Showing posts with label కొప్పుల రాజు IAS. Show all posts
Showing posts with label కొప్పుల రాజు IAS. Show all posts

Saturday, April 19, 2014

బాబా సాహెబ్ బాటలో కాంగ్రెస్ By కొప్పుల రాజు IAS


హిందూ సమాజంలోని అణచివేత దుర్లక్షణాలన్నింటిమీద తిరుగుబాటు చిహ్నం అంబేద్కర్ అని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. అంటరానితనానికి, సామాజిక అణచివేతకు శ్రమను, ఉత్పాదక వత్తిని నీచంగా చూసే కుల వ్యవస్థకు దాని దుష్ట విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసి నోరులేని కోట్లాదిమంది మూగ భారతీయులకు అంబేద్కర్ దఢమైన కంఠాన్ని ఇచ్చారు. ఆయన కేవలం రాజ్యాంగ నిర్మాతే కాదు, అణగారిన వర్గాల విముక్తి ప్రదాత. మహాత్మా జ్యోతిబాఫూలేను స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ సాగించిన సామాజిక విప్లవోద్యమం మహోన్నతమైనది.

దేశం ఎదుర్కొంటున్న ఇతర పలు సవాళ్ళను గాంధీ, నెహ్రూలు తమదైన పద్ధతిలో పరిష్కరించే ప్రయత్నం చేశారు.. డాక్టర్ అంబేద్కర్ మాత్రం కులవ్యవస్థ చిమ్మిన కాలకూట విష ప్రభావం నుంచి సమాజాన్ని సమూలంగా విముక్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించారన్న కీర్తి కిరీటం మీద విహరిస్తున్న గాంధీ, నెహ్రూలకు భారతీయ సమాజాన్ని అమానుషం చేస్తున్న కుల వ్యవస్థను వివక్షను రూపుమాపవలసిన తక్షణ అవసరాన్ని గుర్తు చేశారు. బ్రిటీష్ పాలనలో లండన్‌లో జరిగిన రౌండ్ సమావేశాలలో దీనిని కీలక చర్చనీయాంశం చేయగలిగారు. గాంధీజీకి అప్రియమైనప్పటికీ సాటి ఎస్సీల కోసం బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలు పొందడంలోనూ కతకత్యుడయ్యారు.

అంబేద్కర్ అంటరాని మహర్ కులంలో పుట్టారు. అయినా ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులలో ఒకడుగా సమున్నత స్థాయిని సాధించారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న విద్యాసంస్థలలో న్యాయ, తత్వ, ఆర్థిక శాస్ర్తా లు చదువుకున్నారు. లోతుగా అధ్యయనం చేశారు. ఒక అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. అనేక గొప్ప గ్రంథాలు రచించారు. ఆయన రచించిన కుల నిర్మూలనగ్రంథం చైతన్యశీలమైన, శక్తివంతమై న రచన. సాటి దళితుల దుస్థితిపై అంబేద్కర్ అనేక వ్యాసాలు, రచనలు వెలువరించారు. కుల వ్యవస్థ, అంటరానితనం మూలాలను ఛేదించి వాటిలోని దుర్మార్గాన్ని, డొల్లతనాన్ని ఎండగట్టారు. 
జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానంమీద తొలి ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రి పదవిని అంబేద్కర్ చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీకి అధ్యక్షుడుగా నియమితుడయ్యారు. 

రెండున్నర ఏండ్లు వివేచనతో, పీడిత జనపక్షపాతంతో కషిచేసి ఆ చరిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అనేక క్లిష్టమైన ప్రశ్నలకు విశాల మానవత, సమ్మిళిత ప్రజాస్వామిక దష్టితో రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఇచ్చిన సమాధానాలు, వివరణలు గణనీయమైనవి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం పరమాశయాలుగా రూపొంది న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో కూడిన రాజ్యాంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దానికి గొప్ప ఉప క్రమణికను అందించారు. ఆదేశిక సూత్రాలను విధిగా తక్షణమే అమలు చేయాలని లేనప్పటికీ వాటిని అమలులోకి తేవడం ప్రభుత్వాల నైతిక భాద్యత అని స్పష్టంచేయడం ద్వారా సమున్నత సమాజ నిర్మాణం దిశగా అవి పనిచేయవలసిన ఆవశ్యకతను కల్పించారు. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కులలో చేర్చి సర్వమత సమభావంతో సెక్యులర్ దేశంగా వర్ధిల్లడానికి పునాదులను రాజ్యాంగంలోనే నిర్మించారు. బలమైన కేంద్రం, స్వతంత్ర రాష్ర్టాలు ఉండే ఫెడరల్ వ్యవస్థను నెలకొల్పారు.

అంబేద్కర్ తాను బాల్యంలో అనుభవించిన అంటరానితనం గురించి చెప్పుకొన్నారు. పాఠశాలలో మంచి నీళ్ళు అడిగితే బంట్రోతు పైనుంచి పోసేవాడని ఆత్మకథలో రాసుకున్నారు. మరుగుదొడ్లు ఊడ్చే పనిని, ఆ రంగంలో సామర్ధ్యాన్ని బట్టి గాక కులాన్ని బట్టి అప్పగిస్తారని, ఈ పనిని ఎస్సీల చేతనే చేయిస్తున్నారని అంబేద్కర్ ఎత్తిచూపారు. అందుకే జాతీయ సలహా మండలి ఛైర్మన్ సోనియా సూచన మేరకు మరుగుదొడ్లను ఊడ్చే పనిని పారిశుధ్య సమస్యగానే కాక సామాజిక సమస్యగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం గుర్తించింది.


ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జీవన పరిస్థితులను మెరుగుపరచి సమానమైన గౌరవాన్ని వికాసాన్ని పొందేలా చేయడానికి వారిపట్ల సానుకూల వివక్షను, ధర్మపక్షపాతాన్ని చూపే అధికరణలను రాజ్యాంగంలో చేర్చేలా చేసిన అసమాన ఘనత, మానవత అంబేద్కర్‌ది. అంటరానితనాన్ని నిషేధిస్తున్న ఆర్టికల్ 17, మత, భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాలకు రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 30, విద్యా ఉద్యోగ రంగాలలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తోడ్పడుతున్న ఆర్టికల్ 46 ఆయన పీడితజన పక్షపాతానికి నిదర్శనాలు. 

అంబేద్కర్ స్త్రీల విముక్తికోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధికరణలు చేర్చారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సమాన హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 15, మహిళల పట్ల సానుకూల వివక్షతో ధర్మపక్షపాతంతో వ్యవహరించేలా చేస్తున్న ఆర్టికల్ 15(3), స్త్రీ, పురుషులకు సమాన ఉపాధి అవకాశాలు, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తున్న ఆర్టికల్ 39 వంటి అనేక సాధనాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటిని అనుసరించి పార్లమెం టు పలు విప్లవాత్మక చట్టాలు చేసింది. తొలి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ స్త్రీని బానిసగా చేస్తున్న హిందూ మత దుష్ట విలువలను పరిహరించే హిందూ స్మతి బిల్లును రూపొందించారు.

హిందువులలో బహు భార్యత్వాన్ని నిషేధించి మహిళలకు ఆస్తి హక్కును, విడాకుల హక్కును ఇతర అనేక వెసులుబాట్లను స్వేచ్ఛలను కల్పించదలచిన ఈ బిల్లును పితస్వామ్య వ్యవస్థకు పెను సవాలుగా భావించిన ఆనాటి ఛాందసులు పార్లమెంటులో దానిని వ్యతిరేకించి చట్టం కానివ్వకుండా చేశారు. దానితో ఆయన న్యాయశాఖ మంత్రి పదవినుంచి వైదొలిగారు.

దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏ చట్టాలు రావాలని, ఏ చర్యలు చేపట్టాలని అంబేద్కర్ కోరుకున్నారో వాటిని సాకారం చేసిన, చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిని విస్తరింపచేసింది. మహిళలకు గహహింస నుంచి రక్షణ కల్పిం చే చట్టం కాంగ్రెస్ తీసుకువచ్చిందే. స్థానిక సంస్థలలో మహిళలకు, ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన, నిర్భయ చట్టం, పని స్థలాలలో మహిళల వేధింపును అంతమొందించే చట్టం, కేంద్ర ఉన్నత విద్యాసంస్థలలో ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన కాంగ్రెస్ సాకారం చేసినవే. మహిళలకు చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్ల కోసం కషిని చేపట్టిన ఖ్యాతి దానిదే. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి 117వ రాజ్యాంగ సవరణ బిల్లు 2012 కు రాజ్యసభ ఆమోదం సాధించడం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక సవరణ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చి, దళితులను న్యూనత పరిచే మరి అనేక కుల దురహంకార దుశ్చర్యలకు శిక్షపడేలా చేసిన గొప్పతనం కాంగ్రెస్ పార్టీదే. కేంద్ర స్థాయిలో ఎస్టీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించి వారి ఆభివద్ధికి ఉద్దేశించిన నిధులు వారి కోసమే ఖర్చయ్యేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ దీక్ష పూనింది.

దేశంలోని ప్రతి బ్లాక్‌లోనూ అణగారినవర్గాలు, ముఖ్యంగా దళితుల కోసం నవోదయ విద్యాలయాల మాదిరి ఉన్నత ప్రమాణాల పాఠశాలను నెలకొల్పాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పన దిశగా జాతీయస్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించడానికి గట్టి కషి చేయాలని, ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్టీ, ఎస్టీ లకు, ఇతర బలహీన వర్గాలకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలన్నీ తప్పనిసరిగా వారితో నే భర్తీ అయ్యేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివద్ధి కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశాలన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ త్రికరణశుద్ధిగా అమలుచేస్తోంది.

పునాదులలో సామాజిక ప్రజాస్వామ్యం నెలకొంటే గాని రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించజాలదు అని అంబేద్కర్ స్పష్టపరిచారు. ఈ దష్టితోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో సామాజిక న్యాయసాధనకు అగ్ర ప్రాధాన్యమిచ్చి అహరహం పట్టుదలతో కషి చేస్తున్నా యి. అంబేద్కర్ రాజ్యాంగ పిత, నిర్మాతే కాదు గొప్ప స్వాతంత్య్ర యోధుడు, రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్ధికవేత్త, సంపాదకుడు. భారతదేశంలో బౌద్ధమత పునరుద్ధరణకు అవిరళ కషిచేసినవాడు. అటువంటి అసమాన మహనీయుని జన్మదినాన కేవలం పుష్పార్చనతో సరిపుచ్చడానికి బదులు ఆయన మహోన్నత, మానవీయ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నడుంబిగించడమే ఆయనకు సరైన నివాళి.

బానిసత్వాన్ని అంతమొందించగల పరమాయుధం విద్య. అణగారిన ప్రజానీకాన్ని తట్టి లేపి సామాజిక హోదాను ఆర్ధిక పురోభివద్ధిని, రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించుకునేలా చేసేది విద్య. - అంబేద్కర్ 

Namasete Telangana Telugu News Paper Dated: 13/4/2014 

Wednesday, March 5, 2014

కాంగ్రెస్‌తోనే అణగారిన వర్గాల అభ్యున్నతి By కొప్పుల రాజు IAS


ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కును నిలబెట్టడానికి రాజ్యాంగం 117వ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదే. 75శాతం గ్రామీణ 50 శాతం పట్టణ ప్రజలకు ఆహారహక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన
ఆహారభద్రత చట్టం ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు.

కసరి బుసకొట్టునాతని గాలి సోక అనే దారుణ దుస్థితి నుంచి, ఎంతోకొంత బయటపడి, కొంతమేరకైనా వెన్నెముక వికాసాలతో బతికే స్థితికి ఎస్సీలు నేడు చేరుకున్నారంటే అందు కు దోహదం చేసిన కారణాలు అనేకం వున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసి న బహుముఖమైన కషి. ఉన్నత విద్యావంతులైన ఎస్సీలు ఎంతోమంది ఉన్నారు. విశిష్ట పదవులందుకున్నవారు పెద్ద పెద్ద వ్యాపారాలు విజయవంతంగా నడుపుతున్న వారున్నారు. వీరందరి అభివద్ధి వెనుక కాంగ్రెస్‌పార్టీ, దాని ప్రభుత్వాల కషి గణనీయంగా వున్నది. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కులవ్యవస్థ చెప్పనలవికాని దూరదష్టితో సమాజంలోని మెజారిటీ ప్రజల ను అంటుకోదగినవారుగా వుంచి, అల్పసంఖ్యాక ఎస్సీలను అంటరానివారుగా ముద్రవేసి, సామాజి క వ్యవస్థ బయటకు నెట్టివేసింది. ఊడిగపు చేసే మనుషులుగా ఉపయోగించుకున్నది. అందుచేత, ఈరెండు సమాజాలను కలపడం, ఊరికి దీటుగా వాడను అభివద్ధిచేసి, ఆ రెండింటి మధ్య అభేదాన్ని సాధించడం ఎంతో చాకచక్యంతో, అందుకు తగిన చట్టాల సహాయంతో, పురోగామి, మానవీయ భావజాల వ్యాప్తితో చేయవలసిన పని. దీన్ని కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతుంది. సమ సమాజాన్ని ఆవిష్కరించుకోవడానికి ముందు విధిగా, సమాజంలోని మిట్టపల్లాలను సరిచేయవలసిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ ఇతరులెవ్వరికంటె ఎక్కువగా గుర్తించింది.

ఇప్పటికీ అత్యాచారాలకు, హత్యలకు, దురంహంకార దాడులకు ఎస్సీలు గురవుతున్న సందర్భాలలో వారికి గట్టి దన్నుగా నిలబడుతున్న చరిత్ర కాంగ్రెస్‌కే ఉన్నది. దేశంలో ప్రతి 18నిమిషాలకు ఒకటి వంతున దళితులపై దాడులు జరుగుతున్నాయన్న సమాచారమే అంధకార భారతావనికి ప్రబల నిదర్శనం. 48.4 శాతం గ్రామాలలో దళితులకు ఇప్పటికీ ఊరుమ్మడి మంచినీటి వనరులవద్ద అనుమతి లేదు. 37.8 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో దళితుల పిల్లలు ఇతరుల పిల్లలకు దూరంగావుండి చదువు నేర్చుకుంటున్నారు. వెలిపంక్తి భోజనం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడమే కనాకష్టంగా ఉన్న పరిస్థితి. నమోదవుతున్న కేసులలో 15.71 శాతం కేసుల మాత్రమే శిక్షలవరకు వెళ్తున్నాయి. మిగతావి ఎడతెగని తాత్సారానికి గురి అవుతున్నాయి. జాతీ య మానవహక్కుల సంఘం దళితుల దయనీయస్థితిపై సేకరించిన కఠోర గణాంకాలలో ఇవి కొన్ని మాత్రమే. ఆధ్యాత్మి క రంగమూ ఎస్సీలను అలుసు గా చూసింది. అంత్యజులుగా పరిగణించి, అవమానించింది. శతాబ్దాలుగా బడికి, గుడికి దూరంగా వుంచబడినవారికి బానిస బతుకులే శరణ్యమయ్యాయి.

2009,జనవరి 14న ఒడిస్సా రాష్ట్ర దళిత మహిళామంత్రి ఒకరు ఒక గ్రామంలోని శివాలయంలో ప్రవేశించబోతే, అక్కడి పూజారులు అడ్డుకున్నారు. చివరకి ఆమె ఆగుడిలో దేవుడిని దర్శించుకుని వెళ్లిన తర్వాత శుద్ధి కార్యక్రమం జరిపారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనైతే దళితుల పెళ్ళి ఊరేగింపుల మీద రాళ్ళువేసే అమానుషం ఇప్పటికీ ఉన్నదని సమాచారం. ఫ్యూడల్ గ్రామీణ భారతానికి, ప్రజాస్వామ్య రాజ్యాంగ మానవీయ నిర్దేశాలకు పూడ్చనలవికాని అఖాతం ఇప్పటికీ ఉన్నది. ఇటువంటి గ్రామీణ భారతాన్ని సోషలిస్ట్ సెక్యులర్ రాజ్యాంగబద్ధం చేయడమనే కషిని కాంగ్రెస్ పట్టుదలతో నిర్వహిస్తున్నది.

మార్పును వ్యతిరేకించే కొన్ని పాలకశక్తుల దన్ను తో దళితులకు వెన్నెముక మొలవకుండా చేసే దుస్సాహసానికి ఫ్యూడల్ ప్రాబల్యవర్గాలు పాల్పడుతున్నా యి. అందుకోసం దేశాధికార పీఠాన్నే చెరబట్టాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ చేపట్టి, దీక్షతో పూరి ్తచేస్తున్న సామాజిక న్యాయసాధన కషికి గండికొట్టాలనే పన్నాగం ఈశక్తుల అండతో జాతీయస్థాయిలో జోరు గా సాగుతున్నది. అందుకే కాంగ్రెస్‌పార్టీలో ఎస్సీల వాణిని గట్టిగా వినిపించేలా చేసి, అందుకు తగ్గ రీతి లో పార్టీ స్పందించేలా చేయవలసిన ఆవశ్యకతను ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది.

ఎస్సీల అడుగడుగునా వెన్నుదన్నుగా ఉండేలా, వారి చేతి దుడ్డుకర్రలా ఉపయోగపడేలా కాంగ్రెస్ తనను తాను పునర్నవీకరించుకుంటున్నది. పూర్వం మాదిరిగా ఎస్సీలసభలు ఏర్పాటు చేసి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టి చేతులు దులుపుకోవడానికి బదులు బాధిత ఎస్సీలకు అండ దండ గా ఉండే పటిష్ఠమైన సైన్యంలా కాంగ్రెస్ కార్యకర్తలు తయారయై వారికి చేదోడువాదోడుగా ఉండాలని రాహుల్‌గాంధీ సరికొత్త పిలుపునిచ్చారు. పారదర్శకతకు, జవాబుదారీతనానికి వీలు కల్పించే చట్టాలను తీసుకువచ్చి, వెనుకబడిన ప్రజానీకంతో ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరించేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కషి చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం ఇందు కు ఒక బలమైన నిదర్శనం. పదేళ్ళల్లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మరెన్నో చట్టాలు నిరుపేదలకు అన్ని రంగాలలోనూ పైవర్గాలతో సమానమైన వాటా లభించేలా చేయడానికి ఉద్దేశించినవే.

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కును నిలబెట్టడానికి రాజ్యాంగం 117వ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదే. 75శాతం గ్రామీణ 50 శాతం పట్టణ ప్రజలకు ఆహారహక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహారభద్రత చట్టం ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. ఇలాంటి చట్టం ఇంతవరకు ప్రపంచం లో మూడుదేశాలలోనే ఉండేది. భారత్ నాలుగవది కావడం గమనార్హం. సోనియాగాంధీ నాయకత్వంలోని జాతీయ సలహా మండలి సిఫార్సు మేరకు ఈ చట్టం అవతరించింది. ఆహార సబ్సిడీని ప్రభుత్వాలు ఉదారంగా భరించడానికి పౌరులకు ఆహారాన్ని ఒక హక్కుగా చేసి, అందించడానికి తేడా వున్నది. గ్రామీ ణ నిరుపేదలలో అధికశాతం ఎస్సీలు, ఎస్టీలే కాబట్టి ఈ చట్టం వారికి జీవన భద్రతను కలిగిస్తుంది.

గ్రామీణ ఉపాధిహామీ పథకం గ్రామసీమల్లో నిరుపేదల ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అణగారిన ప్రజల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పు కళ్ళముందున్నదే. దేశంలో ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో పేదలకు భరోసాను, ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన పథకం మరొకటి లేదు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 632 జిల్లాలలో ప్రతి ఐదు మంది కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉపాధి లభిస్తున్నది. 97 వేల పోస్టాఫీసులలో ఇందుకోసం ఐదుకోట్ల కు పైగా ఖాతాలు తెరుచుకుని వారిసేవలో తరిస్తున్నాయి. 2006-07లో ఈ పథకం క్రింద చెల్లించిన కనీస దినవేతనం 65 రూపాయలుండగా, 2012-13లో దాన్ని 128.6 రూపాయలకు పెంచారు. 2006 నుంచి ఈ పథకం క్రింద 1,10,700 కోట్ల రూపాయల మేరకు ఉపాధి వేతన చెల్లింపు జరిగింది. దాదాపు ఐదు కోట్ల కుటుంబాలకు 213 కోట్ల పనిదినాలు కల్పించాము. ఒక్క 2013లోనే 1.06 కోట్ల పనులు ఈ పథకం ద్వారా పూర్తిచేయడం జరిగింది.

చిన్న చిన్న దుకాణాల్లో వీధి వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న అసంఖ్యాక కుటుంబాలకు వత్తిభద్ర త కల్పించడం కోసం 2012లో తీసుకువచ్చిన వీధి వ్యాపారుల ఉపాధిపరిరక్షణ, క్రమబద్ధీకరణ చట్టంవారిపై ట్రాఫిక్ పోలీసుల, మున్సిపల్ అధికారుల వేధింపులు లేకుండా చేసి, వారి జీవనోపాధిని కాపాడుతున్నది. ఇది ఎంతో విప్లవాత్మకమైన చట్టం. అలా గే, ప్రాజెక్టులకు, పరిశ్రమలకు సేకరించే భూమికి పరిహారం చెల్లింపు విషయంలో బ్రిటీష్ కాలం నాటి కాలదోషం పట్టిన చట్టంవల్ల దేశంలో ఎంతోమంది భూములు కోల్పోయి, తగిన పరిహారంలేక బతుకులు దుర్భరమైపోయి విలపిస్తున్న నేపథ్యంలో పాతచట్టంస్థానే భూసేకరణలో పారదర్శక త, పునరావాస, పునరాశ్రయ చట్టాన్ని 2012లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనివల్ల ప్రాజెక్టుల, పరిశ్రమలు, సెజ్‌ల క్రింద భూములు, ఉపాధు లు కోల్పోయినవారికి మెరుగైన పరిహారం, పునరావాసం లభించే అవకాశం కలిగింది.

ఇంకా మరుగుదొడ్లను చేత్తో ఊడ్చి శుభ్రం చేసే పారిశుధ్య వత్తి నిషేధ, పునరావాస చట్టం, నిర్భయచట్టం,కార్యాలయాలలో, కార్యక్షేత్రాలో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం, ఇందిర ఆవాస్ యోజన సహాయం రెట్టింపు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, సర్వశిక్ష అభియా న్, లోక్‌పాల్ లోకాయుక్త చట్టం వంటి అనేక అభ్యుదయకరమైన శాసనాలను రూపొందించి, దేశంలో నిజమైన ప్రజాస్వామిక పరిపాలన వ్యవస్థ పటిష్ఠం కావడానికి, అణగారిన వర్గాల పరిపూర్ణ అభ్యున్నతి ని సాకారం చేయడానికి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు పాటుపడ్డాయి.

2013 అక్టోబరు 8న నూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో దళితుల సాధికారతపై జరిగిన ఒకకార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అప్పుడు ఆయన గట్టి గా ఒక విషయం చెప్పారు. మూడవదశ దళితుల సాధికారత, హక్కుల సాధన విప్లవాన్ని కాంగ్రెస్ తీసుకురాదలచిందని ఆయన ప్రకటించారు. మొద టి దశ విప్లవం అంబేడ్కర్ తీసుకువచ్చారు. దళితుల కు రాజకీయ సమానత్వం సాధించి పెట్టడానికి రాజ్యాంగపరమైన పునాదిని ఆయన పటిష్టంగా నిర్మించారు. రెండవదశలో కాన్షీరావ్‌ు దానిని కొనసాగించారు. రిజర్వేషన్ల ద్వారా దళితులకు సంక్రమించిన శక్తి సామర్ధ్యాలను ఆయన ఒక పద్ధతిలో సంఘటితపరిచారు. సామాజిక సమానత్వాన్ని సాధించుకోవడం కోసం దళితులను రాజకీయంగా సమీకరించారు. ఇప్పుడు మూడవదశ దళిత సాధికారత, సమానత్వ సాధన విప్లవానికి కాంగ్రెస్ సార ధ్యం వహిస్తున్నదిఅని రాహుల్‌గాంధీ ఆ కార్యక్రమంలో వివరించారు. ఈ విప్లవ సాధనకోసం పంచాయితీల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ.

స్థానాల వరకు వివి ధ విధాన నిర్ణయ దశలలోను అన్ని స్థాయిలలోను పటిష్టమైన దళిత నాయకత్వాన్ని నిర్మించాలని ఆయ న అన్నారు. ఈబాధ్యతను ఈ వ్యాసకర్తకు, జాతీ య ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ పి.ఎల్ పునియాకు అప్పగించినట్టు ఆ సందర్భంలో ఆయన ప్రకటించా రు. తన బాల్యంలో నాయనమ్మ ఇందిరాగాంధీ తన తో చెప్పిన ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని గురించికూడా రాహుల్‌గాంధీ ఈ వేదికమీద వివరించారు. ఇందిరాగాంధీ చిన్నప్పుడు ఒకసారి జర్మనీ వెళ్ళారు. అప్పుడు అక్కడ హిట్లర్ పాలన సాగుతున్నది. అక్క డ జరిగిన ఒక హాకీ మ్యాచ్ చూడడానికి ఆమె వెళ్ళా రు. అది జర్మనీ జట్టుకు మరో దేశపు జట్టుకు మధ్య జరుగుతున్నది. జర్మనీ ఆటగాళ్లు స్కోర్ సాధించినప్పుడల్లా జర్మన్‌ల విజయధ్వానాలతో ఆటస్థలం హోరెత్తి పోయిందట. చివరికి గెలుపును అవతలి దేశం కైవసం చేసుకోగా జర్మన్‌ల నోళ్ళు మూగబోయాయట అవతలి దేశం గెలుపుకి హర్షసూచకంగా ఇందిరాగాంధీ ఒక్కరే లేచి చప్పట్లు కొట్టారట. దానికి జర్మన్‌లు ఆమెను హేళన చేస్తూ పిచ్చికూతలు కూశారట.

అందుకు ఆమె ఎంతమాత్రం బాధపడలేదు. ధర్మపక్షాన నిలబడేటప్పుడు ఒంటరి అయినా వెనుకాడకూడదు, దళితుల పక్షం నిలబడటానికి అటువంటి సాహసానికి ఎదురీతకు సిద్ధంగా ఉండాలని రాహుల్‌గాంధీ చేసిన ఉద్బోధను ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ శిరోధార్యంగా స్వీకరించింది. కాంగ్రెస్‌కు ఎస్సీలే వెన్నెముక అని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ప్రాధాన్యం స్థానాలను ఎస్సీలకు కేటాయించి నాయకత్వంలో వారి భాగస్వామ్యాన్ని ఇతోధికంగా పెంచడానికి అన్యాయాలు, అత్యాచారాలు ఎదురైనప్పుడు వారికి గట్టిదన్నుగా నిలబడటానికి ఏఐసీసీ ఎస్సీ విభాగం ఒక వినూత్న వికేంద్రీకత వ్యూహాన్ని చేపట్టి ఎస్సీలకు రక్షాకవచం కావడం ద్వారా దేశంలో పెను సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఈమహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఎస్సీ సోదర లను ఇతర సామాజిక దీక్షాపరులను కోరుతున్నాను.
(రచయిత ఐఏఎస్ (విశ్రాంత),
ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ 
Namasete Telangana Telugu News Paper Dated : 6/3/2014 

Wednesday, February 26, 2014

ఎస్సీలకు బాసటగా కాంగ్రెస్ - కొప్పుల రాజు, విశ్రాంత ఐఏఎస్ అధికారి; చైర్మన్ ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్




1 
 
1 
 
0 

 



చిటికెన వేలు అందిస్తే చాలు, చిటారుకొమ్మనందుకోగల చేవ సామర్థ్యం తెలివితేటలు కలవారు ఎస్.సి.లు. అటువంటి ఎస్సీలు శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, శ్రమ దోపిడీకి గురై ఇప్పటికీ చెప్పనలవికాని కష్టాలు పడుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమం వంటి మహా సంకల్పాలు ఎస్.సి.ల జీవితాల్లో తీసుకువచ్చిన వెలుగు గణనీయమైనదే. అయినా ఇప్పటికీ మెజారిటీ ఎస్.సి.లు దారిద్య్రంలో న్యూనతలో మగ్గుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎస్.సి.ల బతుకులను బాగుచేయటానికి జరిగిన కృషితో ఇతర ఏ పార్టీకి లేనంత ఎక్కువ సంబంధం సహజంగానే ఉన్నది. దీనినెవరూ కాదనలేరు.
'నిమ్నజాతుల కన్నీటి నీరదములు/ పిడుగులై దేశమును గాల్చివేయుననుచు/ రాట్నమును దుడ్డుకర్ర కరాన బూని/ దెసలు దోతెంచె గుజరాతు ముసలి సెట్టి'; 'వెఱపు వలదు నీకు హరిజన సోదరా/ స్వీయరాజ్య రథము వెడలివచ్చె/ లాగిపొమ్ము నీకు లాభము గలదంచు/ బాడుచుండె రత్న భరతమాత'- స్వతంత్ర భారతదేశంలో ఎస్.సి.ల బతుకులు బాగుపడి తీరుతాయనే ప్రగాఢ విశ్వాసంతో మహాకవి జాషువ ఈ విధంగా పద్యగానం చేశారు. ఆ మహత్తర లక్ష్యం చేరుకునే కృషి సాగుతూనే ఉన్నది. అందులో కాంగ్రెస్ పార్టీ అనితరమైన పాత్ర పోషిస్తూనే ఉన్నది. అయినా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎస్.సి. ఓటు బ్యాంకు తగ్గిపోతున్నది. దానిని పునరుద్ధరించటానికి మీరు ఏమి చేయదలచారు అని మిత్రులనేక మంది నన్ను అడుగుతున్నారు. ఇందుకు నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నాను. ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఎస్.సి.లకు ప్రాధాన్యం పెరిగేలా చూడాలి. వారి మాట పార్టీలో కంగుమని వినిపించేలా చేయాలి. వారి కంఠం మార్మోగేలా పార్టీలో తగిన మార్పు తీసుకురావాలి.
ఇందుకోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ఎస్.సి. కమిటీలను పటిష్ఠం చేయాలి. పునః చైతన్యవంతం గావించాలి. ఎస్.సి.ల నుంచి యువతరాన్ని నవతరాన్ని పార్టీ శ్రేణులలోకి తీసుకురావాలి. వారికి గురుతరమైన బాధ్యతలు అప్పగించాలి. ఎస్.సి.ల బాగు కోసం ఏమిచేయాలి, ఎలా చేయాలి అనే విషయాలపై పార్టీ లోపల, పార్టీకి పౌర సమాజ సంస్థలకు మధ్య విస్తృతమైన లోతైన చర్చ జరిగేలా సంస్థాగతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి. ఆ వైపుగా పలురకాల సరికొత్త చొరవలు తీసుకోవాలి. రాజ్యాంగం ఎస్.సి.లకు అనేక రక్షణలు కల్పించింది. వాటి అమలుకు పలు చట్టాలు వచ్చాయి. అవి పకడ్బందీగ రాజీలేని రీతిలో అమలయ్యేలా చూడాలి. అదీ చాలదు. ఎస్సీ లకు పరిపూర్ణమైన సాధికారత సాధించడానికి మరెన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమాలు చేపట్టాలి. మరిన్ని చట్టాలు తేవాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎస్సీలకు ఉద్దేశించిన ప్రతి ఒక్క రక్షణ -సహాయం, రాజ్యాంగపరమైన, చట్ట సంబంధమైన వెసులుబాటు కచ్చితంగా సకాలంలో సంపూర్ణంగా వారికి అందేలా చూడాలి. అందుకు ఆయా కార్యక్రమాల అమలు వ్యవస్థను సమూల సంస్కరణకు గురిచేయాలి.
ఎస్.సి., ఎస్.టి. ఉపప్రణాళికలకు చట్ట బద్ధత కల్పించటం ద్వారా వాటి నిధులు వారికోసమే ఖర్చు అయ్యేలా చూడాలన్న డిమాండ్ అత్యంత సహజమైనది, సమర్థనీయమైనది. ఎందుకంటే ఎస్.సి.ల కోసం ఇతర అణగారిన వర్గాల కోసం నిధుల కేటాయింపు కాగితాలకే పరిమితమవుతున్నది. ఎస్.సి. అంటే ఇతర వర్గాలకు కన్నుకుట్టే స్థాయిలో ఈ కేటాయింపుల గురించి ప్రచారం విశేషంగా జరుగుతున్నది.

కాని వాస్తవంలో అది మేడిపండు సామెతను గుర్తు చేస్తున్నది. పేరు పెద్ద ఊరు దిబ్బ అనేనానుడిని జ్ఞప్తికి తెస్తున్నది. కాగితాల మీద బడ్జెట్ లెక్కలలో చూపిస్తున్న నిధులు వాస్తవంలో ఎస్.సి., ఎస్.టి.లకు అందడంలేదు. మధ్యలోనే దారిమళ్ళిపోతున్నాయి. ఇతర అమాంబాపతు అవసరాలకు తరలిపోతున్నాయి. వీరికి బడ్జెట్‌లో చేస్తున్న కేటాయింపులు అంకెల గారడీగానే తెల్లారిపోతున్నాయి. గణాంక విన్యాసాలుగానే మిగిలిపోతున్నాయి. ఉపప్రణాళికల నిధుల దారి మళ్ళింపు మీద పార్లమెంట్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సభ్యుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. సంకల్పానికి ఆచరణకు ఎంతో వ్యత్యాసం ఉన్న మాట వాస్తవం. ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు. వీటి మధ్య పొంతన సాధించడానికి దూరాన్ని తొలగించడానికి తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఎస్సీ, ఎస్‌టీ ఉపప్రణాళికలకు కేంద్ర స్థాయిలోని చట్ట బద్ధత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జైపూర్ డిక్లరేషన్‌లో ఘన సంకల్పం చెప్పుకున్నది. ముసాయిదా చట్టాన్ని రూపొందించడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఒక లక్ష్య కమిటీని ఏర్పాటుచేసింది. నేనందులో సభ్యుడిని. రాష్ట్రాలనుంచి, సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సలహాలు సూచనలు కోరాము. ఈ చట్టాన్ని తీసుకురావడం అది సక్రమంగా సమగ్రంగా అమలయ్యేలా చూసి ఎస్ సి ఎస్ టిలకు ఉద్దేశించిన నిధులన్నీ ప్రతి పైసా వారికే ఖర్చయ్యేలా చూడటం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఎస్సీల విషయంలో ముఖ్యంగా జరగవలసిందేమిటంటే రాజ్యాంగం వారికి హామీ ఇచ్చిన హక్కులన్నీ వారికి లభించేలా వారి అనుభవంలోకి వచ్చేలా చేయడం. డాక్టర్ అంబేద్కర్ బడిలో చదువుకున్నప్పుడు స్కూలు ప్యూను తనను అంటకుండా ఎత్తునుంచి పోసిన మంచి నీళ్ళతోనే దాహం తీర్చుకునే వాడట. ఆయన దాహంతో దహించుకుపోయిన అనేక సందర్భాలలో ఆ ప్యూను ఉద్దేశపూర్వకంగానే అందబాటులో లేకుండా పోయే వాడట. అటువంటప్పుడు దాహార్తితో గొంతు ఎండి ఆయన ఎంతో బాధపడేవారు. ఈ రోజున కూడా ఆ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం వడ్డించేటప్పుడు పలు చోట్ల దళిత బాల బాలికలను వేరుగా కూర్చో బెడుతున్నారు. 'కింది కులాల' వారు వండే మధ్నాహ్న భోజనాన్ని తినడానికి 'పై కులాల'కు చెందిన పిల్లలు నిరాకరిస్తున్న సందర్భాలున్నాయి. పలు రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలలో ఇవి తరచు కన్పిస్తుంటాయి. పాఠశాలల్లో కుల వివక్ష దళితుల పిల్లలను మంచి చదువుకు దూరం చేస్తుంది. అంతటి చిన్న వయసులోనే వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచుతుంది. అందుకే దళితులు తమ హక్కు లకోసం పోరాడే ముందు ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కొని బాగాచదువుకోవాలని అంబేద్కర్ చెప్పారు.
దేశంలో పని విభజన ఇప్పటికీ చాలా సందర్భాలలో వారి వారి అర్హతలు, సామర్థ్యాలను బట్టి కాకుండా కులాలను బట్టి సాగుతున్నది. 'ఇండియాలో పారిశుద్ధ్య కార్మికుడు కావడమనేది అందుకు సంబంధించిన పనితనం మీద ఆధారపడి జరగదు. అతడు లేక ఆమె ఆ పని చేయగలరా అనే దాని మీద కాకుండా వారి పుట్టుక (బలం) ఆధారంగా పారిశుద్ధ్యపు పనివారవుతారు' అని అంబేద్కర్ అన్నారు. నీటి సదుపాయం లేని పాయిఖానాలు శుభ్రం చేసి మానవ వ్యర్థాన్ని నెత్తిన మోసుకుపోయే హీనాతిహీనమైన వృత్తి చేస్తున్న దళితులు దేశంలో ఇప్పటికీ లక్షల సంఖ్యలో ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో మూడు లక్షల మందికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. ఇంతకంటే బాధాకరం, సిగ్గుపడవలసిన విషయం ఏముంటుంది? ఇటువంటి పాయిఖానాలను ఈ నీచమైన వృత్తిని చట్టం నిషేధించింది. అయినా సామాజిక వ్యవస్థలోని క్రూరత్వం దానిని కొనసాగనిస్తున్నది. జాతీయ సలహా మండలి సూచన మేరకు యూపీఏ ప్రభుత్వం ఈ రకమైన నీచ వృత్తిని కేవలం పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యగా గాక సామాజిక రుగ్మతగా పరిగణించాలని నిర్ణయించింది. అందుకే దళితులకు రాజ్యాంగం హామీ ఇచ్చిన మానవహక్కులు వారికి పరిపూర్ణంగా లోపరహితంగా సంక్రమించేటట్టు చేయడం వారు వివిధ జీవనరంగాలలో ఎదుర్కొంటున్న దారుణమైన వివక్షను రూపు మాపడం మా ముందున్న అతి ముఖ్యమైన కర్తవ్యం. అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యం దీనికే ఇవ్వదలిచాం. అదే సమయంలో దళితులకు ఉన్నత ప్రమాణాల విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి అగ్రతర ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.
ఎస్.సి.లకు, సామాజికంగా అభివృద్ధి చెందిన వర్గాలకు మధ్య వివిధ ప్రగతి సూచీల పరంగా ఉన్న తేడాలను సరిగా అంచనా వేసి నిర్ణీత వ్యవధిలో ఈ వ్యత్యాసాలను తొలగించే కృషి జరిగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం సంకల్పించింది. అందుకోసం నడుం బిగించింది. అభివృద్ధి సాధనలో అన్ని సామాజిక వర్గాల మధ్య సమానత్వం సాధించడానికి దోహదం చేసే విధానాలు, కార్యక్రమాలు, చట్టాలు రూపొందించడం వైపు దీక్షతో కృషి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం పనిచేస్తున్నది.
తగిన అర్హత నిపుణత ఉన్నప్పటికీ ఎస్.సి.లకు ప్రైవేట్ రంగంలో మిగిలిన వారితో సమానంగా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. ఈ విషయం పలు సమగ్ర పరిశోధనలలో సందేహాతీతంగా రుజువయ్యింది. ఒక పనిలో వివిధ వర్గాల వారిని నియమించడం వల్ల కార్యక్షేత్రంలో భిన్నత్వాన్ని వైవిధ్యాన్ని పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఇందువల్ల ప్రైవేట్ రంగంలో ఉత్పాకత కూడా గణనీయంగా పెరుగుతున్నదని అభివృద్ధి చెందిన దేశాలలో రుజువయ్యింది. ఇండియాకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకే ప్రైవేట్ రంగంలో ఎస్.సి.లకు రిజర్వేషన్లు కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అది ఎస్.సి.ల అభ్యున్నతికే కాక దేశ సర్వతోముఖ వికాసానికి విశేషంగా తోడ్పడుతుంది. కుల వివక్ష అంతం కావడానికి ఉపయోగపడుతుంది.
ఎస్.సి.ల ఈ ఆకాంక్షను బలంగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి దానినొక విధాన పరమైన ఆజ్ఞాపాలనగా స్వీకిరించి పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం అంకితమై ఉన్నది. ఎస్.సి.లకు సంబంధించిన అన్ని అంశాల పైన పార్టీ ఏమి చేయదలచింది, ఎంతటి నిబద్ధతతో కృషి చేయదలచింది వచ్చే ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ సవివరంగా ఎరుక పరుస్తుంది. ఈ విషయమై దేశవ్యాప్తంగా గల ఎస్.సి.ల అభిమతాలను ఆకాంక్షలను తెలుసుకుని ఒక చోట చేర్చే పనిని ఏఐసీసీ ఎస్.సి. విభాగం నిమగ్నమై చేస్తున్నది.
-కొప్పుల రాజు
విశ్రాంత ఐఏఎస్ అధికారి; చైర్మన్ ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్
- Andhra Jyothi Telugu News Paper Dated: 25/02/2014