Saturday, May 23, 2015

దళిత బాంధవుడు (భాగ్యరెడ్డివర్మ) By ఆదినారాయణ గిన్నారపు


మేదరి భాగయ్య (భాగ్యరెడ్డివర్మ) 1888 మే 22 న హైదరాబాద్‌లో మేదరి రంగమాంబ, వెంకయ్య దంపతులకు జన్మించారు. సమాజంలో దళితుల బాధలను స్వయాన తానూ అనుభవించాడు. ఈ సమాజంలో తన జాతి వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందాలని దళితులు తమ సమస్యలను పరిష్కరిం చుకోవడానికి, సామాజిక చైతన్యం ఉంటేనే ఆధిపత్యం అణచివేతను ప్రశ్నించవచ్చన్న భాగయ్య ఇందుకు చదువుకోవడమే సరైన మార్గమని దిశానిర్దేశం చేశారు. అందుకోసం హైదరాబాద్‌తో సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు ఇరవై ఆరు పాఠశాలలను నెలకొల్పి దళితజాతి చైతన్యం కోసం వందలాదిమంది దళిత విద్యార్థులకు చదువుకొనే అవకాశం కల్పించారు. నిజాం పాలనలో సాంఘిక దురాచారాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. స్త్రీల నిరక్షరాస్యతను, బాల్య వివాహాలను, దేవదాసి వ్యవస్థను నిర్మూలించే పయత్నం చేశారు. ఇందుకు గాను 1906లో హైదరాబాదులోని ఇస్లామియా బజార్ వద్ద జగన్మితమండలిని స్థాపించి బాలబాలికలకు చదువు నేర్పించారు. మద్యపానం, మాంసాలను నిషేధించడం, దేవదాసి వ్యవస్థను నిర్మూలించడం లాంటి సమాజోపయోగకర పనులు ప్రారంభించారు.

1906లో హిందూ సోషల్ లీగ్ అనే సంస్థను ప్రారంభించి అస్పృశ్య వర్గాల బానిసత్వాన్ని, వెట్టిచాకిరి వ్యవస్థను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణులు కల్పించిన అసమానతల రహస్యాలను బట్ట బయలు చేశారు. 1910లో ప్రచారిని సభను స్థాపించి దళితు ల కు నీతి నియమాలు బోధిస్తూ హిందూ మతంలోని రహస్యాల గుట్టు విప్పారు. 1914లో హైదరబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఆదిహిందు భవన్ స్థాపించారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి దానికి కారణమవుతున్న సవర్ణ వర్గాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉద్యమం తెలుగు నేలకే పరిమితం కాకూడదని అఖిల భారత ఆది ఆంధ్రుల మహాసభను హైదరాబాదులో నిర్వహించారు. అంటరాని కులాలను ఆది ఆంధ్రులు గా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంతిమంగా ఆదిహిందువులుగా పిలవాలని ప్రకటించారు. ఈ ఉద్యమ ఫలితంగా నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ (తమిళులు) అను పదాలను అస్పృశ్య వర్గాలకు వాడాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలంలో భాగ్యరెడ్డివర్మను అనేకమంది అగ్రవర్ణాల వారు వ్యతిరేకించినా ఒక్కడే ధైర్యంగా నిజాం ప్రభువుతో ఉన్న దగ్గరి సంబంధం వల్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మహారాష్ట్రలో అంబేద్కర్ దళితుల పట్ల పోరాడుతున్న విధానా న్ని అభినందించారు. మహారాష్ట్రలో అంబేద్కర్ ఏర్పాటు చేస్తు న్న కళాశాలకు భాగ్యరెడ్డి వర్మకు నిజాం రాజుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల పది లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. దీని ద్వారా ఎంతో మంది విద్యార్థులు గొప్ప విద్యావంతులుగా ఎదిగారు. ఇంకా చాలా మంది విద్యావంతులు కావాలని 1931 లో ఆదిహిందూ భవన్‌కు అనుబంధంగా భాగ్యనగర్ పత్రికను స్థాపించి విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించారు. 1937 లో ఈ పత్రికను ఆది హిందూ పత్రికగా పిలిచారు. నిరంతరం దళితుల కోసం పాటుపడిన భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న దివంగతులయ్యారు. 

Namasete Telangana Telugu News Paper Dated:22/02/2015

Friday, May 22, 2015

సామాజిక ధర్మంతోనే సామరస్యం (22-May-2015) By కృపాకర్‌ మాదిగ పొనుగోటి


ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 61 షెడ్యూల్డు కులాల వారి మధ్య సమానత్వం, సామాజిక న్యాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 మే ఒకటవ తేదీన జీవో నెంబర్‌ 25ను జారీ చేసింది. నిజానికి సామాజిక న్యాయ ఉద్యమాలు ఇటీవల సాధించుకున్న ఒక మంచి ఉత్తర్వు ఇది. ఈ జీవో రావడానికి ఉద్యమించిన మాల కాని ఎస్సీ కులాల సంఘాలు, కార్యకర్తలందరూ ఇందుకు అభినందనీయులు. మాదిగ మహాశక్తి ఉద్యమాలతో ఈ జీవో జారీకి చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్‌బాబు గారికి ప్రత్యేకించి మాదిగ మహాశక్తి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సంక్షేమ, ఆర్థిక విధానాలన్నీ ప్రభావవర్గంగా లేదా శిష్టవర్గంగా లేదా షెడ్యూల్డు కులాల మధ్య అత్యంత ప్రాబల్య కులంగా తయారైన ఒకే ఒక ఎస్సీ అగ్ర (మాల) కులానికి అనుకూలంగా ఉంటూ వచ్చాయి. ఇదే సమయంలో ఎస్సీ కులాల మధ్య సాపేక్షికంగా ఎక్కువ అణిచివేతలకు, వెనకబాటుతనాలకు గురైన మాదిగలు ఇతర ఎస్సీ కులాల అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు మారాయి. తెలివైన సమూహాలు - అమాయకపు సమూహాల మధ్య, బలమైన సమూహాలు - బలహీనమైన సమూహాల మధ్య బతుకుదెరువు అవకాశాలు ఉంచి, పోటీ పెడితే ఏం జరుగుతుందో, ఇక్కడ షెడ్యూల్డు కులాల మధ్యన కూడా అదే జరిగింది. జరుగుతున్నది.
పంపిణీ న్యాయం - సామాజిక న్యాయం - ఏకరూప అభివృద్ధికి ఆయా కులాల జనాభా నిష్పత్తుల కనుగుణంగా ప్రతి ఎస్సీ కులానికీ అవకాశాలు కల్పించే విధంగా ఈ 25 నంబర్‌ జీవో ఉన్నది. పేదరిక నిర్మూలన పథకాలు, స్వయం ఉపాధి పథకాలు, ఇళ్ళ స్థలాల పంపిణీ, గృహ నిర్మాణం, భూమి కొనుగోలు పథకం ద్వారా సాగుభూములు పంపిణీ, ఎస్సీ ఉప ప్రణాళిక కింద ప్రత్యేకంగా అందే నిధులు, సంక్షేమ, ఆర్థిక పథకాలను సామాజిక న్యాయ పంపిణీ సూత్రాలకు అనుగుణంగా ప్రతి షెడ్యూల్డు కులానికీ అందించడానికి ఉద్దేశించి ఈ జీవో నెంబర్‌ 25ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం ఈ నెల తొమ్మిది, పది తేదీల్లో బెంగుళూరులో జరిగిన జాతీయ స్థాయి సదస్సు 25వ నంబర్‌ జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఇంతేకాకుండా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను మాదిరిగా తీసుకొని ఆయా రాష్ర్టాల్లోని అన్ని రాష్ర్టాల ప్రభుత్వాల ద్వారా ఇటువంటి జీవోలను జారీ చేయించుకోవాలని వివిధ రాష్ర్టాల నుంచి పాల్గొన్న ఆయా సంఘాల ప్రతినిధులు, నాయకులు, మేధావులు ఈ సదస్సులో తీర్మానించారు.
సరే, ఇది ఎంత మంచి జీవో అయినప్పటికీ, చూసుకొని మురిసిపోవడానికే తప్ప ఇలాంటి జీవోలని ప్రభుత్వ అధికారులు పటిష్ఠవంతంగా, సక్రమంగా అమలు చెయ్యరనే సంగతి మనకు తెలియనిది కాదు. ఇందుకు ప్రబలమైన ఉదాహరణ ప్రస్తుత 25వ నంబర్‌ జీవోకి మూల రూపమైన జీవో నెంబర్‌ 183 అమలు జరపని తీరే. 1997 డిసెంబర్‌ 16న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ 183వ నంబర్‌ జీవోని విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ శాఖలో ఇతరత్రా శాఖల్లో ఉన్న కొందరు మాల అధికారులతోపాటు ఆయా ఆధిపత్య కులాల ప్రభుత్వాలన్నీ ఈ 183వ నంబర్‌ జీవో అమలు కానీయకుండా తొక్కిపెట్టిన సంగతి మాదిగలతో పాటు మిగిలిన ఎస్సీ కులాల వారందరికీ బాగా తెలిసిందే. ఈ 183 జీవోని ప్రస్తుత 25వ నంబర్‌ జీవోగా మార్చి, 2011 జనాభా గణాంకాలకనుగుణంగా ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కూడా వర్తింపజేస్తూ రాబోయే పదేళ్ళ కాలం పాటు అమలులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యీ తాజా సవరణ ఉత్తర్వునిచ్చింది.
 
ఈ 25వ నంబర్‌ జీవో అమలు జరగటం వలన గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు, చదువు మధ్యలో ఆగిపోయినవారు, వ్యవసాయ కూలీలు, నిరుపేదలు, యువకులు, మహిళలు అయిన అన్ని షెడ్యూల్డు కులాలలోని మెజారిటీ ప్రజలకు సంక్షేమ పథకాలు పొందటానికి వీలుకలుగుతుంది. ప్రతి జిల్లాలోని ఎస్సీ జనాభాను యూనిట్‌గా తీసుకుని ఆయా ఎస్సీ కులాల వారి నిర్దిష్ట జనాభా నిష్పత్తులకనుగుణంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రతి ఎస్సీ కులానికీ అందించాలని ఈ జీవో నిర్దేశించడం హర్షణీయం. ఈ జీవో సక్రమంగా నిరంతరాయంగా అమలయితే, షెడ్యూల్డు కులాల మధ్య ప్రస్తుతం పెద్దగా కొనసాగుతున్న అభివృద్ధి వ్యత్యాసాలు తగ్గిపోయి, ఏకరూప అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయి. ఈ 25వ నంబర్‌ జీవో అమలు వల్ల ఎవరికీ ఎటువంటి నష్టమూ, అన్యాయమూ జరగదని తెలిసినప్పటికీ, ఇప్పటి వరకూ అదనంగా పొందుతూ వున్న ఆర్థిక, సంక్షేమ లబ్ధిని కోల్పోతామన్న దురుద్దేశంతో కొన్ని మాల సంఘాలు, కొందరు మాల నాయకులు ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ (వర్గీకరణ) మాట ఎత్తితే నాలుకలు తెగ్గోస్తామని గోదావరి మాల నాయకుడొకరు ఇటీవల బహిరంగ హెచ్చరిక చేసేశారు! ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ అనేది కాలం చెల్లిన సమస్య అని తెలంగాణ మాల నాయకుడొకరు ప్రకటించేసారు! సామాజిక న్యాయానికి - పంపిణీ న్యాయానికి - వ్యతిరేకంగా మాల కులంలో చెలరేగుతున్న ఇటువంటి అసాంఘిక శక్తులు, వ్యక్తుల వలన షెడ్యూల్డు కులాల మధ్య దూరం, అపోహలు పెరుగుతున్నాయి. ఎస్సీ కులాల మధ్య సామరస్యం, ఐక్యత దెబ్బతింటున్నది. ఇదే సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, ఉద్యమకారుల పేరిట చెలామణి అవుతున్న నాయకులు, కుల పెద్దలుగా ఉన్న కొందరు ఉన్నతాధికారులు కొనసాగిస్తున్న మౌనాన్ని గనక గమనిస్తే వీరే కొన్ని అసాంఘిక శక్తులకు ఊతం అందిస్తున్నారేమో అనే అనుమానం ఎవరికైనా కలుగక మానదు.
 
భారత జనాభా 2011 గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాదిగ జనాభా అత్యధికంగా ఉండగా, మిగిలిన జిల్లాల్లో మాల వారి సంఖ్య కొంచెం అధికంగా ఉన్నదని తెలుస్తున్నది. అలాగే రాష్ట్రంలో ముప్పై ఎనిమిదిన్నర లక్షల మంది మాదిగ అనుబంధ కులాల ప్రజలుండగా, నలభై రెండు లక్షల మంది మాల అనుబంధ కులాల ప్రజలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ గణాంకాలు కూడా మాదిగలు, మిగిలిన సాపేక్షిక అణగారిన ఎస్సీ కులాలకు వాస్తవిక సంఖ్యలకు అద్దం పట్టేవిగా లేవేమోనని ఈ వ్యాసకర్త అనుమానం. ఎన్నో ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం, సామాజిక న్యాయం, సరైన ప్రాతినిధ్యం కోసం అన్ని షెడ్యూల్డు కులాల వారు చేసిన ఎన్నో ఉద్యమాల ఫలితంగా వచ్చిన యీ 25వ నంబర్‌ జీవో అమలు వలన తమకు కొంతమేరకు న్యాయం జరుగుతుందని అణగారిన ఎస్సీ కులాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ జీవో పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ జీవోను రద్దు చెయ్యాలనే అసాంఘిక, అన్యాయ వాదనలకు, వ్యతిరేక చర్యలకు దిగుతున్న కొందరు మాల వారి దుశ్చర్యలను మాల కుల పెద్దలుగా, ప్రముఖ మాల అంబేద్కరిస్టులుగా, బుద్దిస్టులుగా, మావోయిస్టులుగా, కవులు, రచయితలు, పాత్రికేయులు, విద్యావంతులు, ఉన్నతాధికారులుగా వివిధ రంగాల్లోని మాల పెద్దలు ఖండించడం, మిగిలిన ఎస్సీ కులాల వారి ప్రజాస్వామిక ఆకాంక్షలను, డిమాండ్లను బలపరచడం వారి సామాజిక ధర్మం. ఇలా చెయ్యకుండా వారు కూడా మౌనం వహిస్తున్నారూ అనంటే, ఎవరైతే గాంధీగారి కాలంచెల్లిన దళితవ్యతిరేక వాదనలను మాల కులంలో నెత్తికెత్తుకుంటున్నారో వారితో వీరు ఏకీభవిస్తున్నట్టుగా, బలపరుస్తున్నట్లుగానే ప్రస్తుత సామాజిక సంఘర్షణల సమయంలో భావించవలసి ఉంటుంది.
మాల సామాజిక వర్గంలో ఉన్న నిజమైన అంబేద్కరిస్టులు, బుద్దిస్టులు, విప్లవవాదులు, ప్రజాస్వామికవాదులు - వారు ఇప్పుడు తమ నోళ్ళు విప్పాలి. మాదిగలు ఇతర షెడ్యూల్డు కులాల ప్రజలు చేస్తున్న డిమాండ్లలోని హేతుబద్దత, న్యాయబద్దతకు మద్దతునివ్వాలి. మాదిగలు, మిగిలిన ఎస్సీ కులాలవారు చేస్తున్న పోరాటాలు ప్రభుత్వాల పైననే కాని మాల వారిపై కాదన్న సత్యాన్ని మాల పెద్దలు స్వీయ సామాజిక వర్గీయులకు వివరించాలి. సాపేక్షిక, వ్యవస్థీకృత అన్యాయాలకు, వెనకబాటుతనాలకు గురైన మాదిగలు ఇతర ప్రభుత్వాలపై చేస్తున్న ఉద్యమాలను వ్యతిరేకిస్తున్న కొద్ది మంది అసాంఘిక మాల శక్తులను కట్టడి చెయ్యడానికి మాల పెద్దలు పూనుకోవాలి. ఇందుకోసం మాల పెద్దలు ఇకనైనా తమ నోళ్ళు విప్పాలి. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమంచాలి.
 
కృపాకర్‌ మాదిగ పొనుగోటి
మాదిగ మహాశక్తి జాతీయ అధ్యక్షుడు
 Published in Andhra Jyothi Dated: 23/05/2015

Tuesday, May 19, 2015

దేవుడు ప్రజాస్వామ్యవాదా, కాదా? (09-May-2015) By కంచ ఐలయ్య



దేవుడు ప్రజాస్వామ్యవాదా, కాదా అనే ప్రశ్న చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను నా పీహెచ్‌డీ పుస్తకానికి God as political philosopher (దేవుడి రాజకీయ తత్వం) అని పేరు పెట్టినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో హిందూ తత్వంలో జీవించే మేధావులకు, విగ్రహారాధన చేసే వారికి ఇది అంతుపట్టని ప్రశ్న. నిత్యజీవితంలో అప్రజాస్వామ్యంగా బతికే వ్యక్తికి ప్రజాస్వామ్య ప్రక్రియను దేవునితో ముడేసే సరికి భయమేస్తుంది. అటువంటి పేరున్న పుస్తకాన్ని ముట్టుకోవాలంటే కూడా భయమేస్తుంది. కాని ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఈ దేశంలో చాలా ఉంది.
 
ప్రపంచ మానవాళి ముందు మూడు రకాల దేవుళ్ళ ఆలో చన, ఆచరణ సరళులు ఉన్నాయి. (1) అబ్‌స్ర్టాక్ట్‌ (నిరాకార, నిరంతర) దేవుడు. (2) మానవులుగా పుట్టి ముందు ప్రవక్తలుగా మారి క్రమంగా ప్రపంచ దేవులుగా మారిన శక్తులు, వ్యక్తులు. ఈ విధంగా ప్రపంచ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మానవ సాంఘీక రాజకీయ విలువల్ని శాసిస్తున్నది గౌతమ బుద్ధుడు, జీసెస్‌ క్రైస్తు. (3) ఊహాజనిత మానవాకార దేవతలు. ఇటువంటి దేవతలు ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రమే దేవతలుగా నమ్మేవారు విష్ణువు, ఆయన అవతార సంతతి. రెండవ గ్రూపు శివుడు ఆయన చుట్టూ నిర్మిత దేవతా శక్తులు. ఈ రెండు గుంపు దేవతలను ఇప్పుడు వైష్ణవ దేవతలు, శైవ దేవతలుగా చూస్తున్నాం.
 
ప్రపంచస్థాయిలో వ్యక్తి, కుటుంబ, సామాజిక, రాజ్య ప్రజాస్వామిక విలువలు ఎక్కడ నుంచి వచ్చాయి అనే అంశం మీద ఇంత వరకు సిద్ధాంత చర్చ జరగలేదు. అబ్‌స్ర్టాక్ట్‌ దేవుని వ్యక్తిగత విలువలు, ఆయన (ఇంకా పురుష రూపంలో చలామణి అవుతున్నాడు కనుక) బోధనలు, ఆయన రూపొందించాలనుకునే లేదా రూపొందించిన మానవ విలువలు ముఖ్యమైనవి. ఇవి జనరల్‌గా ప్రపంచ మానవుల చర్చల్లో ఉన్నప్పటికీ బైబిల్‌, ఖురాన్‌ గ్రంథాల్లో ఈ దేవుని చర్చలు సుదీర్ఘంగా కనిపిస్తాయి. ఖురాన్‌ కంటే బైబిల్‌ ముందు రాయబడ్డది కనుక ఓల్డ్‌ టెస్టామెంట్‌ అంతా ఈ దేవుని లక్షణాలు, పనులు ఆచరణ మనకు వివిధ కోణాల్లో కనిపిస్తుంది. ఖురాన్‌ బైబిల్‌ కొనసాగింపు ఒక నిర్దిష్ట కోణం నుంచి కనిపిస్తుంది. ఖురాన్‌ అబ్‌స్ర్టాక్ట్‌ దేవున్ని పదే, పదే నొక్కి వక్కాణించింది.
ఈ దేవుని మొదటి ప్రజాస్వామిక లక్షణం (అదే ఆ పుస్తకాల లక్షణం అవుతుంది) మనుషులందర్నీ ఆయన సమానంగా సృష్టించాడనే సుదీర్ఘ చర్చ. ఈ దేవునిలో కనబడే మరో ఆర్థిక ప్రజాస్వామిక లక్షణం మనుష్యుల్ని అత్యున్నతులుగా సృష్టించి అన్ని జంతువులనూ, క్రిములనూ, సమస్త ప్రకృతిని ఆ మనుషుల అవసరాల కోసం, ఆహారం కోసం (ఆవుతో సహా అన్నిటిని) సృష్టించాడని చెప్పడం. కానీ ఈ రెండు గ్రంథాల్లో దైవ ప్రక్రియకు మానవ గుర్తింపు కలిగించింది ముందు జీసెస్‌ క్రైస్తు ఆ తరువాత ప్రాఫెట్‌ మహహ్మద్‌. చరిత్ర క్రమంలో మహమ్మద్‌ ఒక ప్రాఫెట్‌గా మాత్రమే మిగిలిపోగా జీసెస్‌ ఒక దేవుని స్థాయి పొందారు.
 
ప్రవక్తలు, సంఘ సంస్కర్తలు ప్రపంచస్థాయి దేవుళ్ళుగా మారింది ఇద్దరే ఇద్దరు. గౌతమబుద్ధుడు, జీసెస్‌ క్రైస్తు. బుద్ధుడు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దేవునిగా చలామణిలో ఉన్నాడు. బుద్ధునికి విహారాల్లో, గుడుల్లో విగ్రహ రూపం ఉన్నప్పటికీ ఆయన టీచింగ్స్‌, జీవించిన విధానం, సంఘ నిర్మాణం తూర్పు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. భారతదేశంలో ఆయన ప్రభావం చాలా ఉంది. ప్రపంచంలో బుద్ధుని కంటే ఎక్కువ స్థాయిలో జీసెస్‌ ప్రభావం ఉంది. ఆయన జీవిత చరిత్ర, టీచింగ్స్‌ నాలుగు గాస్పెల్స్‌ రూపంలో బైబిల్‌లో చేర్చాక ఆయన విగ్రహాంలోగాని, ఆయన్ని ఏ శిలువపై చంపారో ఆ శిలువ విగ్రహంలో గాని చర్చి వెలిసాక ప్రపంచ రూపురేఖలే మారిపోయాయి. బుద్ధుడు, జీసెస్‌ హింసావాద వ్యతిరేకులు. వారి టీచంగ్స్‌ సర్వమానవ సమానత్వాన్ని కోరుకున్నాయి. ఇద్దరి జీవిత ప్రక్రియలో, సంఘ నిర్మాణ, స్ర్తీ పురుష సంబంధాల్లో మార్పు, అంతిమంగా వాళ్ళు కోరుకున్న రాజ్య వ్యవస్థ ప్రజాస్వామ్య విలువల గురించి సుదీర్ఘ చర్చ, ఆచరణకు అనువైన చాలా సూచనలు ఉన్నాయి. వాటి ప్రభావం ప్రపంచ సామాజిక, రాజకీయ వ్యవస్థల మీద చాలా బలంగా ఉంది.
 
బుద్ధుడు తన సంఘ నిర్మాణంలో, తన శిష్యులతో తాను వ్యవహరించిన తీరులో చాలా ప్రజాస్వామిక విలువలున్నాయి. ‘సంఘం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి’ నినాదమే ఆనాటి కులవ్యవస్థను, వర్గ వ్యవస్థను, స్ర్తీ పురుష అసమానతలను దెబ్బతీసేందుకు తోడ్పడ్డది. జీసెస్‌ తన 12 మంది శిష్యులతో వ్యవహరించిన తీరు చాలా ప్రజాస్వామ్య లక్షణాలను కలిగి ఉంది. అంతకంటే సమరిటన్‌ (అక్కడి దళితులు) స్ర్తీలతో, జంటైల్‌ స్ర్తీ-పురుషులతో, బానిసలతో, వేశ్యా స్ర్తీ విముక్తి కోసం ఆయన పోరాటం బుద్ధుని ప్రజాస్వామ్య విలువల కంటే ఒక అడుగు ముందు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయనే మతాన్ని, రాజ్యాన్ని వేరు చెయ్యాలని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఆదర్శప్రాయంగా ప్రజల ముందు పెట్టిన ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌’ క్రిష్టియన్‌ దేశాల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ఎవాల్వ్‌ చెయ్యడానికి బాగా తోడ్పడింది.
 
పై వాదనల్లో ఒక అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ అబ్‌స్ర్టాక్ట్‌ గాడ్‌ గాని, బుద్ధుడు, జీసెస్‌లు గాని మానవ సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, ఆచరణ, అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. ఇప్పటికే మనుష్యుల్ని రాజ్యం, చట్టాలు, పోలీసు, మిలిటరీ వ్యవస్థల కంటే ఎక్కువగా నియంత్రించే శక్తి దేవుడు. దేవుడు అనే భావం, దాని చుట్టూ భక్తి, ప్రేమ, భయం వ్యవస్థల మీద ప్రభావం పడేసాయి. మానవ గవర్నెన్స్‌లో ఇప్పటికీ దేవుని పాత్ర రాజ్యం పాత్ర కంటే ఎక్కువ.
 
ఈ వెలుగులో చూసినప్పుడు హిందూ వ్యవస్థ నిర్మించి, నమ్మే ఆచరించే వైష్ణవ స్కూల్‌ దేవతలకు గాని, శైవ స్కూల్‌ దేవతలకు గాని ప్రజాస్వామ్య విలువలు, లక్ష్యాలు, ఆచరణ ఉన్నాయా? వైష్ణవాన్ని భారతదేశంలో రాజ్యం, సంస్థలు, పార్టీలు తమ రాజకీయ, ఆధ్యాత్మికంగా ప్రకటించుకుంటున్న ఈ తరుణంలో ఈ స్కూలు దేవతల్లో గాని, వారి చుట్టూ రూపొందించబడ్డ ఆధ్యాత్మిక తాత్వికతలో గాని ప్రజాస్వామిక జీవన విధానాన్ని, రాజ్య వ్యవస్థను కాపాడే లక్షణాలు ఉన్నాయా అన్న అంశాన్ని లోతుగా చర్చించాలి. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించే బీజేపీ కాని, కాంగ్రెస్‌లో ఎక్కువ మంది నేతలు గాని, కమ్యూనిస్టు-సోషలిస్టు నేతలు గాని చాలా ప్రాంతీయ పార్టీల నేతలు గాని వైష్ణవ విలువలతో తమ సాంఘీక, రాజకీయ జీవితాన్ని, పార్టీలను నడుపుతున్నారు. కమ్యూనిస్టులు, విప్లవకారులు కూడా ఈ చట్రం బయట లేరు. వారు హేతువాదులమని చెబుతున్నా, వాళ్ళు హిందూ వ్యవస్థ తాత్విక పరిధిలోనే జీవిస్తున్నారు. తమ రాజకీయాలను కూడా ఆ చట్రంలోనే నడుపుతున్నారు.
 
 విష్ణువు, ఆయన అవతార దేవతలు రాముడు, కృష్ణుడు ఊహాజనిత దేవతలు. వారికి బుద్ధుడికి, జీసెస్‌కు ఉన్నట్టు మానవ జీవన చరిత్ర లేదు. కృష్ణుడు రాసినట్టు చెప్పబడుతున్న ఒక్క ‘భగవత్‌ గీత’ తప్ప వాళ్ళ బోధనలు అంటూ ఏమీలేవు. వాళ్ళ చుట్టూ అల్లిన కథలు, వారి బొమ్మలు ఇప్పుడు మన ముందున్నాయి. మొదట వీరి గురించి ఉన్న కథలల్లో మనకు కనిపించేది వారి హింసాయుత హీరోయిజం. దేవుడే హింసను అనుసరించదగ్గ విలువను ఆచరణలో పెడతాడు. అతని గురించిన వర్ణనలో గాని, అతని విగ్రహ రూపంలో గాని ఆయుధాలు (చక్రం, బాణం, త్రిశూ లం) కొట్టొచ్చేవిగా కనిపిస్తున్నప్పుడు మానవ సంబంధాలపై వారి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. వీరిలో ప్రజాస్వామిక ప్రక్రియకు వ్యతిరేక అంశం వారికి అంటగట్టబడ్డ కులపునాదిలో వుంది. 
దేవతలకు కులం ఉండడం నమ్మకస్తుల్లో అప్రజాస్వామిక విలువలను కాపాడడానికి బాగా తోడ్పడే అంశం. అయితే శివునికి కుల పునాది ఉన్నట్టు మనకు కనిపించదు. కానీ వైష్ణవ దేవతలందరూ క్షత్రియ కుల పునాదులు, క్షత్రియులకు ఉండాల్సిన ఆయుధ ధారణ, ఈ దేవతలందరికీ ఉంటుంది. వారి భార్యలతో గాని, ఇతర స్ర్తీలతో ఉండే సంబంధాల్లో గాని ప్రజాస్వామిక సంబంధాలు లేకపోవడం అప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణానికి బాగా తోడ్పడ్డాయి. భారతదేశంలో అప్రజాస్వామిక పౌర సమాజం ఉండడానికి వీరి విలువలే కారణం.
శైవ స్కూలు ఇందుకు కాస్త భిన్నమైంది. ఇది ప్రధానంగా శివుని చుట్టూ మాత్రమే తిరుగుతుంది. శివునికి చాలా ట్రైబల్‌ క్యారక్టర్లు ఉన్న విషయం తెలిసిందే. శివుడు కూడా ఊహాజనిత దేవుడే. ఆయన చుట్టూ ఉన్న కథలు తరువాత కాలాల్లో రచయితలు అల్లినవే. శైవ స్కూలు చేతిలో శూలం, మెడలో పాము, చుట్టూ పులి తోలు, జగ్గు మొదలగు వస్తు సముదాయాలతో ఉంటుంది. ఆ రూపం నుంచి శివలింగ పూజ వరకు ఒక నిర్దిష్ట వ్యక్తి, సమాజ, రాజ్య సూత్రాలతో సంబంధం లేకుండా ఆచరణలో ఉన్నట్లు కనబడుతుంది. సామాజిక ప్రజాస్వామిక సూత్రాలేమీ ఈ స్కూలు రూపొందించిన దాఖలాలు లేవు. అందుకే బీజేపీ వంటి పార్టీలు శివున్ని ఎక్కువగా వాడుకోవడం లేదు. దైవిక, సామాజిక ఆహార అలవాట్లలో వైష్ణవ, శైవాలు - ఒక్క మాటలో హిందూ తాత్వికత - అప్రజాస్వామికంగా ఉండి వెజిటేరియనిజం, మీటేరియనిజం, ఫిషేరియనిజాల మధ్య కూడికలు, తీసివేతలతో కలగలిసి ఉంటుంది. ఈ స్కూల్లో కొన్ని కుల వ్యతిరేక తిరుగుబాట్లు కనబడతాయి. అయినా దీనికి భారతదేశం బయట గుర్తింపేమీ లేదు.
 
పైన మనం చర్చించిన మూడు అంటే - నిరాకార దేవుడు, బుద్ధుడు, జీసస్‌, హిందూ ఊహాజనిత ఆకార దేవతల - స్కూళ్ళు రాజకీయ వ్యవస్థల్ని ఎలా ప్రభావితం చేశాయో చూడ్డం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. నిరాకార దేవుని ప్రభావం ఈనాడు ముస్లిం దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం ప్రధానంగా ఖురాన్‌లోని సూత్రీకరణల నుంచి సమాజ ప్రాక్టీసుగా మారింది. వీటితో పాటు ప్రాఫెట్‌ మహమ్మద్‌ టీచింగ్స్‌ (అహదీస్‌) వాటికి జోడయ్యాయి. ఈ దేశాలన్నిటిలో ప్రజాస్వామ్యం బలంగా నిలదొక్కుకోలేకపోతున్నది. నియంతృత్వం ప్రజాస్వామ్యం కలగాపులగంగా అమల్లో ఉంటున్నది. ఈనాడు మనం ప్రజాస్వామ్య దేశాలుగా చూసే క్రైస్తవ దేశాల్లో ఏసుక్రీస్తు ప్రభావంతో పాటు నిరాకార దేవుని ప్రభావం కూడా ఉన్నది. ఈ దేశాల్లో బైబిల్‌ అధ్యయనం ఒక కీలకమైన పాత్ర పోషించింది. బైబిల్‌ అధ్యయనం నుండి ‘పాజిటివిజం’ ఆ క్రమంలో ప్రజాస్వామ్య సూత్రీకరణలు పుట్టుకొచ్చాయి. ఈనాడు క్రైస్తు ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో రాజకీయ, సాంఘీక ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్నాయి.
తూర్పు దేశాలైన బుద్ధిస్టు దేశాల్లో సోషలిజం-ప్రజాస్వామ్యం కలగాపులగంగా ఉన్నాయి. ఈ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి (చైనా, జపాన్‌, కొరియా, వియత్నాం మొదలగునవి) స్టెడీగా బలంగా జరుగుతున్నది. సమాజ ఆధునికీకరణతో పాటు స్ర్తీ ఆధునికీకరణ చాలా వేగంగా జరుగుతుంది. ఈ అన్ని దేశాల్లో బాల్యవివాహాలు ఆగిపొయ్యాయి, వితంతు వివాహాలు చాలా గౌరవ ప్రదంగా జరుగుతున్నాయి. వీటన్నిటికి కారణం సభ్య సమాజంలో బౌద్ధం ప్రభావం ఎక్కువగా ఉండడం.
 
ఇగ మిగిలినవి భారతదేశం, నేపాల్‌. భారతదేశంలో క్రైస్తవ విలువలు గలిగిన బ్రిటిష్‌ విలువల్లో భాగంగా 1947 నాటి ప్రజాస్వామిక వ్యవస్థ ఒక రూపానికి వచ్చింది. ఇక్కడి వైష్ణవ విలువలు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవాలని చూసినా బ్రిటిష్‌ వారు ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంపై రుద్ది పోయారు. బుద్ధిస్టు అంబేద్కర్‌, హేతువాద నెహ్రూల ప్రయత్నం వల్ల ఒక మంచి రాజ్యాంగం, రాజకీయ ప్రజాస్వామ్య ప్రాక్టీసు ఇక్కడ నిలదొక్కుకున్నాయి. కాని సభ్యసమాజంలో వైష్ణవ, శైవ అసమానత, అంటరాని తనాన్ని కాపాడే విలువలు ఇంకా బలంగా ఉన్నాయి. హిందూ దేవతల్ని, ఈ మత పుస్తకాల్ని, ప్రజల - ముఖ్యంగా బ్రాహ్మణీయుల ప్రాక్టీస్టును - పత్రికల్లో ప్రచారం చేస్తున్న మేధావులు ఈ అంశంపై తేల్చాలి గదా!
 
ఒక వ్యక్తి నమ్మే దేవునికి ప్రజాస్వామిక విలువలు లేకపోతే అతనికి/ఆమెకు ఆ విలువలు ఎక్కడి నుండి వస్తాయి? అసలు తమ దేవతలను కూడా ఇంత హింసాయుతంగా, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత స్ర్తీ వ్యతిరేకులుగా ఎందుకు రూపొందించుకున్నారో చెప్పాలి గదా! ఇంత విగ్రహారాధన (పుస్తకారాధన కాదు) మతంలో ఉంటే విగ్రహాల నుంచి ప్రజలు ప్రజాస్వామిక విలువల్ని ఎట్లా నేర్చుకుంటారో చెప్పాలి గదా! మార్పు లేని మతం మంచిదెట్టయితదో చెప్పాలి గదా!
కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త
Article Published in Andhra Jyothi Telugu News Paper Dated :09/05/2015 

Tuesday, February 10, 2015

మీరు పులు కడిగిన ముత్యాలా? By Andhra Jyothi MD Radha Krishna Editorial



ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడాన్ని, తొలగించిన తీరును సమర్థిస్తున్న వారందరూ గుండె మీద చేయి వేసుకుని తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పగలరా? రాజయ్య మినహా మిగతా మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడటం లేదని హామీ ఇవ్వగలరా?... డాక్టర్‌ రాజయ్య విషయంలో వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇచ్చుకోవాలి. దళితులైనంత మాత్రాన అవినీతికి పాల్పడటానికి లైసెన్స్‌ ఇవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. జరుగుతున్న దాంట్లో వారి పాపం అతి స్వల్పం మాత్రమే కనుక దొరతనంతో కాకుండా దొడ్డ మనసుతో వ్యవహరించి ఉండాల్సింది అని చెప్పడమే నా అభిమతం. అవినీతి నిర్మూలన జరగాలంటే పై స్థాయి నుంచి ప్రారంభం కావాలి గానీ, అట్టడుగు స్థాయి నుంచి మొదలుపెడితే అది అంతిమంగా సామాజికపరమైన అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది!
పిచ్చి ముదిరింది- తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికెవడో! ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు వాస్తు పిచ్చి పట్టుకుంది. వాస్తు నమ్మకాల పేరిట కట్టినవాటిని కూలగొట్టడం, మరమ్మతులు చేయడం చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఎంతో ముచ్చటపడి మూడు నాలుగు భవనాలను కూలగొట్టి కట్టించుకున్న సీఎం నివాస భవనం, క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషం అన్న ముద్రవేసి పాడుబడుతున్న భవనాల జాబితాలో చేర్చారు. ఈ భవనంలోనే ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌ రెడ్డి మూడేళ్లు ఉన్నారు. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వాస్తురీత్యా దోహదపడిన ఆ భవనాలు కానీ, సచివాలయాల భవన సముదాయం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పనికిరాకుండా పోయాయి. సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉందని ఇప్పుడు ఆయన తేల్చిపారేశారు. ఉభయ రాష్ర్టాలకు చెందిన, ఇప్పుడు జీవిస్తున్న తెలుగు ప్రజలందరికీ ప్రస్తుత సచివాలయం మాత్రమే తెలుసు. ఎందరో ముఖ్యమంత్రులు అక్కడి నుంచే పరిపాలన చేసి తెలుగు నేల దశ, దిశను మార్చే నిర్ణయాలు తీసుకున్నారు. దశ బాగుంటే దిశ బాగుంటుందంటారు. అలాంటిది తమ దశలను మార్చుకోవడానికై, దిశలను మార్చడానికి ప్రస్తుత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ప్రస్తుత విభజిత రాష్ర్టాలకు ముఖ్యమంత్రులైనవారు గానీ దివ్యమైన ముహూర్తాలు చూసుకునే ప్రమాణ స్వీకారంచేశారు. అయినా ఏ ఒక్కరూ శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగలేదు.. కొనసాగబోరు. వెయ్యేళ్లపాటు జీవించడానికి మనం ఈ భూమి మీదకు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఈ వాస్తవం తెలిసిన కేసీఆర్‌కు వాస్తు ప్రకారమైనా, ముహూర్త బలం ప్రకారమైనా ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరన్న సంగతి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్‌ వారసత్వాన్ని, చారిత్రక కట్టడాలను కాపాడాలనీ, అందుకోసం మెట్రో రైలు అలైన్‌మెంట్‌ను మార్చాలనీ పట్టుబట్టిన కేసీఆర్‌కు ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల దవాఖానా చారిత్రక కట్టడంగా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. అదేమని ప్రశ్నించిన వారిపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఎర్రగడ్డలో 150 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సచివాలయాన్ని, శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు గానీ, కొత్త సచివాలయ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న రోడ్లు భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయానికే 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుత సచివాలయంలోని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కార్యాలయాలలో వాస్తు హంగుల కోసం పదుల కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది 150 కోట్ల రూపాయలతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామని చెప్పినంత మాత్రాన నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వాస్తు నమ్మకం అనేది వ్యక్తుల వ్యక్తిగత విశ్వాసం. అందుకోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసే అధికారం ముఖ్యమంత్రులకు, మంత్రులకు ఎవరు ఇచ్చారో తెలియదు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది ప్రజల జీవితాలు బాగుపరిచేందుకేగానీ సచివాలయం నిర్మించుకోవడానికి కాదు. తాను అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సచివాలయాన్ని పడగొట్టి ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని తరలించి అక్కడ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానని ఎన్నికల సందర్భంలో కేసీఆర్‌ చెప్పి ఉండాల్సింది. రాజుల సొమ్ము రాళ్లపాలు అని గతంలో రాజ్యాలు ఉన్నప్పుడు అనేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజల సొమ్ము కాంక్రీట్‌ భవనాల పాలు కాబోతున్నది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు టవర్ల పిచ్చి పట్టుకుంది. ఎక్కడబడితే అక్కడ టవర్లు నిర్మించాలని ఆయన తలపోస్తున్నారు. అవి ఎందుకో, ఎవరి కోసమో మాత్రం చెప్పడం లేదు. పింఛన్ల కోసం అలమటిస్తున్న అభాగ్యులను ఆదుకోవడానికి గానీ, అప్పుల బాధతో ఉసురు తీసుకుంటున్న రైతులకు ఆపన్నహస్తం అందించడానికి గానీ కేసీఆర్‌కు మనసు రావడం లేదు. కొత్త సచివాలయాన్ని నిర్మించిన తర్వాత ఇప్పుడున్న భవనాలను వివిధ ప్రాంతాలలో ఉన్న శాఖాధిపతులు, ఇతర అధికారుల కార్యాలయ భవనాలను ఏమి చేస్తారో మాత్రం ఆయన చెప్పరు. అంతేకాదు అర్థరహితమైన, అహేతుకమైన, ఆచరణసాధ్యం కాని ఆయన నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేస్తారు. అయితే తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. కేసీఆర్‌ చర్యలను నిశితంగా గమనించడం మొదలెట్టింది. త్వరలోనే నోరు విప్పడానికి సిద్ధమవుతోంది. నాలుక మడత వేయడంలో మన రాజకీయ నాయకులు సిద్ధహస్తులు. ఈ విషయంలో కేసీఆర్‌ నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. ‘‘మా పిల్లలకు మాత్రమే మేం ఫీజులు చెల్లిస్తాం గానీ, పొరుగు రాష్ర్టాలవారి పిల్లలకు ఎందుకు చెల్లించాలి? ఆంధ్రావారి పిల్లలకు మేం ఫీజు చెల్లించబోం. అందుకోసం ఫాస్ట్‌ పథకాన్ని తీసుకు వస్తాం’’ అని అధికారం చేపట్టిన కొత్తలో కేసీఆర్‌ అనేక ప్రకటనలు చేశారు. ‘‘ఆహా మా ముఖ్యమంత్రి ఎంత బాగా చెప్పారు’’ అని ఆయన చుట్టూ ఉండే తెలంగాణవాదులు చప్పట్లు కొట్టారు. అయితే అలా చేయడం జరిగేపని కాదనీ, ఆర్టికల్‌ 371-డి అమలులో ఉన్నా లేకపోయినా, 1956కి పూర్వం నుంచి తెలంగాణలో ఉన్నవారి పిల్లలనే స్థానికులుగా నిర్ణయించడం చట్టసమ్మతం కాదని నేను అప్పుడే చెప్పాను. దీనిపై అప్పట్లో నాపై అవాకులు చెవాకులు పేలారు. ఇప్పుడు ఏమి జరిగింది? హైకోర్టులో మొట్టికాయలు తప్పవని గ్రహించిన కేసీఆర్‌ తన ఆలోచనను విరమించుకున్నారు. ఏ నోటితో అప్పుడు ఆ మాట అన్నారో, ఇప్పుడు అదే నోటితో ‘‘ఫాస్ట్‌ లేదు.. గీస్టు లేదు’’ అని తేల్చిపారేశారు. నిజానికి ఫాస్ట్‌ పథకం చెల్లదని కేసీఆర్‌కు కూడా తెలుసు. అయితే తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో చట్టవిరుద్ధమైన వాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్ని పర్యాయాలు నాలుక మడత వేశారో పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. కేసీఆర్‌ మాటలు, చర్యలు కొన్నిసార్లు వినసొంపుగా, అబ్బురపరిచేవిగా ఉంటాయి. ఆయన గురించి చాలావరకు తెలిసిన నాకే కొన్ని సందర్భాలలో ఆయన ప్రకటనలు నిజమే కాబోలని నమ్మే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది ఒక ఉద్యమ నాయకుడిగా తప్ప ఇతరత్రా కేసీఆర్‌ గురించి ఏమీ తెలియని తెలంగాణ సమాజం సహజంగానే కేసీఆర్‌ ప్రకటనల పట్ల ఆకర్షితమైంది. అయితే ఇప్పుడిప్పుడే అందరికీ తత్వం బోధపడుతోంది. ప్రస్తుత సచివాలయాన్ని ఖాళీచేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్న కేసీఆర్‌, తాను అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రినని గ్రహించాలి. ప్రస్తుత సచివాలయంలో వాస్తు బాగోనందున నష్టం తెలంగాణకా? కేసీఆర్‌కా? కొత్త సచివాలయం నిర్మించడం వల్ల తెలంగాణ సమాజం బాగుపడుతుందా? కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడుతుందా? నూతన సచివాలయంలోకి మార్చినంత మాత్రాన తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్‌ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండిపోగలరా? తన నిర్ణయాన్ని అమలుచేసే ముందు కేసీఆర్‌ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే తెలంగాణ సమాజంలో వాస్తుకు అంత గుర్తింపు గానీ, ప్రాధాన్యం గానీ లేదు. ప్రస్తుత వాస్తు విశ్వాసం ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి దిగుమతి అయినది మాత్రమే! అడుగడుగునా ఆంధ్రా వ్యతిరేకతను నూరిపోసే కేసీఆర్‌కు ఆంధ్రావాళ్లు మాత్రమే ఎక్కువగా నమ్మే వాస్తు మీద నమ్మకం ఎందుకు కలిగిందో, ఎప్పుడు కలిగిందో తెలియదు. పనిలో పనిగా శుక్రవారంనాడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తాను మొక్కిన మొక్కులను ఆయా దేవుళ్లు, దేవతలకు తీర్చబోతున్నట్టు చెప్పారు. వ్యక్తిగతంగా ఆయన మొక్కుకున్న మొక్కులు తీర్చడానికి ప్రజాధనం ఖర్చు చేయడంలోని ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి! బహుశా ఆయన ‘‘నేను ముఖ్యమంత్రి అయితే..’’ అని మొక్కుకుని ఉంటారు. అందుకే ప్రజాధనంతో మొక్కులు తీర్చడానికి తెగబడుతున్నారు.
మరి వారు కనిపించడం లేదా?
రోజుకో అడ్డం పొడుగు ప్రకటనలు చేయడం కేసీఆర్‌కు అలవాటే కనుక ఆ విషయం కాసేపు పక్కన పెట్టి ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన వ్యవహారానికి వద్దాం. ప్రస్తుత ప్రభుత్వంలో రాజయ్య ఒక్కరే అవినీతిపరుడన్న ముద్రవేసి ఆయనను పదవి నుంచి తొలగించిన కేసీఆర్‌ను అభినందించాల్సిందే! దళితులకు అధికారం అప్పగిస్తే అవినీతికి పాల్పడతారని తన ఈ చర్య ద్వారా తెలంగాణ సమాజానికి చక్కటి సందేశం పంపిన కేసీఆర్‌కు తెలంగాణలోని దళితులందరూ రుణపడి ఉండాలేమో! అణువణువునా అహంకారాన్ని నింపుకొన్నవారు మాత్రమే ఇలా వ్యవహరించగలరు. ప్రభుత్వాలలో జరిగే అవినీతిలో దళితుల వాటా అతి స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద డీల్స్‌ చేసుకునేవారు ఎవ్వరూ వారిని సంప్రదించరు. ముఖ్యమంత్రులుగా, వారికి నమ్మకస్తులుగా అగ్ర కులాలకు చెందిన వారే ఉంటారు కనుక వందల కోట్ల అవినీతి వారి సొంతమే అవుతుంది. దళితులకు మిగిలేది తాలు, తప్ప మాత్రమే! అందుకే ఎవరైనా దళిత నాయకుడు అవినీతికి పాల్పడినట్టు బయటకు పొక్కినా మన సమాజం అంత సీరియ్‌సగా తీసుకోదు. ఎందుకంటే వారు చేసిన అవినీతి వల్ల కొంపలు మునిగిపోవు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉద్వాసనకు దారితీసిన వ్యవహారంలో ఎంత మేరకు అవినీతి జరిగిందో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రంలో పెచ్చుమీరిపోతున్న ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియాలలో దళితులు లేరే! సీమాంధ్రతో పోల్చితే తెలంగాణలో దళితులు, ముఖ్యంగా మాదిగల జీవితాలు దుర్భరంగా ఉంటాయి. ఆర్థికంగా, సామాజికంగా వెలివేతకు గురైన జీవితాలు వారివి! అలాంటి మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను అత్యంత అమానుషంగా, అవమానకరంగా పదవి నుంచి తొలగించడం కేసీఆర్‌కు మాత్రమే చెల్లింది. అదేమని ప్రశ్నించినవారిపై ‘‘అవినీతిని ఉపేక్షించమంటావా?’’ అంటూ ఆయన వందిమాగధులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడాన్ని, తొలగించిన తీరును సమర్థిస్తున్నవారందరూ గుండె మీద చేయి వేసుకుని తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పగలరా? రాజయ్య మినహా మిగతా మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడటం లేదని హామీ ఇవ్వగలరా? అంతా నేతిబీరకాయలో నేతి చందంగా ఉంది. ప్రస్తుత రాజకీయంలో అవినీతికి పాల్పడకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేని దుస్థితి. వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డికి ప్రతిపక్ష హోదా సమకూర్చిన సమాజం మనది! తాను నిజాయితీపరుడినని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నో మార్గాలున్నాయి. అందుకు రాజయ్య లాంటి బలహీనులు అవసరమా? జిల్లాలలో యథేచ్ఛగా వనరుల దోపిడీకి పాల్పడుతున్న ఇతర మంత్రులు, పార్టీ నాయకులపై కేసీఆర్‌ ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నిజామాబాద్‌ జిల్లాలోని మంజీరా నదిలో వందల కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నవారి సంగతి ఏమిటి? ఈ దందాలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ కవిత హస్తం ఉందని జిల్లా ప్రజలందరూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారే! ఈ మాటలు కేసీఆర్‌ చెవికి సోకడం లేదా? కవిత లేదా పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడి హస్తం ఉందనడానికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోవచ్చును గానీ జరుగుతున్నదేమిటో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే కదా! అనధికారికంగా జరిపే అక్రమాలకు ఆధారాలు ఉండవు కదా? అవినీతికి పాల్పడితే సొంత కొడుకైనా, కూతురైనా జైలుకు పంపిస్తానని ముఖ్యమంత్రి అయిన కొత్తలో కేసీఆర్‌ చేసిన ప్రకటనలు నమ్మి చప్పట్లు కొట్టినవారిలో నిజామాబాద్‌ జిల్లా ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు వారే ముక్కున వేలేసుకుంటున్నారు. దోషులపై చర్య తీసుకోవలసింది పోయి ఇసుక బాగోతాన్ని బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికపై శుక్రవారంనాడు జరిగిన కేబినెట్‌ సమావేశంలో కేసీఆర్‌ విరుచుకుపడ్డారట! ఇలాంటి వార్తలు ప్రచురిస్తే కేసులు వేయాలని మంత్రులకు ఉద్బోధించారు కూడా! రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ‘ఆంధ్రజ్యోతి’పై కేసులు వేయించారు. ఇప్పుడు ఏమైంది? ఆనాడు మేం ప్రచురించిన వార్తలకు సంబంధించిన కేసులలోనే ఆయన కుమారుడైన జగన్మోహన్‌ రెడ్డి దోషిగా కోర్టు ముందు నిలబడ్డారు.
 పది శాతం ఇస్తేనే..
అవినీతిని అరికట్టే విషయంలో ఎవరు చిత్తశుద్ధి ప్రదర్శించినా అభినందించవలసిందే! అయితే ‘‘అవినీతికి పాల్పడే హక్కు మాకు మాత్రమే ఉంది. దళితులకు లేదు’’ అన్న సందేశం ఇవ్వడంతోనే ఈ తంటా అంతా! ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి విషయంలో తనను తాను నిప్పుతో పోల్చుకుంటూ ఉంటారు. నిజంగా ఆయన నిప్పు కాబోలునని కొంతమంది నమ్ముతున్నారు. సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న తంతు గురించి చెప్పవలసి వస్తోంది. రాజశేఖర్‌ రెడ్డి పుణ్యమా అని పాలకులకు నీటిపారుదల ప్రాజెక్టులు కామధేనువుగా మారాయి. బతికున్నంత వరకు ఆయన ఎంత దండుకోవాలో అంతా దండుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా తమ వాటా తాము దక్కించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంతు వచ్చింది. ఈ సదుపాయం ఏపీలో తక్కువ. ఎందుకంటే అక్కడ నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పోలవరం మినహా పెద్దగా లేవు. వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా చేతికి మట్టి అంటుకోకుండా కీలక స్థానాలలో ఉన్నవారు తమ వాటా తాము పొందుతున్నారు. మట్టి అంటడం లేదని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే అవన్నీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మాత్రమే! ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసినవి కావు! సరిగ్గా ఇక్కడే మళ్లీ పాత నమూనాను అనుసరిస్తూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి అవినీతికి తెర లేపారు. అదెలాగంటే ఆయా ప్రాజెక్టుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి కదా! ఏ ప్రతిఫలం ఆశించకుండా అంతంత మొత్తాలు చెల్లించడం ఆనవాయితీ కాదు కనుక పది శాతం ఇస్తేగానీ బిల్లులు చెల్లిందేది లేదని షరతు పెట్టారు. అందుకు కాంట్రాక్టర్లు తలాడించక చస్తారా? దీంతో మనవాడు మిస్టర్‌ క్లీన్‌ కాదు, మిస్టర్‌ టెన్‌ పర్సంట్‌ అని కాంట్రాక్టర్లు ముద్దుగా పిల్చుకోవడం మొదలెట్టారు. అయితే ఈ పది శాతాన్ని ఆ తర్వాత ఆరు శాతానికి తగ్గించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 2,500 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించారు. ముఖ్య నేతలు విధించిన షరతు ప్రకారం ఆయా కాంట్రాక్టర్లు ‘రుసుము’ కింద 200 కోట్ల రూపాయల వరకు సమర్పించుకున్నారు. ఈ మొత్తం ఎవరికి చేరుతున్నదో కూడా తెలుసు. ఏలిన వారికి నమ్మకస్తులు ఉండాలి కదా! రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వసూళ్లను కె.వి.పి.రామచంద్రరావు పర్యవేక్షించేవారు. ఇప్పుడు కేసీఆర్‌ జమానాలో అలాంటి నమ్మకస్తుడే ఒకరు దొరికారు. ఆయన ఎవరు? ఏమిటి? అన్నది తర్వాత వెల్లడిస్తాం. అయితే కమిషన్లు చెల్లించేవారు రశీదులు అడగరు. తీసుకున్నవాళ్లు కూడా రశీదులు ఇవ్వరు. అందుకే ‘‘దమ్ముంటే రుజువు చేయండి’’ అని పాలకులు సవాళ్లు విసరగలుగుతున్నారు. వ్యతిరేక వార్తలు ప్రచురించే పత్రికలపై కేసులు వేయవలసిందిగా మంత్రులను కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టిన నాపై కూడా కేసు వేయవచ్చు. ఒక రకంగా అలా కేసు వేయడమే మంచిది. న్యాయస్థానం వారు విచారణకు ఆదేశిస్తే ఈ వ్యవహారాన్ని రుజువు చేసే అవకాశం మాకు దక్కుతుంది. బిల్లులు పొందడానికి తాము ఎంత చెల్లించిందీ చెప్పడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. తెలంగాణలో అవినీతికి పాల్పడింది డాక్టర్‌ రాజయ్య ఒక్కరేనా? బిల్లులు చెల్లించినందుకు కమీషన్లు తీసుకోవడం అవినీతి కిందకు రాదా? పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్పించిన ఒక అభాగ్యుడిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అడుగడుగునా లంచాల కోసం వేధించడాన్ని తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదే? ‘ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే కలడు’ అని సర్వాంతర్యామి గురించి భాగవతంలో ప్రహ్లాదుడంటాడు. అలాగే అవినీతి అనేది మన జీవితాలతో పెనవేసుకుపోయింది. అవినీతి లేనిదే బతకలేని పరిస్థితులు కొని తెచ్చుకున్నాం. గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరిన చందంగా పరిస్థితి తయారయ్యింది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ రాజయ్య విషయంలో వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇచ్చుకోవాలి. దళితులైనంత మాత్రాన అవినీతికి పాల్పడటానికి లైసెన్స్‌ ఇవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. జరుగుతున్న దాంట్లో వారి పాపం అతి స్వల్పం మాత్రమే కనుక దొరతనంతో కాకుండా దొడ్డ మనసుతో వ్యవహరించి ఉండాల్సింది అని చెప్పడమే నా అభిమతం. అవినీతి నిర్మూలన జరగాలంటే పై స్థాయి నుంచి ప్రారంభం కావాలి గానీ, అట్టడుగు స్థాయి నుంచి మొదలుపెడితే అది అంతిమంగా సామాజికపరమైన అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది!
Andhra Jyothi Telugu News Paper Dated: 01/02/2015

Friday, January 2, 2015

భవంతులు బతుకుదెరువైతయా? - కంచ ఐలయ్య



తెలంగాణ అభివృద్ధి సోషల్‌ రిఫామ్‌తో ముడివడి ఉంది. సోషల్‌ రిఫామ్‌ ముఖ్యంగా జరుగాల్సింది ఈ ప్రాంతపు అగ్ర కులాల్లో. తెలంగాణ సాయుధపోరాటం, తొలి జై తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల జగిత్యాల పోరాటం, మలి జై తెలంగాణ పోరాటాలు సోషల్‌ రిఫామ్‌ జోలి పోలేదు. కింది కులాల్లో కూడా బాగా మూఢ నమ్మకాలున్న రాష్ట్రమిది. వాటిని రూపుమాపకుండా వారి ఆర్థిక అభివృద్ధి కూడా జరుగదు. 

అప్పుల భయంతో, ఆకలి బాధతో రైతులు చస్తున్న రోజులివి. ఎన్నడెరుగని చలిలో కన్నతల్లులు చంటి పిల్లల్ని కడుపుకు అద్దుకుని కాపాడుకుంటున్న రోజులివి. కరు వు కండ్లలోని నీళ్లను కూడా పిండేసిన రోజులివి. ప్రజల ఆకలి దప్పుల్ని, అసమానతలనూ, అంటరానితనాన్ని రూపుమాపడానికొచ్చిన ప్రవక్త ఏసు. ఈ ఏసు జన్మదిన వేడుకగా కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవ నాయకులకు గొప్ప విందు ఇచ్చాడు. క్రైస్తవ భవనానికి స్థలమిచ్చాడు, రూ. 10 కోట్లు డబ్బు ఇచ్చాడు, ఆర్చిబిషప్‌తో భూమి ప్రార్థన కూడా చేయించాడు.
బహుశా ఏసు పుట్టక ముందనుకుంట.. ఈ ప్రాంతంలో మల్లయ్య అనే గొర్రెల-బర్రెల కాపరి పుట్టాడు. ఆయన పుట్టిన తేది మెట్టిన తేది లెవ్వు. ఆయన కాపులో మంద మంచిగున్నదని, పాలు, పెరుగు, చల్ల సమృద్ధిగా దొరికాయని, మాంసం మస్తుగా తినగలిగేవారని, చలిని చంపే గొంగళ్ళు బోలెడుండేవని, బహుశా మల్లన్న మరణించిన కొంరెళ్ళిలో కురుమ-గొల్లలంతా గుడి కట్టుకున్నారు. ఈ మల్లన్నకు తెలంగాణలో మరో రెండు గుళ్ళు కూడా ఉన్నాయి. అవే ఐలోని మల్లన్న, కట్ట మల్లన్న గుళ్ళు. ఈ గుళ్ళు ఐలోని పేరులోనే నా పేరు కూడా ఉంది. కట్ట మల్లన్న పేరులో మా అవ్వ ‘కంచ కట్టమ్మ’ ఉన్నది. కాలినడకన గుళ్ళన్నీ తిరిగింది. నా ఎంటుకలు ఐలోని లోనే తీసిందట. పట్నాలేసింది, బోనాలు చేసింది. మా అయ్య పేరు కొమురయ్య కొమురెల్లి మల్లన్న నుంచే వచ్చింది. మా తాత పేరు కంచ మల్లయ్య ఈ అందరి దేవ తల పునాది పేరది. ఈ విధంగా దేవుడైన మా ముత్తాత ముత్తాత దగ్గర ఒక దేవుడిగా ఎలిసిన కొమురెళ్ళి మల్లన్న గుడి దగ్గర ముఖ్యమంత్రి దొడ్డి కొంరయ్య భవనం కట్టిస్తానని ప్రకటించాడు.
దొడ్డి కొంరయ్య పేరు కొంరెల్లి మల్లన్న నుంచి వస్తే గొర్ల-మేకల దొడ్డి కాపల కాసినోళ్ళయింనందుకు వాళ్ళ ఇంటిపేరు ‘దొడ్డి’ అని వచ్చి ఉంటుంది. ఈ దొడ్డి కొంరయ్యను సాయుధ పోరాటం ఆరంభ దశలో కడివెండి భూస్వాములు, ఆ ప్రాంతపు పోలీసులు కాల్చిచంపారు. కమ్యూనిస్టులు సైతం మర్చిపోయిన ఈ దొడ్డి కొంరయ్య చ రిత్రను మళ్ళీ, మళ్ళీ తవ్వి తీసింది దళిత బహుజన ఉద్యమం. ఇప్పుడాయన పేరుతో ఒక భవనం వస్తుంది. ఈ ప్రకటనలకంటే ముందే ముఖ్యమంత్రి కొమురం భీం భవనం ప్రకటించాడు. ఇక మిగిలింది చాకలి ఐలమ్మ భవనమొక్కటే. అది కూడా కట్టించాలని దళిత బహుజన ఉద్యమకారులు, చాకలి సమాజం కోరుకుంటుంది.
జీసెస్‌, కొమురంభీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలకు భవనాలు, వాళ్ళ జీవితాలపై అధ్యయనాలు, వాళ్లపై పాటలు ఉండాలని నేనూ కోరుకుంటాను. కష్టజీవులకు తమ బాంధవ్యుల పేర్లతో భవనాలు, సంబరాలు, ఆటలు పాటలు ఉండాలి. ఐనా ఒకవైపు రైతులు అప్పుల బాధలతో, ఆకలి బాధలతో కరువు కోరల్లో ఉండగా ఇన్ని భవనాలు ఈ సంవత్సరమే కట్టడాన్ని మనమే కాదు ఆ మహానుభావులు ముఖ్యంగా జీసెస్‌-ఒక ప్రవక ్తగా, ఒక ప్రపంచ ఆకలి, దోపిడి విముక్తి దాతగా పూర్తిగా వ్యతిరేకిస్తాడు. జీసెస్‌ ప్రపంచానికి మానవత్వాన్ని నేర్పిన ప్రవక్త.
ఈ సంవత్సరం ఈ భవనాలకు భూమి ఇవ్వడం, కట్టిస్తామని హామీ ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఈ 25 కోట్లు కరువు కాటకాల్లో, అప్పుల ఆవేదనలో, ఆకలి కోరల్లో ఉన్న తెలంగాణ ప్రజల్ని ఆదుకోవడానికి ఖర్చు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. రోజూ ఆత్మహత్యల వార్తలు బాధాకరంగా లేదా? ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు క్రైస్తవ సమాజానికిచ్చిన హామీ వారిపై ఈ రాష్ట్రంలో దాడులు జరుగవని. చర్చీలను ఎవరూ ఎటాక్‌ చెయ్యలేరని, పాస్టర్లకు, సిస్టర్లకు రక్షణ యిస్తామని అందరి బిషప్‌లు, పాస్టర్ల సమక్షంలో చెప్పడం మెచ్చుకోదగ్గది. ఆ వాగ్దానాలు ఈ రాష్ట్రంలో అమలైతే ఈ క్రి స్మస్‌ వేడుకలు సార్థకమైనట్టే. తెలంగాణలోని క్రైస్తవులకు భవనం కంటే వాళ్ళ మత ప్రచార హక్కు చాలా ముఖ్యమైంది. ఏ క్రైస్తవుడూ రాష్ట్ర ప్రజలు అప్పులో, ఆకలిలో మలమల మాడుతున్నప్పుడు 10 కోట్లతో తమకో భవనం కట్టండని అడుగకూడదు.
రాష్ట్రమంతటా మంచి పంటలు పండి, తిండికి తిప్పలులేని సంవత్సరంలో ప్రభుత్వం దగ్గర పైసలు దండిగా ఉన్నప్పుడు ఇటువంటి భవనాలు కట్టిస్తే మంచిదే. ఒకవేళ ఈ సంవత్సరమే ప్రభుత్వం దగ్గర డబ్బు కోకొల్లలుగా ఉన్నదనుకుంటే- చనిపోయే రైతాంగాన్ని, మాకో రెండువందల పించనైనా ఇయ్యండని రోడ్లమీద నిదురపోతన్న ముసలవ్వల, ముసలయ్యల రోదన వినకుండా డబ్బులేదని బుకాయిస్తూ భవనాల మీద కోట్లు పెడితే అది దేవుడు కూడా క్షమించనటువంటి నేరం. ఎన్ని యాగాలు చేసినా పాలకులు ఇటువంటి పాపం నుంచి బయటపడలేరు. ఏది ఎప్పుడు చెయ్యాలో కాలాన్ని బట్టి ఉంటుంది. మనముందున్న ప్రజల సాధక బాధకాలను బట్టి ఉంటుంది. ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే పల్లికాలేదని మరొకడు ఏడ్వడం మంచిదికాదు. ఈ ప్రాంతపు అతిపెద్ద మెదక్‌ చర్చిని తీవ్రమైన కరువున్న రోజుల్లో విదేశాల నుంచి డబ్బు తెచ్చి కట్టారు. ఆ కట్టడంలో వేలాది మందికి పని కల్పించారు. ఆ రూపంలో కాకుండా మరో రూపంలో ఆ డబ్బు తేగలిగేవారు కాదు. ఆనాడు ఆ పని మేలు చేసింది. ఒక బ్రహ్మాండమైన చర్చినికూడా చరిత్రలో నిలిపింది. దేవుని పేరు తో చేసే పనైనా సొంత లాభాలు లేకుండా చెయ్యాలి కదా?
తెలంగాణ ప్రజలు ఇంకా ఫ్యూడలిజం ప్రభావంలో ఉన్నారు. ‘కుడుమే పండుగనే’ అమాయకత్వం చైతన్యం కాదు. వందల వేల కోట్లు ఖర్చు చేసి రాషా్ట్రన్ని కాపాడవలసిన రోజుల్లో పదుల కోట్లతో కులానికో మతానికో భవనం కడితే ప్రజలు బతకరు. నాకు ఇల్లు లేదు. నాకు వద్దు కూడా కానీ ప్రతి మనిషికీ-సీ్త్రకి, పురుషునికి - ఇల్లు నిర్మించేందుకే నా తండ్రి నన్ను పంపాడు అని చెప్పిన జీసెస్‌ మాట మరచి వేలాది మంది ఇల్లు లేక, తిండిలేక కరువు తమపై కరాల నృత్యం చేస్తున్న రోజుల్లో క్రైస్తవ భవంతికి పది కోట్లు ఇస్తే క్రైస్తవులెట్లా సంబరపడతారు. ఇక్కడే కదా ఒక బ్రాహ్మణీయ హిందువుకు, ఇతరుల కోసం తన శరీరాన్ని తన రక్తాన్నీ ధార పోసిన ఏసును నమ్మే క్రైస్తవునికి ఉండాల్సిన తేడా.
కొమురెల్లి మల్లన్న దగ్గర దొడ్డి కొమురయ్య భవనం కడుతానని ప్రకటించిన ముఖ్యమంత్రి రాషా్ట్రన్ని పరిపాలించే వెలమ భూస్వాముల్లో కొమురెల్లి మల్లన్న పట్ల ఎంత ప్రేమ ఉందో చూడాలి కదా! వారి సంస్కృతిలో మార్చు తెచ్చే సంఘ సంస్కర్త ఆ కులంలో ఎందుకు పుట్టలేదో ఆలోచించాలికదా! నేను ఇంతకు ముందే చెప్పినట్లు మా ఇంట్లో పేర్లన్నీ - మల్లయ్య, కొమురయ్య, కట్టమ్మ, ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే. కానీ వెలమల్లో ఈ పేర్లున్న ఒక్క మగ లేదా ఆడ వ్యక్తి మనకు కనిపించరు. నరసింహరావు, రామారావు, విద్యాసాగర్‌రావు, రాజేశ్వరరావు అనే బ్రహ్మణీయ దేవతల పేర్లతో, అణచివేతే ఆనందంగల సంస్కృతితో జీవించే సంస్కృతి నుంచి వాళ్ళు మారుతున్న దాఖలాలుకూడా లేవు.
నిజానికి రెడ్లల్లో, కాపుల్లో కొంరెల్లి మల్లన్న పేర్లు కనబడతాయి. మల్లారెడ్డి, ఐల్‌ రెడ్డి, కోట్రెడ్డి, మగపేర్లు, మల్లమ్మ, కొంరమ్మ వంటి ఆడపేర్లు కాపు రెడ్లలో చాలామందికి ఉన్నాయి. ‘కడుపులో లేంది కౌగలించుకుంటే రాదు’. దొడ్డి కొంరయ్య భవనం ఒక్క గొల్ల కురుమలకే కాదు తెలంగాణ సాయుధ పోరాటంపై గౌరవం ఉన్న వారందరికీ కావాలి. చాకలి ఐలమ్మ ఒక్క చాకలోళ్ళ హీరోయినే కాదు. తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే సీ్త్రలకు-పురుషులకు ఆమె ఆదర్శం. కొమురం భీం ఒక్క ఆదివాసుల హీరోనే కాదు. మొత్తం మానవజాతికి ఆయన ఆదర్శం. వీరిని పట్టించుకోకుండా సమైక్య రాష్ట్ర పాలకులు, కమ్యూనిస్టు-సోషలిస్టు నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద తప్పు చేశారు. రాష్ట్రం విడిపోవడానికి ఇదొక కారణం.
ఈ ముగ్గురి పోరాటయోధుల్లో కొంరెల్లిమల్లన్న, ఐలోని మల్లన్న సంస్కృతి ఉంది. అందుకే ఆ ఆదివాసి నాయకుని పేర్లో ‘కొమురం’ ఉంది. కొత్త రాష్ట్ర పాలకులుగా మారిన వెల మల్ని నేనడిగేదేమంటే తెలంగాణ సంస్కృతికే మూల విరాట్టులైన కొమురెల్లిమల్లన్న, ఐలోని మల్లన్న, కట్ట మల్లన్న, సమ్మక్క, సారక్క, పోచమ్మ కట్టమైసమ్మ, పోతరాజు, బతుకమ్మల ప్రభా వం మీ సంస్కృతిక జీవనంలో కనబడటం లేదు. తెలంగాణ ఉత్పత్తి కులాల్ని వీళ్ళు నిజంగా ప్రేమించాలంటే ఈ కులంలో కూడా సంఘసంస్కరణ ఆలోచన చెయ్యాలి కదా! ఈ కులంలో పుట్టిన ఒక్క సంఘం సంస్కర్త పేరన్నా చెప్పగలరా?
ఆ మధ్య మాజీ విప్లవకవి, జగిత్యాల ఉద్యమంలో అండర్‌గ్రౌండ్‌లో ఉండి రచనలు చేసిన మిత్రుడు, కమ్మల వలెనే వెలమలు క్యాపిటలిస్టులు కావడానికి నేను దోహదపడదల్చుకున్నానన్నాడు. ఐతే వెలమల్లో సంఘ సంస్కరణ విలువలు కనబడవు. చెన్నమనేని రాజేశ్వరరావు తరువాత ముప్పాళ్ళ లక్ష్మణరావు కమ్యూనిస్టులుగా ఎదిగినా వారు సంఘ సంస్కరణ కోసం చేసింది ఏమీ లేదు. విప్లవం రాదనుకున్న రాజేశ్వరరావు పూర్తిగా పాలక సంస్కృతిలోకి జారుకున్నారు. లక్ష్మణరావు ప్రభావం కులంపైగాని, ఆ ప్రాంత ప్రజల సాంస్కృతిక జీవన విధానంపై గాని ఏమీలేదు. దురదృష్టవశాత్తు భారత దేశంలో కమ్యూనిస్టులు సోషల్‌ రిఫామ్‌ను ఎన్నడూ పట్టించుకోలేదు. కనుక ఈ ప్రభుత్వానికి కనీసం కమ్మలకున్న రామస్వామి చౌదరులో, ఎన్‌.జి. రంగాలో లేరు. కనుక వాళ్ళ అధికారాన్ని, రాజకీయ ఆధిక్యతను కాపాడుకోవాలనుకున్నా, కొమురం భీమ్‌, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలే అండ. ముందు, ముందు వీరి ఆదరణ పెరుగుతుంది కానీ తరుగదు. అందువల్ల వారి పేర్లతో భవనాలు ఇవ్వాళ కాకపోతే రేపైనా వస్తాయి. వాటిని కరువులో ప్రజలకు తిండి పెట్టకుండా కట్టాల్సిన అవసరం లేదు. వారికి భవనాలు కావాలని ప్రజల్లో ఎంతో సెంటిమెంటు ఉన్నప్పటికీ ఇది తరుణం కాదని నా అభిప్రాయం.
తెలంగాణ అభివృద్ధి సోషల్‌ రిఫామ్‌తో ముడివడి ఉంది. సోషల్‌ రిఫామ్‌ ముఖ్యంగా జరుగాల్సింది ఈ ప్రాంతపు అగ్ర కులాల్లో. తెలంగాణ సాయుధపోరాటం, తొలి జై తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల జగిత్యాల పోరాటం, మలి జై తెలంగాణ పోరాటాలు సోషల్‌ రిఫామ్‌ జోలి పోలేదు. కింది కులాల్లో కూడా బాగా మూఢ నమ్మకాలున్న రాష్ట్రమిది. వాటిని రూపుమాపకుండా వారి ఆర్థిక అభివృద్ధి కూడా జరుగదు. ఈ ప్రాంతంలోని రెడ్డి, వెలమ, కాపు కులాల్లో ఫ్యూడల్‌ విలువలు చాలా బలంగా ఉన్నాయి. కింది కులాల్లో ఈ ఫ్యూడల్‌ విలువలకు బానిసత్వంలో బతికే లక్షణం చాలా ఎక్కువ. అన్ని కులాల్లో పురాతన విగ్రహారాధన చాలా బలంగా ఉంది. మతం రంగంలో కూడా పుస్తక పఠన సంస్కృతి ఏ కులంలో అంతగా లేదు. ఇక్కడి బ్రాహ్మలు కూడా ఫ్యూడలిజాన్ని పూజించే పండితులే. ఈ మౌలిక రంగంలో మార్పు రాకుండా తెలంగాణ దక్షిణాది బీహార్‌గా మారే అవకాశముంది.
ఈ స్థితి మార్చడానికి స్మారక భవంతుల కంటే సంఘ సంస్కరణ పోరాటాలు ఎక్కువ జరగాలి. ఐతే ఏ పోరాటాలైౖనా కరువును, ఆకలిని, అప్పుల బాధను అధిగమించాకే అర్థవంతంగా జరుగుతాయి.
 కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త 
Andhra Jyothi Telugu News Paper dated : 2/1/2015 

Saturday, December 20, 2014

మనం మరిచిన ‘మూల’ యోధుడు (శ్యాం సుందర్‌) - ఎ.ఎన్‌. నాగేశ్వర రావు

మనం మరిచిన ‘మూల’ యోధుడు - ఎ.ఎన్‌. నాగేశ్వర రావు

శ్యాం సుందర్‌ లాంటి అనితర సాధ్యమైన విప్లవ కారులు, మేధావులు చాలా అరుదు. సమాజం ఆయన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే కాకుండా, వారి జీవితకాలంలో సరయిన గుర్తింపునూ ఇవ్వకపోవడం దురదృష్టకరం. దేశంలో వర్గం, కులం అని విడదీయబడిన శక్తులు నేడు చావోరేవో తేల్చుకొనే పరిస్థితి ఏర్పడింది. సమైక్యతకు గండిపడి, అగ్ర కులాల చేతుల్లో అధికారం కేంద్రీకరించబడిన స్థితిలో దళితులు, మైనారిటీలు, వెనకబడిన కులాలు తమ స్థైర్యాన్ని కోల్పోతున్నాయి. సనాతన సిద్ధాంతాలూ వివిధ రూపాలలో విజృంభిస్తున్నాయి. ఇలాంటి సంక్షుభిత స్థితిలో శ్యాం సుందర్‌ లాంటి వారి ఆలోచనలు, రచనల అవసరం ఉంది.
బలవంతులదే చరిత్ర. అగ్రవర్ణాలదే ఈ దేశ చరిత్ర. జ్ఞాతుల చరిత్ర తప్ప అజ్ఞాతుల చరిత్ర మనకు అక్కర్లేదు. చరిత్ర చీకటి గుయ్యారంలో ఎందరో అగుపడకుండా చిదిమేసిన చరిత్ర మనక్కావాలి. అలాంటి కోవలోనే మూల భారతీయ ఉద్యమ పితామహుఢు బత్తుల శ్యామసుందర్‌ చరిత్ర కూడా నిర్లక్ష్యానికి గురయింది. ఆయన రచనలు మరుగునపడ్డాయి. అలనాటి హైదరాబాదు సంస్థానంలోని ఔరంగాబాదులో 1908 డిసెంబరు 21న బత్తుల శ్యాంసుందర్‌ ఒక పేద దళిత కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయలంలో ఆర్థిక , రాజనీతి, న్యాయశాసా్త్రల్లో ఉన్నత విద్య అభ్యసించారు.
1930-34 సంవత్సరాల మధ్యలో నిమ్న జాతి యువతరాన్ని సమైక్యపరచి ‘యంగ్‌ మెన్స్‌ అసోసియషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ను స్థాపించారు. తద్వారా హైదరాబాద్‌ రాష్ట్రంలో దళితుల విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యల గురించి పోరాటం సాగించారు. స్వదేశీ లీగ్‌ సభ్యునిగా, హైదరాబాద్‌ లైబ్రరీ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కు మద్దతుగా యూత్‌ లీగ్‌ ఆఫ్‌ అంబేద్కరైట్స్‌ స్థాపించారు. పి.ఆర్‌. వెంకటస్వామి, భాగ్యరెడ్డి వర్మ లాంటి సహచరులతో హైదరాబాద్‌లో దళితులకు ఎన్నో విద్యా వసతి సౌకర్యాల కోసం ఉద్యమించారు. నిజాం నవాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. దళిత మైనారిటీ వెనకబడిన వర్గాల విముక్తి కోసం జాతీయ స్థాయిలో ఎన్నెన్నో సంఘాలను స్థాపించారు. సభలు, సమావేశాలు ఏర్పరచి నాటి జాతీయ ప్రాంతీయ నాయకులతో సన్నిహిత రాజకీయ సంబంధాలు కొనసాగించారు. 1946లో నిజాం ప్రభుత్వం నుంచి శాంతి సామాజిక సేవలకుగాను ఖుసురూ-ఎ-డక్కన్‌ అవార్డు, బంగారు పతకం అందుకున్నారు. గ్రాడ్యుయేట్‌ నియోజక వర్గం నుంచి హైదరాబాద్‌ శాసనసభకు, ఉస్మానియా సెనేట్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. నిజాం రాష్ట్రంలో దళిత కులాల ప్రజా ప్రతినిధులను ఆ ప్రజలే ఎన్నుకునేందుకు వీలుగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ 24 వేల గ్రామాల నుంచి 50 వేల మందితో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు. 1948లో హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. దళితుల విద్యా వసతి సౌకర్యాల అభ్యున్నతి కోసం నిజాం నవాబును ఒప్పించి, హైదరాబాద్‌ శాసనసభచే ఆమోదింప చేసి, ఒక కోటి రూపాయల ఫండ్‌ను ఏర్పాటు చేయడంలో శ్యాంసుందర్‌ కీలక పాత్ర నిర్వహించారు. ఆనాటి కాలంలోనే ప్రత్యేక తెలంగాణ కోరుతూ... హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని ప్రధాన మంత్రికి బహిరంగ లేఖ రాయడం చరిత్ర.
మరాట్వాడాలోని మిళింద్‌ కాలేజీ, విద్యా సంస్థల నిర్మాణానికి డాక్టర్‌ అంబేద్కర్‌ అభ్యర్థన మేరకు నిజాం నుంచి 12 లక్షల రూపాయలను విరాళంగా ఇప్పించారు. హైదరాబాద్‌ స్టేట్‌ ఇండియాలో విలీనం తర్వాత, ఆ 12 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని అంబేద్కర్‌ మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టులో కేసు పెట్టింది. ఆ కేసును న్యాయస్థానంలో సవాల్‌ చేసి శ్యాంసుందర్‌ వాదించి గెలిచారు. న్యాయస్థానంలో ఆయన వాదనా పటిమకు, ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఈ వ్యాజ్యం ఒక మచ్చు తునక. దేశవ్యాప్తంగా నిమ్న వర్గాల విద్యావసతుల కోసం డాక్టర్‌ అంబేద్కర్‌ ఏర్పాటు చేసిన పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యనిగా శ్యాం సుందర్‌ ఎంపికయ్యారు. తద్వారా దేశ వ్యాప్తంగా దళితులకు విద్యార్జన కోసం విద్యాలయాల ఏర్పాటులో తన వంతు సాయాన్ని కొనసాగించారు. కేవలం క ట్టుబట్టలతో, అద్దె గదిలో అత్తెసరి వసతులతో శ్యాంసుందర్‌ జీవితాన్ని అతి సామాన్యంగా గడిపారు. నిజాం నవాబు సన్నిహిత మిత్రడై ఉండి కూడా, ఎ ందరో సన్నిహితులు అత్యున్నత పదవుల్లో ఉండినా తన కోసం ఇసుమంతైనా వారిని ఉపయోగించుకోని అభిజాత్యం ఆయనది. ఒక సామాన్య బ్రహ్మచారి, మద్యపాన వ్యతిరేకి, కచ్చితమైన నియమాలతో, సూటిదనం, మచ్చలేని వ్యక్తిగా పేరుబడ్డ శ్యాంసుందర్‌ నిరాడంబరంగా ఉన్నతమైన జీవితాన్ని గడిపారు. ఉర్దూ, మరాఠీ, ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలలో పండితులు. లక్షలాది మందిని సమ్మోహితులని చేసే ప్రసంగ శక్తి ఆయనది.
ఐక్యరాజ్య సమితికి హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి 90 లక్షల మంది దళితుల ప్రతినిధిగా హాజరయి, వారి సమస్యల గురించి ప్రపంచ స్థాయి ప్రతినిధుల ముందు శ్యాంసుందర సవివరంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచ పత్రికలన్నీ పతాక స్థాయిలో ప్రచురించాయి. ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి డైలీ ‘లీ మాండె’ మొదటి పేజీలో హోచిమెన్‌, శ్యాంసుందర్‌ ఫ్రెంచి ప్రధాని కలిసి ఉన్న ఫోటో, సంప్రదింపుల వివరాలు ప్రచురించిందని చెబుతారు. ప్రపంచ నాయకులతో వివిధ దేశాలలో వారి అతిథిగా శ్యాంసుందర్‌ గడిపారని, వారందరితో స్నేహ సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. చౌ ఎన్‌ లై మన దేశాన్ని తొలిసారి సందర్శించినపుడు, ఆయన ప్రధాని నెహ్రూతో, హైదరాబాద్‌లో శ్యాంసుందర్‌ అనే మిత్రుణ్ణి కలవాల్సి ఉందని తె లిపారట.
హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో శ్యాం సుందర్‌ను ఢిల్లీ రప్పించారట. ప్రపంచ స్థాయి మేధావులు హెరాల్డు, జెలాస్కీ, జీన్‌ పాల్‌ సారె్త్ర వంటి వారితో శ్యాంసుందర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీటన్నింటి వివరాలు తెలియాంటే ఆనాటి సమకాలీన పత్రికలు, ప్రాంతాలు, ఆధారాలు దొరకబుచ్చుకోవాలి. ఇదంతా సులభ సాధ్యం కాదు. ప్రభుత్వపరంగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి చేయాల్సిన బాధ్యత ఇది.
ఈ దేశంలో వాస్తవమైన దళిత ఉద్యమం ఏదయినా ఉందంటే అది శ్యాం సుందర్‌ 1948లో ప్రారంభించిన భీం సేన. సుశిక్షితులైన మిలిటెంట్‌ అంకిత భావం కలిగిన దళిత యువతను ఇందులో సమ్మిళితం చేసి, వారి ఆచరణ ద్వారా విప్లవకర భావజాలంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రాంతాలలో తమ ప్రభావాన్ని కొనసాగిస్తూ అంబేద్కర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. వాస్తవానికి భీంసేన కొనసాగించిన కార్యక్రమాలు మహారాష్ట్రలోని దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమానికి మాతృకగా పనిచేసింది. తద్వారా యావద్భారతదేశ దళిత ఉద్యమానికి భీం సేన ఉద్యమం వేగుచుక్కగా పనిచేసింది.
వాస్తవాల మీద, న్యాయం పునాదుల మీద నిలబడి పీడిత వర్గాల పక్షాన పోరాడే ఆత్మరక్షణ దళంగా భీం సేనను శ్యాంసుదర్‌ తయారు చేశారు. భీం సేనకు ప్రణాళిక-నియమ నిబంధనలు తయారు చేసి వాటిని దళిత యువతరంలో విస్తృతంగా ప్రచారం చేసి సైనికులను తయారు చేశాడు. తరతరాలుగా సైనిక జాతిగా ఉండిన దళిత జాతితో మాజీ సైనికులతో భీంసేన సభ్యులకు తర్ఫీదునిప్పించారు. తనే స్వయంగా రాజకీయ సిద్ధాంతాల గురించి ప్రసంగాలు చేసేవారు. అంబేద్కర్‌ రచనలు విస్తృతంగా భీం సేన ప్రచారంలోకి తెచ్చింది. తమను తాము మూల భారతీయులుగా ఆయన ప్రకటించారు. తన మహత్తర రచన ‘మూల భారతీయులు‘లో దళితుల గురించి చెబుతూ ‘అనాగరికులైన ఆర్యుల రాకకు ముందు ఈ దేశాన్ని పాలించిన పాలకులం మేము. మేం మూల భారతీయులం ఎన్నటికీ హిందువులం కాము. సరికదా భారత దేశంలో హిందూ రాజ్యం ఏర్పడడానికి ఏ రకంగానూ సహకరించం.
అంతేకాదు హిందూ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ఏ అవకాశమొచ్చినా విడిచి పెట్టం’ అని అంటారు శ్యాం సుందర్‌. డాక్టర్‌ అంబేద్కర్‌ ప్రసిద్ధ రచన ‘కుల నిర్మూలన’లో ప్రతిపాదించిన సిద్ధాంతాలను శ్యాం సుందర్‌ మరింత విస్తృతపరచి ఎన్నో చారిత్రాత్మక గ్రంథాలను రచించడం జరిగింది. కర్ణాటకలో భీం సేన హిందూ కులోన్మాదుల ఆగడాలను అడ్డుకుంది. దళిత కులాల యువత తల పై కెత్తుకొని నడిచే ఆత్మస్థైర్యాన్నిచ్చింది. దళితులు చైతన్యవంతులవడంతో భూస్వామ్యవర్గాలయిన లింగాయత్‌, గౌడ వర్గాలు దళితుల పట్ల అత్యాచారాలు చేసేందుకు జంకారు.
దళిత-ముస్లిం ఐక్య సంఘటన అనేది దేశంలోనే ఒక వినూత్నమైన అత్యవసర విముక్తి సిద్ధాంతంగా, శ్యాంసుందర్‌ మేధోశక్తికి ప్రతీకగా నిలిచింది. సమాజపు అట్టడుగు చీకటి కోణం నుంచి ఎంతో శ్రద్ధాసక్తులతో పరిశోధించడం మూలంగా, ఈ రెండు జాతులు అణచివేతకు గురయి, నేడు ఒకే రకమైన సామాజిక అసమానతలకు లోనయ్యారని శ్యాంసుందర్‌ ఆధారాలతో నిరూపించడం జరిగింది. దేశ చరిత్రలో నిరంతరం పీడింపబడ్డ ఈ రెండు జాతులు ఐక్యమై ఒక బలీయమైన శక్తిగా ఎదిగి, సామాజిక ఆర్థిక విప్లవాన్ని వేగవంతం చేసి భారత దేశ నిజమైన విప్లవాన్ని విజయవంతం చేయాలనేది శ్యాం సుందర్‌ కోరిక. దళిత సమస్యకు పరిష్కారం కనుక్కొనే మార్గంలో భాగంగా ముస్లింలను మిత్ర సహిత బంధంగానూ, హిందూ అగ్రకులాలను శత్రుపూరితంగానూ సిద్ధాంతీకరించాడు. దానితో సనాతన హిందువులు శ్యాంసుందర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.
హైదరాబాద్‌ విలీనం అనంతరం ఆయన మీద కేసులు పెట్టి అరెస్టు చేసి శారీరకంగానూ, మానసికంగానూ హింసకు గురిచేశారు. ఏటికి ఎదురీదడం, సమాజ రుగ్మతల మీద పోరాడడం విప్లవకారుల కర్తవ్యం. ఆ బాధ్యతను శ్యాం సుందర్‌ సమర్ధంగా నిర్వర్తించారు. హిందూ కులవాదులు ఆయన మీద బనాయించిన కుట్ర కేసుకు ఆయన సమాధానంగా ‘సజీవ దహనం’ అనే గ్రంథాన్ని రచించారు. అందులో దళితులు హిందువులు కారనే చారిత్రక వాస్తవాన్ని సజీవ సాక్ష్యాలతో భారత న్యాయస్థానానికి, తద్వారా యావద్భారత ప్రజానీకానికి బహిరంగంగా వెల్లడి ంచారు.
శ్యాం సుందర్‌ అభిప్రాయం ప్రకారం పీడిత జాతులకు, దళిత వర్గాలకు మతం ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. చూపదు. కనుక మత వ్యవస్థ అనేది తిరోగమన మార్గం. కేవలం మతం మార్చుకున్నంత మాత్రాన దళితులకు సంబంధించిన సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యలు తీరుతాయని ఆయన భావించలేదు. మూల భారతీయులైన దళితులకు మతమనేది లేదు. కేవలం ముస్లింలను, క్రిస్టియన్లను ఎదుర్కోవడం కోసం సంఖ్యాబలం కోసం దళితులను హిందువులుగా సనాతన హిందువులు కోరుతున్నారు. ఇది రాజకీయంగా హిందువులకు అవసరం. హిందూ మహాసభ దేశంలో కుల నిర్మూలనా సంఘాలు స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఇదే. వీరి తొలి కార్యక్రమం దళితులకు హిందువులమనే స్పృహ కలిగించడం. తర్వాత దేవాలయ ప్రవేశం లాంటి పై పై పూతలు, వీటివల్ల దళితుల ఆర్థిక సామాజిక రాజకీయ వివక్ష, తరతరాల వెనుకబాటుతనం పోతాయా? శ్యాం సుందర్‌ హేతుబద్ధమైన తీవ్ర వాదనల ద్వారా, రచనల ద్వారా గొప్ప చర్చను లేవదీశారు. కానీ ఆయన రచనలన్నీ నేడు చార్వాకులు రచనల్లా చీకటిలో చిదిమి వేయబడ్డాయి. వాటిని దొరకబుచ్చుకునే ప్రయత్నం మన తరమన్నా చేయగలిగితే, ఒక మేధావి అంతరంగాన్ని, దేశ సమస్యలపై ఆయన వైఖరిని, వివిధ రకాల మార్గాంతరాలను మనం తెలుసుకోగలం. తద్వారా ఆయన ఉద్యమించిన చరిత్ర బహిర్గతపరచగలుగుతాం.
కర్ణాటక విధానసభలో సభ్యునిగా శ్యాం సుందర్‌ కానసాగినంత కాలం పీడితుల పక్షాన చిచ్చర పిడుగులా పోరాడారు. కర్ణాటక శాసనసభలో నిమ్న వర్గాలకు విద్యా భూసంస్కరణలకు సంబంధించి విస్తృతంగా చర్చించినట్లు ఆయన సమకాలికులు ఇప్పటికీ చెబుతుంటారు. కర్నాటక రాషా్ట్రనికి భూ సంస్కరణల మార్గదర్శిగా శ్యాం సుందర్‌ని పేర్కొంటారు. ఆయన శాసనసభలో చేసిన కీలకమైన ఉపన్యాసాలను కన్నడంలో ముదించడం జరిగింది. కర్ణాటకలో ఆయన స్థాపించిన భీం సేన బలవత్తరమైన విముక్తి సేనగా రూపుదిద్దుకుంది. శ్యాం సుందర్‌ నేతృత్వంలో మెరికల్లాంటి దళిత యువకులు వేలాది మంది సుశిక్షితులుగా మారిన చరిత్ర ఉంది. శ్యాంసుందర్‌ మహారాష్ట్రలో పర్యటిస్తున్నప్పుడు బొం బాయిలోని ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, భీంసేనను కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే 10వేల మంది సభ్యులు ఉన్నట్లు, సభ్యులంతా నెలకు పదిపైసలు చెల్లిస్తారనీ, మొత్తం దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది సభ్యులుంటారని తెలిపారు. మాజీ సైనికులతో స్వయం రక్షణకు సంబంధించి సైనిక శిక్షణను భీం సేన సభ్యులకు అందజేశారు. భీం సేనకు తన సొంత రాజ్యాంగం, జెండా, అజెండా ఉన్నా యి. నిమ్న వర్గాల మీద, దళితుల మీద ఎక్కడ అకృత్యాలు, అత్యా చారాలు జరిగినా భీం సేనకు సమాచారం తెలిసిన వెంటనే అక్కడి ప్రజలకు సహకారంగా రంగంలోకి దిగేది. ఈ సంస్థ కాన్షీరాం తర్వాత కాలంలో స్థాపించిన బాంసెఫ్‌కు మాతృకగా అనిపిస్తుంది
శ్యాం సుందర్‌కు దేశవ్యాప్తంగా రాజకీయ రంగంలో మిత్రులుండేవారు. ఆయన బెంగుళూరులో బస చేసినపుడు వి.వి.గిరి, దేవరాజ్‌ అర్స్‌, ఉమా శంకర్‌ దీక్షిత్‌ లాంటి వాళ్ళు ఎక్కువగా కలిసేవాళ్లు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్‌, ఎస్‌.యం.కృష్ణ లాంటి వాళ్ళు మల్లిఖార్జున్‌ ఖర్గె, మొయిలీ లాంటి వాళ్ళు ఆయనకు శాసనసభలో యువ సహచరులు. ఎందరో యువ శాసనసభ్యులు శ్యాం సుందర్‌ ఉపన్యాసాలను, ఆయనతో సాహచర్యాన్ని అభిలషించేవారు. ఆయన గంటల తరబడి దళితుల వెనుకబడిన వర్గాల, మైనారిటీల సమస్యల గురించి చర్చిస్తున్నపుడు వారు ఉత్తేజంతో ఆయన అనుయాయులుగా ఉండేవారని చెబుతారు. హిందీ, ఆంగ్ల, ఉర్దూ, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన రచనలు వెలువడ్డాయి. ‘భూ దేవతోంకా మేనిఫెస్టో’, ‘దే బర్న్‌’, భీం సేన అవర్‌ పాస్ట్‌ అండ్‌ ప్రజెంట్‌’ ముఖ్యమైన రచనలు అనేకం ఉన్నాయి.
శ్యాం సుందర్‌ లాంటి అనితర సాధ్యమైన విప్లవ కారులు, మేధావులు అరుదు. సమాజం వారిని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే కాకుండా, వారి జీవితకాలంలో సరయిన గుర్తింపును కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం. దేశంలో వర్గం, కులం అని విడదీయబడిన శక్తులు చావోరేవో తేల్చుకొనే పరిస్థితి ఏర్పడింది. సమైక్యతకు గండిపడి, అగ్ర కులాల చేతుల్లో అధికారం కేంద్రీకరించబడిన స్థితిలో దళితులు, మైనారిటీలు, వెనకబడిన కులాలు తమ స్థైర్యాన్ని కోల్పోతున్నాయి. నేడు సనాతన సిద్ధాంతాలు వివిధ రూపాలలో విజృంభిస్తున్నాయి. ఇలాంటి సంక్షుభిత స్థితిలో శ్యాం సుందర్‌ లాంటి వారి ఆలోచనలు, రచనల అవసరం ఉంది.
- ఎ.ఎన్‌. నాగేశ్వర రావు
(నేడు బత్తుల శ్యాంసుందర్‌ జయంతి)
Andhra Jyothi Telugu News Paper Dated: 21/12/2014 

Saturday, December 6, 2014

కుల, వర్గ రహిత సమాజమే అంబేద్కర్‌ అభిమతం By జి. రాములు


            డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భారతదేశం గర్వించదగ్గ సామాజిక విప్లవకారులలో అగ్రగ ణ్యుడు. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో అంబేద్కర్‌ ప్రభావం అనన్యసామాన్య మైంది. తరతరాలుగా కులపీడనకు గురై, సమాజం నుంచి వెలివేయబడిన బానిసత్వం కంటే హీనంగా చూడబడుతున్న అస్పృశ్య అణగారిన ప్రజలకు ఆయన ఆరాధ్యదైవంగా నిలిచిపోయాడంటే ఆయన గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిందెంతో ఉంది. అంబేద్కర్‌ దళితునిగా జీవించడమే కాదు అంటరాని తనం, కుల వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడాడు. తాను స్వయంగా పేదరికాన్ని అనుభవిం చాడు. భూస్వామ్య విధానం దుష్టస్వభావాన్ని గ్రహించాడు. దానికి వ్యతిరేకంగా పోరాడాడు. సమ సమాజం కావాలన్నాడు. 'బోధించు, సమీకరించు, పోరాడు' అన్న అంబేద్కర్‌ నినాదం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఆయన తన అభిప్రాయాలను నిర్భయం గా బోధించాడు. వాటి అమలుకై సమీకరించాడు. లక్ష్య సాధనకై నిరంతరం పోరాడాడు. చాలా మంది అంబేద్కర్‌ రచనలను అధ్యయనం చేయకుండానే కేవలం కుల సమస్య గురించే ఆయన అధ్యయనం చేశాడని, అంటరాని వాడు కాబట్టి అంటరానితనానికి వ్యతిరేకంగా కృషి చేశాడని, దళితుల రిజర్వేషన్లకై కృషి చేశాడనే చులకన భావన కలిగి ఉన్నారు. కానీ ఆయనకు దేశ ఆర్థిక విధానం, ప్రభుత్వ స్వభావం, ఉత్పత్తి సాధనాలు, కార్మికోద్యమం, భూస్వామ్య విధానం, స్త్రీ సమస్యలు, ఫాసిజం, దేశ సమగ్రత, కుల వ్యవస్థ, దాని అమానుషత్వం పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించొచ్చు లేదా విభేదించొచ్చు. కానీ ఆయన వాటన్నింటినీ అధ్యయనం చేసింది, తనదైన రీతిలో భాష్యం చెప్పింది సుస్పష్టం. అంబేద్కర్‌ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలనే పరిశీలిద్దాం. ఉత్పత్తి గుర్తించాలన్నాడు. ప్రజలందరికీ భూమిపై సమాన హక్కులుండాలన్నాడు. కులమతాలకతీతంగా భూములను కౌలుకివ్వాలన్నాడు. గ్రామాల్లో భూస్వామిగాని, కౌలుదారుగాని, వ్యవసాయ కూలీలు గాని ఉండరాదన్నాడు. అందరూ సమానమే అన్నాడు. అందరూ ఉత్పత్తిలో భాగం కావాలన్నాడు. ప్రభుత్వమే నీరు, పని చేసే పశువులు, పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందజేయాలన్నాడు. అందు కయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలన్నాడు. భూస్వామ్య విధానం సమాజ పురోగతికి ఆటంకమ న్నాడు. చెప్పడమే కాదు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఆనాటి మహారాష్ట్రలోని 'కొంకణ' ప్రాంతంలో భూమి మీద హక్కులు 'ఖోటీ'లనబడే భూస్వామ్య వర్గ చేతుల్లో ఉండేవి. వారు రైతులపై శిస్తు రూపాన అధికంగా డబ్బు వసూలు చేసేవారు. అదే విధంగా పండించిన పంటలో కూడా దౌర్జన్యంగా భాగం తీసుకునేవారు. ఇది కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. ఈ 'ఖోటీ' పద్ధతికి వ్యతిరేకంగా అంబేద్కర్‌ రైతు ఉద్యమాన్ని నడిపాడు. అటు ఉద్యమాన్ని నిర్మిస్తూనే మహారాష్ట్ర శాసనసభలో తానే 'ఖోటీ' నిర్మూలన కొరకు 1937లో బిల్లు ప్రవేశపెట్టాడు. అది చివరకు 1949లో చట్ట రూపం ధరించే వరకూ పోరాడాడు. అదే విధంగా 'దేశ సౌభాగ్యం దేశ పారిశ్రామికీకరణ మీద ఆధారపడి ఉంది. జాతీయ యాజమాన్యంలో అది జరగాలేకాని ప్రయివేటు వ్యక్తుల పరంగా కాదు' అంటూ ప్రైవేటీకరణను అంబేద్కర్‌ ఖండించాడు.
               దేశంలో ప్రస్తుతమున్న కుల, వర్గ పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కార్మికవర్గమే నాయకత్వం వహించాలన్నాడు. 'దేశానికి నాయక త్వం అవసరం. అయితే ఆ నాయకత్వాన్ని వారు వహిస్తారా అన్నది ప్రశ్న. దేశానికి అవసరమైన అలాంటి నాయకత్వాన్ని శ్రామికవర్గం మాత్రమే సమకూర్చగలదని చెప్పడానికి నేను సాహసిస్తు న్నాను' అని 1942 డిసెంబర్‌లో 'శ్రామికవర్గం- ఆదర్శవాదం' అనే విషయంపై మాట్లాడుతూ స్పష్టం చేశారు. కార్మికవర్గ సమస్యలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. కార్మికవర్గ భవిష్యత్తుకు సాంఘిక న్యాయం, సాంఘిక భద్రత పునాదులు కావాలని, పటిష్టమైన కార్మిక చట్టాలు దోహదపడుతాయని భావించాడు. అందుకు ముఖ్య చట్టాలైన కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక సంఘాల గుర్తింపు చట్టాల కొరకు కార్మికుల ప్రతినిధిగా ప్రభుత్వ కమిటీలలోనూ, లాయర్‌గా కోర్టులోనూ, చట్టసభల్లో సభ్యునిగానూ అవిరళ కృషిచేశాడు.
            డాక్టర్‌ అంబేద్కర్‌కు ఫాసిజం ప్రమాదం పట్ల స్పష్టమైన అభిప్రాయం ఉంది. అది మానవాళి మనుగడకు ముప్పని గ్రహించాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఆయన 1942లో ఆకాశవాణిలో చేసిన ప్రసంగం గమనిస్తే 'ఈనాడు జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం కేవలం ప్రపంచాల విభజన కోసం మాత్రమే కాదు. నియంతృత్వం మీద విజయం సాధించి స్వేచ్ఛా సమానత్వాలు నెలకొల్పడానికి మన కార్మికులు తమ సంపూర్ణ మద్దతివ్వాలి. సాధించబోయే విజయం నూతన, సామాజిక వ్యవస్థకు దోహద పడాలి. స్వాతంత్య్రం సాధించినంత మాత్రాన సరిపోదు స్వాతంత్య్ర ఫలితాలు మనం నిర్మించుకోబోయే సమతా సమాజం మీద ఆధారపడి ఉండాలి' అంటూ ఫాసిజానికి వ్యతిరేక పోరాటంలో కార్మికవర్గ ప్రయోజనాలు ఎలా ఉపయోగించుకోవాలో కూడా సూచించాడు. డాక్టర్‌ అంబేద్కర్‌ దేశ సమగ్రత కాపాడాలని కోరాడు. కులాలు, మతాలు, జాతులు, అనేక సంస్కృతులున్న ఈ దేశంలో ఐక్యంగా ఉంటేనే ప్రయోజనమని భావించాడు. 'పాకిస్తాన్‌'లాగా 'దళితస్తాన్‌' 'హరిజన్‌స్థాన్‌' లాంటి నినాదాలివ్వడం ఆ రోజుల్లో పెద్ద సమస్యేమీ కాదు. అయినా ఇవ్వలేదంటేనే ఆయనకు దేశ సమగ్రతపట్ల ఉన్న చిత్తశుద్ధి ద్యోతకమవుతుంది. కుల, వర్గ దోపిడీ లేని రాజ్యం కావాలన్నాడు. అలాంటి రాజ్యం కావాలంటే దానంతటదే రాదన్నాడు. అందుకు పోరాటమే శరణ్యమన్నాడు. రాజ్యాధికారమే పీడిత వర్గాల సామాజికాభివృద్ధికి ఏకైక మార్గం. రాజ్యాధికారం లేకుండా మన అభివృద్ధి అసంభవం అని స్పష్టంగా చెప్పాడు.
స్త్రీలు భారత సమాజంలో నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారని 'ప్రతి స్త్రీని శాస్త్ర దాస్యం నుండి విముక్తి' చేయాలన్నాడు. ఈ లక్ష్యం చేరుకునే క్రమంలో 'హిందూకోడ్‌' బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఆనాటి సనాతన, సంప్రదాయ అగ్రకుల పాలకులు నిరాకరించారు. ఆ బిల్లు ఆమోదానికి తోడ్పడని ప్రధాని నెహ్రూ వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసిన ఆదర్శవంతుడు, త్యాగశీలి అంబేద్కర్‌. శ్రామిక మహిళల 'ప్రసూతి ప్రయోజనాల చట్టం' కొరకు పోరాడిన వారిలో డాక్టర్‌ అంబేద్కర్‌ ముందుపీఠిన ఉన్నాడు. ఈ దేశం అభివృద్ధి కాకపోవడానికి, శ్రామికులంతా ఐక్యం కాకపోవడానికి, దోపిడీ కొనసాగటానికి కుల వ్యవస్థ పెద్ద ఆటంకమని గుర్తించాడు. అందుకే కుల సమస్యలపై ప్రత్యేకంగా ఆయన పరిశోధన చేశాడు. రాజ్యాధికారానికై శ్రమజీవులను ఐక్యం కాకుండా చేస్తున్న ప్రతిబంధ కాల్లో కుల వ్యవస్థ చాలా కీలకమైందిగా గుర్తించాడు. దేశంలో శ్రమ విభజనే కాదు శ్రామికుల మధ్య విభజన అనే తరతరాల అగాధం ఉందన్నాడు. ఇది అగ్రకుల దోపిడీ వర్గాల రక్షణకు పెట్టనికోటలా ఉందన్నాడు. శ్రామికుల మధ్య ఐక్యతకై ప్రత్యేక ప్రయత్నం, నిరంతర ప్రయత్నం జరగాలన్నాడు. 'విప్లవం తేవడానికి భారతదేశంలోని కార్మికవర్గ ప్రజలంతా ఏకం అవుతారా? నా దృష్టిలో ఆ శక్తి ఒక్కటే... అదేమిటంటే తనతోపాటు విప్లవంలో పాల్గొంటున్న వారిలో ఒకరి పట్ల ఒకరు సంపూర్ణ విశ్వాసం చూపగల్గాలి' అన్నాడు. 'మనుషులు తరతరాలుగా సాంఘిక అణచివేతకు గురవుతున్నారు. ఆస్తి సమానత్వం కొరకు మాత్రమే విప్లవంలో పాల్గొనరు. విప్లవం సాధించిన తర్వాత కుల, మత భేదాలు లేకుండా సమానత్వంగా చూడబడతామనే గ్యారంటీ ఉంటేనే అరమరికలు లేకుండా విప్లవోద్యమంలో పాల్గొంటార'న్నాడు.
అందుకే 'కుల నిర్మూలన' అనే చారిత్రాత్మకమైన గ్రంథంలో అనేక విషయాలు రాశాడు. భారతదేశం సామాజిక విప్లవోద్యమ ఆవశ్యకత మిగతా దేశాల న్నింటి కంటే ఎక్కువగా ఉందని భావించాడు. సామాజిక ఉద్యమంలో కీలకమైనది 'కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటం' అని భావించాడు. స్వకుల వివాహాలే కులవ్యవస్థను కొనసాగించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయని, అందుకు స్వకుల వివాహా లను నిరుత్సాహపర్చాలని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఏదైనా పోరాడితేనే పోతుందని, కాబట్టి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడితేనే కులం బలహీన పడుతుందన్నాడు. కుల వ్యవస్థ బలహీన పడటం వర్గ ఐక్యత పటిష్టతకే తోడ్పడుతుందన్నాడు. కుల వ్యవస్థ వర్గ దోపిడీని రక్షిస్తుందన్నాడు. వాస్తవానికి కమ్యూని స్టుల అభిప్రాయాలకు అంబేద్కర్‌ ఆలోచనలకు సామీప్యమే ఎక్కువ. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు 1998 నవంబర్‌ 20న ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో 'అంబేద్కర్‌ అభిప్రాయాలకు, కమ్యూనిస్టుల అభిప్రాయాలకు పెద్దతేడా లేదు. కొన్ని విషయాల్లో కమ్యూనిస్టుల కన్నా ముందున్నారు కూడా. దేశంలో ఉన్న భూమిని జాతీయం చేయాలని చెప్పడం ఎంతో ముందు చూపుతో కూడింది. హిందూ ధర్మశాస్త్రాలను తూర్పారాపట్టాలని, వాటిని ఓడిస్తే తప్ప కుల వ్యవస్థ పోదని చెప్పడం అంబేద్కర్‌ చాలా ప్రధానంశంగా తీసుకున్నాడనే అంశాన్ని రుజువు చేస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయాధికారం కావాలన్నారు. నిజానికి కమ్యూనిస్టులతో అత్యంత చేరువగా అభిప్రాయమున్న వ్యక్తి అంబేద్కర్‌. అయితే రాజ్యాంగ యంత్రం, ప్రజాస్వామ్యం, తదితర విషయాల్లో కొన్ని విభేదాలున్నాయి' అని చెప్పిన అంశాలు సదా గమనంలో ఉండటం అవసరం.
             డాక్టర్‌ అంబేద్కర్‌ 58వ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళి అర్పించడమంటే కుల, వర్గ రహిత సమాజం కొరకు పోరాడటమే. 

Prajashakti Telugu News Paper Dated: 05/12/2014