించారు. ఆర్థిక స్వావలంబన వచ్చినంత మాత్రాన జనం కులం ఉక్కు పంజరంలోంచి బయటపడలేరని నా తెలివిడి.
ప్రబంధ సాహిత్యం మీద మీరు చాలా చక్కటి విశ్లేషణలు చేశారు. వసుచరిత్ర రాసిన రామరాజభూషణుడు శూద్రకవి, శుభమూర్తి అని మీరు రాసిన చేసిన పరిశోధన అపురూపమైంది. విమర్శకులు ఆ గ్రంధాన్ని తిరస్కరించలేకపోయారు. అకడమిక్ రంగంలో ఆధిపత్య వర్గాలను ధిక్కరించి మీరు ఆ పరిశోధన చేశారు. అసలు ఆ రచన చేయాలని ఎందుకనిపించింది?

- పీడింపబడేవాడు నాకు తల్లి తండ్రి దైవం సోదరుడు బిడ్డ. శుభమూర్తి నాకు గురువు. నా గురువు బట్రాజుగా పిలవబడి, పీడింపబడి అవమానింపబడి, తృణీకరింపబడ్డాడు. సాహిత్య గురువు సాంఘికంగా సోదరుడు. ఆ మహాకవిని వసుచరిత్రను భక్తితో చదివాను. తెలుగు సాహిత్యంలో అది మహోత్కృష్ట ప్రబంధం. మహా కావ్యం. గొప్ప సాహిత్య సృష్టి. అంత గొప్ప రచన అవతరించటానికి అది పీడన నుంచి పుట్టటం శూద్రుడి గుండె నుంచి ప్రవహించటం కారణమని నాకు అనిపించింది. నేను దళితుణ్ణి పీడితుణ్ణి కావటాన శుభమూర్తి దుఃఖం నాకు వినిపించింది. ఆయన కన్నీటి తడి నా గుండెను తాకింది.
వసుచరిత్ర స్రష్ట పేరు శుభామూర్తి భట్టుమూర్తి అని కులం పేరుతో రామరాజభూషణుడని చేరదీసిన రాజు పేరుదో పిలిచారు. నా పేరు శుభమూర్తి అని ఆయన కంఠోక్తిగా చెప్పుకొన్నా ఇప్పటికీ ఎవరూ అలా పిలవటం లేదు, తలవటం లేదు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పండితులు ఒక దృష్టి నుంచే చూస్తున్నారు. ఇంకో దృష్టి నుంచి చూడవచ్చునని నా అభిప్రాయం. అదే వసుచరిత్ర వైశిష్ట్యం.

మీ 'ఆది ఆంధ్రుడు' కావ్యానికి రాసిన ముందుమాటలో అమరావతీ స్తూపానికి పూర్ణకళశం బహుమతిగా ఇచ్చిన ఒక మాదిగ గురించి వివరంగా తెలిపారు. మీరు సమాజాన్ని, కావ్యవస్తువునీ ఒక చారిత్రక దృక్పథం నుంచి చూస్తుంటారు. ముఖ్యంగా ఈ దేశాన్ని నిర్మించిన ఈ దళితుల చరిత్రను, ఆర్యుల దురాక్రమణను ప్రస్తావిస్తూ వుంటారు. ఇది మీ మెథడాలజీ కదా! ఈ చారిత్రక దృక్పథం మీకెలా ఏర్పడింది.
- నేను సాహిత్యాన్ని సామాజిక నేపథ్యం నుంచి చూస్తాను. రాస్తాను. సంఘాన్ని సాహిత్యంలో ప్రతిబింబింపచేయాలని ఇష్టపడతాను. సాహిత్యం సంఘానికి దశ దిశ నిర్దేశం చేయాలని ఆలోచిస్తాను. ఆలోచన కార్యరూపం దాల్చటానికి, చర్యోన్ముఖం కావటానికి ఇష్టపడతాను. ఈ ఉన్నతి; స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానత్వం అన్న ప్రజాస్వామిక విలువలతో కలిసి ఉండాలని వాంఛిస్తాను; ఈ వాంఛ పరిపూర్ణమయితే రేపటి సమాజపు అస్తిత్వం అవగతమవుతుంది. ఇది భవిష్యద్దృష్టి. ఈ సమాజం వర్తమానంలో ఇలా ఉందంటే ఎటువంటి గతాన్ని వారసత్వంగా ఇవ్వగలిగిందో గుర్తిస్తాము. అటువంటి గతాన్ని వెదుకుతూ పోవటం నాకు అనివార్యం. అట్లాంటి అన్వేషణలో కనిపించినవాడు భుజంగరాయుడు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి చేత అంటరానితనం నిర్మూలన శాసనం వేయించిన కార్యదక్షుడు. దళితుడు. దళితుల ప్రాచీనతా శైవభం నాకు ఆరాధ్యం. ఎందుకు స్మశానాలు తవ్వుకోవటమంటే ఆ ఎముకలు చెప్పే ఔన్నత్యం తెలుసుకోవటానికి. తెలుసుకొని ఏం చేస్తాను? గుండెల నిండా బలంగా గాలి పీల్చుకొని, ఛాతీ ఎగదట్టి నిర్భయంగా, ఆత్మగౌరవంతో, తలెత్తుకు తిరిగే దళితుల్ని చూస్తాను.

మీ మరో గొప్ప కావ్యం 'కన్నీటి గొంతు'. అందులో శూర్పణఖ హృదయాన్ని ఆవిష్కరించారు. రామాయణం పట్ల మీ విమర్శనాత్మక పరిశీలన చాలా ఆసక్తిగా వుంది. రామున్ని ప్రతినాయకుడిగా చేస్తూ, రావణున్ని ధీరోదాత్త నాయకునిగా స్థాపించారు. కారణమేంటి?
- ధన్యవాదాలు. ఇంతమంది స్త్రీవాదులు సీతకు, అహల్యకు, మంధరకు, కైకకు, శబరికి జరిగిన న్యాయాన్యాయాల గూర్చి ఆవేదనాత్మక రచనలు చేశారు కదా, శూర్పణఖను గూర్చి ఏమీ రాయరేం? ఆమెకు అన్యాయం జరగలేదా? ద్రావిడ చక్రవర్తి అయిన రావణుడిని దశకంఠుడని వికారుడుగా, క్రూరుడుగా, రాక్షసుడుగా చిత్రించడం ఏం సబబు? వాల్మీకి పుట్టలోంచి పుట్టలేదు. ఆర్యుల బుర్రల్లోంచి పుట్టాడు. రామాయణం ఆర్యులు దక్షిణా పథానికి వ్యాపించటానికి పన్నిన రాజకీయ వ్యూహంలో భాగం. మీరు రామాయణాన్ని ప్రచార గ్రంథంగా, ఆర్యులు ద్రావిడుల్ని జయించే యుద్ధ వ్యూహంలో భాగంగా చూస్తే చాలా జీవన సత్యాలు కనిపిస్తాయి.

మీ మునివాహనుడు నాటకంలో తాత్వికత, తర్కం, కళా సౌందర్యం తొణికిసలాడే ఎన్నో సంభాషణలు రాశారు. అంత సోషల్లీ, ఫిలాసాఫికల్లీ, పొలిటికల్లీ సీరియస్ నాటకం రాయాలని ఎందుకనిపించింది? తిరుప్పాణ్ పాత్రను అలా చిత్రించడానికి కారణం?
- మునివాహనుడు చారిత్రక పాత్ర. పాణ్ కులస్థుడు. నాటి దళితుడు. దేవాలయ ప్రవేశం తిరస్కరింపబడ్డవాడు. పన్నెండుమంది ఆళ్వారుల్లో ప్రసిద్ధుడు. పది పాశురాలు పది పరిశోధన గ్రంథాల పెట్టు. తిరుప్పాణ్ ఆళ్వారు అని పిలువబడే దళితుడు మునివాహనుడు అయ్యాడు. అది అద్భుత కథా సందర్భం. దీన్ని గూర్చి వ్యాసం రాశాను. తృప్తి లేదు. నాటకం రాయదగ్గ అంశం అనిపించి రాశాను.
ఊరబావి, తలలేనోడు, కాకి వంటి అద్భుతమైన కథలు రాశా రు. ఎన్నో కథాసంపుటాలు వెలువరించారు. ఏ ఒక్క కథకూ మరో కథతో పోలిక వుండదు. అంత వైవిధ్యాన్ని చూపడం ఎలా సాధ్యం?
- సంఘం, మహారాజా సంఘం. సంఘంలో ఇంత వైవిధ్యమంటే, సంఘాన్ని ఆరాధించే రచయితకు అనంతమైన వైవిధ్యం లభిస్తుంది. గీతకు దిగువనున్న అందరిని గురించీ రాయాలనుకున్నాను. పాత్రలనేకం. వస్తువులనేకం. ఇతివృత్తాలనేకం. సంఘ జీవన వైవిధ్యమే సాహిత్య జీవన వైవిధ్యం.

రాయలసీమ జీవితం మీ సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేసింది?
- ఆంధ్రాచార్యుడికి, అనంతపురంలోనో, తిరుపతిలోనో విద్యార్థులతో జీవితం గడిపే రచయితకు, రాయలసీమ జీవితం అర్థం కావ టం అంత తొందరగా సాధ్యం కాదు. మాండలికం తెలిస్తే చాలనుకొంటారు చాలామంది. అది నిజం కాదు. ఒక ప్రాంత జీవితానికో జీవశక్తి ఉంటుంది. అది అర్థం కావటం వలస రచయితకు అంత సులభం కాదు. నాకు 30 ఏళ్లు పట్టింది. రాయలసీమ జీవితం ఎంత సుకుమారమో, సౌందర్య సమన్వితమో, ప్రశాంతమో; వెలుపల ఉన్న వారికి ఇక్కడి మనుషుల వ్యక్తిత్వ సౌజన్యం, సౌకుమార్యం, మంచితనం, ఓర్పు తెలియవు. సీమ జీవ లక్షణం తెలిశాకే నేను కథలు, నవలలు, నాటకాలు, కవితలు రాశాను. ఒకప్పుడు నాలోంచి గుంటూరును విడదీయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు నాలోంచి అనంతపురాన్ని తొలగించటం అసాధ్యం.
జానపద సాహిత్య విమర్శ అనే ప్రత్యేకమైన ప్రక్రియను మీరే మొట్టమొదటగా ప్రతిపాదించారు. ప్రపంచంలో ఎక్కడా అలాంటి ప్రయత్నం జరిగినట్టు లేదు. జానపద సాహిత్య విమర్శకు శాస్త్రప్రతిపత్తి చేకూరుతుందా?
- మీరన్నది నిజమే! 'జానపదుల సాహిత్య విమర్శ' బలమైన ప్రతిపాదన. ప్రపంచంలో ఎక్కడా జానపదుల విమర్శ ఉందని పరిశోధకులు గుర్తించలేదు. నా పరిశోధన గ్రంథాన్ని గొప్ప గ్రంంథం అంటున్నారు. తర్కించలేదు. నిగ్గు తేల్చలేదు.
విస్కాన్‌సిన్‌లో ఇది గొప్ప గ్రంథం. ఇంతకుముందు ఇటువంటి దృక్పథం లేదు. ఇది మొదటి గ్రంథం. తెలుగు జానపదుల్ని సజీవంగా చూపిన పరిశోధన అని నిగ్గు తేలిస్తే ఉస్మానియాలో గుర్తింపు వస్తుంది. ఇల విశాలం. కాలం అనంతం. 'జానపదుల సాహిత్య విమర్శ' ఆద్య గ్రంథం. అది అలా శాశ్వతం.

కంచికచర్ల కోటేశు హత్య మీద మీరొక నాటిక రాశారు. అందులో ఇంకా ఎన్నో హత్యాకాండలు జరుగనున్నాయనే సంకేతాన్నిచ్చారు. ఆ తర్వాత కారంచేడు, చుండూరు జరిగాయి. అలా జరుగుతాయని ఎలా అంచనాకు రాగలిగారు?
- కోటేశు వంటి హత్యలు జరుగుతాయని భయపడ్డాను. భయపడ్డంత జరిగింది. కారంచేడు నుంచి పాతిక చోట్ల అంతే జరిగింది. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా సాగుతుంది. ఇంకా పాశవిక దహనకాండ జరుగుతుంది. జాగ్రత్త పడకపోతే ఊళ్లు పేలిపోతాయి. ఎవరి ఊళ్ళు? ఊహించండి! ఆలోచించండి.

లౌకిక, ప్రజాస్వామ్య విలువలను సాహిత్యం కాపాడగలదా?
- కాపాడగలదు. ఆ విలువలతో సాహిత్యం సృష్టి కావటమే అవస రం. సాహిత్యం ప్రజాస్వామ్య విలువలను ప్రతిష్ఠించాలి. ఆ విలువలు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తాయి.సాహిత్యమే ప్రజల్ని ఆధునీకరించిం ది. సమాజాలను నూత్నీకరించింది. మనిషిని మహోన్నతుణ్ణి చేసింది. చైతన్యవంతులైన ప్రజలు పరస్పర అవగాహనతో సహజీవనం సాగించటానికి సాహిత్యం నిశ్చయమైన, అనివార్యమైన అవసరం.
దళితుడికి దూరంగా ఉండే ఆంధ్రాచార్యత్వం చేపట్టిన మీరు గ్రహించేదేమిటి?
- తెలుగు చదువు బ్రాహ్మణుల విద్య మాత్రమే అనే దశ నుంచి అది మానవ సమూహాల గుత్త సొత్తు అనే దిశకు మారటం నా జీవిత కాలంలోనే చూశాను.
సాహిత్యంలోని ప్రభావిత వ్యవస్థలను ప్రజాస్వామీకరించాలని విమర్శకులంటున్నారు..
- ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యీకరణం చెందాలి. దానికి అపవాదం లేదు. సాహిత్యం మినహాయింపు కాదు.
ఇంటర్వ్యూ: డా.జిలుకర శ్రీనివాస్, స్కైబాబ
-  Andhra Jyothi Telugu News Paper Dated: 3/2/2014

Friday, July 5, 2013

అక్షరానికి అరవయ్యేళ్ళు ( ఆచార్య కొలకలూరి ఇనాక్) రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి


July 01, 2013
భయం ప్రాతిపదిక మీద బతుకుతున్న
ఈ ఊరు, ఈ దేశం ఎంతకాలం జీవిస్తాయి?
ప్రేమ ప్రాతిపదిక మీద బతికే
సమాజం, వ్యవస్థ ఏ రోజు పుడతాయి?


(ఊరబావి: 1969)
వ్యక్తిగా డెబ్భై అయిదో పడిలో అడుగిడుతున్న (01.07.1939) ఆచార్య కొలకలూరి ఇనాక్ రచయితగా అరవయ్యవ ఏడాదిలోకి పరుగిడుతున్నారు (1954-2013). రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతుండగా పుట్టిన కొలకలూరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమింపబడి ఎన్నికల రాజకీయాలు దేశ భవిష్యత్తును నిర్ణయించడం మొదలవుతున్న దశలో రచనను చేపట్టారు. 1954లో 'ఉత్తరం' కథ, సీసపద్యం వంటివి రాయడంతో ఆయన రచనా జీవితం మొదలైంది.


అతిచిన్న వయసులోనే రచనను ప్రారంభించి అరవయ్యేళ్ళుగా రచయితగానే జీవిస్తున్నారు కొలకలూరి. ఆయన స్వాతంత్య్రానంతర తొలితరం తెలుగు రచయిత. మధురాంతకం రాజారాం, కాళోజీ, గూడూ రి సీతారాం, సురమౌళి, నవీన్, ఇల్లిందల సరస్వతీదేవి, ముదిగంటి సుజాతారెడ్డి, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కేతు విశ్వనాథరెడ్డి, కె.సభా, ముంగర శంకరరాజు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటివాళ్ళు కొలకలూరికి కొంచెం ముందు, కొంచెం వెనకలుగా సమకాలిక రచయితలు. ఇవాళ దళిత రచయితలుగా మనం కీర్తిస్తున్న గుర్రం జాషువా, కుసుమ ధర్మన్న, బోయి భీమన్నల తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ దళిత రచయిత కొలకలూరి. వాళ్లలోని అభ్యుదయాంశను తనదైన ఆధునిక మార్గంలో కొనసాగిస్తున్న రచయిత కొలకలూరి.


కొలకలూరి కవి, కథకులు, నవలా నాటక రచయిత, విమర్శకులు, పరిశోధకులు, సమీక్షకులు. తెలుగు సాహిత్య చరిత్రలో స్తబ్ధతా యుగమని కొందరు భావిస్తున్న యుగంలో కొలకలూరి రచనలు ప్రారంభించారు. కొలకలూరి రచనల పట్టిక కన్నా ఆయన రచనాతత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. కొలకలూరి అభ్యుదయ సాహిత్యం మలి దశలో రచన ప్రారంభించి విప్లవ, స్త్రీ, దళిత బహుజన, మైనారిటీ, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల ద్వారా రచయితగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆయనది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఏ సంస్థలోనూ చేరకుండా ఆ సంస్థల భావజాలాలలోని అనుకూలాంశాలను స్వీకరించి సమకాలీన సామాజిక వాస్తవికతను వస్తువుగా చేసుకొని రచనలు చేస్తున్నారు కొలకలూరి.
ఆచార్య కొలకలూరికి ఒక సామాజిక స్వప్నముంది.


పైసా లేనివాడు - పైగా హరిజనుడు
ప్రధానమంత్రి కాగలిగి - అయిదేళ్ళు పదవిలో ఉండి
ఆపైన పదవి వదిలి -పైసా లేకుండా
పాత మనిషిగా - బ్రతగ్గలిగిన్నాడు

భారతదేశం - బాగుపడ్డట్టు (అభ్యుదయం)
1970ల నాటికే స్వాతంత్య్రం మీద తెలుగు రచయితలకు నమ్మకం సన్నగిల్లింది. ఆ అపనమ్మకాన్ని వ్యక్తం చేయడానికి ఆరుద్ర, కాళోజీ, జాషువాల నుండి నేటిదాకా ప్రజా రచయితలు వెనకాడలేదు. కొలకలూరి ఆ కోవలోనివారే. దళితులకు రాజ్యాధికారం దక్కడం ఒక పార్శ్వమైతే, ఆ దళితులు అవినీతికి పాల్పడకుండా పాలించడం కొలకలూరి రాజకీయ స్వప్నంలో మరో అంశం. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అన్నట్లు తయారైన ప్రస్తుత సందర్భంలో కొలకలూరి 'అభ్యుదయం' కవితకు గొప్ప ప్రాముఖ్యముంది. గత నలభయ్యేళ్ల మన దేశ రాజకీయ పరిణామాలను చూసి, ఈ కవిత చదివి ఈ దేశం ఏమౌతుందోనన్న దిగులు కలగకమానదు.


మనిషిని నమ్మడం, మనిషిని ప్రేమించడం కన్నా వ్యక్తిత్వ వికాసమింకేముంటుంది. ఈ రెండూ లోపించడం వల్లనే మన దేశం అనేక అసమానతలలోకి, వివక్షలలోకి నెట్టివేయబడింది. కొలకలూరి గొప్ప మానవ ప్రేమికుడు. మన దేశంలోని సాంఘిక వివక్షల కారణంగా ఆయన వంశీకులు మతాలు మార్చుకున్నా కొలకలూరి అచ్చమైన మనిషి విశ్వాసిగా నిలిచారు.

లేకుంటే మనిషి నా గీత, నా బైబిల్ నా ఖురాన్..
మనిషి నా ఊపిరి, ప్రాణం, రక్తం
మనిషి నా చైతన్యం నా జీవితం నా వ్యక్తిత్వం
అని అనలేరు. భారతదేశ ప్రజలంతా కలిసి మనిషికి మాత్రమే విలువనిస్తే, మనిషిని మాత్రమే ప్రేమిస్తే ఎంత సామాజిక శాంతి చేకూరుతుంది! మన దేశం ఎంత నాగరికమౌతుంది!
దేశభక్తి అనే మాట ఇవాళ అర్థం కోల్పోయిన పదమైపోయింది- దేశభక్తి అంటే రొమ్ములు గుద్దుకోవడం, జబ్బలు చరుచుకోవడం, తొడలు గొట్టడంగా మారిపోయింది. అది దేశభక్తి కాదు. ఒక దేశంలోని ఒక వ్యవస్థలో బాగుపడ్డవాళ్ళు మా దేశం గొప్పది అంటారు. మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నామంటారు. ఆ వ్యవస్థలో నష్టపోయిన వాళ్లు ఈ మాటలనలేరు. కొలకలూరి భారతదేశంలో అవమానాల పాలైన, అణచివేయబడ్డ వర్గాలకు చెందిన కవి. ఆయన ఎలాగో పైకి వచ్చి ఉండవచ్చు. కాని దళితులకు ఈ దేశంలో జరిగిన అవమానాలు, చూసి కూడా
భూషించినా దూషించినా
స్వాగతం పలికినా వీడ్కోలు చెప్పినా
సన్మానించినా అవమానించినా/నా యీ దేశాన్ని ప్రేమిస్తున్నాను
అని ప్రకటించారు. దేశం మీద నిజమైన గౌరవం ఉంటే తప్ప ఇలా అనడం సాధ్యం కాదు. ఈ దృష్టితో చూచినప్పుడు వ్యాపారులు సంపన్నులు ఆధిపత్యవాదులు ప్రదర్శించే దేశభక్తి కృతకమైందని, అణచివేతకు గురైనవారు ప్రదర్శించే దేశభక్తి సహజమైందని చెప్పవచ్చు.


నిన్న తలవంచిన వీళ్లు/నేడు ప్రతిఘటించారు
రేపు విజయులౌతారు....
ప్రతిఘటించే పంచముడు/పంచభూతాలకు ప్రాణదాత
జాషువ ఏ కావ్యం రాసినా అందులో దళిత స్పృహ, దళిత వేదన అంతస్సూత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అది కొలకలూరి సాహిత్యంలోను ఉంది. ఆయన సాహిత్యంలోని కీలకాంశం ఇదే. సమత (దళిత విద్యార్థి జీవితం) అనాధ (దళిత స్త్రీ జీవితం) ఇరులలో విరులు (కుల ప్రసక్తి లేని మానవ సంబంధాలు) సర్కారు గడ్డి (కష్టకాలంలోను దళితులను పెద్దవాళ్లు దోచుకోవడం) దిక్కులేనోరు (అబద్ధపు నేరం మోపి దళితుని చంపడం) దర్శనం (ఆలయ ప్రవేశం) కూలి (దళితుల శ్రమఫలితం) ఊరబావి (నీళ్లకోసం దళిత స్త్రీ తిరుగుబాటు) పశ్చాద్భూమి (కక్కసు ఉద్యోగుల జీవనం) ఆకలి (తిండికోసం దళిత అమ్మాయి సాహసం) అస్పృశ్యగంగ (పట్టణంలోనూ అస్పృశ్యత) సూర్యుడు తలెత్తాడు (చదువుకొని పైకి వచ్చిన దళితుడు) కాకి (మాదిగల ఇండ్ల దగ్గర మాత్రమే అడుక్కునే దళితుడు) విఘ్ననాయకుడు (ప్యాపిలి సంఘటన) -ఇలా కొలకలూరి సర్వ ప్రక్రియలలోనూ దళిత జీవితం పరచుకొని కనిపిస్తుంది. 'ఊరబావి' కథానిక దళిత జీవిత ప్రతిఫలనంలో గత శతాబ్ది ఆధునిక సాహిత్యంలోనే ఒక ఇతిహాసం. 1913లో మంగిపూడి వెంకటశర్మ 'నిరుద్ధ భారతం' రాసి భారతదేశ చరిత్రలో దళితుల శ్రమను కీర్తించారు. 21వ శతాబ్దం ప్రారంభంలో కొలకలూరి 'ఆదిఆం«ద్రుడు' అనీ పద్యకావ్యంలో భుజంగరాయుడనే దళితసేనానిని ప్రదర్శించారు. 'నా కన్నీళ్ళే నా సాహిత్యం' అన్నారు కొలకలూరి ఒక సభలో. అవి పీడిత జనం కన్నీళ్లు. దళితులు బహుజనులు స్త్రీలు మైనారిటీలు- ఇదీ కొలకలూరి పక్షం.


భారతదేశాన్ని మోసే అర్ధాకలి బోయీలకు
భారతభవనం గోడలుగా స్థిరంగా నిలబడ్డ
దళితులకు గిరిజనులకు/ముస్లిములకు వెనుకబడినవారికి
అణగారిన వర్గాలకు నమస్కారం

కులం, మతం, ధనం- ఈ మూడు భారతీయ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాయని కొలకలూరికి తెలుసు. అవి అల్ప సంఖ్యాకులకు మేలు చేసి, అధిక సంఖ్యాకులకు చెడు చేశాయని కూడా ఆయనకు తెలుసు. ఆర్థిక సాంఘిక రుగ్మతలకు మూలాలైన ఈ మూడింటిని నిర్మూలించి, వీటి ప్రమేయం లేని భారతదేశం పుట్టాలని ఆయన ఆకాంక్ష. ఆయన సాహిత్య మంతా విస్తరించిన అంశం ఇది. భారతదేశం నాగరికమూ, శాస్త్రీయమూ కావాలని, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలతో పరిమళించాలని కొలకలూరి తపన. భారతదేశం ఐక్యంగా ఉండాలన్నది కొలకలూరి కోరిక. అయితే అది వైరుధ్యాలను కప్పి పెట్టే వ్యాపారులు కోరుకునే ఐక్యత కాదు. వైరుధ్యాలు, వివక్షలు లేని ఐక్యత, మానవీయ ఐక్యత.


దేశం బాగుపడాలనీ, పాడు కారాదనీ
కులం బాధా, ధనం హింసా తొలగాలనీ
భూమి మిగతా భూతాల్లా అందరిదనీ
పీడన ఏ రూపంలోనూ ఉండరాదనీ....
వ్యవస్థ వ్యక్తిగా, సమిష్టి వ్యక్తిగా
లోకం నేనుగా రోదించింది
ఇదీ కొలకలూరి రోదన. ఇది ప్రజాపక్షం వహించే రచయితల ప్రజాస్వామిక ఆకాంక్ష. కొలకలూరి ఈ ప్రజాస్వామిక ఉద్యమంలో భాగస్వామి.
లోకమంతా ప్రేమై/హృదయమంతా దయై
ఉంటే తప్ప/ఈ జీవితాలకు మోక్షం లేదు
అన్నది కొలకలూరి తీర్పు.


సాహిత్య శిల్పిగా కొలకలూరి సరళవాది. ఆయన సాహిత్యంలో పాఠకులను దూరం చేసుకునే ప్రయోగాలు కనిపించవు. వస్తువులోను శిల్పంలోను కొలకలూరి ప్రజాపక్షమే. పాఠకులను బోల్తా కొట్టించే మలుపులు ఆయన కథలలోను, నవలలోనూ ఉండవు, కొన్నిచోట్ల కథలలో ముగింపు పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచినట్లు కనిపిస్తుంది. ఆయన ఎవరి జీవితాన్ని గురించి రాస్తున్నారో, ఆ జీవితాన్ని అనుభవిస్తున్నవాళ్లు చదివి, విని, అందులో తమ ముఖాలు చూచుకోగలిగేట్టుగా ఉంటుంది కొలకలూరి సాహిత్య శిల్పం. ఆయన వచన కవిత్వం కుందుర్తి చెప్పినట్లు, తిలక్ చెప్పినట్లు పాఠకులకు చాలా దగ్గరగా ఉంటుంది. వ్యంగ్యం, అధిక్షేపం కొలకలూరి కవిత్వ శిల్పాయుధాలు. చిన్న చిన్న వాక్యాలు ఆయన రచనలకు పట్టాలు. అసలైన తెలుగు వాక్యాలు ఆయన సొంతం. జీవిత శకలాలలో నిండిన వస్తువు లోపల సుడులు తిరుగుతున్నా, శిల్పం ఉద్రేకపడదు. తిరుగుబాట్లు, ప్రతిఘటనలు ఉన్నా అవి తిట్లు బూతులు జుగుప్సలు కాకపోవడం కొలకలూరి విశిష్టత. కొలకలూరి సాహిత్యశిల్పంలో క్రమ పరిణామం.

పాఠకులకు దగ్గర కావడం కనిపిస్తాయి. రచన తనకోసం కాదు, పాఠకులకోసం అనే స్పృహ ఆయనకు మొదటినుంచీ ఉంది. కొలకలూరి పాపులర్ మార్గంకాదు, ప్రజా మార్గం. తన ప్రాంతం నుండి నలభయ్యేళ్ల క్రితం రాయలసీమకు వచ్చేసినా, ఆ భాష మాత్రం ఆయన సాహిత్యంలో ఇంకా స్వచ్ఛంగా నిలిచి ఉండడం ఆశ్చర్యం. ఏ భాషలో రాసినా, ఆయన రాయలసీమలో బతికినందుకు, ఆ ప్రాంతం జీవితాన్ని కూడా తన సాహిత్యంలో ప్రదర్శించారు. సాహిత్య విమర్శకుడుగా, పరిశోధకుడుగా కొలకలూరిది కొత్త చూపు. సాహిత్య వ్యాసాలు (1974) మొదలుకొని జానపదుల సాహిత్య విమర్శ (2009) దాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు సాధారణంగా స్పృశించని 'తెలుగు వ్యాస పరిణామం' మీద పరిశోధించడమే ఆయన మౌలిక శ్రమకు నిదర్శనం. గత పదేళ్లలో కొలకలూరి మూడు పరిశోధనాత్మక విమర్శా గ్రంథాలను ప్రచురించారు.

అవి 1.ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం 2.శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం 3.జానపదుల సాహిత్య విమర్శ. ఇవి మూడూ పునర్మూల్యాంకన విమర్శ గ్రంథాలు. అలాగే నరహరిగోపాలకృష్ణమశెట్టి నవల 'శ్రీరంగరాజచరిత్ర'ను దళిత సాహిత్యోద్యమ నేపథ్యంలో పునర్ముద్రిస్తూ, కొలకలూరి రాసిన పరిశోధనాత్మక ముందుమాట కూడా ఇందులో భాగం. విరసం ఏర్పడిన తర్వాత తెలుగు సాహిత్యంలో చర్చకు వచ్చిన నిబద్ధత, నిమగ్నతలకు కొలకలూరి నిబిడత (స్వీయానుభవంతో రాయడం) అనే మూడవ సూత్రాన్ని జోడించి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఈ మూడు సూత్రాలు ప్రాతిపదికగా విశ్లేషించారు. ఇది కొత్తచూపుతో కూడిన కృషి. రామరాజభూషణుడు శూద్ర కవి. ఆయన అసలు పేరు శుభమూర్తి. వసుచరిత్ర శూద్ర కావ్యమంటూ కొలకలూరి చేసిన పరిశోధన ఆ కావ్యం మీద అంతకు ముందు వచ్చిన విమర్శలన్నిటికీ భిన్నమైనది, విశిష్టమైనది. 'తెలుగు జానపదుల సాహిత్య విమర్శ వయస్సు వెయ్యేళ్ళు' అంటూ తెలుగు చాటువులలో, సంప్రదాయ సాహిత్య చరిత్రలలో గల కథనాలను కొలకలూరి జానపదుల సాహిత్య విమర్శగా గుర్తించడం విశేషం. దళిత స్వర్శ ఉన్న కారణంగా, ఎన్ని లోపాలున్నా శ్రీరంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల అనే ప్రతిపాదనను అనేక ఉపపత్తులతో చేశారు కొలకలూరి.


ఆచార్య కొలకలూరి ఇనాక్ ఇప్పటిదాకా 70 రచనలు చేశారు. బైబిల్‌ను వ్యవహారిక భాషలోకి అనువదించారు. ధనికులు పేదలు ఉన్న సమాజంలో కొలకలూరి పేదల పక్షం. పై కులాలు, కింది కులాలు ఉన్న సమజంలో ఆయన కింది కులాల పక్షం. మెజారిటీ మైనారిటీలు ఉన్న సమాజంలో ఆయన మైనారిటీ పక్షం. పురుషులు, స్త్రీలు ఉన్న సమాజంలో ఆయన స్త్రీల పక్షం. ప్రేమ, ద్వేషం ఉన్న సమాజంలో కొలకలూరి ప్రేమ పక్షం. విభజిత సమాజంలో తానొక పక్షం వహించినా ఆయన కోరుకునేది సమష్టి సమాజాన్నే.


మనమంతా కలిసి ఆనందించిందాకా
నాకు సుఖం లేదు, శాంతి లేదు (కులం-ధనం)
డెబ్భై అయిదవ పడిలో అడుగిడుతూ, రచనా జీవితంలో షష్ట్యబ్దిలోకి పరుగిడుతున్న కొలకలూరి ఇనాక్ గారికి శుభాకాంక్షలు.
- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి
94402 22117
(నేడు తిరుపతిలో ఆచార్య కొలకలూరి ఇనాక్ అమృతోత్సవం-
సాహితీ వజ్రోత్సవం జరుగుతున్న సందర్భంగా)
 
Andhra Jyothi Telugu News Paper Dated : 1/07/2013