Showing posts with label మందకృష్ణ మాదిగ. Show all posts
Showing posts with label మందకృష్ణ మాదిగ. Show all posts

Friday, August 9, 2013

Exclusive story on Manda Krishna Madiga Founder, President Madiga Reservation Porata Samithi (MRPS)గీటురాయి ఒకటే ఉండాలి --Navya Special Story


August 09, 2013
మాది వరంగల్ జిల్లాలోని హంటర్‌రోడ్డు శాయంపేట అనే గ్రామం. బాల్యం నుంచి ఆ గ్రామానికి సంబంధించి నాకున్న తీపి జ్ఞాపకాల కన్నా, ఆ నాడున్న కులవివక్ష కారణంగా మేము పడ్డ అవమానాలే ఎక్కువ. ఆ అవమానాలను కొంతకాలం దిగమింగుతూ కూర్చున్నా, వీటిని ఎదుర్కొనకపోతే చివరికి మనల్ని మనుషులుగా కూడా చూడరనే అభిప్రాయం ఏర్పడుతూ వచ్చింది. మెల్లగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ఒక స్ఫూర్తి మనసులోకి ప్రవేశించి ఆ అవమానాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం చేసింది. అదే సమయంలో ఒక న్యాయమైన సమస్య మీద మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడే ప్రతి మాటకూ కట్టుబడి ఉండాలనే ఒక భావన మనసులో బలపడుతూ వచ్చింది.

అలా కట్టుబడి ఉండడం వల్ల అదనంగా కష్టాలు, బాధలు కొంత కాలం వచ్చినా అంతిమంగా ఆ బాధలు పోయే రోజు ఒకటి వస్తుందని, అలా కాకుండా మనం న్యాయం అనుకున్న సమస్యను మధ్యలోనే వదిలేస్తే జీవితమంతా ఆ అవమానాలూ, బాధలూ వెంటాడుతూనే ఉంటాయని నాకు బోధపడసాగింది. పుట్టుకతో వచ్చిన కులబంధం ఎంత గొప్పదైనా కులపక్షపాతంతో ఇతర అన్యాయాలను పట్టించుకోకుండా ఉండకూడదని, అవసరమైతే కులాతీతంగా కూడా వ్యవహరించాలని నేననుకుంటాను. ప్రత్యేకించి వర్గీకరణ విషయంలో ఒక సమస్యలోంచి మరో సమస్య పుట్టుకొచ్చి అడుగడుగునా అగ్ని పరీక్షలు పెట్టింది. నిరంతర సంఘర్షణకు గురిచేసింది. ఆ సంఘర్షణ ఎప్పటికప్పుడు ఎన్నో సత్యాల్ని ఆవిష్కరిస్తూ వచ్చింది. విషయం ఒకటే అయినా అందులోంచి పలు సమస్యలు, పలు సత్యాలు బయటపడుతూ వచ్చాయి. గడిచిన దశాబ్దాలన్నీ దళిత సమస్యల మీదే గడిచిపోవడం వల్ల నా జీవితంలో దళితుల అంశాలే సమస్తమైపోయాయి.


మనకు మనమే హానిగా....
విజయభాస్కర రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1994లో మంద జగన్నాథం, ఎన్ వెంకటస్వామి (రిటైర్డ్ ఐఏఎస్) వీళ్లిద్దరూ ఎస్సీల్లో ఏబిసిడి వర్గీక రణ జరగాలంటూ ఒక సదస్సు నిర్వహించారు. దానికి సంబంధించిన కరపత్రం ఒకటి నా చేతికి వచ్చింది. 70 శాతం ఉన్న మాదిగలకు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు అందితే, 30 శాతం ఉన్న మాలలకు మిగతా 90 శాతం అందుతున్నాయన్నది ఆ కరపత్రంలోని సారాంశం. ఈ వాస్తవాలు నన్ను ఒక తీవ్రమైన ఆత్మ సంఘర్షణకు గురిచేశాయి. ఏమిటిది? నిరంతరం అవమానాలు పడుతున్న దళితులంతా ఒక్కటని ఇన్నేళ్లు మనం ఉమ్మడి ఉద్యమాల్ని నడిపించుకుంటూ వచ్చాం. కానీ, వీటిలో ఒక వర్గం మరో వర్గానికి అవకాశాలు రాకుండా చేసే ఈ పరిస్థితి ఏమిటి? అనిపించింది.


ఎవరికి వ్యతిరేకంగా...
అప్పటిదాకా మనలో భాగమనుకున్న వారిపైనే మనం పోరాటం చేయాలా? పోరాటం లేకుండా సామరస్యంగా ఒప్పందం కుదిరే అవకాశం లేదా అనుకున్నాను. అప్పటిదాకా ఎప్పుడూ ఊహించని విషయం కదా! నాలో తీవ్రమైన అంతర్మథనం మొదలయ్యింది. ఈ స్థితిలో ఒకరోజు విప్లవోద్యమ నాయకుడైన కె.సత్యమూర్తి గారి వద్దకు వెళ్లి వారి ముందు ఈ విషయాన్ని ప్రస్తావించాను. 'ఇంతవరకూ మన ఆత్మగౌరవాన్నీ, మన హక్కుల్నీ కాలరాస్తున్న దళితేతరుల మీద పోరాటం చేశాం. కానీ దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోంది. ఈ సమస్యను పరిష్కరించాలి కదా!' అన్నాను. అక్కడున్న వాళ్లంతా మాలలే. నేనొక్కడ్నే మాదిగ. 'ఉమ్మడిగా మనకు అన్యాయం జరిగినప్పుడు దాని కారకుల మీద పోరాడదాం.

మనలో మనకే అన్యాయం జరిగేటప్పుడు మనలో ఎవరికి అన్యాయం జరుగుతోందో వారి వైపు నిలబడదాం' అన్నాను. దానికి వాళ్లు 'ఆ విషయాల్లోకి వెళితే, మనలో మనకే గొడవలు అవుతాయి. మన మధ్యలోనే చీలికలు ఏర్పడతాయి' అన్నారు. 'అలా అంటే మరి సమస్యను వదిలేస్తామా? అన్యాయం పాలైన వర్గానికి న్యాయం జరగాలి కదా!' అన్నాను. దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి ఉద్యమాలు చేసే మనం మాదిగల వైపు ఉండి వారికి అన్యాయం జరుగుతోందని పరిష్కారం కోరితే, ద ళితులు చీలిపోయే పరిస్థితి ఏర్పడుతుందా? ఒకవేళ వారన్నట్లు, ఈ చీలిక పర్యవసానంగా జాతి చీలిపోతుందని వెరచి నేను మౌనంగ ఉండిపోతే, ఈ జాతికి న్యాయం ఎట్లా జరగాలి?


వర్గీకరణే ఏకైక మార్గంగా....
ఈ స్థితిలో రిజర్వేషన్ పద్ధతి గురించి అధ్యయనం చేస్తే బిసిలో ఎబిసిడి వర్గీక రణ ఉందనేది తెలిసింది. ఆ వర్గీకరణ వల్లే ఎవరి వాటా వారు అనుభవించగలుగుతున్నారు. వర్గీక రణతో బిసిల్లో చీలిక రానప్పుడు, ఎస్‌సిల్లో వర్గీకరణ జరిగితే చీలిపోతారని ఎలా అంటున్నారు? ఈ పరిశీలన వర్గీకరణ దిశగా నేను ముందుకు సాగడానికి పునాదిగా నిలిచింది. నా నిర్ణయాన్ని విప్లవకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ బలపరిచాయి. 1996లో ఎబిసిడి వర్గీకరణ విషయమై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు గారు రామచంద్రరావు కమీషన్ ఒకటి ఏర్పాటు చేశారు. రిపోర్టు ఇవ్వడానికి ముందు ఒకరోజు రామచంద్రరావు గారు నన్ను పిలిపిస్తే వెళ్లాను. ఆయన నాతో 'నిజమే. మాదిగల కన్నా మాలల జనాభా తక్కువగా ఉంది. మీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల వాటా మీకు అందడం లేదు.

మీ వాదనను నేను పూర్తిగా సమర్థిస్తున్నా'' అన్నారు. నేను "చాలా సంతోషం సార్! సాధ్యమైనంత త్వరగా రిపోర్టు పంపండి సార్!' అన్నా. ఆ తరువాత కొద్ది క్షణాలకే 'మీ వాదన వరకైతే నేను సమర్థిస్తా కానీ, ఇక్కడో సమస్య ఉంది. దానికి పరిష్కారం చెప్పండి' అంటూ'షెడ్యూల్డ్ కులాల్లో మీ కంటే వెనుకబడిన వారు కూడా ఉన్నారు కదా! రెల్లి, పైడి, పాకితో పాటు చాలా ఉపకులాలు ఈ 50 ఏళ్ల కాలంలో రిజర్వేషన్ ఫలాలు ఏ మాత్రం పొంద లేదు. వాళ్లను నేను ఏం చేయాలి? ' అన్నారు. 'మళ్లీ ఇదో కొత్త సమస్య వచ్చిపడింది కదా!' అనిపించింది. కొద్ది క్షణాలు ఆగి 'సార్! ఈ కులాల గురించి శాస్త్రీయంగా నేను అంత లోతైన పరిశీలన ఏదీ చేయలేదు.

మాల మాదిగల మధ్య అసమానతలు ఉన్నాయని మాత్రమే నాకు తెలుసు. అందువల్ల మాదిగలకు అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరగాలని పోరాటం చేస్తూ వచ్చాను. మీ కమీషన్ రిపోర్టులో మాదిగల కంటే వెనుకబడిన కులాలు ఉన్నట్లు తేలితే నా సమాధానం ఒక్కటే సార్! రిజర్వేషన్ల పంపిణీలో మొదటి ముద్ద వాళ్లకు పెట్టండి సార్!' అన్నాను. 'ఆ మాట వినగానే వెంటనే లేచి నన్ను కౌగిలించుకుని, తన హర్షం వ్యక్తం చే స్తూ 'మీకు అన్యాయం జరిగింది కాబట్టి అవకాశాల్లో మొదటి భాగం కూడా మాకే కావాలని అంటావనుకున్నాను. కాని మీ కంటే వెనుకబడిన వర్గానికి ఇవ్వాలని నువ్వు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. నే నిప్పుడు అదే చేయబోతున్నాను కూడా' అన్నారు. నా మాటలు ఎంతో మంది మా కుల మేధావుల్ని తీవ్రమైన ఆగ్రహానికి గురిచేశాయి. వారి స్పందన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యాయాన్యాయాలతో ప్రమేయం లేకుండా అంతా మాకే దక్కాలనుకోలేను కదా!


గొంతులేని గోడు
మేధావులు కొందరు తమకు విరుద్ధంగా ఏదో జరగబోతోందని ఆందోళనకు గురై ఈ విషయంలో అడ్డుపడే ప్రయత్నాలు చేశారు. ఒకరోజు ఒక సమావేశం ఏర్పరిచి దానికి నన్ను పిలిచారు. ఆ సభలో నన్ను ఉద్దేశించి 'నువ్వు తప్పు చేస్తున్నావు. మాలల వల్ల మనకు అన్యాయం జరిగిందని చెప్పి, పోరాటం చేస్తున్నావని మీకు నైతిక మద్దతు ఇస్తూ వచ్చాం. ఇవ్వాళ ఎంతో పోరాటం తర్వాత ఎ,బి,సి,డి వర్గీకరణ జరుగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో వచ్చే ఫలితాలు పెద్ద సంఖ్యలోఉన్న మాదిగలకు కాకుండా వే రే వాళ్లకు ఇవ్వమని నువ్వు చెప్పినట్లుగా మాకు సమాచారం అందింది.

అందుకు మేము ఒప్పుకోం. ఒకవేళ అదే నీ విధానమైతే మేమెవరమూ నీకు అండగా నిలబడం' అన్నారు. ఆ సమయంలో నాకు అనిపించిందొక్కటే. మాదిగలు ఇంత పెద్ద సంఖ్యలో ఉండి కూడా వారు అడగనంత వరకు వారి సమస్యే ఎవరికీ అర్థం కాలేదు. ఇన్నేళ్లుగా అన్యాయాలకు ఆహుతి అవుతున్నా, మాదిగలు సంఘటితమై గొంతు విప్పిన తరువాతే కదా సమస్య చర్చకొచ్చింది. మరి ఆ ఉపతెగల వాళ్లు గొంతు విప్పే స్థితికి ఎప్పుడు రావాలి? దానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అప్పటిదాకా వారికి రావలసిన వాటా ఏదీ అందకుండానే పోవాలా?


బతుక్కి అర్థం ఏముంది?
"రిజర్వేషన్ అంటే ఏమిటో, మానవ హక్కులు అంటే ఏమిటో తెలియని స్థితిలో వాళ్లింకా ఉన్నారు. వాళ్లకు చెందవలసిన అవకాశాల్ని వారికి ఇవ్వకపోతే మన బ్రతుక్కి అర్థం లేదు. మన ఉద్యమానికి అర్థం లేదు. నా వ్యక్తిత్వానికి అర్థం లేదు. మీరు ఏమైనా అనుకోండి. నేను ఎ,బి,సి, డి గ్రూపులో 'ఎ' గ్రూపునే వారికి ఇవ్వాలని కోరతా'' అన్నాను. ఆ మేధావి వర్గం అంతా 'నువ్వు మా మాట వినాల్సిందే' అన్నారు. అందుకు నేను 'అట్లా అనుకుంటే రిజర్వేషన్లన్నీ మాకే ఇమ్మంటూ మాదిగల కోసమే మీరు ఉద్యమం నడుపుకోండి. రెల్లి, పైడి, పాకీ కులాలకే ముందు ఇవ్వాలని నేను ఉద్యమం నడుపుతాను'' అంటూ కరాఖండీగా చెప్పేశాను. అంటే నా సొంతకులంతోనే పోరాటం చేయడానికి నేను సిద్ధపడిపోయా. అయితే నా వ్యక్తిత్వం, ఉద్యమం నడిపే తీరు వారికి తెలుసు కాబట్టి అడ్డుకుంటే మరింత మొండిగా ఆ వైపు నిలబడతాడనుకుని నా వాదనను అంగీకరించారు.

నెలల తరబడి నేను అనుభవించిన ఆత్మక్షోభకు ఆ రోజు అలా తెరపడింది. ఆ రోజే కనుక నేను మొత్తం నా కులానికే రావాలని అడిగి ఉంటే ఏమాత్రం సామాజిక స్పృహ లేని ఒక పక్కా కులతత్వవాదిగా మిగిలిపోయే వాడ్ని. వారికి కేటాయించిన రిజర్వేషన్లతో రెల్లి, పైడి, పాకీ కులస్థులు, విద్యా ఉద్యోగాల్లో ఏనాడూ ఏమీ పొందని వారు ఈ రోజు తమ వాటాను తాము పొందుతూ కొందరైనా ప్రభుత్వ ఉపాధి అవకాశాలు అందుకుంటూ ఎంతో కొంత స్థిరమైన జీవితాన్ని గడుపుతున్నారు. స్వార్థం అనేది మనిషిని ఎదుటి వారికి జరిగే అన్యాయాన్ని చూడనివ్వదు. మనము, మన కుటుంబం, మన వర్గం తప్ప మరి దేన్నీ పట్టించుకోనివ్వదు. అన్యాయం జరిగిన వర్గం వైపు ఉండాలనే నిజాయితీ ఉంటే, ఎదుటి వారికి జరిగిన అన్యాయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అదే మనిషికి స్థిరమైన నడక నేర్పుతుంది.


 బమ్మెర
ఫోటోలు: బాబూరావు
Andhra Jyothi Telugu News Paper Dated : 09/08/2013 

Monday, April 2, 2012

తిరుగుబాటు యాత్ర - మందకృష్ణ మాదిగ



ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల తిరుగుబాటు యాత్ర జరుగుతుంది. ఏప్రిల్ 5న చిత్తూరు జిల్లా పీలేరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి జిల్లాలో యాత్ర ఉంటుంది. జూన్ 5న హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుబాటు మహాసభ జరుగుతుంది. 

ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణ సాధన కోసం గత 18 సంవత్సరాల నుంచి ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఈ పోరాటానికి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల, సంఘాల, పార్టీల సంపూర్ణ మద్దతు ఉంది. మొదటి దశ ఉద్యమం 1994లో మొదలై 1999 చివరి నాటికి విజయం సాధించింది. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ ఫలాలు అనుభవించిన చరిత్ర మనకు ఉంది. అయితే 2004 నవంబర్ 5న సాంకేతిక కారణాల సాకుతో సుప్రీంకోర్టు వర్గీకరణను కొట్టివేయడంతో తిరిగి రెండో దశ ఉద్యమాన్ని గత 8 ఏళ్లుగా కొనసాగిస్తున్నాం. 

మన పోరాటాన్ని ముందుకు తీసుకువెళుతున్న వివిధ సందర్భాలలో లాఠీ దెబ్బలు తింటున్నాం. కేసులు పెడితే జైలు కెళుతున్నాం. చివరకు ఉద్యమంలో యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడా రాజీపడకుండా పట్టుదలగా ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం. ఇందుకు మనం నడిపిన నెలరోజుల దీక్షలే సాక్ష్యం. ఏ పార్టీ, ఏ సంఘం చేయలేని విధంగా మనం చేసి నిరూపించాం. 

అయినా వర్గీకరణకు చట్టబద్ధత ఎందుకు సాధ్యపడట్లేదు? ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి సాంకేతిక, రాజకీయ ఇబ్బందులు లేకపోయినా చట్టబద్ధత జరగకపోవడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరం వేసుకోవాల్సిన అవసరముంది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ గత నెలలో రంగారెడ్డి జిల్లా గండిపేటలో రెండురోజుల పాటు ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నా వర్గీకరణ జరగకపోవడానికి మూడు కారణాలను రాష్ట్ర కమిటీ గుర్తించింది. అవి 1.కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం; 2. పాలకపక్ష నిర్లక్ష్యాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష టిడిపి మౌనం; 3. మాదిగ ప్రజాప్రతినిధుల బానిస మనస్తత్వం-చేతగానితనం. 

వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సాంకేతికంగా 2004లోనే వర్గీకరణ చేపట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2008లో వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ 2009లో తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర జాతీయ పార్టీలన్నీ ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖలు కూడా రాశాయి. వర్గీకరణకు ఎలాంటి సాంకేతికపరమైన, రాజకీయ పరమైన అడ్డుంకులు లేకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే జరగట్లేదని తేలిపోయింది. 

అధికారంలో వున్నప్పుడు నాలుగేళ్ల పాటు (2000 నుంచి 2004 వరకు) టిడిపి ప్రభుత్వం వర్గీకరణను అమలుచేసింది. టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వర్గీకరణ చట్టాన్ని సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు 2004లో కొట్టివేసింది. అప్పటి నుంచి ఎమ్మార్పీఎస్ రెండవ దశ ఉద్యమాన్ని ప్రారంభించి ఈ రోజు వరకూ పోరాటాన్ని కొనసాగిస్తోంది. అయినా గత 8 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి అధినాయకత్వం పూర్తిగా మౌనంగా ఉంది. ఈ ఎనిమిదేళ్లలో ప్రతిపక్ష నాయకుడు వర్గీకరణ అంశంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ 8 సెకండ్లు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో వర్గీకరణ సాధించుకునే దిశగా ప్రజాఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే చట్టసభల్లో మన వాణిని వినిపించుకునే దిశగా మనం అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 

- మందకృష్ణ మాదిగ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
Andhra Jyothi News Paper Dated : 3/04/2012 

Thursday, November 3, 2011

మావోయిస్టులా, మావో అయిస్టులా?-1-మందకృష్ణ మాదిగ Namasethe Telangana 08/08/2011


మావోయిస్టులా, మావో అయిస్టులా?-1
అటు స్టాలిన్, ఇటు కొండపల్లి సీతారామయ్యగార్లతో పాటు వరంగల్ డిక్లరేషన్ గుర్తించిన వివిధ వర్గాల మౌలిక సామాజిక అంశాలనే మేము మాట్లాడుతుంటే అందుకు అనుగుణంగా మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీలాంటి వాళ్లు హర్షించాల్సింది. కానీ మీ పార్టీ పంథాను కూడా పక్కకు పెట్టే విధంగా మీలో మార్పు ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి?
ధైర్యంగా ఆలోచించు, ధైర్యంగా ఆచరించు అన్న మావో మాటలను ఉటంకిస్తూ నేను రాసిన వ్యాసంపై ఏ దొరలను ఉద్దేశించి ఆ వ్యాసం రాశానో ఆ దొరల నుంచి అంటే టీఆర్ ఎస్ ప్రధాన నాయకత్వం నుంచి స్పష్టమైన జవాబు రాలేదు. కానీ నా వ్యాసానికి స్పందనగా మావోయిస్టు రాజకీయ ఖైదీ శ్రీరాముల శ్రీనివాస్ రాశారు. ఆ వ్యాసం తను నమ్ముకున్న నికార్సయిన మావోయిస్టు సిద్ధాంతానికి కూడా వ్యతిరేకం అని భావిస్తున్నాం. తాను లేవనెత్తిన అంశాలకు తనే కట్టుబడి లేకపోవడంతో పాటు గందరగోళంగా వ్యాసాన్ని రాశాడు. అందులో వ్యక్తిగతమైన నిందలు, ఎమ్మార్పీఎస్ మీద కుహనా విమర్శలకు పాల్పడడమే కాకుండా మావోయిస్టు రాజకీయ ఖైదీ పేరుతో రాయడం ఆశ్చర్యాన్ని కలిగింది. మావోయిస్టు రాజకీయ ఖైదీ గా కాకుండా ఒక సాధారణ తెలంగాణ అభిమానిగా, వర్గ సామాజిక దృక్పథం లేని ఒక సాధారణ పౌరునిగా రాసినట్లుగా ఉంది.
నా వ్యాసం లోగానీ, ఆచరణలోగానీ మావో, స్టాలిన్‌ల స్ఫూర్తి కనిపించడం లేదని తీర్పు ఇచ్చాడు. మావోను, స్టాలిన్‌ను మావోయిస్టులు తప్ప మరెవరు ఏ కోణంలోనైనా ఆదర్శంగా తీసుకోకూడదా? ఒక మహనీయుడు తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి తమ లక్ష్యాన్ని చేరే దిశగా, తమ కర్తవ్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. కర్తవ్య నిర్వహణలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ, మధ్యలో వచ్చే ఎన్నో అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటు, ఆచరణలో ముందు వరుసలో ఉండి విజయాన్ని సాధించి పెట్టిన మహనీయులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అలా విజయాన్ని సాధించి పెట్టిన వారి సిద్దాంత భూమిక కూడా అందరికి నచ్చకపోవచ్చు. అయితే వారి ఆచరణ , నిబద్ధత, దృఢసంకల్పం చాలా మందికి నచ్చవచ్చు.
మేము 1997లో మహాపాదయావూత మొదలు పెట్టినప్పుడు మీకు స్ఫూర్తి ఎవరు అని విలేఖరులు ప్రశ్నించినప్పుడు చైనా విప్లవోద్యమ నేత మావో కొనసాగించిన లాంగ్ మార్చ్ నాకు స్ఫూర్తి అని చెప్పాను. అదే స్ఫూర్తితో 3 విడుతలుగా చేసిన నా పాదయాత్ర 4000 కిలోమీటర్లు దాటింది. మావో సాయుధ పోరాటాన్ని ఎమ్మార్పీస్ కొనసాగించలేకపోయినా, ఆయన కొనసాగించిన లాంగ్‌మార్చ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాం. హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించి ప్రపంచాన్ని కాపాడిన రష్యా సోషలిస్టు నిర్మాత జోసెఫ్ స్టాలిన్ దృఢసంకల్పాన్ని మార్కిస్టు , లెనినిస్టులే కాదు వామపక్ష సిద్ధాంతాలకు భిన్నమైన వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటే, అలా తీసుకున్న వారిలో మేము కూడా ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? గాంధీ సామాజిక రాజకీయ సిద్ధాంత అవగాహన మీద ఎమ్మార్పీఎస్‌కు నమ్మకం లేదు. మాకే కాదు అంబేద్కర్ వాదులకు , కులనిర్మూలన వాదులకు, వర్గరహిత సమాజాన్ని కోరుకునే వారికి కూడా నమ్మకం లేదు.
అయినా గాంధీ కోట్లాది మందిని జాతీయోద్యమంలో భాగస్వాములను చేసిన ప్రజాస్వామిక శాంతియుత పోరాటాన్ని, నేనే కాదు గాంధీతో సైద్ధాంతిక భిన్న దృక్ఫథం ఉన్నవారు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. అంబేద్కర్‌ను కులతత్వవాదులు కొన్ని విషయాల్లో వ్యతిరేకించవచ్చు. కానీ ఆయన ఆశయ సాధన కోసం చేసిన కృషిని ఆయనను వ్యతిరేకించే వారు కూడా శ్లాఘిస్తారని నమ్ముతున్నాం.
తెలంగాణ ఉద్యమం సీమాంధ్ర పెట్టుబడిదారులతో అమీ తుమీ తెల్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఏర్పాటును సమర్థించడం లేదా పోరాడడం, తెలంగాణ ఏర్పాటుకు నష్టం కలిగించేలా వ్యవహరించడం అనేది తేల్చుకోవాల్సిన మౌలిక అంశం అన్నట్లు వ్యాసకర్త రాశారు. తెలంగాణే ఏకైక లక్ష్యంగా ముందుండి పోరాడుతున్న వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అడ్డంకులు కల్పించే సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణను సమర్థించే విభిన్న వర్గాలు, సంస్థలు వారి ఆకాంక్షలను కూడా ఉద్యమంలో భాగంగానే ప్రతిస్పందించడం తప్పు ఎలా అవుతుంది? తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నది కాబట్టి సామాజిక అంశాలను ప్రస్తావించకూడదని ఎవరూ అనరని వ్యాసకర్తనే చెప్పారు. ఆత్మగౌరవ అంశాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను ప్రతిబింబించే విధంగా కార్యాచరణ ఉండాల్సిందేనని కూడా మీరే అంటున్నారు.
మరి మేము మా అంశాలను ప్రతిబింబించే విధంగా కార్యాచరణే తీసుకుంటే మీరు, మీతో పాటు తెలంగాణ అగ్రకుల శక్తులు జీర్ణించుకోగలరా?స్థల, కాల పరిస్థితుల్లో ఏది ప్రధానాంశమో, ఏది అప్రధానాంశమో తెలుసుకోవాలని మీరు అనడం భావ్యంగా లేదు. ఎలాంటి ఉద్యమంలోనైనా, ఏ వర్గ ప్రయోజనాలు ఆ వర్గానికే ప్రధానం. ఈ విషయాన్ని మీరు విస్మరించారు. స్వాతంవూత్యోద్యమంలో పాల్గొంటున్న ముస్లింలు జిన్నా నాయకత్వంలో తమ ప్రధాన ఎజెండాను ముందుకు తీసుకువచ్చి దేశ స్వాతంత్య్రం కంటే ముందే మాకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయండని, లేని పక్షంలో ఈ స్వాతంవూత్యమే మాకు అవసరం లేదని ఒత్తిడి చేసి పాకిస్తాన్‌ను సాధించుకోలేదా? దేశ స్వాతంత్య్రం కోసం ముస్లింలు తమ ఎజెండాను మూలకు పెట్టారా? వాళ్ళు మూలకు పెడితే నేటి పాకిస్తాన్ ఆవిర్భవించేదా!
స్వాతంత్య్రం కంటే ముందే మా అస్పృశ్యుల హక్కులు ఏంటో తేల్చాలని అంబేద్కర్ పట్టుబట్టి దళితులకు, గిరిజనులకు తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోలేదా? జాతీయోద్యమ కాలంలోనే ఏ వర్గ ప్రయోజనాలను ఆ వర్గాలు చూసుకున్నప్పుడు అది తెలంగాణ ఉద్యమానికి వర్తించదా? ఈ మధ్యకాలంలో అన్నాహజారే నాయకత్వంలో లోక్‌పాల్ బిల్లు కోసం దేశ వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక పోరాటం జరుగుతున్నది. నేడు దేశ ప్రజలందరూ ముక్తకం అవినీతి నిర్మూలన జరగాలని కోరుకుంటున్నారు. లోక్‌పాల్ బిల్లుకంటే తెలంగాణ అంశమే ముఖ్యమని కోదండరాండ్డి గారు ఢిల్లీలో ప్రకటించారు. ఆయన డిమాండ్‌ను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కోదండరాండ్డి గారికి దేశ ప్రయోజనాల కంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం. ఈ ముసుగులో తెలంగాణలోని అగ్రవర్ణాలకు అధికారాన్ని సాధించిపెట్టుకోవడమే ఆయనకు ముఖ్యమైనప్పుడు, తెలంగాణలో 90 శాతం గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వాటా అన్ని రంగాలలో వారికి దక్కాల్సిందేనని మేము అడగడం తెలంగాణకు అడ్డెలా అవుతుంది? మా అణగారిన వర్గాల గురించి, వారి హక్కుల గురించి ఇప్పుడే ఆలోచించనోళ్లు, పరిష్కారాన్ని చూపెట్టనోళ్లు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆలోచిస్తారని, పరిష్కరిస్తారని మేము నమ్మాలా? జాతీయోద్యమ కాలంలో అగ్రకుల నాయకుల మాటలు నమ్మిన మా అణగారిన బీసీ నాయకులు, ప్రజలు మోసపోలేదా? ఇప్పటికీ దేశంలో 50 శాతం గల బలహీనవర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం అగ్రకులాలు చేసిన మోసం కాదా? మమ్మల్ని ఇప్పుడు అగ్రకులాల్ని నమ్మి మోసపొమ్మనే చెప్పదలుచుకున్నారా? భూమి, నీటి పంపిణీతో పాటు విద్యా, ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో అందరికీ జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఉండాల్సిందేనని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా! మరి ఆమాటే తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న అగ్రకుల నాయకులు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఆ విషయం తెలిసిన మీరు ఎందుకు ఈ అగ్రకుల నాయకత్వాన్ని ప్రశ్నించడం లేదు?
తెలంగాణ వచ్చాక తక్కువ ఒత్తిడితో పై అంశాలను సాధించవచ్చని మీలాంటి వారు మాట్లాడడం అర్థరహితం. నిజాం పరిపాలన కాలంలో తెలంగాణలోని అగ్రవర్ణాల దొరలు వాళ్ల గడీల ముందు చెప్పులేసుకొని తిరగడానికే అణగారిన వర్గాలను అంగీకరించేవారు కాదు. దళితులతో, పీడిత కులాలతో వెట్టి చేయించుకొన్న చరిత్ర, బాంచన్ దొర అనిపించుకున్న చరిత్ర తెలంగాణ దొరలది, భూస్వాములది కాదా? దొరల, భూస్వాముల ఆగడాలకు, గడీల్లో జరిగిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటమే జరిగిన విషయం మీకు తెలియదా? ఆ తర్వాత కూడా తెలంగాణలో నక్సలైట్ల ఉద్యమం, భూస్వాముల భూములను పీడిత కులాలకు పంచడానికి, దొరలు దళితులను వేధించడానికి నిరసనగా ప్రారంభమైన ఉద్యమం కాదా? తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నాటి నక్సలైట్ ఉద్యమం వరకు వేలాది మంది ఉద్యమకారులు తమ విలువైన హక్కులను సాధించవచ్చని మీరు మాట్లాడడం ప్రజలను మభ్యపెట్టడంతోపాటు, నికార్సయిన మావోయిస్టు వైఖరికి భిన్నం కాదా?
నేను స్టాలిన్ ఆదర్శాలను ఉటంకించడమనేది అన్యాయమని మీరు అంటున్నారు. అదే మీ వాదనైతే దళితులు చదువుకోవడం అన్యాయం, వేదాలు వల్లించడం అన్యాయం అన్న ఒకనాటి బ్రాహ్మణీయ భావజాల వైఖరికి, మీ వైఖరికి తేడా ఏంటి? జాతుల స్వయం నిర్ణయాధికారం కోసం చేసే పోరాటాన్ని బలపరిచేటప్పుడు సోషలిస్టు సమాజాన్ని నిర్మించుకొనే దృక్పథంతో ప్రజల్ని సంఘటితం చేయాలని, భూస్వామ్య శక్తులను నమ్మి మన కర్తవ్యాన్ని విస్మరించరాదని కమ్యూనిస్టులను జోసెఫ్ స్టాలిన్ హెచ్చరించాడు. ఈ దృక్పథాన్ని భారతదేశంలో జాతుల పోరాటాలని బలపరిచేటప్పుడు, అణచివేయబడ్డ కులాలవారు సామాజిక న్యాయాన్ని సాధించుకునే లక్ష్యంగా ఉద్యమంలో భాగస్వాములైతారే కానీ స్థానిక భూస్వామ్య శక్తులని నమ్మడమంటూ జరుగదు. అంతేకాకుండా దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని కోరే మావోయిస్టులు కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్టాలిన్ దృక్పథాన్నే అమలు చేస్తారని ఆశిస్తున్నాం.
అంతెందుకు పీపుల్స్‌వార్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య రాష్ట్ర విభజనోద్యమం, మార్క్సిజం అనే అంశం మీద తను 1973లో సృజనలో రాసిన వ్యాసమే ఇప్పటికీ పార్టీ దృక్పథంగా ఉందని మేము భావిస్తున్నాం. ఆయా దేశాల్లో సాంఘిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జాతుల సమస్య అనేక రూపాల్లో బహిర్గతం కావచ్చు. ఏ రూపాల్లో బహిర్గతమైనా ప్రధానంగా అది విభిన్న జాతులకు చెందిన బూర్జువా వర్గాలకు చెందినవారి వైరుధ్యమే! ఆ వైరుధ్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నంలో తమ వెనుక ప్రజలందరినీ సమీకరించుకోవడానికి గానూ జాతినంతటిని రకరకాల నినాదాలతో ఉత్తేజ పరచటానికి ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకోవడానికి ప్రాంతీయ పెట్టుబడిదారులు ప్రయత్నిస్తారని కొండపల్లి సీతారామయ్య గారు చెప్పడమే కాకుండా, స్టాలిన్ జాతుల పోరాటాలపై చెప్పిన విషయాన్ని కూడా ఈ విధంగా పొందుపరిచాడు. ‘పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతూ ఉన్న పరిస్థితుల్లో జాతుల సమస్యపై జరిగే పోరాటం, బూర్జువా వర్గాల మధ్య జరిగే పోరాటమే. కొన్ని సందర్భాల్లో జాతుల ఉద్యమంలోకి కార్మికవర్గాన్ని కూడా బూర్జువా వర్గం ఆకర్షించగలుగుతుంది. అలాంటప్పుడు అది జాతి మొత్తం పోరాటంగా వ్యక్తం అవుతుంది.
కానీ వాస్తవానికి అది బయటికి కనిపించే లక్షణం మాత్రమే. సారాంశంలో అది ఎప్పుడూ బూర్జువా పోరాటమే. ప్రధానంగా బూర్జువాల ప్రయోజనాల కొరకు జరిగే పోరాటమే’
ఇంకా కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య వ్యాసాన్ని కొనసాగిస్తూ, జాతుల పోరాటం ప్రజలందరి క్షేమం కోసమే జరుగుతున్నట్లు కనిపిస్తున్నా, సారాంశంలో బూర్జువా వర్గాల ప్రయోజనం కోసమే, బూర్జువావర్గ నాయకత్వం కిందనే జరుగుతుందనే విషయం కార్మికవర్గం ఎన్నడూ మర్చిపోవద్దు. సాధారణంగా జాతుల పోరాటంలో వర్గ దృష్టిని లోపింపజేసి, అన్ని వర్గాల ప్రయోజనాలు ఒక్క అవాస్తవిక వాతావరణం సృష్టించబడుతుంది. ప్రజల్లో వున్న విభిన్న వర్గాల ప్రయోజనాలు భిన్నభిన్నంగా వుంటాయనే యదార్థం మరుగునపడిపోతుంది. ప్రత్యేకించి జాతుల ఉద్యమానికి నాయకత్వం వహించే పెట్టుబడిదారులు తమకున్న ప్రచార సాధనాలను ప్రయోగించి అలాంటి వాతావరణాన్ని సృష్టించడంపై కేంద్రీకరిస్తారు. కానీ అలాంటిది జరగకుండా తమ శక్తినంతా వినియోగించి కార్మికవర్గం చైతన్య పూరితంగా కృషి చేయాలి. ఇంత స్పష్టంగా అక్కడ స్టాలిన్, ఇక్కడ కొండపల్లి సీతారామయ్య చెప్పారు. ఈ పంథాకు అనుగుణంగానే మావోయిస్టు పార్టీ ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షపై వరంగల్ డిక్లరేషన్ పేరుతో తమ కర్తవ్యాన్ని నిర్దేశించుకుంది. అందులో ఈ విధంగా పేర్కొంది.
‘ఆంవూధవూపదేశ్ నుంచి తెలంగాణ భౌగోళికంగా వేరుపడి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రాజకీయ, ఆర్థిక విధానాలలో మార్పు రాకపోతే, అలాంటి ప్రత్యేక రాష్ట్రం వల్ల రాష్ట్ర ప్రజలకు లాభించేది ఏమీ ఉండదు. అధికారంలో వుండే వారిలో మార్పు వచ్చి విధానాల్లో మార్పు రాకపోతే అది ఏ విధంగా నిజమైన మార్పుకాదో మన అనుభవంలో వుంది’.అంతేకాకుండా దేశంలోనూ, విదేశాల్లోను వున్న బడా పారిక్షిశామికవేత్తలకు దళారులుగా వున్న సీమాంధ్ర రాజకీయ శక్తులు స్థానిక తెలంగాణ భూస్వామ్య రాజకీయ శక్తులు తెలంగాణ ప్రస్తుత పరిస్థితికి కారణం. ఇట్లాంటి వాస్తవ విషయాల జోలికి పోకుండా, కేవలం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేవారు ప్రజలను మభ్యపెడుతున్నారు. వీళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. తెలంగాణలో ఒక ప్రజాసమూహానికి, మరో ప్రజాసమూహానికి మధ్యలో తేడా వుంది. వివిధ వర్గాల ప్రజలు తమ మౌలికమైన సమస్యలకు, మౌలికమైన పరిష్కారాలను కోరుతూ పోరాడాలి. ప్రజలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే ప్రజా, రాజకీయ వ్యవస్థ కలిగిన తెలంగాణ రాష్ట్రం కావాలని, దీన్ని ప్రజాస్వామిక తెలంగాణగా అందామని వరంగల్ డిక్లరేషన్ స్పష్టం చేసింది.
అటు స్టాలిన్, ఇటు కొండపల్లి సీతారామయ్యగార్లతో పాటు వరంగల్ డిక్లరేషన్ గుర్తించిన వివిధ వర్గాల మౌలిక సామాజిక అంశాలనే మేము మాట్లాడుతుంటే అందుకు అనుగుణంగా మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీలాంటి వాళ్లు హర్షించాల్సింది. కానీ మీ పార్టీ పంథాను కూడా పక్కకు పెట్టే విధంగా మీలో మార్పు ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి?
ఇక నా వ్యాసంలో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశానికి ప్రధానమంవూతులైన వారందరూ, రెండు సంవత్సరాలు మినహా ఈ రాష్ట్రానికి ముఖ్యమంవూతులైన వారందరూ అగ్రవర్గాల వారేనని నేను అన్నాను. అందుకు మీరు స్పందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ముఖ్యమంవూతులు, ప్రధానమంవూతులైతే వారి సమస్యలు పరిష్కారమవుతాయని భ్రమలు పెట్టడం సరైనది కాదని రాశారు. అంటే ఈ అణగారిన వర్గాల నుంచి ప్రధానమంవూతులు, ముఖ్యమంవూతులైతే వారికి వర్గ దృక్పథం, కుల నిర్మూలన దృక్పథం ఉండదా? అన్ని దృక్పథాలు అగ్రవర్ణాలకే ఉంటాయా? 90 శాతం వర్గాల నుంచి వర్గ, కుల నిర్మూలనే ధ్యేయంగా పనిచేసే వాళ్లు, ఉద్యమించే వాళ్లు ఉండరనా మీ అభివూపాయం? అణగారిన వర్గాలు అధికారంలోకి వస్తే వారు విముక్తి వాళ్లు చేసుకోలేరా? 90 శాతం ఉన్న అణగారిన వర్గాల విముక్తి ఎల్లకాలం 10శాతంగా ఉన్న అగ్రవర్ణాల దయా, దాక్షిణ్యాల మీదమే అధారపడాలా? మీ మాటలు, మీ రాతలు 10 శాతం వున్న అగ్రకులాల వారికి సంతోషిన్నిస్తాయేమోగానీ, 90 శాతం వున్న అణగారిన ప్రజలకు ఆగ్రహం కలిగిస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు.
ఇక కారంచేడు సువార్తమ్మ ప్రతిఘటనను, పోరాటాన్ని నేను సమర్థించాను. చందర్‌రావు భార్య చెప్పు ఎత్తి చూపెట్టడాన్ని కూడా సమర్థించాను, గర్వపడ్డాను. ఇది దళిత మహిళల పోరాట సంప్రదాయంగానే వున్నదని స్వాగతించానే తప్ప, పోరాటాన్ని విరమించే నీరు గార్చే భ్రమలు కల్పించే విధంగా మేము ఏ ప్రయత్నం చేయలేదు. మీరేమో మీ వ్యాసంలో మమ్మల్ని పోరాటాన్ని నీరుగార్చే వారిగా, కోర్టులపై భ్రమలు కల్పించేవారిగా చూపెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉంది. అన్ని చట్టాల ద్వారానే పరిష్కారమవుతాయనే భ్రమల్లో మేము లేము. కానీ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వుండే చట్టాలను ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదని నమ్ముతున్నాం. ఒకసారి మీ విషయానికే వద్దాం. ప్రస్తుతం మీరు జైళ్ళో ఉన్నట్టుగానే 1977 ఎమ్జన్సీలో క్రామేడ్ చెరబండరాజు కూడా జైలులో వున్న సమయంలో చట్టాలమీద, కోర్టుల మీద మాకు నమ్మకం లేదనీ, బూర్జువా కోర్టులను బహిష్కరిస్తున్నామని బెయిల్ తీసుకోవడానికి నిరాకరించారు. కానీ తర్వాత కాలంలో విప్లవకారులు కూడా ఈ బూర్జువా చట్టాలను ఉపయోగించుకొని ప్రజల కోసం మరింతగా పోరాడాలని పార్టీ అవగాహనకు వచ్చిన విషయం తమరికి తెలిసిందే. రాజ్యాంగంలో వుండే కనీస పౌరహక్కులను ఉపయోగించుకోవడం కూడా చట్టాల మీద భ్రమలు కల్పించడమే అయితే మీరు రేపు బెయిల్ తీసుకొని బయటికి వస్తే అది కనీస పౌరహక్కులను ఉపయోగించుకొన్నట్లా? లేక బూర్జువా చట్టాల మీద మీరు కూడా ప్రజలకు భ్రమలు కల్పించినట్లా

బడుగుల భాగస్వామ్యం తేల్చాలి - మంద కృష్ణ మాదిగ Andhra Jyothi News Paper 31/08/2011


బడుగుల భాగస్వామ్యం తేల్చాలి
- మంద కృష్ణ మాదిగ
'భారతదేశమా నీ ప్రయాణం ఎటు?' -పండిట్ నెహ్రూ1928లో రాసిన ఒక గ్రంథ శీర్షిక అది. ప్రపంచం పెట్టుబడిదారీ, సోషలిస్టు వ్యవస్థలుగా చీలిపోతున్న సందర్భమది. భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే సోషలిస్టు వ్యవస్థవైపే భారత్ పయనిస్తుందని నెహ్రూ విస్పష్టంగా చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ తెలంగాణ ఏ లక్షణం కలిగివుంటుంది? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నామని చెప్పే ఏ అగ్రకుల నాయకులూ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు.
ఒక పోరాటానికి నాయకత్వం వహించే శక్తులు అవలంభించే విధానం వల్ల ఆ పోరాటం ద్వారా వచ్చే ఫలాలు అన్ని వర్గాలకు అందే విధంగా ఉంటాయా లేదా అనే విషయం ఆ పోరాటం జరుగుతున్న సందర్భంలోనే తెలిసిపోతుంది. తెలంగాణను కోరే వారిలో ప్రధానంగా మూడు శక్తులు పనిచేస్తున్నాయి. అవి: (అ) ముందు తెలంగాణ వస్తే చాలు అనుకునే శక్తులు.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేంతవరకు ఎలాంటి సామాజిక అంశాలను చర్చకు తేకూడదని అనుకునే శక్తులు ఇవి. ఈ శక్తులు అగ్రకుల భూస్వామ్య వర్గాలు; (ఆ) ప్రజాస్వామిక తెలంగాణ కోరుకునే శక్తులు. వీరిని ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవోద్యమ అనుకూల శక్తులుగా చెప్పవచ్చు; (ఇ) తెలంగాణను కోరుకునే సామాజిక శక్తులు. ఈ శక్తులు వచ్చే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం భాగస్వామ్యం అన్ని రంగాలలో ఉండాలని కోరుకునేవి.
తెలంగాణ ఏర్పడిన వెంటనే తాము అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటు అన్ని రంగాల మీద ఆధిపత్యం చెలాయించడానికి, తెలంగాణలోని అణగారిన కులాల ప్రజల్ని అన్ని రంగాలలో వెనక్కు నెట్టివేయడానికి అగ్రకుల భూస్వామ్య వర్గాలు పకడ్బందీగా ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే క్రమంలోనే భూస్వామ్య వర్గాల ఆధిపత్యాన్ని ఎండగడుతూ వారి దోపిడీ రాజకీయాలను ఎదుర్కొనే విధంగా, ప్రజాస్వామిక తెలంగాణను కోరుతున్న విప్లవోద్యమ అనుకూల శక్తులు తమ ప్రయత్నాలను కొనసాగించాలి. దురదృష్ట వశాత్తు ఒక స్పష్టమైన ఎజెండాతో తమ కార్యాచరణను ఆ శక్తులు ప్రజల ముందు ఇప్పటివరకు పెట్టలేకపోయాయి. ఇక సామాజిక శక్తుల పక్షాన ఎంఆర్‌పిఎస్ ముందు వరుసలో ఉండి, వచ్చే తెలంగాణలో 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలకు అన్ని రంగాలలో న్యాయమైన వాటాను డిమాండ్ చేస్తోంది. అణగారిన వర్గాలను అప్రమత్తం చేస్తూ తమ బాధ్యతను ఈ సంస్థ నెరవేరుస్తోంది.
ఈ కారణంగా తెలంగాణలో ఉన్న అగ్రకుల భూస్వామ్యశక్తులు సామాజిక న్యాయాన్ని కోరే శక్తులను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది రెండు విధాలుగా జరుగుతోంది. మొదట అగ్రకులాలు డైరెక్టుగా దుష్ప్రచారం చేస్తున్నాయి. రెండవది అణగారిన కులాల నుంచి కొంత మంది స్వార్థపరులను చేరదీసి డబ్బులకు, పదవులకు ఆశపడ్డవారితో చేయించడం కూడా జరుగుతుంది. అగ్రకుల శక్తులకు, అణగారిన కులాల శక్తులకు మధ్య జరిగిన ప్రతి సంఘర్షణలో గతం నుంచి నేటివరకు ఈ వైఖరినే అగ్రకుల శక్తులు కొనసాగిస్తున్నాయి.
చెప్పవచ్చినదేమిటంటే ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో ఆ ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించాలంటే, ఆ ఉద్యమం అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని పరిష్కరించుకోవాలి. ఆ అంతర్గత సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించుకున్నప్పుడే ఉమ్మడి లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. అలా కాక లక్ష్య సాధనలో అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారాన్ని విస్మరిస్తే ఉమ్మడి లక్ష్య సాధన కూడా జాప్యం జరిగి అది మరింత జటిలంగా మారే ప్రమాదం ఉందని ఎంఆర్‌పిఎస్ విశ్వసిస్తుంది. అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా గుర్తించి పరిష్కరించుకున్న ప్రతి ఉద్యమం తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకున్న సందర్భాలు మన రాష్ట్ర, దేశచరిత్రలో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు కొన్నిటిని నిశితంగా చూద్దాం.
(అ) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం :- తెలుగు ప్రజల హక్కుల్ని, అవకాశాల్ని తమిళులు కొల్లగొడుతున్నట్లుగా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు తమ హక్కుల్ని హరించరనే గ్యారంటీ ఏమిటని రాయలసీమ ప్రజలకు అనుమానం వచ్చింది. రాయలసీమ సోదరులలో ప్రగాఢంగా ఉన్న ఈ అనుమానాలను తొలగించడానికై కోస్తాంధ్ర నాయకులు, సీమ నాయకులకు లిఖిత పూర్వకమైన హమీలు ఇచ్చారు. 1937 నవంబర్ 16న ఈ లిఖిత పూర్వక హామీలపై ఇరుప్రాంతాల మధ్య జరిగిన ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందంగా ప్రసిద్ధి పొందింది. దరిమిలా రెండు ప్రాంతాల ప్రజల సమష్టి కృషితో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
(ఆ) ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు :- స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే ఆకాంక్ష బలపడుతున్న సందర్భం అది. ఆంధ్ర, హైరదాబాద్ రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే బలమైన ఆకాంక్ష ఆంధ్ర నాయకుల నుంచి ఉత్పన్నమయింది. అయితే సమైక్య రాష్ట్రంలో తాము దోపిడీకి గురవుతామనే భయాందోళనలు తెలంగాణ వారిలో వ్యక్తమయ్యాయి. ఆ భయాందోళనలను ఎన్నో సందర్భాలలో తెలంగాణ నాయకులు బహిరంగంగానే వ్యక్తపరచడం జరిగింది.
ఆ భయాందోళనలను తొలగించడానికే 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. దానివల్ల తెలంగాణ ప్రాంతీయ బోర్డు మొదలు కొని విద్యా, ఉద్యోగ అవకాశాలు, నీటి పంపిణీ, బడ్జెట్ మొదలగు విషయాల మీద తెలంగాణకు రావాల్సిన, దక్కాల్సిన అన్ని విషయాల మీద ఒప్పందం జరిగింది. దీనినే పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు. ఈ ఒప్పందం జరిగిన తరువాతనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏకమై 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.
(ఇ) స్వాతంత్య్ర పోరాటం : 1917లో హోం రూల్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. భారతీయులకు స్వయం పాలనాధికారాలు ఇస్తున్నామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు దేశరాజకీయాల్లో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లు మాత్రమే ప్రధాన శక్తులు. యావత్ భారతీయుల పేరిట వచ్చిన రాజకీయ అధికారాన్ని కాంగ్రెస్ పేరుతో అగ్రకుల హిందువులు, ముస్లింలీగ్ పేరుతో సంపన్న ముస్లిం వర్గాలు అధికారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే చట్ట సభల్లో మాకు కూడా ప్రాతినిధ్యం కావాల్సిందేనంటూ దళిత గిరిజన బలహీన వర్గాలు దేశవ్యాప్తంగా పోరాటాన్ని మొదలుపెట్టాయి.
అప్పటికి గాంధీ, అంబేద్కర్, జిన్నాలు దేశ రాజకీయ చిత్రపటంలోకి ఇంకా రాలేదు. 1928లో సైమన్ కమిషన్ ఎదుట, ఆ తరువాత లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో స్వాతంత్య్రాన్ని అగ్రకులాలతో పాటు నిమ్నకులాలు కూడా కోరుతున్నాయని, స్వాతంత్య్రానంతరం అన్ని రంగాలలో తమకు న్యాయమైన వాటా ప్రాతినిధ్యం సంగతి ఏమిటో మీరు ముందే తేల్చాలని అంబేద్కర్ పట్టు పట్టారు. దేశ స్వాతంత్య్రాన్ని స్వాగతిస్తూనే అణగారిన కులాల పక్షాన అంబేద్కర్ బలంగా నిలబడ్డారు. నిమ్న కులాల వాణిని బ్రిటిష్ పాలకులు, కాంగ్రెస్ నాయకుల ముందు విన్పించిన తరువాతనే బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును 1932లో ప్రకటించింది.
ఆ అవార్డును అడ్డుకోవడానికి అగ్రకుల శక్తులు గాంధీని ముందుపెట్టడం, ఆయన ఆమరణ దీక్షకు పూనుకోవడం, అప్పటివరకు అంబేద్కర్‌కు అనుసరించిన కొంతమంది దళితనాయకులు కాంగ్రెస్‌కు లొంగిపోయి, దళారులుగా మారి కమ్యూనల్ అవార్డు దళితులకు అవసరం లేదంటూ అంబేద్కర్‌కు వెన్ను పోటు పొడవటం జరిగింది. గాంధీ చనిపోతాడనే వదంతులతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం, అటు గాంధీ ప్రాణాలు కాపాడటానికి, పీడితకులాల కనీసహక్కులను సంరక్షించుకోవడానికి అంబేద్కర్ ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా గాంధీ, అంబేద్కర్‌ల మధ్య 1932లో జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే స్వాతంత్య్రానంతరం అమలు జరుగుతున్న నేటి రిజర్వేషన్ల విధానమని అందరికి తెలిసిందే.
పై మూడు ఒప్పందాలు జరిగిన వివిధ సందర్భాలను గమనిస్తే తమిళుల నుంచి విడివడే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న కాలంలోనే రెండు అసమాన ప్రాంతాల మధ్య కొనసాగుతున్న అసమానతలను రూపుమార్పించే దిశగా శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. రెండు తెలుగురాష్ట్రాలు కలిసి ఒక్కటిగా ఏర్పడే సందర్భంలోకూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతలు, దోపిడీని తొలగించుకునే విధంగా అన్ని రంగాలలో సమాన పంపిణీ జరిగే విధంగా ముందే పెద్దమనుషుల ఒప్పందం జరిగింది.
దేశ స్వాతంత్య్రం సాధించుకునే సందర్భంగా దేశంలో కుల అసమానతలు సాంఘిక వివక్షలను తొలగించుకునే విధంగా అస్పృశ్యులకు, గిరిజనులకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కే విధంగా గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూనా ఒడంబడిక జరిగింది. ఆ తర్వాతే దేశానికి స్వాతం త్య్రం సాధించడం జరిగింది. ఒప్పందాలు చట్టాలుగా అమలులోకి వచ్చి, నిజాయితీగా అమలయితే దేశంలోని వివిధ వర్గాల ప్రజలు అసమానతలు తొలగించుకుని ఐక్యంగా జీవిస్తారని గాంధీ, అంబేద్కర్ల మధ్య జరిగిన ఒప్పందం సాక్ష్యం చెప్పింది.
ఒప్పందాల మీద కలిసిన రాష్ట్రం ఆ ఒప్పందాలను అమలు చేయకపోతే తిరిగి ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం అనే డిమాండ్ వస్తుంది. అందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే సాక్ష్యం. అందువల్ల తెలంగాణలోని అణగారిన కులాలు, అగ్రకులాల మధ్య ఒక ఒప్పందం జరగడంతో పాటు ఆ ఒప్పందం తెలంగాణ, ఆంధ్ర ఒప్పందంలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అగ్రకులనాయకులదేనని ఎంఆర్‌పిఎస్ భావిస్తోంది. తెలంగాణ జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన కులాలకు రాజకీయ అధికారంలోను, సంపదలోను, విద్యా, ఉపాధి అవకాశాలలోను వారి వారి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో భాగస్వామ్యం ఉండే హక్కును గుర్తించే విధంగా, అది త్రికరణ శుద్ధిగా అమలు జరిగే విధంగా ఒప్పందం కుదరాలి.
ఇందుకు తెలంగాణ అగ్రకుల శక్తులు ముందుకు వచ్చి అణగారిన కులాల ప్రజల ఆకాంక్షలను గౌరవించటడం, గుర్తించడం చేయాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నాం. అప్పుడే తెలంగాణలోని అగ్రకులాలు, అణగారిన కులాల మధ్యన మరింత ఐక్యత ఏర్పడి, సీమాంధ్ర అగ్రకుల రాజకీయ పెట్టుబడిదారులు కల్పించే ప్రతి అడ్డంకిని తొలగించుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే అవకాశం ఉంటుందని ఎంఆర్‌పిఎస్ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే. కాని అంతకు ముందే అణగారిన కులాల భాగస్వామ్య విషయం కూడా తేల్చాల్సిందే.
- మంద కృష్ణ మాదిగ
ఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

Saturday, October 22, 2011

ఐలమ్మే మా అమ్మ - మందకృష్ణ మాదిగ Andhra Jyothi 23/10/2011


ఐలమ్మే మా అమ్మ
- మందకృష్ణ మాదిగ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది తెలంగాణ లోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అణగారిన కులాల విద్యార్థుల, యువతీ యువకులు త్యాగాలతో ప్రబలంగా మారింది. లక్ష్యాన్ని సాధించటం కోసం జరుగుతున్న యుద్ధంలో తెలంగాణలోని 90 శాతం గల బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల ప్రజలే సైనికులు. అందుకు వారు సమిధలవుతున్నారు. తెలంగాణను సచ్చైనా సాధించాలని అణగారిన కులాల విద్యార్థినీ విద్యార్థులు యువతీ యువకులు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని చూడకముందే ఈ లోకాన్ని వీడుతున్నారు.

కాని తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పే వెలమ, వెలమ దొరల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అదే తెలంగాణ సాధించే లక్ష్యం కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఈనాటికీ ఆత్మహత్యలు చేసుకునే వైపు పోలేదు. తెలంగాణ సాధించటమే ఒక లక్ష్యంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని వారి త్యాగాలు వృ«ధా కావని దొరలు అంటున్నారు. ఆ సమున్నత లక్ష్య సాధన కోసమే అణగారిన కులాల పిల్లలు చేసుకుంటున్న ఆత్మహత్యలే త్యాగాలయితే ఆ స్థాయి త్యాగాలు తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నామని చెబుతున్న వెలమ దొరల సామాజిక వర్గీయులు ఒక్కరంటే ఒక్కరు ఎందుకు త్యాగాలు చెయ్యలేకపోయారో చెప్పటానికి దొరలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. దొర కులంలోని ఎవ్వరు త్యాగాలు చేసే అవకాశం లేదు.

వారికి ఆ అవసరం కూడా లేదు. పెద్దదొర కెసిఆర్ తెలంగాణ కోసం తలనరుక్కుంటానంటాడు. కాని నరుక్కోడు. అల్లుడు హరీశ్‌రావు మీడియా ముందు పోలీసుల ముందు కిరోసిన్ చల్లుకొనే ప్రయత్నం చేయడం ద్వారా ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టుగా నటిస్తుంటాడు. కాని చేసుకోడు. ఎందుకంటే, ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్నవారెవ్వరు నూటికి 99 శాతం మీడియా ముందు, పోలీసులు ముందు చేసుకోలేదు. దొర కొడుకు, తెలంగాణ కోసం జైలు కెళ్ళటానికయినా సిద్ధమేనని ఉద్యమకారుడి స్థాయిలో ప్రకటనలిస్తుంటాడు.

అయితే తెలంగాణ కోసం ఇప్పటివరకు ఉద్యమాలు చేసి జైలుకెళ్ళిన వేలాది అణగారిన కులాల విద్యార్థులు, యువకుల్లో ప్రగల్భాలు పలికిన దొర కొడుకు ఉండడు. ఎందుకంటే దొర కొడుకు జైలు కెళ్ళితే, అసెంబ్లీ కెళ్ళే ఇంకో కుమారుడు లేడు కనుక. దొర ఒకానొక కొడుకు జైలుకెందుకెళ్ళాలి? అసెంబ్లీకే వెళ్ళాలి. జైలుకెళితే ఖైదీగా ఉండాల్సివస్తుంది. కాని అసెంబ్లీ కెళితే ప్రజాప్రతినిధిగా అనుభవం వస్తుంది. తెలంగాణ రాక ముందే ప్రజాప్రతినిధిగా అనుభవం వస్తే, తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రిగా పరిపాలించటానికి ఆ అనుభవమే పనికి వస్తుంది.

ఇక తెలంగాణలో బతుకమ్మ సంస్కృతిని బతికించాలంటే బతికించటం కోసం ప్రజలను జాగృతం చేయాలంటే దొర కూతరుకు తప్ప తెలంగాణలోని ఏ ఆడపడుచుకు ఆ అర్హతే లేదు. జాగృతం చేసే అర్హత ఇంకో అణగారిన కుల మహిళ సాధిస్తే దొరలపాలనకే చరమ గీతం పాడే మాయావతి లాగా మారుతుందేమోనని భయం పెద్ద దొరను వెంటాడుతుంది. తెలంగాణ అనే నాలుగు అక్షరాలను, తన కుటుంబంగా చేసి, తాను, కొడుకు, అల్లుడు, కూతురు నాలుగున్నర కోట్ల ప్రజలకు సెంటిమెంటు రుద్దుతున్నారు. దొరలు రాసిన సెంటుకు గుబాళించే సువాసన లేదు. కాని అణగారిన కులాలను ఆత్మహత్యలకు ప్రోత్సహించే విషపూరిత మందు ఉంది.

ఆ విషపూరిత మత్తు మందును తమ సామాజికవర్గానికి పూయరు, వారి సామాజిక వర్గానికి రాయరు. అందువల్ల వెలమ దొరల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళెవరు ఆత్మహత్యలు చేసుకోరు. ఎందుకంటే గ్రామాల్లో ఉండే వెలమ దొరలు సెంటిమెంటుకు చిత్తయ్యేవారు కాదు. వారు, బతికి వుండి గ్రామాల్లో అణగారిన వర్గాల ప్రజల మీద తెలంగాణ వచ్చినా రాకపోయినా గ్రామాల్లో పెత్తనం చేయాలనుకుంటారు తప్ప చావాలనుకోరు. ఒక లక్ష్యం కోసం త్యాగాలు చేసేవారు అణగారిన వర్గాల జనులు.

అందుకే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణను పరిపాలించటం కోసం, తెలంగాణలోని అన్ని గ్రామాల మీద పెత్తనం చేయటమే లక్ష్యంగా బతికుండాలనుకునే వారు వెలమ దొరలు. అందుకు వీరు బతికి ఉండాలి. అందుకే వీరు ప్రాణ త్యాగాలు చెయ్యరు. ఇప్పటికి ఆత్మహత్యలకు పాల్పడ్డ దాదాపు 700 మందిలో ఒక్కరు కూడా వెలమ దొరల సామాజికవర్గానికి చెందినవారు లేకపోవడమే ఇందుకు సాక్ష్యం.

ఇక ఇప్పుడు తెలంగాణ రాకముందే దొరసానుల రూపముండే ఒక బొమ్మను పెట్టి ఆమెనే తెలంగాణ తల్లిగా అణగారిన కులాల చేతనే భజన చేయించటం ప్రారంభించారు. ఈ బొమ్మనే పీడిత కులాల వారందరికి అమ్మను చేసి సెంటిమెంటు ముసుగులో పీడితకులాలపై సాంస్కృతిక, మానసిక దాడిని ప్రారంభించారు. ఇప్పటివరకు దొరలు అణగారిన కులాలపై చేసిన భౌతిక, లైంగిక దాడుల కంటే దొరసాని రూపంలో ఉండబడే బొమ్మను అణగారిన కులాలందరి మీద అమ్మగా రుద్దే సాంస్కృతిక దాడి అతిభయంకరమైంది. శాశ్వతంగా తెలంగాణలో అణగారిన కులాలను అణచివేయటానికి ఈ బొమ్మ దొరల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం కాబోతుంది.

ఈ దాడిని ఇప్పుడే ఎదుర్కోవాలని ఇప్పుడు ఎదుర్కోకపోతే ఇక ముందు ఎదుర్కోవటం దాదాపు అసాధ్యమే అవుతుందని అణగారిన కులాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రపంచంలో జీవించిన, జీవిస్తున్న ప్రతి జీవికి తల్లి ఉంటుంది. మానవుడిగా జీవించిన, జీవిస్తున్న ప్రతి వ్యక్తికి తల్లి ఉంటుంది. ప్రతి తల్లికీ పేరుంటుంది. అంతెందుకు, మన దేశంలో మూడుకోట్ల దేవుళ్ళు, దేవతలున్నారని ఒక విశ్వాసం. దేవుడికయినా, దేవతకయినా ఖచ్చితంగా పేరుంటుంది. నాకు తల్లి వుంది. నా తల్లి పేరు కొమురమ్మ. నాకు తండ్రి వున్నాడు. నా తండ్రి పేరు కొమురయ్య. నాకు జిల్లా వుంది. అది వరంగల్. నాకు ఊరుంది.

హంటర్‌రోడ్ శాయంపేట. నా స్వగ్రామంలో, గ్రామప్రజలు పూజించే దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. మా ఊర్లో శివాలయం ఉంది. అక్కడ దేవుడు శివుడు. మా ఊరిలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. అక్కడ దేవుడు ఆంజనేయుడు. మా ఊరు చెరువుకట్ట మీదకట్ట మైసమ్మ దేవత ఉంది. మా ఊర్లో పెద్ద పండుగ పోచమ్మ పండుగ. పోచమ్మ తల్లినే దేవతగా పూజించే మా ఊరిలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఘనంగా పోచమ్మ పండుగ చేస్తారు. మా ఇంట్లో ఇంటిదేవతగా ఎల్లమ్మ తల్లిని పూజించే వారు. ఈ విధంగా ప్రతివ్యక్తికి తల్లితండ్రులున్నారు. వాళ్ళకు పేర్లున్నాయి. ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు పూజించే దేవుళ్ళు, దేవతలున్నారు.

ప్రతి దేవుడికి, ప్రతి దేవతకి పేరుంది. మా ఊర్లోనే కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా. మరి ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో తెలంగాణ పేరుతో వెలుస్తున్న ఈ బొమ్మకు తల్లిదండ్రులెవరు, వారి పేర్లేంటి? సాధారణంగా, హిందువుల్లో వితంతువులే బొట్టు తీస్తారు. ఈ బొమ్మరూపంగావున్న ఈ అమ్మకు పెళ్ళి అయితే భర్త ఎవరు, ఆ భర్త పేరేంటి? ఈమె పుట్టినిల్లెక్కడ, మెట్టినిల్లెక్కడ? ఎవరైనా చెప్పగలరా? కనీసం అమ్మ అని చెబుతున్న ఈ బొమ్మకు పేరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు.

ఇది వాస్తవం. ఇక ఈ బొమ్మ రూప శిల్పి దొరే గనుక దొరసాని రూపాన్ని చాలా అందంగా చిత్రించాడు. తన దగ్గరున్న శిల్పులతో అపురూపంగా చిత్రించారు. ఆ అపురూపమైన బొమ్మకు, తలమీద ధగధగమెరిసే బంగారు కిరీటం, కొట్టొచ్చినట్టు ఆకర్షణీయంగా కనిపించే ముక్కుపుడక, చెవులకు ఒదిగివుండే గంటీలు, మెడకు కంఠాహారము, దానికింద బంగారు చైన్, నెక్‌లెస్‌లు ధరించివున్నాయి, నడుముకు వడ్డాణము, రెండు చేతులకు బంగారు కడియాలు, అబ్బో ధగధగ మెరిసే ఎర్రటి పట్టు చీర, మొత్తానికి పీడిత కులాలు కూడా మైమరిచిపోయే విధంగా అందమైన బొమ్మను తయారుచేయించి ఈమెనే మీ అమ్మ అని చెప్పి గౌరవించడం, పూజించడం దొరలు చేయమంటున్నారు.

పీడిత కులాల, మహిళల సంస్కృతి సంప్రదాయం లేని ఈ బొమ్మ అందరికి అమ్మ ఎలా అవుతుంది? తినడానికే తిండి సరిగాలేని, బతకడమే కష్టంగా జీవించే కూలీనాలీ చేసుకునే అణగారిన కులాల తల్లులకు ఒంటినిండా బంగారం, వడ్డాణాలు, కిరీటాలు, నక్లెస్‌లు వేసుకుని తిరిగే పరిస్థితే లేదు, పట్టెడన్నమే సరిగా లేని నా తల్లులకు పట్టు వస్త్రాలు ఎక్కడివి. మోసం చేసేటోళ్ళ, దగా చేసేటోళ్ళ ఇండ్లలో బంగారు నాణేలు, వజ్రాలుంటాయి. కూలి చేసుకుని బతికే మా ఇండ్లలో కడుపు నిండా మా తల్లులకు తిండేలేదు, ఒంటి మీద పట్టు చీరలెక్కడివి, ఒంటినిండా బంగారమెక్కడిది. అందుకే, మీరు పెట్టే ఈ బొమ్మ మాకు అమ్మ ఏనాటికి కాదు. ఆ బొమ్మను బజారులో పెట్టడం కంటే, మీ గడీల్లో పెట్టుకుంటే మీకే మంచిదేమో ఆలోచించుకోండి.

తెలంగాణలో కాకతీయ రాజుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమణం పొందిన మా ఆదివాసీ గిరిజన వీరవనితలైన సమ్మక్క, సారక్కలను మేము దేవతలుగా కొలుస్తున్నాము. వారి త్యాగాలు అడవులను దాటి, సరిహద్దులను దాటి దేశ వ్యాప్తమైంది. రెండున్నర సంవత్సరాలకోసారి దాదాపు కోటి మంది ఒక్క దిక్కున చేరి (మేడారం జాతర) సమ్మక్క సారక్కలను పూజించుకునే సంప్రదాయం ప్రపంచాన్నే ఆకర్షిస్తుంది. ఆ ఇద్దరూ మా ఆదివాసీ మహిళలైనందుకు మేమెంతో గర్వపడుతున్నాము. వారే మా దేవతలుగా, అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మా ఇలవేల్పులుగ మేమెప్పుడూ పూజిస్తుంటాము.

ఆ కోవలోనే దాదాపు ఆరు దశాబ్దాల క్రితం, దేశ్‌ముఖ్‌లకు, భూస్వాములకు, వారి గూండాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి, పోరాడి విజయం సాధించిన చాకలి ఐలమ్మే మా అణగారిన కులాలకు మొత్తం వివక్షకు, దోపిడీకి గురిఅవుతున్న వర్గాలకు స్ఫూర్తి. దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి, వందలాది గ్రామాల్లో అణగారిన కులాల మహిళల్ని, ప్రజల్ని నిరంతరం వేధించే కిరాతకుడు. జనగామ తాలూకాలో విసునూరు రామచంద్రారెడ్డి తదితర భూస్వాములు సంఘంలో ఉన్నారనే నెపంతో ప్రజలపై తప్పుడు కేసులు బనాయించడం, హింసలకు గురిచేయడం పరిపాటిగా మారింది.

విసునూరు రామచంద్రారెడ్డి పరిపాలించే గ్రామంలో ఒకటైన జనగామ తాలూకా పాలకుర్తిలో సంఘాన్ని బలపరిచే దృఢ సంకల్పం గల చాకలి ఐలమ్మ అంటే కిరాతకుడైన రామచంద్రారెడ్డికి కన్నెర్రయింది. ఐలమ్మ పొలాన్ని స్వాధీనం చేసుకోటానికి పొలంలో ఉన్న పంటను కోయించుకెళ్ళటానికి వందలాది గుండాలను పంపించాడు. దేశ్‌ముఖ్‌కి అండగా వచ్చిన వందలాది గూండాలను ఎదుర్కొని చితకతన్ని, వారు పారిపోయేటట్లు చేయడంలో వీరోచితంగా పోరాడింది ఐలమ్మ. పంటను గాని, భూమిని గాని దొరలు, పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోవటానికి తమ భూమిని, తమ పంటను సంరక్షించుకోవటానికి ఐలమ్మ చేసిన పోరాటం ఆనాడు విజయవంతం అయింది.

పేరు మోసిన కిరాతకుడైన దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిపై చాకలి ఐలమ్మ సాధించిన ఈ విజయం మొత్తం తెలంగాణ పీడిత కులాల ప్రజల్ని ఉత్తేజపరిచింది, ధైర్యాన్నిచ్చింది. ఈనాటి దొరలు అవలంబిస్తున్న కుట్రలు కుతంత్రాల నుండి మా అణగారిన వర్గాలను రక్షించుకోటానికి సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని చెలాయించాలనుకున్న దొరల ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే పీడిత కులాలందరికీ చాకలి ఐలమ్మే ఆదర్శం. కులాలకు అన్ని రంగాల్లో న్యాయబద్ధంగా దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకునే మా పోరాటంలో అడ్డొచ్చే ఈనాటి దొరలను, దొరలకు వత్తాసు పలికే దళారులను మా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ఎదుర్కొంటాం. న్యాయమైన పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఐలమ్మను మా తెలంగాణ తల్లిగా, ఆ తల్లి విగ్రహాలను తెలంగాణ మొత్తం పెడతాం. మాకు ఐలమ్మే తెలంగాణ తల్లి. అంతేకానీ దొరలు పెట్టిన ఈ బొమ్మ మాకెన్నటికీ తల్లి కానే కాదు.

- మందకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

Thursday, October 13, 2011

తొలి ముఖ్యమంత్రిగా కొండా లక్ష్మణ్ By మందకృష్ణ మాదిగ Andhra Jyothi Dated 13/10/2011

తొలి ముఖ్యమంత్రిగా కొండా లక్ష్మణ్
- మందకృష్ణ మాదిగ

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కమిటీ సమావేశం సెప్టెంబర్ 30న ఖమ్మంలోని అంబేద్కర్‌హాల్‌లో జరిగింది. రాష్ట్ర కమిటీలోని మూడు ప్రాంతాల సీనియర్ నాయకులు, ప్రాంతీయ ఇన్‌చార్జ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో సామాజిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణలో ఎమ్మార్పీయస్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని, తెలంగాణలోని 90 శాతం గల బిసి, యస్‌సి, యస్‌టి, మైనారిటీ వర్గాలను సామాజిక తెలంగాణకు అనుకూలంగా పెద్దఎత్తున సమీకరించాలని తీర్మానించడం జరిగింది.

సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఈ వర్గాలను సంఘటితంచేయడంలో భాగంగా చైతన్యం చేయడానికి అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రెండు నెలల పాటు ప్రతి రోజు రెండు నియోజకవర్గాలలో సామాజిక తెలంగాణ సాధనకై, పెద్ద ఎత్తున సభలను నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. మరో తీర్మానంలో తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బడుగు, బలహీన వర్గాల నాయకుడు త్యాగం, పోరాటం, సాహసం, పట్టుదల, అంకిత భావం ఉద్యమ స్ఫూర్తితో బాటు పాలనా దక్షత గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీనే నియమించాలని ఎమ్మార్పీయస్ తీర్మానించింది.

తెలంగాణ రాష్ట్రసాధనకై జరుగుతున్న ఉద్యమంలో త్యాగపూరితమైన పాత్ర పోషిస్తున్న ఈ అణగారిన వర్గాలు వచ్చే తెలంగాణలో సామాజికన్యాయం అమలుజరిగే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు ఆర్థిక, సామాజిక, విద్య -ఉపాధి, రాజకీయ తదితర రంగాలలో తీసుకోవాలని అనుకుంటే అందుకు ముఖ్యమంత్రిగా బాపూజీ నిజమైన అర్హుడని ఎమ్మా ర్పీయస్ సంపూర్ణంగా విశ్వసిస్తుం ది. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని అమలు చేయించుకునే దిశగా బాపూజీని ముఖ్యమంత్రిగా నియమించడానికి ఎమ్మార్పీయస్ ముందు వరుసలో నిలబడి పీడిత కులాలన్నింటినీ కూడగడుతుంది.

బాపూజీని ముఖ్యమంత్రిగా నియమించడానికి బలమైన అండదండలు అందిస్తుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులను ఒక తాటి మీదకి తీసుకొచ్చే విషయంలో కూడా ఎమ్మార్పీయస్ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే విషయంలో తెలంగాణ ప్రజల, వివిధ వర్గాల సమూహాల మధ్య ఏకాభిప్రాయం వుంది. అందులో రెండో మాటే లేదు. అంతే కాకుండ సీమాంధ్ర ప్రాం తాలలో కూడ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్న దళిత, బలహీనవర్గాలు, విద్యావంతులు, మేధావులలో తెలంగాణ ఏర్పాటు పట్ల సానుకూలత వుంది.

తెలంగాణ ఏర్పాటు పట్ల సీమాంధ్రలో ఉండే సానుకూలతను కూడగట్టే విషయంలో కూడా ఎమ్మార్పీయస్ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి బాపూజీని ప్రథమ ముఖ్యమంత్రిని చేయడం వల్ల ఆయనలో ఉన్న సామాజిక దృక్పథం, సామాజిక తెలంగాణకు దారితీస్తుంది. దొరల తెలంగాణకు సీమాంధ్రలోని పీడిత కులాలలో సహజంగా ఉండే వ్యతిరేకత కనుమరుగై సామాజిక తెలంగాణకు మరింత మద్దతు సీమాంధ్ర పీడిత కులాల నుంచి దొరుకుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తెలంగాణప్రజల్లో ఏకాభిప్రాయం ఉన్నది. తెలంగాణేతర ప్రజల్లో కూడా సానుభూతి ఉన్నది. అయినా తెలంగాణ ఏర్పడ్డ తరువాత అది దొరల చేతికి పోతుందేమో అనే భయం, తద్వారా దొరల పాలనలో మరింత అణచివేతకు, వివక్షకు గురవుతామనే ఆందోళన తెలంగాణ జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలకు ఉంది. నిజాం పరిపాలనను అడ్డం పెట్టుకొని భూస్వాములుగా, జమిందారులుగా, జాగీర్దారులుగా ఎదిగిన వెలమ, రెడ్డి దొరలు సామంతరాజులుగా గడీల ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను వారి వారి పరిధిలోని వందలాది గ్రామాలను ఆయా గ్రామాల్లో పీడిత కులాల ప్రజలను నిట్టనిలువున దోపిడీ చేశారు.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఇంగ్లీషు వాళ్ళ పరిపాలనలో వున్న భూభాగంలో పేదవాడు ఏ పనిచేసినా కనీస వేతనాలు అమలు జరగడం వల్లనే పీడిత కులాలు కొంత ఆర్థికంగా పుంజుకోవడం జరిగింది. తెలంగాణలోని ఈ వెలమ, రెడ్డి దొరలు పీడిత కులాల వారందరి చేత వెట్టిచేయించుకున్న చరిత్ర వుంది. తెలంగాణ అవతలి ప్రాంతంలో బ్రిటిష్ పాలనలో దళితులు, పీడితకులాలు చదువు నేర్చుకోవడానికి మార్గం ఏర్పడితే తెలంగాణలో ఈ దొరలు తమ బిడ్డలను ప్రాథమిక, మాధ్యమిక చదువులకు పక్క రాష్ట్రాలకు పంపి ఇంగ్లీషు చదువులు నేర్పించి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు.

దళితులు, పీడిత కులాల ప్రజలు చదువు నేర్చుకోవాలని ఆలోచిస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పడకుండ ఈ దొరలు అడ్డు పడింది వాస్తవం కాదా? అంతే కాకుండ మీ పిల్లలను బళ్ళోకి పంపితే మాకు ఎట్టి చేసేటోడు ఎవడ్రా అని దౌర్జన్యాలు చేసిన సంఘటనలు కోకొల్లలే కదా? గడీల ముందు దొరలు ఎదురయినప్పుడు తన కాళ్ళ చెప్పులను తన సంకలో పెట్టుకొని తలదించుకొని దొరలకు వంగి వంగి దండం పెట్టే పరిస్థితే గతంలో కొనసాగిన విషయం మేం మరచిపోలేం. తెలంగాణలోని దొరల అణచివేత, పీడనకు వ్యతిరేకంగా పీడిత కులాలు తమ ప్రాణాలను అడ్డంపెట్టి ఎదురు తిరిగిన సందర్భాలున్నాయి.

ఆ సందర్భమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కావటానికి దారితీసింది. ఎట్టికి వ్యతిరేకంగా, తెలంగాణ దొరల, భూస్వాముల అహంకారానికి వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటంలో 1946 నుంచి 1951 వరకు దాదాపు 6 వేల మంది అణగారిన వర్గాల వారు అసువులు బాశారు. సాయుధ పోరాటానికి, ప్రజల తిరుగుబాటుకు భయపడ్డ దొరలు ఊర్లను, గడీలను వదలి పట్నం చేరారు. సాయుధ పోరాట విరమణ అనంతరం ఆ దొరలు, భూస్వాములే తిరిగి కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని, ఆ పార్టీలో చేరి కాంగ్రెస్ కండువాలు టోపీలు ధరించి గ్రామాలు చేరి ప్రజల మీద పెత్తనం చేయడం ప్రారంభించారు.

ఆ విధంగా దొరల పెత్తనం తిరిగి అన్ని అణగారిన వర్గాలను దౌర్జన్యంగ తమ ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం జరిగింది. దొరల పెత్తనాన్ని ప్రశ్నించిన వాళ్ళను హింసలకు గురిచేయటం పీడితకులాల మహిళల మీద దొరల అన్ని రకాల అకృత్యాలు పెరగడం సర్వసాధారణమయింది. ఆ పరిస్థితుల్లోనే మళ్ళీ దొరలకు వ్యతిరేకంగా పీడిత కులాల హక్కుల, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మొదలైన ఉద్యమమే నక్సలైట్ ఉద్యమానికి దారి తీసింది.

పీడిత కులాల ఆగ్రహం నక్సలైట్ ఉద్యమం మరింత బలపడడానికే దారి తీసింది. పీడిత కులాల ప్రజల ప్రతిఘటన వల్ల కొంత మంది దొరలు ప్రజల ఆగ్రహానికి గురై హతం కావడంతో మిగిలిన దొరలు మళ్ళీ పట్నాలకు చేరారు. ఆనాడు సాయుధ పోరాటానికి భయపడి పట్నాలకు చేరిన దొరలు (1946-51), సాయుధపోరాటం విరమణ అనంతరం కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకొని తిరిగి పల్లెలకు చేరినట్టుగానే, మూడు నాలుగు దశాబ్దాల క్రితం నక్సలైట్ ఉద్యమానికి భయపడి పట్నాల దారి పట్టిన దొరలే టిఆర్ఎస్ ఏర్పడ్డ గత దశాబ్దం నుంచి తెలంగాణ సెంటిమెంటు ముసుగులో గ్రామాలకు చేరి టిఆర్ఎస్, జెఎసిల పేరుతో గ్రామీణ ప్రజల మీద తమ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇది వాస్తవం.

పీడితకులాల పోరాట స్ఫూర్తి, త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఆ ఏర్పడ్డ తెలంగాణ పరిపాలన టిఆర్ఎస్ ముసుగులో జెఎసి పేరుతో వెలమ, రెడ్ల చేతికే అధికారం పోతే ఇక అణగారిన వర్గాల జీవితాలు మళ్ళీ అధోగతి పాలే. ఈ భయం తెలంగాణ లోని అన్ని అణగారిన వర్గాల ప్రజలను వేధిస్తుంది. దీనికి పరిష్కార మార్గమే కొండా లక్ష్మణ్ బాపూజీని ముఖ్యమంత్రిగా చేయడం. తద్వారా సామాజిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారి తీస్తుందని ఎమ్మార్పీయస్ భావిస్తుంది. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని దొరలు నమ్మించవచ్చు. దొరల మాటలు నమ్మేంత అమాయకులు ఇప్పుడు ఎవరూ లేరు.

ఎందుకంటే టిఆర్ఎస్ ఏర్పడ్డ ఈ పదేళ్ళ కాలంలో తెలంగాణలోని పది జిల్లాల్లో ఈ నాటికీ ఏ జిల్లాకు ఒక్క దళితుణ్ణి టిఆర్ఎస్ అధ్యక్షుణ్ణి చేయలేదు. లక్షలాది మందితో జరుగుతున్న బహిరంగ సభల వేదిక మీద ఒక దళిత నేతనూ ముందు వరసన తమ పక్కన కూర్చో బెట్టుకున్న సందర్భం మచ్చుకైనా లేదు. టిఆర్ఎస్ అధినాయకత్వం ఆయా సందర్భాల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో గాని వివి ధ జాతీయ రాజకీయపక్షాల నేతలతో గాని చర్చలు జరపటానికి వెళ్ళి న సందర్భాలలో ఒక్క దళిత నాయకుణ్ణి కూడా వెంటతీసుకెళ్ళిన సంద ర్భం లేదు.

ఇక పోతే 97 ఏళ్ళ వయస్సుగల కొండా లక్ష్మణ్ బాపూజీనే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎందుకు కోరుకుంటున్నారనే ప్రశ్న కొంత ఉదయించక తప్పదు. ఎమ్మార్పీయస్ ఆయనలో రెండు నిర్దిష్టమైన లక్షణాలను గమనించింది. (అ) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత; (ఆ) అణగారిన కులాల ప్రజలు పడుతున్న బాధలను తొలగించే విషయంలో వారికి దక్కవలసిన న్యాయమైన హక్కులను అందించే విషయంలో ఆయన పీడిత కులాల పక్షపాతిగా గతంలో నిలబడ్డారు. ఇక ముందు కూడ ఆయన సామాజిక న్యాయాన్ని కోరే శక్తులను ప్రోత్సహించే విషయంలో మరింత క్రియాశీలమైన పాత్ర వహిస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.

కొండా లక్ష్మణ్ బాపూజీ గారినే ఎమ్మార్పీయస్ ప్రథమ ముఖ్యమంత్రిగా కోరుకోవడానికి ఆయనలోవున్న ఈక్రింది పది లక్షణాలు కారణాలని మేం స్పష్టం చేస్తున్నాం. తాను స్వాతంత్య్ర సమరయోధుడిగా జైలు జీవితాన్ని గడిపిన మొదటి తరం యోధుడు; నైజాం స్టేట్ భారతదేశంలో విలీనమయ్యేందుకు ఎన్నోకష్టాలకు ఓర్చి ఉద్యమాన్ని నిర్వహించిన ధీశాలి; 1959లో తమ స్వగృహమైన జలదృశ్యంలో దేశంలోనే ప్రథమ దళిత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన దళిత దీన జనుల పక్షపాతి;

1969లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కిరాతకంగా అణచివేస్తున్న సందర్భంలో ఉద్యమానికి అండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా తన క్యాబినెట్ మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మొట్ట మొదటి త్యాగశీలి; తన జలదృశ్యాన్ని (తన ఇంటిని) అణగారిన కులాల సామాజిక ఉద్యమాలకు, తెలంగాణ ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమాలకి, సంఘాలకి, పార్టీలకు గొడుగుగా మార్చిన పెద్ద మనసున్న పెద్ద మనిషి;

తన సామాజిక వర్గమైన చేనేత సహకార సంఘానికే కాకుండా మాదిగ చర్మకార పరిశ్రమ అభివృద్ధికి 1960లోనే నాయుడమ్మ కమిషన్‌ను నియమించిన మాదిగ బంధువు. ఈ రోజువున్న బలహీన వర్గాల ప్రతి వృత్తి కులసంఘాలయిన గీత, మత్స్య, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకార, రజక, మేదరి తదితర కులవృత్తి సంఘాలను నెలకొల్పడానికి మనసావాచా ప్రోత్సహించిన పీడిత కులాల పక్షపాతి; టి.ఆర్.యస్ ఆవిర్భావానికి తన ఇల్లు (జలదృశ్యం) ఇచ్చి ఆనాటి ముఖ్యమంత్రి కోపానికి గురై ఇంటినే పోగొట్టుకున్న నిఖార్సయిన తెలంగాణ స్ఫూర్తిదాత;

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి డిప్యూటీ స్పీకరై, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా వుండి ఇప్పుడు సొంత ఇల్లులేని నిస్వార్థ ప్రజాసేవకుడు; 97 ఏళ్ళ వయస్సు వచ్చినా ఇప్పటికీ ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణం కట్టుకొని తెలంగాణ వాదులందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రమజీవి; తన సుదీర్ఘ ప్రజారాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తెలంగాణ విషయంలో గాని పీడితకులాలకు సామాజిక న్యాయం సాధించే విషయంలో గాని రాజీపడకుండా ధృడ సంకల్పంతో తను నమ్ముకున్న ఆశయ సాధన కోసం పట్టువదలని విక్రమార్కుడిలాగ ప్రయాణిస్తున్న బాటసారి.

- మందకృష్ణ మాదిగ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

Monday, September 12, 2011

దోచుకునేకాడ దొరలంతా ఒక్కటే - మంద కృష్ణ మాదిగ Andhra Jyothi 13/09/2011



దోచుకునేకాడ దొరలంతా ఒక్కటే

- మంద కృష్ణ మాదిగ

వందల సంవత్సరాలు స్వతంత్ర రాజ్యంగా పిలువబడ్డ హైదరాబాద్ గత శతాబ్దిలో కొన్నేళ్ళు హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగింది. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణలోని అగ్రవర్ణ భూస్వాములు, సీమాంధ్ర అగ్రవర్ణ భూస్వాములతో మిలాఖతై చేసిన ద్రోహం వల్ల తెలంగాణ ఆంధ్రలో విలీనమయింది; 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ జనాభాలో 85 శాతంగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు రావలసిన న్యాయమైన వాటా ఏ రంగంలోనూ దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన మొదలు నేటివరకు ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన వారిలో దామోదరం సంజీవయ్య పాలన రెండేళ్ళు మినహాయిస్తే గత యాభై మూడేళ్ళ పరిపాలన మొత్తం అగ్రవర్ణాల నేతృత్వంలోనే సాగింది. అధికారం అగ్రవర్ణాల చేతిలో ఉండడం వల్ల రాష్ట్ర జనాభాలో 85 శాతంగా ఉన్న అణగారిన వర్గాలు అన్ని రంగాల్లో వివక్షకు, దోపిడీకి గురయ్యారు.

మొత్తం పరిపాలనలో మూ డు ప్రాంతాల నుంచి కూడా, ముఖ్యమంత్రులుగా అధికారం చెలా యించిన వారూ అగ్రవర్ణాల వారైతే, మూడు ప్రాంతాల అణగారిన వర్గాల వారికి అధికారం అందకుండా పూర్తిగా వెనక్కి నెట్టారు. 'దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు - మూడు ప్రాంతాల అగ్రవర్ణాలు అధికారాన్ని పంచుకున్నారు'. ముఖ్యమంత్రులైన వారే కాకుండా మంత్రుల సంఖ్య చూసినా ఎమ్మెల్యే, ఎంపీల సంఖ్యలను చూసినా శాసనసభ స్పీకర్ల సంఖ్య చూసినా అగ్రవర్ణాల ఆధిపత్యం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది.

రాజకీయ అధికారం చేతిలో పెట్టుకొని పరిపాలనా యంత్రాంగాన్ని వారి వర్గాలతో నింపుకొని ఆంధ్రప్రదేశ్‌ను కొల్లగొట్టి దోచుకొంటున్నారు. కొల్లగొట్టబడిన దోపిడీ సొమ్ములో పంచుకునే వాటాలలో తేడా ఉండవచ్చు. ఆ తేడా వచ్చిన సందర్భాల్లో వారిలో అభిప్రాయ బేధాలు పొడచూపవచ్చు. ఆ అభిప్రాయ భేదాలను ప్రాంతీయ వివక్ష కోణంగా సమాజానికి చూపెట్ట వచ్చు. ఆ పేరుతో వారి వారి ప్రాంతాల ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టే జై ఆంధ్రా, జై తెలంగాణ లాంటి ఉద్యమాలు గతంలో రావచ్చు.

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ఆధిపత్యానికై అగ్రకులాల వారు, రాష్ట్ర సాధన ముసుగులో తెలంగాణ ప్రజలందరి పక్షాన పోరాడినట్లు కనిపించవచ్చు. తెలంగాణ భౌతిక వనరులను కొల్లగొట్టి మూడు ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని య«థేచ్ఛగా తమ దోపిడీని కొనసాగించడం కోసం రాయలసీమ, ఆంధ్ర అగ్రవర్ణాల పెట్టుబడిదార్లు మాత్రమే సమైక్యాంధ్రను కోరుతున్నట్టు బయటికి కనిపించవచ్చు. అంతిమంగా మూడు ప్రాంతాల అగ్రవర్ణాల వారి లక్ష్యం దోపిడీ సొత్తును పంచుకోవడానికి తమ రాజకీయ ఆధిపత్యాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి మాత్రమే అని స్పష్టమవుతుంది.

ఈ 53 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు విద్యా, ఉద్యోగ రంగాలలో ఉన్న రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు చేయకుండా అగ్రకుల రాజకీయ నాయకులు, అగ్రకుల అధికారులు, నిరంతరం అడ్డుతగిలారు, తగులుతున్నారు. రిజేర్వేషన్ల అమలును పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ అణగారిన వర్గాలకు సంక్షేమ నిధులు కేటాయించవలసింది 85 శాతం అయితే 15 శాతం కూడా కేటాయించడం లేదు. కేటాయించడం 15 శాతం అయినా కేటాయించిన మొత్తం బడ్జెట్‌ను ఖర్చుపెట్టకుండా ఈ వర్గాలకు రావలసిన ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను కూడా ఇతర వర్గాల ప్రయోజనాల కోసం దారి మళ్ళిస్తున్నారు.

మరోవైపు ఈ అణగారిన వర్గాల 'ఆత్మగౌరవాన్ని' దెబ్బతీసే విధంగా అగ్రవర్ణాల వారు తమకున్న అధికార బలంతో దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు; 55ఏళ్ళలో అనేక హత్యలు, హత్యాచారాలకు పాల్పడుతు వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే '55 సంవత్సరాల సమైక్యాంధ్ర పరిపాలన మొత్తం మూడు ప్రాంతాల అగ్రవర్ణాల భూస్వాముల ఆధిపత్య పరిపాలనే' జాతీయోద్యమ కాలంలో డాక్టర్ అంబేద్కర్ పోరాడి సాధించిన చట్టసభల ప్రాతినిధ్యం ఎస్‌సి, ఎస్‌టిలకు దక్కింది.

ఈ ఇరువర్గాలకు కేటాయించిన రిజర్వుడు స్థానాలను మినహాయించి మూడు ప్రాంతాలలోని జనరల్ స్థానాలలో అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతుంది. మొత్తం స్థానాల్లో దక్కాల్సిన 50 శాతం ప్రాతినిధ్యం బిసి వర్గాలకు దక్కలేదు. మొత్తం స్థానాలలో దక్కాల్సిన 12 శాతం రాజకీయ ప్రాతినిధ్యం మైనార్టీలకు దక్కలేదు. బిసి, మైనార్టీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కకుండా పోవడానికి రాజకీయంగా బిసి మైనార్టీలను వెనక్కినెట్టి వేయడానికి అగ్రవర్ణాలే కారణం. ఇది వాస్తవం.

తెలంగాణలో 62 శాతం రాజకీయ వాటా బిసి, మైనార్టీలకు దక్కాల్సివుండగా కేవలం పది శాతంగా ఉన్న మూడు అగ్రవర్ణాల వారు దోచుకొని పంచుకుకొంటున్నారు. అదే విధంగా కోస్తాంధ్రలో బిసి మైనార్టీలకు దక్కాల్సిన రాజకీయ వాటా రెండు లేదా మూడు అగ్రకులాల వారే పంచుకొంటున్నారు. ఇక రాయలసీమలో కూడా బిసి, మైనార్టీలకు దక్కాల్సిన వాటాను రెండు అగ్రకులాలే పంచుకొంటున్నాయి. మూడు ప్రాంతాల అగ్రకులాలు దోపిడీ మనస్తత్వంతోనే ఉన్నాయని స్పష్టంగా తేలింది.

ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సాధనకై జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహిస్తున్న అగ్రకులాలు, తెలంగాణ వస్తే బిసి, మైనార్టీల వాటా ముందే అంగీకరించకపోతే, రేపు ఏర్పడబోయే తెలంగాణలో కూడా అగ్రకులాల వారు తమ రాజకీయదోపిడీని కొనసాగిస్తారు. ఆ రాజకీయ దోపిడీని కొనసాగిస్తే వచ్చేది మాత్రం 'దొరల రాజ్యమే'. బిసి మైనార్టీలు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంలో నష్టపోయిన విధానమే సమైక్యాంధ్ర రాష్ట్రంలో కూడా ఈనాటికీ తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతుంది.

ఇందుకు ఉదాహరణగా హైదరాబాద్‌లో 1952లో జరిగిన ఎన్నికలలో వివిధ సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉందో గమనించి, యాభై ఏళ్ళ తర్వాత కూడా పరిస్థితులలో పెద్దమార్పు ఏమీలేదని 2009 ఎన్నికలలో సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. అదే విధంగా సీమాంధ్ర ప్రాంతంలో కూడా గత 56 ఏళ్ళలో ఆనాటి, ఈనాటి వాస్తవ సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని చూడండి: పట్టికలో పేర్కొన్న జనరల్ స్థానాలలో వివిధ సామాజిక వర్గాల వారి ప్రాతినిధ్యాన్ని గమనిస్తే మూడు ప్రాంతాల్లో మొదటి ఎన్నికల నుంచి ఇప్పటివరకు రెండు లేదా మూడు జిల్లాలను మినహాయిస్తే రాష్ట్రం మొత్తం మీద 10 లేక 15 శాతంగా ఉన్న అగ్రకులాల వారి రాజకీయ ఆధిపత్యమే కొనసాగుతుంది.

తెలంగాణ కోరే అగ్ర వర్ణాల దొరలు రేపటి తెలంగాణలో బిసి, మైనార్టీల వారి వాటా తేల్చగలరా? సమైక్యాంధ్రనే కోరే అగ్రవర్ణాలు రాయలసీమ, కోస్తాంధ్రలోని బిసి మైనార్టీల రాజకీయపరమైన వాటాను ఇప్పటికైనా ఇవ్వగలరా? మాకు రావలసిన వాటా మాకు ఇవ్వకుండా మేమెందుకు మీ నాయకత్వాన్ని అంగీకరించాలి? తెలంగాణ కావాలని కోరుతున్న అగ్రవర్ణ నాయకులారా, వచ్చే తెలంగాణలో మా వాటా ఎంతో తేల్చకుండా మీ నాయకత్వాన్ని మేమెందుకు అంగీకరించాలి? తెలంగాణలోనైనా, సీమాంధ్రలోనైనా అణగారిన ప్రజలు అందరూ సమైక్యమై తమ తమ ప్రాంతాలలోని అగ్ర వర్ణాల నాయకత్వాన్ని ప్రశ్నించే స్థితికి ఎదగాలని, గుడ్డిగా ఎక్కడైనా వారి నాయకత్వాన్ని అంగీకరించకూడదని పిలుపునిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలకు చెందిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించాలి; స్వాగతించాలి. అయితే తెలంగాణ లోనైనా, సీమాంధ్రలోనైనా దొరల, అగ్రవర్ణాల పెట్టుబడిదారుల ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ సామాజిక తెలంగాణను, సామాజిక సీమాంధ్రలను సాధించాల్సిందే. ఆ లక్ష్య సాధనకై ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు చెందిన మూడుప్రాంతాల ప్రజలు సంఘటితం కావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. తెలంగాణ, సీమాంధ్ర అగ్రవర్ణ రాజకీయ నాయకులకు మధ్య కుటుంబపరమైన, వ్యాపారపరమైన సంబంధాలు ఇప్పటికీ కొనసాగతూనే ఉన్నాయి. దోచుకున్న సంపద పంచుకునేకాడ వారి మధ్య వచ్చిన ఘర్షణే తప్ప, దోచుకునేకాడ దొరలంతా ఒక్కటే!

- మంద కృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

Sunday, September 4, 2011

ఆహార హింస! కృపాకర్ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి 4/5/2011 Andhra Jyothi




మేంకొమ్ము మాదిగలం. ఎద్దుకొమ్ము బూరల్లోంచి సమరనాదాన్ని పుట్టించి సమాజాలను మేల్కొలిపినోళ్ళం. మేం డప్పులు కొట్టే మాదిగలం. పశువుల చర్మాలతో తప్పెట పలకల్ని తయారుచేసి మీ దేవతల ఉత్సవ విగ్రహాలకి ఊపుని, తూగుని, ఉత్సాహాన్ని పుట్టించినోళ్ళం. మేం తోలు పని మాదిగలం. చర్మాల చెప్పులు తొడిగి రాళ్ళు, రప్పలు, తుప్పలు, ముళ్ళు, కొండలు, కోనలు కీకారణ్యాలలోకి మానవాళిని నడిపించినోళ్ళం. మేం పశువులు కాసే మాదిగలం. చిన్న చేతిపుల్ల వాటంతో జంగిలి గొడ్లని, ఆలమందల్ని మలేసి నిలేసి, మచ్చిక చేసుకుని, నడిపించి నోళ్ళం. చేనుల్లో, చెలకల్లో గొడ్లతో చెరి సమానంగా శ్రమచేసినోళ్ళం. మాకు ఇష్టమైనదీ, బలవర్ధకమైనదీగా భావించే ఆహారం గొడ్డు మాంసం.

మేం మాదిగలం, మాలలం. ఆదివాసులం. వెనకబడిన తరగతులం. సంచార, అర్ధ సంచారజాతులం. సబ్బండలం. మేం క్రైస్తవులం. ముస్లింలం. బౌద్ధులం. వెరసి మేమంతా బహుజనులం. మాంసం మాకిష్టపూర్వకమైన ఆహారం. మాలో కొందరం గొడ్లు, ఎడ్లు, గోవులు, దూడలు మొదలగు పశుమాంసం తింటాం. వారి వారి ఇష్టాలను బట్టి మాలో కొందరు మేకలు, గొర్రెల మాంసం తింటారు. కొందరికి పంది మాంసం, కొందరికి గాడిద మాంసం, కొందరికి కాకి, ఎలుక, పిల్లి, పిట్ట మాంసాలంటే ఇష్టం. ముడుసు, మూలిగె, ఈరిగ, దొబ్బ, కార్జం, గుండె, శేరు, వృషణాలు, నాల్క, మెదడు, పేగులు, చెవులు, సల్ల, నల్ల బట్టి వరకు వారి వారి ఇష్టాల మేరకు, అందుబాటు మేరకు ఇవన్నీ మా వాళ్ళకు ఆహారంగా ఉపయోగపడతాయి.

మాంసాహారం తినే హక్కు బహుజనులకు ఉన్నట్టే, ఇష్టంలేని వారికి తినకుండా ఉండే హక్కు ఉన్నది. ఈ హక్కును మాంసాహారులైన బహుజనులు ఎప్పుడూ అగౌరవపరచ లేదు. మాంసం తీసుకెళ్ళి బలవంతంగా శాకాహారుల కంచాల్లోనో, నోళ్ళలోనో పెట్టే ప్రయత్నాలూ బహుజనులు చెయ్యలేదు. ఐతే, కొంత మంది శాకాహారులు ఇందుకు భిన్నంగా, శాకాహారం ద్వారానే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని, గో వధను నిషేధించాలని, ఆవును పవిత్రమైన జంతువుగా పరిగణిస్తూ చట్టాలు తేవాలని ప్రచారం చేస్తున్నారు.

డిమాండు చేస్తున్నారు. ఇలాంటి అశాస్త్రీయ, అప్రజాస్వామిక, చాందస వాదనలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మెజారిటీ బహుజనుల సాంఘిక స్థితిగతులను 'హీనం'గా చూస్తున్నట్లు గానే వారి ఆహారపు అలవాట్లను కూడా అగ్రవర్ణాల వారు హీనంగా చిత్రీకరిస్తున్నారు. కొన్నికుల హిందూ సంస్థలు ఈ శాకాహార బ్రాహ్మణ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీని ద్వారా బహుజనులపై ఫుడ్ ఫాసిజాన్ని (ఆహార హింస)ను అమలు జరుపుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో గత నెల 30 వ తేదీరాత్రి జరిగిన సంఘటన ఇందుకు ఒక ప్రబల నిదర్శనం. ఎద్దు మాంసం పండగ (బీఫ్ ఫెస్టివల్) సందర్భంగా ఇఫ్లూలో బహుజన విద్యార్థులు ఎద్దు మాంసం తెచ్చి కూర వండుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు ఆగంతకులు మూకుమ్మడిగా వచ్చి, వండుతున్న విద్యార్థులను రాళ్ళతో తరిమికొట్టి, ఉడుకుతున్న ఎద్దు మాంసం కుండల్లో మూత్రం పోసి, ఆ కుండల్ని నేలపై దొర్లించివేశారు. ఈ సంఘటన గురించి తెలిసి దుఃఖమూ, కోపమూ కలిగాయి.

బహుజన విద్యార్థులు తమకిష్టమైన ఎద్దు మాంసం కూర వండుకోవటం దాడిచేసిన వారి మనోభావాలను గాయపరిచిందట! హవ్వ! ఎంత తెంపరితనం! ఏమిటీ సాంస్కృతిక దాష్టీకం? దాడిచేసినవారు పర ఆహార సహనాన్ని ఎందుకు కోల్పోయారు? తమకు ఇష్టం లేని లేదా ఇతరులు తినే మాంసాహారంపై మూత్రం పోసి, నేల పాలు చెయ్యటం వెనకున్న సాంస్కృతిక, సాంఘిక, తాత్విక ద్వేషాలు ఎప్పటివి? ఎంత బలమైనవి?

ఎంత అమానుషమైనవో ప్రజలు ఈ సందర్భంలో చర్చించాలి. వండుతున్న మాంసాహారాన్ని వొలకబోసి, ధ్వంసం చెయ్యటం మాంసాహారాన్ని తినేవారి మనోభావాలను గాయపరచటమేనని దాడిచేసినవారికి తెలియదా? ఇష్టమైన కూర వండుకు తినే స్వేచ్ఛ కూడా దళిత బహుజనులకు లేదా? మాకిష్టమైన చియ్యల కూర మేం తినడం పైన కూడా నిషేధాలేనా? దాడులేనా? అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారే! ఏమిటీ వికృతం?

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూడా 1996 నుంచి దళిత స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీఫ్ ఫెస్టివల్‌ను ఏటా నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ 'సుకూన్'లో భాగంగా జరిగిన బీఫ్ ఫెస్టివల్‌ను కొందరు కులోన్మాదులు వ్యతిరేకించారు. కానీ ఇఫ్లూలో లాగ అనాగరికమైన రూపంలో కాదు.

ఇఫ్లూలో జరిగిన దాడిలో అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులతో పాటు బీసీ విద్యార్థులూ ముందుండటం కలవరం కలిగించే విషయం. బీసీలు మేక, గొర్రె, కోడి మాంసాలను తింటారు. గొడ్డు మాంసం అంటే బీసీల దృష్టిలో మాదిగలు, మాలలు, అంటరాని కులాల వారు తినేదని. ఇదే భావన ఆధిపత్య కులాల మాంసాహారులకు ఉంది. దురదృష్టవశాత్తూ కొంతమంది బీసీలు బ్రాహ్మణీకాలను అనుకరిస్తున్నారు. అనుసరిస్తున్నారు. అసాంఘీకరణం చెందుతున్నారు. తమ సాటి మనుషులైన దళితుల మీదనే ఆధిపత్య కుల సంస్కృతిని చలాయించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆహార నియమాల వెనక కులం ఉంది; మతం ఉంది. మాంసాహారాన్ని వ్యతిరేకించే వారి వెనక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవస్థీకృతమైన బ్రాహ్మణీయ సాంస్కృతిక రాజకీయాలున్నాయి. మాంసాహారులైన బహుజనులను కించపరిచే ఉద్దేశాలు ఉన్నాయి. చరిత్రలో కాయకసరులు, కందగడ్డలు కూడా దొరకని రోజులను మా జాతులు చూశాయి. ఉంగిడి తగిలి, లేదా రోగంతో అప్పుడే చనిపోయిన పశువుల, జీవాల మాంసాన్ని తిని మావెనకటి తరాలు కరువాకలి తీర్చుకున్న సందర్భాలున్నాయి.

గురువు వీరబ్రహ్మం ఆజ్ఞను పాటించి, కుక్క మాంసాన్ని భుజించి సమ్యక్ దృష్టిని చాటిన సిద్దయ్య వారసులం. తుకతుక ఉడికి, మా నోటికాడికి అందివచ్చిన చియ్యల్ని (మాంసం ముక్కల్ని) మట్టి పాలు చేస్తే మా మనసులు తుకతుకలాడవా? మా మనోభావాలు గాయపడవా?

-కృపాకర్ మాదిగ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి

వర్గీకరణ తరువాతే తెలంగాణ - మందకృష్ణ మాదిగ Andhra Jyothi 19/07/2011


యస్.సి. రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమం - ఈ రెండు కూడా ప్రజల ఆకాంక్షలను సాధించే ప్రజాస్వామిక ఉద్యమాలే. యస్.సి. సామాజిక వర్గాల్లోని అంతరాలను తొలగించడానికి రిజర్వేషన్ల ఫలాలు యస్.సి.ల్లోని ప్రతి సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించాలనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైనది. యస్.సి.ల్లోని ఏ కులమైనా రిజర్వేషన్ల అవకాశాలను తమ జనాభా దామాషా నిష్పత్తి కంటే అదనంగా పొందడానికి అంగీకరించకూడదని, విద్య, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్లను పంచాలని అంబేద్కర్ నిర్మొహమాటంగా చెప్పారు.

ఆయన వివేక వాణి స్ఫూర్తిని తీసుకోకుండా మాలల్లోని కొంత మంది స్వార్థపరులు తమ రాజకీయ పలుకుబడి ద్వారా ఉన్నత ఉద్యోగ వర్గం రూపంలో ఎస్.సి. వర్గీకరణకు అడ్డుతగులుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించిన, సమర్థించిన అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎం.ఆర్.పి.యస్. బలపరుస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారీ వర్గం అడ్డుకుంటున్న విషయం స్పష్టమౌతూనే ఉంది.

ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిన మాదిగలు, ఉపకులాలు తమకు దక్కాల్సిన న్యాయమైన వాటా వర్గీకరణ రూపంలో కోరుతుంటే సమైక్యాంధ్రలో కలిసినప్పటి నుంచి అన్ని రకాలు గా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏ ర్పాటుకై ఉద్యమిస్తున్నారు. అ యితే వర్గీకరణను వ్యతిరేకించే కొంతమంది స్వార్థపరులు దళితుల ఐక్యత దెబ్బతింటుందనే ముసుగుతో అడ్డుకుంటున్నారు; అలాగే తెలంగాణను అడ్డుకునే శక్తులు కూడా తెలుగు ప్రజల ఐక్యత దెబ్బతింటుందనే సాకుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అడ్డు తగులుతున్నారని తేటతెల్లం అవుతుంది.

ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణ సాధించుకునే లక్ష్యంతో ఏర్పడ్డ సామాజిక ఉద్యమ సంస్థ. ఈ సంస్థ తన లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం పోరాడుతూనే ఇతర అణగారిన వర్గాల ప్రజల, ప్రజాస్వామిక డిమాండ్‌లను బలపరచే విషయంలో మొదటి నుంచి అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామిక దృక్పథంతో చాలా విషయాల మీద స్పష్టతతో నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల న్యాయమైన ఆకాంక్షలను బలపరుస్తూ వస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఎం.ఆర్.పి.యస్. మొదటి నుంచి బలపరుస్తుంది.

అయితే ఇక్కడ మేధావులు, ప్రజాస్వామిక వాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ సంస్థలు, పార్టీలు గుర్తించాల్సింది ఏమిటి? ఏదైనా ఒక సంస్థ లేదా పార్టీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏర్పడ్డప్పుడు ఆ లక్ష్య సాధన మీదనే ప్రధానంగా దృష్టిపెడుతూనే యితర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరిచే విధంగా ఉండాలి. అంతేకాని ఆ సంస్థ తమ లక్ష్యాన్ని పూర్తిగా పక్కకు పెట్టి యితర ప్రజాస్వామిక, డిమాండ్ల సాధనకై నిరంతరం పోరాడాలా? ఇది ఏ సంస్థకైనా ఏ పార్టీకైనా సాధ్యమౌతుందా?

ఉదా : ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, గుర్తిస్తూ ఎన్నో ఉద్యమాలకు అండగా నిలబడింది. అట్లానే తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీలు/సంస్థలు ఆ లక్ష్యసాధన మీదనే ప్రధాన దృష్టి పెడుతూ యితర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరిచే విధానంలో ప్రజాస్వామిక బద్ధంగా వ్యవహరించవచ్చు. మరో ఉదాహరణ : ఒక పార్టీగా టి.ఆర్.యస్. తెలంగాణ సాధించుకునే లక్ష్యంలో భాగంగా నిరంతరం ఆ అంశం మీదనే ప్రధాన దృష్టి పెడుతూ మా వర్గీకరణ అంశంతో పాటు ఇతర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరచవచ్చు.

అంతేగాని తెలంగాణ లక్ష్య సాధనను పక్కకు పెట్టి ఇంకో అంశం మీద ప్రధాన దృష్టి పెట్టి నిరంతరం పనిచేసే విధానం ఆ పార్టీకి ఉండడం సాధ్యమేనా? అనేది ఆలోచించాలని మేధావి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాకే తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలన్న మా డిమాండ్‌ను మా కోణంతో పాటు వాస్తవ దృక్పథంతో అవగాహన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రెండు అంశాలు (వర్గీకరణ, తెలంగాణ) కేంద్రం వద్ద పరిష్కారం కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రెండు అంశాలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నా ముందుగా పరిష్కారం కావలసింది వర్గీకరణ అని వర్గీకరణ కోసమే ఏర్పడ్డ ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణను ముందు కోరుకోవడం తప్పు ఎలా అవుతుంది? మేము కోరుకోవడానికి కావాల్సిన అర్హతలు, అవకాశాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని వాస్తవ దృష్టితో పరిశీలించాలి. అందుకు ఈ క్రింది అంశాలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇవీ ఆ అంశాలు : (1) సామాజిక వివక్షను, అసమానతలను తొలగించుకోవడంలో భాగంగా హక్కుల సాధనకై వర్గీకరణ కోసం పోరాడుతున్న సామాజిక ఉద్యమ సంస్థ ఎం.ఆర్.పి.యస్. దీన్ని సామాజిక వివక్ష కోణంతో చూడండి.
(2) ప్రాంతీయ వివక్ష కోణంలో తెలంగాణ డిమాండ్‌ను చూడండి.
(3) సామాజిక వివక్ష, దోపిడీ మాదిగ ఉపకులాల ప్రజల మీద తెలంగాణలోను అటు సీమాంధ్రలోను కుల వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి నేటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది.
(4) ఇక ప్రాంతీయ వివక్ష, ప్రాంతీయ దోపిడీ తెలంగాణ ఆంధ్రలో విలీనం అయినప్పటి నుంచీ అంటే గత 55 సంవత్సరాల నుంచి మాత్రమే కొనసాగుతోంది.
(5) కుల వివక్ష నిర్మూలన సామాజిక న్యాయం కోసం గతంలో మాదిగ పెద్దల ఆధ్వర్యంలో ఎన్నోసంస్థలు ఏర్పడినా 1994లో ఎం. ఆర్.పి.యస్. ఆవిర్భావంతోనే బలమైన ఉద్యమరూపం దాల్చింది.
(6) అలాగే ఎన్నో సంస్థలు ఎన్నో పార్టీలు గతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డా 2001లో టి.ఆర్.ఎస్. ఏర్పడ్డాకనే ప్రజల ఆకాంక్షకు రాజకీయ రూపం వచ్చింది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు.
సామాజిక వివక్ష, ప్రాంతీయ వివక్షకు సంబంధించి రెండు కోణాల్లో విశదీకరించి చూసినా వర్గీకరణే ముందు జరగాలని మేము కోరుకోవడం సమంజసమే అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అందుకు ఈ క్రింది అంశాలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
వర్గీకరణకు, తెలంగాణకు ఉన్న అనుకూలత వ్యతిరేకతలను పరిగణన లోకి తీసుకొని సహృదయంతో సామాజిక న్యాయకోణంలో ఆలోచించి మా వర్గీకరణ సమస్యను ముందుగా పరిష్కరించేందుకు తోడ్పాటును అందించాలని తెలంగాణను కోరే, బలపరిచే శక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

- మందకృష్ణ మాదిగ
ఎమ్.ఆర్.పి.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

ధైర్యంగా ఆలోచించు, ధైర్యంగా ఆచరించు! అన్న-----మంద కృష్ణమాదిగ Namasethe Telangana News Paper 28/7/2011


ఏ ఉద్యమంలోనైనా అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకుంటూ, సామాజిక న్యాయ లక్ష్య సాధనకు దోహదపడే విధంగానే మాపావూతను నెరవేరుస్తామే కానీ పై అంశాలను విస్మరించం. కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో ఏ అంశమైనా కులానికి అతీతం కాదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది కావున సామాజిక అంశాన్ని ప్రస్తావించకూడదు అనడం అగ్రకుల ఆధిపత్యాన్ని
కాపాడుకునే వారి దృక్పథం. ప్రజాస్వామిక చైనా విప్లవ నిర్మాత ‘మావో’ స్ఫూర్తిని కొనసాగించే క్రమంలో ‘ఎమ్మార్పీఎస్’ మాదిగ అణగారిన కులాల పక్షాన వారి హక్కులను సాధించడానికి వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి నిరంతరం పోరాడుతూనే ఉంది.

అంతేకాకుండా మానవత, ప్రజాస్వామ్య దృక్పథంతో ఎమ్మార్పీఎస్ నడిపిన నిరుపేద గుండె జబ్బు పిల్లల ఉద్యమం అంతిమంగా ఆరోగ్యశ్రీ పథకానికి దారితీస్తే, వికలాంగుల కోసం ముందుండి నడిపిన ఉద్యమం.. వారి పెన్షన్ పెరగడంతో పాటు మరిన్ని హక్కులను సాధించడానికి ఎమ్మార్పీఎస్ చేయూత నిచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ప్రజల ఆకాంక్ష .ఈ ఆకాంక్షను 2001లోనే గుర్తించి, డా. బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను, అందులో భాగంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ మద్దతుగా నిలబడింది. అలాగే వచ్చే తెలంగాణ అగ్రకులాల అధికారాన్ని చెలాయించే విధంగా కాకుండా, అణగారిన కులాల ఆకాంక్ష నెరవేరే విధంగా ఉండాలనీ ఎమ్మార్పీఎస్ ప్రజాస్వామిక తెలంగాణ సాధించుట కొరకు సైకిల్ యాత్రల ద్వారా వేల కిలోమీటర్లు తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించింది.

కేవలం ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధించవచ్చన్న కొంత మంది అగ్రకుల నాయకులతో ఎమ్మార్పీఎస్ సైద్ధాంతికంగా మొదటినుంచి విభేదిస్తోంది. ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ రాజకీయంగా ఒక శక్తిగా చేసే ప్రయత్నం ద్వారా తెలంగాణ సాధించవచ్చన్న అభివూపాయాన్ని ఎమ్మార్పీఎస్ బలంగా నమ్ముతుంది.అయితే.. ఎన్నికలే నమ్ముకొని పొత్తులతో 2004లో 50 స్థానాలకు గాను 26 స్థానాలు గెలిచి 2009 లో 50 పోటీ చేసి 10 మాత్రమే గెలువగలిగింది టీఆర్‌ఎస్ రాజకీయ లక్ష్యం చాలా బలహీనపడిన సమయంలో టీఆర్‌ఎస్ అధినేత ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిస్తే అందరికంటే ముందు మద్దతు ఇచ్చి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించింది ఎమ్మార్పీఎస్. ఎమ్మార్పీఎస్ భౌగోళికంగా తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు.

రాయలసీమ, కోస్తాంధ్ర, ప్రాంతంలోనూ చాలా బలంగా ఉంది. డిసెంబర్ 9 కేంద్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంవూధలో ఉండే అగ్రకుల రాజకీయనేతలు బలం గా అడ్డు తగులుతున్న సమయంలో,రాజీనామాలు సంధించి ప్రజలను సమైక్యాంవూధకు మద్దతుగా బలంగా కూడగడుతున్న సమయంలో తెలంగాణకు మద్దతుగా ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు కొనసాగించి ఉద్యమాలు చేస్తూ సీమాంధ్ర ప్రాంతంలో దెబ్బలు తిని, జైలుపాలైంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలే. శ్రీకృష్ణకమిటీ నివేదికలోనే అన్ని కులాలతో పాటు మాలలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే.. ఒక మాదిగలే సమర్ధిస్తున్నారని తమ నివేదికలో పొందుపరచటం జరిగింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విషయంలో మా నిజాయితీ నిరూపితమైంది.

మాదిగల కోసం వర్గీకరణ ఉద్యమం అయినా, ముస్లింలకు గుజరాత్‌లో అన్యాయం జరిగినప్పుడు వారికి అండగా నిలబడే విషయంలోనైనా, మాదిగల కంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ ఉపకులాల విషయంలోనైనా, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లు, రిజర్వేషన్లు సాధించే విషయంలోనైనా, గుండె జబ్బు పిల్లల వికలాంగుల హక్కుల విషయాల్లో .. ఆదుకునే విషయంలోనైనా, బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ నక్సలైట్ అమరవీరుల అంత్యక్షికియలల్లో పాల్గొనే విషయంలో నైనా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీల ప్రజా సంఘాలకంటే ముందు, ఎన్నో రెట్లు ఎమ్మార్పీఎస్ ముందు వరుసలో నిలబడింది. ఆ విధంగా ై‘దెర్యంగా ఆలోచించు! ధైర్యంగా ఆచరించు!!’ అన్న మావో స్ఫూర్తిని ఎమ్మార్పీఎస్ ఆచరిస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఏ విషయంలోనైనా ఈ దృక్పథాన్నే కొనసాగిస్తుంది.


అయితే మేం పాల్గొనే ఏ ఉద్యమంలోనైనా సామాజిక న్యాయానికి నష్టం జరుగకుండా, అడుగడుగునా వేయి కళ్లతో నిరంతరం చూసుకోవడం ద్వారా మా అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రయోజనాలను కాపాడుకోవటం మా బాధ్యత అవుతుంది. ఈ దృక్పథమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో మా వైఖరిగా ఉంటుందని స్పష్టం చేస్తున్నం. అదే సమయంలో మా పాత్ర అది ఏ ఉద్యమంలోనైనా అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకుంటూ, సామాజిక న్యాయ లక్ష్య సాధనకు దోహదపడే విధంగానే మాపావూతను నెరవేరుస్తామే కానీ పై అంశాలను విస్మరించం. కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో ఏ అంశమైనా కులానికి అతీతం కాదు.

తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరుగుతుంది కావున సామాజిక అంశాన్ని ప్రస్థావించకూడదు అనడం అగ్రకుల ఆధిపత్యాన్ని కాపాడుకునే వారి దృక్పథం. సామాజిక న్యాయాన్ని , ఆత్మగౌరవాన్ని ప్రస్థావించడం అణిచివేయబడ్డ కులాల సామాజిక దృక్పథం. సామాజిక అంశాలు చర్చకు రాకుండా చూడటం అగ్రకులాల స్వార్థమైతే, సామాజిక అంశాన్ని చర్చకు పెట్టి తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల (90 శాతం) ప్రయోజనాలను కాపాడుకోవటం, అన్ని రంగాల్లో 90 శాతం వాటా సాధించుకోవటం మా ప్రయోజనాలకు అనుగుణమైనది. ఈ వైరుధ్యం ఇప్పుడు మొదలైంది కాదు. జాతీయోద్యమ కాలంలో కొనసాగిన విషయం మర్చిపోవద్దు. కొంతమంది అన్నట్లుగా ముందుగా సీమాంధ్ర వలసాధిపత్యంతో నుంచి విముక్తిని కోరుకుందాం.

ప్రజాస్వామిక, సామాజిక న్యాయం తెలంగాణ తెచ్చుకున్నంక సాధ్యం అవుతుందని మాట్లాడటం చూస్తే పోరాటంలో భాగంగానే మాట్లాడుకోవాల్సిన కొన్ని అంశాలను పరిష్కరించుకోవాల్సిన కొన్ని ఆంకాంక్షలను, కుదుర్చుకోవాల్సిన కొన్ని ఒప్పందాలను వాయిదా వేయటం తప్ప మరొకటి కాదు. వాయిదా వేయాలను కోవటం అగ్రకులాల దృక్పథం. వాయిదా పడకుండా చూసుకోవటం అణచివేయబడ్డ కులాల దృక్పథం. జాతీయోద్యమ కాలంలో ముస్లింలు వారికంటూ ప్రధాన ఎజెండా పెట్టుకొని జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఈ దేశంలో ఉండబడే అణగారిన కులాల పక్షాన ముఖ్యంగా దళితులు, గిరిజనుల పక్షాన డా. బీఆర్ అంబేద్కర్ ముందువరుసలో నిలబడ్డాడు.

స్వాతంత్య్రం కంటే ముందే కొన్ని ప్రాంతాలను కలిపి ముస్లింలకు ప్రత్యేక దేశం ఇవ్వాలని చెప్పి ముస్లింల పక్షాన నిలబడ్డ జిన్నా తీసుకొచ్చిన ఒత్తిడే పాకిస్తాన్ మనకంటే ఒక రోజు ముందే స్వాతంత్య్ర దేశంగా అవతరించింది. ఇది వాస్తవం కాదా? దళిత, గిరిజనుల పక్షాన నిలబడ్డ అంబేద్కర్ ‘స్వాతంత్య్రం వస్తే మాకేం వస్తదో ముందే తేల్చండి’ అని బ్రిటిష్ ప్రభుత్వాన్ని జాతీయోద్యమ కారులను నిలదీయటం వల్లే అది కమ్యూనల్ అవార్డ్ కు , తద్వారా గాంధీతో జరిగిన పూనా ప్రజావూపాతినిధ్య ఒప్పందం, తదనంతరం ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల విధానానికి దారి తీయలేదా? ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు దళిత, గిరిజనులు అనుభవిస్తున్న వాటాను పొందింది. స్వాతంత్య్రం కంటే ముందు జరిగిన ఒప్పందంలో భాగం కాదా? ఇప్పుడు ఈ వర్గాలకు సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు జరగక పోవచ్చునేమో కానీ జరిగిన సామాజిక న్యాయం స్వాతంత్య్రం కంటే ముందే సాధించుకున్న విషయం మరిచిపోవటం సహేతుకమేనా? స్వాతంవూత్యానంతరం బిసిలకు సామాజిక న్యాయాన్ని అందించగలమన్న ఆనాటి జాతీయోద్యమ నాయకుల వారసులే ఈనాటికీ పరిపాలిస్తున్నా బిసిలకు 50 శాతం చట్టసభల్లో ప్రాతినిధ్యం ఈ నాటికీ కల్పించబడలేదు. అంటే ముందుగా అప్రమత్తం కాకపోతే కొన్ని వర్గాలు ఏ విధంగా మోసపోతరో.. ఈ దేశంలో 50 శాతంగా జీవిస్తున్న బలహీనవర్గాల పరిస్థితే మన కళ్లకు కనిపిస్తున్న సాక్ష్యం.

ఇక ఈ దేశంలో కుల వ్యవస్థ కొనసాగడం వలన ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కులం అంటూ ఉండక తప్పదు. అయితే ఈ కుల వ్యవస్థ వల్ల నష్టపోయిన వర్గాలు బాధపడ్డ వర్గాలు కుల వివక్షతకు వ్యతిరేకంగా కుల నిర్మూనలకోసం పోరాటం చేయటం కూడ తప్పదు. ఒక వ్యక్తి కుల నిర్మూలనంటే.. కుల తత్వవాదా? కులం అనేది ఆయన పుట్టుకతో సంబంధం లేదు. ఆయన ఆచరణతో సంబంధం ఉంది. ఇక్కడ యాదిడ్డికి, చందర్‌రావుకి, హరీష్‌రావుకి కులం ఉంది. కానీ యాదిడ్డికి ఒక్క అమ్మా ఉందని, ఆ అమ్మ వంట తింటే తన లక్ష్యం మారుతుందేమో నీ యాదిడ్డి స్వయంగా రాశాడు.

యాదిడ్డి రాయడాన్ని మీరు గుర్తు చేయటం బాగానే ఉంది. యాదిడ్డి అమ్మ చేతి వంటలో లక్ష్యం నుంచి పక్కదారి పట్టించే పదార్థం ఉన్నదేమో నని మీరు భావించారేమో కానీ..,తెలంగాణ కోసం అసువులు బాసిన 600 మంది ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ వర్గాల బిడ్డలకు కూడ అమ్మలు ఉన్నారు. ఆ అమ్మల చేతి వంట తిన్నా కూడా త్యాగాల బాటే నడిచారు. వాళ్ల అమ్మల కంటే తెలంగాణ కోసమే ప్రాణత్యాగాలు చేసిన సందర్భం ఉన్నది. ఇక్కడ యాదిడ్డి మరణాన్ని , ఇషాన్‌డ్డి , వేణుగోపాల్‌డ్డి మరణాన్ని వారి కులం కోసమో, కుల దురహంకారం కోసమో చేశారు అని ఎవరూ అనలేదు. మేమూ అనలేదు.కానీ ఆ ముగ్గురు చనిపోయినప్పుడే బంద్‌లు ప్రకటించిన అగ్రకుల జాక్, టీఆర్‌ఎస్ నాయకత్వం , 600 మంది అణగారిన వర్గాల బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే బంద్ పిలుపులు ఎందుకు ఇవ్వలేదో అనేదే మా ప్రశ్న.

ఇవ్వక పోవటం అంటే .. ఆ ముగ్గురి త్యాగాలను ఆకాశానికి ఎత్తి చూపటం , 600 మంది అణగారిన వర్గాల బిడ్డల త్యాగాలను వారి భౌతికకాయాలతో పాటు వారి త్యాగాలను కూడా సమాధి చేయటమే కాదా?
ఇక్కడ చందర్‌రావు గారి భార్య చెప్పెత్తి చూపెట్టడాన్ని తెలంగాణ వాళ్ల అందరికి వర్తించే విధంగానే కొంతమంది చూస్తున్నారు. ఆమె చెప్పెత్తింది తన భర్త మీద దాడి చేసి అవమానించిన హరీష్‌రావు దొర మీద మాత్రమే. దాడి చేసిన వాళ్లమీద చెప్పెత్తటం , దాడి చేసిన వాళ్లను ఎదుర్కోవటం దళితమహిళల పోరాట సంప్రదాయంగానే ఉన్నది. మీరు చెప్పిన కారంచేడులోనే దళిత మహిళ సువార్తమ్మ గ్రామ అగ్రకుల భూస్వాములపైనే చేతుల ఉన్న బిందతో ఎదురు తిరిగింది. కాళ్లకు ఉన్న చెప్పును విసిరింది. మా ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి , మా మాన ప్రాణాలను సంరక్షించుకోవడానికి అది తెలంగాణలో నైనా, ఆంధ్రాలోనైనా , రాయలసీమలోనైనా , దేశంలో మరెక్కడైనా ముందుగా మాకు ఆయుధంగా ఉండేది మేం కుట్టిన చెప్పే.


దురహంకారంతో చేసిన దాడిని ‘సారీ’తో కప్పి పుచ్చలేం. ఇక్కడ ప్రధాన నిందితుడుగా ఉన్న ఏపీ భవన్ అధికారి రజిత్ భార్గవ్ అగ్రకుల అధికారిని చర్చలతో సరిపెట్టి, చందర్‌రావు మీదికి వెళ్లేటప్పుడే ఎంత దురహంకారంతో వెళ్లాడో ? ఏవిధంగా దుర్భాషలాడాడో! ఎంత దుర్మార్గంగా తన్నాడో.. దేశ రాజధాని మీడియా సాక్ష్యంగా ప్రపంచమే చూసి నివ్వెరపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఉండబడే అ గారిన కులాలు తెలంగాణ రాకముందే ఈ దొరల దౌర్జన్యాలు ఈ స్థాయిలో ఉంటే.. తెలంగాణ వచ్చాక ఈ దొరల దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉంటాయో.. అని ఈ వర్గాలు భయాందోళనలకు గురైన మాట వాస్తవమే. ఎందుకంటే గతంలో ఈ అగ్రకుల ఆధిపత్య అహంకారానికి బలైన ఈ అణగారిన వర్గాలకు భయం ఉండటం సహజమే. చందర్‌రావును తన్ని కూడా సారీ చెప్పి ఈ రోజు తప్పించుకోవాలను కునేటోల్లు , రేపు తెలంగాణ వస్తే మా వర్గాలను చంపి కూడా సారీ తో తప్పించుకోగలరు.

మా వర్గాల మీద ఎవరు దాడిచేసినా, దౌర్జన్యాలు చేసినా ,తప్పించుకోజూసే ఏ మార్గానై్ననా మేం అంగీకరించం. హరీష్‌రావే కాదు, ఇంక ఎంతటి వారైనా..మామీద దౌర్జన్యం చేస్తే జైలుకు వెళ్లాల్సిందే. శిక్ష అనుభవించాల్సిందే. తెలంగాణ సెంటిమెంట్ ముసుగులో దొరలు తమ ఆధిపత్యాన్ని అణగారిన వర్గాలపై కొనసాగించాలని చూస్తే మాకు తెలంగాణ సెంటిమెంటు కంటే అణచివేయబడ్డ కులాల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవటం, అంతకంటే కోటి రెట్లు ముఖ్యమని మేం విశ్వసిస్తున్నాం. మేం తెలంగాణకు అనుకూలమే. అయితే.. దొరల రాజ్యానికి దారితీసే ఎలాంటి పరిణామానికి మేం అంగీకరించం.
‘జాతుల స్వయం నిర్ణయాధికారం కోసం జరుగుతున్న పోరాటాన్ని బలపరచటం తోపాటు అదే సందర్భంలో దోపిడీ , అసమానతలను తగ్గించడానికి దోహదపడే విధంగా ఉండటం కోసం మనం జాగ్రత్త వహించాల’ ని అన్న రష్యా సోషలిస్ట్ నిర్మాత జోసఫ్ స్టాలిన్ మాకు ఆదర్శం.
-మంద కృష్ణమాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు

వర్గీకరణ తరువాతే తెలంగాణ - మందకృష్ణ మాదిగ Andhra Jyothi 19/07/2011


వర్గీకరణ తరువాతే తెలంగాణ
- మందకృష్ణ మాదిగ
యస్.సి. రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమం - ఈ రెండు కూడా ప్రజల ఆకాంక్షలను సాధించే ప్రజాస్వామిక ఉద్యమాలే. యస్.సి. సామాజిక వర్గాల్లోని అంతరాలను తొలగించడానికి రిజర్వేషన్ల ఫలాలు యస్.సి.ల్లోని ప్రతి సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించాలనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైనది. యస్.సి.ల్లోని ఏ కులమైనా రిజర్వేషన్ల అవకాశాలను తమ జనాభా దామాషా నిష్పత్తి కంటే అదనంగా పొందడానికి అంగీకరించకూడదని, విద్య, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్లను పంచాలని అంబేద్కర్ నిర్మొహమాటంగా చెప్పారు.
ఆయన వివేక వాణి స్ఫూర్తిని తీసుకోకుండా మాలల్లోని కొంత మంది స్వార్థపరులు తమ రాజకీయ పలుకుబడి ద్వారా ఉన్నత ఉద్యోగ వర్గం రూపంలో ఎస్.సి. వర్గీకరణకు అడ్డుతగులుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించిన, సమర్థించిన అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎం.ఆర్.పి.యస్. బలపరుస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారీ వర్గం అడ్డుకుంటున్న విషయం స్పష్టమౌతూనే ఉంది.
ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిన మాదిగలు, ఉపకులాలు తమకు దక్కాల్సిన న్యాయమైన వాటా వర్గీకరణ రూపంలో కోరుతుంటే సమైక్యాంధ్రలో కలిసినప్పటి నుంచి అన్ని రకాలు గా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏ ర్పాటుకై ఉద్యమిస్తున్నారు. అ యితే వర్గీకరణను వ్యతిరేకించే కొంతమంది స్వార్థపరులు దళితుల ఐక్యత దెబ్బతింటుందనే ముసుగుతో అడ్డుకుంటున్నారు; అలాగే తెలంగాణను అడ్డుకునే శక్తులు కూడా తెలుగు ప్రజల ఐక్యత దెబ్బతింటుందనే సాకుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అడ్డు తగులుతున్నారని తేటతెల్లం అవుతుంది.
ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణ సాధించుకునే లక్ష్యంతో ఏర్పడ్డ సామాజిక ఉద్యమ సంస్థ. ఈ సంస్థ తన లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం పోరాడుతూనే ఇతర అణగారిన వర్గాల ప్రజల, ప్రజాస్వామిక డిమాండ్‌లను బలపరచే విషయంలో మొదటి నుంచి అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామిక దృక్పథంతో చాలా విషయాల మీద స్పష్టతతో నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల న్యాయమైన ఆకాంక్షలను బలపరుస్తూ వస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఎం.ఆర్.పి.యస్. మొదటి నుంచి బలపరుస్తుంది.
అయితే ఇక్కడ మేధావులు, ప్రజాస్వామిక వాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ సంస్థలు, పార్టీలు గుర్తించాల్సింది ఏమిటి? ఏదైనా ఒక సంస్థ లేదా పార్టీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏర్పడ్డప్పుడు ఆ లక్ష్య సాధన మీదనే ప్రధానంగా దృష్టిపెడుతూనే యితర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరిచే విధంగా ఉండాలి. అంతేకాని ఆ సంస్థ తమ లక్ష్యాన్ని పూర్తిగా పక్కకు పెట్టి యితర ప్రజాస్వామిక, డిమాండ్ల సాధనకై నిరంతరం పోరాడాలా? ఇది ఏ సంస్థకైనా ఏ పార్టీకైనా సాధ్యమౌతుందా?
ఉదా : ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, గుర్తిస్తూ ఎన్నో ఉద్యమాలకు అండగా నిలబడింది. అట్లానే తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీలు/సంస్థలు ఆ లక్ష్యసాధన మీదనే ప్రధాన దృష్టి పెడుతూ యితర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరిచే విధానంలో ప్రజాస్వామిక బద్ధంగా వ్యవహరించవచ్చు. మరో ఉదాహరణ : ఒక పార్టీగా టి.ఆర్.యస్. తెలంగాణ సాధించుకునే లక్ష్యంలో భాగంగా నిరంతరం ఆ అంశం మీదనే ప్రధాన దృష్టి పెడుతూ మా వర్గీకరణ అంశంతో పాటు ఇతర ప్రజాస్వామిక డిమాండ్లను బలపరచవచ్చు.
అంతేగాని తెలంగాణ లక్ష్య సాధనను పక్కకు పెట్టి ఇంకో అంశం మీద ప్రధాన దృష్టి పెట్టి నిరంతరం పనిచేసే విధానం ఆ పార్టీకి ఉండడం సాధ్యమేనా? అనేది ఆలోచించాలని మేధావి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాకే తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలన్న మా డిమాండ్‌ను మా కోణంతో పాటు వాస్తవ దృక్పథంతో అవగాహన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రెండు అంశాలు (వర్గీకరణ, తెలంగాణ) కేంద్రం వద్ద పరిష్కారం కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రెండు అంశాలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నా ముందుగా పరిష్కారం కావలసింది వర్గీకరణ అని వర్గీకరణ కోసమే ఏర్పడ్డ ఎం.ఆర్.పి.యస్. వర్గీకరణను ముందు కోరుకోవడం తప్పు ఎలా అవుతుంది? మేము కోరుకోవడానికి కావాల్సిన అర్హతలు, అవకాశాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని వాస్తవ దృష్టితో పరిశీలించాలి. అందుకు ఈ క్రింది అంశాలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇవీ ఆ అంశాలు : (1) సామాజిక వివక్షను, అసమానతలను తొలగించుకోవడంలో భాగంగా హక్కుల సాధనకై వర్గీకరణ కోసం పోరాడుతున్న సామాజిక ఉద్యమ సంస్థ ఎం.ఆర్.పి.యస్. దీన్ని సామాజిక వివక్ష కోణంతో చూడండి.
(2) ప్రాంతీయ వివక్ష కోణంలో తెలంగాణ డిమాండ్‌ను చూడండి.
(3) సామాజిక వివక్ష, దోపిడీ మాదిగ ఉపకులాల ప్రజల మీద తెలంగాణలోను అటు సీమాంధ్రలోను కుల వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి నేటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది.
(4) ఇక ప్రాంతీయ వివక్ష, ప్రాంతీయ దోపిడీ తెలంగాణ ఆంధ్రలో విలీనం అయినప్పటి నుంచీ అంటే గత 55 సంవత్సరాల నుంచి మాత్రమే కొనసాగుతోంది.
(5) కుల వివక్ష నిర్మూలన సామాజిక న్యాయం కోసం గతంలో మాదిగ పెద్దల ఆధ్వర్యంలో ఎన్నోసంస్థలు ఏర్పడినా 1994లో ఎం. ఆర్.పి.యస్. ఆవిర్భావంతోనే బలమైన ఉద్యమరూపం దాల్చింది.
(6) అలాగే ఎన్నో సంస్థలు ఎన్నో పార్టీలు గతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డా 2001లో టి.ఆర్.ఎస్. ఏర్పడ్డాకనే ప్రజల ఆకాంక్షకు రాజకీయ రూపం వచ్చింది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు.
సామాజిక వివక్ష, ప్రాంతీయ వివక్షకు సంబంధించి రెండు కోణాల్లో విశదీకరించి చూసినా వర్గీకరణే ముందు జరగాలని మేము కోరుకోవడం సమంజసమే అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అందుకు ఈ క్రింది అంశాలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
వర్గీకరణకు, తెలంగాణకు ఉన్న అనుకూలత వ్యతిరేకతలను పరిగణన లోకి తీసుకొని సహృదయంతో సామాజిక న్యాయకోణంలో ఆలోచించి మా వర్గీకరణ సమస్యను ముందుగా పరిష్కరించేందుకు తోడ్పాటును అందించాలని తెలంగాణను కోరే, బలపరిచే శక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
- మందకృష్ణ మాదిగ
ఎమ్.ఆర్.పి.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు