Saturday, August 9, 2014

అర్ధాకలితో హాస్టల్‌ విద్యార్థులు By ఎం శోభన్‌ నాయక్‌


Posted on: Thu 07 Aug 22:55:13.666587 2014

                    తరతరాలుగా సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ రంగాలలో వెనకబడిన తరగతులకు ఉపశమనం కల్గించటం కోసం భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాల మేరకు దేశంలోని షెడ్యూల్ట్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనకబడిన తరగతులకు హాస్టళ్ళ వసతి సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. దళిత బలహీన వర్గాలకు అందుతున్న ఈ సౌకర్యాలను ప్రభుత్వాలు భిక్షలాగా భావిస్తున్నాయి. అందుకే అరకొరగా నిధులు కేటాయిస్తున్నాయి. అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం, అధికరణ 39(సి) ప్రకారం సంపద ఒక్క దగ్గరే కేంద్రీకరించకుండా చూడాలి. అధికరణ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, తదితర బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నది. ఈ నిర్దేశాల సారాంశాల ఫలితంగానే హాస్టళ్ళ సౌకర్యం పేద, దళిత, బలహీనవర్గాలకు అందుతున్నది. ప్రభుత్వాలు రాజ్యాంగ నిర్దేశాలను చిత్తశుద్ధితో అమలు చేయటం లేదు. హాస్టళ్ళను ఏర్పాటు చేసి నడుపుతున్నా వాటి పట్ల, అందులో చదువుతున్న విద్యార్థుల పట్ల మమకారం లేకుండా, వారి చదువుల పట్ల అశ్రద్ధ చూపిస్తూ వచ్చాయి.
సంక్షేమ హాస్టళ్ళకు ఇచ్చే ప్రాధాన్యత ఎప్పుడూ మాటలకే పరిమితమౌతోంది. వాటి పటిష్టతకు, నిర్వహణకు జరిపే కేటాయింపుల విషయంలో ప్రభుత్వాలు దళిత, గిరిజనులకిచ్చే భిక్షలాగా వ్యవహరిస్తున్నాయి. తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా వెనకబడిన తరగతులైన దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు రాష్ట్ర జనాభాలో అత్యధికులైనా నేటికీ మొదటితరం కూడా విద్యను అభ్యసించలేని స్థితిలో ఉన్నారు. వీరికి విద్యను అందించటం కోసం ఏర్పాటైన యంత్రాంగమే 'హాస్టల్‌'. వారి దయనీయమైన జీవన స్థితి గతుల నుంచి వెసులుబాటు కల్పించి వారికి విద్యను అందించటమే వీటి ఉద్దేశం. కానీ ఆచరణలో రోజురోజుకూ నిర్వీర్యం అవుతూ పేద దళిత, గిరిజనులను విద్య నుంచి దూరం చేస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వాలకు వాటి పటిష్టత కోసం కృషి చేయాలనే సంకల్పం లేకపోవటమే.
                    1990 అనంతరం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ రూపంలో ముందుకొచ్చిన ఆర్థిక విధానాలు ప్రభుత్వాలను సంక్షేమం నుంచి పక్కకు నెడుతున్నాయి. బహుళజాతి కంపెనీల లాభాలు సంపాదించటానికే ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా సంక్షేమరంగం నుంచి తప్పుకుంటున్నాయి. ఈ విధానాలనే సర్వరోగ నివారిణిగా పేర్కొంటున్న పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఫలితంగా హాస్టళ్ళు నిర్వీర్యమై విద్యార్థులు తీవ్ర సమస్యల నెదు ర్కొంటున్నారు. నిధుల కోత, సౌకర్యాల లేమితో హాస్టల్‌ వ్యవస్థ కుంటుపడుతున్నది. వీటిని రక్షించుకొని, పటిష్ట పరచడం కోసం ఉద్యమించాల్సిన అవసరమున్నది. వీటిని రక్షించు కోకపోతే ఇప్పటి వరకైనా అందుతున్న విద్య భవిష్యత్తులో ఈ తరగతులకు అందుబాటులో లేకుండా పోతుంది.
                    హాస్టళ్ళను మరింత బాధ్యతా యుతంగా, పారదర్శకంగా నిర్వహించుటకు, నిర్ణయాలు అమలులో ఆలస్యం చోటు చేసుకోకుండా, ఏఏ అధికారాలు ఏ అధికారి నిర్వర్తించాలో, ఏ సౌకర్యానికి ఎంత మొత్తం కేటాయించాలో నిర్దారిస్తూ జి.ఓలో పొందుపరిచింది. 2012 నాటి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా కేటాయింపులు కేటాయించారు. ప్రస్థుత ధరలకు అవి ఏ విధంగాను సరితూగవు అనేది స్పష్టం. కాని ఆనాటికి నిర్ధేశించిన కేటాయింపులు కూడా హాస్టళ్ళకు సరిగ్గా చేరటం లేదు. అందుకై ప్రభుత్వం నిధులను విడుదల చేయటం లేదు. బడ్జెట్‌ కేటాయింపుల్లోనే నామమాత్రం నిధులు వెచ్చిస్తున్నారు. అనంతరం వాటిని కూడా ఇతర రంగాలకు కేటాయిస్తూ హాస్టల్‌ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. నెలవారీగా విడుదల చేయవలసిన నిధులను మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పాటు విడుదల చేయకపోతుండటం వల్ల హాస్టళ్ళ నిర్వహణ దెబ్బతింటున్నది. 
                    నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్లోకి ఎగబాకుతున్నాయి. హాస్టళ్ళ నిర్వహణకు అవసరమైన కేటాయింపులు మాత్రం గొర్రెతోక బెత్తెడు అన్న చందంగా అక్కడే ఉంటున్నాయి. ఒక విద్యా సంవత్సరంలోనే ధరలు అనేక రెట్లు పెరుగుతున్నాయి. కానీ హాస్టల్‌ విద్యార్థులకు ఇస్తున్న మెస్‌ ఛార్జీలు, కాస్మోటిక్‌ ఛార్జీలు, ఇతర కేటాయింపులు 2012 నాటివే కొనసాగుతున్నాయి. వీటిని పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలనే డిమాండ్‌ ముందుకొస్తూనే ఉన్నది. ప్రభుత్వాలు మారినా హాస్టళ్ళకు జరిపే కేటాయింపుల్లో ఎలాంటి మార్పులూ ఉండటం లేదు. రెండు సంవత్సరాల క్రితం ధరలు ఏ రకంగా ఉండేవో వాటి కనుగుణంగా ఆనాటి కేటాయింపులు జరిపారు. ఆ కేటాయింపులే నేటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలకు ఏమాత్రం సరిపోక విద్యార్థులు అర్థాకలితో అలమటిస్తున్నారు. వార్డెన్లు/మేట్రన్‌లు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ చట్టం ప్రకారమే విద్యార్థుల కేటాయింపుల్లో ప్రతి సంవత్సరం 10 శాతం పెరుగుదల ఉండాలి. అది ఎక్కడా అమలుకు నోచుకోవటం లేదు. హాస్టల్‌ విద్యార్థులకు చెందవలసిన వసతులను సమీక్షించి ప్రతిపాదనలు చేయటానికి ఒక యంత్రాంగమంటూ లేదు.                     అసెంబ్లీలో, పార్లమెంటులో గౌరవ సభ్యుల జీతభత్యాలు పెంచుకోవటానికి, ఉద్యోగుల వేతనాల పెరుగుదలకు పిఆర్‌సి లాంటి శాశ్వత యంత్రంగాలు ఉన్నాయి. అసెంబ్లీ సభ్యులకు సరాసరి వేతనాలు పెంచుతూనే ఉంటారు. విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటారు. అందుకోసం అసెంబ్లీలో ఆందోళనకు దిగటానికి వెనకాడరు. వీరి వేతనాలు పెంచటానికి కూడా స్థాయీ సంఘాలు ఉన్నాయి. కానీ హాస్టళ్ళలో చదువుతున్న దళిత, బలహీన, గిరిజన విద్యార్థుల అవసరాలు గుర్తించటానికి యంత్రాంగమే లేదు. ఫలితంగా విద్యార్థులు పౌష్టికాహార లోపంలో అనేక వ్యాధులకు గురవుతున్నారు. భోజన వసతి కల్పించటం ద్వారా అక్షరాస్యతా శాతాన్ని పెంచటానికి, డ్రాప్‌అవుట్‌ తగ్గించటానికి, మళ్ళీ బడికి, మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తున్నారు. కానీ ఇప్పటికే వసతిగృహాల్లో చదువుకుంటామని వస్తున్న విద్యార్థులను అర్థాకలితో చంపటం భావ్యం కాదు. హాస్టల్‌ విద్యార్థులకు కేవలం మెస్‌ ఛార్జీలే కాక కాస్మోటిక్‌ ఛార్జీలు, బట్టల కుట్టుకూలీ, గుడ్డ కొనుగోలు, హాస్టల్‌ నిర్వహణ, ట్యూషన్‌ ఫీజులు వీటన్నిటినీ మారిన, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలి. ఈ చర్యలు తీసుకోకుండా హాస్టల్‌ను పటిష్ట పరుస్తామని ఎన్ని మాటలు చెప్పినా వర్థమే. ప్రభుత్వం నిర్దేశించే వస్తువులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీలు ఎలా ఉన్నాయో అలాగే వార్షిక సమీక్షా కమిటీలను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇందులో కొనుగోలు కమిటీ ఛైర్మన్‌, పౌర సరఫరాల అధికారి, ఎఎస్‌డబ్య్లుఒ, వార్డెన్‌, మేట్రన్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఇది ప్రతి సంవత్సరం హాస్టల్‌కు విడుదల అవుతున్న నిధులు, విద్యార్థులకు అందవలసిన సౌకర్యాలకు సరి తూగుతున్నాయా, లేదా? ధరలు ఎంత శాతం పెరిగాయి ? అనే వాటికనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు, ఇతర సౌకర్యాలకు కేటాయింపులు ఎంత శాతం పెంచాలో నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించాలి.
- ఎం శోభన్‌ నాయక్‌ 
(వ్యాసకర్త ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)
Prajashakti Telugu News Paper Dated: 09/08/2014 

No comments:

Post a Comment