Friday, May 2, 2014

సామాజిక తెలంగాణలో వంచన! By దామిశెట్టి రామాకోటేశ్వర్ రావు


లోపించిన సామాజిక కోణం 
వంచనకు గురైన ఉద్యమ బిడ్డలు 
నీరు గారిన ఉద్యమ హామీలు 
నిరాశలో విద్యార్ధి, యువజనులు 
కల్లలుగా మారిన బడుగు వర్గాల కలలు 
ఎవరికి బంగారు తెలంగాణ రాబోతోంది? 
మరో పోరాటం తప్పని పరిస్థితులు ్చ 

ఉద్యమాలే ఊపిరిగా, ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటే ధ్యేయంగా అర్ధశతాబ్దానికిపైగా నిరసనకారుల గుండెల్లో, కళాకారుల ప్రదర్శనల్లో, కవుల కలాల్లో, వాగ్గేయకారుల గొంతుకల్లో రణన్నినాదమై ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణ పోరాటం దేశంలోనే ఓ మహోజ్వల ఉద్యమఘట్టం. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణ భారత భౌగోళిక చిత్ర పటంపై 29వ రాష్ర్టంగా, తొలి భాష వియుక్త రాష్ర్టంగా ఆవిర్భవించాక పోలింగ్‌ ముగిసిన మొట్టమొదటి ఎన్నికలు పార్టీల పరంగా అధికారం కోసం సాగుతున్న అంతర్యుద్ధం, అస్తిత్వం కోసం జరుగుతున్న ఆఖరి యుద్ధంలా సాగాయి. సంపూర్ణ తెలంగాణ ప్రజలు కోరుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి. ప్రజలు ఆకాంక్షలు, ఆశయాలకు భిన్నంగా సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగా అడుగడుగునా రాజకీయ వంచన పర్వం వేళ్ళూనుకు పోతోంది. 

తెలంగాణ పునర్నిర్మాణం పేరిట అన్నీ పార్టీలు ఉద్యమ బిడ్డల్ని వంచించే ప్రయత్నాలకు ఏమాత్రం చరమగీతం పాడకపోగా వాటిని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. 16వ లోక్‌సభ ఎన్నికలలో దేశంలోనే అతి ఖరీదైన రాజకీయాలు నడుస్తున్న నయా రాష్ర్టంగా తెలంగాణ మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే టి.పి.సి.సి. అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించినట్లుగా విస్వసనీయతకు- విస్వాసఘాతుకానికి జరిగిన ఎన్నికలివి. ప్రత్యేక రాష్ర్టం కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను జెండాగా మార్చి దాని నీడలో రాష్ర్ట పునర్నిర్మాణమంటూ పొంతనలేని అజెండాలతో తెలంగాణ ప్రజలను మరింతగా వంచించేందుకు నిస్సిగ్గు రాజకీయాలకు పాల్పడుతున్నాయి కొన్ని బూర్జువా పార్టీలు. త్వరలో ఈ సార్వత్రిక ఎన్నికలను రాజకీయ పార్టీలు తమ తమ అధికార బలప్రదర్శనకు వేదికగా మార్చుకోగా, సామాజిక తెలంగాణ ఆశయసాధకులకు అదొక బలిపీఠంగా మారింది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు స్థావరమైనట్లుగా- నవతెలంగాణ రాష్ర్టం నిరుద్యోగ రాజకీయ పార్టీలు, సంస్థలకు కోరకపోయినా లభించిన వరంగా మారింది. 

ఉద్యమ సమయంలో కలుగులో ఉన్న చిన్న చితక పార్టీలు, రాజకీయ సామాజిక ఉద్యమ సంస్థలన్నీ తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్ధులు, యువతీయుకుల భుజంస్కంథాలమీద సాగిన తెలంగాణ చివరి దశ ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో నేడు రాజకీయ ఆధిపత్యం, అధికార సాధనల కోసం కొన్ని పార్టీలు అర్రులు చాస్తున్నాయి. సామాజికన్యాయం కోసం జరిగిన సాయుధ పోరాట చరిత్ర కలిగిన పురిటి గడ్డను రాజకీయ రణరంగంగా మార్చివేస్తున్నారు కొందరు స్వార్ధపరులు. భూస్వామ్య పెత్తందారి దొరల తెలంగాణలో సామాజిక రుగ్మతలు, వర్గ వైషమ్యాలు లేని పునర్నిర్మాణమే ప్రజల ఆకాంక్ష. అందుకు భిన్నంగా అగ్రవర్ణ పాలక వర్గాల ఆధిపత్యానికి ఈ ఎన్నికలనుండే బీజం పడింది.

ఒకనాటి ఉద్యమ సంస్థగా ఉన్న టిఆర్‌ఎస్‌, తెలంగాణ ఏర్పాటు అనంతరం కనుమరుగై పోతుందని అన్నీ పార్టీలు ఊహించినదానికి భిన్నంగా నేడు అది బలమైన రాజకీయ పార్టీగా ఎదిగి అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్ధులను నిలపడమే కాకుండా, ఈ ఎన్నికల్లో బరిలో దిగుతూ శతాబ్దాలు, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటం ఆశ్చర్యకరƒ పరిణామం. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు పరిశీలిస్తామని సూత్ర ప్రాయంగా అప్పట్లో అంగీకరించారు కేసిఆర్‌. అదే విధంగా టిఆర్‌ఎస్‌ గెలిస్తే తెలంగాణలో దళిత వ్యక్తిని సిఎం చేస్తామని ప్రకటించారు. కానీ ఈ రెండు విషయాలు ప్రస్తుతం ఆయన విస్మరించి ఓట్ల కోసం ప్రచారానికి బయలు దేరడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. బడుగు, బలహీన వర్గ ప్రజలు అత్యధికంగా ఉన్న తెలంగాణలో ఆయా వర్గాల ప్రజల తరపున ఈ ఎన్నికలలో సీట్ల కేటాయింపులలో సముచిత ప్రాధాన్యం ఇవ్వని ఆయన- రానున్న ఏడేళ్ళలో బంగారు తెలంగాణను నిర్మిస్తామని చేస్తున్న ప్రకటనల అంతరార్ధం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 
తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామే గనుక ఓటర్ల ఆదరణ తమకే ఉంటుందనే భ్రమలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ- టిఆర్‌ఎస్‌ ఇచ్చిన అనూ„హ్య షాక్‌తో- తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ శల్య సారథ్యం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, టిడిపి కూటములకు రెఫరెండమ్‌గా మారగా, వైఎస్సార్‌సిపి, వామపక్ష, ఇతర పార్టీలు అస్తిత్వ పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం ఊపిరి సలపని ఉద్యమాలు నడిపిన ప్రజలు అతి తర్వరలోనే తిరిగి- సంపూర్ణ సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులను కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా తీసుకొస్తున్నాయి. 

119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణ ప్రాంతంలో అధికారిక లెక్కల ప్రకారం 50.07 శాతం మంది బిసిలు, 15.8 శాతం మంది ఎస్సీలు, 8.9 శాతం మంది ఎస్టీలు, 12.4 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 12.87 శాతం మంది మాత్రమే అగ్రవర్ణ కులాలవారున్నారు. ఈ ఎన్నికల్లో బిసిలు నిర్ణాయక శక్తిగా ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్‌ పార్టీ 12.87 శాతం ఉన్న ఓసిలకి ఏపార్టీ కేటాయించని విధంగా అత్యధికంగా 47 శాతం సీట్లు (56) కేటాయించింది. బిసిలని 23 శాతం సీట్ల (26)కే పరిమితం చేసింది. 12.4 శాతమున్న ముస్లిం మైనారిటీలకు కేవలం 3.36 శాతం సీట్లు (4) కేటాయించి సమన్యాయాన్ని గాలికి వదిలేసింది. అదే విధంగా 15.8 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 10.9 శాతం సీట్లు మాత్రమే కల్పించి- బడుగు, బలహీన వర్గ ప్రజల పట్ల తమ వివక్షను చాటుకుంది. 

మొదటినుండీ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన టిడిపి సీట్ల కేటాయింపులో సామాజిక నమన్యాయాన్ని పాటించిందనే చెప్పాలి. జనాభా దామాషా ప్రకారం ఓసిలకు రెట్టింపు టిక్కెట్లు కేటాయించినా, 37.5 శాతం సీట్లు బిసిలకే వెచ్చించి చిత్తశుద్ధిని చాటుకుంది. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా 37 శాతం టిక్కెట్లను బిసిలకు కేటాయించడం చెప్పుకోదగ్గ అంశం. లెక్క ప్రకారం ప్రతి పార్టీ ఓసిలకు 12 నుండి 15 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించాలి. కానీ టిఆర్‌ఎస్‌ పార్టీ 56, కాంగ్రెస్‌ 41 స్థానాలు కేటాయించగా- టిడిపి మాత్రం 25 స్థానాలకు మించి ఇవ్వకపోవటం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల పట్ల వివక్షను విడనాడలేదు. 12.4 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలకు 4.5 శాతం టిక్కెట్లు (5) కేటాయించింది. టిడిపితో పొత్తుపెట్టుకున్న బిజెపి సైతం తమకు దక్కిన 47 అసెంబ్లీ స్థానాల్లో 26 శాతం (12) టిక్కెట్లను బిసిలకు కేటాయించడం విశేషం. తెలంగాణలో ఓసి యేతర శక్తుల వాటా 89.3 శాతం కాగా, వారికి ఈ ఎన్నికలలో సామాజిక న్యాయ వాటా 45.2 శాతం మాత్రమే. 
13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను బరిలో నిలిపిన వైఎస్సార్‌సిపి సైతం 7 స్థానాలకు ఏకంగా రెడ్డి సామాజిక వర్గీయులకే కట్టబెట్టి, మొత్తం 70 శాతం టిక్కెట్‌లను ఓసిలకే కేటాయించింది. సామాజిక తెలంగాణ ధ్యేయమని చెప్పుకునే పార్టీల చిత్తశుద్ధి ఇదేనా? 

తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిల్చిన యువతకి అన్నీ పార్టీలు తీరని ద్రోహం చేశాయి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి, బిజెపి కూటమి- ఓసి యేతరలకు 52 శాతం సీట్లు, కాంగ్రెస్‌ 53 శాతం సీట్లు, టిఆర్‌ఎస్‌ 44 శాతం సీట్లు కేటాయించాయి. వీటిలో కేవలం 10 శాతం సీట్లు కూడా అమరవీరుల తరఫున కృతజ్ఞతగా యువలోకానికి ఏ పార్టీ కల్పించకపోవడం దారుణమైన అంశం. అధికార కాంగ్రెస్‌ పార్టీని మినహాయిస్తే టిఆర్‌ఎస్‌, బిజెపి- టిడిపి కూటమి ఎస్సీ, ఎస్టీ, బిసిలకు సీట్ల కేటాయింపులో సముచితన్యాయం చేశాయనే చెప్పాలి. ఇక వైఎస్సార్‌సిపి విషయానికొస్తే 70శ ాతం సీట్లు ఓసిలకే కట్టబెట్టింది. సామాజిక తెలంగాణ కోరుకునే ప్రతిఒక్కరూ ఏ పార్టీ ఓసియేతరలకు పెద్దపీఠ వేసిందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. 

ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారిన 89.3శాతం ఓసియేతర శక్తులకు టిడిపి కూటమి అత్యధికంగా 52 శాతం సీట్లు కేటాయించింది. ముఖ్యమంత్రిని కూడా బిసినే చేస్తామని టిడిపి ప్రకటించింది. దళిత వ్యక్తిని సిఎం చేస్తానని తొలుత ప్రకటించి ఆ తర్వాత మాట మరచిన టిఆర్‌ఎస్‌ అధినేత ఏ మేరకు సామాజిక తెలంగాణను తెస్తారో ప్రజలు అర్ధంచేసుకోవాలి. టిడిపి కూటమితో సమానంగా బిసిలకు అసెంబ్లీ సీట్లను కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, సీట్లు కోసం తప్ప, తెలంగాణ ప్రజలపై ప్రేమతో రాష్ట్రాన్ని విభజించలేదనేది కూడా బడుగు, బలహీన వర్గ ఓటర్లు తెలుసుకోవాలి. తెలంగాణ ఆవిర్భావానంతరం జరుగుతున్న తొలి ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బిసిలకు అన్యాయం చేసిన పార్టీలేవో ప్రజలు గమనించాలి. సంపూర్ణ సామాజిక తెలంగాణ ఏ పార్టీతో సాధ్యమో గుర్తెరగాలి. 29వ రాష్ర్టం భవిష్యత్తు- తెలంగాణలో ఉన్న 89 శాతం బడుగు, బలహీన వర్గ ప్రజలు తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. దొరల పాలనకు చరమగీతం పాడాలంటే ఓసియేతర శక్తులు సంఘటితం కావలసిఉంది. అప్పుడే సామాజిక తెలంగాణ, తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమనే వాస్తవాన్ని గ్రహించాలి.

Surya Telugu News Paper Dated: 3/5/2014 

No comments:

Post a Comment