Showing posts with label ఆహార భద్రతా చట్టం. Show all posts
Showing posts with label ఆహార భద్రతా చట్టం. Show all posts

Monday, November 4, 2013

అస్తవ్యస్త ఆహార భద్రత By - హరిలాల్‌ నాథ్‌

 ఆహార భద్రత చట్టం తెచ్చి ప్రజలకు అవసరమైన ఆహారం, పౌష్టికత కల్పిస్తామని 2009 లోకసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. అంటే దేశ ప్రజలను ఆకలి, పోషకాహార లోపం నుంచి విముక్తులను చేయటమన్న మాట. ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ నాయకత్వంలో యుపిఎ-2 ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పనుల్లో ఆహార భద్రత బిల్లును ప్రవేశ పెట్టడం కూడా ఒకటిగా ఉంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రపతి ప్రసంగంలో కూడా 100 రోజుల లోపే ఆహార భద్రత బిల్లు పెడతామని స్పష్టంగా చెప్పింది. అలా చూస్తుండగానే నాలుగున్నరేళ్ళు గడిచిపోయాయి. ఈ కాలమంతా ప్రభుత్వానికి ఆహార భద్రత గురించి ముందుకు వెళ్ళటం అవసరం అనిపించలేదు. ఒక విధంగా తమ వాగ్దానం సంగతే వారు మరిచిపోయారు. ఇప్పుడు పదవీకాలం ముగియవస్తున్న సమయంలో, మరో లోకసభ ఎన్నికల ముంగిట ఆహార భద్రత చట్టం చేయటానికి ఇదే అనువైన సమయమని ప్రభుత్వానికి గుర్తొచ్చింది. ప్రభుత్వ అసలు లక్ష్యం ఎన్నికల ముందు బిల్లు ఆమోదింప చేసుకోవటం, ఎన్నికల్లో అదనపు లాభం పొందటంగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికలప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా వరకు తమ విజయాన్ని సుగమం చేసిందనేది కాంగ్రెస్‌ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది. ఈసారి ఆహార భద్రత చట్టం తమను దరిచేరుస్తుందని అనుకుంటున్నారు. అందుకు ఆహార భద్రత బిల్లును ఆమోదింపజేసుకున్నారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో పౌరుల ఆహార అవసరాలను తీర్చటానికి ఆహార భద్రత చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ కూడా ఆ జాబితాలో చేరుతుంది. ఆహార భద్రత అంటే పౌరుల ఆహార హక్కుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వటం. అంటే దేశంలో ఒక్కడు కూడా తిండి లేక పౌష్టికాహార లోపానికి గురి కాకుండా, వారికి అవసరమైప కనీస ఆహారం, పౌష్టికత లభించేలా ప్రభుత్వం చూస్తుంది. కానీ లోక్‌సభలో ఆమోదించిన బిల్లులో ఆహార భద్రతకు సంబంధించి కాక కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అందుకే సార్వజనీన ఆహార హక్కు గుర్తింపు పొందలేదు. పేదల మధ్య విభజన రేఖ గీసి కొందరికి సౌకర్యాలు ఇచ్చి మరి కొందరికి లేకుండా చేసింది. బిల్లులో లోపాలు, పరిమితులను సరిదిద్దటానికి ప్రతిపక్షాలు 300కు పైగా సవరణలు ప్రతిపాదించాయి. కానీ ప్రతిపక్షాలు సూచించిన ఏ ఒక్క సవరణనూ అంగీకరించలేదు. ఇంకా విడ్డూరమేమంటే ఆ సవరణల్లో ఆమోదయోగ్యమనిపించిన వాటిని సర్కారువారి సవరణలుగా స్వీకరించి నూటికి నూరు శాతం తనదే ఘనత అని చాటుకోవటానికి ప్రయత్నం జరిగింది. భారతీయులందరికీ ఆహార భద్రత వ్యవస్థ కంటే కాంగ్రెస్‌కు తన రాజకీయ లబ్ధే ముఖ్యమని దీన్నిబట్టే స్పష్టమౌతోంది.
మొదటి నుంచీ ఆహార భద్రత భావన మూలంలో ప్రతి భారతీయునికీ ప్రతి నెలా 7 కేజీలు బియ్యం లేక గోధుమలు కేజీ రూ.2 చొప్పున కేటాయించటం జరుగుతుందని ఉంది. దీనికి సంబంధించి ప్రాథమిక ప్రణాళిక లేకపోవడంతో ముసాయిదా ప్రతిపాదన తయారు చేసే బాధ్యతను జాతీయ సలహా మండలికి అప్పగించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఈ సలహా మండలి ఏర్పాటైంది. ప్రభుత్వానికి సామాన్య ప్రజల పక్షపాతిగా ఒక ఇమేజ్‌ సృష్టించడమే ఈ మండలి ఏర్పాటు లక్ష్యం. మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ఒకటి తరువాత ఒకటి సరళీకరణ చర్యలు చేపట్టటంవల్ల ప్రభుత్వం సంపన్నుల పక్షపాతిగా మారిందని స్పష్టమౌతున్న సమయంలో ఈ జాతీయ సలహా మండలిని తెరపైకి తెచ్చారు. ఐదుగురు సభ్యులున్న ప్రతి కుటుంబానికీ నెలకు 35 కిలోల బియ్యం లేక గోధుమలు కిలో రూ.2 చొప్పున ఇవ్వాలని మొదట ఈ మండలే సిఫారసు చేసింది. సోనియా గాంధీ కూడా దీనికి తలూపారు. కానీ ప్రధాని ఆర్థిక సలహా మండలి నుంచి దీనికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. నిజానికి సరళీకరణ విధానాల భక్తులు ఎప్పుడూ ప్రజాసంక్షేమ పథకాలను ఇష్ట పడరు. సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు దుబారా అని వారు భావిస్తారు. దానికి బదులు వారు దేశ, విదేశీ ప్రైవేటు పెట్టుబడికి వీలైనన్ని రాయితీలు, సౌకర్యాలు ఇవ్వాలంటారు. అందుకే జాతీయ సలహా మండలి సిఫారసులు ఆచరణ సాధ్యం కాదని, ఇంత పెద్ద బాధ్యత ప్రభుత్వం వహించజాలదని ప్రధాని సలహా మండలి చెప్పింది. నెలకు 35 కిలోలకు బదులు 25 కిలోలిస్తే సరిపోతుందని వారు భావిస్తున్నారు. దానితో పాటే గోధుమ ధర కిలో రూ.2 అయినా బియ్యం మాత్రం రూ.3 ఇవ్వాలని చెప్పింది. ఈ విధంగా బిల్లు ఊసెత్తకుండా నాలుగేళ్ళు గడిపేశారు. మొదటి నుంచీ సామాన్యులు ఆహార భద్రత సౌకర్యం పొందటం ప్రభుత్వానికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ప్రజలకు ఉద్దేశపూర్వకంగా సౌకర్యం అందకుండా చేసి సరళీకరణ విధానాలకే ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కనక పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిల్లు ఆమోదించారు.
లోక్‌సభలో ఏ బిల్లు ఆమోదం పొందినా దాంట్లో జాతీయ సలహా మండలి సిఫారసులను కత్తిరించి ప్రధాని ఆర్థిక సలహా మండలి అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ప్రజలందరినీ ఈ చట్టం పరిధిలోకి తేకుండా రాష్ట్రాలవారీగా కోటా నిర్ధారించి మొత్తం మీద గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం అంటే మొత్తం కలిపి 67 శాతం ప్రజలను ఆహార భద్రత చట్టం పరిధిలోకి తెచ్చారు. మిగతా 33 శాతం ప్రజలు (40 కోట్లు) దీని బయట ఉంటారు. ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎపిఎల్‌-బిపిఎల్‌ విభజన ఉన్నా అందరికీ రేషన్‌లో ఆహార ధాన్యాలు లభించేది. కొత్త బిల్లులో కొత్త తరహా విభజన చేసి 37 శాతం ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి బయటకు నెట్టేశారు. అలాగే ప్రస్తుత ఏర్పాటులో బిపిఎల్‌ కుటుంబాలు నెలకు 35 కేజీల ఆహార ధాన్యాలు పొందుతున్నాయి. కొత్త బిల్లులో దాన్ని 10 కేజీలు తగ్గించి 25 కేజీలు చేయటం జరిగింది.
నిజానికి ప్రభుత్వం చాలా ఆలోచించి, విశ్లేషించి ఆహార భద్రత పేరున రాజకీయ లబ్ధి పొందుతూనే అదనపు ఆర్థిక భారం మోయాల్సిన అవసరం లేకుండా ఉండేలా ఒక దారి కనిపెట్టింది. ఇది పాము చావకుండా, కర్ర విరక్కుండా ఉన్న చందంగా ఉంది. దీనివల్ల వాస్తవంగా మొత్తం బియ్యం-గోధుమల అవసరం ఏమంత పెరగదు. ఇంచుమించు ఇదివరకు మాదిరిగానే ఉంటుంది. ఆహార మంత్రిత్వ శాఖ లెక్కలు కూడా ఆహార భద్రత చట్టం అమలు చేయటానికి అదనపు ఆహార ధాన్యాల అవసరం పెద్దగా ఉండదని చెబుతున్నాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల రేషన్‌ వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలందరూ చౌకగా ఆహార పదార్థాలు పొందటమే కాక పెద్ద సంఖ్యలో ప్రజలు చాలా తక్కువ ధరకే ఎక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలను పొందుతున్నారు. కేంద్ర కొత్త చట్టం అమలు జరిగితే ఈ రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు ఇన్నాళ్ళూ పొందుతున్న సౌకర్యం కోల్పోతారు. వారిలో చాలామంది రేషన్‌ పరిధి బయటికి నెట్టబడుతారు. ఎంతోమందికి ఆహార కేటాయింపులు తగ్గిపోతాయి, ఇంకా ఎంతోమంది ఎక్కువ ధర చెల్లించి రేషన్‌లో ఆహార పదార్థాలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు తమిళనాడులో అందరికీ 20 కేజీల బియ్యం ఉచితంగా లభిస్తాయి. కొత్త చట్టంలో కేవలం గుర్తించబడిన కుటుంబాలే 25 కేజీల చొప్పున పొందుతాయి. వారు దానికి రూ.75 చెల్లించాల్సి వస్తుంది. అలాగే తమిళనాడులో కొత్త చట్టం ప్రకారం కేవలం 50.55 శాతం ప్రజలే రేషన్‌ పొందుతారు. మిగతా వారు అది కోల్పోతారు. తమిళనాడు తమ ప్రస్తుత పథకాన్ని కొనసాగించాలనుకుంటే అదనపు ఆహార పదార్థాలను స్వయంగా సేకరించుకోవాలి. అలాగే దానికయ్యే అదనపు ఖర్చు కూడా తానే భరించాలి. అదే విధంగా కేరళకు కేంద్రం నుంచి ఆహార కేటాయింపు చాలా తగ్గిపోతుంది. ధర విషయంలో కూడా వారు నష్టపోతారు. అన్నిటికీ మించి ప్రస్తుతం అందరికీ ఉన్న రేషన్‌ వ్యవస్థ నుంచి 54 శాతం మంది బయటికి వెళ్ళిపోతారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు ఆర్థికంగా అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో 34 శాతం మంది రేషన్‌ పరిధి నుంచి బయటకు పోతారు. అలాగే ఇప్పుడు రూ.2 చొప్పున బియ్యం పొందుతున్న కుటుంబాలు రూ.3 చొప్పున చెల్లించాలి. దీనివల్ల ఇప్పటికే ఆహార భద్రత సమర్థవంతంగా ఉన్న కనీసం 12 రాష్ట్రాల్లో ప్రజలు నష్టపోతారు.
బిల్లు ఆమోదం పొందిన దగ్గర నుంచి ఉదారవాదులు ముఖ్యంగా పరిశ్రమ రంగం నుంచి అసంతృప్తి వ్యక్యమవుతోంది. వారి అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఖర్చు మోయలేనంతగా పెరుగుతుంది. ఖజానా లోటు పెరగటం వల్ల ఆర్థిక వ్యవస్థ ఇంకా దిగజారిపోతుంది. ఉదారవాద ఆర్థికవేత్తలు కినుక వహించటానికి కారణమేమంటే వారి ఆర్థిక సూత్రాల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు చాలా పరిమితమైన స్థానమే ఉంది. ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడం, ప్రజా ప్రయోజన పథకాలకు ఖర్చు పెంచటం వారికి ఏమాత్రం రుచించదు. పేదలకు అనవసరంగా ఇంత సొమ్ము ఖర్చు పెట్టే బదులు ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉద్దీపన పథకాలు విస్తరించగలదని పారిశ్రామికవేత్తల వాదన. అంతేకాక సామాజిక పథకాల్లో ప్రభుత్వం ఖర్చు పెరిగితే ఆ ఖర్చు పూరించటానికి పన్నుల పరిమాణం, వసూలు పెరగాలి. పారిశ్రామిక రంగం అదనపు పన్నుల సంగతి అటుంచి బకాయి పన్నులే చెల్లించటానికి ఇష్ట పడటం లేదు. ఇంకా చెప్పాలంటే వారు ప్రభుత్వ బ్యాంకుల వద్ద తీసుకున్న భారీ ఋణాలు తీర్చటానికి ఇష్ట పడటం లేదు. అంటే ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై ఖర్చు పెట్టకుండా ఆ ధనం పరిశ్రమల సంక్షేమం కొరకు ఖర్చు పెట్టాలని ఉదారవాదులు, పారిశ్రామిక రంగం కోరుకుంటోంది.
ప్రస్తుతం రేషన్‌ సహా వివిధ పథకాల్లో ఆహారం కొరకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఇంచుమించు రూ.1 లక్ష కోట్లు. ఇదికాక ఆహార సబ్సిడీకి రూ.90 వేల కోట్లు, ఆహార భద్రతకు మరో రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా చెప్పారు. ఇంకా అవసరమైతే ఆ ఖర్చు పెట్టే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పారు. రూపాయి నిజ విలువ దిగజారటం, ద్రబ్యోల్బణం కారణంగా ఏ పనికైనా ఖర్చు పెరుగుతుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ బడ్జెట్‌ పరిమాణం కూడా పెరుగుతుంది. అలాగే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేయటం ప్రభుత్వ విధి. భారత్‌లాంటి దేశంలో ఆహార భద్రత అనేది ఒక విలాసమని చెబుతున్నారు. భారత్‌ కంటే చాలా వెనుకబడిన దేశాలు చాలా ముందు నుంచే ఆహార భద్రత వ్యవస్థ విజయవంతంగా నడిపిస్తున్నాయి. నిజానికి గత దశాబ్దంలో అసమాన అభివృద్ధి జరిగింది. జరిగిన అభివృద్ధి ఫలాలు కూడా సంపన్నులకే దక్కాయి. సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. కనుకనే ఆహార భద్రత అవసరం వచ్చింది. సంపన్నులు సామాన్య ప్రజల కొరకు ప్రభుత్వం పెట్టే వ్యయాన్ని సున్నాకు దగ్గరగా తేవాలని భావిస్తున్నారు. దానితో ప్రభుత్వ వ్యయం తగ్గి సంపన్నుల పన్ను రాయితీలు పెరుగుతాయి. వారి ఆదాయం పెరగటానికి మార్గం సుగమం అవుతుంది. అందుకే ఏదో కొంపలంటుకున్నట్టు ఆహార భద్రతకు వ్యతిరేకంగా ఈ రాద్ధాంతమంతా చేస్తున్నారు.
ప్రభుత్వం నిజానికి సామాన్య ప్రజలకు అదనంగా చేసిందేమీ లేదు. ఒకవేళ ప్రజలందరినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చి, తలసరిన నెలకు 7 కిలోల బియ్యం లేక గోధుమలు కిలో రూ.2కే ఇవ్వడంతో పాటు చౌకగా వంట నూనె, ఉప్పు, పప్పు వగైరా అత్యవసర సరుకులు ఏర్పాటు చేసి ఉంటే నిజంగానే ప్రభుత్వం కొత్తగా ఏదో చేసిందని చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం అలాంటిదేమీ చేయలేదు. అలాగే నాలుగున్నరేళ్ళు పథకాన్ని నానబెట్టటం వెనుక ఖర్చు పెంచకుండా ఉండాలనే ఆలోచన ఉంది. నిజంగానే సామాన్యులకు ఆహార భద్రత కల్పించటమే ప్రభుత్వ ఉద్దేశమైతే నాలుగున్నరేళ్ళ క్రితమే ఇది మొదలయ్యేది. అదీకాక ఆహార భద్రత మూల భావనలోనే గందరగోళం ఉంది. కేవలం బియ్యం, గోధుమలు ఇస్తే సరిపోదు. నూనె, ఉప్పు, పప్పు వంటివి కూడా అవసరం. అవన్నీ ఇస్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అనగలం. అందువల్ల ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కచ్చితంగా చెప్పొచ్చు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి బాట వేసుకోవటానికే ఇది చేసింది. ప్రజలు ఈ మోసాన్ని పసికట్టగలరు. వారు నిజమైన ఆహార భద్రత కోసం ఎదిరించి నిలబడతారు.

Prajashakti Telugu News Paper Dated: 02/11/2013 

Monday, September 2, 2013

ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధి (భరతవాక్యం) - భరత్ ఝన్‌ఝన్‌వాలా


September 03, 2013

ఆహార భద్రతా చట్టం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ ఆమోదానికి మార్కెట్లు మోదం చూపలేదు. ఇదలావుంచితే ఆహార భద్రతా చట్టం అర్థవంతమైన శాసనమనడంలో సందేహం లేదు. అయితే ఆ చట్టాన్ని అమలుపరచడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుకోవల్సివుంది. ఒక సగటు దుకాణదారు మూలధనం సహజంగానే పరిమితంగా ఉంటుంది. మరి ఆ పరిమిత ధనంతో దాన ధర్మాలు చేస్తూ వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించుకోగలడా? సమాధానం స్పష్టమే. మరి ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నది. ఆహా ర భద్రతా చట్టాన్ని అమలుపరచేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ప్రభుత్వానికి లేవు. ఈ అవరోధాన్ని అధిగమించడం ఎలా? ప్రస్తుత సంక్షేమ వ్యయాలను అధికం చేయడానికి బదులు ఆ వ్యయాల నాణ్యతను మరింతగా మెరుగుపరచడం ద్వారా పేదలకు ఆహార భద్రత సమకూర్చవచ్చు.

పేదలకు సహాయపడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అవి : రైతులకు కనీస మద్దతు ధర లభించేలా భారత ఆహార సంస్థకు సబ్సిడీ నివ్వడం, విద్యా వైద్యసదుపాయాలు సమకూర్చడం, ఉపాధి హామీ పథకం అమలు, ఎరువుల సబ్సిడీలు. ఆ కార్యక్రమాల లక్ష్యమేమిటి? తన ఫలసాయానికి ధరలు తగ్గిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకై భారత ఆహార సంస్థకు సబ్సిడీనిస్తోంది. ఆవశ్యక సేవలైన విద్యా వైద్యాలు సామాన్య ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు అడిగిన ప్రతి ఒక్కరికీ సంవత్సరంలో కనీసం వంద రోజులు పాటు ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం కట్టుబడివుంది. రైతుల ఉత్పాదక ఖర్చులను తగ్గించేందుకై ఎరువులపై ప్రభుత్వం భారీ సబ్సిడీని ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.2.92,000 లక్షల కోట్లను ఎరువుల సబ్సిడీగా నిచ్చింది. ఈ మొత్తం 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3.60,000 కోట్లకు పెరగవచ్చని ఒక అంచనా.

పేదల సంక్షేమానికి ఉద్దేశించిన ఈ పథకాల వల్ల పేదలు నిజంగా లబ్ధిపొందుతున్నారా? లేదు. వారికి దక్కుతున్న లబ్ధి స్వల్పాతి స్వల్పం మాత్రమే. ఆహార సంస్థకు సమకూరుస్తున్న ఆర్థిక సహాయం ఆ సంస్థలో అవినీతిని పెంచుతోంది. సిబ్బంది అసమర్థతకు ఊతమిస్తోంది. సంపన్న రైతులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే మిగులు ధాన్యం ఉండేది వారి వద్దే కదా. విద్యా వైద్యరంగాలకే కేటాయిస్తున్న నిధులు ప్రభుత్వ సిబ్బంది, పట్టణ ప్రాంతాల ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఉపాధి హమీ పథకం అమలు అవినీతిమయమై పోయింది. సంబంధిత నిధులలో 25 నుంచి 75 శాతం మేరకు ప్రభుత్వ సిబ్బంది, సర్పంచ్‌లు స్వాహా చేస్తున్నారు.

ఈ సంక్షేమ కార్యక్రమాల నుంచి పేదలు నిజంగా లబ్ధి పొందాలంటే వాటిని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడు మాత్రమే సంబంధిత సొమ్ము నిర్దేశిత లబ్ధిదారులకు చేరుతుంది. ఈ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయడమే శ్రేయస్కరమని నేను గట్టిగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాల రద్దు వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏటా 3,60,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఇలా ఆదా అయిన సొమ్మును దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తున్న వారందరికి నేరుగా నగదు రూపేణా పంచవచ్చు. ఈ పేదల సంఖ్య 80 కోట్లు అయితే ప్రతి ఒక్కరూ నెలకు రూ.4500 పొందే అవకాశముంది. అంటే దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.22,500 ఆర్థిక సహాయమందుతుంది. ఇంకా ఇతర పనులు చేసుకోవడం ద్వారా అదనంగా సంపాదించుకోవచ్చు. ఇలా అదనంగా రూ.12,500 సంపాదించుకునే అవకాశముంటుంది.

అంటే దారిద్య్రరేఖకు దిగువున నివశిస్తున్న ప్రతి కుటుంబమూ సంవత్సరానికి రూ.35 వేలు లేదా నెలకు రూ.3000 ఆర్జించుకునే అవకాశముంది. ఈ సొమ్ముతో వారు తమ ఆహార, విద్యా, వైద్య అవసరాలను మార్కెట్ రేట్ల ప్రకారం కొనుగోలు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయవల్సిన అవసరముండదు. అలా ఆదా అయిన సొమ్ము కూడా ప్రజలకు అందుతుంది. అయితే ఇందుకు ప్రభుత్వ సిబ్బందికి, సంపన్నులకు కల్పిస్తున్న ప్రయోజనాల్లో కోత విధించి, తద్వారా ఆదా అయిన సొమ్మును పేదల సంక్షేమానికి మళ్ళించవలసివుంది.

కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యా వైద్య సేవలకు ఏటా రూ. 3,60,000 కోట్లను వ్యయం చేస్తున్నాయి. ఈ సంక్షేమ సేవలను కూడా రద్దు చేస్తే దారిద్య్రరేఖకు దిగువున నివశిస్తున్న కుటుంబానికి నెలకు రూ.5000 మేరకు నేరుగా ఆర్థిక సహాయం అందించవచ్చు. దారిద్య్ర రేఖకు దిగువున నివశిస్తున్న కుటుంబాలు ప్రస్తుతం నెలసరిన ఆర్జిస్తున్న మొత్తం కూడా రూ. 5000 లేనన్నది గమనార్హం. చెప్పవచ్చినదేమిటంటే పేదల కోసం ఉద్దేశించి, వాస్తవంగా సంపన్నులకు లబ్ధి చేకూర్చుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను రద్దుచేసి, దారిద్య్రరేఖకు దిగువున నివశిస్తున్న కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ద్వారానే ప్రస్తుత సంక్షోభం పరిష్కారమవుతుంది. సుస్థిర ఆర్థికాభివృద్ధికి గట్టి పునాది అవుతుంది. పేదలు ఖచ్చితంగా అభ్యున్నతి సాధిస్తారు.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

Andhra Jyothi Telugu News Paper Dated : 3/09/2013