Saturday, May 3, 2014

అంబేద్కర్ వెలుగులో మోదీ (గతానుగతం) - రామచంద్ర గుహ


Published at: 04-05-2014 02:50 AM
కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కోట్లాది ప్రజలు అత్యుత్సాహంతో ఉన్న ఈ తరుణంలో నా ఆలోచనలు డాక్టర్ అంబేద్కర్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. దళితుల విమోచకుడుగా కంటే, ప్రజాస్వామిక సైద్ధాంతిక వేత్తగా అంబేద్కర్ దార్శనికత నా ప్రస్తుత ఆలోచనలకు ప్రేరణ. 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో అంబేద్కర్ చేసిన ఒక మహోపన్యాసాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొంటున్నాను. మన రాజ్యాంగనిర్మాత ఆ ఉపన్యాసంలో మూడు హెచ్చరికలు చేశారు. రాజకీయ వ్యవహారాల్లో రాజ్యాంగబద్ధ పద్ధతులను విడనాడడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, రాజకీయ ప్రజాస్వామ్య పరిమితులు, సామాజిక ప్రజాస్వామ్య ఆవశ్యకత గురించి ఆయన హెచ్చరికలు నేటికీ ఉపయుక్తమైనవి. అయితే ప్రస్తుతఎన్నికల నేపథ్యంలో, అంబేద్కర్ మూడో హెచ్చరికను తప్పక గుర్తుచేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ నిర్దిష్ట నాయకుడినీ, ఎంత మహోన్నతుడైనప్పటికీ, గుడ్డిగా అనుసరించవద్దని అంబేద్కర్ హెచ్చరించారు. ఆ సందర్భంగా ఉదారవాద తాత్త్వికుడు జాన్ స్టువార్ట్ మిల్‌ను మాటలను ఉటంకించారు. 19వ శతాబ్దికి చెందిన ఆ పాశ్చాత్య చింతకుడు ఇలా అన్నారు: 'ఒక ప్రజాస్వామ్య సమాజ పౌరులు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, ఒక వ్యక్తి-ఎంత మహోన్నతుడయినప్పటికీ- నాయకత్వానికి పణంగా పెట్టకూడదు; తనకున్న అధికారాలతో రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే అవకాశమున్నందున అధికారంలో ఉన్న వ్యక్తిని ఎంత గొప్పవాడయినప్పటికీ విశ్వసించకూడదు'. అంబేద్కర్ ఇలా వ్యాఖ్యానించారు:
'దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తికి కృతజ్ఞతాబద్ధులై ఉండడం తప్పుకాదు. అయితే కృతజ్ఞతకు హద్దులు ఉండాలి ఐరిష్ దేశభక్తుడు డేనియల్ ఓ'కాన్నెల్ అన్నట్టు ఏ పురుషుడూ తన ఆత్మగౌరవాన్ని కించబరచుకునే విధంగా కృతజ్ఞత చూపలేడు; ఏ మహిళా తనకు మానహాని జరిగే విధంగా కృతజ్ఞత చూపలేదు; ఏ జాతీ తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయే విధంగా కృతజ్ఞతాబద్ధమై ఉండదు'. అంబేద్కర్ ఇంకా ఇలా అన్నారు: 'మరే ఇతర దేశంకటే భారతదేశం విషయంలో ఇటువంటి జాగ్రత్త మరింతగా అవసరం. ఈ దేశంలో భక్తి, వీరారాధన ఎక్కువ. ప్రపంచంలోని మరే ఇతర దేశ రాజకీయాలలో కంటే మన దేశ రాజకీయాలలోనే ఇవి ఎనలేని పాత్ర నిర్వహిస్తున్నాయి. మతంలో భక్తి మోక్ష సాధనకు తోడ్పడవచ్చు. అయితే రాజకీయలలో భక్తి లేదా వీరారాధన తప్పకుండా జాతి భ్రష్టతకు, అంతిమంగా నియంతృత్వ పాలనకు దారితీస్తాయి'.
అంబేద్కర్ ఈ మాటల ద్వారా, సాధారణీకరించిన ఒక హెచ్చరికను చేశారు. అయితే ఈ హెచ్చరిక చేయడంలో ఆయన మనసులో ఎవరైనా నిర్దిష్ట వ్యక్తులు ఉన్నారా? గాంధీ పట్ల భారతీయుల మితిమీరిన ఆరాధనను అంబేద్కర్ తొలినుంచి వ్యతిరేకించారు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలో జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్ తదితరులకు దేశ ప్రజల్లో బ్రహ్మాండమైన ప్రతిష్ఠ ఉండడాన్ని ఆయన గమనించారు. దేశ స్వాతంత్య్ర సాధనకు మహాత్మాగాంధీ నాయకత్వంలో ఆ నాయకులూ, వారి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల సుదీర్ఘ పోరాటం చేశారు. అనుపమేయ త్యాగాలు చేశారు. కఠోర కష్టాలు పడ్డారు. కనుకనే అశేష ప్రజలు వారిని విపరీతంగా అభిమానించసాగారు. అంబేద్కర్ ఈ పరిణామాలన్నిటినీ గమనించారు. పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్న విషయం ఆయన్ని కలవరపరిచాయి. గాంధీ, నెహ్రూలు జీవితపర్యంతం దేశసేవలోనే గడిపినందున వారి భావాలు, చర్యలు విమర్శకు అతీతమైనవా? సామాన్య పౌరులు ఎదురు ప్రశ్నించకుండా వారి మాటలను అనుసరించవలసిందేనా?
ప్రజలు నాయకులను గుడ్డిగా అభిమానించి, అనుసరించడంలో ఉన్న ప్రమాదాల గురించి జవహర్‌లాల్ నెహ్రూకు బాగా తెలుసు. 1937 నవంబర్‌లో కలకత్తా నుంచి వెలువడే 'మోడరన్ రివ్యూ'లో నెహ్రూ మీద ఒక వ్యాసం ప్రచురితమయింది. 'ఇతరుల పట్ల అసహనం, బలహీనులు, కార్యదక్షత లేని వారి పట్ల తిరస్కార వైఖరి' గురించి ఆ వ్యాసం పేర్కొంది. ఇటువంటి ధోరణులు నెహ్రూలో ఇప్పటికే బలవత్తరంగా ఉన్నాయని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాదు 'జవహర్‌లాల్ త్వరలోనే తనను తాను ఒక సీజర్‌గా భావించుకోవచ్చునని' కూడా ఆ వ్యాసం హెచ్చరించింది. 'చాణక్య' అనే కలంపేరుతో నెహ్రూనే ఆ వ్యాసం రాశారని ఆ తరువాత వెల్లడయింది.
స్వీయ పరిమితులు, లోపాల గురించి నెహ్రూకు బాగా తెలుసు గనుకనే తన సీజరిస్ట్ ధోరణులను ఆయన అదుపులో పెట్టుకున్నారు. దీంతో పాటు తన సహచరులైన నాయకులు మహోన్నత రాజకీయ నేతలు అనే వాస్తవాన్ని నెహ్రూ బాగా గుర్తెరగడం కూడా అందుకు ఎంతైనా తోడ్పడింది. నెహ్రూ వలేకాక ఆయన తనయ ఇందిర ప్రజల చేత మరింతగా ఆరాధింపబడాలని ఆకాంక్షించే వారనడంలో సందేహం లేదు. 1969-74 మధ్య మూర్తీభవించిన జాతి స్ఫూర్తిగా ఆమె దేశ ప్రజల గౌరవ మన్ననలను పొందారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్ విముక్తి సమరంలో పాకిస్థాన్‌పై సైనిక విజయం మొదలైన వాటి కారణంగా దేశప్రజలు తనను మరింతగా అభిమానించాలని ఇందిర కోరుకునే వారు.
సంఖ్యానేక భారతీయులు ఇందిరను ఆరాధించారు. సామాన్య ప్రజలే కాదు, రచయితలూ, కళాకారులూ కూడా. ఎమ్.ఎఫ్. హుస్సేన్ ఆమెను దుర్గగా చిత్రించారు. తన మాతృభాష అస్సామీలో చెప్పుకోదగ్గ కవి అయిన దేవకాంత్ బారువా అయితే 'ఇండియా అంటే ఇందిర, ఇందిరే ఇండియా' అని కూడా నినదించారు. ఇందిరాగాంధీ, ఆమె అభిమానుల ప్రవర్తన, రాజకీయాలలో భక్తి, వీరారాధన ధోరణుల ప్రమాదాలకు ఒక ప్రామాణిక ఉదాహరణ. ఇందిర పట్ల చూపిన ఆ ఆరాధనా భావం -అంబేద్కర్ హెచ్చరించిన విధంగా- జాతి భ్రష్టతకు, అంతిమంగా నియంతృత్వ పాలనకు దారితీసింది. తన అధికారానికి ముప్పు ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీని విధించి తన ప్రత్యర్థులందరినీ జైలుకు పంపడానికీ ఆమె వెనుకాడలేదు కదా.
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట వ్యక్తి పూజ ప్రభవించింది ఇందిరాగాంధీ విషయంలోనే. విచారకరమైన విషయమేమిటంటే ఆ అప్రజాస్వామిక పరిణామాలు చోటుచేసుకోవడం అదే చివరిసారి కాదు. సరే, ఇప్పుడు నరేంద్ర మోదీ వ్యక్తిపూజ ప్రభవిస్తోందని మరి చెప్పనక్కర లేదు. కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రాంతీయపార్టీల వలే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఒక నాయకుని నేతృత్వంలో లేదు. నిజానికి తమది ఉమ్మడి నాయకత్వంలోఉన్న పార్టీ అని బీజేపీ వారు సగర్వంగా చెప్పుకోవడం కద్దు. ఇప్పుడిదంతా మారిపోయింది. 2014 సార్వత్రక ఎన్నికల సందర్భంగా బీజేపీ అంతకంతకు తనను తాను ఒక వ్యక్తి సంకల్పానికి లొంగిపోతోంది. మోదీ ప్రచార యంత్రాంగం తొలుత ఆయన్ని పార్టీ రక్షకుడుగా, ఆ తరువాత జాతి రక్షకుడుగా కీర్తిస్తోంది. ఇతర బీజేపీ నాయకులూ మోదీకి పూర్తిగా విధేయులైపోయారు. ఆయన విధానాలను విమర్శనాత్మకంగా చూడడానికి నిరాకరిస్తున్నారు. బీజేపీ నాయకులకూ, కార్యకర్తలకూ మోదీ మాటే వేదం అయిపోయింది. ఇప్పుడు మనలనూ అదే రీతిలో మోదీని అనుసరించాలని కోరుతున్నారు!
విదేశాలలో 'అర్థరహిత మోదీ ఆరాధన' ఉన్నదని ఒక ఎడిటర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఒక గొప్ప నాయకుడుగా మోదీ వ్యక్తి పూజను పెంపొందించడంలో విధేయులైన రచయితలు, పాత్రికేయులు పోటీపడుతున్నారు. ఒకప్పుడు ఇందిరకు దేవకాంత్ బారువాలాగా తామూ మోదీకి అలా మారాలని వారు ఆశిస్తున్నారు! నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని, ఏటా పది శాతం వృద్ధిరేటుతో ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తారని, పాకిస్థాన్, చైనాలను దీటుగా ఎదుర్కొంటాడని, భారత్‌ను గొప్ప అగ్రరాజ్యంగా రూపొందిస్తాడని తమ పాఠకులకు వారు హమీ ఇస్తున్నారు. సైబర్ రౌడీలు మరింత దురహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు. తమ 'మహాపురుషుడిని' పొగడడంలో కంటే, ఆయన్ని వ్యతిరేకిస్తున్నవారిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించడం ద్వారా వారు తమ భక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ధోరణులు అంబేద్కర్‌ను ఎంతగానో భయపెట్టేవి. మనమూ, బహుశా వాటి విషయమై కలవరపడుతున్నాము.
n రామచంద్ర గుహ
 
Andhra Jyothi Telugu News Paper Dated: 4/4/2014 

No comments:

Post a Comment