Monday, December 7, 2015

వికలాంగుల రాజ్యాంగబద్ధ హక్కులు


( నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం)ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించి సమాజ పురోగమనంలో ప్రజలందరి మానసిక, శారీరక సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధికి బాటలు వేయాలంటే ప్రజలందరి భాగస్వామ్యమే కీలకం. కానీ ఈ సమాజ అభివృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం లేకపోవడంవల్లనే సంపూర్ణ అభివృద్ధి జరగడం లేదు. దీనికి ప్రధాన కారణాల్లో వైకల్య సమస్య కూడా ఒకటి అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించడం ద్వారా వారి మానసిక, శారీరక శక్తి సామర్థ్యాలు సమాజ అభివృద్ధిలో మిళితం చేయాలనే లక్ష్యంతో 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ఐరాస ప్రక టించింది. అందులో భాగంగానే అనేక దేశాలు వికలాం గులను విలువైన మానవ వనరులుగా గుర్తించి వారికి అనేక చట్టాలు, అంతర్జా తీయ ఒడంబడికలు, హక్కులు కల్పించాయి.

ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వికలాంగుల హక్కులు పక్కాగా అమలుపరిచి వాటి ఫలితాల వల్ల అభివృద్ధి రథంపై దూసుకుపోతున్నాయి. కానీ భారతదేశం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వికలాంగుల ఒడంబడికను ఆమోదించినా, వికలాంగులకు ఎన్నో చట్టాలు చేసినా వాటి అమలు అంతంతమాత్రంగానే ఉండటానికి ప్రధాన కారణం వాటి పట్ల వికలాంగులకు, ప్రభుత్వ యంత్రాంగానికి అవగాహన లోపించడమే ప్రధాన కారణం. కనుకనే డిసెంబరు 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా భారతదేశం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ద్వారా వికలాంగులకు కల్పించని హక్కులపై ఈ ప్రత్యేక వ్యాసం.

రాజ్యాంగం ద్వారా వికలాంగులకు సంక్రమించిన హక్కులు :
1. 14వ అధికరణ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే.
2. 15(1) అధికరణం ప్రకారం పౌరులపై జాతి, మతం, లింగం, పుట్టుక ఆధారంగా ఎలాంటి వివక్ష ప్రదర్శించడానికి వీలు లేదు.
3. 16(2) అధికరణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులపై జాతి, లింగం, పుట్టుక, వారసత్వం, స్థిర నివాస ప్రాతిపదికన వివక్ష ప్రదర్శించరాదు.
4. 21(ఎ) అధికరణ ప్రకారం విద్యా హక్కును 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21(ఎ) ప్రకరణలో చేర్చారు. దీని ప్రకారం 6 - 14 సంవత్సరాల వయస్సుగల వారందరికి ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1న దేశవ్యాపితంగా అమలులోకి వచ్చింది. దేశంలో వున్న వికలాంగ పిల్లలకు కూడా ప్రాథమిక విద్య అనేది హక్కుగా ఏర్పడింది.

5. 29 (2) అధికరణ ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వం ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో ప్రవేశానికి జాతి, మతం, కులం, భాషా ప్రాతిపదికపై వివక్ష చూపరాదు.
6. 41వ అధికరణ ప్రకారం నిరుద్యోగులకు, వృద్ధులకు వికలాంగులకు జీవన భృతి కల్పించాలి.
వీటితో పాటుగా జీవించేహక్కు, భాగస్వామ్య హక్కు, తదితర హక్కులు రాజ్యాంగబద్ధంగా పౌరులందరికి కల్పించిన హక్కులే. కానీ 15(1), 16(2) అధికరణలో వైకల్యం అనే పదం వీటిలో చేర్చకపోవడం మూలంగా ప్రభుత్వం ఎన్ని చట్టాలు, జిఓలు చేసినా వాటి అమలు తీరు అంతంతమాత్రంగానే ఉంటోంది.

పార్లమెంటు చేసిన చట్టాలు
ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించిన అనంతరం భారతదేశం వికలాంగుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించి అనేక చట్టాలు చేసింది.
ఎ. మెంటల్ హెల్త్ యాక్ట్ : మానసిక వికలాంగుల ఆరోగ్యం వారి జీవన ప్రమా ణాలు మెరుగుపరిచేందుకు, కావాల్సిన చికిత్స అందించేందుకు మరియు వారిని సంరక్షించేందుకు, వారి ఆస్తులను రక్షించేందుకు 1993లో మెంటల్ హెల్త్ యాక్ట్ రూపొందించారు.. దీని ప్రకారం మానసిక వికలాంగులకు రక్షణ, పునరావాస సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో సంస్థలను ఏర్పరిచే అవకాశం చట్టపరంగా ఏర్పడుతుంది. ఈ చట్టం ఉన్నా అమలు జరగడంలేదు.

జాతీయ ట్రస్టు చట్టం : ఆటిజం, సెరిబ్రల్ పాల్సి, బుది ్ధమాంద్యం, బహుళ అంగ వైకల్యాలతో బాధపడేవారి కోసం రూపొందించినదే ఈ జాతీయ ట్రస్టు చట్టం. ఇది దేశవ్యాప్తంగా 1999లో అమల్లోకి వచ్చింది. మానసిక, అంగ వైక ల్యం కలిగిన వికలాంగులకు జీవితాంతం ఆసరా ఇవ్వడానికి వారి తల్లిదండ్రుల తదనంతరం వికలాంగులను ప్రధాన స్రవంతిలో భాగస్వాముల్ని చేయడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. ఈ బోర్డుకు ఛైర్మన్ కూడా లేకపోవడం వల్ల అమలు పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది.
వికలాంగుల చట్టం 1995 (సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం) : ఈ చట్టం వికలాంగులలో కొత్త ఆశలు చిగురింపచేసింది. వైకల్య నిర్వచనం, కేంద్ర రాష్ట్ర సమన్వయ కమిటీల ఏర్పాటు, వైకల్యాల ప్రారంభ దశ, నిరోధక చర్యలు, వికలాంగులకు విద్యా హక్కు, ఉపాధికి సమాన గౌరవం, గుర్తింపు, సంస్థల స్థాపన, వివక్ష నిర్మూలన, సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, సాంఘిక చైతన్యం, ఎన్‌జిఓల గుర్తింపు, పని నాణ్యత, వైకల్యంగల వారి కోసం పనిచేసే సంస్థల ఏర్పాటు చేయాలన్న అంశాలు వంటి వాటితో ఉంది. ఈ చట్టం కూడా పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడం మూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానం పదేపదే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఐక్యరాజ్యసమితి (యూఎన్‌సిపిఆర్‌డి) వికలాంగుల ఒప్పందం పత్రం:
భారత ప్రభుత్వ కేబినేట్ సిఫారసులతో 2007 అక్టోబరు 1న రాష్ట్రపతి దీనిని ఆమోదించారు. అప్పటి నుండి యుఎన్‌సిపిఆర్‌డి ఒప్పంద పత్రం అమలౌతోంది. వికలాంగులు ప్రధానంగా ఇతరులతో సమానంగా జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, స్వేచ్ఛను అనుభవించే హక్కు, ప్రోత్సాహకాన్ని అందిస్తూ, భద్రతను కల్పిస్తూ వికలాంగుల్లో స్వాభిమానాన్ని పెంచడమే ఈ ఒప్పంద ముఖ్యోద్దేశం.
వికలాంగులకు విద్య చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవశపెట్టిన పథకాలు :
1. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ) :
2000-01 విద్యా సంవత్సరం నుండి సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం కోసం 6 - 14 సంవత్సరాల బాల బాలికలకు ప్రాథమిక విద్యనందించేందుకు ఈ పథకం రూపొందించారు. ఇది వికలాంగులైన పిల్లల విద్యపై దృష్టిసారించింది.

2. ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్ :
ఈ పథకం 2009 - 10 విద్యా సంవత్సరంలో ప్రారంభమైంది. 9వ తరగతి నుండి ఇంటర్‌మీడియట్ వరకు సమ్మిళిత విద్యనభ్యసిస్తున్న వికలాంగ విద్యా ర్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
3. యుజిసి, సిబిఎస్ఇ, ఇంటర్‌బోర్డులు, ఎస్ఎస్‌సి బోర్డులు :
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అన్ని ర్రాష్టాల్లోని ఇంటర్‌మీడియట్ బోర్డులు, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులు, వికలాంగ విద్యార్థులకు విద్యా సంస్థలు అవరోధ రహితంగా ఉండాలని,దానికి సంబంధించి వివిధ పథకాలతో యూజీసీ దీనిని జారీ చేసింది. పిడబ్ల్యుడి చట్టం అమలులో భాగంగా విశ్వవిద్యాలయాల్లో 3 శాతం విద్య, ఉద్యోగాలు భర్తీ, తదితర అనేక ఉత్తర్వులు యుజిసి జారీ చేసింది. కానీ వికలాంగుల హక్కుల్ని విశ్వవిద్యాలయాల అధికారులు నిర్లక్ష్యం చేయడం మూలంగా యుజిసి అందించిన హక్కులు వికలాంగులు పొందలేకపోతున్నారు.

4. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా : వికలాంగులకు బోధించడానికి గాను, బోధకులను తయారుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే నూతన స్వతంత్ర సంస్థను ఏర్పరచింది. ఈ సంస్థ స్పెషల్ బిఇడి, డైట్, యం.ఇ.డి, యం.ఫిల్, పిహెచ్‌డి కోర్సుల ద్వారా వికలాంగులకు బోధకులను తయారుచేస్తుంది.
5. దీన్‌దయాల్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీం (డిడిఆర్ఎస్) : ఈ పథకం ద్వారా వికలాంగుల విద్య కోసం కృషి చేసే పరభుత్వేతర సంస్థలకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ స్కీం ద్వారా 11వ పంచవర్ష ప్రణాళికలో రూ.364.10 కోట్లు 586 ఎన్‌జిఓ సంస్థలకు అందించింది.

6. నేషనల్ హ్యాండికాప్డ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎఫ్‌డిసి)
వైకల్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా వికలాంగులకు స్వయం ఉపాధి, నైపుణ్యం పెంపు, ఉన్నత విద్యనందించడానికి ఎన్‌హెచ్ఎఫ్‌డిసి అనే సంస్థను ఏర్పరచి కృషి చేస్తోంది.
7. రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌లు : రిసర్చ్ చేసే వికలాంగ స్కాలర్స్ కొరకు ప్రతి విద్యా సంవత్సరం 200 మందికి ఫెలోషిప్‌లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ ఫెలోషిప్ ద్వారా నెలకు 25 వేల రూపాయలతోపాటుగా హెచ్ఆర్ఎ, స్రైబ్ ఆలవెన్సులు కూడా ఇస్తారు.
8. దేశ వ్యాపితంగా వికలాంగుల కోసం 7 జాతీయ సంస్థలను ఏర్పరచి వాటి ద్వారా వికలాంగుల సమస్యలపై పరిశోధనలు, విద్య, పునరావాసం, రక్షణ, స్వయం ఉపాధి, స్పెషల్ స్కిల్స్ డెవలప్‌మెంట్, వికలాంగులను మానవ వనరులుగా తీర్చిదిద్దడానికి క్రియేటివ్ తదితర అంశాలపై అబివృద్ధి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. కెజి నుండి పిజి వరకు విద్యను అందిస్తున్నారు.

పిడబ్ల్యుడి యాక్ట్ 1995 కల్పించిన 3 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషను అమలు చేయడంలో భాగంగా అనేక ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా 3 శాతం ఉద్యోగాలు వికలాంగులకు తప్పకుండా కేటాయించాలని చెప్పింది.
ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, ఒకేషనల్ ్రటైనింగ్ పరిశోధన, వికలాంగ మానవ వనరుల అభివృద్ధి, పునరావాసం తదితర సమస్యలపై అలాగే వికలాంగుల్ని ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయడం కోసం ఈడిడిఆర్‌సిఎస్, సిఆర్‌సిఎస్‌లు పనిచేస్తాయి. అలాగే ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పథకం ద్వారా వికలాంగులకు ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందచేస్తుంది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంత బస్సుల్లో 100%, జిల్లా బస్సుల్లో 50% రాయితీ మరియు దేశవ్యాపితంగా రైల్వే ప్రయాణ ఛార్జీల్లో, విమాన ఛార్జీల్లో 50% రాయితీలు వికలాంగులకు అందుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రూప్1 నుండి అటెండర్ స్థాయి ఉద్యోగాల్లో వికలాగులకు 3 శాతం రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు.. ప్రొఫెషనల్ టాక్స్ మినహాయింపు, జిఓఎంఎస్ 1063 ప్రకారం, అలాగే కేంద్ర ప్రభుత్వ నియామకాలకు అనుగుణంగానే ఉద్యోగులకు అలవెన్సులు, సౌకర్యం, పిఆర్‌సి సౌకర్యం ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ ద్వారా వైకల్యోపకరణాలు, రుణాలు అందిస్తుంది. తెలంగాణాలో వికలాంగుల విద్య కొరకు రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్‌ను కొనసాగిస్త్తోంది. 10 వికలాంగుల హాస్టళ్లు రాష్ట్ర రాజధానిలో ఉండటం చెపకోదగ్గ విషయం. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, అంధ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పోస్టుగ్రాడ్యుయేట్ చదివే శారీరక వికలాంగ విద్యార్థులకు మోటార్ వాహనాలు ఇస్తున్నారు. అంధులకు, బధిరులకు పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలను నిర్వహిస్తూ వికలాంగుల విద్య కోసం పనిచేసే ఎన్‌జిఓలకు నిధులు కేటాయిస్త్తోంది. తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కొరకు కమిషనర్ కార్యాలయం ద్వారా కృషి చేస్తోంది. వికలాంగులకు సాయపడటంలో అవిరళంగా పాటు పడుతోంది .
పి.రాజశేఖర్
 
 
Surya Telugu News Paper Dated: 03/12/2015

Post Comment

No comments:

Post a Comment