Showing posts with label కదిరె కృష్ణ. Show all posts
Showing posts with label కదిరె కృష్ణ. Show all posts

Friday, November 21, 2014

మన కాలం బోధిసత్వుడు - డాక్టర్‌ కదిరె కృష్ణ

కులమత వర్గరహిత వ్యవస్థను సాకారం చేయగలిగేది బౌద్ధం. రాహుల్‌ సాంకృత్యాయన్‌ చెప్పినట్లు మార్క్సిజం బాగా అర్థమైతే బౌద్ధం బాగా అర్థమైనట్లే! కారణం ఈ రెండిటిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్న భౌతికవాదం ప్రధానమైనది. ఈ సారాన్ని బాగా ఒంట బట్టించుకున్న వ్యక్తి ‘దొమ్మేటి సత్యనారాయణ బోధి’.
బోధి మొదట సంప్రదాయ హిందూ కుటుంబ ఆచారాలు కలవాడైనా బౌద్ధం పరిచయమైనప్పటి నుంచీ అదే జీవితంగా జీవించిన త్యాగశీలి. నిజానికి బౌద్ధం అంటే త్యాగం. మానవుడు తన భౌతికావసరాలను ప్రకృతి నుంచి పొంది ప్రకృతిలో కలిసిపోవడం,. ఈ మధ్యలో జీవితం నిస్వార్థంగా ఉండడం, ‘స్వంతం’ అనేది లేని సమాజహిత జీవనమే బౌద్ధం. ఇటువంటి జీవితం ఏ కొందరికో సాధ్యమవుతున్న ప్రస్తుత తరుణంలో స్మరించుకోవల్సిన వ్యక్తి సత్యనారాయణ బోధి.
యావద్భారతదేశంలో బౌద్ధ ప్రచాలనకు ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా కృషి చేశారు. అంతకు పూర్వం ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా, మార్క్సిస్టుగా ఆదర్శ జీవితం గడిపారు. 1926లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా వక్కలంక గ్రామంలో దొమ్మేటిసుబ్రహ్మణ్యం, మాచరమ్మ దంపతులకు సత్యనారాయణ జన్మించారు. 1952 నుంచి 1984 వరకు రైల్వే శాఖలో వివిధ ఉద్యోగాలు నిర్వహించారు ఎస్‌.ఇ రైల్వేలో షాప్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేశారు.
స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్‌-నాగపూర్‌ రైల్వేలో పనిచేస్తున్న కాలంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ట్రేడ్‌యూనియన్‌ రంగంలో కార్మికులను ముఖ్యంగా సూపర్వైజర్‌ క్లాస్‌ని సమకట్టి హక్కుల సాధన పోరాటంలో తిరుగులేని నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే 1974 మేలో దేశవ్యాప్తంగా జరిగిన చరిత్రాత్మక రైల్వే సమ్మెలో బలంగా పనిచేయడంతో ఉద్యోగం కోల్పోయారు. ఆ తరువాత జనతా ప్రభుత్వ హయాంలో తిరిగి ఉద్యోగం పొందగలిగారు. బెంగాల్‌ ప్రాంతంలో పనిచేస్తున్న క్రమంలో హేమాహేమీలైన కమ్యూనిస్టు నాయకులందరితో కలిసిపనిచేశారు. వారి ఉపన్యాసాలు వినడమే కాదు తాను వారితో కలసి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినట్లు నాతో చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ఈయన సహచరుడు. 1984లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత సత్యనారాయణ బౌద్ధం వైపు మళ్లారు. 1992 నుంచి ఆయన పూర్తిగా బౌద్ధం ప్రచారంలో మునిగిపోయారు. కేవలం బౌద్ధ ప్రచాలనకే పరిమితం కాక బౌద్ధ సిద్ధాంతాల వ్యాఖ్యానం, అపార జ్ఞానసంపద ఈయన సొంతం. సత్యనారాయణ బోధి రేడియోలో బౌద్ధాన్ని ప్రబోధిస్తుంటే భగవద్గీతను గానం చేసిన ఘంటసాలను మైమరిపిస్తారు. 1994-95లో దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదికకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఏ పని చేసినా ఆయనలో నిండైన చిత్తశుద్ధి, నిబ్బరం, వినయశీలత తొణికిసలాడేది.
1996 మే20న విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేసిన ‘మత సామరస్యం- జాతీయ సమగ్రత’ అంశంపై బౌద్ధరీతిలో ప్రారంభమైన ఆయన ఉపన్యాసాలు మొన్నటివరకూ కొనసాగాయి. ఎందరో ఔత్సాహిక బౌద్ధ ప్రచారకుల ప్రసంగాలను ఆయన ప్రోత్సాహంతో తెలుగు సమాజం వినగలిగింది. 1996లో కలకత్తాలోని ‘మహాబోధి’ నిర్వహించిన ‘లే బుద్ధిస్ట్‌ లీడర్స్‌ కాన్ఫరెన్స్‌’లో బోఽధి సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఎంతో కీలకమైనదిగా బౌద్ధ నిష్ణాతులు కొనియాడారు. 2001లో ఒక అంతర్జాతీయ సదస్పులో ‘బౌద్ధం-మానవాళి భవిష్యత్తు’ అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక వ్యాసం పలువురి ప్రశంసలు అందుకుంది. 1997లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ‘లుంబిని ఉత్సవం’లో ప్రపంచంలోని వివిధ దేశాల బౌద్ధ ప్రతినిధులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాల్గొన్న ఏకైక ప్రతినిధి సత్యనారాయణ బోధి. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘బౌద్ధ దర్శనం పునాదులు’ అనే పరిశోధనాత్మక వ్యాసం బౌద్ధ సంస్కృతిలోని ప్రాధాన్యాలను వివరణాత్మకంగా మనముందుంచింది. బోఽధి సారథ్యంలో సారనాథ్‌లో జరిగిన 2007 వార్షిక సమావేశాలు చరిత్రాత్మకమైనవి. బౌద్ధంలోని పారమితలపై సత్యనారాయణ బోధి వ్యాఖ్యానం నభూతో నభవిష్యతి. ఆంగ్ల మూలంలోని అనేక బౌద్ధ గ్రంథాలను ఆయన ఆంధ్రీకరించారు. బోధి రేడియో ప్రసంగాలు ‘బౌద్ధచింతన’ పేరుతో పుస్తకరూపం ధరించాయి. బౌద్ధ భిక్షువులు ఆయన సేవను గుర్తించి ‘ధర్మ ప్రియ’ బిరుదుతో కలకత్తాలో సన్మానించారు. నిజజీవితంలో బౌద్ధ ఆచారాలకు సంబంధించి జీవితంలో ప్రతి సందర్భాన్ని ఆచ రించే విధంగా వ్యాఖ్యానించారు. పుట్టుక నుంచి ప్రతి సందర్భంలో బౌద్ధం ఎలా ఆచరించాలో చాలా స్పష్టంగా విశదీకరించారు. పాళీ భాషలో ఆయనకు గల విశేష జ్ఞానం అందుకు సహకరించింది.
బౌద్ధ సారస్వతనిధి దొమ్మేటి సత్యనారాయణ బోధి. బౌద్ధ ధర్మం పట్ల ఆయన ఎంతో అంకిత భావంతో ఉండేవారు. కొన్ని వేల కరపత్రాలు, చిన్న బుక్‌లెట్లు ప్రచురించి ఉచితంగా పంపిణీ చేశారు. ఆఽధునిక సమాజాన్ని పీడిస్తున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, అలౌకిక ధోరణులు, అప్రజాస్వామ్య ఆలోచనలను నిర్మూలించడానికి, మానవతా విలువల పరిరక్షణకు బుద్ధుని ప్రబోధాలు మందు వంటివని బోధి విశ్వసించారు. నిష్పక్షపాత బుద్ధితో బౌద్ధాన్ని వ్యాఖ్యానించడం ఆయన ప్రత్యేకత. దేశవ్యాప్తంగా వివిధ బౌద్ధ సంఘాల నాయకులతో, మాంగ్‌లతో ఆయనకు సత్ససంబంధాలు ఉండేవి. బౌద్ధ మాంగ్‌లను బౌద్ధం విషయంలో నిలదీసేంతటి విషయ పరిజ్ఞానం గల మన కాలం బోధిసత్వుడుగా ఆయనను అభివర్ణిస్తారు. బోఽధిసత్వ గుణ సంపన్నుడు. ఆయన మాట, అక్షరం ప్రసన్నంగా, మానవ జీవితంలోని పరిమళాలను వికసింపజేసే విధంగా ఉంటాయి. తాను మాత్రమే గాక తన కుటుంబాన్నీ అదే మార్గంలో నడిపించిన ఆదర్శవంతుడు. స్వచ్ఛమైన మానవ జీవితానికి భాష్యం చెప్పుతూ జీవితాంతం అణగారిన బీద ప్రజానీకానికి అండగా అరమరికలులేని, సమసమాజం కోసం అనునిత్యం తపించిన మంచి మనిషి సత్యనారాయణ బోధి. ఈ నెల 13న కాకినాడలో ఆయన పరినిర్వాణం పొందారు. బోఽధి సేవలు, కృషి, ప్రేమ, కరుణ, దయశీల, ప్రజ్ఞ ఎందరికో ఆదర్శమైంది. అదే ఆయన్ను చిరస్మరణీయున్ని చేస్తుంది. నమో తస్స సమ్మసంబుద్ధస్స.
- డాక్టర్‌ కదిరె కృష్ణ
Andhra Jyothi Telugu News Paper Dated : 20/11/2014 

Thursday, August 7, 2014

బలహీన తాత్తి్వక పునాదులు కానివాళ్ళకు కంచాల్లో! By Dr Kadere Krishana


చారిత్రక, సాంస్కృతిక గందరగోళం
రాష్ట్ర గీతంలో రాచరిక పోకడలు 
రాష్ట్ర చిహ్నంలో లేని పూర్ణకుంభం 
పి.వి.కి ఘన నివాళులు 
సమైక్యవాది దాశరధి జయంతి 
నిజాం మీదే సాయుధ పోరాటం 
ఉద్యమనేత…- నిజాంను పొగడలేదా! 
చాకలి ఐలమ్మ, కొమురం భీం తగరా? 

తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ. ఒక ఉద్యమ పార్టీకి నిర్ధిష్ఠ లక్ష్యాలతో పాటు తాత్తి్వక పునాదులు బలంగా ఉండాలి, ఉంటాయి. చారిత్రక అవగాహన, సిద్ధాంత లోతులు, సామాజిక పట్టు ఉండి తీరాలి. అలాంటి పార్టీ పాలనా పగ్గాలు చేపడితే- అదే రకంగా వ్యవహరించాలి. కానీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. `తాను చెప్పిందే వేదం' అన్నచందంగా ఉంది కేసీఆర్‌ ప్రభుత్వ గమనం. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాల విషయంలోనూ గందరగోళ వైఖరి అవలంబిస్తున్నట్టు బయటపడుతోంది. ప్రతిపక్షం లేదనుకుంటే తప్పులేదు గానీ, అసలు ప్రజలే లేరనుకుంటే ప్రమాదం. ప్రభుత్వానికి వివేచనతో పాటు విచక్షణా ఉంటే బావుంటుంది. 

తెలంగాణ రాష్ర్ట గీతం- ఎంపికలో ఇలాంటి స్థితే కనిపించింది. కాకతీయ రాజుల, గోల్కొండ నవాబుల ప్రశంస గల ఈ పాటను ఎన్నుకోవడం సరియైంది కాదేమో అనిపిస్తుంది. `కాకతీయ కళాప్రభల కాంతిరేఖ'గా రామప్పను వర్ణించడానికి బదులు- తెలంగాణ శిల్పకారుల వెలుగు రేఖగా చెబితే బాగుండేది. `గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్‌' అనే కంటే సామాన్యుని కళారూపంగా చూస్తే మరింత సముచితంగా ఉండేది. ఈ పాటలోని ఈ రెండు వాక్యాలు బూర్జువా పెత్తందారీ పోకడలను సూచిస్తున్నాయి. పాటలో ప్రజలు/ ప్రాంతం, పాలక రూపంనుండి కాక సామాజిక దృక్పథంతో ప్రదర్శితమైతే- టిఆర్‌ఎస్‌ వంటి ఉద్యమ పార్టీకి తాత్తి్వక లోతులు బలంగా ఉన్నట్లు తోచేది. రాజరికపు నిరంకుశ ధోరణులు రాష్ర్టగీతంలో చాలా చోట్ల దొర్లడం, మహోన్నత ఉద్యమం నుండి ఉద్భవించిన ప్రభుత్వపు గీతంగా చలామణి కావడం కొంత బాధాకరమే. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ మార్పునే కాక, ఆదర్శ సమాజాన్ని కలగన్నదనే సంకేతంకూడా ఈ పాటలోఉంటే అద్భుతంగా ఉండేది. ఏ ప్రాతిపదికన ఒక నిర్ణయం జరిగినా- అది తెలంగాణ ప్రజల పక్షమని రుజువు కావాలి. 

ఇక రాష్ర్ట చిహ్నం విషయానికివస్తే, ఇందులోనూ ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటమయింది. పూర్వాంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ముద్రలోని `పూర్ణకుంభం' నామమాత్రంగానైనా ఉంచాల్సింది. అది ఆంధ్ర ప్రాంతాన్నిగానీ, ఆ ప్రాంత ఆధిపత్యాన్ని గానీ చూపేట్టే చిహ్నం ఎంతమాత్రం కాదు. పూర్ణకుంభం చారిత్రక, తాత్తి్వక పునాదులు కలిగినది. అందులోనూ అది తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని విశదీకరిస్తుంది. భారతీయ మూలవాసీ మాతృస్వామ్య ప్రతీక, హరప్పా సింధూ నాగరికత మూలాలు ఇందులో ఉన్నాయి. ప్రసిద్ధ పురాతత్వ పరిశోధకుడు జాన్‌ మార్షల్‌ దీని గురించి ఇలా చెప్పారు. `హరప్పాలో దొరికిన దీర్ఘచతురస్రాకారపు ముద్ర చాలా ముఖ్యమైనది. ఆ ముద్రపై తలకిందులుగా నిలబెట్టిన స్త్రీ మూర్తి. ఆ స్త్రీ మూర్తి గర్భాశయం నుండి పైకి వచ్చిన వృక్షం- ప్రకృతి ఆరాధన, స్త్రీ ప్రాధాన్యత సమాజాల ఘనతను చాటిచెప్పే చిహ్నమది'. దీనిని తెలంగాణ ప్రాంతములోనూ విరివిగా వాడుకున్నట్లు ఆధారాలున్నాయి. ఈ భావజాలం ఉట్టిపడేవిధంగా పూర్ణకలశం రూపొందించిన తాత్తి్వకుడు విధిక అనే చర్మకారుడు. పురాతన సామాజిక వర్గానికి చెందిన కళాకారుణ్ణి గౌరవించినట్లూ ఉండేది. పూర్ణకుంభం ఒక ప్రాంతానికో, ఒక సమూహానికో చెందింది కాదనేది వాస్తవం. దీనిపై ఆచార్య బిరుదు రామరాజు అద్భుతమైన వ్యాసం రాశారు. ఎంతో చరిత్ర, తాత్తి్వక శక్తిని కలిగిన `పూర్ణకలశం' వదులు కోవడాన్ని అవగాహన లోపంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 
ఈ క్రమంలోనే పి.వి.నరసింహారావు జయంతిని ఘనంగా నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పి.వి. నరసింహారావు ప్రధాని పదవిలో ఉన్నంతకాలం తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. పైగా తెలంగాణ స్వరాష్ర్ట ప్రస్తావనా ఎక్కడా ఎత్తినట్లు కనిపించలేదు. తెలంగాణకు మేలు చేసే ఏఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్య ప్రభుత్వం మొత్తం సమాజానికి ప్రాతినిధƒ్యం వహించాలన్నది వాస్తవమే. కానీ అపాత్రదానం ఉండరాదు. 

ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యమ ఉదాత్తతను చాటే కార్యక్రమం ఏ ఒక్కటీ చేపట్టలేదు. ఇది చాలా దురదృష్టకరం. మరింత దిగ్భ్రాంతిని కలిగించే సంఘటన `దాశరథి జయంతి'ని అధికారికంగా జరపడం. నిజానికి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణవాది కాదు. పైగా సమైక్యవాది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పోరాడిన మాట వాస్తవమే. ఆయన మహాకవి కూడా. అయినప్పటికీ తెలంగాణ సాం„స్కృతిక వారసత్వానికి ప్రాతినిధƒ్యం వహించదగినవాడు కాదు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నవాబుకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం. అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం కాదు. ఒకవేళ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడమే దాశరథి జయంతి జరపడానికి ప్రాతిపదిక అయితే `ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలిన రాజు మాకెన్నడేని' అంటాడు దాశరథి. ఆయన పిశాచమా అని సంబోధించిన నిజాము నవాబు చాలా గొప్పవాడని కేసీఆర్‌ ఉద్యమనాయకుడుగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అభివర్ణించారు. ఒకవైపు గొప్పవాడని అంగీకరిస్తూనే మరోవైపు నిజాం నీచుడన్న వ్యక్తి జయంతిని ఘనంగా నిర్వహించడం ద్వంద్వనీతి కాదా? నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించిన చందంగా ఉంది ఈ ప్రభుత్వ విధానం. దాశరథి తెలంగాణ స్వరాష్ర్ట సాంసృ్కతికోద్యమ ప్రాతిపదిక కానేకాదు. ఈ విషయాన్ని దాశరథి కృష్ణమాచార్య సోదరుడు దాశరథి రంగాచార్య స్వయంగా తన ఇంటర్వూ్యల్లో పలుమార్లు ఉద్ఘాటించారు. `సాహితీ కౌముది' పత్రికకు 2002 అక్టోబరులో ఇచ్చిన ఇంటర్వూ్యలో `తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే భూమి కోసం, భుక్తి కోసం, భాష కోసం. ఆ రోజుల్లో రాజకీయోద్యమం జరిపిన ఆంధ్ర మహాసభ- విశాలాంధ్రనే కోరింది. కమ్యూనిస్టులు విశాలాంధ్రనే కోరారు. ఎందుకంటే రష్యాలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుండేవి. వీటన్నిటితో అనుబంధం ఉన్న దాశరథి సహజంగానే విశాలాంధ్రవాది. దాశరథి మహాకవే సందేహం లేదు. ఆ మాటకొస్తే చాలామందే ఉన్నారు మహా కవులు. దాశరథి నిఖార్సయిన సమైక్య విశాలాంధ్రవాది. సాక్ష్యాలివిగో- 

దాశరథి 1950లో `రుద్రవీణ' రాశారు. తెలంగాణకు అంకితమూ చేశారు. ఇది 1950 నాటి రచన. అంటే తెలంగాణ నిజాంపాలనలో లేదు. పైగా భారతదేశంలో అంతర్భాగ మయింది. ఆ కాలంలో రాసిన ఈ గ్రంథంలో ఆసాంతం `విశాలాంధ్ర' కోసం పరితపించాడే తప్ప ఏఒక్కచోట ప్రత్యేకతెలంగాణకోసం ఒక సిరాచుక్క విడువలేదు. చూడండి మచ్చుకొకటి- `ఇటునటును తెల్గునేల లారటము చెంది/ కలిసి పోజూచుచున్న యట్టులనె తోచు/ కలిపివేయుమి నాతెలంగాణ తల్లి!/ మూడు కోటుల నొక్కటే ముడి బిగించి' అంటాడు. అదే కవితలో `నాకోర్కె తీర్పు మమ్మా!/ నీకు మదీయాశ్రుకణ వినిర్మిత మాలా/ నీకమ్ము సమర్పించెద/ గాక; విశాలాంధ్రమనెడి కల నిజమగుతన్‌' అంటూ విశాలంధ్ర కోసం వెక్కివెక్కి ఏడ్చాడు దాశరథి మహాకవి. మరో గొప్ప కావ్యంగా పేర్గాంచిన గ్రంథం `మహాంధ్రోదయం'. ఇది 1955లో ముద్రితమయింది. అంకితం సురవరం ప్రతాపరెడ్డికి. 1955 నాటికి దాశరథిలో `విశాల ఆంధ్ర రాష్ర్ట అవతరణ కాంక్ష పెచ్చుపెరిగిపోయింది. ఈ కావ్యంలోనూ ఎక్కడా స్వరాష్ర్ట అవతరణ దీక్ష, స్వయం గౌరవ కాంక్ష కనిపించలేదు. `నా తెలంగాణ కంజాత వల్లి', `నా తెలంగాణ కోటి అందాల వీణ', `నా తెలంగాణ కోటి రతనాల వీణ', `నా తెలంగాణ లేమ, సౌందర్యసీమ'- వంటి తేమలేని మాటలు మాత్రమే ఈ కావ్యంలో కనిపిస్తాయి తప్ప గాఢంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణే దృగ్గోచరమవుతుందికానీ మరోటిలేదు. ఆంధ్ర రాష్ట్రావతరణ కు ఆద్యులు పొట్టి శ్రీరాములునుద్దేశించి దాశరథి కవితా పంక్తులు `చిమ్మచీకటిలో తూర్పు సెమ్మెమీద/ దివ్వె యొక్కటి వెలిగించి, రువ్వినావు/ ఎవరు నువ్వు' అని ప్రశ్నిస్తాడు. వెంటనే `నీవెరుగవె; శ్రీరాముడ... నిద్రాణాంధ్ర ధరాస్థలి/ నేడు మేలుకొల్పగలను' అని తనే సమాధానమిస్తాడు. 
వాస్తవానికి తెలంగాణ నిద్రావస్థలో లేదు ఆనాడు. నిజాం నవాబు దాష్ఠీకాన్ని ఎదురించి నిప్పుకణికలా ప్రత్యేక హైదరాబాదు రాష్ర్టంగా స్వయం గౌరవంతో ఉన్నది. `మహాంధ్రోదయం' కావ్యంలో కలికితురాయి వంటి `నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి (దొబ్బి)/ ఆకాశమంత యెత్తార్చినాను' పద్యంలో పోతనను, వేయిస్తంభాల గుడిని స్మరిస్తూ గొప్పగా వర్ణించారు. ఆ వెంటనే ఇలా `కోటి తమ్ములకడ రెండు కోట్ల తెల్గు/ టన్నలను గూర్చి వృత్తాంతమందజేసి/ మూడు కోటులనొక్కటే ముడి బిగించి/ పాడినాను మహాంధ్ర సౌభాగ్యగీతి' అంటూ విశాలాంధ్ర పట్ల గాఢానురక్తి ప్రదర్శించారు. 

దాశరథి సాహిత్యములో భూతద్దం పెట్టి వెతికినా తెలంగాణ రాష్ర్టం గురించిగానీ, హైదరాబాద్‌ స్టేట్‌ను ప్రత్యేక రాష్ర్టంగా తీర్చిదిద్దుకోవాలనే తపన గానీ కనిపించదు. సరికదా హైదరాబాద్‌ స్టేట్‌, ఆంధ్రరాష్ర్టం (మద్రాసు రాష్ర్ట అంతర్భాగమైన ఆంధ్రప్రాంతం) ఒక్క రాష్ర్టంగా అవతరించాలనే ప్రగాఢంగా కాంక్షించాడు, ఆరాటపడ్డాడు. ఇందుకు `మూడు చెరగుల నేలల మూడు కోట్లు/ ముడివడినయట్లు కన్నుల ముందు తోచె' నంటూ భ్రాంతినొంది `ఈనాడు మహాంధ్రోదయ/ మైనది, కోట్లాది జనము/ తెలుగులక్ష్మి పాదాలకు/ వెలుగుల పారణనిడిరి' అని అబ్బురపడ్డాడు. అలాగే ఆంధ్ర రాష్ర్టం ఏర్పడ్డప్పుడు `మంగళాత్రికమ్ముల పొంగిపోయె/ ఆంధ్రరాష్ర్టము వచ్చె, మహాంధ్ర రాజ్య/ మేరుపడు రోజు పొలిమేర జేరి నిలిచె/ నా తెలంగాణ తల్లి ఆనందపడగ' అంటూ రాబోయే విశాలంధ్ర కోసం పొంగిపోయి గంతులేశాడు. పైగా ఆంధ్రరాష్ర్ట ప్రజలు అగ్రజులంటూ పొగడ్త అందుకున్నాడు. `కలిసిపో గోరుచుందు/ రగ్రజుల తోడ వీలైనయంత వడిగ' అంటూ అత్యుత్సాహమూ కనబరుస్తాడు మహాంధ్రోదయ మహాకవి. `తెలుగు బాడితిన్‌ తెలుగు బాబులు...', `నా తెలంగాణ కోటి రతనమ్ముల వీణ...', `ఎన్నినాళ్ల స్వప్నమిది సత్యమైనది? ఎన్ని నోళ్ళ పిలుపుకిది జవాబు?...(అమృతాభిషేకం కావ్యం)' వంటి పద్యాలు ఎన్నో విశాలాంధ్ర కోసం రాశారే తప్ప స్వరాష్ర్టం కోసం ఎక్కడా తపించలేదు. విశాలాంధ్ర కోసం దాశరథి పడని పాట్లు లేవు. నషాలం ఎక్కేదాకా `విశాలాంధ్ర' నిషా ఎక్కించాడీ కవి పుంగవుడు. 

1975 నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, `తిమిరంతో సమరం' (దాశరథి మరోకావ్యం) కావ్యానికి ముందుమాట రాస్తూ `దాశరథి ముపై్పఏళ్లుగా తెలంగాణ దొరల పాలనకు వ్యతిరేకంగానూ, నిజాం నిరంకుశ పాలనను ఎదిరిస్తూను, రెండు ప్రాంతాల తెలుగువారు ఏకం కావాలని ఉద్భోధిస్తూనూ... ఆంధ్రప్రదేశ్‌ ముక్కలు చేయాలనే, రెండు వేర్పాటు ఉద్యమాలలోనూ ఐకమత్యం కోసం బలమైన కంఠంతో ప్రజలను ప్రబోధిస్తూను' అంటారు. ఇక్కడ అర్థమయ్యేదేమిటంటే, విశాలాంధ్ర గూర్చి రాస్తే రాసిండు గానీ, 1969 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1969 ఉద్యమం ప్రజా ఉద్యమం. సుమారు 370 మంది విద్యార్థులు, యువకులు అశువులు బాసారు. 

అయినా దాశరథి చలించలేదు. పైగా ఎలా నిరసించారో చూడండి.. `కుడి కంటిని ఎడమ కన్ను పొడిచేనా/ కుడిచేతిని ఎడమచేయి నరికేనా/ ఒక దేహం, ఒక గేహం మరిచారా/ ఒక్క తెలుగు, ఒక్క వెలుగు మరిచారా!' అంటూ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం పట్ల దాశరథి అక్కసు వెళ్లగక్కారు. ఇదీ ఆయన దృక్పథం! అంతేగాక, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వెర్రితలలు వేస్తున్న అనాకారి ఉద్యమంగా వర్ణించాడు దాశరథి మహాకవి. `ఆంధ్రజాతి అల్లరిపాలవుతుందా?/ విశాలత మరచిపోయి వెర్రితలలు వేస్తుందా' అంటూ గొంతు పెంచి మరింత హెచ్చరిక చేస్తారు కళాప్రపూర్ణ దాశరథి. `ఒక్క పుష్కరమైనదేమొ ఒక వల్లె ఉంటిమి/ కలత లేమి లేక ఒక్క కంచములో తింటిమి'- అలాంటి వారము విడిపోవడమేమిటని ప్రశ్నిస్తూ 1969 మహోద్యమాన్ని తప్పుపడతాడు. విడిపోవడమనే ఆలోచన మానేసి కలిసి ఉండే మార్గం కోసం ప్రయత్నాలు కొనసాగించాలని హితవు పలికాడు. `కలిసియుండు మార్గమునే కనుగొనవలెను/ విడిపోయే ఆలోచన విడిచివేయవలెను' అంటూ సమైక్యవాదాన్ని బలమంతా కూడదీసుకొని బలపరిచారు కృష్ణమాచార్యులు. ఇందుకోసం `తెలుగు జాతి ఏకంగా/ విలసిల్లుట కోసమై/ బ్రతుకును బలిపెడతాను' అని తన జీవితాన్ని అర్పణం చేయడం కోసం కూడా వెనుకాడలేదు. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రా పెట్టుబడిదారులు వాదించిన వాదనను దాశరథి ఆనాడే చేశాడు. చూడండి- `కమ్మని తెలంగాణ/ తొమ్మిది జిల్లాలేనా/ బహుళాంధ్రకు తెలంగాణ పర్యాయపదం కాదా?', `సమగ్రాంధ్ర దీపావళి/ సమైక్యాంధ్ర దీపావళి/ విడిపోయే తత్వంపై/ విరుచుకుపడు దీపావళి' అంటూ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమకారులపై శ్రీకృ„ష్ణుడై విరుచుకుపడతాడు. దాశరథి కోటి రతనాల వీణ- తెలంగాణ నాదాన్ని కాక విశాలాంధ్ర కోసం మ్రోగిందని ఆయన సాహిత్యమే సాక్ష్యమిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్యులు జయంతి చేయడానికి ఆయనకున్న అర్హత ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోరాట యోధులు, అమరవీరులు, రక్తతర్పణ కావించిన సమరయోధులను ఎందరినో ఈ కార్యక్రమం చేసి అవమానించినట్లయింది. చాకలి ఐలమ్మ, కొమరం భీం, ప్రొ జయశంకర్‌, తెలంగాణ సాంసృ్కతిక వీరుడు కాళోజి నారాయణ రావు, శ్రీకాంతాచారి వంటి వీరుల జయంతులను గాలికొదిలి బ్రాహ్మణీయ భావజాలాధిపత్యాన్ని కనబరచడం తెలంగాణ ఉద్యమాన్ని పరిహసించడమవుతుంది. వేలాది ప్రాణత్యాగాలను అపహాస్యం చేసినట్టు భావించక తప్పదు. నిజంగా తెలంగాణ చారిత్రక, సాంసృ్కతిక, స్వయంగౌరవ, స్వయంపాలన కొరకు అహర్నిశలు శ్రమించిన మహాపురు„షులను, బుద్ధి జీవులను, పోరాట యోధులను గుర్తించాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అప్పుడే బంగారు తెలంగాణ సాకారమైనట్లు.

Surya Telugu News Paper Dated: 07/08/2014 

Thursday, July 3, 2014

రాజ్యంతోనే కుల నిర్మూలన! - డాక్టర్‌ కదిరె కృష్ణ


Published at: 04-07-2014 01:02 AM
‘కుల నిర్మూలన ఎలా సాధ్యం?’ శీర్షికన (ఆంధ్రజ్యోతి, జూన్‌ 24) ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ రాసిన వ్యాసం చాలా గందరగోళంగా ఉంది. వినోద్‌ రాసిన ఈ వ్యాసం ‘కులనిర్మూలనతోనే న్యాయం’ శీర్షికన (ఆంధ్రజ్యోతి, జూన్‌ 13) కల్పనా కన్నభిరాన్‌ రాసిన వ్యాసానికి స్పందన. ఈ వ్యాసం ద్వారా వినోద్‌కుమార్‌ సైద్ధాంతిక గందరగోళాన్ని సృష్టించడంతో పాటు, సామాజిక అవగాహనాలోపాన్ని మరింత పెంచిపోషించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే కులనిర్మూలన జరిగి తీరాలన్న కల్పనా కన్నభిరాన్‌ ప్రతిపాదనను స్వాగతించాలంటాడు వినోద్‌. ఆ వెంటనే తిరిగి కుల నిర్మూలన జరుగనే జరుగదు అని ధ్రువీకరణ పత్రాన్ని జారవిడుస్తాడు. కులనిర్మూలనే జరుగదు అనుకున్నప్పుడు ప్రొ. కల్పనా కన్నభిరాన్‌ కుల నిర్మూలనా ప్రతిపాదనను తిరస్కరించాలి గానీ, స్వాగతించడమేమిటి? ‘కల్పనా కన్నభిరాన్‌ మంచి ఉద్దేశంతోనే కులనిర్మూలన జరగాలని కోరుకోవచ్చు కానీ, అది సాధ్యం కాదు... ప్రొఫెసర్‌ కల్పనా కన్నభిరాన్‌ అమాయకంగా, నిజాయితీతోనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల నిర్మూలనతోనే అది సాధ్యం అని రాశారు, కానీ తెలంగాణలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కులాన్ని నిర్మూలించడం ఎవరి వల్లా కాదు’ అంటారు. ఆమె అమాయకత్వం ఏమో గానీ వినోద్‌ ఆ వెనువెంటనే కులం ముల్లును కులంతోనే తొలగించాలి అని ప్రతిపాదించి తన అమాయకత్వాన్ని, అవగాహనా రాహిత్యాన్ని చాటుకున్నారు. కుల నిర్మూలన పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదని తెగ వాపోతారు సదరు వ్యాసకర్త. కుల నిర్మూలన ఎవరి వల్లా కాదని సూత్రీకరించి, వల్లకాని విషయానికి పాలకులకు చిత్తశుద్ధి లేదని చెప్పడం దేనికి నిదర్శనం? ‘పాలకులకు కులాన్ని నిర్మూలించడం అసలే ఇష్టం లేదని మరింత ఆవేదనను వెల్లగక్కారు’. సాధ్యం కాని దానికి ఇష్టంతో చేస్తే మాత్రం సాధ్యం అవుతుందా? కులనిర్మూలన జరగదు లేదా సాధ్యం కాదు. వినోద్‌ మాటల్లో చెప్పాలంటే ‘ఎవరి వల్లా కాదు’. ఇదే నిజమైతే డా. అంబేద్కర్‌ ‘కుల నిర్మూలన’ను ఎందుకు ప్రతిపాదించినట్టు? తన జీవితాంతం కుల నిర్మూలన కోసమే ఎందుకు పరితపించినట్టు? ఇక గాలి వినోద్‌ కుమార్‌ వాక్రుచ్చినట్టు ‘కులాధారిత రిజర్వేషన్లు ఉన్నంతకాలం కుల నిర్మూలన జరగదు’ ఇది పాక్షిక సత్యమే కానీ పూర్తిగా వాస్తవం కాదు. రిజర్వేషన్లు కూడా కులనిర్మూలనలో భాగమే! వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థ చేత విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు ఎడంగా ఉంచబడడం చేతనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డాయి. అందుచేత భూమి, పరిశ్రమలు, ఇతర అన్ని రంగాలలో వేల ఏళ్ల ముందున్న ఆధిపత్య కులాలతో పోటీ పడలేరు కనుకనే ఈ వర్గాలకు రిజర్వేషన్ల కల్పన అనివార్యమయింది. అంటే Equa lity among the inequalsజూటను సాధించడమన్నమాట. ఇది రాజ్యాంగస్ఫూర్తి కూడా. ఈ రిజర్వేషన్లు లేకపోతే ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. రిజర్వేషన్లు ఉన్నందుకే విద్య, తద్వారా ఉద్యోగం, ఉపాధి ఫలితంగా ఆర్థిక వెసులుబాటు సాధ్యమైంది. ఆ వెసులుబాటు మరింత వెసులుబాటును కల్పించి అన్ని రంగాలలో సాధ్యమైనంత మేరకు ప్రాతినిధ్యం కల్పించింది. ఆ ప్రాతినిధ్యమే తన జాతి ప్రజలకు తిరిగి వెసులుబాటును కల్పించాలి. ఇదే రిజర్వేషన్ల పరమావధి. వెసులుబాటు పొందినవారు ఆ సౌకర్యం లేని వారికి ప్రతినిధి. అతని కర్తవ్యం ఏ కులానికి ప్రతినిధిగా వచ్చాడో, ఆ కులాల ప్రజల అభివృద్ధికి కృషి చేయడంగా భావించవచ్చు. మహాపురుషుల పరిభాషలో చెప్పాలంటేPay back to the Society. ఈ సూత్రం మొత్తం అణగారిన వర్గాలకు వెలుగుగా నిలవాలి. అప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి రెట్టింపు శాతం విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థికవెసులుబాటు కలుగుతుంది. ఈ వెసులుబాటే సాధికారతకు దారితీస్తుంది. ఈ సాధికారతే ఆత్మగౌరవాన్ని తద్వారా రాజకీయ అధికారాన్ని సమకూరుస్తుంది. తద్వారా సామాజిక సమానత్వం అనగా కుల నిర్మూలన సాధించబడుతుంది. కానీPay back to the Society దగ్గరే ఈ సమాజం ఆగిపోయింది. ఇది ఎవరి బాధ్యత? ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే రిజర్వేషన్లు ఖచ్చితంగా కుల నిర్మూలనలో భాగంగా కల్పించబడినవే. రిజర్వేషన్లు సమాజగతమే కానీ వైయక్తికం కాదు.
డాక్టర్‌ కదిరె కృష్ణ

Andhra Jyothi Telugu News Paper Dated: 04/07/2014 

Tuesday, September 24, 2013

రాజకీయాధికార మార్గం బహుజన సమన్వయమే By - కదిరి కృష్ణ


భారత దేశంలో దేవుడు లేని గ్రామాలు ఉండొచ్చేమో కానీ ఎస్సీ, బీసీలు లేని గ్రామాలు దాదాపు శూన్యం. గ్రామ నిర్మాణంలో, నాగరికత కట్టడంలో ఎస్సీ, బీసీ కులాల పాత్ర అనిర్వచనీయం. వ్యవసాయిక దేశమైన భారత్‌లో ఈ కులాలు లేకుండా మనుగడ సాగించడం కష్టం. నీళ్లు తోడే తొండం, బొక్కెనలు సమకూర్చి తోలు సంస్కృతికి మాదిగలు ఆద్యులైతే, కమ్మరుల నాగలి, సాలెల వ్రస్తాలు, కుమ్మరుల కుండలు, వడ్డెరల గృహనిర్మాణ సాధనాలు, గొల్లకుర్మల పాడి దేశాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దినవి. ప్రపంచంలో మరెక్కడా లేని ప్రకృతి పూజ, సంస్కృతి ఎస్సీ, బీసీలదే. జనాభా రీత్యా చూసుకున్నా నూటికి ఎనభైశాతం బిసి, ఎస్సీ కులాలే. ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థల్లో గమనిస్తే ఈ కులాలు ఉత్పత్తి శక్తులుగా ఉన్నప్పటికీ, ప్రయోజనాలు కల్పించడంలో వీరిని దూరం చేస్తున్నారు. ఓటు బ్యాంకు దృష్ట్యా ఎనభై శాతం ఉండే బహుజనులు, మైనార్టీలైన బ్రాహ్మణాధిపత్య కులాల ఏలుబడిలో మగ్గుతున్నారు. దేశ రాజకీయాధికారాన్ని నిర్ణయించేది ఖచ్చితంగా బిసిలే (ఎస్సీల కు రాజ్యాధికారం లేకపోయినా కొంతమేరకు వాటా పొందగలుగు తున్నారు) ఐనప్పటికీ నిర్ణాయక శక్తులుగాకాక నిర్వీర్యశక్తులుగా మారుతున్నారు. గతంలో ఎస్సీలను నిర్ణాయక ఓటు బ్యాంకుగా భావించినప్పటికీ, ఇటీవల చీలిపోయి ఉండడంతో అమ్ముడు పోయే వ్యక్తులుగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొని ఉన్నది. పైగా బిసిలు- ఎస్సీలు తమలో తాము కుల వైషమ్యా లతో కలహించుకుంటున్న సం ఘటనలు విచ్ఛిన్నతను మరింత పెంచిపోషిస్తున్నా యి. బీసీలను ఎస్సీలు, ఎస్సీలను బీసీలు శత్రువులుగా భావించుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి విపరీత పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాధికారం ఎలా సాధ్యం?

ఏ కులానికి ఆ కులం స్వంత అస్తిత్వాలు కలిగి ఉంటే తప్పు లేదు. మరో బాధిత కులాన్ని ద్వేషిస్తూ, హెచ్చుతగ్గులు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాధికార నినాదం నీటిమీద అలకడం లాంటిదేనా? కొందరు బిసీలు రాజ్యాధికారం సాధించాలనీ, కొందరు ఎస్సీలు సింహాసనం కైవసం చేసుకోవాలని వివిధ రకాల ప్రణాళికలు, సిద్ధాంతాలతో మరింత గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారు. ఎస్సీలపైకి బీసీలను, బీసీలపైకి ఎస్సీలను రెచ్చగొడుతూ పబ్బంగడుపుతూ అగ్రకులాల తొత్తులుగా, చెంచాలుగా మారిపోతున్న కాలంలో రాజ్యాధికారం పగటి కలేనా? రాజ్యాధికారాన్ని అందుకోవాలంటే ఏం చేయాలి? బహుజన పితామహులు ఫూలే, పెరియార్, డా॥ అంబేడ్కర్‌ల దృష్టిలో రాజ్యాధికారం ఎలా సాధించాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు రాజ్యాధికారానికి మార్గాన్ని సులభ గ్రాహ్యం చేయగలవు? కేవలం మాదిగలు, కేవలం మాలలు అలాగే యాదవ, గౌడ, కాపు, చాకలి, మంగలి కులాలుగా వైయుక్తికంగా రాజ్యాధికారం సాధించగలవా? పోనీ బిసిలు ఎస్సీలు వేర్వేరుగా రాజ్యాన్ని కైవసం చేసుకోగలరా? రాజ్యాధికార సాధనలో ఈ అణగారిన కులాల్లోని విద్యార్థి, మేధావి, ఉద్యోగుల కర్తవ్యం ఎంత? ఇలాంటి ప్రశ్నలెన్నో బహుజన ప్రజల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నాయి. అయితే ఇవేమీ సమాధానం లేని ప్రశ్నలు కావు. పైగా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాల్ని ఇవ్వగలిగినప్పుడే స్పష్టమైన దృక్పథం, తాత్విక నేపథ్యం, సైద్ధాంతిక పట్టుతో బహుజన రాజ్యాధికార సిద్ధాంతాల్లో నెలకొన్న గందరగోళం నశిస్తుంది. స్పష్టమైన సైద్ధాంతిక నేపథ్యం లేని ఉద్యమాలు విఫలమవడం చరిత్రలో చూశాం. ఇండియా లోని కులవ్యవస్థ, దాని వికృత రూపాలు అవగతం చేసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం వర్గ దృక్పథంతో కమ్యూనిస్టు విప్లవ పోరాటాలు వైఫల్యం చెందడం ఇంకా పూర్తిగా గత చరిత్ర కాలేదు. కేవలం హిందుత్వ భావజాలంతో గాయపడిన గొంతుల్లోంచి పెల్లుబికిన ఆర్తనాదాలు కాకి కూతలుగా భావించిన హిందుత్వ జాతీయతా శక్తులు నీరుగారిపోవడం తప్పదు. ఇది వర్తమానం.

ఈ క్రమంలో బహుజనులు విస్పష్టసిద్ధాంతం, పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తే తప్ప రాజ్యాధికారం సాధ్యం కాదు. ఇందుకుగాను మొదట ఎస్సీ, బీసీల్లోని వైరుధ్యాల సమన్వయం సాధించడం అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక్కటే అంటే బీసీలు, ఎస్సీలను, ఎస్టీలు, బీసీలను బీసీలే వ్యతిరేకించడం గమనించగలం. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు బిసి, ఎస్సీ మేధావులు ఐడెంటిటీ క్రైటీరియాను ముందుకు తెచ్చి వికట్టాహాసం చేస్తున్నారు. ఎవరి ఐడెంటిటికీ ఏ ప్రమాదం లేకుండానే బహుజన దృక్పథం కొనసాగించవచ్చు. ఇంకా కావాలంటే 'మూలవాసీ దృక్పథం* దీనికి సరైన విధానం. బ్రాహ్మణ మత గ్రంథాలైన భగవద్గీత, రామాయణ మహాభారత, పురాణ, స్మృతిశృతులు కంచుకంఠంతో శూద్రులు, అతిశూ ద్రులు, నల్లటిప్రజలు, ఇండియన్ స్థానికజాతులని అరుస్తున్నాయి. వేదాలు, శ్రాస్తాలలో శూద్ర, అతిశూ ద్ర కులాలు/ జాతుల మూలాల చరిత్ర ఉంది. ఒరిస్సా ప్రాంతాన్ని గౌడ్‌లు, కర్ణాటక ప్రాంతాన్ని యాద వులు, సముద్ర ప్రాంతంలో ముదిరాజులు అనేక రాజ్యాలను పాలించారనేది చారిత్రక సత్యం. మాదిగ కులానికి చెందిన జాంబవంతుడు మొదట భారత పాలకుడని పురాణాలు, చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. 'శూద్రశ్చ అవివరశ్చ, వృషాలశ్చ, జఘనాంగ జన్యశ్చ' వంటి శ్లోకాలు శూద్ర, అతిశూద్ర జాతుల కూటమిలోని ఏకరూపత, చారిత్రక పునాదిలోని సామ్యతలను నిర్ధారిస్తున్నాయి. ఇటీవల వివిధ యానివర్శిటీలు చేసిన పరిశోధనల్లో ఈ దేశంలోని ఎస్సీ, బీసీలు అత్యంత ప్రాచీన జాతులని, ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రాచీనజాతుల వంటివని నిరూపితమైంది. ఇది ఆధునికకాలంలో ఫూలే ప్రవచించాడు. పెరియార్ ఇదే దృక్పథంలో జీవితాంతం పనిచేశాడు. ఈ సంగతులను ప్రచారం చేయడం వల్ల ఈ జాతులమధ్య వైరుధ్యాలు బ్రాహ్మణవాదుల కుట్రేనని గ్రహించే విధంగా చేసి, సమన్వయం సాధించడం అవసరం. కుల సంఘాలు తమ కర్తవ్యాన్ని మరచి మనువాద పార్టీలవద్ద దళారుల పాత్ర పోషిస్తున్నాయి. ఇది బహుజన ప్రజల వ్యతిరేక విధానమేకాక ద్రోహంకూడా. తమ బతుకుదెరువుకోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టడం క్షమించరాని నేరం. ఉద్యమ నాయకత్వ అవగాహనా రాహిత్యం రాజ్యాధికారానికి మరింత దూరంగా నెట్టివేస్తున్న దుస్థితి. పాలిష్‌డ్ నాయకత్వాన్ని ఇటు ఎస్సీల్లో, అటు బీసీ కులాల్లో రూపొందించాల్సి ఉంది. ఇది విద్యావేత్తల ప్రథమ కర్తవ్యం. ఈ దిశగా బామ్‌సెఫ్ వంటి సంస్థలు పనిచేయగలుగుతున్నా ఇది అణగారిన, బాధిత కులస్థులందరి బాధ్యత, అనివార్యం!
ఎస్సీల్లో మాదిగల సమస్య. జనాభాలో గణనీయంగా ఉన్నా మాదిగలు రిజర్వేషన్ల లబ్ధిలో మిక్కిలి వెనుకబడ్డారనే నేపథ్యంతో, మాల మాదిగలు, ఉప కులాలు తమ జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు పొందేందుకు అనుగుణంగా తమను ఎ.బి.సి.డి.లుగా వర్గీకరించాలని పోరాడుతున్నాయి. నిజానికి ఇది న్యాయం. అంతేకాదు చాలా చిన్న సమస్య. ఈ సమస్యను అడ్డుపెట్టుకొని మనువాద పార్టీలు ఎంత లబ్ధిపొందాలో అంతా పొందాయన్నది వాస్తవం. ఈ దరిమిలా మాదిగలు బ్రాహ్మణీయశక్తుల కుట్రలను పసిగట్టి ఎండగట్టడంలో విఫలమయ్యారు. వర్గీకరణవంటి తాత్కాలిక సమస్యతోపాటు రాజ్యాధికారం వంటి శాశ్వత పరిష్కార మార్గాలపైనా దృష్టి సారించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎ.బి.సి.డీ.లుగా వర్గీకరించినా ఏదో ఒక గ్రూపులోని మరోకులం మళ్లీ అన్యాయానికి గురైనామనే నినాదంతో మరోపోరాటం అవసరమవు తుందేమో?! ఇలాంటి సమస్యనే బిసిలు ఎదుర్కొంటున్న విషయం పరిశీలనార్హం. బిసిల్లో వర్గీకరణ ఉంది. ఐనప్పటికీ కొన్ని అత్యంత వెనుకబడిన కులాలు తమను ఎం.బి.సి. లుగా గుర్తించాలంటూ ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా ఎదురవు తున్న సమస్యలను ఏకరువు పెడుతు న్నారు. ఇలాంటి సమస్యలే ఎస్సీ ల్లోనూ, బీసీల్లోనూ, అనైక్యతకు దారి తీస్తున్నాయి.

వీటన్నింటికీ మాస్టర్‌కీనే శాశ్వత పరిష్కారమైనప్పటికీ తాత్కాలిక ఉప శమనం/ మార్గమూ ఉన్నది. విద్య, ఉద్యోగ రంగాల్లో అత్యంత వెనుక బడిన ఎస్సీ, బీసీ కులాలకు ప్రత్యేక పథకాల ద్వారా (కార్పొరేషన్ ఏర్పాటు, ప్రత్యేక ఉద్యోగ సదుపాయాలు, విద్యావకాశాలు) అభివృద్ధి సాధించేందుకు అభివృద్ధి చెందిన కులాలు, మేధావి వర్గం ప్రయత్నించాలి. ఇది ఇట్లుంటే, రాజకీయరంగంలో బీసిలకు ప్రాతినిధ్యం లేనేలేదు. ఎస్సీల్లో ఉన్నా చట్టసభల్లో కాలుమోపని ఎస్సీ కులాల జాబితానే ఎక్కువ. వీటి పరిష్కారాల కోసం వివిధ దేశాల్లో వివిధ పద్ధతులు పాటిస్తున్నారు. దానినే దామాషా 'ప్రాతినిధ్య విధానం' అంటారు. కొన్ని దేశాల్లో అత్యంత తక్కువ జనాభా ఉన్న తెగలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ విధానం ఉపకరించింది. అంటే ప్రతి లక్ష మంది జనాభా ఉన్న కులానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం వంటి విధానమే అన్ని కులాల సమస్యలకు పరిష్కారం. ఇది ఐక్యత, ఓర్పు, అంకితభావం ఉన్నప్పుడే సాధ్యం. సోదర కులాల పట్ల అభిమానం, గౌరవం మరింత ప్రయోజనకరం.

ఇక ప్రధాన సమస్య- ఎస్సీలు నాయకత్వం వహించాలా, బిసిలా? రాజ్యాధికారంలో పరస్పర అవసరం ఎంత? ఆంధ్రప్రదేశ్ ఐనా, తెలంగాణ రాష్ట్రమైనా ఎస్సీల జనాభా 18 నుండి 22 శాతం వరకు ఉంటుంది. ఇందులో వివిధ పార్టీల్లో ఇప్పటికే పీకల వరకు ఇరుక్కుపోయిన వారి శాతం 10 నుండి 12 వరకు ఉంటుంది. ఇక మిగిలింది 6 శాతం. ఈ ఆరు శాతానికి తొంభై సిద్ధాంతాలు, మూడు కొట్లాటలు, ఆరు విభజనలు. ఇలా కాకపోయినా 18 శాతం ఒక్కటిగా ఉన్నా స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటుకు 30 శాతానికి పైగా ఓటు బ్యాంకు కావాలి. బీసీల జనాభా 50 శాతానికి తక్కువ ఎక్కడా లేదు. బిసి ఓటర్ల పరిస్థితీ అంతే. ఒకవేళ బిసిలు ఒక్కటిగా ఉండగలిగితే 30 శాతం ఓట్లసాధన సులభమే. అలాంటప్పుడు స్వతంత్రంగా రాజ్యాధికారం సాధ్యమే. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుచేత ఎస్సీల్లోని కనీసం 10 శాతాన్ని సమీకరించుకోగలిగితే తిరుగులేదు. కేరళ, తమిళనాడులలో గౌడ్‌లు ఎస్సీలుగా, రజకులు 18 ర్రాష్టాల్లో ఎస్సీలుగా, వడ్డెరలు కర్ణాటకలో ఎస్టీలుగా, ముదిరాజ్‌లు, బెస్తలు కొన్ని ర్రాష్టాల్లో ఎస్సీ, ఎస్టీలుగా చెలామణిలో ఉన్నారనే విషయం- బహుజనుల మూలాలు ఒక్కటేనని ప్రకటిస్తుంది. ఇక బిసిల్లో బిసిలు, ఎంబిసిలు విడిపోతే అగ్రకులాలు మరింత ఆయువు పట్టు పొందినట్టే. కాబట్టి ఎస్సీలకు బీసీల అసవరం, అలాగే బీసీలకు ఎస్సీ, ఎస్టీల అవసరం చాలా ఉన్నది. 1935లో భారత ప్రభుత్వ చట్ట రూపకల్పన సందర్భంలో, 1950లో భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికల విషయంలో బిసిల అనైక్యత వల్లే రాజకీయ బానిసలుగా మారిపోయారు. 66 సంవత్సరాలు గడిచినా చట్టసభల్లో బిసి ప్రాతినిధ్యం అందని ద్రాక్ష చందంగా మారింది. రాజ్యాంగ పరిషత్‌లో ఒక్క బిసి సభ్యుడుకూడా లేకపోవడం దేన్ని సూచిస్తుంది?
ఇటీవల జరిగిన లక్ష్మింపేట వంటి ఘటనలు చాలానే ఉన్నాయి. బిసీలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల సంఖ్య గణనీయంగానే ఉంది. పరస్పర విద్వేషాలకు కారణాలు అవగాహనా రాహిత్యమే. బ్రాహ్మణవాదాన్ని భుజాలపై ఊరేగించడమే. ఇలాంటి విషాదకరమైన ఘటనలు పునరావృతం కాకూడదంటే, ఏ కులంలోని మేధావి వర్గం ఆ కులంలో సామాజిక అవగాహన, రాజ్యాధికారం పట్ల కాంక్షపై బహుళ ప్రచారం చేయాలి. చైతన్యవంతులైన ప్రజలు కలహించుకోజాలరు. డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లు, రెండు జాతుల మధ్య సంఘర్షణ ఒక జాతికి విజయాన్ని ఇస్తుంది. ఒకే జాతిలో సంఘర్షణ ఆ జాతిని తుదముట్టిస్తుంది. ఒక జాతి కుల అస్తిత్వాన్ని ఇంకో కులం గౌరవించి అమోదించగలిగితే అసలు సమస్యే ఉండదు. దీనికి సైద్ధాంతిక స్పష్టత లోతు చాలా అవసరం. కులాల వారీగా విద్వేషాలు సృష్టించుకోవడం, విడిపోవడం ఉద్యోగులు, విద్యావేత్తల్లోనే ఎక్కువగా ఉన్నది. విపరీతంగా పెరిగిపోయి అగ్రకులాలకు మద్దతుగా నిలవడానికి పోటీపడుతున్నారు. ఇది దురదృష్టకర పరిణామం. ఈ సెక్షన్‌లోనే ప్రథమంగా అవగాహన కల్పనకు కృషి చేయాలి. చరిత్ర పట్ల అవగాహన కల్పించగలిగితే ఐక్యత, తద్వారా అధికారం సులభ సాధ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అసలు సమస్య పేదరికం కానేకాదు- అధికారం, స్వయంగౌరవం అసలు సమస్య! దీన్ని మౌలికంగా గుర్తించని వర్గాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి.

ఇది వేల సంవత్సరాల క్రితమే బీజాలు వేసుకుంది. స్వయంగౌరవం లేని జాతులు బానిసలుగా మారుతాయని చరిత్రకారుల భాష్యం నిజమే. ఆత్మగౌరవం కోల్పోవడం వల్లే బహుజనులు బానిసత్వానికే మొగ్గుచూపుతున్నారు. పెరియార్ ఈ దృష్ట్యా తన ఉద్యమానికి 'స్వయం గౌరవ ఉద్యమం'గా పేరు పెట్టారు. స్వయం గౌరవం ఉన్న జ్రలు మానవహక్కుల గురించి ఆలోచిస్తారు. పెత్తందారుల, అగ్రకులాల ఆధిపత్యంపై తిరగబడతారు. పెరియార్ ఇదే దృక్పథం కులనిర్మూలనకు దోహదకారి కాగలదని భావించాడు. ఫూలే తన ప్రతిబోధనలోనూ అణగారిన వర్గాల ప్రజల్లో ఆత్మనూన్యతా భావాన్ని పోగొట్టేందుకే ప్రయత్నించాడు. అందులో భాగంగానే బలిచక్రవర్తిని చరిత్రల్లోంచి వెలికి తీశాడు. బ్రాహ్మణ కులాల దాడుల చరిత్రను అవలోకించి స్పష్టమైన దృక్పథాన్ని అందించాడు. సామాజిక, చారిత్రక రంగాల్లోని గజి బిజిని చేధించి బహుజన దృష్టి కోణాల్లో మొత్తం వ్యవస్థను నిర్వచించాడు. ఇదే మూలవాసీ దృక్పథాన్ని హైదరాబాద్ సంస్థానంలో భాగ్యరెడ్డివర్మ, మద్రాస్ ప్రెసిడెన్సిలోని ఆంధ్రప్రాంతంలో త్రిపురనేని రామస్వామి ప్రచారంచేశారు. చివరగా స్వతంత్ర, పాలిష్‌డ్ నాయకత్వాన్ని బహుజన పితామహ సైద్ధాంతిక పునాదుల వెలుగులో నిర్మించుకోగలిగినప్పుడు రాజ్యాధికారం వస్తుంది, నిలుస్తుంది. డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నట్లు సాంస్కృతిక విప్లవం రాజకీయ విప్లవానికి, రాజకీయ విప్లవం సామాజిక, ఆర్థిక విప్లవానికి దారితీసి సమ సమాజం నెలకొనాలి. అప్పుడే ఈ బానిస కులాలకు విముక్తి. దీనిని సాధించడం ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లోని విద్యావేత్తలు, విద్యార్థులు, మేధావులు, నాయకుల కర్తవ్యం.

- కదిరి కృష్ణ
రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్‌మెంట్ కన్వీనర్

Surya Telugu News Paper Dated : 24/09/2013 


Tuesday, September 17, 2013

బడుగుల మార్గదర్శి By Dr. కదిరె కృష్ణ


బ్రాహ్మణీయ ఆధిపత్య కులాల అరాచకం పెట్రేగిపోతున్న క్రమంలో ఆధునిక యుగంలో మహాత్మాజ్యోతిరావు పూలే దంపతులు సంస్కరణోద్యమాలు చేపట్టి సమర్థవంతంగా ఎదిరించగలిగారు. అణగారిన వర్గాల జీవితాల్లో ఎంతో కొంత మార్పును తీసుకురాగలిగారు. పూలే దంపతుల స్పూర్తి దేశమంతటా ప్రబలింది. చరిత్ర లోతుల్లోకి వెళ్లి తమ చరిత్రను పరిశోధించి స్వయం గౌరవాన్ని వెతుక్కోవడం శూద్రజాతుల్లో అంకురించింది. ఈ ప్రత్యామ్నాయ సంసృ్కతి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఛత్రపతి సాహు మహరాజ్‌, నారాయణ గురు పోరాటాల కొనసాగింపుగా ద్రావిడ దేశంలో పెరియార్‌ ఇ.వి. రామస్వామి బెబ్బులి లాగా గర్జించాడు.1879 సెప్టెంబర్‌ 17 న వెంకటప్పయ్య నాయకర్‌, చిన్న తాయమ్మాళ్‌ దంపతులకు తమిళనాడులోని ఈరోడ్‌ నగరంలో జన్మించాడు. 

పెరియార్‌ చిన్నతనం నుండే హేతువాద దృక్పథంతో మెలగసాగాడు. పండితమణి అయోతిదాస్‌, మరుదయ్య పిళ్లైయార్‌, కైవల్యస్వామి వంటి సంఘ సంస్కర్తల ప్రభావం ఆయనపై మెండుగా ఉంది. 1927లో ఈరోడు నగర పాలక సంస్థ చైర్మెన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సామాజిక సేవ చేసిన ఘనత ఆయనది. కుల, మూఢాచారాల నిర్మూలన పట్ల సమగ్ర అవగాహన కలిగిన పెరియార్‌, మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ ప్రభావంతో 1919లో కాంగ్రెస్‌లో చేరారు. అనతికాలంలోనే తమిళనాడు కాంగ్రెస్‌లో కీలకమైన నేతగా ఎదిగిన ఆయన కుల నిర్మూలన దృక్పథం పట్ల మక్కువతో కాంగ్రెస్‌ మహాసభల్లో కులాల ప్రాతిపదికన విద్యాఉద్యోగ రంగాల్లో పీడిత కులాలకు రిజర్వేషన్ల కల్పన ప్రతిపాదననను ప్రస్తావించి విఫలమయ్యాడు. ఈ అన్ని మహాసభల్లోనూ బ్రాహ్మణ వర్గాల నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1923 నాటికి పెరియార్‌ తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండికూడా రిజర్వేషన్లను, అంటరానితన నిర్మూలనను కనీసం కాంగ్రెస్‌తో అంగీకరింపజేయలేకపోయినందుకు విసిగి వేసారి కాంగ్రెస్‌ను వదలడానికి నిశ్చయించుకున్నాడు.

ఈ క్రమంలోనే వైక్కోం సత్యాగ్రహోద్యమాన్ని నడిపించాల్సి వచ్చింది. కేరళలోని వైక్కోం పట్టణంలో పులయ, పరయా (అతిశూద్రులు), ఈళవ, చేనేత, కంసాలి, వనియర్‌, ఒక్కలిగ కులస్థులు వీధుల్లో నడవరాదని తిరువాంకూర్‌ సంస్థానాధీశులు నిషేధం విధించడానికి వ్యతిరేకంగా నడిచిన సత్యాగ్రహంలో నాటి ప్రముఖ నాయకులు టి.కె.మాధవన్‌, నంబూద్రిపాద్‌, మన్నత్‌ పద్మనాభం, గోవిందదాస్‌ మొదలగు వారిని అరెస్ట్‌ చేసి జైళ్లో పెట్టారు. ఆ ఉద్యమాన్ని నడపడానికి సమర్థుడైన నాయకున్ని వెతకడం ప్రారంభించారు. ఈ దశలో అప్పటికే తమిళనాడులో గురుకులంలోని శూద్ర విద్యార్థుల పట్ల బ్రాహ్మణ వర్గాలు పాటిస్తున్న అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెరియార్‌పై వారి దృష్టి పడింది. నంబూద్రిపాద్‌ ఉత్తరం అందుకున్న పెరియార్‌ అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైక్కోం సత్యా గ్రహానికి నాయకత్వం వహించడానికి కేరళ వెళ్లారు.

వైక్కోం సత్యాగ్రహం దేశమం తటా ఒక సంచలనాన్ని సృష్టించడమే కాక పాలక వర్గాలను గడగడలాడించింది. చివరికి 1925 మార్చి 9వ తేదీన గాంధీ వైక్కోం చేరుకొని సత్యాగ్రహం విరమిం చవలసిందిగా పెరియార్‌ను కోరవలసి వచ్చింది.కేవలం పోరాటాలకే తన ఉద్య మాన్ని పరిమితం చేయకుండా ప్రత్యా మ్నాయ సంసృ్కతికి పునాదులు వేశాడు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణగారిన వర్గాల అభ్యున్నతిని స్వాభి మానాన్ని పునరుద్ధరించేందుకు జీవితాంతం తపనపడిన త్యాగశీలి. తమిళనాడులో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదంటే జస్టిస్‌ మూలాలు కలి గిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీ.ఎం.కే) వంటి నేటిపార్టీల పాలనే కారణం దానికి పెరియార్‌ పోరాటమే పునాది. ద్రవిడ సంస్కృతి, నాస్తిక/ తర్క/ హేతువాదానికి తాత్విక భూమికగా నిలిచింది పెరియార్‌ సిద్ధాంతం. పురోహితుడు, మంగళ సూత్రా లు, మంత్రాలు లేకుండా పూలే సత్యశోధక్‌ సమాజ్‌ పద్దతుల్లో వివాహాలు జరిపిన తిరుగుబాటుదారుడాయన. బహుజన విద్యావేత్తలు, నాయకులు పెరియార్‌ తర్కా న్ని హేతువాద దృక్పథాన్ని ప్రజల్లో ప్రచారం చేయవలసి ఉన్నది. అప్పుడే ఆయనకు నిజమైన నివాళి.

(సెప్టెంబర్‌ 17 పెరియార్‌ జయంతి)

Surya News Paper Dated : 17/09/2013 

Sunday, September 15, 2013

రాజ్యాధికారం మరచి... By Dr కదిరె కృష్ణ,


అగ్రకుల నేతల కవ్వింపులే అభద్రతకు కారణం 
రెండు ప్రాంతాలో బడుగులు బలపడాలి 
బహుజన విముక్తి బాటే శరణ్యం! 
విభజన రాజ్యాధికారానికి బాట కావాలి! 

సెప్టెంబర్‌ 7వ తేదీన ఏపీఎన్జీవోల సభ హైదరాబాద్‌లోని లాల్‌బహ దూర్‌ స్టేడియంలో జరుగుతూ ఉండగానే కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలంగాణ ఏర్పాటు తప్పదనే రీతిలో క్యాబినెట్‌ నోట్‌ గురించి మరోసారి వ్యాఖ్యానించారు. ఇంతకీ తెలంగాణ ఏర్పాటు పట్ల సీమాంధ్ర నాయకుల అభ్యంతరాలేమిటి? కేవలం హైదరాబాదు కోసమా? ఇంత రాద్ధాంతం చేస్తున్నది దేని కోసం? దీని వెనుక దాగి ఉన్న అగ్రవర్ణాల కుట్ర ఏమిటి? తెలుగు భాష పట్ల కొలమానాలు లేని భక్తి భావం అనుకోవాలా? రాష్ర్టంపై ఎనలేని ప్రేమ అనుకోవాలా? విభజన వల్ల కలిగే వేదన వాస్తవంగా సీమాంధ్ర నాయకత్వంలో కనిపించడం లేదు. తెలంగాణ రాదేమో అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో వెలువడ్డ ప్రజాందోళన, విద్యార్థి, యువత కనబర్చిన మనోవేదన సీమాంధ్ర ఉద్యమంలో కనిపించడం లేదు. దీనికి కారణం సమైక్యాంధ్ర భావన వారిలో లేకపోవడమే! సీమాంధ్ర ఉద్యోగులు, నాయకుల అభ్యంతరమల్లా హైదరాబాద్‌ నగరం మాత్రమే. 

తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో ఉద్యోగ, వ్యాపార, జీవనోపాధిరీత్యా స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ అభద్రతా భావానికి కారణాలు లేకపోలేదు. సీమాంధ్ర జేఏసీ ఛైర్మన్‌ పరుచూరి అశోక్‌బాబు భయపడినంత కాకపోయినా, కొంత భయానక వాతావరణం ఉంది. దీనికి కారణం తెలంగాణ ఉద్యమ నాయకత్వ స్థానంలోని భూస్వామ్య, వెలమ, రెడ్డి కులాల కవ్వింపు చర్యలే. వాస్తవానికి అలాంటి పరిస్థితే వస్తే సీమాంధ్ర సెటిలర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రాంతంలోని ఆ కులాల వాళ్లదేనని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొ కంచె ఐలయ్య బాహాటంగానే ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ ప్రాంతంలోని భూస్వామ్య వర్గాలైన రెడ్డి, వెలమ కులాల పెత్తందార్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎదురవబోయే చేదు అనుభవాలు తక్కువేమీ కాదు. అందుకే అసలు పేచీ తెలంగాణలో భూస్వామ్య పెత్తందారి వర్గాలకు, బహుజనులకు ఉండబోతోంది. సీమాంధ్ర బహుజన ప్రజానీకానికి కేసీఆర్‌కు ఏ పేచీ లేదు. ఉన్నదంతా ఆ ప్రాంత ఆధిపత్య కమ్మ, రెడ్డి కులస్థులతోనే. అసలు విభజన సమస్య సీమాంధ్ర అణగారిన కులాలది కానేకాదు. అది కేవలం పెట్టుబడిదారి, అగ్రకులాలదే. తెలంగాణ ప్రాంతంలో సెటిలర్స్‌ అయిన బహుజనులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వస్తే రెండు బస్తాల సరుకు సరంజామా తీసుకెళ్లడం పెద్ద కథేం కాదు. 

కానీ, అపరిమిత ఆస్తులున్న పెట్టుబడిదారీ కులాల పరిస్థితి ఏమిటన్నదే వారి ఆందోళనకు కారణం. ఇప్పటికే తెలంగాణ పేటెంట్‌ హక్కుల కోసం వెలమలు, రెడ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రకటన వెలువడిన పరిణామ క్రమంలో ఈ కులాల ప్రవర్తన అనుమానా స్పదంగా మారింది. రాష్ర్ట మంత్రి కుందూరు జానారెడ్డి తెలంగాణ రాష్ర్టంలో తొలి సంతకం విద్యుత్‌పై చేయబోతున్నట్లుగా ప్రకటించి, అప్రకటిత ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిట్లుంటే అటు సీమాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ప్రస్తుతం ఏం చేయాలి అనే దిశగా చర్చ జరగకపోవడం విచారకరం. సీమాంధ్రలోని బహుజనులు సమైకాంధ్ర నినాదంతో తమ శక్తిని, సమయాన్ని వృథా చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. తెలంగాణ ఏర్పాటు తథ్యమని సోనియా ప్రకటించడం, యుపిఏ ఏకగ్రీవ తీర్మానం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇవి రాష్ర్ట విభజనకు తిరుగులేని ఆధారాలు. ఈ క్రమంలో తెలంగాణ, సీమాంధ్ర ఇరుప్రాంతాల అణగారిన కులాలు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేయవలసి ఉన్నది. 

దేశ చరిత్ర పరిశీలిస్తే ఇలాంటి పరిస్థితులు (విభజన) సంభవించినప్పుడల్లా బ్రాహ్మణీయ, మనువాద అగ్ర కులాలు తమ కుల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జగమెరిగిన సత్యం. ఇండియా, బ్రిటిష్‌ డొమినియన్‌గా ఉన్న కాలంలో స్వాతంత్య్ర సమరయోధుడు, లోకమాన్య బా గంగాధర తిలక్‌ 1916లో చేసిన ప్రకటన ఇక్కడ ఉటంకార్హం. తమ అగ్రకుల ప్రయోజనాలు కాపాడితే బ్రిటిష్‌ పాలన పట్ల తమకు ఏ అభ్యంతరం లేదని బ్రాహ్మణవర్గాలు ఆనాడే బహిర్గతం చేశాయి. ఇలాగే మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ ఇలాంటి ప్రకటనలు 1930వ దశకం వరకు చేస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంతో రాష్ర్ట విభజన అంశాన్ని పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు- అగ్రకులాల నుంచి హక్కులను, అధికారాన్ని కైవసం చేసుకునేదిశగా కృషి చేయవలసి ఉంది. ఈ స్పృహతో- అవసరమైన చైతన్యాన్ని కలిగించి ప్రజానీకాన్ని బహుజన విముక్తి ఉద్యమ బాటలో నడిపించాలి.

తెలంగాణలో కొందరు, సీమాంధ్రలోని చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు వాదిస్తున్నట్లు హైదరాబాద్‌ను యూనియన్‌ టెరిటరీ చేసే అవకాశం ఉందా? అసలు ఈ డిమాండు చేయడం వెనుక ఎవరి ప్రయోజనం దాగి ఉంది? చంఢీఘర్‌ తదితర నగరాలను యూటీ చేయడం వేరు, హైదరాబాద్‌ పరిస్థితి వేరని గ్రహించకపోవడం అత్యంత శోచనీయం. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర- వీటిలోని ఏ రెండింటికీ హైదరాబాద్‌ అనుసంధానంగా లేదు. చంఢీఘర్‌ తీసుకుంటే పంజాబు, హర్యానాల మధ్యలో ఉండి ఆ రెండు రాష్ట్రాలను కలుపుతుంది. అది ఇక్కడ సాధ్యపడదు. పైగా హైదరాబాద్‌ యూటీగా చలామణి అవడంలోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి వృథా డిమాండు పట్ల బహుజన ప్రజలు అప్రమత్తంగా ఉండితీరాలి. తెలంగాణ మేధావి వర్గం భావిస్తున్నట్లు హైదరాబాదు యూటీ అయితే రెడ్డి, వెలమ ప్రాబల్యం లేకుండా పోతుందనో, అసలు ఉండబోదనో గ్యారంటీ లేదు. అది ఒట్టి భ్రమ. ఢిల్లీనే ప్రభావితం చేయగలిగినవాడికి యూటీ పెద్ద లెక్కలోకి రాదేమో?! తెలంగాణలో లేదా హైదరాబాదులో నెలకొన్న పరిశ్రమలు, ఆదాయ వనరులన్నీ ముఖ్యంగా టాప్‌ 10 పరిశ్రమలన్నీ- సీమాంధ్రులవే అనేది నిజం. కానీ సీమాంధ్రలోని ఏ కులాలవి అనేది అసలు ప్రశ్న. వాటి ద్వారా బహుజనులు లబ్ధి పొందుతున్నారా? టాప్‌ 10 పరిశ్రమలు సీమాంధ్ర కమ్మ, రెడ్డి కులస్తులవే కనుక ఆంధ్రప్రదేశ్‌ ఐక్యంగా ఉన్నా సీమాంధ్ర బహుజనుల ప్రయోజనం శూన్యమే. అంచేత సీమాంధ్ర బహుజనులు విభజనాంతరం రాజ్యాన్ని కైవసం చేసుకునే మార్గాల గురించి ఇపుడు ఆలోచించాలి. ఆ దిశగా ఎత్తుగడలు వేయాలి.

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలి అనేది మరో ప్రతిపాదన. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనం ఏమేరకు ఉందో అర్థం కావడం లేదు. పైగా ఇది వట్టి పసలేని వాదన. డాక్టర్‌ బాబాసాహెబ్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని ప్రతిపాదించారని సమర్థన. దానితో పాటు అంబేడ్కర్‌ తెలంగాణకు వరంగల్‌ను రాజధాని చేయాలన్నారు. మరి దాని సంగతేమిటి? హైదరాబాదును తెలంగాణకు రాజధానిగా ఉంచిన ప్పుడు రెండో రాజధానిగా చేయడం సాధ్యం కాదనేది అంబేడ్కర్‌ భావనగా అవగతమవుతుంది. హైదరాబాదు రెండో రాజధాని ప్రస్తావన అవసరం ఇప్పుడేమీ కనిపించదు. ఇలాంటి ఉబుసు పోని డిమాండ్లను చేయడం మాని, జాతి ప్రయోజనాల నిమిత్తం పునరాలోచించాలి. ఒక ఉద్యమానికైనా, డిమాండుకైనా ఒక క్యారెక్టర్‌ ఉండాలి. హైదరాబాదును రెండో రాజధానిగా చేయాలనే డిమాండు ప్రస్తుతం క్యారెక్టర్‌ లేనిదే కాక, ప్రభుత్వాలు పరిగణనలోకి కూడా తీసుకోలేని నిర్హేతుక వాదన. ఆధిపత్య వర్గాలను ఎదుర్కొవడానికి ఇలాంటి డొంక తిరుగుడు, దొడ్డిదారి మార్గాలు పనిచేయవు. బహుజన పితామహులు చెప్పినట్లు పోరాడి హక్కులు సాధించినప్పుడే ఆత్మగౌరవం సిద్ధిస్తుంది. 

ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఉమ్మడిగా దోచుకున్న అగ్రకులాలు విడిపోయి విచ్చలవిడిగా దోచుకునేందుకు గత దశాబ్దం కిందటే బ్లూప్రింటు సిద్ధం చేసుకున్నాయి. ఎటొచ్చి అమాయకంగా, అగమ్యంగా ఆగమయింది ఈ రెండు ప్రాంతాల బహుజన కులాలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లోని ప్రజాప్రతినిధులు బ్రాహ్మణీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు. కాన్షీరాం భాషలో చెప్పాలంటే చెంచాలు. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా జాతిని తాకట్టు పెట్టేందుకు వెనుకాడని ద్రోహులు. విద్యార్థి విభాగం ప్రతినిధులకు స్వతంత్ర ఆలోచనాసరళి లోపించి, ఏదైనా పార్టీ టిక్కెట్టు ప్రసాదిస్తే అదే పదివేలు అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో బహుజన నాయకత్వ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, కులసంఘాలు, మేధావివర్గం కీలకపాత్ర పోషించి జాతి ప్రయోజనాలు కాపాడాలి. తెలంగాణ డిమాండు ప్రజాస్వామ్యమైందే. కానీ, ఉద్యమం అలా లేదు. ఉద్యమ నాయకత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్యులు ప్రకటించినట్లు ‘ఇవి రెండూ ఉద్యమాలు కావు’. కారణం వీటిల్లో శీలం లేదు. దానితో పాటు భూస్వామ్య, సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణులు పుష్కలంగా ఉన్నాయి.

పాలిష్‌డ్‌ లీడర్‌ షిప్‌ కరవయింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉంది. సీమాంధ్ర ఉద్యమంలో కడుపుమంట లేకపోగా ‘ఇగో’ తిష్ఠ వేసింది. ఈ దృక్పథంతో ఆలోచిస్తే ఈ రెండు ఉద్యమాల ద్వారా, వాటి ఫలాల వల్ల సామాన్యులకు ఏ ప్రయోజనమూ ఉండదు. ఉద్యోగాలు రావడం కంటే ఆత్మగౌరవం చాలా ప్రధానమని బహుజనులు గ్రహించాలి.ఇన్నాళ్ల పోరాటంలో అగ్రకుల శక్తులు విమర్శ, ప్రతివిమర్శ చేసుకున్నా చాలా అప్రమత్తంగా వ్యవహరించాయి. తెలంగాణ ఉద్యమం వెలమ కులస్థుల పేటెంట్‌గా మారిందని సీమాంధ్ర కమ్మ, రెడ్డి కులాలకు బాగా తెలుసు. సమైక్యాంధ్ర ఉద్యమం కమ్మ కులాల కనుసన్నల్లో బ్రేక్‌డ్యాన్స్‌ చేస్తోందని తెలంగాణ అగ్రకులాలకూ ఎరుకే. కానీ, ఏనాడూ పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామిరెడ్డి ‘ఇది సీమాంధ్ర ఆధిపత్య కులాల కుట్ర’ అని ప్రకటించలేదు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే శక్తి సీమాంధ్ర ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు లేదని కోదండరామిరెడ్డి, కె. చంద్రశేఖర్‌రావులకు తెలియదనుకోవాలా? పోటీ సీమాంధ్ర దోపిడీదారులెవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు సీమాంధ్ర నుండి వచ్చి 100 నుండి 150 గజాల స్థలం పొందగలిగితే స్వర్గ సుఖం అనుభవిస్తున్నారు. 

తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్‌ చుట్టూరా వందల వేల ఎకరాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? సీమాంధ్ర పెట్టుబడిదారులు అంటున్నారే కానీ, సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారులని ఎందుకనరు? సామ్యవాదిగా, బుద్ధుని సోదరునిగా చెప్పుకునే కోదండరామిరెడ్డి సిద్ధాంతాలు మరచిపోయినట్టా? లేక తెలంగాణ బహుజనులకు తెలివి వచ్చి తిరగబడతారనా? రహస్యంగా భద్రపరచిన కోదండరామిరెడ్డి బ్లూప్రింటు మర్మమేమిటో? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడితే అణగారిన వర్గాల నుండి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని పదిలం చేసుకోవాలి. జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అక్కడి పాలకులు గిరిజనులే కాగలిగారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో ఈ అవకాశం గురించి ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించి చాకచక్యంగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. సీమాంధ్రలో ఎస్సీల్లో మాలల జనాభా ఎక్కువ. వీళ్లకు తోడు బీసీలు ముఖ్యంగా కాపు, గౌడ, యాదవ కులాలు ఏకం కావడానికి వ్యూహాలు రూపొందించుకోవాలి. 

తద్వారా కూటమిగా ఏర్పడి మాస్టర్‌కీని అందుకోవాలి. సమైక్యాంధ్ర నినాదాలతో బహుజన కులాలకు ఒరిగేదేమి ఉండబోదు. తెలంగాణలో మాదిగలు, ముస్లిం, యాదవ, గౌడ, ముదిరాజ్‌లు కూటమిగా ఏర్పడేందుకు మార్గాలను సుగమం చేయాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు ఖాయమని ప్రకటించినా, బహుజన కులాలు నిర్వీర్యంగా నోరు తెరచి, కళ్లప్పగించి అమాయకంగా రెడ్డి, కమ్మ, వెలమ ఆధిపత్య కులాల అధికార పోరుకు దిష్టిబొమ్మలుగా మారుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న తంతంతా అంతేనన్నది చేదునిజం. విభజన జరిగితే ఒనగూడే ప్రయోజనాలకోసం ఏ వర్గానికి ఆ వర్గం వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ- జగన్‌ను, బిజెపిని దెబ్బతీయడానికి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ఆయుధంగా ఎంచుకుంది. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని ఎవరైనా ఊహించగలరు. తెలంగాణ రెడ్లు ముఖ్యమంత్రి, రాజకీయ ప్రాబల్యమే లక్ష్యంగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడితే జగన్‌మోహన్‌రెడ్డి సంగతి వేరే చెప్పనక్కర లేదు. కమ్మలు ఈ పరిస్థితిని గమనించే చంద్రబాబులో పరకాయ ప్రవేశంచేసి యు టర్న్‌ తీసుకొని సమైక్యరాగం తీస్తున్నారు.

ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీమాంధ్ర కమ్మలు దింపుడు కళ్లెం ఆశగా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రే కాదు, ఏ అధికారమూ లేకపోయినా కర్రపెత్తనం కేసీఆర్‌ కుటుంబానిదే. వారి ఆధిపత్యానికి వచ్చిన ఆపదేమీ లేదు. ఇప్పటికే తిరుగులేని నాయకత్వాన్ని, సంపదను ఆర్జించినట్లు ఫోర్త్‌ఎస్టేట్‌ భోగట్టా. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఏ దిక్కూ లేదు. తెలంగాణ పోరాట వెలుగులో నిద్రావస్థలో బహుజనులు సొక్కి సోయి దప్పి ఉన్నారు. ఎస్సీలు కాకపోతే బీసీలు- వాళ్లూ కాకపోతే ఎస్టీలు మొత్తంగా అగ్రకులాలకు గొడుగు చందంగా మారుతున్న దుస్థితి దాపురించింది. బోనాలు, బతుకమ్మలు బెంజికార్ల నుండి కాసేపు ఫోజిచ్చినంత మాత్రాన న్యాయం జరుగుతుం దనుకోవద్దు. సీమాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, తెలంగాణ బహుజనులకు అసలు ఏ గొడవా లేదు. గోచి గొంగడి గాళ్ళ గతి నుండి ఏదో కొంత మెరుగైన జీవితానికైనా ఈ ఉద్యమాలు దోహదపడలేదు, పడబోవన్నది నగ్నసత్యం. సీమాంధ్ర నుండి 12 మంది ముఖ్యమంత్రులైతే 11 మంది రెడ్డి, కమ్మ కులాల వారే. రాయలసీమలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా అగ్ర కులాల జనాభా కంటే ఎన్నోరెట్లు ఎక్కువ. ఆరుగురు రాయలసీమ ముఖ్యమంత్రుల్లో దామోదరం సంజీవయ్య రెండు సంవత్సరాల అత్తెసరు పాలన మినహాయిస్తే, మిగిలినవారంతా రెడ్లే. కోస్తాంధ్ర ప్రాంతం నుండి ఆరుగురు ముఖ్యమంత్రులయితే ఇద్దరు కమ్మలు, ముగ్గురు రెడ్లు. మొత్తంగా పెట్టుబడిదారీ భూస్వామ్య కులాలే పాలకపక్షంగా వ్యవహరించాయి. 

తెలంగాణ ప్రాంతం నుండి నలుగురు ముఖ్యమంత్రులయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు మొండిచెయ్యే మిగిలింది. మొత్తంగా ఐదు శాతం లేని రెడ్లకు ఒక్కసారి ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా ఎనమండుగురు ముఖ్యమంత్రులయ్యారు. బిసిలు కనీసం ఆరుగురు ముఖ్యమంత్రులు కావాల్సి ఉండగా ఒక్క అవకాశమూ దక్కలేదు. నలుగురు కమ్మ కులస్థులు ముఖ్యమంత్రులు కాగలిగారు. కానీ వారి జనాభా రీత్యా ఒకటి కూడా వచ్చే వీలులేదు. ఇంతకీ విషయ మేమిటంటే విభజన జరిగినా, జరుగకపోయినా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలిపశువులవుతున్నది అణగారిన కులాలే. లబ్ధిపొందే దగ్గర వీళ్లకు రిక్తహస్తమే దిక్కవుతుంది. విభజన జరిగిపోయింది కాబట్టి కోల్పోయిన వాటాను, రాజ్యాన్ని ఎలా దక్కించుకోవాలో ఆలోచించాల్సింది పోయి అగ్రకులాల టక్కరిపాటలకు వంతపాడుతుండడం బాధాకరం, దౌర్భాగ్యం. ‘పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప’ అంటే పోరాడీ పోగొట్టుకొని (బిడ్డలను) బానిస సంకెళ్లు మరింత బిగించుకుంటే లాభం ఏముంది? తాతలు, తండ్రులు దొరల ఘడీల ముందు దాష్ఠీకం చేస్తే, విద్యావంతులు, చైతన్యవంతులు, పోరాటవీరులై అదే దొరల పాదాలవద్ద వెట్టి చేసి, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం విడ్డూరం కాదా?అంటే తెలంగాణ కోసం పోరాటం వద్దని కాదు, పోరాడి ఆత్మగౌరవంతో అధికారాన్ని సాధించుకోవాలన్నదే భావం.

తెలంగాణ, సీమాంధ్ర ప్రజలది కేవలం ఆంధ్రప్రదేశ్‌ విభజన, సమైక్యసమస్య కాదు. వీళ్లది జాతి, జాతీయ సమస్య, రాజ్యాధికార సమస్య కూడా. ఆత్మగౌరవ వ్యవహారం ఈ దిశగా ఆలోచించక తప్పదు. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో బహుజనుల అస్తిత్వం నామమాత్రం కాకూడదు. జనాభా రీత్యా మెజారిటీ ప్రజలైన బహుజనులకు, రాష్ర్ట విభజన అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు- అధికారాన్ని మరింత దగ్గర చేయాలే కానీ, మరింత బానిసలను చేయకూడదు. అంబేడ్కర్‌ చిన్న రాష్ట్రాల ఏర్పాటు సమర్థనలో దాగి ఉన్న రహస్యం కూడా ఇదే. కనుక ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాధికారదిశగా కాంక్రీట్‌ భావజాలంతో ముందుకు నడవడమే శ్రేయస్కరం. 

రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్‌ మూవ్‌మెంట్‌ కన్వీనరు

Surya Telugu News Paper Dated: 15/09/2013 

Friday, August 2, 2013

ఇక బహుజన తెలంగాణ!? By కదిరి కృష్ణ


కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ మీటింగ్, సిడబ్ల్యుసి సమావే శం, యుపిఎ భాగస్వామ్య పక్షాల ఏకగ్రీ వ తీర్మానం, డిగ్గీ రాజా ప్రకటన తదితర పరిణామాలు చకచకా జరిగిపోవడంతో తెలంగాణ ప్రాంతంలో సంబర వాతావరణం నెలకొన్నది. గత 60 సంవ త్సరాల తెలంగాణ ప్రజల కల నెరవేర డానికి అనుకూల పరిస్థితులు సంభవిం చడంతో ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తెలంగాణలోని వివిధ యూనివర్శిటీల్లో, వివిధ పార్టీల్లో పండుగ సందడి కనిపించింది. 2013 జూలై 30 నాటి ఢిల్లీ పరిణామాలతో, ఇప్పటిదాకా లాఠీదెబ్బలు, వాటర్ కెనాన్, టియర్ గ్యాస్ ప్రయోగాలు, రబ్బరు బుల్లెట్లకు తల్లడిల్లిన తెలంగాణ కనుల కొలనులలో ఆనంద భాష్పాలు మెరిశాయి. వేలాదిమంది తన బిడ్డల ఆత్మ బలిదానాలు తలచుకొన్న తెలంగాణ తల్లి ఎద ఉద్వేగంతో ఉప్పొంగింది. సుమారు 1600 మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ- ఈ ప్రకటనతో తన ముద్ర తుడిచివేసుకొని కొంత పాపప్రక్షాళన చేసుకొన్నదని చెప్పవచ్చు. దాటవేత, సాచివేత, నాన్చుడు ధోరణులతో ఇన్నాళ్లూ కాలం గడిపిన కాంగ్రెస్ ఎట్టకేలకు తెలంగాణ పట్ల తన సానుకూల స్వంత అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పది జిల్లాలతో కూడిన పూర్వ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. యుపిఎ భాగస్వామ్య పక్షాలతోనూ 'మమ' అనిపించడం విశేషం. వేగంగా జరిగిన ఈ పరిణామాలన్నీ రాజకీయ ప్రహసనంలో భాగమే. ఇక చట్టపరమైన ప్రహసనం మిగిలి ఉంది. ఆ తంతూ పూర్తయితే కానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరిగినట్టుకాదు. ఈలోపు జరుగవలసిన రాజ్యాంగబద్ధ వ్యవహారం చాలా కీలకమైనది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తీర్మానం, రాష్ట్రపతి ఆమోదంతో న్యాయశాఖ బిల్లుకు రూపకల్పన చేయడం, తిరిగి శాసనసభ అభిప్రాయాన్ని కోరడం, రాష్ట్రపతితో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిఫారస్సు చేయించడం వగైరా సోపానాలు ప్రధానమైనవి.
2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ సంస్థగా ఆవిర్భవించింది. అప్పటికే 1969 ఉద్యమాన్ని, దాని దుష్ఫలితాలను అనుభవించిన వారు, తెలంగాణ డిమాండును అడపాదడపా నినదిస్తున్న కొన్ని సంస్థలు, వ్యక్తులు టిఆర్ఎస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించడంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మారోజు వీరన్న, ప్రొ॥ జయశంకర్, కేశవరావ్ జాదవ్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మేధావుల పాత్ర 2001 పూర్వపు తెలంగాణ ఉద్యమంలో కీర్తించదగినది. 1969లో ఉద్యమాన్ని నీరు గార్చిన తరువాత కూడా, నివురుగప్పిన నిప్పులా జై తెలంగాణ నినాదం ప్రజల హృదయాల్లో నిలుపడంలో వీరు విశేషంగా కృషి చేశారు. ఈ క్రమంలో 'ఒక ఓటు- రెండు ర్రాష్టాలు' నినాదాన్ని వినిపించిన బిజెపి 2004 వరకు ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ దిరిమిలా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీతో నాటిఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో అలయెన్స్ కుదుర్చుకుంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్ర ర్రాష్టాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. టిఆర్ఎస్ పార్టీ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షంగా చేరి మంత్రి పదవులను స్వీకరించింది. ఇది కొంతకాలం సుఖప్రదంగానే జరిగింది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఎలాంటి చిత్తశుద్ధిని కనబర్చకపోవడంతో టిఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజలు వ్యతిరేకత కనబరచడమే కాక, తీవ్ర నిరసనలు ప్రదర్శించారు. ప్రజల అసంతృప్తిని గమనించిన టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2009 నవంబరు 29న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్ష విరమించేందుకు ప్రయత్నించగా, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘాలనుండి పెద్దయెత్తున నిరసనలు వచ్చిన క్రమంలో- కేసీఆర్ దీక్ష కొనసాగించక తప్పలేదు. ఈ పరిణామాలతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం యుద్ధరంగాన్ని తలపించింది. బంద్‌లు, రాస్తారోకోలు, వంటావార్పులు ఒకవైపు- పోలీసు నిర్బంధాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, జైళ్లు మరొకవైపు!
ఈ సందర్భంలోనే హైదరాబాద్ శివారులోని ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆత్మహత్య కు పాల్పడడంతో ఉద్యమం శిఖరస్థాయికి చేరుకుంది. డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం 'తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయింది' అంటూ ప్రకటించేవరకు పట్టు వదలలేదు. వాస్తవానికి ఇక్కడే మరో కథ మొదలయింది. సమైక్యాంధ్ర నినాదంతో డిసెంబర్ 9 కేంద్ర ప్రకటనను నిరసిస్తూ ఆ ప్రాంతంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు. విద్యార్థుల ఉద్యమాలకు పునాదులు పడ్డాయి. ఆంధ్ర పెట్టుబడి దారులు కేంద్రప్రభుత్వాన్ని- చిదంబరం ప్రకటనను ఉపసంహరించుకుంటూ డిసెంబర్ 23న మరో ప్రకటన చేసేటట్టు ప్రభావితం చేశారు. దీంతో తెలంగాణ మళ్లీ అగ్నిగుండమయింది. డిసెంబర్ 23 నాటి ప్రకటనతో యువత, విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఈ దఫా మరింత ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మబలిదానాలు వందల సంఖ్యను దాటడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ దశలో శ్రీకృష్ణ కమిటి నియామకం, నివేదిక సమర్పణ ఈ మొత్తం తతంగంతో కొంత కాలయాపన చేయగలిగినా తెలంగాణ ప్రాంతానికి నిరాశనే మిగిల్చింది. తెలంగాణ ప్రాంతమంతా నిప్పుల కుంపటిగా మారిపోయింది. ఆత్మహత్యలు మితిమీరి పోతున్నా కాంగ్రెస్ స్పందన శూన్యం. ఈ క్రమంలో వివిధ సంఘాల జెఎసిలు ఏర్పడి, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఛలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. తెలంగాణ ధూంధాంల పేరుతో ప్రజలు ఉద్యమానికి బ్రహ్మరథం పట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఊపిరి సలుపని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి, పొలిటికల్ జెఏసి, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు మరీ ముఖ్యంగా విద్యార్థులు వీరంగాన్ని సృష్టించారు. ఉద్యమం ప్రారంభం నుండి, ప్రధానంగా 2009 నుండి టిఎన్‌జిఒలు, యూనివర్శిటీ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు- టిఆర్ఎస్‌తో సమానంగా ఉద్యమాన్ని నడిపించడంలో కృతకృత్యులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1600 పైచిలుకే. ఇందులో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వాళ్లే. టిఎన్‌జీవో సంఘాన్ని, విద్యార్థి, ఇతర జెఏసీలను (లాయర్లు, డాక్టర్ల జెఎసి వగైరా) తమ భుజస్కంధాలపై వేసుకొని లాఠీదెబ్బలు, తుపాకీ తూటాల గాయాలుఎదుర్కొని పోరాటాన్ని నడిపించిన వీరులూ ఈ బహుజన కులాల వారే కావడం గమనార్హం. కానీ ఉద్యమ ఫలితాలు అనుభవించిన వారిలో ఈ కులాలేవీ లేకపోవడం శోచనీయం. తెలంగాణ ఉద్యమ ఫలితాలు ఇప్పటి వరకు అనుభవించింది టిఆర్ఎస్- వెలమలు, దాని అనుబంధ సంఘాల అగ్రకులాలు. వెలమ కులాల నుండి ఎక్కువ మొత్తంలో అసెంబ్లీకి ఎన్నిక కాగా, ఇతర అగ్రకులాలూ ఈ ప్రయోజనాన్ని కొద్దో గొప్పో పొందాయి. అమరవీరుల కుటుంబాలు, కేసుల పాలైన విద్యార్థులు ఎంతమాత్రం లబ్ధి పొందలేదు సరికదా, అక్రమకేసుల బనాయింపు వారిని ఆర్థికంగా మరింత చితికిపోయేలా చేసింది. కింది కులాల ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎదుగుబొదుగు లేని విధంగా ఉండిపోయాయి.

ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ ర్రాష్టాన్ని అంగీకరిస్తూ తీర్మానించిన ఈ సందర్భంలో ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకార్యకర్తలు మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 1947లో స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో ఏమరుపాటుగా ఉన్న కారణంగానే వెనుకబడిన కులాలు (బిసిలు) 65 సంవత్సరాలుగా రాజకీయ బానిసత్వాన్ని అనుభవిస్తున్నాయి. తెల్లదొరల నుండి భారత అగ్రకులాల చేతుల్లోకి అధికార బదలాయింపు జరిగిన పిదప బిసిలు ఎక్కువ అణచివేతకు, వివక్షకు గురికావాల్సి వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసే సందర్భంలో కూడా ఈ వర్గాల సంక్షేమం ప్రస్తావనకు రాకపోవడం చరిత్రలో జరిగిన తప్పిదం. బిసిలు ఒకవైపు అణచివేతకు, సామాజిక వివక్షకు గురవుతూనే ఎలాంటి రిజర్వేషన్లు పొందలేక, అధికార భాగస్వామ్యం అందుకోలేక అణగారినవర్గాలుగా మిగిలిపోయారు. అయితే ఇందులో కొంత స్వయంకృతాపరాధం లేకపోలేదు. అగ్రకులాలను గుడ్డిగా నమ్మడమే ఇన్ని వైపరిత్యాలకు కారణంగా భావించవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలోనూ ఇదే జరుగుతుందా? అనే సందేహం చాలా మందికి వస్తోంది. రెండు ర్రాష్టాలు కలిసినప్పుడు లేదా విడిపోయినప్పుడు ఆ ర్రాష్టాలు, ఆ ప్రాంతాల మధ్య జరిగే ఒప్పందాలు, ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక చట్టాలకు రాజ్యాంగబద్ధత లేకపోయి నా రాజ్యాంగ గౌరవం దక్కుతుంది. తదనంతర కాలంలో ఈ చట్టాలు, ఈ రాయితీలే ఆ ప్రాంత ప్రజానీకపు జీవన ప్రమాణా ల అభివృద్ధికి దోహదప డతాయి. అందువల్ల రాజకీయ సామాజిక దోపిడీకి గురవుతున్న బీసీలు, ఎంబిసీలు తమ సమస్యలను పరి ష్కరించుకోవడానికి ఇది అనువైన సమయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఎత్తైతే దాని పునర్నిర్మాణం మరో ఎత్తు. ఈ కోణంలో చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో దొరల పెత్తనంలో సమస్తాన్ని కోల్పోయిన అణగారిన కులాల ప్రజలు ప్రథమ ప్రయోజనాలను పొందవలసి ఉంటుంది. రక్తం ధారపోసి ఊడిగం చేయడం చేతకాని తనం కిందనే లెక్క. అందువల్ల బహుజనులు ఇప్పుడు అత్యంత వివేకంగా వ్యవహరించాలి. తమ జాతి ప్రయోజనాలే పరమావధిగా, సామాజిక బానిసత్వ విముక్తికి మరొక సాధనంగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకోక తప్పదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ముసాయిదా బిల్లు రూపకల్పనకు ముందు ఆస్తులు, అప్పులు, సరిహద్దు నిర్ణయం, రెవెన్యూ, నదీలాల పంపిణీ, రాజధానినిర్మాణం వంటివెన్నో ప్రధాన అంశాల పరిశీలనార్థం కేంద్రం మంత్రుల కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ పై అంశాలతో పాటు అనేక వివాదాస్పద అంశాలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. ఈ మంత్రుల బృందం నివేదిక లోని అంశాలన్నింటినీ కేంద్ర న్యాయశాఖ పునఃపరిశీలించి ముసాయిదాలో చేరుస్తుంది. ఆ తరువాతే ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఈ సమయంలో బహుజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు కీలకపాత్ర పోషించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సమస్యలను చర్చకు తీసుకురాగలగాలి. వాటి పరిష్కారాలకు చట్టబద్ధతను పొందగలిగే సదవకాశమూ ఉంటుంది. తెలంగాణ వచ్చినా ఎస్సీ, ఎస్టీ కులాల రాజకీయ రిజర్వేషన్లు 22 శాతం చొప్పున (ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7శాతం) రాజ్యాంగం ప్రకారం అమలుచేయడం అనివార్యం. కానీ జనాభా దామాషా పద్ధతిన ఆలోచిస్తే వీళ్లకూ అన్యాయమే జరుగుతుంది. తెలంగాణలో ఎస్సీల జనాభా, వారి రిజర్వేషన్ల శాతానికి మించి ఉంటుంది. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అసలు అమలులోనే లేవు. బిసి రిజర్వేషన్లను ఈ సందర్భంలో ప్రస్థావనకు తీసుకురావడం ద్వారా చట్టబద్ధమైన హామీ సంపాదించవచ్చు. బీసీల జనాభా తెలంగాణలో 55 నుండి 60 శాతం వరకు ఉంది. అందువల్ల తగిన రాజకీయ ప్రాతిని«ధ్య కోటాను సాధించగలిగితే తెలంగాణ ఉద్యమంలో బీసీలు చేసిన త్యాగాలకు సార్థకత చేకూరుతుంది. బహుజన కులాల దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యాన్ని పంపిణీ చేయగలిగితే ఈ వర్గాలు సమంజస ప్రజాప్రాతినిధ్యాన్ని పొంది రాజ్యాధికారానికి చేరువవుతాయి.

ఎస్సీల్లో మాదిగల జనాభా 18 శాతానికి మించి ఉంది (మొత్తం ఎస్సీ జనాభా 22 శాతంగా ఉంటుంది). మొత్తం జనాభాలో 11 నుంచి 15 శాతం మాదిగలు ఉంటారు. కానీ ప్రస్తుతం రిజర్వేషన్లను అందులో సగానికి మించి అనుభవించలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. తెలంగాణ సమస్యపట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో, కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరింపచేయడంలో మాదిగ ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేశారు. కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ, డిసెంబర్ 9 ప్రకటనలో తన కృషిని ఇటీవల జరిగిన తెలంగాణ సాధన సభలో బాహాటంగానే ప్రకటించడం విదితమే. కోర్ కమిటీ, కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద తెలంగాణ రోడ్ మ్యాప్‌ను విశ్లేషించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బహిర్గతం చేసి, వారిని ఒప్పించడంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా చేసిన కృషి ఆమోఘం. ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీల్లో మాదిగ విద్యార్థులు వీరోచిత పోరాటాలు చేశారు. అలాగే గౌడ, యాదవ, ముదిరాజ్ కులాలతో పాటు ఎంబీసీ కులాలు ఎన్నదగిన రీతిలో తమ వంతు పోరాటం కొనసాగించాయి. తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు అంటరాని తనం సమస్య, కుల బహిష్కరణ, పేదరికం, అవిద్య వంటి సమస్యలు నేటికీ పీడిస్తునే ఉన్నాయి. అగ్ర కుల ప్రాబల్యం ఇక్కడ నిరాటంకంగా సాగుతూనే ఉంది. 13 సంవత్సరాలకు పైగా నడిచిన తెలంగాణ ఉద్యమం ఈ సమస్యలను పరిష్కరించడం కాదుకదా, కనీసం స్పృశించే ప్రయత్నం చేయలేదు.
మరో ప్రధాన సమస్య వనరుల పంపిణీ. తెలంగాణ ఏర్పాటు సందర్భంలో ఇది తేలాల్సిన సమస్య. తెలంగాణ వస్తే నీళ్లు, ప్రాజెక్టు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కానీ, భూములే లేని దళిత కులాలకు ఇవి ఎలాంటి ప్రయోజనాన్నిస్తాయి? అందుచేత భూమి పునర్ పంపిణీ జరగాలి. దీనికి చట్టబద్ధమైనహామీ కావాలి. 'తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ సమస్య లన్నింటనీ పరిష్కరించుకుందాం!' అంటూ అగ్రకులాలు చక్కిలిగింతలు పెట్టి తదనంతరం మసిపూసి మారేడుకాయ చేస్తాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తరుణంలో అగ్రకులాలు ఇదే నాటకాన్ని ప్రదర్శించి విజయవంతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను శాశ్వత బానిసత్వంలోకి నెట్టివేయడం మర్చిపోలేము కదా! డా॥ బి.ఆర్. అంబేడ్కర్ ఆశించినట్టు చిన్న ర్రాష్టాలు బహుజన కులాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. కానీ, పునర్నిర్మాణంలో ఈ సమస్యలేవీ ప్రస్థావనకు రాకుండానే కేవలం రాజకీయ పునర్నిర్మాణం ఏ రకంగానూ ఈ కులాలకు ప్రయోజనకారి కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజన కులాలు ప్రదర్శించిన పటుత్వాన్ని, వారు హక్కులు సాధించుకునే దగ్గర చూపకపోతే వారి త్యాగాలకు అర్థంలేదు. అటి వెట్టిచాకిరీయే! తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనవారిలో బహుజన కులాల వారే అత్యధికం. తెలంగాణ సాయుధ పోరాట ఫలితాలను అనుభవించిన వారిలో అగ్రకులాలే అగ్రభాగాన ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటానంతరం జరిగిన భూసంస్కరణల్లో ఎస్సీ, ఎస్టీ,బిసి కులాలకు రావాల్సినవాటా రాలేదు. అటు నాయకత్వస్థానంలో, ఇటు లబ్ధి పొందడంలో అగ్రకులాలు ఆనాడు విజయం సాధించాయి. ఈనాడూ సాధించాలని చూస్తున్నాయి.ఈ గుణపాఠాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు బడుగు బలహీన కులాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.


- కదిరి కృష్ణ
(రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్‌మెంట్ కన్వీనరు)

Surya Telugu News Paper Dated : 2/8/2013

Saturday, July 27, 2013

అగ్రకుల పార్టీలు బడుగులు స్వీయ నాయకత్వమే శరణ్యం By కదిరె కృష్ణ,


మోడీ అభ్యర్థిత్వంపై అగ్రకులాల అక్కసు!
బడుగుల ఓట్ల ఆకర్షణే బిజెపి లక్ష్యం
బంగారు లక్ష్మణ్‌ను తొక్కివేసిన బిజెపి 
జగ్జీవన్‌రామ్‌ను మోసం చేసిన కాంగ్రెస్‌ 
అవగాహనా లేమితో రాహుల్‌ గాంధీ 

అగ్రకుల పార్టీలు 2014 సాధారణ ఎన్నికల దృష్టితో ఒక నాటకం ప్రారంభించాయి. నరేంద్ర మోడీని బిజెపి, రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌- భావి ప్రధానులుగా, దేశ పరిరక్షణ శక్తులుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇందులోని కుటిల నీతిని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు పసిగట్టనట్లయితే మరొకసారి మోసానికి గురికాక తప్పదు. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి బిజెపికి ఇప్పుడు నరేంద్రమోడీ అనివార్యమైపోయారు. భారత్‌ వెలిగిపోతోంది వంటి నినాదాలు ఈ పార్టీని మరింత చీకటిలోకి నెట్టాయి. సేనాని పాత్రలో అద్వానీని ప్రజలు నిరాకరించడంతో గత్యం తరంలేక మోడీని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఇప్పుడు అభివృద్ధి, ఉగ్ర వాద శక్తుల పట్ల కఠినవైఖరి వంటివాటితో మోడీని మెరిపించాలన్నదే బిజెపి యత్నం. ఈ క్రమంలోనే మోడీని తమ ఎన్నికల కమిటీ సారథిగా బిజెపి ప్రకటించింది. బిజెపి నిండా అగ్రకుల బ్రాహ్మణులు తిష్ఠ వేసి ఉన్నారు. ప్రత్యక్షంగానే ఎస్సీ, ఎస్టీ, బిసి కులా ల అభివృద్ధి, రిజర్వేషన్ల పట్ల బిజెపి తన అక్కసు వెళ్ళబోసుకుంటోంది. 

ఈసారి బహుజనవర్గాల నాయకత్వాన్ని బిజెపిలోని అగ్రకుల నాయకులు తట్టుకోలేక పోయారు. శూద్రుడైన మోడీని నాయకుడిగా అంగీకరించడానికి మనస్కరించక అద్వానీ రూపంలో తమ స్వభావాన్ని మరోసారి వెళ్ళబుచ్చారు. అద్వానీ, మోడీ విషయంలో ప్రవర్తించిన తీరు అగ్రకుల స్వభావానికి అద్దంపట్టింది. అస్త్ర సన్యాసం చేసినట్టు ట్విట్టర్‌లో అద్వానీ నమోదు చేసుకొని కొంత వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన కొందరు నాయకులు మోడీ అవసరాన్ని చెప్పడం మూలంగా ఉక్కుమనిషి కొంత మెత్తబడ్డారు. ఇంతకీ మోడీద్వారా బిజెపి ఆశిస్తున్న ప్రయోజనమేమిటి? మోడీ ప్రధాని అభ్యర్థిత్వం ద్వారా బిజెపి పొందగలిగే లబ్ధి ఎంత? 
అభివృద్ధికి ప్రతీకగా మోడీని బిజెపి చూపిస్తున్నప్పటికీ వాస్తవంలో మాత్రం వెనుకబడిన కులాలను (బిసిలను) ఆకర్షించడానికేనని అర్థమవుతుంది. మోడీని సమర్థించడం ద్వారా బిసిలకే రాజ్యాధికారం వస్తుందనే భ్రమ కల్పించడానికి బిజెపి వేసిన ఒక ప్రమాదకర ఎత్తుగడ ఇది. అభివృద్ధి మంత్రమే నిజమైతే గుజరాత్‌- మానవాభివృద్ధి సూచికలో ఎంతో వెనుకబడి ఉంది.

అంటే మోడీ తరహా అభివృద్ధి వల్ల ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంత మాత్రం మార్పు రాలేదన్నమాట! బడా పెట్టుబడిదారులు, గుత్తేదారుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి కానేరదు. మోడీని అభివృద్ధికి ప్రతినిధిగా బిజెపి భావించడం లేదు సరికదా, ఆయనను నూటికి నూరుపాళ్లు బిసి కులాలను ఆకర్షించడానికే ఎంచుకున్నదనేది నిజం.బిసిలు మోడీని కేవలం బిజెపి నాయకుడిగానే గుర్తించినట్లు స్పష్టమవుతోంది. హిందుత్వ పార్టీలో ప్రధానమంత్రిగా మోడీ చేయగలిగేదేమీ ఉండదని, చివరికి మోడీని వాడుకొని అధికారంలోకి రాగానే అద్వాని వంటి వారిని రంగంలోకి దించే ఒక రహస్య అజెండా కూడా ఇందులో దాగిఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బిసిల ఎదుగుదల ఎంతమాత్రం అంగీకరించలేని బిజెపి, ఆరెస్సెస్‌ వంటి హిందుత్వసంస్థలు, పార్టీలు మోడీవంటి శూద్రుణ్ణి ప్రధానిగా అంగీకరిస్తా యనుకోవడం అమాయకత్వమే. బంగారు లక్ష్మణ్‌ను ఎలా బలిపశువును చేశారో విదితమే. సమాజాన్ని హిందూ జాతీయవాద కోణంలో దర్శించే బిజెపిని బహుజనులు నమ్మడం లేదు. బ్రాహ్మణీయ శక్తుల కుట్రలను గ్రహించలేని కొందరు బిజెపి కుట్రకు బలయ్యే అవకాశమూ లేకపోలేదు. 

బాబూ జగ్జీవన్‌రామ్‌ (చమార్‌)కు ప్రధానిగా అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తే, బంగారు లక్ష్మణ్‌ కింది వర్గాలను ఆకర్షించి ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావచ్చనే కారణంతో ఇటు రాజకీయంగా, అటు సామాజికంగా కోలుకోలేకుండా తొక్కివేసింది బిజెపి. ఇటువంటి పార్టీల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు కీలుబొమ్మలుగానో, అంబేడ్కర్‌ పరిభాషలో ‘బలమైనకుక్కలు(మజిల్‌డాగ్స్‌)’గానో, కాన్షీరాం మాటల్లో ఏ ‘చెంచాలు’గానో ఉంటారేతప్ప స్వతంత్ర నిర్ణాయక శక్తులుగా తమ జాతిని బానిసత్వంలోనుంచి విముక్తి చేస్తారనుకోవడం భ్రమ. మరో ప్రధానఇభ్యర్థి, కాంగ్రెస్‌పార్టీ 2014 ఐకాన్‌ రాహుల్‌ గాంధీ స్వభావరీత్యా అమాయకుడు. కాంగ్రెస్‌ పార్టీలోని బ్రాహ్మణ నారదబృందం ఇతనితో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శింపచేస్తోంది. తెరవెనుక రిహార్సల్స్‌ ఎంత పకడ్బందీగా జరిగినా పార్లమెంటులో పట్టు మని పదినిమిషాలు సొంత శైలి, సొంత దృక్పథాన్ని కనబరచడంలో విఫలమైన వీరుడు! సంపన్నుడిగా పుట్టి, సంపన్నదేశాలలో పెరగడం మూలంగా ఆయనకు భారతీయ జీవితం, పరిస్థితులు ఓపట్టాన అర్థం కావడం లేదు.

ఇదే పరిస్థితి రాజీవ్‌గాంధీకి దాపురించింది. అంచేత రాజీవ్‌ నిర్ణయాలన్నీ అసంబద్ధంగా, అవగాహనా రాహిత్యంతో ఉండేవి. బోఫోర్స్‌, తమిళఈలం వంటఇంశాల్లో ఆయన నిర్ణయాలు, పాత్ర వివాదాస్పదమయ్యాయి. రాహుల్‌గాంధీలో ఈ దోషాన్ని నివారించేందుకు దేశవ్యాప్తంగా పర్యటనలు చేయించారు. పాపం! రాహుల్‌ వాటిని విహార యాత్రల్లా భావించాడేమో కానీ, ఆయనలో ఈ దేశ స్థితిగతులపట్ల ఎంతమాత్రం అవగా హన పెరగలేదు. రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన ప్రతి రాష్ర్టంలో కాంగ్రెస్‌పార్టీ ప్రతికూల ఫలితాలనే చవిచూడాల్సి వచ్చింది. రాహుల్‌ హిందుత్వ టెర్రరిజాన్ని తూర్పారబట్టి మైనారిటీ, లౌకికవాదులను ఆకర్షించా లనుకుంటారు. తదనంతరం ఎదురయ్యే ప్రతీఘాతాలను తట్టుకోవడానికి ఆయన రాజకీయ అవగాహనాస్థాయి సరిపోవడం లేదు. ఈదేశంలో ఎంతో వెనుకబాటుతనముంది, స్వాతంత్యం వచ్చి అర్థశతాబ్ది గడిచినా పేదరికం విపరీతంగా పెరిగిపోతోందని బాధపడతారు.

ఇలాంటి దేశంలో పుట్టినందుకు సిగ్గుగా కూడా ఉందని మరీ వాపోతాడు. కాని, స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన వారు తన వంశీకులేనని, ఈ వెనుకబాటుతనానికి కారణం తన తాత ముత్తాతల ఘనతేనని విమర్శ రావడంతో నాలుక కరచుకుంటారు. బిజెపి బాహాటంగానే బ్రాహ్మణీయ అగ్రకుల శక్తులను సమర్థిస్తే కాంగ్రెస్‌ పార్టీ నిగూఢంగా అదేపనిని అంతకంటే ఎక్కువే చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా బ్రాహ్మణులతో నిండి కళకళ లాడుతుంటుంది. ప్రత్యేకంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ఉండే అభిప్రాయమే (అణచివేత) రాహుల్‌కు ఉంటుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌లో తలపండిన నాయకులవద్ద యువరాజుకు తర్ఫీదుజరిగింది. కాబట్టి గతంలో కాంగ్రెస్‌పార్టీ ఎస్‌సి,ఎస్‌టి, బిసిలను అణచివేసినట్లే ఈయన ఆలోచనాధోరణి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఓటు బ్యాంకును వాడుకొని బ్రాహ్మణీయశక్తుల స్వార్థప్రయోజనాలను నెరవేర్చడానికి రాహుల్‌గాంధీ ఉపయోగపడతాడు. బహుజన సమాజానికి ఉపయోగపడేదేమీ ఉండదు. 

మొత్తంగా రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యవాదో, తల్లివాదో, తాతవాదో అర్థం కాకుండా ఒక నీడలోని మానవాకారాన్నిపోలి, ఒక గందరగోళ వ్యక్తిత్వంగా మిగిలిపోయి ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ‘ఇప్పుడు రాహుల్‌ ప్రధాని పదవికి అర్హుడు’ అంటూ ప్రకటించారు. ప్రధాని పదవికి అర్హతలు పొందడం అంటే- కాంగ్రెస్‌ పార్టీ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, పన్నాగాలు నేర్చుకోవడమే. రాహుల్‌ గాంధీ బిసిలకు రిజర్వేషన్లను వ్యతిరేకించిన గాంధీ వారసుడు. దళితులను నాయకత్వ స్థానంలో చూడజాలని అగ్రకులతత్వ పార్టీ నేత అవుతాడే గానీ బహుజనుల ఆశాజ్యోతి ఎంత మాత్రం కాడు. నూటికి ఎనభైశాతం మంది ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కాలేకపోతున్నారు. రోజుకు రూ. 33 సంపాదనను ఇక్కడ గొప్ప అభివృద్ధిగా చూపిస్తున్నారు. 

నూతన ఆర్ధిక విధానాలతో మేడిపండు చందంగా ఉన్న అభివృద్ధి, ఆహార లోపంతో బాల్యం, నిరుద్యోగ నిస్పృ హలో యువత! దీనికి తోడు రోజుకో కుంభకోణం, మహిళల అభద్రత వెరసి తీవ్ర నైరాశ్యంతో దేశప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక సామాజిక వ్యవస్థ పట్ల అవగాహన, అంకితభావం ఉన్న నాయకత్వాన్ని అందించగల శక్తులు బహుజనులే. 
బహుజన శక్తుల ప్రతినిధిగా మరో ప్రధాని అభ్యర్థి బహుజనసమాజ్‌ పార్టీ నేత మాయావతి. ఆమె- కాన్షీరాం వారసురాలు. రాజ్యం ముఖం ఎరుగని ఎరుకల, మేథరి, చాకలి, కుమ్మరి వంటి అత్యంత వెనుకబడిన కులాల వాళ్లను అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపించిన ఘనత కాన్షీరాంది. అలాంటి బహుజన తాత్వికుల ప్రతిరూపం మాయావతి. బహుజన కులాల అభివృద్ధి పట్ల నిబద్ధత ఉన్న నిజమైన ప్రతినిధి. బహుజన కులాల నేతృత్వంలో అక్కడ బ్రాహ్మణవర్గాలను నడిపించడం ఆమె రాజకీయ చతురత. బ్రాహ్మణీయ కులాల వాటానే వారికి రిజర్వేషన్లుగా ఇస్తున్నారు. 

సాంసృ్కతికంగా, రాజకీయంగా సంస్కరణలకు పునాదులువేస్తూ ఆర్థిక పటిష్ఠతను బహుజన కులాలు పొందగలిగినప్పుడే సామాజిక సమానత్వం సిద్ధిస్తుంది. బహుజనుల్లో సాంసృ్కతిక విప్లవం జనించడాన్ని కాంగ్రెస్‌, బిజెపి తదితర బ్రాహ్మణవాద పార్టీలు జీర్ణించుకోలేవు. బ్రాహ్మణవాదాన్ని మోస్తూ తమ అడుగులకు మడుగులొత్తే బహుజన కులాల నాయకత్వాన్ని పెంచి పోషించేందుకు బ్రాహ్మణ పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయి. మహిళలను, ఆర్థిక రంగానికి వెలుపలఉన్న 70 శాతం ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను ఆర్థికరంగంలో భాగస్వాములను చేయడం సాంసృ్కతిక విప్లవంలో ప్రధానభాగం. కాంగ్రెస్‌, బిజెపి పార్టీల మాదిరిగా బహుజనులు తమ నాయకులను, సిద్ధాంతాన్ని ప్రొజెక్టు చేయడంలో ముందుకు రావాలి. మోడీని, రాహుల్‌గాంధీని ప్రమోట్‌ చేసుకునేందుకు అగ్రకుల బ్రాహ్మణవర్గాలు చూపే ఉత్సుకత, ఆరాటం బహుజన కులాలనుంచి లోపించింది. ఒక స్వతంత్ర నాయకత్వాన్ని సాధించుకొని, సొంతం చేసుకునే తత్వాన్ని బహుజనులు అలవర్చుకోవాల్సి ఉన్నది.

రాజ్యంపై కాంక్షలేనిదే, రాజకీయ స్పృహ లేనిదే అధికారం కల్ల. రాజ్యాధికారం (స్వతంత్ర) లేనిదే కులబానిసత్వం, వెనుకబాటుతనం నిర్మూలన సాధ్యంకాదు. ఇవన్నీ సాధించేందుకు బహుజనుల్లో చైతన్యం రావడానికి ఉధృతంగా ఉద్యమాలు చేయవలసిన చారిత్రక సందర్భమిది. ఈ ఉద్యమాలకు త్యాగాలవసరమవుతాయి. ఆ త్యాగాలను రిజర్వేషన్ల ఫలితాలు అనుభవిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, నాయకులే చేయాల్సి ఉంది. బహుజన పితామహుల స్ఫూర్తిని గ్రహించి 2014 ఎన్నికలకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు సమైక్యంగా పోరాడితే తప్ప బహుజన రాజ్యం సిద్ధించదు. బహుజన రాజ్యం రానిదే విముక్తి లేదు.

రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్‌ మూవ్‌మెంట్‌ కన్వీనర్‌



Surya Telugu News Paper Dated : 27/07/2013

Wednesday, July 17, 2013

ప్రమోషన్లలో కోటా By కదిరె కృష్ణ మూలవాసీ బహుజన లిబరేషన్‌ మూవ్‌మెంట్‌ కన్వీనర్‌


సమానత్వం రాజ్యాంగ హక్కు 
రిజర్వేషన్లలో బిసిలకు అన్యాయం
వాటా అడ్డంకొట్టేందుకు అగ్రకుల కుట్రలు
ప్రాథమిక హక్కులకోసం పోరాటమే మార్గం 
ప్రమోషన్లలో కోటా అనివార్యం 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 16 ప్రాథమిక హక్కుల్లో భాగం. ఆర్టికల్‌ 14 సమానత్వాన్ని, ఆర్టికల్‌ 15 వెనుకబడిన, ఇతర వెనుక బడిన తరగతులకు విద్యారంగంలో రిజర్వేషన్లు, ఆర్టిక ల్‌ 16 ఉద్యోగరంగంలో పదోన్నతుల్లో రిజర్వేషన్లను ప్రసాదించాయి. ఈ రాజ్యాంగ ప్రకరణలు ప్రాథమిక హక్కులు అవటాన వీటిని కుదించే లేదా తొలగించే అధికారం ఇటు పార్లమెంటుకు గాని, అటు ఏకోర్టుకూ గానీ లేదని భారత రా జ్యాంగం నిర్దిష్ఠంగా పేర్కొన్నది. కోర్టులు- పార్లమెంటు ద్వారా చేసిన శాసనాలు రాజ్యాంగబద్దమైనవా, కావా అని నిర్ధారిస్తాయి. ప్రాథమిక హక్కుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం వీటికి లేదని రాజ్యాంగం చెప్పినా అడపా దడపా ఈ ఆర్టికల్స్‌ కోర్టుల జోక్యానికి గురవు తున్నాయి. ఆర్టికల్‌ 14 సమానత్వాన్ని ప్రదిపాదిస్తే మరి రిజర్వేషన్లు ఏమిటి అని అగ్ర వర్ణాలు ఒక వాదనను వినిపిస్తున్నాయి. అందరు సమానమైనప్పుడు కొందరికే రిజర్వేషన్లు ఏమిటనే అవగాహనా రహితమైన వాదనను ముందుకు తెస్తున్నాయి. 

ఆర్టికల్‌ 14 ప్రకారం సమానత్వం అంటే అసమానత్వాన్ని రూపు మాపి ఏ వర్గాలు అసమానత్వానికి గురయ్యాయో ఆ వర్గాలను ప్రధాన స్రవంతితో సమం చేయడమే నని అదే ఆర్టికల్‌లో పొందుపరచిన విషయాన్ని ఈ వర్గాలు పక్కదారి పట్టిస్తున్నా యి. ఒక వ్యక్తికి యాభై కేలరీల శక్తి కావాల్సినప్పుడు అప్పటికే శక్తిమంతుడైనవానికి యాభై, శక్తిహీనుడికి 60 కేలరీలు ఇస్తే వారిద్దరు సమానమవుతారు. ఇది సమాన త్వం సూత్రంలో దాగి ఉన్న మర్మం. అందుకే సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన తరగతులకు, మరింత వెనుకబడిన తరగతు లకు రిజర్వేషన్ల కల్పన అనివార్యమయింది. దీన్నే రాజ్యాంగం ఆర్టికల్‌ 14 అంటేనే అసమానతల నిర్మూలన అనే నర్మగర్భమైన అర్థాన్ని వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 15(4) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు విద్యారంగంలో రిజర్వేషన్లు అందాయి. దీన్ని వివాదాస్పదం చేయడానికి అగ్రకుల పాలకులు- ఈ రిజర్వేషన్లు పొందేవారు విద్యాపరం గానే కాక, సామాజికంగానూ వెనుబడి ఉండాలని మెలికపెట్టారు. 

ఈ కారణం చేతనే ఓబిసీలు 2008వరకు విద్యారంగంలో రిజర్వేషన్లకు నోచుకోలేదు. 2008లో ఓబిసీలకు విద్యారంగంలో రిజర్వేషన్లు కల్పించేక్రమంలో అగ్రవర్గాలు చేసిన రాద్ధాంతం బీసీ నాయకులెవ్వరికీ స్పర్శ కలిగించలేదు. ఇప్పటికే కేంద్రస్థాయి విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల సౌకర్యాన్ని తొలగించడం జరిగింది. నవరత్నాల వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో బీసీలకే కాదు ఎస్సీలకు కూడా దిక్కు లేదు. ఆర్టికల్‌ 16(4)ను పొందుపరచడంద్వారా వెనుకబడిన కులాలకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు లభించాయి.అంతేకాక ప్రమోషన్లలో రిజర్వేషన్లనుకూడా ఇదే ఆర్టికల్‌ అందిస్తుంది. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న వెనుకబడిన కులాలు ఎవరు అనే ప్రశ్న లేవనెత్తారు. ఎస్సీ,ఎస్టీలు వెనుకబడినారనే కారణంచేతనేకదా వాళ్లకు రిజర్వే షన్ల సౌకర్యం కల్పించింది, వారే వెనుకబడిన కులాలైనప్పుడు, ఇతర వెనుకబడిన కులాలు ఏమిటంటూ వితండవాదానికి దిగుతున్నారు.

డా బి.ఆర్‌.అంబేడ్కర్‌- ‘షెడ్యూల్డు కులాలు అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవని ప్రకటించడం (షెడ్యూలు)అని, షెడ్యూల్డు కులాలేకాక మరికొన్ని కులాలు (ఓబిసి) వెనుకబడి ఉన్నాయి’ అని నిర్వచించాడు. అర్థమయ్యేదేమంటే శూద్రకులాలను ఓబిసీలుగా, అతిశూద్ర కులాలను ఎస్సీలుగా పరిగణించాలనే భావనను డా అంబేడ్కర్‌ భారత రాజ్యాంగంలోనే పొందుపరిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వచ్చినదే ఆర్టికల్‌ 340. ఈ ఆర్టికల్‌ద్వారా ఓబిసిలు ఏయే కులాలో నిర్వచించి, గుర్తించడానికి ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. మాన్యశ్రీ కాన్సీరాం 50 రోజుల నిరాహారదీక్ష చేసి ఆనాటి అగ్రకుల ప్రభుత్వాన్ని నిలదీసిన ఫలితంగా1979లో వచ్చిన మండల్‌ కమిషన్‌ ‘ఓబిసీలు అనగా ఎస్సీ, ఎస్టీలు కాక ఇంకా మిగిలి ఉన్న సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిన కులాల ప్రజలు’ అంటూ నిర్వచించింది. 

ఈ స్పష్టత వచ్చి ఓబిసీలకు ఉద్యోగరంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి 42 సంవత్సరాలు పట్టింది. ఇందులో భాగంగానే 1992-93లో ఓబిసీలకు ఉద్యోగరంగంలో కేంద్రస్థాయిలో 27 శాతం, రాష్ర్ట స్థాయిలో 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇది జీర్ణించుకోలేని అగ్రకులాలవారు ఆర్టికల్‌ 16ను సవాల్‌ చేస్తూ కోర్టుకెక్కారు. ఆర్టికల్‌ 16(4) ప్రకారమే 1955 నుండి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు ఉద్యోగరంగంలో రిజర్వేషన్లు కల్పించడంతో ప్రమోషన్లలోకూడా రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందనే భయంతో ఈ కుట్ర చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు- ఆర్టికల్‌ 16 ఉద్యోగ నియామక సందర్భంలోనే రిజర్వేషన్లను అనుమ తిస్తుందని, ప్రమోషన్ల విషయంలో వర్తించనేరదని- 1997లో తీర్పునిచ్చింది. ప్రాథమిక హక్కులను వ్యాఖ్యానించే లేదా జోక్యంచేసుకునే హక్కు తమకుందనికూడా సుప్రీంకోర్టు వెలువరించింది. 

1997లో ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా వాజ్‌పేయ్‌ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16వ ఆర్టికల్‌కు 4ఎ ను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పరిమితంచేసింది.ఈ దరిమిలా ఓబిసిలు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కోల్పోయేటట్లు చేయడంలో అగ్రకుల శక్తులు విజయవంతమయ్యాయి. అంబేడ్కర్‌ బిసి కమిషన్‌ కోసం రాజీనామా చేయడం, ప్రముఖ బిసి నాయకుడు ఆర్‌.ఎల్‌. చందాపురి నాయకత్వంలో ఉద్యమం చేపట్టడంతో అనివార్యమైన పరిస్థితుల్లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ బిసి కులాలను గుర్తించడం కోసం 1962లో కాకా కలేల్కర్‌ కమిషన్‌ను నియమించి బిసి కులాలకు రిజర్వేషన్ల ఆవశ్యకతను ఆ కమిషన్‌ నొక్కివక్కాణించడంతో తిరిగి కలేల్కర్‌ ద్వారానే ఆ నివేదికను నిర్వీర్యం చేశాడు. 

ఇది బిసి రిజర్వేషన్లపై మొదటి అధికారిక కుట్ర. మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తారేమోననే భయంతో పశ్చిమ భారతంలో మత కల్లోలాలు సృష్టించి మరోసారి ఈ సమస్యను మరగుపరచేలా చేశారు. అగ్రకులవర్గాలు తమ అక్కసును వెళ్లగక్కుతూ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించడం జగమెరిగిన సత్యమే. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్లున్నాయి. ఒకవేళ ఓబిసిలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే, సుమారు 34 శాతం మంది ప్రతినిధులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రవేశిస్తారు. అప్పుడు 56 శాతం ప్రతినిధులు బహుజనవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించడంద్వారా ఆ జాతి ప్రయోజనాలు నెరవేరి రాజ్యాధికారంలోకి వస్తారు. 

ఆధిపత్య అగ్రకులాలు చట్టాన్ని, కోర్టులను ఉపయోగించుకుంటూ బహుజనవర్గాల హక్కులను కాలరా స్తుంటాయి. కొందరు ఓబిసి మేధావులే- చట్టసభల్లోనే రిజర్వేషన్లు లేవంటే ప్రమోషన్లకు రిజర్వేషన్లు ఏమిటని వెటకారాలాడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకైనా, బీసీలకైనా చట్టసభలలో రిజర్వేషన్లు పార్లమెంటు చట్టంద్వారా లభించవలసిందే కానీ, విద్య ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్ల కల్పన ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదని, అది భారత రాజ్యాంగంద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కు అని గ్రహించాలి. ఈఅధునాత కంప్యూటర్‌ యుగంలో 54 శాతానికి పైగా ఉన్న మెజార్టీ జనాభాకు అన్యాయం జరుగుతుంటే కోర్టుల చెవికెక్కడం లేదు, ఇటు స్వజాతి నాయకులకు, మేధావులకు చీమకుట్టనట్లు కూడా లేకపోవడం దుఖఃకరం. అణగారినవర్గాలు తమకు రావాల్సిన హక్కుల కోసం కోర్టుకెక్కితే రాని స్పందన, వారి హక్కుల్ని కాలరాయడానికి మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో వస్తుంది. కారణం, న్యాయరంగంలోనూ బ్రాహ్మణీయ వర్గాల ఆధిపత్యం తిరుగులేని విధంగా ఉండడమే. 

కాన్షీరాం ‘కోర్టులుకూడా బ్రాహ్మణ అగ్రహారాలుగా మారిపోయాయి’ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఒక వైపు ఎంబిసీలు- సోదర కులాలద్వారా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్లను వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి చెందిన ఎస్సీ బీసీ కులాలు స్వార్థ ప్రయోజనాలకులోనై రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీస్తూ మిక్కిలి అణగారిన కులాలను అణచివేసు ్తన్నాయి. అగ్రకులాల కంటే తమ సహకులాలతోనే ఎక్కువ నష్టపోతున్నామని ఎంబీసీ, ఎంఎస్‌సీ (మోస్ట్‌ షెడ్యూల్డుకులాలు, మాదిగలు) కులాలు తమ నిరసనస్వరాన్ని పెంచుతున్నాయి. మరోవైపు ఇన్ని సంవత్సరాల రిజర్వేషన్లలో పేరుకు 27 శాతం అయినా అమలు జరిగింది మాత్రం 6 శాతమే. ఈ 6 శాతం ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు లభించకుండా కుతంత్రం గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఆర్టికల్‌ 16(4) ప్రకారం ఓబిసిలు ఉద్యోగ కల్పనలోనూ, ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు పొందడమనేది ప్రాథమిక హక్కుగా సంక్రమించ వలసిఉంది.

ఓబిసిలు చట్టసభల్లో రిజర్వేషన్లు పొందకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అన్యాయం చేస్తే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను పూర్తిగా నీరుగార్చిన ఘనత బిజెపి హిందుత్వ పాలకులకు దక్కింది. ఈ నేపథ్యంలో ఓబిసి వర్గాలనుండి ఆనాడే తీవ్ర ప్రతిఘటన వచ్చిఉంటే ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఓబిసి రాజకీయ ప్రతినిధులు అగ్రకుల పాలకపక్షాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఈ దుస్థితిని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటికే ఇంటికుంపటితో నలిగిపోతున్న ఓబిసిలకు పాలకపక్షాల నిర్ణయాలు మూలిగేనక్కమీద తాటిపండు పడ్డ చందంగా మారాయి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు నిరాకరించడం మూలంగా 1,26,000 ఉద్యోగాలు కోల్పోతే, రూ. 1,10,000 కోట్ల ఆదాయాన్ని ఓబిసీలు కేంద్ర సర్వీసు ల్లో కోల్పోవలసి వచ్చింది. ఈ 1,26,000 ఉద్యోగాలు అగ్రకులాలు అప్పనంగా కాజేశాయి.

దీనికంతటికీ కారణం బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన 77వ రాజ్యాంగ సవరణ.ఇది క్లాస్‌ 1 ఉద్యోగులకు సంబంధించిన సమాచారం మాత్రమే. క్లాస్‌ 4,3,2 ఉద్యోగాల్లో ఓబిసిలకు జరిగిన అన్యాయం పూడ్చలేని విధం గా ఉన్నది. ఇక రాష్ర్ట ప్రభుత్వ సర్వీసుల్లో ఇంతకంటే ఘోరంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటికీ క్లాస్‌ 3 ఉద్యోగులు లేని కులాలు కోకొల్లలుగా ఉన్నాయి. యూనివర్శిటీ గడపతొక్కని కులాలు ఇటు ఎస్సీల్లో, అటు బీసీల్లోనూ లెక్కలు మిక్కిలిగానున్నాయి. పరిస్థితిఇలా ఉంటే సుప్రీంకోర్టు గత 2012 ఏప్రిల్‌ 27న ఎస్సీఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ ఒక తీర్పు వెలువరించింది.
ఎస్సీ ఎస్టీలు ఈ తీర్పు ద్వారా కోల్పోయిన ప్రమోషన్లలో రిజర్వేషన్లను తిరిగి కల్పించడానికి ఇప్పుడున్న యుపిఏ ప్రభుత్వం 117వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

ఈ బిల్లులో పూర్వమున్న ‘సరియైన ప్రాతినిధ్యం’ అనే క్లాజ్‌కు బదులుగా ‘రిజర్వేషన్ల శాతం ప్రకారం’ అనే క్లాజును చేర్చి సవరణ చేయడం ద్వారా ఆర్టికల్‌ 16ను సవరించనుంది. దీంతో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సిద్ధించే అవకాశం ఉంది. సమస్యల్లా ఓబీసీలదే. ఓబీసీలు బ్రాహ్మణీయ శక్తులను తమ భుజాలపై మోసినంతకాలం వారి హక్కుల్ని కాలరాస్తూనే ఉంటారు. ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగకుండా, రాజకీయ ప్రాతిని ధ్యాన్ని పెంచుకోకుండా వీరి సమస్యకు పరిష్కారం లభించదు. మహాత్మాగాంధీని నమ్ముకోవడంతో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో బీసీలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగ పరిషత్తులో ఒక్క బిసి కులాల ప్రతినిధి కూడా లేకుండానే రాజ్యాంగనిర్మాణం జరిగింది. 

ఆ సందర్భంగా బీసిల రిజర్వేషన్లసమస్యను అంబేద్కర్‌ మాత్రమే చర్చకుతీసుకురా గలిగాడు. అయినా అగ్రకులాల ఆధిపత్యంలో గొంతులు నొక్కివేశారు. రాతియు గానికి ప్రతినిధులైన వడ్డెరలు, మట్టియుగానికి ప్రతినిధులైన కుమ్మరులు, రజకులు, లోహయుగానికి మూలకారకులైన మంగలివంటి వెనుకబడిన కులాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాజ్యాంగంద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను తిరిగిపొందినప్పుడే సామాజికన్యాయం. బిసివర్గాలుఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా పొందవలసిన వసతులను పొందగలుగుతారు. 

Surya Telugu News Paper Dated : 17/06/2013