Showing posts with label EGS. Show all posts
Showing posts with label EGS. Show all posts

Monday, June 30, 2014

అభివృద్ధి పేరిట గ్రామీణ ఉపాధికి ఎస‌రు


పేదలకిచ్చే రాయితీల మీద అభివృద్ధి నిరోధక ప్రచారకులు దాడి చేయడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు, కూలీలకు రాయితీలివ్వడం వల్లే రైతుల అభివృద్ధి ఆగిపోయిందని నమ్మించగల్గుతున్నారు. సామాజిక సమానత్వం కోసం చేసే రిజర్వేషన్లు లాంటి వాటికే పరిమితం కాకుండా, వాలంటైన్స్‌ డే జరుపుకోవడం దగ్గర నుంచి పేదలకిచ్చే రాయితీల వరకు అన్నింటికీ వ్యతిరేకంగా అగ్రవర్ణాల యువకుల్లోనే గాదు - మధ్యతరగతి కులాల యువకుల్లో కూడా ద్వేషాన్ని బిజెపి నూరిపోసింది. ఇప్పటికే అగ్రవర్ణాలు, మధ్యతరగతి కులాలు ఒకవైపు - దళితులు, పేదలు మరోవైపు చేరేలా బిజెపి అగాధాన్ని ఏర్పరచింది. మధ్య తరగతిని బలపరచి వీరి మధ్య విభజన మరింత బలపడడానికి వీలుగా ప్రయత్నిస్తున్నది. అగ్ర వర్ణాలు, మధ్యతరగతి కులాలు తన వెంట గట్టిపడాలంటే - దళితులకు వ్యతిరేకంగా వీళ్ళను రెచ్చగొట్టాలి.
                             అభివృద్ధి పేరిట పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా మధ్య తరగతిని రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నం బిజెపి ఈ ఎన్నికల్లో చేసింది. అభివృద్ధి అనే తమ నినాదానికి మధ్యతరగతేగాదు పేదలు కూడా ఆకర్షితులయ్యారని బిజెపి వాదిస్తోంది. ఏదో చిన్నచిన్న వాటితో పేదలు సంతృప్తి పడకుండా ఇంకా కొన్ని కావాలని కోరుకోవడం మంచిదే. కానీ పేదలు - అందునా దళితులు బిజెపి వైపు ఈ ఎన్నికల్లో మొగ్గారనడంలో అసలు వాస్తవం లేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఓట్ల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మాయావతి వెనకున్న అగ్రవర్ణాలు ఈ ఎన్నికల్లో ఆమెను వదిలేశాయి. ఆ కొరతను పూరించడానికి ముస్లింల నుంచి తగినంత మద్దతు రాలేదు. అందువల్లే బిఎస్‌పికి సీట్లు రాలేదు. కానీ బిఎస్‌పికి ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం ఓట్లు వచ్చాయి. మాయావతికి 20 శాతం ఓట్లు వచ్చాయంటే అవి దళితుల ఓట్లేనన్నది వాస్తవం. దేశం మొత్తంలోనూ, ఉత్తర భారతదేశంలోనూ - అగ్రవర్ణాలు ప్రధానంగా, మధ్యతరగతి (కులాలు) బిజెపికి ఓటు వేశాయి. బిజెపి అభివృద్ధి నినాదం వైపు ఆకర్షితులైన ఈ తరగతులు తమ అభివృద్ధికి దళితులు, వ్యవసాయ కూలీలు ఆటంకంగా ఉన్నారని ఎన్నికల్లో ప్రచారం చేశాయి. ఉపాధి హామీ పథకం వల్ల కూలీలు పనికి రావడం లేదని, దీని వల్లే వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని పోతోందని ప్రచారం చేశాయి. బిజెపి అభివృద్ధి నినాదం పట్టణ-మధ్యతరగతిని, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి కులాలను బాగా ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో పేదలు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద ప్రచారాన్ని బిజెపి వినియోగించినా, అభివృద్ధి నినాదం పట్టణ మధ్యతరగతిని, గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నతవర్గాలను బాగా ఆకర్షించింది. ఈ పునాది మీదే ఆధారపడి బిజెపి ఎన్నికల ప్రచారం సాగింది. అందువల్ల పేదలకు వ్యతిరేకంగా బిజెపి మధ్య తరగతి వర్గాలను బాగా నిలబెట్టింది.
అభివృద్ధి కలను మీడియా నమ్మేట్లు చేసింది
                             గ్లోబలైజేషన్‌లో ప్రపంచీకరణను అంగీకరించే ప్రతి పార్టీ దాని ఎజెండాకు లోబడి పని చేయాల్సిందే. దేశంలో ఏ పార్టీ అయినా పెట్టుబడి రాకపోకలను ఆటంకపర్చరాదు. ఒకవేళ ఆటంకపరిస్తే ద్రవ్య పెట్టుబడి ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టి పారిపోతుంది. ఇక్కడ ఉన్న బిజెపి కార్పొరేట్‌ పెట్టుబడితో లింకయి ఉన్నది. ప్రపంచీకరణతో తెగతెంపులు చేసుకోలేదు. కాబట్టి బిజెపి ద్రవ్య పెట్టుబడి ఎజెండాను తప్పక అమలు చేయాల్సి ఉంది. ఈ పని కాంగ్రెస్‌ కంటే బిజెపియే బలంగా చేయగలదని కార్పొరేట్లు నమ్మాయి. అందరికీ అన్నీ ఇచ్చా అనే 'గుజరాత్‌ నమూనా అభివృద్ది' ఒక భ్రమే అయినా దాన్నెక్కువగా కార్పొరేట్లు ముందుకు తెచ్చాయి. గుజరాత్‌ నమూనా అభివృద్ధిలో మానవాభివృద్ధి సూచిక చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. ప్రత్యేకంగా అభివృద్ధి రేటు కూడా పెద్దగా ఎక్కువగా లేదు. గుజరాత్‌ కంటే బీహార్‌, తమిళనాడు వృద్ధి రేటులో ముందున్నాయి. గుజరాత్‌ అభివృద్ధి రేటు కేరళకు సమానంగా ఉంటే, కేరళ మానవాభివృద్ధి సూచిక దేశంలోనే ముందు ఉన్నది. ఈ వాస్తవాలను మరుగుపర్చి గుజరాత్‌ నమూనా అభివృద్ధి అన్న నినాదాన్ని కార్పొరేట్లు ముందుకు తెచ్చారు. గుజరాత్‌ నమూనాను ఆకాశానికెత్తడం మీడియా చేసిన పని. దీన్ని అంగీకరించడానికి కూడా చాలా మంది సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే వామ పక్షాలు తప్ప అన్ని పార్టీల ఆర్థిక విధానాలు కూడా అవే కాబట్టి. ధరల పెరుగుదల, నిరు ద్యోగం, అవినీతి లాంటి వైఫ ల్యాలకు కారణం కాంగ్రెస్‌ చేతగానితనంగా ప్రచారం చేశారు. అంతేగాని విధా నాల్లోనే లోపం ఉందని చెప్పడానికి చాలా మంది ధైర్యం చేయలేదు. సమర్థవంతమైన పాలన ఎవరు ఇవ్వగలరో, ఎవరైతే ధైర్యంగా నిర్ణయాలు చేయగలరో అలాంటి వారు కావాలనుకున్నారు. మోడీయే అందుకు తగిన వాడని మీడియా చేసిన ప్రచారం మందికెక్కింది. ఎవరైనా గుజరాత్‌ నమూనా వట్టి బూటకమని చెప్పినా నమ్మే స్థితి లేదు. కారణం మీడియా చేసిన మితిమీరిన ప్రచారమే. కానీ ఇది ఎప్పటికీ నిలిచేదిగాదు. కారణం ఇది వాస్తవం కాదు, కల మాత్రమే. అయితే మోడీ చేయబోయేది పేదలకు ఇచ్చే రాయితీలను కుదించి కార్పొరేట్లకు దోచిపెట్టడమే. పేదలకు ఇచ్చే రాయితీలే నేటి వైఫల్యాలకు కారణమని కార్పొరేట్లు ఇంత కాలం ప్రచారం చేస్తూ వచ్చారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకమే వ్యవసాయ అభివృద్ధికి ఆటంకమని భూస్వాములు, ధనిక రైతులు ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అవినీతి ముద్ర వేసి మధ్య తరగతి మద్దతుతో గెలిచిన బిజెపి దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేపట్టింది.
మీడియా
                             హిందూత్వ శక్తులు అధికారానికి రావడానికి మీడియా పాత్ర కూడా తక్కువేంకాదు. ప్రజల్లో ప్రభావం కల్గించడానికి మీడియా (ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ మీడియా) పాత్ర ఈ ఎన్నికల ఫలితాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. భారతదేశం సాధించిన ప్రగతిని ప్రసార రంగంలో చూడవచ్చు. అంతేగాదు మీడియా మన ఆధునికత యొక్క లక్షణమేగాదు, ఫలితం కూడా. ఇప్పుడు అదే ఆధునికత మన దేశంలో సాధించిన ఆధునిక ప్రగతిని వెనక్కు తిప్పడానికి వినియోగిం చబడుతోంది.
పేదల మీద దాడి
                             అన్నా హజారే అందుకున్న అవినీతి వ్యతిరేక పోరాటం ఇప్పుడు పేదలకు వ్యతిరేకంగా తిరిగింది. పేదలకిచ్చే రాయితీల మీద అభివృద్ధి నిరోధక ప్రచారకులు దాడి చేయడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు, కూలీలకు రాయితీలివ్వడం వల్లే రైతుల అభివృద్ధి ఆగిపోయిందని నమ్మించగల్గు తున్నారు. సామాజిక సమానత్వం కోసం చేసే రిజర్వేషన్లు లాంటి వాటికే పరిమితం కాకుండా, వాలం టైన్స్‌ డే జరుపుకోవడం దగ్గర నుంచి పేదలకిచ్చే రాయితీల వరకు అన్నింటికీ వ్యతిరేకంగా అగ్రవర్ణాల యువకుల్లోనే గాదు - మధ్యతరగతి కులాల యువకుల్లో కూడా ద్వేషాన్ని బిజెపి నూరిపోసింది. ఇప్పటికే అగ్రవర్ణాలు, మధ్యతరగతి కులాలు ఒకవైపు - దళితులు, పేదలు మరోవైపు చేరేలా బిజెపి అగాధాన్ని ఏర్పరచింది. మధ్య తరగతిని బలపరచి వీరి మధ్య విభజన మరింత బలపడడానికి వీలుగా ప్రయత్నిస్తున్నది. అగ్ర వర్ణాలు, మధ్యతరగతి కులాలు తన వెంట గట్టిపడాలంటే - దళితులకు వ్యతిరేకంగా వీళ్ళను రెచ్చగొట్టాలి. అందుకోసమే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి, అగ్రవర్ణాలను-మధ్యతరగతి కులాలను సంతృప్తి పరిచే కార్యక్రమం మొదలయింది. ఇది మతోన్మాదాన్ని పెంచడంతోనే ఆగిపోదు. ఈ దేశంలో గత వందేళ్ళుగా సాధించిన సామాజిక విప్లవాన్ని వెనక్కుగొట్టే ప్రయత్నానికి దారితీస్తోంది. వలసాధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ద్వారాను, జ్యోతిరావ్‌ఫూలె, ఇవి రామస్వామి నాయకర్‌, అంబేద్కర్‌ లాంటి వారు సాధించిన సామాజిక ఫలితాలను వెనక్కుగొట్టే ప్రయత్నం ఇందులో ఇమిడి ఉన్నది. విప్లవ ప్రతీఘాతక ప్రయత్నాలకు అవకాశం ఉంది. సామాజిక అణచివేత, దళితులను తక్కువ చేసి చూసే నీతిభాహ్యమైన చర్యలు మళ్లీ తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంది. హిందూ సమాజంలో ప్రధానమైంది కులం. అసమానతలతో కూడిన కులదొంతరలను కూడా ఇది ప్రోత్సహిస్తోంది. కాబట్టి ఇది సామాజిక ప్రతీఘాతక విప్లవ ప్రయత్నంగా భావించవచ్చు.
హక్కుల ఆధారిత విధానం
                             ఎన్నికల్లో పరాజయం పాలవడానికి కాంగ్రెస్‌ చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు బిజెపి అభివృద్ధి నిరోధకత్వంతో పోటీ పడేవిగా ఉన్నాయి. ఉదాహరణకు 'హక్కులు ఆధారంగా కాంగ్రెస్‌ తీసుకున్న చర్యలే' మన పరాజయానికి కారణమని కమలనాథన్‌ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం, ఆహారభద్రత లాంటి వాటి వల్ల పరాజయం కల్గిందన్నారు. 'కాంగ్రెస్‌ ఈజ్‌ మోడిఫైడ్‌' అన్నారు కొందరు. ఉపాధి పొందడం ఒక హక్కు, ఆహార భద్రత పొందడం ఒక హక్కు. వీటిని హక్కుగా గుర్తించినప్పుడు - దానికి షరతులు విధించరాదు. 'హక్కుల ఆధారంగా విధానం' అంటే హక్కులకు పరిమితులు విధించడం గాదు. ముందు వాటిని సంస్థాగతం చేయాలి. టార్గెటెడ్‌గాకుండా అంటే ఎంపిక చేసిన వారికి పరిమితం కాకుండా సార్వజనీన (యూనివర్సల్‌) ఆహార భద్రత కావాలి. ఉపాధి హామీ పథకం కూడా 100 రోజుల పనికి పరిమితం కాకుండా - పని కోరేవారందరికీ అవకాశం కల్పించేదిగా ఉండాలి. పరిమితుల విధింపు వల్ల ప్రయోజనం పొందేవారికి వ్యతిరేకంగా పొందనివారిని రెచ్చగొట్టేదానికి అవకాశం ఇస్తోంది. నయా ఉదారవాదం కూడా ఇలాంటి పరిమితులతో కూడిన రాయితీలనే అనుమతిస్తుంది. ఇది వెనకబడ్డ ప్రజానీకానికి, బాగా వెనకబడ్డ ప్రజా నీకానికి మధ్య తంపులు పెట్టడానికి దారితీస్తోంది. కాబట్టి హక్కుల ఆధారిత విధానం అలా ఉండరాదు. హక్కుగా గుర్తించిన ప్రతి అంశాన్నీ పరిమితులు లేకుండా ఉండేదిగా ఉండాలి. 'ఆహారభద్రత కానివ్వండి, ఉపాధి హామీ కానివ్వండి, వృద్ధాప్య మరియు వికలాంగుల పింఛన్లు కానివ్వండి' పరిమి తులు లేకుండా ఇలాంటి వారందరికీ పెన్షన్లు అమల య్యేదిగా ఉండాలి. ఇవి బాధితులందరికీ అందేవిగా ఉండాలి. పరిమితులు లేని ఆరోగ్య హక్కు - పరిమితులు లేని విద్యాహక్కు ఉండాలి. అప్పుడే సరుకులుగా మారిన ఆరోగ్యం, విద్య ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
- పెనుమల్లి మధు 
(వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి)

Prajashakti Telugu News Paper Dated: 27:06.2014 

ఉపాధి హామీ : విమర్శలు, వాస్తవాలు - రవికుమార్



వ్యవసాయంలో ఉన్న సంక్షోభానికి ఉపాధి హామీ కారణం కాదు. ఆ సంక్షోభ పరిష్కారం భారం మొత్తం ఉపాధి హామీ పథకం మీద వేయడం సరికాదు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఒక మెరుగైన జీవనోపాధిగా చేయడానికి ఉపాధి హామీ నిధులను, పథకాన్ని తప్పనిసరిగా గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. ఎవరి వ్యవసాయం, ఏ రైతులు, ఏ విధమైన అనుసంధానం అన్న ప్రశ్నల మీద స్పష్టత ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమతో కూడిన పని చేయడానికి ముందుకొచ్చే ఏ వ్యక్తికైనా, వారి కుటుంబం మొత్తానికి కలిపి ఏడాదిలో 100 రోజుల వరకు పని పొందడానికి, పనికి తగ్గ వేతనం పొందడానికి 2005 నుంచి అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం హక్కు కల్పించింది. ఈ చట్టం ద్వారా కనీస వేతనాలు, మహిళలకు సమాన వేతనాలు, వ్యవసాయ పనుల్లేని కాలంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో శ్రామికులకు అదనపు ఆదాయం ఉపాధిపై భరోసా కలిగింది. భూములుండి శ్రమ చేసేవారికి భూమి అభివృద్ధికి మొక్కల పెంపకానికి ఒక అదనపు పెట్టుబడి సమకూరింది. తద్వారా భూములు సాగులోకొచ్చి వ్యవసాయం చేసుకోవడం ద్వారా ఇంతకు ముందు కూలీలుగా ఉన్నవారు రైతులుగా ఎదిగే అవకాశం కలిగింది. మొత్తంగా శ్రమచేసే వారి బేరమాడే శక్తి పెరిగి ఆ ప్రభావం వ్యవసాయం, ఇతర ఉపాధి రంగాల్లోని వేతనాల రేట్లపై పడి వారికి మరింత లబ్ధి చేకూరింది.
ఈ చట్టం అమలుద్వారా గ్రామీణ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న శ్రమ మీద ఆధారపడే కుటుంబాలలో సగానికి పైగా కుటుంబాలు (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి 60-70 లక్షలు) ప్రయోజనం పొందగా ఈ చట్టం వల్ల కొన్ని వర్గాలకు నష్టం జరిగిందనే విమర్శ కూడా ఉంది. అందులో ముఖ్యంగా రైతులుగా పిలవబడేవారు, వారికి ప్రాతినిధ్యం వహించే సంఘాలు, ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదని, ఒకవేళ లభ్యమైనా కూలీరేట్లు విపరీతంగా పెరిగిపోయాయని, దాని ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, మొత్తంగా ఈ పథకం వల్ల వ్యవసాయరంగం నష్టపోతుందనే వాదనను ముందుకు తెచ్చారు. అంతేకాకుండా పథకం అమలులో అవినీతి చోటుచేసుకుంటుందని, పథకంలో చేపట్టిన పనులలో నాణ్యత లోపించి ఎవరికీ పనికిరానివిగా ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. సమాజంలో ఈ వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రసార మాధ్యమాలు, మధ్యతరగతి ప్రజలు, ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు అవే వాదనలను బలపరుస్తున్నారు.

(అ) విమర్శ/అపోహ: ఈ పథకం వల్ల 'రైతులకు', వ్యవసాయానికి నష్టం జరుగుతుంది. వాస్తవం/ భిన్న కోణం: ఈ విమర్శలో ఏ రైతులు, ఎవరి వ్యవసాయం అనే స్పష్టత లేదు. ఈ పదాలు వాడటం ద్వారా అన్ని ప్రాం తాల్లోని మొత్తం రైతులు, వ్యవసాయం నష్టపోతున్న భావన కల్పిస్తున్నారు. ముందుగా అర్థం చేసుకోవలసింది రైతులందరూ ఒక్క తీరుగా లేరనే విషయం. పెద్ద రైతులు, చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు, కుటుంబసభ్యులు స్వయంగా కష్టపడి పనిచేసే రైతులు, పూర్తిగా కూలీల మీద ఆధారపడే రైతులు, మహిళా రైతులు, ఇలా రకరకాలుగా ఉన్నారు. అలాగే వ్యవసాయం కూడా మెట్ట, పల్లం, వర్షాధారం, కాల్వల ద్వారా, బోర్లద్వారా సాగునీరు అందే వ్యవసాయం, తిండి పంటలు అందులో మళ్లీ ఎన్నోరకాలు, పత్తి లాంటి పంటలు, పండ్ల తోటలు పెంపకం, వివిధ వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం ఇలా వ్యవసాయం పలురకాలుగా ఉంది. అన్నింటినీ అందరినీ ఒకేగాటన కట్టి వ్యవసాయానికి నష్టం అనటం అవగాహనరాహిత్యం లేదా బుద్ధిపూర్వకంగా చేసే తప్పుడుప్రచారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంఖ్యాపరంగా, పనిరోజుల పరంగానూ ఉపాధి పథకాల్లో పాల్గొన్న వారి వివరాలు చూస్తే భూమిలేని కూలీలకన్నా భూమి ఉండి శ్రమ చేసే వ్యక్తులే ఎక్కువ పాల్గొన్నట్లు స్పష్టమవుతుంది. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అధ్యయనం చేసిన దాదాపు 160 గ్రామాల్లోని వివరాల ద్వారా ఈ విషయం స్పష్టమయింది. ఏ జిల్లాలో అయితే భూమిలేని వ్యవసాయకూలీలు అధికంగా ఉన్నారో ఆ జిల్లాలో ఉపాధి హమీ పథకంలో తక్కువ మంది పాల్గొన్నారు. ఏ జిల్లాలో అయితే ఎక్కువ మందికి భూమి ఉండి భూమి లేని వ్యవసాయ కూలీల సంఖ్య కొంచెం తక్కువుందో ఆ జిల్లాలో ఉపాధిహామీలో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
(ఆ) విమర్శ/ అపోహ : ఈ పథకం వల్ల వ్యవసాయానికి కూలీలు దొరకటం లేదు, వ్యవసాయ పనులున్నప్పుడు ఉపాధి పనులు పెడుతున్నారు. వాస్తవం/ మరో కోణం : సన్న, చిన్న కారు రైతులు ఉపాధి హమీలో ఎక్కువగా పాల్గొంటున్నప్పుడు వారు తమ వ్యవసాయ పనులు చేసుకుని, అనువైన, మిగిలిన రోజుల్లోనే ఉపాధిలో పాల్గొంటున్నారు. అంటే ఉపాధిహామీ వారి వ్యవసాయానికి ఏమాత్రం అడ్డంకిగా లేక మరింత తోడ్పడినప్పుడు, వ్యవసాయం వల్ల ఉపాధి హామీ పనులకు కూలీలు దొరకటం లేదనడం, వ్యవసాయం జరుగుతున్నప్పుడు ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నారనడం వాస్తవం కాదు. క్షేత్రస్థాయి అధ్యయనాల్లో తేలిందేమిటంటే 70 శాతం ఉపాధి పనిరోజులు వ్యవసాయ పనులు లేనప్పుడే జరుగుతున్నాయి. అందులోనూ ఉపాధి హామీలో సగటు 55 రోజుల నుంచి ఏ సంవత్సరం కూడా పని కల్పించలేదు. సంవత్సరానికి వందరోజులు పనిచేసిన వారి సంఖ్య 10-15 శాతం మాత్రమే. వందరోజులు పని సాధించినా కూడా భూమిలేని వ్యవసాయ కూలీలకు తమ జీవనోసాధి సాగించాలంటే మరో 200 రోజులకు పైగా పని అవసరం ఉంటుంది. అయితే ఉపాధి హమీ పథకం వచ్చిన తరువాత సన్న, చిన్నకారు కమతాలు ఉన్న కుటుంబాలు తమ స్వంత వ్యవసాయం మెరుగుపరచుకుని ఇతరుల భూముల్లో కూలీకి వెళ్లటం తగ్గించుకున్నారు.
(ఇ) విమర్శ/ అపోహ : ఈ పథకం వల్ల వ్యవసాయంలో కూలీరేట్లు పెరిగాయి. కూలీలు శ్రమ చేయకుండా పనిచౌర్యానికి పాల్పడుతున్నారు. తేలికగా డబ్బులు పొందుతున్నారు. సోమరుల్లా తయారవుతున్నారు. వాస్తవం/మరోకోణం: ఉపాధి హామీ చట్టం అమల్లోకి రాకముందు దశాబ్దాల పాటు వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు చెల్లించకుండా రైతులు/భూ యజమానులు పనులు చేయించుకుని వారి శ్రమను దోపిడీ చేశారు. ఇప్పుడు ఈ చట్టం సహాయంతో వారు కనీస వేతనాలను సాధించుకున్నారు. అయితే కనీస వేతనాలకు అదనంగా రేట్లు పెరగడం అనేది కేవలం ఉపాధి హామీ చట్టం వల్ల కాదు. శ్రమ చేసే వ్యక్తులకు వివిధ రంగాలలో అవకాశాలు పెరగటం వల్ల, విద్యావకాశాలు పెరిగి కొత్త తరం వ్యవసాయ కూలీలుగా పనిచేయడానికి ఇష్టపడక, భూ యజమానులు/రైతుల కుటంబాలలో కూడా వ్యవసాయంలో పాల్గొనే సభ్యులు తగ్గడం వల్ల శ్రమచేసే వారికి డిమాండు పెరిగి రేట్లు పెరిగాయి. ఒకే ప్రాంతంలో ఒకే రకమైన పంటలు వేయడం వల్ల ఒకేసారి అందరికీ కూలీల అవసరం ఉండటంతో 'రైతుల' మధ్య పోటీ కూడా కూలీ రేట్లు పెరగడానికి దోహదం చేసింది. ఇంతా చేసి కూలీలకిచ్చే రేట్లు వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికే సరిపోతున్నాయి కానీ ఆస్తులు కూడబెట్టేంత ఏమీకాదు.
(ఈ) విమర్శ/అపోహ : ఈ పథకంలో చేపట్టిన పనులు నాణ్యతగా లేవు. వ్యవసాయానికి ఉపయోగపడేవి కావు. వాస్తవం/ మరోకోణం : ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా చేపట్టిన పనులు ఉమ్మడి వనరుల (ముఖ్యంగా నీటివనరుల) అభివృద్ధి, దళిత, ఆదివాసీ, ఇతర సన్న, చిన్నకారు రైతుల వ్యక్తిగత / అసైన్డ్ భూముల అభివృద్ధి, పండ్లతోటల పెంపకం, పథకంలో లోపాలు, నాణ్యత విషయంలో మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఉన్నప్పటికీ ఈ పనులు పూర్తిగా రావనడం, నిధులు వృథా అవడం సరికాదు. ఏ విధంగా అయితే ఈ వర్గాలను వ్యవసాయదారులుగా గుర్తించడానికి ఆధిపత్య సమాజం నిరాకరిస్తుందో అదేవిధంగా వారి భూముల్లో లేదా వారికి ఉపయోగపడే పనులను కూడా పనికిరానివిగానే చూస్తుంది.

సాధారణంగా ప్రభుత్వ పథకాల అమలులో ఉండే లోపాలు ఈ పథకం అమలులోనూ ఉన్నాయి. అయితే ఆ లోపాలను భూతద్దంలో చూపిస్తూ మొత్తం పథకాన్నే పనికిరానిదిగా, వృధా ఖర్చుగా పేర్కొంటూ ఈ పథకాన్ని నిలిపివేయాలనే వాదన సరైందికాదు. అమలు ప్రక్రియలను మరింత పటిష్ఠం చేయడం ద్వారా వాటన్నింటినీ చేయవచ్చు. అమలులో లోపాల కారణంగా పథకాలను, పట్టాలను రద్దు చేసుకుంటూ పోతే రాజ్యాంగాన్ని కూడా రద్దుచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో అతి తక్కువగా అమలుకు నోచుకున్న చట్టం అదే.
వ్యవసాయంలో ఉన్న సంక్షోభానికి ఉపాధి హామీ కారణం కాదు. ఆ సంక్షోభ పరిష్కారం భారం మొత్తం ఉపాధి హామీ పథకం మీద వేయడం కూడా సరికాదు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఒక మెరుగైన జీవనోపాధిగా చేయడానికి ఉపాధి హామీ నిధులను, పథకాన్ని తప్పనిసరిగా గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఎవరి వ్యవసాయం, ఏ రైతులు, ఏ విధమైన అనుసంధానం అన్న ప్రశ్నల మీద స్పష్టత ఉండాలి. ప్రస్తుతం కొన్ని వర్గాలు సూచిస్తున్నట్లుగా వ్యవసాయంతో ఉపాధి పథకాన్ని అనుసంధానిస్తే అంటే సాధారణ వ్యవసాయ పనులకు ఉపాధి నిధులను ఖర్చుచేస్తే, ప్రభుత్వ ఖర్చుతో కొన్ని వర్గాలను బలవంతంగా ఇతర వర్గాల భూముల్లో కూలీ చేయించినట్లే. వారికి వచ్చే అదనపు ఆదాయాన్ని తగ్గించడంలో పాటు, వారి గౌరవాన్ని, కూలీ బతుకుల నుంచి బయటపడదామన్న ఆకాంక్షలను చిదిమేసినట్లే. ఎంతసేపూ కూలీలుగా మారి చక్కగా పనిచేసి ఎందుకు చూపించరో?

వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వ్యవసాయం చేసే వారికి తగిన ఆదాయం, భద్రత లేదు అనే విషయాలలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఉపాధి హామీ పథకం లేదా చట్టంలో లేదు. వ్యవసాయం చేయని వర్గాల చేతుల్లో భూములు ఉండటం, వ్యవసాయ కుటుంబాలలో శ్రమ చేయతగిన వ్యక్తులు తగిన సంఖ్యలో లేకపోవడం, మన పరిస్థితులకు తగిన చిన్న తరహా యాంత్రీకరణ లేకపోవడం, రైతులు విత్తనం నుంచి మందుల దాకా అన్ని అంగడిలలో అధిక ధరలకు కొనుక్కోవలసి రావడం, గ్రామ, మండలస్థాయి పరపతి సంఘాలు నిజమైన సాగుదార్ల ప్రయోజనాలు కాపాడలేకపోవడం ఇత్యాది సమస్యల వల్లే వ్యవసాయం సంక్షోభంలో ఉంది. మరి ముందు ఈ సమస్యలన్నీ పరిష్కరించాక మొత్తం వ్యవస్థలో అట్టడుగున ఉన్న కూలీల దగ్గరకు వస్తే బాగుంటుంది. పై చర్యలన్నీ చేబడితే రైతులు శ్రమచేసే కార్మికులకు తగిన వేతనాలు చెల్లించే స్థితిలో ఉంటారు. అలాగే శ్రమ చేసే వారి చేతుల్లోనే ఎక్కువ భూమి ఉంటే ఈ కూలీల కొరత సమస్య కూడా తప్పుతుంది. ఉపాధి హామీ పథకంను సమీక్షించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రభుత్వాలు మెరుగుపరచాల్సిన కొన్ని అంశాలు : యూపీఏ ప్రభుత్వం ఐదు సంవత్సరాల అమలును సమీక్షించి కొత్త మార్గదర్శకాలను 2012లో విడుదల చేసింది. వాటికనుగుణంగా పథకం అమలు ఏమేరకు మెరుగుపడిందో సమీక్షించి పథకం పారదర్శకంగా, అవినీతి రహితంగా అమలు జరిగేట్లు చర్యలు తీసుకోవాలి; ఇప్పటి వరకు నమోదైన కార్మికులలో సగం మంది, సగటున కేవలం సగంరోజులు(50) మాత్రమే ఉపాధి పొందారు. నిజంగా అవసరమైన వారందరూ ఈ పథకాన్ని తగినంత మేర అందుకోగలుగుతున్నారా? లేకపోతే కారణాలేమిటి? పని అవసరం ఉన్నవారందరూ ఈ చట్టంలో భాగంగా తగినంతగా ఉపాధి పొందడానికి ఏమి మార్పులు తీసుకురావాలో ఆలోచించాలి; ఉపాధి చట్టంలో ఇప్పటికీ పూర్తిగా సాధించలేని అడిగిన 15రోజులలో పని కల్పన, పనిచేసిన 15రోజులలో వేతనాల చెల్లింపును సాధ్యంచేసే విధంగా చట్టం అమలులో మార్పులు తీసుకురావాలి; ఉపాధి హామీలో వివిధవర్గాలు (ఆదివాసీలు, పూర్తిగా భూమిలేని వారు, సన్నకారు రైతులు, మహిళలు..) ఎంతవరకు తమ హక్కులను సాధించుకున్నారు, అందులో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అడ్డంకులు, వారి అవసరాలను గుర్తించి అందుకు తగినట్లుగా వర్గాలవారీగా ఉపాధి హామీ అమలు వ్యూహాలను, కార్యాచరణను తయారుచేసి అమలు చేయాలి.
-రవికుమార్

Andhra Jyothi Telugu News Paper Dated: July .1. 2014 

Friday, November 1, 2013

ఉపాధి' కార్మికులకు మార్గం చూపిన కేరళ By ఎంవి బాలకృష్ణన్‌ మాస్టర్‌

 గత ఎనిమిదేళ్ళుగా అనుభవాలను సమీక్షిస్తే ఆదాయాన్ని కల్పించడం, దారిద్య్రాన్ని నిర్మూలించడం ద్వారా ఉపాధి హామీ చట్టం అనేక పేద కుటుంబాలకు ఎంతో సాయపడిం దనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. అయితే ఇక్కడ వాస్తవానికి ఇందులో కల్పించిన విధంగా కార్మికులు పూర్తి స్థాయి ప్రయోజనాలు, హక్కులు పొందడం లేదు. పైగా వారి హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఈ చట్టం అమలు దశలో అనేక సమస్యలు తలెత్తాయి.
    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్‌ఆర్‌ఇజిఎ) 2005 సెప్టెంబరులో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికీ ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజుల పాటు ఉపాధి కల్పించబడుతుంది. అయితే 2009 అక్టోబరులో దీనికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)గా పేరు మార్చారు. తొలుత దీన్ని కేవలం 200 జిల్లాల్లో అమలు చేశారు. తర్వాత దేశమంతటికీ వర్తింపజేశారు.
          హక్కుల నిరాకరణ
     గత ఎనిమిదేళ్ళుగా అనుభవాలను సమీక్షిస్తే ఆదాయాన్ని కల్పించడం, దారిద్య్రాన్ని నిర్మూలించడం ద్వారా ఉపాధి హామీ చట్టం అనేక పేద కుటుంబాలకు ఎంతో సాయపడిం దనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. అయితే ఇక్కడ వాస్తవానికి ఇందులో కల్పించిన విధంగా కార్మికులు పూర్తి స్థాయి ప్రయోజనాలు, హక్కులు పొందడం లేదు. పైగా వారి హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఈ చట్టం అమలు దశలో అనేక సమస్యలు తలెత్తాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి నిరంకుశ అధికార యంత్రాంగం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద అసంఘటిత రంగాన్ని వేధిస్తూ వచ్చాయి. ఒక వ్యక్తికి వంద రోజుల పాటు ఉపాధి దొరుకుతుందన్న హామీ లేకుండా పోయింది. వంద రోజుల పాటు ఉపాధి కల్పించడమే ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం అయినా కార్మికులకు సక్రమంగా వేతనాలు అందడం లేదు. ఒక్కోసారి చాలా కాలం వరకూ అందడం లేదు. ఈ చట్టంలో నష్టపరిహార బాధ్యతకు సంబంధించిన నిబంధనలు లేవు. కేరళలో వేతనాల చెల్లింపులో దాదాపు 193 రోజులు జాప్యం జరిగింది. ప్రాజెక్టు వివరాల రూపకల్పన సకాలంలో జరగలేదు. గ్రామ సభలు కూడా తమ పాత్రను నిర్దేశిత సమయంలో నిర్వర్తించలేక పోయాయి. ప్రాజెక్టు బడ్జెట్‌లు కూడా సకాలంలో రూపొందించలేదు. కేంద్రంలోని, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తగిన నిధులు తగిన సమయంలో కేటాయించలేదు.కార్మికులు డిమాండ్‌ చేసినపుడు లేదా దరఖాస్తు చేసినపుడు ఉపాధి దొరకక పోవడం మరొక ముఖ్యమైన, ప్రధానమైన సమస్య. కానీ చట్టం మాత్రం కార్మికులు ఉపాధి కోరుతూ దాఖలు చేసిన పక్షం రోజుల్లోగా వారికి ఉపాధి దొరికేలా చూడాలని నిర్దేశిస్తోంది. ఒకవేళ వెంటనే ఉపాధి కల్పించలేని పరిస్థితే తలెత్తితే, నిరుద్యోగ భృతి కల్పించాలని కూడా చట్టం పేర్కొంటోంది. కానీ ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. సక్రమమైన సామాజిక ఆడిట్‌ లేదు. గ్రామీణ వనరుల స్థాయిని, గ్రామీణ జీవనాన్ని పటిష్టపరచడం ద్వారా నిలకడగా అభివృద్ధిని సాధించడం ఈ చట్టం లక్ష్యం. కానీ ఈ అంశం ప్రాజెక్టుల్లో వాస్తవంగా కొరవడుతోంది. చట్టాన్ని అమలు పరచడంలో ఇంజనీర్లు, ఇతర అధికారుల కొరత కూడా పెద్ద అవరోధంగా ఉంది. చట్టంలో పేర్కొన్నట్లుగా అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కృషీ చేయడం లేదు. పనుల భౌతిక పరిశీలన అనేది సకాలంలో పూర్తి కావడం లేదు. చేసిన పనులను లెక్కించడంలో జరుగుతున్న జాప్యం కారణంగా నష్టపోతున్నది కార్మికులే. వారికే వేతనాల్లో కోతలు పడుతున్నాయి. ఉపాధి కార్డుల కోసం నమోదు చేసుకునే కుటుంబాల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకు కేటాయింపులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుదిస్తున్నాయి. చట్టంలో పేర్కొన్నట్లుగా తాగునీటి సరఫరా, ప్రథమ చికిత్స కిట్‌లను అందించడం, పని ప్రదేశాల్లో సేద తీరే సౌకర్యాన్ని కల్పించడం వంటివి చేపట్టేందుకు అటు ప్రభుత్వాలు కానీ, ఇటు స్థానిక సంస్థలు కానీ ఎలాంటి ఏర్పాట్లూ చేయడం లేదు. అవసరమైన పనిముట్లు, ఇతర పరికరాలను కూడా అధికారులు కొనకడం లేదు. కార్మికులు స్వయంగా పనిముట్లు తెచ్చుకుంటే వాటికి అద్దె చెల్లించడంలేదు. కార్మికులకు తప్పనిసరిగా చేతులకు గ్లౌవ్‌లు, కాళ్ళకు బూట్లు ఉండాలని చట్టం నిర్దేశిస్తోంది. మరీ ముఖ్యంగా మురికిగా ఉండే లేదా ప్రమాదకరంగా ఉండే పని ప్రదేశాల్లో పని చేస్తున్నపుడు ఇవి తప్పనిసరని పేర్కొంటోంది. కానీ వీటి అమల్లో వైఫల్యం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రమాదం జరిగితే సరైన చికిత్స, రక్షణ కల్పించే సౌకర్యాలు పలు పని ప్రదేశాల్లో లేవు. ప్రమాదం జరిగి సదరు కార్మికుడు లేదా కార్మికురాలు పనికి రాలేని పరిస్థితి ఉంటే వారి రోజువారీ అవసరాలు తీర్చే ఏర్పాటు ఉండటం లేదు. అటువంటి చైతన్యమే కొరవడింది.
        మార్గం చూపిన కేరళ కార్మికులు
    కేరళలో గ్రామీణ పేదలు ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఐకెఎస్‌ కేరళ శాఖ రాష్ట్రంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద అసంఘటిత రంగంలోని కార్మికులను సమీకరించాలని నిర్ణయించింది. ఇది, ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల యూనియన్‌ (ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు) ఏర్పడేందుకు దారి తీసింది. 2011 సెప్టెంబరు 4న ఈ యూనియన్‌ ఆవిర్భవించింది. గత ఏడాది నవంబరు 24, 25 తేదీల్లో అలప్పూజలో మొదటిసారిగా రాష్ట్ర మహాసభను నిర్వహించింది. ఆనాడు ఎఐకెఎస్‌ అధ్యక్షుడిగా వున్న సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్‌.రామచంద్రన్‌ పిళ్ళై ఈ మహాసభను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 720మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయుకు ఇప్పుడు రాష్ట్ర, జిల్లా, ప్రాంత (జోన్‌), గ్రామ పంచాయితీలు, వార్డుల స్థాయిలో కమిటీలు ఏర్పడ్డాయి. కేరళలో, యూనియన్‌ ఇప్పుడు దాదాపు 14 జిల్లాల్లో పనిచేస్తోంది. కేరళలో దాదాపు 26,11,116 కుటుంబాలు ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నాయి. ఎలాంటి రాజకీయ విబేధాలు, మత లేదా కులాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తేవాలని ఎన్‌ఆర్‌ఇజిఎ భావించింది.
యూనియన్‌ ఏర్పడిన ఈ స్వల్ప కాలంలోనే సమ్మెలు, ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు, జాతాలతో సహా అనేక కార్యక్రమాలను ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు చేపట్టింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులు ఈ అన్ని ప్రచారాల్లోనూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనియన్‌ చేపట్టే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికుల సంఖ్య 2.25 లక్షల నుంచి 3.5 లక్షలకు పెరిగింది. ఇప్పటివరకూ ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు కృషి వల్ల దినసరి వేతనాల్లో పెరుగుదల, రోజులో మొత్తం కార్మికుల పనిగంటల్లో ఒక గంట కోత, పని దినాల సంఖ్య పెంపు, సకాలంలో వేతనాల చెల్లింపు, వంద రోజుల పని పూర్తి చేసిన కార్మికునికి వెయ్యి రూపాయిల అవార్డు ఇవ్వడం, ఓనం పండుగ సందర్భంగా ప్రతి కార్మికునికీ రూ.400 విలువ చేసే కొత్త బట్టలు, కార్మికులకు పెన్షన్‌ పథకం వంటివి సాధించుకున్నారు.
2013 సంవత్సరానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు వ్యవసాయ రంగాన్ని చాలా ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేయడం నేడు నెలకొన్న ప్రధాన సమస్య. అంటే దీనర్థం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను ఇటీవలి సంవత్సరాల వరకూ ఉపయోగించిన విధంగా ఇప్పుడు వ్యవసాయ కార్య కలాపాలకు ఉపయోగించ రాదన్నమాట. ఫలితంగా, గ్రామీణ పేదలకు ఉపాధి నిరాకరణ మరింత ఎక్కువవుతోంది. దాంతో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని యూనియన్‌ నిర్ణయించింది.
       డిమాండ్ల పత్రం
   కార్మికుల్లోనూ, అధికారుల్లోనూ ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు కల్పించిన చైతన్యం ఫలితంగా పని దినాలు పెరగడమే కాక వంద రోజుల ఉపాధి పూర్తి చేసే కార్మికుల సంఖ్య కూడా పెరిగింది. ఈ చట్టం గురించి అందరికీ తెలిసేలా చేయడానికి యూనియన్‌ చాలా కృషి చేసింది. మళయాళంలో ఒక చిన్న బుక్‌లెట్‌ను కూడా ప్రచురించింది. వివిధ స్థాయిల్లో చైతన్యపరిచే కార్యక్రమాలను యూనియన్‌ నిర్వహించింది. 'ఉపాధి హామీ : సమస్యలు, పరిష్కారాలు' అనే శీర్షికతో యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఒక కరపత్రాన్ని ప్రచురించి విస్తృతంగా పంపిణీ చేసింది. వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ యూనియన్‌ను ఎలా నిర్మించాలనే దాన్ని వివరంగా పేర్కొంటూ ఒక పత్రాన్ని, సొంతంగా నియమనిబంధనలను కూడా యూనియన్‌ ఆమోదించింది. ఈ ఏడాది జూన్‌ 30న త్రిస్సూర్‌లో ప్రత్యేక రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను కూడా నిర్వహించింది. ఈలోగా, ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ల పత్రాన్ని అందజేసింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను సక్రమంగా అమలు చేయాలని ఈ డిమాండ్ల పత్రం కోరుతోంది. నిలకడగా కొనసాగించేందుకు, ఈ చట్టం కింద కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ అందేలా ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ప్రతి ఏటా ప్రతి కుటుంబానికీ కనీసం 200 రోజుల పాటు పని కల్పించాలని, దినసరి వేతనాన్ని రూ.320కి పెంచాలని, ఉదయం 9 నుంచి 4 గంటల వరకూ ఒక గంట విరామంతో సహా పని వేళలను రీ షెడ్యూల్‌ చేయాలని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద పని చేస్తున్న కార్మికులకు సంక్షేమ నిధి బోర్డును ఏర్పాటు చేయాలని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను పక్కన పెట్టే విధంగా ఉన్న తమ ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని, ఈ కార్మికుల పిల్లలకు విద్యా ప్రయోజనాలు అందచేయాలని, వ్యవసాయ రంగాన్ని ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ పనుల పరిధి నుంచి తొలగించడాన్ని రద్దు చేయాలని ముఖ్యంగా, వరిసాగును ఈ చట్టం పరిధిలోకి తేవాలని, ఎందుకంటే కేరళలో ఆహార భద్రతకు హామీ కల్పించాలంటే ఇది తప్పనిసరని యూనియన్‌ ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.
ఇంకా వేతనాలు వారం వారం చెల్లించాలని, ఒకవేళ ఎప్పుడైనా జాప్యం జరిగినా ఎట్లి పరిస్థితుల్లోనూ 14 రోజుల కన్నా ఎక్కువ ఆలస్యం చేయరాదని, ఒకవేళ అంతకన్నా ఎక్కువ జాప్యం జరిగితే దానికి నష్టపరిహారం చెల్లించాలిని కూడా డిమాండ్‌ చేసింది. ఈ చట్టం కింద పనిచేసే కార్మికులందరికీ బీమా కల్పించాలని, పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం, ప్రాధమిక చికిత్సా కిట్‌లను కల్పించాలని, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయడం వంటి ఇంకా అనేక డిమాండ్లను ప్రభుత్వాల ముందించింది.
పైన పేర్కొన్నవాటితో సహా వివిధ సమస్యల పరిష్కారానికి, మరింత ఉధృతంగా ప్రచారాన్ని, కార్యాచరణను చేపట్టాలని ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు పిలుపిచ్చింది. ఇందుకు సంబంధించి యూనియన్‌ చాలా ఆశాభావంతో ఉంది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులందరూ యూనియన్‌ బ్యానర్‌ కింద ఐక్యతతో, ఉత్సాహంగా ఉంటూ ఈ డిమాండ్లను నెరవేర్చుకోగలరని యూనియన్‌ భావిస్తోంది.
Prajashati Telugu News Paper Dated: 31/10/2013