Saturday, May 3, 2014

'నోటా' కూడా అణచివేత సాధనమే! - By కొంగర మహేష్ , రీసెర్చ్ స్కాలర్, ఓయూ

Published at: 04-05-2014 02:52 AM
భారత ఎన్నికల చరిత్రలో 'నోటా' (నన్ ఆఫ్ ది ఎబౌ) అవకాశం ప్రజాస్వామ్య పరిపుష్టికి అవసరమయ్యే మరో ఆయుధం. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోయినా మీటనొక్కి దిమ్మతిరిగే తీర్పు నిచ్చే అరుదైన అవకాశం ఓటరుకు దక్కడమే ఈ 'నోటా' (నిలబడ్డవాళ్లెవరూ నాయకుడిగా పనికిరారన్నది) అసలు ఉద్దేశం. ఓటు అనే ఖడ్గానికి మరింత పదునుపెట్టి ఈ 'నోటా' మీట అసలు లక్ష్యం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణే. తమకు సుపరిపాలన అందించే సమర్థ నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటుకో బలమైన విలువ చేకూర్చడం దీని కర్తవ్యం. 'నోటా'ను గత ఏడాది సెప్టెంబర్ 17 తదుపరి ఎన్నికల నుంచి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నోటా సదుపాయాన్ని భారత్‌తో సహా మరో 11 దేశాలు తమ ఎన్నికల్లో వినియోగించుకుంటున్నాయి. అక్రమ సంపాదన, అవినీతి సొమ్ము, నల్లధనం.. ఇలా పేరేదైనా ప్రజాస్వామ్యాన్ని 'ధన'స్వామ్యంగా మార్చి చట్టాలను చుట్టాలుగా వినియోగించుకునే ఖద్దరు నేతలకు నోటా ఓ ఖబడ్దార్ వంటిది.
అంతటి బృహత్తర ఆశయంతో రూపుదిద్దుకున్న నోటా మీట నుంచి ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఆదిలోనే గుదిబండగా మారుతోంది. అదీ కూడా కుల 'తంత్రం'తో ముడిపడి ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల ఎన్నికకు ప్రతిబంధకంగా మారడం ఆందోళనకరం. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీ, మిజోరాం, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా నోటా మీటను వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఓటర్లకు అవకాశం కల్పించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు'నోటా' హక్కును ఎలా వినియోగించుకున్నారు? ఏయే సెగ్మెంట్లలో నిలబడిన అభ్యర్థుల పట్ల తమ అసంతృప్తిని వెలబుచ్చారన్న అంశాలపై జాతీయ మీడియా సంస్థ ఒకటి జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పై రాష్ట్రాల్లో మొత్తం 630 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 400 జనరల్ స్థానాలుండగా మిగిలిన రిజర్వ్‌డ్ స్థానాల్లో దాదాపు 25 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనే నోటా ఎక్కువ నమోదయింది. మళ్ళీ ఇందులోనూ 23 స్థానాలు ఎస్టీ (గిరిజన) రిజర్వ్‌డ్ స్థానాలు కావడం కులాధిపత్య సమాజ నూతన పోకడలకు నిలువుటద్దం. వీటిల్లో టాప్ ఐదు స్థానాల్లో నోటా నమోదును పరిశీలిస్తే.. తమకు రిజర్వ్‌డ్ అభ్యర్థులెవరూ నచ్చలేదని చత్తీస్‌ఘడ్ బీజాపూర్ - 7179 ఓట్లు (పది శాతం), చిత్రకోట్ 10848 (తొమ్మిది శాతం), దంతేవాడ -9677 (తొమ్మిది శాతం), మధ్యప్రదేశ్‌లోన జున్నార్ దేవ్ -94,12 (ఆరు శాతం), నారాయణ్‌పూర్ (చత్తీస్‌ఘడ్)-6731 (ఆరు శాతం) మంది ఓటర్లు నోటా వినియోగించారు. ఢిల్లీలోని 4 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ 'నోటా' మీట ప్రబలంగానే వినియోగించుకున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.
కేవలం 5 రాష్ట్రాల్లోని 630 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో నోటా మీట నొక్కడం భయాందోళనకు గురి చేస్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న 543 లోక్ సభ స్థానాలు (84-ఎస్సీ, 47-ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు), 294 (తెలంగాణ, సీమాంధ్ర) అసెంబ్లీ నియోజకవర్గాల (ఎస్సీ-48, ఎస్టీ-19 రిజర్వుడ్ స్థానాలు) ఎన్నికలు కలవరం కలిగిస్తున్నాయి. ఎన్నికల వేళ కోటానుకోట్ల రూపాయల పంపిణీకి పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడో కలుషితమై పోయాయి. కులం, ధనం, ప్రధాన ఇంధనాలుగా సాగుతున్న ఈ ఎన్నికల్లో నోటా మీట భారీగానే నమోదవుతుందని ఓఅంచనా. దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మనువాద నిచ్చెనమెట్ల రాజకీయపార్టీలన్నీ చట్టబద్ధ రిజర్వేషన్ల కారణంగా తప్పనిసరై తమకు నచ్చినవారిని, అనుచరులు, అతికొద్దిమంది విద్యావంతులు, కాస్తో కూస్తో ఆర్థికంగా స్థిరపడ్డ ఎస్సీ, ఎస్టీలనే బరిలోకి దింపాయి. వారే ఎంపీ, ఎమ్మెల్యేలుగా రిజర్వ్‌డ్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
మన ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒక పార్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో నిలబెట్టిన అభ్యర్థుల ఆర్థిక బలాబలాలు పరిశీలించిన మీదటనే టిక్కెట్లు కేటాయించినట్లు ఆరోపణలు బహిరంగంగానే గుప్పుమన్నాయి. రిజర్వ్‌డ్ స్థానాల్లో అగ్రకులాల జనాభా పరిమితంగా ఉన్నా ప్రాబల్యం బలంగానే ఉంటుంది. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ నియోజవర్గాల్లో ఓటింగ్ శాతం 60 శాతంలోపే. కారణం ఆయా వర్గాలు ఓటు హక్కు వినియోగించుకునే అధికార యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలు నామమాత్రంగా ఒకటికాగా అక్కడి 'మరింత చైతన్యవంతులైన అగ్రకులాలకు ఓటు వేసేంత సమయం ఉండకపోవడం మరో కారణం. ఇక చివరికి తప్పక ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళేమో నోటా నొక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పై తెలిపిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఓటు వినియోగాన్ని చూస్తే ఆశ్చర్యం, ఆందోళన కలుగకమానదు. మిగతా జనరల్ స్థానాల్లో కంటే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో నోటా వినియోగం అధికంగా ఉందంటే అక్కడ సమర్థ నాయకుడు లేడని కాదు.
అసలు 'రిజర్వ్‌డ్' స్థానాలు ఉండకూడదని, అంతటా అగ్రకులాలే నిలబడాలని, రాజ్యమేలాలనేదే అసలు రహస్యం. ఒకవేళ అగ్రకులాలు, ఓబీసీల దృష్టిలో ఆ రిజర్వ్‌డ్ స్థానాల్లో నిలబడ్డ అందరూ అసమర్థ అభ్యర్థులే అనుకుంటే మిగతా 400 స్థానాల్లో నిలబడ్డ ఓబీసీ, జనరల్ కేటగిరిలకు చెందినవారంతా సమర్థులా? సమర్థత అనేది కులం ఆధారంగా కంటే వ్యక్తి తన వ్యక్తిత్వం, వనరుల, పార్టీ అధినాయకత్వం ఇచ్చే మద్దతుపై ఆధారపడి ఉంటుంది. కానీ కుల పునాదులపై రూపుదిద్దుకున్న భారత దేశంలో పుట్టుకతోనే ఆ వ్యక్తి బలం, బలహీనతలు నిర్ణయించబడుతున్నాయి. లోకజ్ఞానం, ఉన్నత చదువులు, ఆస్తులు, అంతస్థులు సంపాదించుకున్నా ఇక్కడ కులమే ప్రామాణికం. దాని పర్యవసానమే ఎ స్సీ, ఎస్టీల అభ్యర్థుల 'తిరస్కరణ' కారణం. నేటి ఆధునిక సమాజంలో రాజులు పో యినా, రాజ్యాలు కూలినా రోజురోజుకు కుల నిర్మాణం మరింత దృఢమవుతోంది. ఏ కులానికాకులం మరింత దగ్గరవుతూ హక్కులు, ఆత్మగౌరం అంటుంది. ఇప్పటిదాకా అగ్రకులాల జాబితాలో ఉన్నవి కూడా పేదరికం పేరుతో రిజర్వేషన్లు కావాలంటున్నాయి. కుర్చీని కాపాడుకునేందుకు అమాత్యులు ఆ రకంగానే అడుగులు వేస్తూ కుంపట్లకు ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ కులం ప్రాతిపదికగానే నాయకత్వ ఎంపిక జరుగుతుండటం సామాజిక తిరోగమనానికి నిదర్శనం.
ఒకనాడు నోరులేని జనానికి తానై గొంతుగా నిలిచి చట్టసభల్లో గొంతుకనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్‌నే ముపుప్పతిప్పలు పెట్టిన ఈ సమాజం.. ఆధునికతను అందిపుచ్చుకొని అందివచ్చిన అవకాశాలు, చట్టాలన్నిటినీ తనకనుగుణంగా మలుచుకుంటోంది. అప్పట్లో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో అంబేద్కర్ పోటీ చేసినప్పటికీ ప్రశ్నించే నాయకుడు చట్టసభల్లో అడుగుపెడితే తమగొంతు మూగబోతుందని గ్రహించిన అగ్రకుల ఓటర్లే ఆయనకు ఓట్లు పడకుండా చేశారు. రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీచేసే అభ్యర్థులు తమ చెప్పుచేతుల్లో ఉంటేనే తప్ప ఓటు వేస్తానంటుందే తప్ప సమర్థతకు విలువ నివ్వరు. ఈ నేపథ్యంలో కులం ఇప్పటికీ కొనసాగుతున్న 60 ఏళ్ళ గణతంత్ర భారతంలో నోటా మీట అగ్ర వర్ణాలకు ఉపకరిస్తుందా అన్న భయం అణగారిన ప్రజల్లో మొదలైంది. విచక్షణ కోల్పోయి వివక్షకు దారితీసే నోటాపై చర్చ జరగాలి. చట్టసభల్లో వినిపించే గొంతును 'చట్టబద్ధ'మైన పద్ధతిలోనే నొక్కేస్తే, లక్ష్యం పక్కదారిబట్టి, నోట్లో మట్టికొట్టే పథకమైతే దాన్ని ఎత్తివేయడమే మేలు. కేవలం ఎస్సీ, ఎస్టీలు పోటీ చేస్తున్న చోట నోటా దుర్వినియోగమైతే ఆ స్థానాల్లో దాని రద్దే శరణ్యం. ఏదేమైనా నోటాపై జరిగే చర్చలు, సమాలోచనలు చివరికి క్యాండిడేట్ 'రీకాల్'కు దారితీసినా ఆమ్ ఆద్మీకి ఆమోదయోగ్యమే. ఓటుకు నోటుఅంటూ వచ్చే నాయకులకు నోటా ఓటా అని ఎదురు ప్రశ్నించే రోజులు ప్రతి ఓటరుకు రావాలి.

కొంగర మహేష్

Andhra Jyothi Telugu News Paper Dated: 4/4/2014 

No comments:

Post a Comment