Monday, December 7, 2015

తీరని వికలాంగుల వెతలు


Updated : 12/3/2015 1:59:08 AM
Views : 190
సమాజంలో వికలాంగులు అసమానతలకు, వివక్షకు బలవుతున్నారు. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. సంక్షే మ రాజ్యంలో బడ్జెట్ కేటాయింపులు, విద్య, ఉపాధి రంగాలు, పునరావాసం, ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు ఇలా ప్రతి అంశంలోనూ వికలాంగులకు అన్యాయమే జరుగుతున్నది. రాజకీ య పార్టీలను నమ్మి ఓట్లేసినా అధికారంలోకి అడుగుపెట్టాక వికలాంగుల సంక్షేమాన్ని మరుస్తున్నాయి. దేశం లో 2011లెక్కల ప్రకారం 2,68,10,557 వికలాంగులున్నారు. వీరిలో పురుషులు 55.8 శాతం ఉంటే స్త్రీలు 44.2 శాతం ఉన్నారు. గ్రామీణ ్రప్రాంతాల్లో నివసించే వికలాంగుల జనాభా 69.4 శాతం ఉండగా పట్టణ ప్రాంతంలో 30.6 శాతం ఉన్నారు. వివిధ రకాలుగా శారీరక లోపాలతో.. పాక్షికంగా చూపు కోల్పోవడం, కుష్ఠు వ్యాధి, పూర్తిగా చూపు కోల్పోవడం, మూగ, వినికిడి లోపం, శారీరక లోపం, మానసిక రుగ్మతలు, బుద్ధి మాంధ్యం తదితర అంశాల ను పరిగణనలోకి తీసుకొని ఆయా లోపాలున్న వారిని వికలాంగులుగా పరిగణిస్తారు.


vasu


వికలాంగుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం 1995లో వికలాంగుల చట్టం చేసింది. చట్టం పరిధిలో వీరి కి సామాజిక న్యాయం, అనేక పథకాలు అమలుచేయాల్సి ఉన్నది. సమాజ పౌరులుగా వికలాంగులను అభివృద్ధి పరిచేందుకు ముఖ్యంగా విద్యా, ఉపాధి అవకాశాల్లో మూడు శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. అయితే పలు పథకాలు కాగితాలకే పరిమితమై ఉంటున్నాయి. దీన్‌దయాల్ వికలాంగుల పునరావాస పథకం కింద వికలాంగులకు సంక్షేమ పాఠశాలలు, వృత్తి విద్యా కేంద్రాలు, కమ్యూనిటీ పునరావాస కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పించాలి.


కానీ అవి క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంవల్ల వికలాంగులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో వికలాంగులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం ద్వారా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంత వికలాంగులకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా వారు నోచుకోవడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలలో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ల ఊసే లేదు. దామాషా ప్రకా రం ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ద్వారా నైరాశ్యానికి లోనవుతున్నారు.


ఇక వికలాంగుల ఆరోగ్య పరిస్థితులు దారుణపరిస్థితిలో ఉన్నాయి. వికలాంగుల కుటుంబాలు ఆర్థికంగా లేకపోవడంతో తగిన పోషక ఆహార విలువలతో కూడిన భోజనం దొరకడంలేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల్లో పరిస్థితి దయనీయంగా ఉన్నది. వికలాంగులకు ఉచిత వైద్య అవకాశాలు ఉన్నప్పటికీ అది పట్టణ ప్రాంతంలోని వారికే అరకొర అందుతున్నాయి. పల్లెల్లో ఉన్న వికలాంగులకు వైద్యసాయం అసలే అందడంలేదు. వికలాంగుల సర్టిఫికెట్ల కోసం ఏర్పాటు చేస్తున్న సదరన్ క్యాంప్‌లు డివిజన్ స్థాయిలోనే ఏర్పాటు చేయడంతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అంగవైకల్యానికి సంబంధించి అన్ని పరీక్షలు అయిపోయాక కూడా నిర్ణీత సమయంలో వికలాంగుల సర్టిఫికెట్స్ అందటం లేదు. ఈ సర్టిఫికెట్ల విషయంలో దళారుల బెడద ఎక్కువై పోయింది. వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ ముఖ్యం కావడంతో దళారుల చేతి లో మోసపోకతప్పడం లేదు. ప్రస్తుతం వైకల్యం 40 శాతం ఉంటేనే, వారికి అర్హత సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. 39 శాతం వైకల్యం ఉన్నా అనర్హులుగా తేల్చుతున్నారు.


దీంతో లక్షలాది మంది వికలాంగులు ప్రభుత్వ పథకాలకు రాయితీలకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి 40 శాతంగా ఉన్న అర్హతను 30 శాతానికి కుదించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంపై పునరాలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

అనేక సామాజిక కారణాల కారణంగా రోజురోజుకూ వికలాంగుల జనాభా గణనీయంగా పెరుగుతున్నది. ప్రభుత్వ శాఖలల్లో వీరి నియామకాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. వీరికి మల్టీనేషనల్ కంపెనీలల్లో పనిచేసే అర్హతలున్నా ఏ కంపెనీ కూడా వీరికి ఉద్యోగాలు ఇవ్వడం లేవు. అన్నిరకాల ప్రభుత్వ ఉద్యో గాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటే నిరుద్యోగ సమస్య కొంతమేరకు తగ్గించిన వారవుతారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్క్‌లో వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనటువంటి పథకాలతో వికలాంగుల సంక్షేమాన్ని అమలు చేస్తున్నది. అర్హులైన వికలాంగులందరికి ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నది. నెలకు 1500 రూపాయల ఆసరాను అందిస్తూ వారి వికాసానికి తోడ్పాటునందిస్తున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4,38,526 మంది వికలాంగులు లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యం గా ముందుకు సాగుతున్నది. అదే లక్ష్యంతో వికలాంగుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి.


తెలంగాణ రాష్ట్ర సాధనలో వికలాంగుల పోరాటం అద్వితీయమైనది. అందుకోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో వీరిని భాగస్వాములను చేస్తూనే వీరి అభివృద్ధికి బాటలు వేయాలి. ప్రస్తుతం వికలాంగులకు ఉన్న రిజర్వేషన్‌ను ఎనిమిది శాతానికి పెంచాలి. ఇత ర కార్పొరేషన్స్ మాదిరిగా వికలాంగుల కార్పొరేషన్‌కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూం పథకంలో వికలాంగుల కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వికలాంగుల వివాహ ప్రోత్సాహాకాన్ని 2 లక్షలకు పెంచాలి. వ్యక్తిగత రుణసౌకర్యం 5 లక్షలు ఇవ్వాలి. ఉన్నత చదువులు చదువుతున్న వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. అలాగే వారికి వాహన సౌకర్యం కూడా అందించాలి. మరోవైపు వికలాంగ మహిళలపై అనేక లైంగిక దాడులు జరుగుతున్నాయి.


వీటిని అరికట్టాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాలల్లో వికలాంగుల వసతిగృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నా యి. వాటికి ప్రత్యామ్నాయంగా సొంత భవనాలు ఏర్పాటుచేసి విద్యార్థుల కష్టా లు తీర్చాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ల కింద ఒక కుటుంబంలో ఎందరు వికలాంగులు ఉన్నా వారందరిని ఆసరా పథకం ద్వారా ఆదుకోవాలె. ప్రభుత్వం నిర్వహించే పరీక్ష రుసుముల్లో వికలాంగలకు మినహాయింపును ఇవ్వాలి. వికలాంగులకు ప్రభుత్వ రవాణా రంగాలన్నింటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలి. అర్హులైన వికలాంగులందరికీ ఆరోగ్య భద్రత కార్డులు జారీ చేయాలి. వికలాంగుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగాలి. సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సమాజంలో పూర్తిస్థాయి భాగస్వామ్యం పెంచేందుకు ఉద్దేశించిన 1995 చట్టాన్ని అమలుచేయాలి. జీఓ నెం.1095 ప్రకారం మిగులు భూముల్లో ఐదెకరాలు వికలాంగులకు కేటాయించాలి. బడ్జెట్ కేటాయింపులో ఎనిమిది శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి. వికలాంగులను అన్ని విధా లా ఆదుకొని వారికి రక్షణ, ఉపాధి కల్పించిన నాడే వికలాంగులు ఆత్మగౌరవం తో తలెత్తుకొని నిలుచుంటారు.

Andhra Jyothi Telugu News Paper Dated : 03/12/2015


No comments:

Post a Comment