Showing posts with label జిలుకర శ్రీనివాస్. Show all posts
Showing posts with label జిలుకర శ్రీనివాస్. Show all posts

Sunday, July 14, 2013

విప్లవవాదుల్లోనూ మనుధర్మం ! - డా. జిలుకర శ్రీనివాస్


July 15, 2013
'మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు' (ఏప్రిల్ 1) అనే నా వ్యాసంపై నెల్లుట్ల నర్సింహారావు, పి.వరలక్ష్మి, ఎస్వీ సత్యనారాయణ వారి అవగాహనను ప్రకటించారు. త్రిపురనేని, రాంభట్ల విశ్లేషణలను ప్రస్తావించాను. ఒక్కరూ వాళ్లను సమర్ధిస్తూ రాయలేదు. పాపం.. త్రిపురనేని, రాంభట్ల!
అంబేద్కర్‌వాదులు ఆచరణలో లేరని నర్సింహారావు ఆరోపణ. కానీ ఆచరణ లేకుండా అంబేద్కరిజం వుండదు. అంబేద్కర్ జీవితమంతా పోరాటమే! ఆచరణే! సరే, ఇప్పటి కాలమే తీసుకుందాం. కాంగ్రెస్, బిజెపీలను ఉత్తరప్రదేశ్‌లో కమ్యూనిస్టులు ఏమీ చేయలేకపోయారు. కానీ మహాపురుషుడు కాన్షీరాం ఆ రెండు పార్టీ ధ్వంసం చేశాడు. కాన్షీరాం ఆచరణను మించిన తార్కాణం ఏముంటుంది? ఆయన స్ఫూర్తితో ఇక్కడ జీవితాలను అంకితం చేసిన బహుజనుల ఆచరణను గుర్తించకపోవటం ఒక కుట్ర. పైగా దళితులను కమ్యూనిస్టులకు దూరం చేసే కుట్ర అని నా మీద ఫిర్యాదు. నిజమే! కమ్యూనిస్టులకు దూరం చేసి అంబేద్కర్‌కు, కాన్షీరాంకు దగ్గర చేయటమే మా లక్ష్యం. జేమ్స్ ఫ్రెడ్రిక్‌సన్ చెప్పినట్టు ప్రతి రచనా ఒక రాజకీయ కార్యాచరణే!
మార్క్సిజం అజేయమనీ, చలనశీలమైందనీ ఎస్వీ ఏవేవో విశేషణాలుపయోగించారు.

మార్క్సిజం చలనశీలమైంది అంటేమిటి? చలనం దేనిలోనైనా వుండొచ్చు. అది ఎటువైపైనా వుండొచ్చు. కానీ లక్ష్యం వైపే వుంటుందని చెప్పలేం. కాబట్టి చలనం అన్న ప్రాథమిక అంశం దగ్గరే మార్క్సిస్టులు ఆగిపోయారు. అంబేద్కర్ చలనం కన్న గమనం, గమ్యం ముఖ్యమని భావించాడు. 'ఈ సమాజంలో కులం వుంది. వర్గం వుంది' కాబట్టి ఈ రెంటికీ వ్యతిరేకంగా పోరాటం జరగాలని ఎస్వీ అంటున్నారు. ఇది కుల-వర్గ సమాజమని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యుదయ రచయితల సంఘం తీర్మానించిందా? ఆయన అభిప్రాయంతో సిపిఐ ఏకీభవిస్తుందా? కులం గురించి చర్చ జరిగిన ప్రతిసారీ ఈ అభ్యుదయ, విప్లవ సంస్థల నాయకులు 'కుల-వర్గ సమాజం' అనే వాదన ముందుకు తెస్తారు. కుల రహిత పెట్టుబడిదారీ సమాజాన్ని అంబేద్కర్‌వాదులు కోరుతున్నారని ఆయన నిందారోపణ చేశారు.

దేనిమీదైనా మాట్లాడేస్తామనే అహంకారం కమ్యూనిస్టులకు ఎక్కువ. అంబేద్కర్ రచనలేవీ చదవకుండానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కేవలం వీళ్లకే చెల్లింది. అంబేద్కరిజం పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి ఏమి చెప్తుందో ఎస్వీకి తెల్సినట్టు లేదు. 'స్టేట్స్ అండ్ మైనార్టీస్'లోనూ, ఇతర రచనల్లోనూ ఆయన ప్రతిపాదించిన 'స్టేట్ సోషలిజం' గురించి ఈయనకేమీ తెలీదు. వ్యక్తిగత ఆస్తిని విప్లవం ద్వారా రద్దు చేయగలవు కానీ కుల వ్యవస్థను నిర్మూలించలేవు. అంటే కమ్యూనిస్టులు వర్గం లేని కుల సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారా? అందుకే, అంబేద్కరిజమే కుల సంబంధాలను, ఆస్తి సంబంధాలనూ నిర్మూలించగలదు. ప్రపంచీకరణ బూచి చూపి బ్రాహ్మణిజాన్ని సమర్ధిస్తారా? ప్రపంచీకరణను నిలువరించే శక్తి కాన్షీరామ్ ఉద్యమానికి మాత్రమే ఉంది.
వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? ఎక్కణ్నించి వస్తుంది? వ్యక్తి చైతన్యాన్ని నిర్ణయిస్తున్న జ్ఞానం ఎలాంటి స్వభావాన్ని కల్గి వుంది? సాహిత్యం సమాజానికి దర్పణం అయితే ఇక్కడి రచయితలు ఆ సమాజ వాస్తివికతను ఎందుకు చిత్రించలేదు.

లెనిన్ చెప్పిన పరావర్తన సిద్ధాంతం ప్రకారం రచయిత సమాజంలోని పరిస్థితులను చైతన్యంతో తిరిగి రచనల్లో ప్రతిఫలింప చేస్తాడు కదా! మరి ఇక్కడి రచయితలు ఈ సమాజంలో వున్న కుల వ్యవస్థను రచనల్లో ప్రతిఫలించలేదేమి? నిత్యం కులంలో జీవిస్తూ, దాని నియమాల ప్రకారం నడకను, నడతను కొనసాగించే బ్రాహ్మణవాద రచయితలు పూర్తి ఎరుకతో దాని గురించి రాయకపోవటంలో వున్న కుట్ర ఏమిటి? వీటి సమాహారమే నా వ్యాసం. జ్ఞాన సిద్ధాంతంలో సమాజ పరిణామ క్రమాన్ని పరిశీలించే పద్ధతి అంతర్భాగంగా వుంటుంది. అంటే మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం చారిత్రక భౌతికవాదమనే పద్ధతిలో ఈ సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తారు. కానీ అది కులం పుట్టుక, పరిణామాన్ని విశ్లేషించలేకపోయింది. కుల వ్యవస్థ ఆవిర్భావాన్ని వివరించే ఆ పద్ధతి పూర్తిగా తప్పుడు ఫలితాలనిస్తుందని నేనేంటే పి.వరలక్ష్మీ అంగీకరించటం లేదు.


వరలక్ష్మిది ప్రత్యేక-పరిమితవాదం. సంఘ సంస్కర్తలకూ, భావ కవులకూ, ఆ మాటకొస్తే విప్లవ రచయితలకూ ప్రత్యేకతలున్నాయని ఆమె వాదన. వాళ్ల సామాజిక నేపథ్యం వల్ల వాళ్ల రచనలకు పరిమితులు తప్పక వుంటాయని ఆమె అంటున్నారు. ఆ పరిమితులను గమనించి వాళ్లను అర్థం చేసుకోవాలని సూచన. ఈ ప్రత్యేకవాదాన్ని ముందు పెట్టే చాలా కాలం అనేక సాహిత్య సమస్యలను చర్చకు రాకుండా చేశారు. సంస్కరణవాద చరిత్రతో పాటు కాల్పనికవాద చరిత్రను కూడా తీసిపారేయాలని నేను ఆరాటపడినట్టు ఆమె ఆరోపణ. గోపాల కృష్ణమశెట్టి, కందుకూరి, గురజాడ వంటి వాళ్లకు మార్క్సిజంతో సంబంధం లేదనీ, అలాంటి వాళ్లకు మార్క్సిస్టు జ్ఞానసిద్ధాంతంతో పనేమిటని ఆమె అంటున్నారు, నేనేదో వాళ్లంతా మార్క్సిస్టులు అన్నట్టు. నిజమే, వాళ్లు మార్క్సిస్టులు కాదు. టాల్‌స్టాయ్ కూడా మార్క్సిస్టు కాదు.

బోల్షివిక్కు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కూడా కాదు. కానీ ఆ పార్టీ సభ్యుడైన మాక్సిం గోర్కీ కన్న గొప్పగా, వాస్తవికంగా టాల్‌స్టాయ్ రచనలు చేశాడని లెనిన్ కొనియాడాడు కదా! అంటే వాస్తవికతను చిత్రించే నిజాయితీ వుండాలి. అలాంటి నిజాయితీని ఈ దేశంలోని బ్రాహ్మణవాద రచయితలు చూపలేదని లెనిన్ కన్న ముందే మహాత్మ జ్యోతిరావ్ ఫూలే విమర్శించారు. సంస్కరణవాద, కాల్పనికవాద సాహిత్యం ఎందుకొచ్చాయి? గోపాలకృష్ణమ శెట్టి, కందుకూరి, గురజాడ వంటి రచయితలు రచనలు చేస్తూన్న కాలం కన్న ముందునుంచే దేశవ్యాప్తంగా బ్రాహ్మణాధిక్యత నుంచి విముక్తి కోసం కింది కులాలు పోరాడుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్‌లో హరిచంద్ ఠాకూర్, గిరిచంద్ ఠాకూర్‌ల నాయకత్వంలో మత్వా ఉద్యమం, మహాత్మ జ్యోతిరావ్ ఫూలే నాయకత్వంలో బ్రాహ్మణేతర సత్యశోధక ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి.

కులం, వర్ణం పుట్టుక, సామాజిక అసమానతలు, మూలవాసుల విముక్తి, బ్రిటీషు పాలకుల ద్వంద్వ వైఖరి మీద సైద్ధాంతిక చర్చలే కాదు, భౌతిక ఉద్యమాలు కూడా జరుగుతున్న రోజులవి. మరి, వాటి పట్ల ఈ రచయితలు స్పందించలేదేం? వీరి రచనల్లో అసలు కింది కుల జీవితం, పాత్రలు కన్పించక పోవటానికి కారణమేంటి? సరే, వాళ్లకు తెల్సిన బ్రాహ్మణ జీవితమే రాశారనుకుందాం. ఆ బ్రాహ్మణ వాస్తవికవాదాన్ని ఆ తర్వాతి తరం ఎందుకు కొనసాగించలేదో వరలక్ష్మి చెప్తే బాగుండేది. సంస్కరణవాదం మరింత వాస్తవికతను అందిపుచ్చుకొని నిర్దిష్టత వైపు పయనించాలి కదా! మరి భావకవిత్వం పేరుతో కాల్పనికవాదం తలెత్తిందేమిటి? మానవ కర్తృత్వం వల్లే విప్లవం వస్తుందని నమ్మే వరలక్ష్మి కాల్పనికవాదం కూడా ఒక కులం కర్తృత్వం వల్లే తలెత్తిందని ఒప్పుకోదేమి!


మూలవాసీ మహాపురుషులు ప్రారంభించిన కుల వ్యతిరేకోద్యమం 1910 తర్వాత విప్లవాత్మక రూపం తీసుకుంది. అది ఈ తెలుగు సాంస్కృతిక చరిత్రలో నమోదు కాకుండా, అక్షరాస్యులైన వారి మెదళ్లు ఆ ఉద్యమం వైపు వెళ్లకుండా కాల్పనికవాదం అవసరమైంది. భావకవిత్వం అందులో ఒక పాయని అందుకే అన్నాను. అంటే కుల వాస్తవికతను గుర్తించకుండా భావకవిత్వం వచ్చింది. భావ కవిత్వంలోని ప్రియుడు మనువాది, ప్రియురాలూ మనువాదే! నండూరి 'ఎంకి' ఏ కులజురాలో మార్క్సిస్టు సిద్ధాంతం చెప్పగలదా? ఇంకా, అభ్యుదయ, విప్లవవాద రచయితలు తక్కువ తిన్నారా? వాళ్లు కూడా కాల్పనికవాదులు చేసిన దాన్నే 'వర్గం' పేరుతో చేశారు. అలా చేయటంలో వాళ్ల లక్ష్యం అంబేద్కర్ ఉద్యమాన్ని దెబ్బతీయటం కాదా? 1930-32 మధ్యకాలంలో అంబేద్కర్ కింది కులాలకు చట్టసభల్లో ప్రవేశించే ఓటు హక్కు, ప్రత్యేక నియోజకవర్గాల గురించి పోరాడుతూంటే ప్రజలంతా ఆయన వెంట వున్నారు.

1932లో కమ్యూనల్ అవార్డునను శ్రీశ్రీ వ్యతిరేకించాడా? సమర్ధించాడా? ఈ దేశంలోని బహుజనులకు రాజకీయ, పౌరహక్కులు తిరస్కరించిన గాంధీ చనిపోతే ఎలిజీలు రాసిన శ్రీశ్రీ అంబేద్కర్ అమరుడైతే ఒక్క కవితా రాయలేదే!? 'యజ్ఞోపవీతాన్నీ వైప్లవ్య గీతాన్నీ' అని ఆయనే చెప్పుకున్నాడు. దానర్థం బ్రాహ్మణవాదినీ విప్లవవాదినీ అనే కదా! యజ్ఞోపవీతాన్ని కీర్తించినవాడు విప్లవవాదెలా అవుతాడు. వర్ణ ధర్మాన్ని సమర్ధిస్తూ రాసిన విశ్వనాథ సత్యనారాయణ మనువాదయితే, వర్గం పేరుతో కులం గురించి ఒక్క మాటా మాట్లాడక పోగా, అది ఉనికిలో లేనట్టు రచనలు చేసిన శ్రీశ్రీ కూడా మనువాదే. బ్రాహ్మణవాద రచయితలు కులం గురించి ఎందుకు రాస్తారు అంటున్నారు వరలక్ష్మి. విప్లవ రచయితలు కులవ్యవస్థకు వ్యతిరేకంగా రాయలేదేం? అంతేకాదు, వాళ్ల రచనల నిండా పర్చుకొన్న బ్రాహ్మణవాద ప్రతీకలు, కవి సమయాలు ఏ భావజాలానికి సంకేతాలు? విప్లవవాదుల చైతన్యాన్ని కూడా మనుధర్మమే నిర్ణయిస్తుంది.


జ్ఞాన సిద్ధాంతంలో పాదార్థిక విషయాలు (భౌతిక అంశాలు), భావజాల (ధర్మం) విషయాలు వుంటాయని ఆమె అంగీకరించారు. కానీ ఇక్కడ పాదార్థిక విషయాలు వ్యక్తి చైతన్యాన్ని రూపొందిస్తాయా? లేక భావజాలం రూపొందిస్తుందా? మనుధర్మం మనిషి స్థాయినీ, విలువనీ నిర్ణయిస్తుంది కాబట్టి కుల సమాజంలో వ్యక్తి విలువ కులాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల ఏ కులస్తుడితో ఎలా వ్యవహరించాలన్నది ఆ ధర్మమే నిర్దేశిస్తుంది. ఒక వ్యక్తికి ఆస్తి వుండాలా వద్దా అన్నది అతడు పుట్టిన కులం వల్ల నిర్ణయించబడుతుంది. ఎలా ఆలోచించాలో ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో కులమే నిర్ణయిస్తుంది. అంటే, ఒక వ్యక్తి జ్ఞానం పాదార్థిక విషయాల ఆధారంగా కాకుండా మనుధర్మం (భావజాలం) కారణంగా నిర్ణయం అవుతుంది. ఆ భావజాలాన్ని అతడి రచన ప్రతిఫలించాలి. దాన్ని నిజాయితీగా చిత్రించాలి. అలా చేయని రచయిత ఎంత గొప్పవాడైనా అతడు బ్రాహ్మణవాదే అవుతాడు. మార్క్సిస్టు సిద్ధాంత ప్రవచకులు ఎన్ని రకాలుగా వాదించినా ఇదే అంతిమ సత్యం.

- డా. జిలుకర శ్రీనివాస్
(చర్చ ముగిసింది)

Andhra Jyothi Telugu News Paper Dated : 15/07/2013 

Sunday, March 31, 2013

మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు - డా.జి లుకర శ్రీనివాస్




ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులూ ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.


సాహిత్యంలో వాస్తవికత ఒక తిట్టుపదంగా మారిపోయింది. వాస్తవికత ఒక నిర్మాణం. గోపాలకృష్ణమ శెట్టి, కందుకూరి, గురజాడలు బ్రాహ్మణీయ వాస్తవికతను నిర్మాణం చేశారు. అయితే, బ్రాహ్మణీయ వాస్తవికత నికరంగా నిలబడకుండానే పలాయనవాదంలోకి జారుకుంది. అదే కాల్పనికవాదం. భావ కవిత్వం దానిలో ఒక పాయ. కుల వాస్తవికతను సైద్ధాంతిక, రాజకీయ క్షేత్రంలో కింది కులాలు వ్యక్తీకరించడమే కాదు దాని తార్కికతనూ నిర్ణాయకవాదాన్నీ ప్రశ్నిస్తున్న 'కాలం'లో తెలుగు సాంస్కృతిక 'స్థలం' బ్రాహ్మణీకపు కాల్పనికవాదంలోకి సచేతనంగానే పాదం మోపింది. అదే నడక అభ్యుదయ, విప్లవ రంగాలను కూడా నియంత్రించింది. దానికి మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పునాది. అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు మార్క్సు ప్రతిపాదించిన భౌతికవాదం పునాది. లెనిన్ మార్క్సు జ్ఞాన సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దానికి శాస్త్రీయతను చేకూర్చాడు. లెనిన్ ప్రతిపాదించిన 'పరావర్తన సిద్ధాంతం' (రిఫ్లెక్సివ్ థీయరీ) ప్రపంచ వ్యాప్తంగా జ్ఞాన సిద్ధాంతాలను విశేషంగా ప్రభావితం చేసింది. సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ రచయితలు పరావర్తన సిద్ధాంతాన్ని బలంగానే ప్రచారం చేశారు. మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతానికి పరావర్తన సిద్ధాంతమే పునాది. ఈ సిద్ధాంతం నిజంగా అద్భుతమైంది. కాని, ఈ సిద్ధాంత స్ఫూర్తిని ఇక్కడి బ్రాహ్మణవాద రచయితలు గ్రహించలేదని విమర్శకుల భావన.

త్రిపురనేని మధుసూదనరావు 'సాహిత్యంలో వస్తు శిల్పాలు' అనే గ్రంథంలో 'పరావర్తన సిద్ధాంతం - సాహిత్యం' అనే ఉపశీర్షిక కింద పరావర్తన సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించారు. "...ఇంద్రియ జ్ఞానాలకి ఆలోచనలకీ మూలాధారం ఏమిటి? అంటే చైతన్యానికి మనస్సుకీ సంబంధం ఏమిటి? పదార్థం ముందు, దాని నుంచీ చైతన్యం ఉత్పన్నం అవుతుంది అని చెప్పుకోవటం మాత్ర మే చాలదు. మనిషికి ఇంద్రియ జ్ఞానాలూ, ఆలోచనలూ, ఆవేశం వంటివి ఎలా వస్తాయి అనేది భౌతికవాద జ్ఞాన సిద్ధాంత మౌలిక ప్రశ్న. దీనికే లెనిన్ పరావర్తన సిద్ధాంతం సమాధానం చెపుతుంది'' అని తెలిపారు. మనిషి మనస్సు నుండే జ్ఞానం పుడుతుందని భావవాదులు తలుస్తారనీ, భౌతికవాదులు ఇంద్రియ జ్ఞానం వికసిస్తుందని చెపుతారని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన సముపార్జనా క్రమంలో ఇంద్రియాల ద్వారా సమాచార గ్రహణం తొలి దశ. ఇంద్రియాలు లేకుండా మెదడుకు సమాచారం అందే వీలు లేదు. మెదడూ, ప్రపంచం రెండూ పదార్థ రూపాలే అంటాడు త్రిపురనేని. ఈ రెండింటి మధ్య వుండే సృజనాత్మకమైన, క్రియాశీలమైన సంబంధాన్ని పరావర్తన సిద్ధాంతం అంటారని ఆయన భావన. 

"అద్దంలో చూసుకున్నప్పుడు మొఖం బింబం. అద్ధంలో కనిపించే మొఖం ప్రతిబింబం. బింబం లేకుండా ప్రతిబింబం ఉండదు. అలాగే మెదడు అద్దం అయితే అందులో ప్రతిబింబించేది బాహ్యప్రపంచం. ఈ బింబ ప్రతిబింబ ఉదాహరణ చాలా ప్రాథమికమైన పోలికగా మాత్రమే గ్రహించాలి. ప్రతిబింబానికి పరావర్తనకీ చాలా తేడా వుంది. అద్దంలో ప్రతిబింబానికి బింబానికీ మధ్య క్రియాశీలమైన, సృజనాత్మకమైన పరావర్తనా శీలమైన సంబంధం ఉండదు. మెదడు కేవలం అద్దం కాదు. అదొక జీవ శారీరక వ్యవస్థ. నిర్ధిష్ట క్రియలను నిర్వహించే అనేక సూక్ష్మ భాగాల అవిభాజ్య సముదాయం. కాబట్టి బాహ్య ప్రపంచం జ్ఞానానికి మూలం. ఇంద్రియాలు జ్ఞానానికి సాధనాలూ, వాహికలూ మాత్రమే కానీ ఇంద్రియాలే జ్ఞానానికి మూలం కాదు. బాహ్య ప్రపంచం ఇంద్రియాల ద్వారా మెదడులో పరావర్తనం చెందకుండా జ్ఞానం అనేది ఉండదు'' అంటారు త్రిపురనేని మధుసూదనరావు. మార్క్సు పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించడానికీ, ఉత్పత్తి విధానాన్ని సూత్రీకరించడానికీ కూడా పరావర్తన సిద్ధాంతమే మూలమని త్రిపురనేని భావన. పంటని ఉత్పత్తి చేసేందుకు భూమి, నీళ్లు, నాగలి, ఎద్దులు, ఎరువులు వంటివన్నీ అవసరమనీ, అవన్నీ బాహ్య ప్రపంచంలో దొరికేవనీ, అవి మనిషి చైతన్యంతో సంబంధం లేకుండానే ప్రపంచంలో ఉంటాయనీ, కానీ, వాటిని సృజనాత్మకంగా పరావర్తనం చేసుకోవటం వల్లే రైతులు పంటలు పండిస్తున్నారనే ఉదాహరణ సరిపోతుందని ఆయన అన్నాడు. మానవ చేతన కేవలం వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించటమే కాదు, దాన్ని పునర్ సృష్టిస్తుంది కూడా అని లెనిన్ తన వృద్ధాప్యంలో రాసుకున్న నోట్సులో పేర్కొన్నాడు. 

అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న బాహ్య ప్రపంచాన్ని మానవుడు తనకు అవసరమైన విధంగా నిర్మాణం చేసుకుంటాడని దీని అర్థం. ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని బట్టీ, చారిత్రక పరిమితుల్ని బట్టీ అది నిర్ణయించబడుతుందని కూడా త్రిపురనేని పేర్కొన్నారు. ఈ మొత్తం సిద్ధాంతంలో 'బాహ్య ప్రపంచం', 'వస్తుగత ప్రపం చం', 'ఇంద్రియ చర్య' అనేవి చాలా కీలకం. బాహ్య ప్రపంచం అంటే కేవలం భౌతిక వస్తు సముదాయం మాత్రమే కాదు. ఆ వస్తు సముదాయాన్ని నియంత్రించే లేదా ఉత్పత్తి చేసే లేదా ప్రకృతిలో అంతర్భాగంగా జీవించే మానవ సముదాయం కూడా. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు కూడా బాహ్య ప్రపంచం అనే భావనలో అంతర్భాగం. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి విధానంతో పాటు మారుతాయనేది మార్క్సిస్టు అవగాహన. కాని కులం అనేది ఒక సంబంధం. ఆయా కులాలకు వ్యవస్థలో నిర్దేశిత స్థానం అనుసరించే అనులోమ, విలోమ సంబంధాలు ఉంటాయి. ఇవి వందల యేళ్లుగా ఉత్పత్తిలో గుణాత్మకమైన మార్పు వచ్చిన తర్వాత కూడా మారకుండా కొనసాగుతూ వున్నాయి. ఇండియా సమాజంలోని మానవ సంబంధాలు కుల సంబంధాలుగా వున్నాయనే సంగతిని ఇంద్రియాల ద్వారా మెదడుకు నిరంతరం చేరవేయబడుతూనే ఉంటుంది. ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులు కూడా ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. 

అదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానంతోటే వివిధ కులాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి అంతర్వును బట్టీ, స్థానం, స్థాయిని బట్టి ఆయా కులాల వ్యక్తుల మానసిక ప్రవర్తన ఉంటుంది. అది ఆ కులస్తుడి చైతన్యమై నిరంతరం అతని ప్రమేయ, ప్రవర్తనలను నిర్దేశిస్తుంది. ఇది వాస్తవిక దృశ్యం. ఈ వాస్తవిక దృశ్యం అనేక కుల నియమాల వల్ల నియతం అవుతూంటుంది. ఈ వాస్తవాన్ని మార్క్సిస్టు రచయితలు అంగీకరించలేదు. లెనిన్ వృద్ధాప్యంలో చెప్పిన మానవ చైతన్యం తిరిగి వాస్తవ ప్రపంచాన్ని సృష్టిస్తుందనే సూత్రీకరణను సారభూతంగా అర్థం చేసుకొంటే రచయితలు కుల సంబంధాలను, వాటిని నిర్ణయిస్తున్న భావజాలాన్ని సృజనాత్మకంగా చిత్రించేవారు. కానీ అలా చేయలేదు. అంటే బ్రాహ్మణవాద రచయితల చైతన్యం వాస్తవ ప్రపంచాన్ని పరావర్తనం చేయటం లేదనీ, కాల్పనికతను లేదా అబద్ధాన్ని నిర్మాణం చేస్తుందని అంగీకరించాలి.

పరావర్తన సిద్ధాంతం చారిత్రక భౌతికవాదంతో అంతస్సంబంధం కలిగి ఉంది. చారిత్రక భౌతికవాదం అనేది సమాజాన్ని అధ్యయనం చేసే విశ్లేషించే ఒక పద్ధతి. ఒక మెథడాలజీ. పాశ్చాత్య సమాజాన్ని విశ్లేషించినట్టే కుల నిర్మిత సమాజాన్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది. అది మెథడాలాజికల్ ప్రాబ్లెం. సమాజ పరిణామ క్రమాన్ని మార్క్సిస్టు పద్ధతిలో అర్థం చేసుకొనే ప్రయత్నం త్రిపురనేని చేశారు. రాంభట్ల కృష్ణమూర్తి కూడా అదే ప్రయత్నం చేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అన్వర్తింప చేసే కృషి రాంభట్ల కొనసాగించారు. ఆయన వాస్తవికతను పురాణ వాస్తవికత, ప్రబంధ వాస్తవికత, కాల్పనిక వాస్తవికత, సోషలిస్టు వాస్తవికతలుగా అనేక విభజనలు చేశారు. ఆ క్రమంలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నిర్మాణం వెనక ఉత్పత్తి పోషించిన పాత్రను తెలిపారు. ఉత్పత్తి క్రమంలో రూపొందిన సాహిత్యమే వేదాది సాహిత్యమని ఆయన భావించారు. ఈ కాల్పనిక ఆధిపత్యవాద సాహిత్యంలో ఆయన కెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. రామ, రావణ వైరంలో కూడా ఆయనకు వర్గ సంఘర్షణ కనిపించింది. ఇతిహాస, పురాణాల పట్ల ఆయనకు బలమైన విశ్వాసం వుంది. ఆ రచనలను మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతాన్నీ, మార్క్సిస్టు వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు ఉపయుక్తం చేసుకోవటమే వింత. వేదాలు యురేషియా నుండి ఇక్కడికి వచ్చినవి. హరప్పా నాగరికత నాటి మానవులకు వేదాలకు ఎలాంటి సంబంధం లేదు. వైదిక ధర్మం పూర్తిగా విదేశీయమైంది. 

యురేషియా సంచార జాతుల దురాక్రమణ వల్ల హరప్పా నాగరికత అంతరించింది. హరప్పా నాగరికతలో వర్గ అసమానతలు లేవు. వారు ఉత్పత్తి సాధనాలను అభివృద్ధి చేయటమే కాదు, శాస్త్రీయమైన జ్ఞానాన్ని కూడా నిర్మించారు. మరి హరప్పా నాగరికత కాలం నాటి పురాణాలేవి? ఇప్పుడు ప్రచలితంగా ప్రచారంలో వున్న పురాణాలకు ఎంత వయస్సు ఉంటుంది? ఇతిహాసాలు ఏ కాలంలో ఆవిర్భవించాయి? ఈ ప్రశ్నలకు మార్క్సి స్టు పద్ధతి సరైన సమాధానం చెప్పదు. ఉత్పత్తి పెరిగినప్పుడే వర్ణ వ్యవస్థ ఏర్పడిందనేది మార్క్సిస్టు అవగాహన. కానీ ఉత్పత్తి ఎక్కువగా జరిగిన హరప్పా నాగరికతలో వర్ణ వ్యవస్థ రూపొందలేదు. అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ యురేషియా సంచార తెగల దురాక్రమణ ఫలితమని బోధపడుతుంది. అష్టాదశ పురాణాలు ప్రతివిప్లవం తర్వాత రూపొందినవి. కుల పురాణాలు కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏర్పడినవి. క్రీ.పూ. 187లో మౌర్య చక్రవర్తి బృహద్రదున్ని హతమార్చిన పుశ్యమిత్రుడు వర్ణ వ్యవస్థను పునరుద్ధరించాడు. మనుధర్మం, భగవద్గీత, మహాభారత, రామాయణాలు, అష్టాదశ పురాణాలు రాయించాడు. అంటే వర్ణ వ్యవస్థను సమర్ధించే రచనలు మూలవాసీ చక్రవర్తి బృహద్రదుని రాజ్యాన్ని బ్రాహ్మణుడైన పుశ్యమిత్రుడు చేజిక్కించుకొన్నాకే జరిగింది. 

కానీ, వర్గ సిద్ధాంతం ప్రకారం పైన పేర్కొన్న రచనలన్నీ సమాజం తనకు తానే ఉత్పత్తి క్రమంలో కల్పించుకొన్నవి. అందుకే వాటిలో మార్క్సిస్టులు అనుకూల అంశాలను మాత్రమే చూడగలిగారు. కుల వ్యవస్థ పరిణామాన్ని సూత్రీకరించడానికి చారిత్రక భౌతికవాదం సరిపోదు. అది వర్గ ప్రాతిపదికన మాత్రమే సమాజాన్ని వ్యాఖ్యానించగలదు. సుమారు వేయి సంవత్సరాల పాటు ఉనికిలో వున్న బౌద్ధ రాజ్యాలలో ఎలాంటి సాహిత్యం ఉందో తెలుసుకొనే ప్రయత్నం మార్క్సిస్టు సాహిత్యకారులు చేయలేదు. వేద కాలంలోని రచనలను విశ్లేషించి, ఆ వెంటనే ప్రబంధ కాలానికి వెళ్లిపోయే ఒక పలాయన వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. బౌద్ధ రాజ్యాల్లో విలసిల్లిన సాహిత్య, సాంస్కృతిక, కళా సిద్ధాంతాలను గానీ, విద్యా, వైజ్ఞానిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని గానీ ఏ మాత్రం ప్రస్తావించరు. అంటే, బ్రాహ్మణవాద చరిత్రకారులు ఏ ఆకరాలను ప్రామాణికమని సమాజం మీద రుద్దారో వాటిని మాత్రమే గ్రహిస్తే సమాజ పరిణామ క్రమం సవ్యంగా ఎలా అర్థం అవుతుంది? చారిత్రక భౌతికవాదం పేరుతో బ్రాహ్మణీయ చరిత్ర రాజ్యమేలింది. ఇయంఎస్ నంబూద్రిపాద్ రాసిన 'వేద భూమి' అందుకు నిదర్శనం. వాస్తవికవాదం బ్రాహ్మణవాదానికి మరో పేరుగా మారిపోవటమే విచారం. యూరోప్ సమాజంలో అది సాధించిన ఘన విషయాలు ఇక్కడ సాధించలేకపోవడానికి అది వక్రీకరణకు గురికావటమే కారణం.

వాస్తవికవాదం పేరుతో చలామణి అయిన సాహిత్య ఆధిపత్యానికి ప్రతిస్పందనగా వచ్చిందే 'ప్రతివాస్తవికవాదం' (కౌంటర్ రియలిజం). కులం ఒక వాస్తవం. అస్పృశ్య రచయితలు సాహిత్యంలో కుల వ్యవస్థ స్వరూప, స్వభావాలను చిత్రించిన తీరు, కులం ఒక అధికార వ్యవస్థగా ప్రజల జీవితాలను శాసించే సామాజిక నియతిని కళాత్మకంగా రూపుగట్టిన తీరును పఠించే ఒక పద్ధతే ప్రతివాస్తవికవాదం. అదొక పఠన పద్ధతి మాత్రమే కాదు. ప్రాపంచిక దృక్పథం కూడా. ప్రతివాస్తవికతను అర్థం చేసుకొనేందుకు అంబేద్కరిజం వెలుగులో కుల వాస్తవికతను అర్థం చేసుకోవాల్సిందే. బ్రాహ్మణ ధర్మంలోని కుల అంతర్వుల నియమాన్నీ, కులం పేరుతో కొనసాగుతున్న దాస్యాన్ని చిత్రించటమే సాహిత్యంలో ప్రతివాస్తవికత. కుల వ్యవస్థలో బానిస కులాల రచయితలు సమాజ పరివర్తన కోసం సృజించిన రచనలన్నీ ప్రతివాస్తవికత పరిధిలోకి వస్తాయి. కులం పేరుదో చీల్చబడిన మూలవాసుల కళా సృజనకు, బ్రాహ్మణవాదుల కళా దృష్టికీ మధ్య చాలా వైరుధ్యం తప్పకుండా వుంటుంది. అందుకే ప్రతివాస్తవికవాదం కళాతత్వానికి సంబంధించింది కూడా. పరావర్తన సిద్ధాంతంతో పీడిత కులాల నిజమైన జ్ఞాన సిద్ధాంతానికి సంధి కుదరదు. మసక బారిన పరావర్తన అద్దం సత్య రూపాన్ని ప్రతిఫలించదు. బ్రాహ్మణీయ జ్ఞాన సిద్ధాంత పద్ధతిలో చరిత్ర సమాలోచన చేస్తే సత్యం బోధ పడదు. మూడు దశాబ్దాల కింద అలవాటైన వాస్తవికతను పట్టుకొని వేళ్లాడే మూసవాదులకు ఈ కొత్త జ్ఞాన సిద్ధాంతం చికాకునూ చిరాకునూ కల్గిస్తుంది. అయినా సరే, సత్యాన్ని సత్యంగా చెప్పమని కదా అంబేద్కర్ బోధించింది!

- డా.జిలుకర శ్రీనివాస్
jilukara@gmail.com

Andhra Jyothi Telugu News Paper Dated: 1/4/2013

Tuesday, February 12, 2013

రెండు వ్యాఖ్యలు : ద్వంద్వ ప్రమాణాలు - డా. జిలుకర శ్రీనివాస్



సంస్కృతి పరిశ్రమను ఆధిపత్య కుల వ్యవస్థలో ఒక భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. కమల్ హాసన్ పట్ల సానుభూతిని చూపి, షారుఖ్ ఖాన్ పట్ల ఉదాసీనతను చూపించే స్పందనలు ఎలాంటి మానవీయమైన విలువలనూ పాదుకొల్పలేవు. 

సవర్ణ పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మించే సాంస్కృతిక పరిశ్రమ ఉత్పత్తులకు పీడిత కుల శ్రామిక వర్గాలు కేవలం వినియోగదారులుగా మాత్రమే ఉంటాయి. పాశ్చాత్య సాంస్కృతిక పరిశ్రమ గురించి అడార్నో తర్వాత విలియం రేమాండ్స్, ఫ్రెడ్రిక్ జేమ్‌సన్, జిజెక్ వంటి తత్వవేత్తలు అనేక రచనలు చేశారు. కానీ మన దేశ సంస్కృతి పరిశ్రమ విభిన్నమైంది. దాని రాజకీయ తాత్విక పునాది అందుకు కారణం. భారతదేశంలో వలస పాలన కాలం నుంచీ రూపొందుతూ వచ్చి, ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైన సాంస్కృతిక పరిశ్రమ స్వభావం గురించీ దాని పరిణామాల గురించీ తగినంత చర్చ జరగలేదన్నది విమర్శకుల అభిప్రాయం. పాశ్చాత్య సమాజంలోని సాంస్కృతిక పరిశ్రమకు పెట్టుబడిదారీ వ్యవస్థను మరింత బలపర్చే కార్యక్రమం ఉన్నట్టే, మన దేశంలోని పరిశ్రమకు కొన్ని సామాజిక వర్గాల ఆధిక్యాన్ని మరింత శక్తిమంతం చేసే ఎజెండా ఉంది. ఆ క్రమంలోనే అది అనేక సమస్యలను చాలా తెలివిగా చర్చకు పెడుతూ ఉంటుంది.

'విశ్వరూపం' చిత్రం వివాదం ఆసక్తికరమైన అంశాలను చర్చకు తెచ్చింది. కమల్ హాసన్ గొప్ప కళాకారుడు. తన చిత్రాన్ని ముస్లిం వ్యతిరేకమైందిగా చిత్రిస్తూ నిషేధించడాన్ని ఆయన తప్పు పడుతున్నారు. ఇలాంటి మతతత్వవాదులున్న చోట జీవించలేననీ, లౌకికవాదం ఉన్న మరెక్కడికైనా వెళ్లి బతకాలని ఉందని కమల్ అన్నారు. ఆయన నోటివెంట అలాంటి మాటలు విన్న అనేక మంది అభిమానులు బాధపడ్డారు. ఆయనకు కష్టం కలిగిస్తున్న వారి మీద, వారి మతం మీద తీవ్రమైన అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. ముస్లిం సమాజం అంటేనే ఒక సమస్యగా భావించే మతతత్వవాదులకు ఇదొక మంచి అవకాశంగా లభించింది. కమల్ హాసన్ పట్ల సానుభూతిని ప్రదర్శించే వారి సంఖ్య చాలా ఎక్కువ. కళను కళగానే చూడాలని హితబోధ చేసే ధార్మిక పండితులకూ ఇదొక చక్కని అవకాశం. కమల్ హాసన్‌కు అలాంటి అభద్రతా భావం కలగడానికి కారకులెవరైనా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఆయన ఆవేదన పట్ల ఇంతగా చలించిపోతున్న వారికి షారుఖ్ ఖాన్ వేదన ఎందుకు పట్టడం లేదో ప్రశ్నించాలి.

షారుఖ్ ఖాన్ గొప్ప కళాకారుడని ఎవరి ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. ఆయన నటనా వైదుష్యం విమర్శకులనే కాదు కోటానుకోట్ల మంది అభిమానులను మెప్పించింది. కానీ, మన దేశంలోని మత వివక్ష, అంతర్జాతీయంగా ముస్లిం వ్యతిరేకత వల్ల ఆయన చవి చూసిన అవమానాల గురించి ఒక వ్యాసంలో చాలా హృదయ విదారకంగా రాసుకున్నారు. 

ఆయన మనో వేదనను అర్థం చేసుకున్న చలన చిత్ర ప్రముఖులెవరూ కనిపించలేదు. ఆయనకు సంఘీభావం తెలిపిన వాళ్లూ లేరు. ఇన్ని అవమానాలు జరిగినా సరే, నేను భారతీయుడిని, ఈ దేశంలోనే జీవిస్తాను, మరణిస్తాను అని షారూఖ్ ఖాన్ ఆ వ్యాసంలో రాశారు. ఇలాంటి వాక్యాలు రాసినందుకు ఆయన్ని ప్రశంసించిన వారూ లేరు. జరిగిన అవమానాలకు ఈ దేశం విడిచి వెళ్లిపోతానని షారూఖ్ ఖాన్ ఒక వేళ అంటే ఎలా ఉండేది? కమల్ హాసన్ పట్ల సానుభూతి చూపిన తీరుగానే షారుఖ్ పట్ల సానుభూతినీ సంఘీభావాన్ని ప్రదర్శించేవారా? ఒక వేళ ఆయన కమల్ హాసన్ లాగే మాట్లాడి ఉంటే దేశ వ్యాప్తంగా ముస్లింల మీద అపర దేశభక్తులు దాడులకు తెగబడేవారు కాదా? దేశ ద్రోహం అభియోగం మోపి జైల్లో పెట్టేవారు కాదా? ఇద్దరూ కళాకారులే. కానీ ఒకరి పట్ల సానుభూతి. మరొకరి పట్ల నిరాసక్తత. ఈ ద్వంద్వ వైఖరి దేన్ని చూపిస్తుంది? సమాజంలో ముస్లిం వ్యతిరేకత క్రమంగా విస్తరించటమే కాదు, సామాజిక ఆమోదం పొందుతుందన్నది నిరూపణ అవుతుంది.

విశ్వరూపం నేపథ్యంలోనే పాత వివాదాలను కూడా గుర్తు చేసుకోవాలి. ఇటీవల ఒక యువ కథానాయకుడు హీరోగా ఒక చిత్రం విడుదలైంది. అందులో బ్రాహ్మణులను అవమానించేలా దృశ్యాలున్నాయని కొన్ని సంఘాలు ఆందోళనకు దిగాయి. అదే విధంగా, ఏ వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం అనే సినిమాను నిషేధించాలని ఆ సినిమా చూడకుండానే డిమాండ్ చేశారు. మునుపెన్నడూ రాస్తారోకో, ధర్నా, ముట్టడి వంటి కార్యక్రమాలు చేసి ఎరుగని బ్రాహ్మణ సంఘాలు ఆందోళన మార్గం పట్టాయి. చాలా విచిత్రంగా బ్రాహ్మణీయ సంస్కృతిని విమర్శించే కొన్ని దళిత సంఘాలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు పలికాయి. బ్రాహ్మణుల తరఫున మాదిగలు పోరాడుతారని మందకృష్ణ బాహాటంగానే ప్రకటించారు. విశ్వరూపం చిత్రం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, ముస్లింల తరఫున పోరాడుతామని ఆయన బహిరంగ ప్రకటన చేయలేకపోతున్నాడెందుకు? సినిమాను సినిమాగానే చూడాలని ఇప్పుడు హితవు పలికే ప్రబోధకులు, మతాధిపతులు అప్పుడు మాత్రం హిందూ ధర్మం మీద దాడిగా, భారతీయ సంస్కృతి మీద దాడిగా గగ్గోలు పెట్టారు. విశ్వరూపం సినిమాను మాత్రం సినిమాగానే చూసి ఆనందించాలని సెలవిస్తున్నారు. ముస్లింలకో నీతి, ఇతరులకో నీతేంటని అడిగితే సమాధానం ఏం చెబుతారు?

ముస్లింలను దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా చిత్రిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. అణగారిన వర్గాల సమాజాన్ని అవహేళన చేస్తూ ఎన్నో చిత్రాలు వచ్చాయి. వీటిని తొలి దశలో వెకిలి సినిమాలుగా ప్రేక్షకులు తోసిపుచ్చారు. అయినా సరే, అలాంటి సినిమాలనే దర్శక, నిర్మాతలు ఎందుకు తీస్తున్నారు? మతతత్వం తలకెక్కిన అనేక మంది చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. కాకపోతే, అప్పుడు ఆధిపత్య కుల సంస్కృతిని సార్వజనీనం చేసే ఎజెండా మాత్రమే ఉండేది. రెండు ఆధిపత్య కులాల ముఠా కక్షలను ప్రతీకార కథనాలతో చిత్రించారు.

సినిమా రంగం యొక్క రాజకీయ తత్వశాస్త్రం మనువాదం. తెలుగు సంస్కృతి, భారతీయ సంస్కృతి పేరుతో సినిమాల నిండా బ్రాహ్మణీయ సంస్కృతినే కూర్చుతూ వచ్చారు. వంద ఏళ్ల కిందటి కన్నా ఎక్కువ బ్రాహ్మణీయ అసమాన భావజాలం సంస్కృతి పరిశ్రమ విస్తరించాకే జరిగింది. ఆ భావజాలానికి ఆమోదం దొరుకుతుంది. అది ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించాలని ఆశించిన రాజ్యాంగ కర్త ఆలోచనకు ప్రతికూలమైంది. బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా ఇప్పుడు అణగారిన కులాల్లో చైతన్యం పెరిగింది. ఈ చైతన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు మత మైనార్టీలను శత్రువులుగా చూపే చిత్రాలు నిర్మిస్తున్నారు. మతాల వారీగా సంస్కృతిని నిర్మాణం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే జర్మనీలో కూడా జరిగింది.

హిందూత్వ తీవ్రవాద హింసాకాండ పట్ల చిత్ర పరిశ్రమ ఏనాడూ స్పందించలేదు. రెండు వేల మంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ మారణకాండ మీద ఒక్క సినిమా కూడా రాలేదు. వేల సంవత్సరాల నుంచి దళితులను అంటరాని వారిగా చూస్తూ, నిత్యం వారి మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటే వాటికి వ్యతిరేకంగా సినిమాలు రాలేదు. కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట వంటి దళితుల సామూహిక హననాల గురించీ ఏ ఒక్క సినీ హీరో, సక్సెస్‌ఫుల్ డైరెక్టరూ సినిమా తీయలేదు. 'శూద్ర' అనే ఒక హిందీ సినిమాను జైస్వాల్ అనే దర్శకుడు తెరకెక్కిస్తే దాన్ని విడుదల కానీయకుండా అనేక అవాంతరాలను కల్పించారు.

ముస్లిం, దళిత సమాజం నిత్యం వేధింపులకూ అవమానాలకూ గురవుతున్నది. మత వివక్ష, మత హింసకు ముస్లింలు గురవుతూనే ఉన్నారు. అయినప్పటికీ వారు ఈ దేశంలోనే జీవిస్తాం అంటున్నారు. కేవలం సమానత్వాన్ని మాత్రమే అంగీకరిస్తామన్నందుకు రెండు వేల సంవత్సరాల నుంచీ అంటరాని వాళ్లుగా వెలేయబడిన ఈ దేశ మూలవాసులు ఏనాడూ ఈ దేశం విడిచి పోతామని అనలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఇతర మైనార్టీలు గొప్ప దేశ భక్తులు. ఇది వాళ్లకు మాతృభూమి. కమల్ హాసన్ ఈ దేశం విడిచి వెళ్లిపోతానని ఉద్వేగంలో అన్నాడేమో. కానీ ఆ మాటల వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు భయంకరమైనవి. ముస్లిం సమాజం పట్ల వ్యతిరేకతనూ విద్వేషాన్ని పెంచుతాయి. అన్ని హక్కులూ అధికారాలూ హోదా సామాజిక గౌరవం అనుభవించిన వర్గాలు తేలిగ్గా అల్ప సంఖ్యాకులను ముద్దాయిలను చేస్తాయి. అలా చేసేందుకు అవసరమైన పరిస్థితులను పాలకవర్గమే కల్పిస్తుంది.

సంస్కృతి పరిశ్రమను ఆధిపత్య కుల వ్యవస్థలో ఒక భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. కమల్ హాసన్ పట్ల సానుభూతిని చూపి, షారుఖ్ ఖాన్ పట్ల ఉదాసీనతను చూపించే స్పందనలు ఎలాంటి మానవీయమైన విలువలను ఈ సమాజంలో పాదుకొల్పలేవు. బహుళ సంస్కృతులున్న మన దేశంలో ఒకేఒక్క ఆధిపత్య సంస్కృతిని నిలబెట్టాలని చూస్తే అది కూలిపోక తప్పదు. అప్పుడు నిజంగానే కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ లాంటి మంచి కళాకారులు ఈ దేశంలో జీవించే లౌకిక పరిస్థితులేవీ ఉండవు.

- డా. జిలుకర శ్రీనివాస్

Andhra Jyothi Telugu News Paper Dated : 13/2/2013 

Saturday, December 8, 2012

పురంధరుల చరిత్ర విధ్వంసం - జిలుకర శ్రీనివాస్



చారిత్రక వారసత్వ సంపద లేని మట్టి దిబ్బగా ఈ దేశాన్ని తయారు చేయాలని యురేషియా బ్రాహ్మణవాద పాలకులు కుట్రలు పన్నుతుంటే ఈ దేశాన్ని ఏలాలని కలలు గనే బహుజనులు రాజకీయ యుద్ధం చేసేందుకు సిద్ధపడతారా? రాజకీయాధికారాన్ని కాపాడుకొనేందుకు మతతత్వాన్ని పెంచిపోషిస్తున్న పాలకుల 'కుల రాజకీయాల'ను అర్థం చేసుకోవాలంటే రాజకీయ చర్చలు మతం ప్రాతిపదికన కాకుండా కులం ప్రాతిపదికన జరగాలి. అప్పుడే చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోగలం. 

ఏ నాగరిక సమాజానికైనా చారిత్రక ఆనవాళ్లే గర్వాన్నీ ఘనతనూ అందిస్తాయి. మానవ నాగరికతకు చిహ్నాలైన పురాతన కట్టడాలనూ ఆకారాలనూ కాపాడుకోవటం ప్రపంచం యొక్క ప్రధాన కర్తవ్యం. ప్రపంచంలోని అన్ని దేశాలు చారిత్రక వారసత్వ సంపదను అన్ని రకాల అసౌకర్యాలకూ ఇబ్బందులకూ ఓర్చి పరిరక్షించుకుంటూ ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం అలాంటి ప్రయత్నమేమీ జరగటం లేదు. పైగా చారిత్రక కట్టడాలను విధ్వంసం చేసే కార్యక్రమాలను ప్రభుత్వమే నిస్సిగ్గుగా చేయటం కనిపిస్తుంది. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 'పురాతన మానవ జాతి' ఆధారాలను కలిగి ఉన్న వందలాది గుట్టలను మైనింగ్ మాఫియాకు అప్పగించింది. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే పోలీసు పర్యవేక్షణలో చార్మినార్‌ను ఆనుకొని ఒక ఆలయాన్ని నిర్మించే దుర్మార్గానికి ఒడిగట్టింది. ఇంత జరిగినా పురాతత్వ శాఖ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.

పురాతత్వ శాఖ అనుసరిస్తున్న ఈ ఉదాసీనతకు మూలమేంటో కూడా అన్వేషించాలి. ఈ నేపథ్యంలో చారిత్రక కట్టడాలు, ఆధారాల పరిరక్షణకు ప్రభుత్వ వ్యతిరేకతను కులం కోణం నుంచి అర్థం చేసుకోవాలి.

చరిత్ర అన్వేషకురాలు రొమిల్లా థాపర్ ప్రకారం సుమారు క్రీ.పూ నలభై మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైన జంబూద్వీప నాగరికత హరప్పా, మొహంజదారో అనే రెండు పట్టణ రాజధానులతో విలసిల్లింది. వీటిని కేంద్రంగా చేసుకొని శంబరు మహారాజు 250 పట్టణాలతో కూడుకున్న జంబూద్వీపాన్ని పాలించాడు. శంబరు మహారాజు విగ్రహం హరప్పా నాగరికతలో లభించింది. హరప్పా, మొహంజదారో నాగరికతల్లో దొరికిన లిపి (స్క్రిప్టు) ద్రావిడ భాషకు చెందినదని ఆర్కియలాజికల్ ఫిలాలజిస్టులు నిర్ధారించారు. శంబరు మహారాజుతో నలభై యేళ్లు యురేషియా (ఆర్య) బ్రాహ్మణులు యుద్ధం చేసినట్టు రుగ్వేదంలో పేర్కొన్నారు. శంబర్ మహారాజే జాంబవంతుడనే సంగతిని మనం ఈ వివరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల జంబూద్వీపాన్ని ఏలిన జాంబవుడిని యురేషియా (ఆర్య) బ్రాహ్మణులు అనేక కుయుక్తుల ద్వారా ఓడించి హరప్పా, మొహంజదారో నాగరికతలను ధ్వంసం చేశారు. రుగ్వేదంలో ఆర్యులు ఇంద్రున్ని 'పురంధరుడు' అని కీర్తిస్తారు.

అంటే పురాలను నాశనం చేసే వాడని అర్థం. అందుకే నగరాలను విధ్వంసం చేయటమే తప్ప నిర్మించటం తెలియని విదేశీ యురేషియన్ (ఆర్య) బ్రాహ్మణులు మన దేశంలో నిర్మించిన నగరం ఒక్కటి కూడా లేదు. కానీ జాంబవుని వారసులు నిర్మించిన మూలవాసీ నాగరికతకు సంబంధించిన పట్టణాలను సమూలంగా నిర్మూలించే కృషిని మాత్రం నిరాఘాటంగా కొనసాగిస్తూనే ఉన్నారు. దేశ విభజన సందర్భంగా హరప్పా, మొహంజదారో పట్టణాలు పాకిస్తాన్‌కు కట్టబెట్టడం వెనక మాదిగల గర్వకారణమైన చరిత్రను ఇక్కడి ప్రజలకు తెలియకుండా చేసే కుట్ర ఉంది. హరప్పా, మొహంజదారో నాగరికత కాలం నాటి అనేక చారిత్రక ఆధారాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చరిత్రకారులు గుర్తించారు. అలాంటి కృషిని కొనసాగిస్తున్న వారిలో ప్రఖ్యాత చరిత్రకారుడు డా. జైకిషన్ ఒకరు కాగా మరొకరు డా. జాన్ మిల్టన్. తెలంగాణ జిల్లాల్లో ఇనుము, ఉక్కు పరిశ్రమ మీద డా. 

జైకిషన్ గొప్ప గ్రంథం రాశారు. తెలంగాణ పది జిల్లాల్లో ఉన్న అనేక వందలాది గుట్టల మీద, వాటి పరిసర ప్రాంతాల్లో ఇనుము, ఉక్కు తయారీకి సంబంధించిన పురాతన ఆధారాలను ఆయన కనుగొన్నారు. అలాంటి చారిత్రక ఆధారాలున్న ఈ గుట్టలను వారసత్వ సంపద కింద పురాతత్వశాఖ గుర్తించలేదు. కొన్నింటిని గుర్తించినప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ మాఫియాకు అప్పగించినా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కరీంనగర్ జిల్లాలో సుమారు 800లకు పైగా, వరంగల్ జిల్లాలోని 500లకు పైగా గుట్టలను మైనింగ్‌కు అనుమతులిచ్చారు. చివరికి కరీంనగర్‌లో హుస్నాబాద్ నియోజకవర్గంలో రాక్షస గుళ్లనూ తవ్వేస్తుంటే ఆర్కియాలజీ డిపార్టుమెంటు మౌన ంగా ఉండిపోయింది.

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పాలనల్లో అభివృద్ధి పేరుతో అనేక చారిత్రక స్థలాలు ఆనవాళ్లు లేకుండా చేశారు. హైదరాబాద్ కేంద్రంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, రసాయనిక పరిశ్రమల వల్ల రంగారెడ్డి జిల్లాలోని అనేక బౌద్ధ, జైన ఆనవాళ్లు కానరాకుండా పోయాయి. రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చారిత్రక కట్టడాలన్నీ ప్రమాదంలో పడ్డాయి. గోల్కొండ కోట భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పురాతన బౌద్ధ నిర్మాణాలను ప్రభుత్వం సినిమా పరిశ్రమ కోసం, మైనింగ్ కోసం అగ్రకుల పెట్టిబడిదారుల కోసం కేటాయించింది. రాయలసీమలోని అనేక గుట్టలను దశాబ్దాలుగా అగ్రకుల ఫ్యాక్షనిస్టులు తవ్వుకొంటూనే ఉండగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాలి జనార్దన్ రెడ్డి, జగన్ రెడ్డి మైనింగ్ జరిపి తుడిచిపెట్టేశారు.

కాకతీయుల కోటను పునరుద్ధరించే పేరుతో తూర్పు కోటను పురాతత్వ శాఖ పీకి పందిరేసింది. వందలాది నాగదేవతల విగ్రహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కోట శిధిలావస్థకు చేరుకున్నప్పటికీ ఆర్కియాలజీ అధికారులు గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ చేపట్టిన చర్యలు శూన్యం. కాకతీయుల ఉత్సవాలకు 150 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ తెలంగాణలోని కాకతీయుల కోట, రామప్పతో సహా పురాతన గుట్టలను పరిరక్షించే కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు. అభివృద్ధికి మౌలిక వసతుల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్) మూలం. మౌలిక వసతుల కల్పన వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం ధనాపేక్ష ఉన్న అగ్రకుల కంపెనీల లాభాల కోసం చారిత్రక ప్రాంతాలను సైతం ధారాదత్తం చేయటం ఒకటి కాగా హైదరాబాదును ఏకైక అభివృద్ధి కేంద్రంగా మార్చేయటం మరోటి. దీనివల్ల హైదరాబాదు ప్రాచీన గుర్తింపు కోల్పోయింది. అనేక తోటలు, చెరువులతో ఆహ్లాదకరంగా పర్యావరణ ప్రేమికురాలిగా ఉండే హైదరాబాదు కాంక్రీటు జంగల్‌గా మారిపోయింది.

రోడ్ల విస్తరణలో కూలిపోయిన పురాతన కట్టడాలనేకం. మెట్రో రైలు పేరుతో కూలిపోతున్న చారిత్రక కట్టడాలు కూడా అనేకం. తెలంగాణ రాష్ట్రం గురించి ఉద్యమించే కార్యకర్తలు గానీ ఒక్క గుడి రోడ్డు విస్తరణలో కూలిపోతుందంటే రక్తం చిందించే మతవాదులు గానీ చారిత్రక కట్టడాలు అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని వ్యతిరేకించడం లేదు. ఆ క్రమంలోనే చార్మినార్ చుట్టూ ఉన్న చమన్‌ను, ముళ్లకంచెను తొలగించి రోడ్డు వేశారు. అంతేకాదు చార్మినార్ పక్కనే ఎత్తైన భవన నిర్మాణాలకు అనుమతిచ్చారు. వాయు, ధ్వని కాలుష్యాల వల్ల చార్మినార్ గోడలు బీటలు వారుతున్నాయి. చార్మినార్ పరిరక్షణ కోసం ఉద్యమించే వారిని చులకనగా చూసిన ప్రభుత్వం నేడు అభివృద్ధి వల్ల ఎలాంటి ఫలితం లేదని గ్రహించి మత ఘర్షణల ఎజెండాను చేపట్టింది.

చార్మినార్ ఆర్కియాలజీ డిపార్టుమెంట్ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు గానీ ఇతరేతర నిర్మాణాలుగానీ చేపట్టరాదు. అందుకు విరుద్ధంగా చార్మినార్ గోడలకు పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆలయ నిర్మాణం పనులు చేపట్టింది. ఈ పనికి పోలీసు బలగాలతో సహా అన్ని రకాల సహకారం అందించింది. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవాలయం ఉన్నదని ప్రభుత్వం బుకాయిస్తోంది. మీడియా ఈ అసత్యాన్ని సత్యంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. చార్మినార్ సౌందర్యాన్ని బ్రిటిషు వారి కాలం నుంచీ ఫోటోల్లోనూ, ప్రపంచీకరణ తర్వాత వీడియోల్లోనూ అణువణువూ బంధించారు. అవి ఇంటర్నెట్‌లో లభిస్తున్నాయి. వాటిల్లో ఎక్కడా చార్మినార్‌ను ఆనుకొని గానీ దాని పరిధిలో గానీ ఎలాంటి దేవాలయం కనిపించడం లేదు. ఈ వాస్తవం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు అక్కడ దేవాలయం ఉన్నదనీ దాన్ని విస్తరించే పనికి దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చిందని చెబుతున్నారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవటం ఒక రాజకీయ చర్యని నమ్మబలుకుతున్నారు.

చారిత్రక కట్టడాలకు వంద మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదని ఆర్కియాలజీ నిబంధనలను అమలు చేయాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు విరుద్ధంగా చార్మినార్‌ను ఒక వివాదాస్పద అంశంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనితో ముస్లిం, ముస్లింయేతరుల మధ్య చిచ్చుపెట్టాలనే ఎత్తుగడతో బీజేపీతో కిరణ్ ప్రభుత్వం చేతులు కలిపింది.

దేశంలో మత కలహాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమనీ, అది బీజేపీతో చేతులు కలిపి మారణహోమం సృష్టిస్తుందని కాన్షీరాం ఎప్పుడూ చెబుతుండేవారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు వంటి లౌకిక విషయాల కన్నా ఎక్కువగా మతతత్వ విషయాలు ఉపకరిస్తాయనే సంగతి కాంగ్రెస్ పార్టీ అనుభవంలో ఉన్నవే. కిరణ్ కుమార్ రెడ్డి పాలన వల్ల కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో నెగ్గే పరిస్థితులు కనబడటం లేదు. అందుకే రాజకీయాలను మతం ప్రాతిపదికన నడపాలని ఆ పార్టీ సంకల్పించింది. మత రాజకీయాలను ఇంత కాలం బీజేపీ మాత్రమే చేస్తుందని భావించే వారు చార్మినార్ సంఘటనతోనైనా వాస్తవాలను గ్రహించాలి.

ఈ మొత్తం పరిణామాలను సంగ్రహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అధికారంలోకి రాకుండా చేసే యుద్ధనీతి కనిపిస్తుంది. చరిత్రను వక్రీకరించే కృషి అందులో ఒకటి కాగా తమ చారిత్రక ఆధారాలను తుడిచిపెట్టేయాలి. అదేవిధంగా ముస్లింల చరిత్రనూ వైభవాన్నీ కాలాంతరాలకు అందించే నిర్మాణాలను ధ్వంసం చేయటమో లేదా వివాదాస్పదం చేయటమో అగ్రకుల పాలకులనుసరిస్తున్న రణనీతి. చారిత్రక వారసత్వ సంపద లేని మట్టి దిబ్బగా ఈ దేశాన్ని తయారు చేయాలని యురేషియా బ్రాహ్మణవాద పాలకులు కుట్రలు పన్నుతుంటే ఈ దేశాన్ని ఏలాలని కలలుగనే బహుజనులు రాజకీయ యుద్ధం చేసేందుకు సిద్ధపడతారా? అధికారాన్ని కాపాడుకొనేందుకు మతతత్వాన్ని పెంచిపోషిస్తున్న పాలకుల 'కుల రాజకీయాల'ను అర్థం చేసుకోవాలంటే రాజకీయ చర్చలు మతం ప్రాతిపదికన కాకుండా కులం ప్రాతిపదికన జరగాలి. అప్పుడే చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోగలం.

- జిలుకర శ్రీనివాస్

Andhra Jyothi Telugu News Paper Dated: 9/12/2012 

Tuesday, August 28, 2012

అసోం హింసలో కుల కోణం - జిలుకర శ్రీనివాస్



కుల, మతాలకు అతీతంగా పౌరులకు రక్షణ కల్పించే బాధ్యతను రాజ్యాంగం ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఆధిపత్య కులాలే పాలనలో ఉండే చోట రాజ్యాంగం అమలు కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తులకే ముస్లింలు, ఇతర మైనార్టీలు పట్టం కడితే వారికి ఎప్పటికీ రక్షణ దొరకదు. రాజ్యం విఫలమైన చోట ప్రజలు ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం నిలబడితేనే రాజ్యాంగం అమలవుతుంది. 

ప్రపంచంలోనే అత్యధిక పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే మన దేశంలో కింది కులాలకే కాదు, ముస్లింలకూ విలువ లేదనీ రక్షణ లేదనీ గ్రహించటం చాలా సులువు. వలస పాలన కాలంలోనూ, వలసానంతర కాలంలోనూ పారుతున్న రక్తపుటేరులూ కోల్పోతున్న హక్కులూ గమనిస్తే ముస్లింలూ 'ప్రజాస్వామ్య బాధితు'లన్నది బోధపడుతుంది. అసోంలో ఉన్నది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వం. 

కేంద్రంలో అధికారం నెరుపుతున్నది కూడా ప్రజాస్వామ్య చట్రంలో ఎన్నుకున్న ప్రభుత్వమే. అసోంలో ముస్లింల ఊచకోత విషయం మీద అబద్ధాలదే పైచేయి. ఆ అబద్ధాలను సంఘ్‌పరివార్ మాత్రమే ప్రచారం చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, కేంద్ర నిఘా సంస్థలూ, పాలక ప్రతిపక్ష పార్టీలూ మూకుమ్మడిగా కలిసి ప్రచారం చేయటమే అసోం మారణకాండ నేపథ్యంలో ఆవిష్కృతమైన భయంకరమైన దృశ్యం. అసోంలో పదేళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 

ఈ కాలంలోనే ముస్లింల మీద సుమారు మూడుసార్లు పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆస్తుల విధ్వంసం, అమాయకుల ఊచకోత, నిరాశ్రయుల ఆక్రందనలన్నీ అంతిమంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించాయి. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, లేదా ముస్లింల మీద దాడులు జరిగినా అక్కడ బిజెపి కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లాభపడుతోంది. ముస్లింలను బుజ్జగించటం ద్వారా మస్లిం ఓట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని బిజెపి విమర్శించేది. 

అల్లర్లు జరగడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించటం ద్వారా ముస్లిం వ్యతిరేకతను ప్రదర్శించటం వల్ల కాంగ్రెస్ ఇతర మతాల ప్రజల ఆమోదాన్ని పొందుతుంది. అసోంలో గత మూడు దఫాలుగా పాలక కులాల నుంచి వచ్చిన తరుణ్ గొగొయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేవలం రెండు శాతం ఉన్న బ్రాహ్మణులు అసోంను ఇన్నేళ్ల నుంచి పాలించటం మత కలహాల - ఇతర కారణాలెన్ని వున్నా - వల్లే సాధ్యమైంది. మతతత్వాన్ని పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీని ముస్లింలు ఇంకా విశ్వసించటమే ఆ పార్టీకి బలం. 

అసోంను పాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అల్లర్లు జరగ్గానే శాంతి భద్రతలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సింది ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం. అలాంటి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించటంలో ఆ పార్టీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ పాలకవర్గ స్వభావాన్ని ప్రదర్శించాడు. అల్లర్లను అణచివేసేందుకు తగిన సైనిక బలగాల్ని పంపాల్సిందిగా కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన నాలుగు రోజులకు గానీ రక్షణ దళాలు అసోం చేరుకోలేదు. 

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే సైన్యం రావటం ఆలస్యం అయిందనీ ఈలోగా జరగాల్సిన నష్టం భారీగానే జరిగిందని ఆయన అంగీకరించారు. తరుణ్ గొగొయ్ వాదన ప్రకారం దేశ ప్రధాని సకాలంలో స్పందించలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అసోం ఊచకోతల నుంచి ఏవో ప్రయోజనాలను ఆశించింది. అందుకే నేటికీ దాడులు కొనసాగేందుకు సహకరిస్తుంది. ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడైనా శాంతిని పునరుద్ధరించే యంత్రాంగం ఉన్న దేశంలో నెల రోజులుగా యథేచ్ఛగా మారణకాండ కొనసాగుతూ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యహరిస్తున్నాయి. పాలక కులాల ప్రయోజనాలే దీనికి కారణం. 

ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రచార ప్రణాళికను ప్రవేశపెట్టింది. అందులో అబద్దాలకే పెద్ద పీట వేసింది. అసోంలో స్థానికులకూ బంగ్లాదేశ్ నుంచి పెద్ద సం ఖ్యలో చొరబడిన అక్రమ వలసదారులకూ మధ్య ఘర్షణ జరుగుతుంది. కాబట్టి దీన్ని మతాల మధ్య సంఘర్షణగా చూడరాదు. ఈ అబద్ధాన్ని కాంగ్రెస్ చెబితే ఎవరూ నమ్మరు. అసోంలో ఎల్‌కే అద్వానీ నోటివెంట ఈ అబద్ధాన్ని పలికించారు. మీడియా దీనికి విస్తృత ప్రచా రం కల్పించింది. కేంద్ర నిఘాసంస్థలూ దీనికి వత్తాసు పలికాయి. 

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజల వల్లే సమస్య తలెత్తితే, దాని గురించి మాట్లాడే బాధ్యత ఆ దేశ పాలకుల మీద ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తన పౌరుల రక్షణ గురించి ఎలాంటి విన్నపమూ చేయలేదు. కాబట్టి ఇది అక్రమ, సక్రమ చొరబాటుదారులు/వలస వచ్చిన వారికి సంబంధించిన సమస్య కాదు. కోక్రఝార్ జిల్లా పశ్చిమ బెంగాల్‌కు సరిహద్దు జిల్లా. బంగ్లాదేశ్‌తో ఈ జిల్లాకు ఉన్న సరిహద్దు కూడా కొండలూ గుట్టలతో నిండి ఉంటుంది. పైగా సరిహద్దు జిల్లాలో నిఘా చాలా పటిష్టంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే అసోంలో ముస్లింల ఊచకోత గురించి ఎస్ఎంఎస్‌ల రూపంలో జరిగిన ప్రచారాన్ని పాకిస్తాన్ కుట్రగా వక్రీకరిస్తూ కేంద్రం అమాయక ముస్లిం యువకులను అరెస్ట్‌చేసి చిత్రహింసల పాల్జేస్తోంది. 

వాస్తవానికి అసోంలో ఏం జరిగింది? జూలై 19న కోక్రఝార్ జిల్లాలో ఒక దళిత యువతి మీద అత్యాచారం చేసి హతమార్చారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ముస్లింలూ, దళితులూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అది హింసాత్మక రూపం తీసుకుంది. బోడోలాండ్ ఉద్యమం గిరిజనులు చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కాని, బోడోలాండ్ ఉద్యమం అగ్రకులాలది. ముఖ్యంగా బ్రాహ్మణవాదుల నాయకత్వంలో నడిచిన ఈ ఉద్యమం బిటిసి ఏర్పాటుకు దారితీసింది. 

బిటిసి పరిధిలో ఉన్న బోడోల సంఖ్య కేవలం 20 శాతమే. కానీ బిటిసి పరిధిలోని ప్రజల జీవితాన్ని ఈ సాయుధ ముఠా నియంత్రిస్తుంది. బ్రాహ్మణవాదుల ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ముస్లిం వ్యతిరేకతతో నిండిపోయింది. అగ్రకుల ఆధిపత్యాన్ని అసోంలో 40 శాతం పైగా ఉన్న ముస్లింలు, 9 శాతం పైగా ఎస్సీలు కలిసి ఎదిరిస్తున్నారు. ముస్లింలు, ఎస్సీల మధ్య సామాజిక, రాజకీయ సంబంధాలు బలంగా పెనవేసుకొని ఉన్నాయి. 

ఈ రాజకీయ ఐక్యత బిజెపికి పెద్ద సవాలుగా మారింది. మనువాద కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం బిటిసి అన్ని విధాల పనిచేయటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లిం, ఎస్సీల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీస్తే తప్ప కాం గ్రెస్ పార్టీతో సహా సంఘ్‌పరివార్ ఆర్ధిక, మతరాజకీయ ప్రయోజనాలు నెరవేరవు. అందుకే ముందు ఎస్సీ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశారు. ఆ సంఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ముస్లిం, ఎస్సీల మీద సామూహిక నరమేధాన్ని ప్రారంభించారు. 

అసోంలో జరుగుతున్న రాజ్య ప్రాయోజిత (స్టేట్ స్పాన్సర్డ్) దమనకాండను వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో ముస్లింలు నిరసనకు దిగితే గుర్తు తెలియని అల్లరి మూకలు హింసకు దిగారు. పోలీసులే అలాంటి హింసాత్మక కార్యక్రమానికి దిగారని ఆరోపణలు వస్తున్నాయి. ముస్లింలను బద్నాం చేసేందుకే ముంబై పోలీసులు శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చారని సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ ఆరోపిస్తోంది. 

తెలంగాణ ఉద్యమంలోనూ మఫ్టీలో ఉన్న పోలీసులు అలాంటి సంఘటనలకు ఎన్నో మార్లు పాల్పడ్డారు. కాబట్టి వారి ఆరోపణలను కొట్టిపారేసే వీలు లేదు. దేశ వ్యాప్తంగానూ, మన రాష్ట్రంలోనూ వివిధ సంఘాలూ పౌరసమాజమూ అసోం మారణకాండ మీద స్పందించక పోవడానికి కుహానా దేశభక్తి కారణం. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, వలసవాదులు అనే భ్రమలో వుండటం ఆ కుహాన దేశభక్తికి మూలం. బంగ్లాదేశ్ నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారిలో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. అధికారికంగా వలస వచ్చిన వారిలోనూ, అక్రమంగా వలస వచ్చిన వారిలోనూ ముస్లింయేతరులు పెద్దసంఖ్యలో ఉన్నారు. 

సరిగ్గా అసోంలో ముస్లింల మీద దాడులు జరుగుతున్న సందర్భంలోనే మరో వాదనను మీడియా చర్చకు పెట్టింది. పాకిస్తాన్‌లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయనీ, యువతులను అపహరించి బలవంతంగా మతమార్పిళ్లు చేసి వివాహం చేసుకుంటున్నారనే వదంతులను జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ నుంచి హిందువులు ఇండియాకు వచ్చి సిర్థపడేందుకు శాశ్వత వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, కృష్ణాష్టమి సందర్భంగా ఇండియాకు వస్తున్న హిందువులను నిర్భంధించారని ఇంగ్లీషు మీడియా చర్చలు నిర్వహించింది. 

కరాచీ నుంచి వచ్చిన ఒక యువతితో టీవీలో మాట్లాడించారు. కరాచీలో ముస్లింయేతరులకు ఎలాంటి ఇబ్బందులు లేవనీ, హిందూ మహిళల మీద దౌర్జన్యాలు జరగటం లేదనీ, బలవంతపు మత మార్పిళ్లు గానీ, అపహరణలు గానీ జరగటం లేదనీ ఆ యువతి చెప్పటంతో టీవీ చర్చలో పాల్గొన్న వారందరూ తెల్లబోయారు. ఈ విధంగా జాతీయ మీడియాలోనూ ప్రాంతీయ మీడియాలోనూ ఒక్కసారిగా పాకిస్తాన్‌లో హిందువుల సమస్యను చర్చకు తీసుకురావడంలో అస్సాం హత్యాకాండను సమర్ధించుకొనే ఎత్తుగడను బ్రాహ్మణ పాలక వర్గం అనుసరిస్తుంది. 

బోడోలాండ్ స్వయం ప్రతిపత్తి గురించి కూడా ఇప్పుడు చర్చ తీవ్రమైంది. బిటిసిని రద్దుచేయాలనే డిమాండ్ కూడా తెరమీదకు వచ్చింది. బోడోలు ఒకే ఒక తెగ కాదు. అనేక తెగల సమాహారం. నిజానికి బోడోలను ఒక తెగగా పరిగణించాలా లేదా అనే విషయం మీద శాస్త్రీయమైన అధ్యయనం జరగాలి. బోడోలు బ్రాహ్మణ ధర్మాన్నే ఆచరిస్తారు. ఆచార వ్యవహారాలు, ఇంటి పేర్లు చాలా వరకు కుల వ్యవస్థను పోలి ఉంటాయి. బోడో లిబరేషన్ టైగర్స్ చేసిన సాయుధ పోరాటం కేంద్ర ప్రభుత్వంతో ఒక రాజీకి దారితీసింది. 

అదే బోడోలాండ్ టెర్రిటరీ కౌన్సిల్ అనే సంస్థ ఏర్పాటుకు దారితీసింది. బోడోల జన సంఖ్య బిటిసి పరిధిలో 20 శాతానికి మించి లేదు. వలస పాలన కాలం నుంచి కూడా బోడోయేతరులదే ఆధిక్యం. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం అసోం షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటం కూడా బోడోలాండ్ డిమాండ్‌కు తోడ్పడింది. బిటిసి ఏర్పాటులో ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతులు అనుసరించటం, బోడోయేతరులు అధిక సంఖ్యలో ఉన్న జిల్లాలను కూడా బిటిసి పరిధిలోకి తీసుకురావడం, అధిక సంఖ్యలో ఉన్న బోడోయేతర కులాలకూ మతాలకూ బిటిసిలో చోటులేకపోవడం, వారి రాజకీయ హక్కులన్నీ నియంత్రణకు గురికావటం దీర్ఘకాలిక సమస్యలకు మూలమైంది. 

దీనికి తోడు బోడో లిబరేషన్ టైగర్స్ నుంచి ఆయుధాలు జప్తు చేయకపోవటం బోడోయేతర సమూహాలకు పెద్ద ప్రమాదంగా మారింది. అలాంటి పరిస్థితిని ఆ రాష్ట్రంలోని పాలక కులాలు పెంచి పోషిస్తున్నాయి. బిటిసి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో గిరిజన సంస్కృతిని కాపాడే ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా బ్రాహ్మణ ధర్మాన్ని హిందూ మతం పేరుతో విస్తృతంగా వ్యాపించే చర్యలు చేపట్టింది. ఈ వైఖరి వల్ల మనువాద తీవ్రవాద సంస్థలు బిటిసి పరిధిలో ఉన్న గిరిజనులను ముస్లిం, ఎస్సీ వ్యతిరేకులుగా మార్చే కార్యక్రమాలు చేపట్టాయి. 

ప్రభుత్వ సహకారంతో వాటి ప్రభావం విస్తరించింది. లక్షలాది మంది నిరాశ్రయులు కావడానికీ ఎంతో మంది చనిపోవడానికీ కారణమైంది. తెలంగాణ ఉద్యమానికి బోడోలాండ్ పట్ల సానుభూతి ఉంది. రేపు తెలంగాణలోనూ బోడోలాండ్ పునరావృతం కాదనే నమ్మకమేమీ లేదు. తెలంగాణవాదులు కూడా అసోం ఊచకోతపై మౌనం వెనుక అర్థమేమిటో ముస్లింలకు సులువుగానే బోధపడుతుంది. 

కుల, మతాలకు అతీతంగా పౌరులకు రక్షణ కల్పించే బాధ్యతను రాజ్యాంగం ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఆధిపత్య కులాలే పాలనలో ఉండే చోట రాజ్యాంగం అమలు కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తులకే ముస్లింలు, ఇతర మైనార్టీలు పట్టం కడితే వారికి ఎప్పటికీ రక్షణ దొరకదు. రాజ్యం విఫలమైన చోట ప్రజలు ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం నిలబడితేనే రాజ్యాంగం అమలవుతుంది.
- జిలుకర శ్రీనివాస్
బహుజన్ అకడమిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్

Andhra Jyothi News Paper Dated: 28/08/2012

Thursday, April 5, 2012

మతోన్మాదమే గెలిచింది - జిలుకర శ్రీనివాస్



మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మతోన్మాదమే గెలిచింది. తెలంగాణవాదం ఓడిపోయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే రెడ్డి కులవాదం గెలిచింది. వెలమలు అందుకు సంపూర్ణంగా సహకరించారు. ప్రాంతీయ ఉద్యమాలను కులాతీత, మతాతీత పరిశుద్ధ చైతన్య ప్రతీకలుగా సూత్రీకరించేవన్నీ తప్పని మొన్నటి ఉప ఎన్నికలతో నిరూపణ జరిగింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమంత అప్రజాస్వామిక ఉద్యమం మరోటి లేదని అనిపిస్తుంది. 

తెలంగాణ ప్రజలంతా రాష్ట్రం కోరుకుంటున్నారు కాబట్టి అది ప్రజాస్వామిక ఉద్యమమని భావిస్తే తప్పులో కాలేసినట్టే. ఉద్యమ స్వభావాన్ని ప్రజా సమీకరణ ప్రాతిపదికన కాకుండా, దాని భావజాలం ప్రాతిపదికగా, ఆ భావజాల రాజకీయ వ్యక్తీకరణ రూపాల ఆధారంగా మాత్రమే నిర్ధారించాలి. ఆ రకంగా చూసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో గులాబీ రంగు మాటున కాషాయ భావజాలమే గంభీరంగా ప్రచారమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని వేదమయం చేస్తానని మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక సందర్భంలో కెసిఆర్ అన్నారు. అదే మార్గంలో ఆయన అనేక మార్లు యజ్ఞ యాగాలు చేస్తున్నారు. అలాంటి కెసిఆర్ మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఒక ముస్లిం అభ్యర్ధిని పోటీలో పెట్టి గెలిపిస్తారని ఎవరైనా ఎలా అనుకుంటారు? 

మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ ఓటమికి బాధ్యత వహిస్తూ కెసిఆర్ ఎంపి పదవికి రాజీనామా చేయాలని సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ కార్యదర్శి లతీఫ్ ఖాన్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక ముస్లిం సంఘాలు కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే వున్నారు. అది ధర్మాగ్రహం. నిజానికి కెసిఆర్ రాజీనామా చేయటం వల్ల ముస్లింలకు ఎలాంటి ఉపకారం ఒనగూరదు. ఆయన తెలంగాణ ఉద్యమం నుంచి విరమించుకోవాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా నడుస్తుంది. 

ముస్లింలు నిరంతరం అవమానానికి గురవుతూనే ఉన్నారు. తెలంగాణ వస్తే మాకెలాంటి రక్షణ ఉంటుంది. తెలంగాణ ఏర్పడితే బిజెపి, సంఘ పరివార్ తీవ్రవాదం బలపడదనే హామీ ఏమిటి? ముస్లింలకు ఎలాంటి రక్షణ ఉంటుంది? ఎలాంటి ప్రాతినిధ్యం ఉంటుంది? అని ముస్లిం మేధావులు, ముస్లిం పౌర హక్కుల నేతలు అడిగారు. అలాంటి కోర్కె ఏమీ కోరకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని అగ్రకుల ఉద్యమకారులు సూచించారు. 

కావాలంటే ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కెసిఆర్ బహిరంగంగా చేసిన ప్రకటన నిజంగా ముస్లిం, అణగారిన వర్గాలకు ఎక్కువ మంది శత్రువులను తయారు చేసింది. ఆయన లక్ష్యం కూడా అదే. ఎస్టీ, బిసి, రెడ్డి కులాలు ముస్లింలకు, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. ముఖ్యంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఉప ముఖ్యమంత్రి పదవి అనే రెండు హామీలు ముస్లిం యేతర సమాజాన్ని వ్యతిరేకంగా నిలబెట్టాయి. అందుకే ముస్లిం అభ్యర్థి ఇబ్రహీంను ఓడించడానికి అన్ని శక్తులు ఒక్కటయ్యాయి. 

కెసిఆర్ వ్యూహాత్మకంగానే ఇబ్రహీంను పోటీకి దింపారు. ముస్లింలు అధిక సంఖ్యలో వున్న ఈ నియోజకవర్గంలో వారి ఓట్లు మాత్రమే కీలకం. అవి కాంగ్రెస్‌కు పోకుండా ఉండాలనే ముస్లిం అభ్యర్థిని నిలబెట్టారు. ముస్లిమేతర ఓట్లు బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డికి పడేలా పోలింగ్ వ్యూహం తయారుచేశారు. హరీష్ రావు, శ్రీనివాసరెడ్డిల మధ్య వున్న వ్యాపార సంబంధాలు ఒక కారణంగా కాగా అగ్రకులాల మధ్య ఐక్యత మరో కారణం. 

కెసిఆర్ మరెంతో కాలం తెలంగాణ ఉద్యమం నడపలేడు. అలాంటి ఆసక్తి కూడా ఆయనకు లేనట్లు ఉంది. కాబట్టి బిజెపిని బలపర్చాలనే ఆలోచనకు వచ్చారు. టిఆర్‌యస్ నుంచి బయటికి వెళ్ళిన జిట్టా బాలక్రిష్ణారెడ్డితో పాటు అమెరికా నుంచి ఆపరేట్ అవుతున్న తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం వరకు కోదండరామిరెడ్డితో సమన్వయం చేసుకుంటున్నది. బిజెపి రాష్ట్ర బాధ్యతలు కిషన్‌రెడ్డి తీసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమం పేరు మీద రాజకీయం నెరుపుతున్న రెడ్లకు ఒక నమ్మకం వచ్చింది. ఆ క్రమంలో కిషన్‌రెడ్డి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని రెడ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అందుకు ముస్లిం వ్యతిరేకత తప్ప మరో ప్రాతిపదిక లేదు. 

మతం పేరుతో బిజెపి బలపడటం ఈ రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా వీలు కాలేదు. కాని, తెలంగాణ నినాదం వల్ల అది చాలా సులువైపోయింది. ఇది ముస్లింలకు మాత్రమే ప్రమాదం కాదు. బహుజనోద్యమానికి, లౌకిక ప్రజాస్వామిక ఉద్యమాలకూ ప్రమాదం. కాబట్టి బహుజనులు తెలంగాణ ఉద్యమం గురించి ఆలోచించుకోవాలి. ముస్లింలు యూటర్న్ తీసుకోవటం తప్ప మరో మార్గం లేదు. కెసిఆర్ నాయకత్వంలో జరిగే ఉద్యమం రెడ్డి, వెలమల ఆధిపత్యానికి ఉపయోగపడుతుందనే సంగతిని గుర్తించాలి. కేవలం బహుజనుల నాయకత్వంలో అంబేద్కర్ భావజాలంతో ఉద్యమం నడపటం వల్ల మాత్రమే ముస్లింలకైనా, ఇతరులకైనా మేలు చేస్తుందనే సత్యాన్ని గుర్తించాలి. 

- జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated: 06/04/2012 

Saturday, February 25, 2012

ఆధిపత్యాన్ని కొనసాగించేవే ఐతిహ్యాలు - జిలుకర శ్రీనివాస్


ఆదిపత్య సాహిత్య క్షేత్రం అనేక కుట్రలు చేస్తుంటుంది. కుట్రలు చాలావరకు సానుకూలంగా ఉంటాయి. ప్రతికూలమైన కుట్రలను గుర్తించటం సులువు. సానుకూలమైన కుట్రలను పసిగట్టడం, వాటిని బట్టబయలు చేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. సౌదా అరుణ రచించిన 'వర్ణ నిర్మూలన' అనే కుట్ర గురించి వివరించేందుకు ప్రయత్నిస్తే,ఆ ప్రయత్నాన్ని మరుగుపర్చేచర్చను నరేష్ నున్నా చేశారు. 'రాజకీయంగా ప్రళయన్‌కీ, సౌదాకీ మధ్య సారూప్యం ఉం ది' అని నరేష్ అంగీకరిస్తున్నారు. సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా చెప్పటమే అంబేద్కరిజం. అందుకు భిన్నమైన వాదనలు చేయటం బ్రాహ్మణవాదం. 

సౌదా, నరేష్ ఇద్దరూ అంబేద్కరిజానికి విరుద్ధమైన వాదనలు చేస్తున్నా రు. సౌదాను రక్షించేందుకు రాజకీయ నేపథ్యాలను ముందుకు తేవటం హాస్యాస్పదం. వర్ణ నిర్మూలన పేరుతో అనిమిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథాన్ని అనువదించవచ్చా? వర్ణం, కులం రెండింటి మధ్య వున్న భావనాత్మక వైభిన్యత ఏమిటి? పారిభాషిక ప్రయోగంలో అనుసరించదగిన సంభావ్యత లేమిటి? కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు, భోజనాలు పరిష్కారం కావని అంబేద్కర్ ఏనాడో చెప్తే సౌదాకు ఇప్పుడే ఎందుకు అర్థమైంది? మూలవాసీ పబ్లికేషన్ ట్రస్టు ప్రచురించిన 'జాతిప్రథ తోడ్‌నేకా సహీ తరీఖా' అనే పుస్తకం నుండి సౌదా తన వాదనను స్వీకరించాడా లేదా? వంటి కీలక అంశాలను చర్చించే సాహసం చేయలేక సౌదా సాహిత్య నిజాయితీని సృజనశీలతను ముందుకు తీసుకురావటం విచారకరం. 

జానపద సాహిత్య స్వభావం గురించి అర్థవంతమైన చర్చ నేటికీ జరగటం లేదు. ఆధిపత్య సాహిత్యం కన్నా జానపద సాహిత్యం ప్రజానుకూలమైనదనే పొరపాటు అవగాహన బలంగా నాటుకొని ఉంది. జానపద సాహిత్యం ఆధిపత్య భావజాలాన్ని సజీవంగా ఉంచేదే గానీ దాన్ని పరాస్తం చేసేది కాదు. కుల సమాజంలో కుల వ్యతిరేక ఐతిహ్యాలు కూడా అంతిమంగా ఆధిపత్య చట్రంలోనే సంలీనం చెందిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఒక సమాజం సమిష్టి స్వప్నాలే పురాణాలనీ, ఇతిహాసాలనీ భావించే ఉదారవాదం ప్రబలంగానే ఉంది. 

ఉనికిలో వున్న ఐతిహ్యాలనూ విమర్శనాత్మకంగా చూడటమే కాదు వాటి పట్ల అనుమాన దృష్టితోచూడటం కూడా అవసరం. రామాయణ, మహాభారతాలను ఆధారంగా చేసుకొని అనేక జానపద కథలు ప్రచారంలో వున్నాయి. భగవద్గీత, మనుధర్మం, రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలను అంబేద్కర్, పెరియార్ అలాంటి విమర్శనాత్మక దృష్టితో చూశారు. అంతేకాదు వాటి పుట్టుకకు ప్రాతిపదిక కల్పించిన మౌలిక కారణాలనూ వారిద్దరూ విశ్లేషించారు. బౌద్ధం పునాదుల మీద నిర్మాణమైన మూలవాసీ రాజ్యాన్ని పుశ్యమిత్ర శుంగుడు హస్తగతం చేసుకొన్న తర్వాత ప్రతి విప్లవాన్ని నిర్మించేందుకు సామాజిక, సాంస్కృతిక, సాహిత్య వ్యవస్థలు అవసరమయ్యాయి. 

కులం అనే అమానవీయమైన వ్యవస్థను బ్రాహ్మణవాదులు మూలవాసీ ప్రజల మీద రుద్దారు. ఆ కుల వ్యవస్థను సమర్ధించే ఇతిహాసాలు, పురాణాలు, బ్రాహ్మణ ధర్మశాస్త్రాలు ఆ క్రమంలోనే నిర్మాణమైనాయి. మూలవాసీ సమాజాన్ని భావబానిసత్వంలో బంధీలను చేసేందుకు తయారుచేసిన సాహిత్యమే ఇతిహాసాలు, పురాణాలు. వాటిని కాలక్రమంలో ప్రజలకు మరింత చేరువ చేశారు. కులపురాణాలు, జానపద కథలు అందుకు ఉపకరించాయి. బౌద్ధ సమాజాన్ని నిర్మూలించిన మనువాదులు మూలవాసీ ప్రజల మెదళ్ల మీద దురాక్రమణ చేశారు. 

అనేక జానపద కథలను ఆ క్రమంలో తయారుచేశారు. ఈ పరిణామం ఏ మాత్రం ప్రగతిశీలమైంది కాదు. రాముడు, కృష్ణుడు చారిత్రక పురుషులుగా అల్లిన కట్టుకథలు, వాటికి అనేక సవరణలతో మూలవాసీ ప్రజలు చెప్పుకుంటున్న పుక్కిటి పురాణాలన్నీ మనువాద వ్యవస్థను నిలబెట్టేవే తప్ప కూల్చేవి కావు. ప్రళయన్, సౌదా ఇద్దరూ ప్రతివిప్లవ కథలను విప్లవ కథలుగా మార్చే పని చేసి విఫలమయ్యారు. 

కృష్ణుడిని మూలవాసీ ప్రజానీకానికి స్నేహితుడని సౌదా అల్లిన బర్బరీకుని కథ అంబేద్కరిజానికి వ్యతిరేకమైంది. మహాభారతమే ఈ దేశ మూలవాసీ ప్రజలకు వ్యతిరేకమైంది. దానిలోని కథానాయకుడు మనుధర్మాన్ని ప్రవచించి ఆ వ్యవస్థను చెక్కుచెదరకుండా నిలబెట్టేందుకు అన్ని రకాలుగా కృషి చేశాడు. అలాంటి కృష్ణున్ని ఒక వాస్తవంగానూ మూలవాసీ ప్రజల హితుడుగానూ సౌదా చిత్రించాడు. నాటకం ప్రదర్శించాడు. 'ఆధిపత్య శ్రీకృష్ణుడి పాత్ర అణగారిన వర్గాలకు కర్తవ్య బోధ చేసిన పాత్రగా ఎన్నో రెట్లు విశిష్టమైనది, నిష్పాక్షికమైనది' అని నరేష్ నున్నా కీర్తిస్తున్నాడు. ఏ రూపంలో శ్రీకృష్ణుడి పాత్రను చిత్రించినా అది అంతిమంగా అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకంగానే నిలబడుతుంది. 

మహాభారతం, రామాయణాలను ప్రాతిపదిక చేసుకొని అల్లే ఏ కథైనా కళారూపమైనా అంతిమంగా అది అసత్యాలనే అందిస్తుంది. పురాణం, ఐతిహ్యాలను వర్తమాన అవసరాలకు అనుకూలంగా స్వీకరించటంలో తప్పేముందని భావించొచ్చు. విప్లవ ప్రతిఘాత వ్యవస్థ నిర్మాణం కోసం అల్లిన కథలు ఆ వ్యవస్థను కూలదోసేందుకు ఉపయోగపడవు. 'అపూర్వ పురాణ కథలు' వ్యవస్థ పరివర్తన కోరేవి కావు. అవి వ్యవస్థలో ఒక మెరుపు లాంటివి మాత్రమే. ఊహ వేరు. అవగాహన వేరు. 

'అవగాహనలో సౌదా ఎంత ముందు యుగం దూతో అపూర్వ పురాణ కథలు నిరూపిస్తాయి' అని నరేష్ అంటున్నారు. ప్రతినాయకున్ని నాయకునిగా చేయటంలో ఆయన ఊహాశక్తి వ్యక్తమవుతోంది. కాని, ఐతిహ్యాలను మూలవాసీ వ్యవస్థలో అంతర్భాగం చేయాలనే ఆయన అవగాహన లోపభూయిష్టమైంది. ఈ అవగాహన 'ఆధిపత్య సాంస్కృతిక వ్యవస్థ మూలాలను పెళ్లగించ'కపోగా మరింత వ్యవస్థీకృతం చేస్తుంది. అందుకే ఆయన వెనక యుగం దూత. 

ప్రత్యామ్నాయ సంస్కృతులు అంటేమిటి? ఆధిపత్య సంస్కృతికి సమాంతరం గా వర్ధిల్లుతూ మరో విముక్తి మార్గం చూపించే ప్రజల జీవన విధానమే ప్రత్యామ్నాయ సంస్కృతి. రామాయణ, మహాభారతాల నుండి అలాంటి ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించుకోవటం వీలవుతుందా? ఆధిపత్య సంస్కృతిలో కనిపించే పల్చని వెసులుబాట్లు, లేదా దానికి పూరకంగా తయారు చేసుకొనే వ్యక్తీకరణలు ఆధిపత్య సంస్కృతిలో అంతర్భాగం అవుతాయి గానీ ప్రత్యామ్నాయం కాలేవు. అపూర్వ పురాణ కథలు ఆధిపత్య సంస్కృతిని కూలగొట్టేవి కావు. ఆ సంస్కృతికి కళాత్మక పూరకాలు మాత్రమే. కాబట్టి నరేష్ నున్నా 'అపూర్వం' అని కీర్తించటం అతిశయోక్తి. వాటిని కళాఖండాలని నరేష్ స్వీకరించొచ్చు గానీ అంబేద్కర్‌వాదులు మాత్రం తిరస్కరిస్తారు. 

ప్రళయన్ రాసిన ఉపకథలు చదివిన వారికి సౌదా కొల్లగొట్టిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సంపదెంతో తెలుస్తుంది. ప్రళయన్ చిత్రించిన ఏకలవ్యుడి బొటనవేలు నరికిన ద్రోణుడి కుటిలత్వం, శంభూకుడి శిరచ్ఛేదం చేసిన రాముడు, రేణుక శిరస్సును నరికిన పరశురాముడు- అన్ని కథలు సౌదా సాహిత్య స్థిరీకరణకు ఉపయోగపడ్డాయి. ప్రళయన్ నాటకం పుస్తక రూపంలోకి రావటానికి ముందే తమిళనాడులో పెనుసంచలనం సృష్టించింది. ఆయన మరెన్నో కథలు పురాణ ఐతిహ్యాల నుండి స్వీకరించి అనుసృజించారు. వాటిని సౌదా కళాత్మకంగా ఎత్తిపోశాడు. ఎవరూ గుర్తు పట్టలేనంత సృజనాత్మకంగా రాసుకున్నాడు. వాటి మార్గంలో అనేక కొత్త కల్పనలు చేశాడు. ప్రళయన్‌లోని ఒరిజినాలిటీ, సౌదాలోని అనుకరణ రెండూ పోల్చలేనివి. 

- జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated 29/11/2011

ఉద్దారకం మాకొద్దు-- - జిలుకర శ్రీనివాస్


అధికారం, రాజ్యం, దోపిడి, సకల పీడన రూపాలకు వ్యతిరేకం గా పీడిత కుల సాహితీవేత్తలు వ్యక్తీకరించిన అభిప్రాయాల పట్ల ఆధిపత్య సాహిత్య వ్యవస్థ తృణీకార భావాన్ని కనబరుస్తుందని మరో మారు రుజువైంది. సమాజ మౌలిక స్వభావవిశ్లేషణలో ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీలైన బహు జనుల దృక్పథానికి బ్రాహ్మణవాద దృక్పథానికి మధ్య శత్రు వైరుధ్యం అనుస్యూతంగా కొనసాగుతూనే ఉంది. బ్రాహ్మణీయ ఉదారవాదం, అణగారినవర్గాల వైయక్తిక అవకాశవాదం రెండూ ఈ శత్రువైరుధ్యాన్ని మిత్రవైరుధ్యంగా మార్చా లని చూశాయి.

ఈ ప్రయత్నాలన్నీ బానిసలను మరింత దాస్యంలోకి నెట్టేవిగా పరివర్తన చెందుతాయి. ఈ శత్రువైరుధ్యం బ్రాహ్మణాధిపత్య వ్యతిరేక పోరాట రూపం తీసుకొని సమాజంలోని సకలక్షే త్రాల నిర్బ్రాహ్మణీకరణకు మార్గంవేస్తుంది. ఈ క్రమం లో బ్రాహ్మణవాదం, వైయక్తిక అవకాశవాదం రెండూ తగి న మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాత్యాయని విద్మ హే, చల్లపల్లి స్వరూపరాణీ ప్రవచిత వ్యాసం అందుకొక సందర్భం. 

రంగనాయకమ్మ 'అస్తిత్వ' సమస్య విశ్లేషణ నవీనమూ అద్భుతమూ అని సంబురపడిన వారుండొచ్చు. కాని, గుర్తింపు, అస్తిత్వం, లింగం, లైంగికత వంటి అంశాల గురించి స్త్రీవాదుల మధ్య చర్చ జరిగిన సందర్భంలోనూ కులం, వర్గం, సమాజ వాస్తవికత, నిర్దిష్టత వంటి విషయాలు చర్చించిన సందర్భంలోనూ బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సాహితీవేత్తలు తీవ్రమైన వాదోపవాదాలు చేసుకున్నారు. 

సమాజంలో వ్యక్తుల, సమూహాల జీవనం, ప్రవర్తన, ప్రమేయం వంటి విషయాలు దేనివల్ల నిర్ణయమవుతున్నాయనే చర్చ జరిగింది. ఈ చర్చకు శతాబ్దాల చరిత్ర ఉంది. మార్క్సు ప్రస్థాపితం చేసిన ఆర్థిక/వర్గ నిర్ణాయక సిద్ధాంతం మన సమాజంలోని ఎంతోమంది ఉదారవాద బ్రాహ్మణవాద మేధావులను ఆకర్షించింది.

అయితే, జాతిపిత మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఇండియా కుల సమాజం కావడం వల్ల కులమే సకల అంశాలనూ ఉత్పత్తి శక్తులనూ ఉత్పత్తి సంబంధాలనూ (మార్క్సి స్టు పరిభాషలో కాసేపు) మానవ సంబంధాలనూ అధికార సంబంధాలనూ నిర్ణయిస్తుందని నిరూపించారు. ఆర్థిక నిర్ణాయకవాదమే అంతిమ సత్యమని నమ్మే రంగనాయకమ్మ వంటి ఉదారవాద బ్రాహ్మణీయ మేధావులకు కుల నిర్ణాయకవాదంలోని తర్కం అంతుబట్టకపోవడం ఆశ్చర్యమేమీ కాదు.

మార్క్సిస్టు సిద్ధాంత విశ్వాసులెవరూ అస్తిత్వం, గుర్తింపు వంటి అమూర్త విషయాలను అంగీకరించరు. అస్తిత్వ ఉద్యమాలు రాజ్య ప్రాయోజితమైనవనీ, అవి విశాల ప్రజా పోరాటాలను విచ్ఛిన్నం చేస్తాయనీ వర్గ సమైక్యతావాదానికి అవి గొడ్డలిపెట్టనీ, శకలీకరణ రూపాల పట్ల కార్మిక వర్గ మేధావులు అప్రమత్తంగా ఉండాలనీ విశ్వసిస్తారు. 

పార్టీ నిర్మాణ శ్రేణులకు ఆయా అంశాల పట్ల స్పందించాల్సిన వైఖరుల గురించి తగిన శిక్షణ కూడా మార్క్సిస్టులు అందిస్తూ ఉంటారు. అస్తిత్వ ఉద్యమాల పరిభాషను ఇంతగా ద్వేషిస్తున్న వర్గ నిర్ణాయకవాదులు చరిత్రను మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. రంగనాయకమ్మ ప్రకారం అస్తిత్వం, గుర్తింపు వంటివి ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలు తయారు చేసినవి. వాటిని స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకొంటూ శాశ్వతీకరిస్తున్నారు. ఇవి పూర్తిగా అసంబద్ధమైన వక్రీకరణలు. 

మహాత్మా ఫూలే, అంబేద్కర్, పెరియాల రచనల్లో ఎక్కడా అస్తిత్వం, గుర్తింపు అన్న పరిభాష కనిపించదు. బ్రాహ్మణుల గుర్తింపు కోసం, వారి దయాదాక్షిణ్యాల కోసం ఫూలే, అంబేద్కర్, పెరియార్‌లు ఏనాడూ దేబిరించలేదు. బ్రాహ్మణ వ్యవస్థ నిర్మూలన కొరకు సైద్ధాంతిక పోరా టం నెరిపిన మహనీయులు వారు. మరి దళిత ఉద్యమం ఎక్కడి నుండి వచ్చింది? స్త్రీవాద ఉద్యమం వలె బహుజన పోరాటం అస్తిత్వ ఉద్యమ పరిభాషలో ఎప్పుడు చిక్కుకపోయింది?

'అస్తిత్వ' ఉద్యమాలు 1960 దశకంలో ప్రారంభమైనవి. అందులో ప్రధానమైంది స్త్రీవాద ఉద్యమం. 1848లో మొదలైన కుల వ్యతిరేక బహుజనోద్యమం అస్తిత్వ ఉద్యమ పరిధిలోకి ఎలా వస్తుంది? కాలిక సమస్య కాదు మౌలిక స్వభావానికి సంబంధించిన సమస్య అని అంగీకరిస్తే సమస్త కుల పీడన దోపిడీల నుండి సమాజ విముక్తిని ప్రతిపాదించిన బహుజనోద్యమం రాజకీయ పోరాటానికి సమాజ సమూల పరివర్తనకూ మార్గం చూపుతున్న విప్లవ ఉద్యమం అవుతుంది తప్ప అస్తిత్వ ఉద్యమం ఎలా అయింది?

దాని విప్లవకర స్వభావాన్ని తగ్గించి అస్తిత్వ పరిభాషలో ఇరికించిన కుదింపువాదం ఎవరి మేధోమధన జనితం? దీనికి సమాధానం బ్రాహ్మణవాదమే ఈ కుదింపువాదానికి బాధ్యత వహించాలి. ఫూలే, అంబేద్కర్‌ల వరకు సాగిన పీడిత కుల విముక్తి పోరును విప్లవ ఉద్యమంగా గుర్తించడానికి స్వయం ప్రకటిత విప్లవకారులు సిద్ధంగా లేరు. అంబేద్కర్ హత్యానంతరం ఆయన నిర్మాణం చేసిన రాజకీయ ఉద్యమాన్ని బ్రాహ్మణులు సర్వనాశనం చేశారు. కాని ఆయన నిర్మాణం చేసిన ఆలోచనా విధానం బలమైంది.

దాన్ని నిర్వీర్యం చేయడానికి బ్రాహ్మణులు పన్నిన మేధో కుట్ర దళితవాదం. దళిత పాంథ ర్స్ ఆ కుట్రలో భాగం. మహారాష్ట్ర కేంద్రంగా సాగిన దళిత పాంథర్స్ ఉద్యమం అంబేద్కరిజం మీ ఒక అత్యాచారం. మార్క్సిస్టు ఆలోచన తప్ప అంబేద్క ర్ ఆలోచనావిధానం అందులోలేదు. దళిత ఉద్య మాలను విశ్లేషణ చేయడానికి బ్రాహ్మణీయ మేధావులు అస్తిత్వ ఉద్యమాల వైధానిక పద్ధతి ని అనుసరించారు.

దళిత ఉద్యమాన్ని వివరించాలంటే మహారాష్ట్రలో 1960 దశకంలో వచ్చి న మేధో ఉద్యమాన్ని, 1980 తర్వాత ఆంధ్ర లో వచ్చిన సామాజిక ఉద్యమాన్ని ప్రస్తావించే అలవాటు ఒకపద్ధతిగా చేశారు. శతాబ్దాల విము క్తి ఉద్యమాన్ని గుర్తింపు ఉద్యమాల చట్రంలో బం« దించిన రంగనాయకమ్మన్యులు నెపం బహుజనుల మీద వేస్తున్నారు. ఈ గుర్తింపు బ్రాహ్మణులిచ్చింది. ఈ కులం బ్రాహ్మణులు నిర్మాణం చేసింది. ఈ కుల వ్యవస్థను సజీవంగా నిలబెడుతుంది బ్రాహ్మణులు. అందుకే కుల నిర్మూలన పోరాటం బహుజనులు చేస్తున్నారు.

అన్ని అస్తిత్వ ఉద్యమాలను నిర్ణయించే ప్రధానమైన అస్తిత్వం (రంగనాయకమ్మ వర్గాన్ని అస్తిత్వం, గుర్తింపు అనడం విచిత్రం) ఈ సమాజంలో వర్గం ఆర్థికం కాదనీ, అది కులమనీ, దాన్ని కాపాడుతున్నది బ్రాహ్మణీయ శక్తులనే ఎరుక ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ రచయితలకు ఉంది. బహుజనులు సృష్టించిన సాహిత్యం పఠించకుండానే అధ్యయనం చేయకుండానే కులాన్ని పాడుతూ ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపన చేయడం ఏ రకమైన మేధో నిజాయితీ?

రంగనాయకమ్మ సంధించిన పాత ప్రశ్నలకు పాత సమాధానాలు రెడీమేడ్‌గా ఉన్నాయి. రంగనాయకమ్మకు పాత సమాధానాలే లభిస్తాయనీ, అవి గతంలోనూ వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఆమె అంగీకరించదనీ అందరికీ తెలుసు. కాని ప్రాభవం కోల్పోయిన బ్రాహ్మణవాద స్త్రీవాదానికి పూర్వ వైభవం తేవడానికి ఒక ప్రయత్నం జరిగింది. అది 'మనలో మనం'గా ఆరంభమై 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక'గా అంతమైంది. 

ఇండియా సమాజంలో స్త్రీలంతా సమానులు కారనీ బ్రాహ్మణీయ అగ్రకుల, పీడిత కుల స్త్రీల సమస్యలు వాటి పరిష్కారం స్వభావరీత్యా విభిన్నమైనవనీ సుభద్ర, షాజహానా,విజయలక్ష్మి లేవనెత్తిన సవాళ్లకు సమాధానం చెప్పా ల్సిన బాధ్యత 'మనలో మనం' నిర్వాహకులది. గత రెండు ఏళ్లుగా మౌనం వహించిన కాత్యాయని అండ్ కో గుండుగుత్తగా ఒక్క వ్యాసంతో తప్పంతా పీడిత కుల స్త్రీల మీదికి నెట్టేశారు. కాత్యాయని, చల్లపల్లి ప్రకటించిన వ్యాసంలో నిర్మాణపరమైన అంశాలు తప్ప సారభూతమైన సైద్ధాంతిక అంశాల విశ్లేషణ ఒక్కటీ లేదు.

ఎక్కడ ఏ సమావేశం జరిగిందనే సాంకేతిక విషయాలు చర్చించిన కాత్యాయని, చల్లపల్లి పీడిత స్త్రీలు లేవనెత్తిన ప్రశ్నలకు ఒక్కదానికీ జవాబివ్వలేదు. సిడీలు చూస్తే నిజాలు తెలుస్తాయని బెదిరింపొకటి. పైగా ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీల సాహిత్యానికి ఏదో ఉద్దారకం చేయాలని సంకల్పించినట్టూ వారు విస్మరిస్తే దానికి ఉనికే లేదన్నట్టు డాంబికం ప్రదర్శించడం వ్యాసంలో ఒక మెరుపు. రెండు దశాబ్దాలుగా వెల్లువెత్తుతున్న అణగారిన కులాల సాహిత్యాన్ని విద్యారంగంలో వైజ్ఞానిక క్షేత్రంలో తొక్కిపెట్టింది బ్రాహ్మణాధిపత్యవాదులు కాదా?

బ్రాహ్మణీయ స్త్రీవాదులు జవసత్వాలుడిగి భయంకరమైన మొనాటనీతో పాఠకులను విసిగించి నిరాదరణకు గురై సకల సాహిత్య ప్రక్రియల్లో పరవల్లు తొక్కుతున్న బహుజన సాహిత్యం ముందు కుదేలై తిరిగి పునరుత్థానంకోసం కింది కుల స్త్రీల నెత్తిమీద ఎక్కి కూర్చుంది నిజం కాదా? బ్రాహ్మణీయాధిపత్య వ్యవస్థ ప్రసన్న దృక్కుల కొరకు ప్రశంసల కొరకు అవార్డులు రివార్డులు అందలాల కొరకు కెరియరిజం కొరకు స్వాభిమానం విలువ విరూపం చేసిన చల్లపల్లి స్వరూపరాణి వంటి అవకాశవాదుల వల్ల బహుజన స్త్రీ సాహిత్యం నష్టపోతున్నది సత్యం. 

అగ్రవర్ణ బ్రాహ్మణాధిపత్యం మీద పోరాటం ఎంత అవసర మో ఇలాంటి అవకాశవాద దివాళాకోరుతనంమీద అంతే స్థాయిలో పోరాటం చేయాలి. కులం ఒక వాస్తవమనీ అదే నిర్ణాయక అంశమనీ ఇకనైనా అర్థం చేసుకోమని బ్రాహ్మణాధిపత్య శక్తులను బతిమాలాడే పని వదిలేయండి. బహుజనులు నిర్మిస్తున్న సాహితీ సౌధాన్ని వీక్షించడానికీ దానిలో సేదతీరి ఓలలాడడానికీ సంశయిస్తూ సాహిత్య ప్రమేయాన్ని అవమానిస్తున్న వారికి దూరం జరగడం మేలు. బ్రాహ్మణవాదుల 'సహజీవనవాదం' జాతి హననానికేమీ తీసిపోదనీ, బహుజన స్త్రీ దృక్పథం నుండి సమస్త రంగాలను నిర్‌బ్రాహ్మణీకరించే మార్గంలో నడిస్తేనే 'మట్టిపూలు' మానని వ్రణాలను నయం చేసే ఔషధమవుతుందని గ్రహించండి. కాని ఒక విన్నపం. చల్లపల్లి స్వరూపరాణులుంటారు తస్మాత్ జాగ్రత్త. 

- జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated :  9/8/2010

నిజాం సరే, అరసం నిరంకుశత్వం మాటేమిటి? - జిలుకర శ్రీనివాస్


నిజాం నిరంకుశత్వం గురించి చర్చ ఎంతో కాలంగా సాగుతున్నా, కమ్యూనిస్టులు మాత్రం ఇప్పటికీ పూర్వ వైఖరినే పునరుద్ఘాటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను దాదాపు ఆరు దశాబ్దాల పాటు వ్యతిరేకించిన 'కమ్యూనిస్టుపార్టీ' చివరకు 'ఓట్ల రాజకీయాల' నేపథ్యంలో అంగీకరించక తప్పలేదు. దీంతో అభ్యుదయ రచయిత సంఘం వైఖరి కూడా తదనుగుణంగా మారింది. 

అరసం కొత్త వైఖరిని పైకి ప్రదర్శిస్తున్నప్పటికీ తెలంగాణ చరిత్ర విషయంలో ఎస్వీ సత్యనారాయణ, వేల్పుల నారాయణ వ్యాసాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేక- సమైక్య వాదాలలో దేనికీ చెందని వానిగా మిత్రుల వ్యాసానికి స్పందిస్తానని దివికుమార్ అన్నప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దక్షిణ భారత దేశంలో నిలదొక్కుకోవడానికి తెలుగువారు ముక్కలు కావడానికి కారకుడు నిజాం అని సమైక్యవాదం వినిపించారు. 

ఈ తటస్థ వాదం అంతిమంగా ప్రజా వ్యతిరేకవాదంలో అంతర్భాగం అవుతుందనడానికి దివి కుమార్ వ్యాసమే ఉదాహరణ. తెలంగాణ చరిత్ర పేరుతో ఇప్పటి వరకు కమ్యూనిస్టు దృక్పథం నుంచే ప్రధానంగా రచనలు వెలువడ్డాయి. నిజాం వ్యతిరేకత కేంద్రంగా ఉన్న సాహిత్యమంతా విద్వేషంతో, చారిత్రక అంశాల పట్ల తగినంత ఎరుకలేని అజ్ఞానంతో, స్వీయ తప్పిదాలను ఇతరులపై నెట్టే ఆధిపత్య భావజాలంతో నిండి ఉంది. 

ఇంతటి అశాస్త్రీయమైన, ప్రజా వ్యతిరేక దృక్పథం ప్రబల శక్తిగా మారడంలో అరసం పాత్ర కూడా ఉంది. చరిత్రను జడమైందిగా అరసం భావిస్తున్నదని వీరి వ్యాసాలు తెలుపుతున్నాయి. నిరంతరం నిర్మించుకునేదే చరిత్ర. ఇందుకు అవసరమైన అకరాలు సేకరించి, మారిన సందర్భంలో పునర్ వ్యాఖ్యానించుకోవాలి. పూర్వ అభిప్రాయాలను విశ్లేషించుకుని కొత్త ఫలితాల ఆధారంగా నిశ్చితాభిప్రాయాలను నిజాయితీగా మార్చుకోగలగాలి. ఇదొక నిరంతర ప్రక్రియే తప్ప నిశ్చలమైనది కాదు. కానీ మార్కిస్టు సాహిత్యకారులుగా చెప్పుకుంటున్నవారు మార్క్సిస్టు మూల సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 

తెలంగాణ బహుజన దృక్పథాన్ని చరిత్రను నిర్‌బ్రాహ్మణీకరించే సందర్భమిది. తెలంగాణ చరిత్ర అంటే నిజాం వ్యతిరేక పోరాటమనే మూఢవాదం వల్ల బహుజనుల సగర్వమైన చరిత్ర మరుగున పడింది. కొన్ని లక్షల ఏళ్ల చరిత్రను ఏడేళ్ళకు కుదించే కుట్ర నిస్సిగ్గుగా ఇంతకాలం జరిగింది. తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఆర్యుల దురాక్రమణకు ఆరు వందల ఏళ్ల పూర్వమే వ్యవసాయిక కోట నాగరికత, పట్టణ నాగరికత నిర్మాణమై ఉన్నాయని పురావస్తు ఆధారాలు నిరూపిస్తున్నాయి. 

నాణాల ద్వారా కనుగొన్న తెలంగాణ జాతి సమున్నత చరిత్రను ఆంధ్ర సంపన్న పాలక కుల భావజాలం తెలియకుండా చేసింది. అదే భావజాలాన్ని మార్క్సిజం పేరుతో ఎస్వీ, వేల్పుల ప్రచారం చేస్తున్నారు. నిజాంను కీర్తించే వారిని విమర్శిస్తున్న వారి అజ్ఞానం కొండంత. జాతిపిత మహాత్మా జ్యోతిబా పూలే నిజాం రాజును శ్లాఘించారు. 1880లోనే జ్యోతిబా పూలే హైదరాబాద్ రాజ్యంలో నిజాం అమలు చేసిన నీటిపారుదల విధానం వల్ల ఇక్కడి రైతుల పరిస్థితి గణనీయంగా మారిపోయిందన్నారు. బ్రిటిష్ వారు అమలు చేస్తున్న నీటి పారుదల విధానం వల్ల కేవలం భట్ బ్రాహ్మణులు, కులకర్ణీలు, పటేల్, పట్వారీలు మాత్రమే లబ్ది పొందుతున్నారని ఆయన విమర్శించారు. 

కమ్యూనిస్టులు ప్రచారం చేస్తున్న నిజాం రాజ్యం శిలా సదృశమైనది. కానీ నిజాం ప్రత్యక్ష పాలనలో ఉన్న తెలంగాణ వేరు. దేశ్‌ముఖులు , జాగిర్దారుల అధీనంలో ఉన్న తెలంగాణ వేరు. నిజాం ప్రత్యక్ష పాలనలోఉన్న తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు దేశంలో ఎక్కడా లేని ప్రాధాన్యం ఉండేది. ఆది హిందూ ఉద్యమ నిర్మాత భాగ్యరెడ్డి వర్మ , అరిగె రామస్వామి వంటి మహనీయులు ఆదరించిన నిజాం ఎస్సీ, ఎస్టీ, బిసిల విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించారు. భాగ్యరెడ్డి వర్మను విద్యాశాఖమంత్రిగా నియమించిన నిజాం ఎస్సీ,ఎస్టీ, బిసిలకు గొప్పవాడే. 

నిజాం 1910 నాటికే వెట్టిచాకిరిని రద్దు చేస్తూ చట్టం చేసారు. సురవరం ప్రతాప రెడ్డి రాసిన 'సంఘాల పంతులు' కథ ఇందుకు నిదర్శనం. నిజాం ప్రత్యక్ష పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో వెట్టిచాకిరీ లేదు. దేవదాసీ వ్యవస్థను రద్దు చేసారు. మద్యపాన నిషేధం కోసం అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.జగన్ మిత్ర మండలిగా పారంభమైన అంటరానివారి ఉద్యమం ఆదిహిందూ ఉద్యమంగా, ఆది ఆంధ్ర ఉద్యమంగా పరిణామం చెందింది. ఎస్సీ, ఎస్టీ, బిసిల విద్యాభివృద్ధికి 1930 నాటికే తెలుగు మాధ్యమంలో ఉచిత పాఠశాలలు ప్రారంభించారు. 

కులం, మతం, లింగం ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం నిరాకరిస్తే శిక్ష పడుతుందని నిజాం హెచ్చరించాడు. నిజాంను ఎస్సీ, ఎస్టీ, బిసి సంఘాల నాయకులు సన్మానించారు. నిజాం సైన్యంలోని జంబన్న వంటి వీరులైన మాదిగలెంతో మంది పదవులు, గౌరవాలు పొందారనేది కమ్యూనిస్టులు ఏనాడూ చెప్పలేదు. రోలు పన్ను, రోకలి పన్ను... వంటివి వసూలు చేసి నిజం ఖజానా నింపుకున్నాడనేది ఎస్వీ ఆరోపణ. ఇన్ని రకాల పన్నులు ఏ ఉత్తర్వులో నిజాం పేర్కొన్నాడో ఒక్క జి.వొ. నెంబరైనా పేర్కొనలేదు. అగ్రవర్ణ జమీందార్లు చేసిన దోపిడీకి నిజాంను బాధ్యుడిని చేయడం ఎంతవరకు న్యాయం. పాలకునిగా నిజాం బాధ్యుడే అయినప్పటికీ,ఆయన ఒక్కడే బాధ్యుడు కాదు. నిజాం పాలన చివరి దశలో రాజకీయ పరిస్థితి దారుణంగా మారింది. 

ఈ జమీందార్లు, ఖాసీం రజ్వీతో కుమ్మక్కై నిజాంను బలహీనుడిని చేశారని చరిత్రచెబుతుంటే ఎస్వీ, వేల్పుల మాత్రం కాదని బుకాయిస్తున్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో 4,500 మంది బలైంది నిజాం నిరంకుశత్వానికే అని గుర్తించాలని వేల్పుల దబాయిస్తున్నారు. రజాకార్లతో జరిగిన పోరాటంలో 400 మంది మరణిస్తే, పోలీస్ యాక్షన్ తరువాత నాలుగు వేల మంది మరణించారని సంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.వేల్పుల మాత్రం దానిని అంగీకరించేది లేదని నిజాం నిరంకుశత్వమే కారణమని వాదిస్తున్నారు. 

పోలీసు యాక్షన్ తరువాత నాలుగు వేల మంది మరణించడానికి కమ్యూనిస్టులు కూడా బాధ్యత వహించాలి. పోలీస్‌యాక్షన్ తరువాత సాయుధ పోరాటం సాగించకూడదని తెలంగాణ రావి నారాయణ రెడ్డి వంటి నాయకులు వాదించారు. రజాకార్ల పేరుతో అమాయక ముస్లింలను ఊచకోత కోయడాన్ని రావి నారాయణ రెడ్డి ఫాసిజంగా పేర్కొన్నారు. పోలీసు యాక్షన్ తరువాత సాయుధ పోరాట విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆంధ్ర నాయకత్వం పెత్తనం చేసి తప్పుదోవ పట్టించడం వల్ల ఈ ఘోరం జరిగింది. ప్రజలు సాయుధ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని , రష్యామార్గంలో పోరాటంసాగించాలని రణదీవె, చైనా మార్గంలో సాగించాలనిమాకినేని బసవ పున్నయ్య వాదించారు. డాక్యుమెంట్లు రాసుకున్నారు. 

దీని వల్ల వేలాది మంది అమాయక ఎస్సీ, ఎస్టీ,బిసి మైనారిటీ ప్రజలు ప్రాణార్పణ చేసారు. కమ్యూనిస్టులు ఇందుకు బాధ్యత వహించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి బదులు నిజాంను బాధ్యుడిని చేస్తున్నారు.ఉద్యమ దిశ నిర్ణయించుకోలేని కమ్యూనిస్టులు, దాని తోక సంస్థల వారు తెలంగాణ ప్రజలకు సుద్దులు చెబుతారా? 

ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే ప్రతిసందర్భంలో ఆయా జాతులు, వర్గాలు, ప్రాంతాలు వాటి చరిత్రను పునర్నిర్మించుకుంటాయి. తెలంగాణ ప్రజలు చేస్తున్నది అదే. బానిస చరిత్ర మాత్రమే తెలంగాణ ప్రాంతానికి ఉందని కమ్యూనిస్టులు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఆంధ్రవలస వాదులు మేమే మీకు విముక్తికలిగించాం, మీరింకా దొరల బానిసలే అని వాదిస్తున్నారంటేఅందుకు అరసంవంటి సంస్థలు బాధ్యత వహించాలి. 

స్వంతంత్ర రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయాలని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పైరవీలుచేసింది.అరసం కూడా దానికి వత్తాసుపలికింది. ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన సంస్థకు నాయకత్వం వహిస్తున్న దోపిడీ అనుకూల శక్తులు నిజాంను విమర్శిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. బహుజనులు ఈ దురహంకారాన్ని ఇంకెంత మాత్రం సహించరు.
Andhra Jyothi News Paper Dated 11/4/2010

జిన్నాకు ముందే ద్విజాతి సిద్ధాంతం - జిలుకర శ్రీనివాస్


సంస్కృతి నిర్వకల్పమైనది కాదనీ, అది ఆయా సమాజాల్లోని వివిధ సమూహాల ప్రత్యేకమైన, నైరూప్యమైన అంశాలతో పాటు ఆధిపత్య శక్తుల అభీష్టానుసారం నిర్మించబడుతోందనీ, దానికి సమాంతరంగా వ్యక్తీకరించబడే ప్రతివాదం కూడా సంస్కృతిలో అవిభాజ్యమైన అంశమని గుర్తించాలి. సాహిత్యం సాంస్కృతిక నిర్మాణమని భావిస్తే అది తప్పనిసరిగా రాజకీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. 

అందువల్ల పీడిత కులాలు, మతాలు చేసే సాహిత్య వ్యక్తీకరణలు నైరూప్యమైనవి కావు. వాటికి నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యం, రాజకీయ పునాదీ ఉంటాయి. ముస్లిం కథలను అర్థం చేసుకోవాలంటే ఈ దృష్టిని అలవర్చుకోవాలి. స్కైబాబ అనేక ముస్లిం రాజకీయ కథలు రాశారు. అలాంటి ముస్లిం సంస్కృతిని వ్యక్తీకరించిన రాజకీయ కథల సంకలనమే 'అధూరె'. 

కనీజ్ ఫాతిమా ముందుమాటలో పేర్కొన్నట్టు ముస్లిం జీవితాలను అర్థం చేసుకోవటం ముస్లిమేతరులకు సులువేమీ కాదు. కాని, ఆ జీవితాలను నియంత్రిస్తున్న, నిర్దేశిస్తున్న పాలక కులాల రాజకీయాలు అర్థం చేసుకోలేని అమూర్త పదార్థమేమీ కాదు. ముస్లింలను పునరావాస శిబిరాల్లోకి నెట్టేసిన సమకాలీన దుస్థితికి గత రాజకీయ కారణాలను చారిత్రక దృష్టితో విశ్లేషించుకుంటేనే వాస్తవికత బోధపడుతుంది. సాహిత్యంలో వాస్తవికత పీడిత కులాలు రచనలు చేసే వరకు రూపొందలేదనేది విమర్శకులు అంగీకరిస్తున్నదే. 

అందువల్ల వాస్తవికత అనేది దానికదే ఆకృతి దాల్చేది కాదు. అది ఒక నిర్మాణం. రచయిత అనుభవంతోనూ గ్రహించిన జ్ఞానంతోనూ కొన్ని సామాజిక ప్రతిఫలనాలను వ్యక్తీకరిస్తాడు. అవి ఆ రచయిత కుల, మత, ప్రాంత, లింగ, జాతి వంటి నిర్దిష్టతల మీద ఆధారపడి ప్రతిఫలిస్తాయి. అందుకే బ్రాహ్మణ కథకులు రాసిన అనేక కథలు ఆ కులంలోని పరిస్థితులను, ఆ కులస్తుల మానసిక వర్తనను ప్రతిబింబించాయి. కాని, విశాలమైన బ్రాహ్మణేతర సమాజాన్ని అవి ప్రదర్శించలేకపోయాయి. శూద్రులు, అతిశూద్రులు, ముస్లింలు రచనలు చేయటం ప్రారంభించగానే అప్పటిదాకా వాస్తవికత అని భ్రమించినది కాస్తా కాల్పనికమైనదని రుజువైంది. 

అందుకే సమాజ వాస్తవికతను అర్థం చేసుకునేందుకు సాహిత్యేతర అంశాలను పరిగ్రహించాలి. 'అధూరె' సంకలనంలోని ముందుమాటలు స్కైబాబ కథలను అర్థం చేసుకొనేందుకు అవసరమైన సాహిత్య, చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని విభిన్న రూపాల్లో ఆవిష్కరించాయి. అఫ్సర్, కె.శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా రాసిన ముందుమాటలు పాఠకులలో ఆసక్తి రేకెత్తిస్తాయి. వాచకానికి ముందుమాటలు అవసరం లేదనీ, ఆ రెండింటి మధ్య వున్న పితృపౌత్ర సంబంధాన్ని తెంచి పితృ హత్యకు పాల్పడాలని డెరిడా ఘీంకరించాడు. కానీ, పీడిత సమాజాల వ్యక్తీకరణలను వివేచించేందుకు డెరిడా సూత్రీకరణ సరిపోదు. 

కాలాన్ని పునర్నిర్మించుకొనేందుకు రచయిత ఆధునికత మీద ఆధారపడతాడనీ, ఆ క్రమంలో వర్తమానంలో నిలబడి గతాన్ని, అది సృష్టించిన మిధ్యా వాస్తవికతను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు ఈ చారిత్రక స్పృహ వున్న రచయిత అంటారు, అఫ్సర్. స్థానిక అస్తిత్వ పునర్నిర్మాణంలో ఇది చాలా అవసరమైన సైద్ధాంతిక సాధనం అని కూడా ఆయన అంటారు. వాస్తవానికి ఆధునికత పేరుతో మన సమాజంలో చలామణిలో ఉన్నదంతా కులాధునికతే. బ్రాహ్మణ్యం ఆధునికత ముసుగు ధరించి వేసిన ఎత్తుగడలు, రాసిన రాతలు కాలాన్ని, దానికి సంబంధించిన అవగాహనను సెక్టేరియన్ పరిమితులలో బంధించింది. 

ఆధునికత గురజాడతో మొదలైనా గిడుగుతో వర్ధిల్లినా అంతా బ్రాహ్మణ్యమే. వలస పాలనలో ఆధునిక చరిత్ర రచన పేరుతో జరిగిన పుక్కిటి పురాణాల అల్లిక ముస్లిం వ్యతిరేకతనూ బ్రాహ్మణ కాల్పనిక స్వర్ణ యుగాలనూ సృష్టిస్తే, ఆ సృష్టికి మనువాదులే బాధ్యత వహించాలి. కాని, ప్రపంచంలో ఏ మానవ సమూహానికీ లేని సౌలభ్యం బ్రాహ్మణులకే ఉంది. 

అన్ని పొరపాట్లకూ చారిత్రక ఉత్థాన పతనాలకు తెల్లదొరలను బాధ్యులను చేసి చేతులు దులుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. కె.శ్రీనివాస్ కూడా హిందూ ముస్లింల మధ్య విభజనకూ ముస్లింల పట్ల వ్యతిరేకతకూ తెల్లదొరలనే బాధ్యుల్ని చేస్తున్నారు. కాని, కనీజ్ ఫాతిమా మాత్రం కుల వ్యవస్థలోని విభజన సూత్రమే మతపరమైన విభజనకూ రాజకీయ విభజనకూ పాదులు వేసిందనీ, ఆ విభజన సూత్రాన్ని తెల్లదొరలు తెలివిగా ఉపయోగించుకున్నారని చెప్తున్నారు. 

చరిత్రను కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించే తీరు ప్రధాన స్రవంతి వైధానిక పద్ధతిలో ఉంటుంది. ఫూలే గురించి ఆయన అవగాహన దీనికి అద్దం పడుతుంది. 'దేశంలోని భిన్న కులాల అంతస్తుల సంబంధం మీద కాక, సొంత కులాన్ని ఆధునీకరించుకోవడం మీదనే సంస్కర్తల దృష్టి. దొంతరల సామాజిక వ్యవస్థ మీద తక్కిన సమకాలీన సంస్కర్తలందరి కంటె లోతైన అవగాహన, విమర్శ ఉన్నప్పటికీ ఫూలే కూడా ఆచరణ రంగంలో విద్యావకాశాలను అందరికీ అందించటం వంటి సంస్కార చర్యల మీదనే దృష్టి నిలిపారు' అని సూత్రీకరించారు. 

సామాజిక విప్లవానికి సైద్ధాంతిక పునాదులు వేసిన ఫూలే దార్శనికత, సైద్ధాంతిక వివేచన పట్ల అనేక వక్రీకరణలు జరిగాయి. ఫూలే కేవలం విద్యారంగంలో కృషి చేసిన ఉద్యమకారుడని పరిమితం చేయటం సంకుచితవాదం. బ్రాహ్మణాధిపత్యం నుండి మూలవాసులను విముక్తి చేసి బలిరాజ్యం స్థాపించాలన్న ఆశయమే ఆయన్ను ప్రజలను విజ్ఞానవంతులను చేయాలని సంకల్పించింది. దీని అర్థం అందరికీ బ్రాహ్మణీయ లేదా వలసవాద విద్యను అందించటం ఆయన ఉద్దేశ్యం కాదు. 

కుల వ్యతిరేక, బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకమైన మూలవాసీ తత్వ చింతనను ప్రచారం చేయటం. ఆ భావజాలంతో ఎదిగిన తరాలను తన పోరాటానికి సంసిద్ధం చేసే రణనీతి ఆయన అనుసరించారు. 1848లో ప్రణాళికాబద్ధంగా ఆయన నడిపిన ఉద్యమం 1873లో వ్యవస్థీకృత నిర్మాణం పొందింది. సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో శూద్ర రైతాంగ ఉద్యమం, కార్మికోద్యమం, వ్యవసాయ కార్మిక పోరాటం, మహిళా ఉద్యమం ఆయన నడిపారు. విధవ స్త్రీలకు శిరోముండనం చేసేందుకు నిరాకరిస్తూ మంగళి కులస్తులతో పుణా పట్టణంలో తొట్టతొలిసారి సార్వజనీన నిరవధిక సమ్మె చేయించిన విప్లవకారుడు ఫూలే. 

తన ఉద్యమంలో ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లను భాగస్వాములను చేసి సామాజిక పరివర్తనకు అంకురార్పణ చేశాడు. అందువల్ల ఫూలే ఆచరణ రంగం బహు విశాలమైంది. అది ఈ దేశ కుల అంతర్వులను, వాటి మధ్య వున్న నిచ్చెన మెట్ల అధికార సంబంధాలను నిర్మూలించేది. కాని, ఫూలేని మరింత కురుచవాదంలో ఇరికించే ప్రయత్నం కె.శ్రీనివాస్ చేయటం విచారకరం. ఫూలేతో జిన్నాను పోల్చటం అహేతుకమైంది. 

మహ్మద్ అలీ జిన్నా వాస్తవానికి వైశ్యుడు. ఇస్లాం స్వీకరించిన వైశ్య కుటుంబసభ్యుడు. కాశ్మీరీ బ్రాహ్మణుడైన మోతిలాల్ నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఏ విధంగానూ ఇస్లామీయ జీవనం సాగించనివాడు. ఆయన్ని లౌకికవాది అంటారు. కాని వాస్తవానికి ఆయన బ్రాహ్మణవాది. కులాధిపత్య సామాజిక అంతర్వులున్న ఈ సమాజాన్ని స్వతంత్రం, సమానత్వం, బంధుత్వం, న్యాయం అనే విలువల ఆధారంగా పునర్నిర్మాణం చేయాలనే సంకల్పం ఏ కోశానా లేనివాడు. 

అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌లో ప్రవేశపెట్టింది. ముస్లిం సమాజానికి నాయకత్వం వహిస్తున్న సర్ సయ్యద్ ఆగాఖాన్ వంటి వారిని దెబ్బతీయడానికీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనేందుకు అలీ జిన్నాను బ్రాహ్మణులే ప్రమోట్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగే వరకు అలీ జిన్నాకు గాంధీ పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. 

ఆగాఖాన్ వంటి ముస్లిం నేతలు డా.అంబేద్కర్‌ను రౌండ్ టేబుల్ సమావేశాల్లో బలపర్చారు. ముస్లింల సహకారం వల్లే నా జాతి ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను సాధించాను అని అంబేద్కర్ అన్నారు. ముస్లిం, అణగారిన వర్గాల మైత్రి బ్రాహ్మణీయ అగ్రకులాల ఆధిపత్యానికి గండి కొడుతుందని గ్రహించిన గాంధీ, నెహ్రూలు అలీ జిన్నాను ముస్లిం లీగ్ నేతగా ఎదిగేలా చేశారు. అలీ జిన్నా ముస్లిం నేతగా ఎదిగిన నాటినుండి అణగారిన వర్గాలకు దూరమై అగ్రకులాలకు చేరువయ్యాడు. 

వాస్తవానికి జిన్నా రాజకీయాల్లోకి రావడానికన్న ముందే ద్విజాతి సిద్ధాంతం ఉనికిలో ఉంది. 1857 తిరుగుబాటు కన్న ముందే బ్రాహ్మణులు, బ్రిటీషువాళ్లు జాతిఐక్యత సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. 1875లో ఆవిర్భవించిన ఆర్యసమాజం ఆర్యజాతి సిద్ధాంతంతో రూపొందింది. ముస్లింలను ఒక జాతిగా చిత్రిస్తూ ముస్లిమేతరులను బ్రాహ్మణీకరించే క్రమం అప్పటికే మొదలైంది. బంకించంద్ర చటర్జీ ఆనంద్‌మఠ్ నవలలోనూ వివేకానంద, తిలక్ రచనల్లోనూ ఆర్యజాతి సిద్ధాంతం స్పష్టమవుతోంది. 

అది ముస్లిం వ్యతిరేకతను కేంద్రంగా చేసుకొని ప్రచారమైంది. పీడిత కులాలను బ్రాహ్మణీకరించేందుకు తయారు చేసినదే ద్విజాతి సిద్ధాంతం. దీనికి ద్విజులే జన్మప్రదాతలు. అందువల్ల ముస్లిం జాతి అనే భావన అలీ జిన్నాతో ఉనికిలోకి వచ్చింది కాదు. బ్రాహ్మణీకరించే (హిందూవీకరణ) క్రమం స్వతంత్రం తర్వాత మొదలైంది కాదు. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనే ప్రజాస్వామిక సూత్రాన్ని బ్రిటీషు వాళ్లు ప్రవేశ పెట్టడాని కన్న ముందే అది మొదలైంది. ఆ క్రమంలోనే అది చట్టసభల పరిచయంతో తీవ్రమైంది. 

సి.రాజగోపాలాచారి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపాదించిన దేశ విభజన పథకాన్ని సి.ఆర్ ఫార్ములా అంటారు. దేశ విభజనకు ఎవరు కారకులనే దాని మీద నేటికీ విస్తృత చర్చ జరుగుతోంది. అలీ జిన్నాను బాధ్యున్ని చేసిన వారు సి.ఆర్ ఫార్ములా గురించి గానీ, గాంధీ నేతృత్వంలో బిర్లా హౌజ్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశ విభజనకు సమ్మతి తెలుపుతూ తీర్మానం చేసిన సంగతిని గానీ అస్సలే ప్రస్తావించరు. కానీ కనీజ్ ఫాతిమా విభజన రాజకీయాలను విపులీకరించిన తీరు ముదావహం. 

బ్రాహ్మణీయ శక్తులు దేశాన్ని హస్తగతం చేసుకొనేందుకు చేసిన దుర్మార్గమైన రాజకీయమే దేశ విభజన. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బిసీలు అధికార వంచితులు కావడానికీ, అధికార బదలాయింపు తర్వాత బానిసలుగా మారడానికి కారణమైంది. తెలంగాణ ముస్లింలు ఆంధ్ర వలసవాదంలో మగ్గిపోవడానికీ, హైదరాబాదీ తెహ్‌జీబ్ నాశనం కావడానికీ దేశ విభజన పేరుతో బ్రాహ్మణవాదులు అధికారం హస్తగతం చేసుకోవటమే కారణం. 

అందువల్ల ముస్లింల పతనానికీ, దురవస్థకూ, అణచివేతకూ స్థానిక మూలాలు వెతికితే సమాధానం దొరకదు. జాతీయ రాజకీయ పరిణామాలు, ఆధిపత్య భావజాల పునాదులను పట్టుకుంటేనే తెలంగాణ ముస్లింల దైన్యానికి కారణాలు బోధపడుతాయి. అందుకే కాబోలు కనీజ్ ఫాతిమా హక్కుల కార్యకర్తగా ముస్లిం అణచి వేతను ప్రత్యామ్నాయ దృక్పథం నుండి విశ్లేషించింది. వాస్తవానికి కనీజ్ ఫాతిమా ముందుమాట విషయ అవగాహనకే కాదు, సాహిత్య క్షేత్రంలో విశాలం కావాల్సిన నవీన దృక్పథానికి మార్గం చూపుతుంది. చరిత్రను ముస్లిం దృక్పథం నుండి చూడాలనే స్పృహను కలిగిస్తుంది. 

ముస్లిం కథా చరిత్రను నిర్మాణం చేసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం మన ముందు ఉంది. సాహిత్య చరిత్ర రచనలో దేశ విభజన కాలం విస్మరించబడింది. స్వతంత్రానికి పూర్వం, స్వాతంత్య్రోత్తర తెలుగు కథ వంటి భావనలే సాహిత్యకారులు నమ్ముతూ వచ్చారు. కానీ దేశ విభజన సందర్భంగా ముస్లిం రచయితలు రాసిన కథలేమిటి? వాటిలో వ్యక్తమైన ప్రతిస్పందనలేమిటీ? వాటిని పాఠకులు ఏ రకంగా స్వీకరించారు? దేశ విభజన సమయంలో ముస్లిమేతర రచయితలేమి రాశారు? 

అభ్యుదయ కథకులు, సంప్రదాయ కథకులు ఆ సమస్యను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఒకవేళ ఆ ముఖ్యమైన సంఘటన పట్ల రచయితలు మౌనం వహిస్తే, దానికి గల కారణాలేమిటి? వంటి అనేక అంశాలను పరిశీలించాలి. దేశ విభజన వల్ల తలెత్తిన సామాజిక అశాంతి, ముస్లింల మీద జరిగిన దమనకాండ ఆనాటి ప్రజల మనసులను వెంటాడుతూనే ఉంటుంది. దేశ విభజన సమయంలో హైదరాబాదు రాజ్యంలో సంభవించిన రాజకీయ మార్పులు ముస్లింలనే కాదు ఇతర కులాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. 

ఆ జాతీయ సమస్యకు హైదరాబాదీ రచయితలు ఏ విధంగా స్పందించారో పరిశోధించాల్సి ఉంది. కోస్తాంధ్ర రచయితలే కాదు, మద్రాసు కేంద్రంగా పనిచేసిన రచయితల అవగాహన ఏమిటో కూడా నమోదు కాలేదు. అవి నమోదు అయి ఉంటే, ఆ రచనలు అందుబాటులో ఉండి ఉంటే ముస్లిం సాహిత్య గమనం, గమ్యం మరోవిధంగా ఉండేది. ముస్లిం సాహిత్యం బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఆరంభమయ్యేది కాదు. స్కైబాబ కథలు మరో విధంగా ఉండేవి. 

- జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated 23/1/2012