Monday, December 17, 2012

స్వార్థ రాజకీయ క్రీడలు - కనీజ్ ఫాతిమా



కాంగ్రెసైనా, టీడీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అయినా అన్ని పార్టీలతో ముస్లింలు బాధలు పడి విసిగిపోయారు. నేతలు అధికారంలో బలపడ్డం తప్ప సామాన్య ముస్లింల జీవితంలో ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేతల మురికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఈ నేతలు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మన జ్ఞాపక శక్తి కోల్పోకూడదు. వారి చర్యలను ప్రశ్నించాలి. మేము కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదనే సంగతి వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి. 

హైదరాబాదు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ మహానగరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో హైదరాబాదులో ఏం జరుగుతుందో విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మతతత్వ వ్యాప్తి, మురికి రాజకీయాలు, అన్ని పార్టీలు ఆడుతున్న రాజకీయ ఆటల వల్ల ఈ పరిస్థితి దాపురించిందా లేదా మరేదైనా కారణం ఉందా? హైదరాబాదు సామాన్యులు, ముఖ్యంగా ముస్లింలు పడుతున్న బాధలతో పాటు గత రాజకీయ పరిస్థితులను పూర్వావలోకనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హైదరాబాదు ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలను ఈ పరిస్థితులు సంకేతిస్తున్నాయి. అన్ని పార్టీల అధినేతలు ఇతరుల నుంచి ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు రాజకీయ యాత్రలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి సంబంధం లేని ఈ యాత్రలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. 

వందలాది మంది అమాయక యువకులను అపహరించిందీ, చట్టవిరుద్ధంగా నిర్బంధించిందీ, అమానవీయంగా హింసించిందీ రాజశేఖర్ రెడ్డి కాలంలోనే అన్న సంగతిని ఎవరూ మరిచిపోవద్దు. ఆయన పాలనలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొన్న దుర్మార్గం గురించి ఏ పార్టీ ప్రశ్నించలేదు. అంతేకాదు వటోలిలో ఒక ముస్లిం కుటుంబాన్ని హిందూత్వ శక్తులు సజీవ దహనం చేసిందీ వైఎస్ పాలనలోనే. నేటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఫార్మసీ విద్యార్థి అయేషామీరాను దారుణంగా హత్య చేసిందీ అదే పాలనలో. ఈ కుటుంబానికి కూడా నేటికీ న్యాయం అందలేదు. దేశం సంగతి వదిలేయండి, రాష్ట్రంలో లౌకికత్వం ఎక్కడుంది? తండ్రి మరణించిన తర్వాత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. అధిష్టానం సీఎం పదవి ఇవ్వకపోవడంతో తన రాజకీయ బలం చూపించేందుకు 'ఓదార్పు' యాత్రను నిర్వహించాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నప్పటికీ తన కుటుంబ సభ్యులు ఓట్లు కొల్లగొట్టేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ల రాజకీయ లబ్ధి కోసం అమాయక ప్రజలను అవమానిస్తున్నారు.

తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' యాత్ర మొదలు పెట్టారు. హైదరాబాదులో హైటెక్ సిటీ మీద ఆయన శ్రద్ధ పెట్టిన కాలంలోనే రైతులు దుర్భరమైన కష్టాలను చవిచూశారు. పాతబస్తీలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలను కొత్త బస్తీకి తరలించింది ఈయనే. గుజరాత్‌లో ముస్లిం నరమేధం సందర్భంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిం చకపోవడంపై నేటికీ పశ్చాత్తాప పడడం లేదు. అధికారంలోకొస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని అంటున్నారు. కానీ ఆయన పార్టీలో ముస్లింలు నామమాత్రంగానే ఉన్నారు. ఈయన కాలంలోనే ఎన్‌కౌంటర్ల పేరుతో ముస్లింలను హత్య చేశారు. ముస్లిం సమాజం మీద నిఘా పెట్టేందుకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులతోనూ ముస్లిం వ్యతిరేకులైన అధికారులతోనూ ప్రత్యేక బృందాలను చంద్రబాబు ఎందుకు ఏర్పాటు చేశారు? హరేన్‌పాండ్యే హత్య కేసులో తప్పుడు ఆరోపణలతో అమాయక ముస్లిం యువకులను అరెస్టు చేసి గుజరాత్ పోలీసులకు అప్పగించారు?

2007లో జరిగిన మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు విచారించే పేరుతో అమాయక ముస్లిం యువకులను చట్టవిరుద్ధంగా బంధించి అమానవీయంగా హింసిస్తే అసెంబ్లీలో గొంతు విప్పడానికి ఏ కారణం వల్ల నిరాకరించారు? అందుకు తన పార్టీ ముస్లిం నేతలే సాక్ష్యం. నగరంలో మత హింసను రేపుతున్న రాజా సింగ్, శ్రీనివాస రావులు తన పార్టీ వారే అయినా ఎందుకు వారి మీద చర్య తీసుకోవటం లేదు? అయేషా మీరా మీద దారుణ అత్యాచారం చేసి హత్య చేస్తే చంద్రబాబు ఎందుకు నోరు మూసుకున్నారు? ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి 2009 ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగించుకున్నారు. చంద్రబాబును ఏ రకంగా లౌకికవాదివో చెప్పమని ముస్లింలు నిలదీయాలి.

ఇక కేసీఆర్ పెద్ద రాజకీయ జూదరి. తెలంగాణ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఆయనను ఎవరు ప్రశ్నించినా తెలంగాణ వ్యతిరేకులని ముద్రవేసే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించినప్పటికీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో ముస్లిం అభ్యర్థి ఓటమికి కేసీఆర్, రాజకీయ జేఏసీ బాధ్యులు. ముస్లిమనే కారణంతో టీఆర్ఎస్ సీనియర్ నేతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, ఆయన పార్టీ సభ్యులే ఓడించారు. తెలంగాణ పేరుతో మతతత్వ పార్టీతో ఆయన జట్టుకట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైన తర్వాతే మతతత్వ పార్టీ బలపడ్డది. అందుకు టీఆర్ఎస్‌దే బాధ్యత. ఈ మూడేళ్ల తెలంగాణ ఉద్యమ కాలంలోనే ముస్లింల మీద అనేక దాడులు జరిగాయి. లౌకికవాద ముసుగు తగిలించుకొన్న అనేక మంది నిజరూపం బహిర్గతమైంది కూడా తెలంగాణ ఉద్యమం వల్లే. తెలంగాణ సాధన పట్ల సీరియస్‌గా ఉన్నట్టు టీఆర్ఎస్ కనిపిస్తుంది కానీ అది నిజం కాదు. అందుకే వచ్చే ఎన్నికల్లో రాజకీయ బలం పెరక్కపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి కేసీఆర్ ఉద్దేశాలు వేరు. ఒకవేళ టీఆర్ఎస్ బలం పెరిగినా పరిస్థితిలో ఎలా ంటి మార్పు ఉండదు. మళ్లీ మళ్లీ అమాయక జనులు మోసపోతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. కానీ తెలంగాణ పేరుతో రాజకీయ వ్యామోహితులు అధికారం పొందుతూనే ఉంటారు.

ఇక హైదరాబాదులోని పరిస్థితులను చూస్తే, ప్రతిఏటా జరిగే దీపావళి పండగ సందర్భంగా చార్మినార్‌ను అనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. నిజానికి చార్మినార్ గోడలకు వాహనాలు తాకుతూ వెళ్లకుండా అక్కడ ఒక రాయి ఉండేది. క్రమంగా దాన్ని మైసమ్మ దేవతగా పూజించటం మొదలైంది. కానీ అక్కడ మార్వాడీలు ఉండటంతో వాళ్లు దాన్ని భాగ్యలక్ష్మి ఆలయంగా మార్చేశారు. నిజానికి అక్కడ ఎలాంటి గుడి లేదని వంద ఏళ్ల నుంచీ తీసిన ఫోటీలు సాక్ష్యం చెబుతున్నాయి. అయితే, చార్మినార్‌లోని మొదటి అంతస్తులో మజీదు, రెండో అంతస్తులో మదరసా ఉండేదని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత మొదటి, రెండు అంతస్తులను మూసేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అది మత సమస్య కాదు. చారిత్రక వారసత్వ నిర్మాణాలకు వంద మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురాతత్వ శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 

రాష్ట్రం మీద మతాధిపత్యాన్ని రుద్దాలని అన్ని పార్టీలు ఈ సమస్యను సృష్టించాయి. అదే హిందూత్వ ఆధిపత్యమనొచ్చు. హైదరాబాదు రాజకీయ నాయకులకూ పాలకవర్గాలకూ ఈ సమస్య కొత్తది కాదు. ఆకస్మికంగా చార్మినార్ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న వాళ్లంతా అనేక సంవత్సరాలుగా అక్కడ ఆలయ విస్తరణ జరుగుతున్నప్పుడు ఎక్కడున్నారు? అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎలాగైనా సరే చార్మినార్‌ను రక్షించాలని ఇప్పుడు అనడం వెనక కారణం ఏమిటి? దీని రాజకీయ కోణం అర్థం చేసుకోవాలి. మతం పట్ల ప్రేమతోనో, చారిత్రక కట్టడాలపై అభిమానంతోనో ఈ ఆందోళన చేయటం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. ఎవరు అధికారంలోకి రావాలనుకున్నా ఇక్కడ మతకలహాలు రేపుతారని హైదరాబాదు వాసులకు తెలుసు. చెన్నారెడ్డి కాలం అందుకు ఉదాహరణ.

ముస్లిం రాజకీయ పార్టీ ఎంఐఎం ఆకస్మికంగా తన నిరసన ప్రకటించింది. పి.వి. నరసింహారావునూ కిరణ్‌కుమార్ రెడ్డినీ మతతత్వవాదులుగా వ్యాఖ్యానించింది. చంద్రబాబు కాలంలో ముస్లింలపై దాడులు జరిగాయనీ ఆరోపణలు చేసింది. కానీ రాజశేఖర రెడ్డి కాలంలో జరిగిన దుర్మార్గమైన వేధింపులు, హత్యల గురించి ఎందుకు మాట్లాడలేదు? జగన్ రెడ్డితో పొత్తు గురించి అది మాట్లాడుతుంది. దీన్ని ముస్లింలు హర్షిస్తారా? నిజంగా ముస్లిం సమాజ సంక్షేమం గురించి అది నిజాయితీతో ఉంటే అవినీతిపరులతోనూ మతతత్వ ప్రచారం చేస్తున్న ఎలాంటి పార్టీతోనూ వ్యక్తులతోనూ ఎట్టి పరిస్థితిలో పొత్తులు పెట్టుకోరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవటం ఒక పెద్ద నాటకం. బాబ్రీ మసీదు కూల్చిసినప్పుడు, అమాయక ముస్లిం యువకులను చట్టవిరుద్ధంగా హింసించినప్పుడూ, వటోలిలో కుటుంబాన్ని సజీవంగా దహనం చేసినప్పుడూ ఇదే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు. 

అదేవిధంగా ముస్లిం ఫ్రంట్ నేతల నిర్ణయం కూడా సామాన్య ముస్లింలకు విభ్రాంతి కలిగించింది. అవినీతిలో కూరుకుపోయిన జగన్ రెడ్డితో ముస్లింలు ఎలాంటి స్థితిలోనైనా జతకడతారా? ముస్లింలకు ఎంత విషాదం దాపురించింది! ఇలాంటి రాజకీయ క్రీడలతో ముస్లింలు విసిగిపోయారు. మానవ, పౌర హక్కులు హరించి వేయటం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ముస్లిం నేతలకు బాగా పట్టున్న హైదరాబాదులోనే అనేక వందల మంది యువకులను అపహరించి, అక్రమ కేసులతో జైల్లో పెట్టారు. ఇంకా చాలా మంది కనిపించకుండా పోయారు. అది కాంగ్రెసైనా, టీడీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అయినా అన్ని పార్టీలతో ముస్లింలు బాధలు పడి విసిగిపోయారు. నేతలు అధికారంలో బలపడ్డం తప్ప సామాన్య ముస్లింల జీవితంలో ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేతల మురికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఈ నేతలు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మన జ్ఞాపక శక్తి కోల్పోకూడదు. వారి చర్యలను ప్రశ్నించాలి. మేము కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదనే సంగతి వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి.

- కనీజ్ ఫాతిమా
సహాయ కార్యదర్శి, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ క

Andhra Jyothi Telugu News Paper Dated: 18/12/2012 

Sunday, December 16, 2012

అంతర్జాతీయ సాహితీ వేదికపై తెలుగు ముస్లిం కవి - ఖాదర్ మొహియుద్దీన్



సెప్టెంబరు 11 తరవాతనే మైనారిటీ డిస్కోర్స్ తేలికగా అర్థమవ్వడం మొదలయ్యింది. అమెరికాలోని మైనారిటీల స్వరం అటు సాహిత్యంలోనూ, ఇటు పబ్లిక్ స్పేస్‌లోనూ బాగా వినిపించడం మొదలయ్యింది. చాలా కాలంగా ఇస్లాం అంటే కొందరు మతాచార్యుల గుప్పిట్లో బందీ అనే భావనని ప్రపంచం పెంచి పోషిస్తూ వచ్చింది. అది వొక్కసారిగా బద్దలయి, ఇస్లాంలోని అభ్యుదయ శక్తులు ముందుకొచ్చి- ప్రతిఘటనని వ్యక్తం చేశాయి. ఇది మన దేశంలో కూడా జరగాల్సి వుంది. ఇస్లాంలో వున్న అభ్యుదయ శక్తులు బలపడితే తప్ప- ముస్లిం సమాజాలకు విముక్తి లేదు -అంటున్నారు అఫ్సర్. 

ఖమ్మంజిల్లాలో ఒక మారుమూల గ్రామం అయిన చింతకాని ఊరుబడి నుండి టెక్సాస్ యూనివర్సిటీ దాకా అతని నడక, మేధో యాత్రలో ఆలోచనల్ని ప్రోది చేసుకొనే క్రమం అంత సులువునా జరిగింది కాదు. తండ్రి కౌముది నించి అభ్యుదయ సాహిత్య వారసత్వం తల్లి వేపు కుటుంబం నించి వామపక్ష రాజకీయాల ప్రభావం.. వీటన్నీటి పునాది మీద నిర్మించుకున్న అస్తిత్వ వేదన అఫ్సర్. అమెరికాలో ఉన్నా తన వూరితో ముడిపడిన మూలాల వెతుకులాట అఫ్సర్. అవే అఫ్సర్‌ని కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా ముందుకు నడిపిస్తున్నాయి. స్థానికత మాత్రమే ప్రపంచీకరణకి సమాధానం అనే దృక్పథం వేపు తీసుకువెళ్లాయి. సూఫీ కథనాల మీద రాయబోతున్న కొత్త పుస్తకానికి సంబంధించి పరిశోధనలో భాగంగా ఇటీవల మన రాష్ట్రం వచ్చి వెళ్లిన అఫ్సర్ హైదరాబాద్‌లో జరిగిన వివిధ సాహిత్య సమావేశాలలో తన పరిశోధన విషయాలను, సాహిత్య అనుభవాలను పంచుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో- వొక అమెరికన్ విశ్వవిద్యాలయం నించి డాక్టరేట్ తీసుకున్న తొలి తెలుగు కవి అఫ్సర్. అస్తిత్వ ధోరణుల మీద చర్చని అంతర్జాతీయ వేదిక దాకా తీసుకు వెళ్తున్న విమర్శకుడు...

ముఖ్యంగా స్థానికత, మౌఖిక రీతులు దేశీయ మౌఖిక కథనాలు దర్గా సూఫీ సంస్కృతుల మీద ఎన్నో అంతర్జాతీయ పత్రికలలో ఆసక్తికరమైన పరిశోధనా వ్యాసాలను రాసారు. స్థానిక కథనాలు అస్తిత్వ నిర్మాణంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో చెప్తూ, వివిధ అంతర్జాతీయ సదస్సులలో తన స్వరం వినిపించారు. సాహిత్య సాంస్కృతిక రంగాలలో మైనారిటీ డిస్కోర్సుకి వొక సిద్ధాంత బలాన్ని తీసుకురావడం తన ప్రధానమైన ప్రయత్నమని ఆయన అంటారు. పీర్ల పండగ మీద ఆయన ఇంగ్లీషులో రాసిన పుస్తకం త్వరలో వొక అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ద్వారా అచ్చు కానుంది. కథకుడిగా మొదలెట్టి వొక అంతర్జాతీయ స్థాయి పరిశోధకుడిగా అఫ్సర్ సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన లేవనెత్తిన పలు అంశాలు ఇంకా చర్చకు దారితీయబోతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్సర్‌తో గుర్రం సీతారాములు (డాక్టోరల్ ఫెలో ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం, ఫోన్: 99516 61001) జరిపిన ఇంటర్వ్యూ-

? బాబ్రీ మస్జిద్ లేదా సెప్టెంబర్ 11 లాంటి ఒక సంక్లిష్ట సందర్భంలో మీరు ఇస్లాంను ఒక టెర్రరిస్టు బూచిగా చూపించిన అమెరికన్ సొసైటీలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా? సమస్య అమెరికా మాత్రమే కాదు. మన దేశంలోనూ అలాంటి సమస్యలు వున్నాయి. అలాంటి ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. వొకే అమెరికా, వొకే ఇండియా అనే జాతీయవాద భావన ప్రమాదకరం ఎప్పుడయినా! అమెరికా భిన్న సంస్కృతుల కలయిక. ఆ భిన్నత్వాన్ని చెరిపేసి 'వొకే' అమెరికా అన్న భావనని పెంచే ప్రయాత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అదృష్టవశాత్తూ దీనికి ప్రజల నించి సమ్మతి లేదు. అలాంటి ఎకోన్ముఖీకరణ మన దేశంలోనూ జరుగుతోంది. అయితే మన దేశంలో దానికి తగినంత ప్రతిఘటన లేదు.

ఇక రెండో విషయం: వలసలో ఎప్పుడూ కొన్ని కష్టాలూ, సాహసాలూ వుంటాయి. అది ఖమ్మ నించి హైదరాబాద్ కావచ్చు. హైదరాబాద్ నించి ఢిల్లీ కావచ్చు. దేశం నించి ఇంకో దేశం కావచ్చు. అయితే అదృష్టం బాగుండి నేను పనిచేసిన యూనివర్సిటీలు -అప్పుడు విస్కాన్సిన్, ఇప్పుడు టెక్సాస్- రెండూ వొక విధంగా కొంచెం బహుళ సాంస్కృతిక వాద అనుకూల ప్రదేశాలు. ఇంకో కొత్త సంస్కృతిలోకి అడుగెట్టినప్పుడు కొన్ని అస్తిత్వ సమస్యలు ఎదుర్కోక తప్పదు -అది అమెరికా అయినా, ఉత్తర భారతమైనా, మన పొరుగు వూరే అయినా. ఆ సంస్కృతికి సంబంధించిన అంశాలు కొన్ని మనల్ని సవాల్ చేస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడడం కష్టమే కానీ అసాధ్యం కాదు. నేను అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజు వెల్చేరు నారాయణరావు అన్న మాట ఇప్పటికీ బాగా గుర్తు పెట్టుకుంటా- 'అంతర్జాతీయ అస్తిత్వం చాలా సాహసంతో కూడుకున్నది. మీరు చాలా పెద్ద సాహసానికి సిద్ధపడాలి. వొక తెలుగుకవిగా మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మాత్రమే ఇక్కడ సరిపోవు. చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వుంటుంది. ఇప్పటిదాకా నేర్చుకున్నది మరిచిపోవాల్సి వుంటుంది కూడా.'

అయితే నేను స్థానికతని బాగా నమ్మే వ్యక్తిని. ఆ స్థానికత నేను పెరిగిన చిన్న వూరు చింతకానిది అయినా, అమెరికాలోని ఆస్టిన్ ది అయినా.. నేర్చుకోవాల్సింది/మారాల్సింది చాలా వుంటుందన్న వాస్తవికతకి నేనెప్పుడూ సిద్ధమే. అలాగే నా లోపల వొక జంగమ ప్రవృత్తి కూడా వుంది. అందుకే వొక కవితలో 'జంగమం నా ఇలాకా' అని రాసుకున్నా. అలాంటప్పుడు నాకు కృత్రిమ స్థావరాలు సృష్టించే అడ్డుగోడల మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇబ్బందులు పడడమూ వుండదు. ? సెప్టెంబర్ 11 తరవాత ఇస్లాం ప్రపంచంపై అమెరికా రాజ్యం అవలంబించిన విధానంపై దేశంలోని బుద్ధిజీవుల నుండి రావాల్సినంతగా ప్రతిస్పందన రాలేదు. దాన్ని ప్రస్తుత మైనార్టీ డిస్కోర్సు ద్వారా ఎలా అర్ధం చేసుకోవచ్చు?

అంతర్జాతీయ స్థాయిలో మేధావులు స్పందించినంత తీవ్రంగా మన దేశంలోని బుద్ధిజీవులు దీనిమీద స్పందించలేదన్నది వాస్తవం. దానికి ప్రధానమైన కారణం: మనం సెప్టెంబర్ 11 అనంతర ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడమే! మొత్తంగా ప్రాపంచిక దృక్పథాన్ని మార్చడంలో దీని ప్రభావాన్ని మనం ఇప్పటికీ అంచనా వేసుకోలేకపోతున్నాం. అసలు మైనారిటీ డిస్కోర్సు వొకటి వుందన్న చైతన్యం అమెరికాలోనూ/ఇతర దేశాల్లోనూ కలిగింది ఈ సెప్టెంబరు 11 తరవాతనే! అమెరికాలో రాజ్య విధానాలకూ, ప్రజలకూ మధ్య వున్న వైరుధ్యం బాగా అర్థమయింది కూడా దీని తరవాతనే. ఈ వైరుధ్యం అర్థమయిన తరవాత మైనారిటీ డిస్కోర్స్ తేలికగా అర్థమవ్వడం మొదలయ్యింది. అమెరికాలోని మైనారిటీల స్వరం అటు సాహిత్యంలోనూ, ఇటు పబ్లిక్ స్పేస్‌లోనూ బాగా వినిపించడం మొదలయ్యింది. అలాగే, ఇస్లాం అంటే ఏమిటో అందులో ఎంత విభిన్నత వుందో తెలిసి వచ్చింది. చాలా కాలంగా ఇస్లాం అంటే కొందరు మతాచార్యుల గుప్పిట్లో బందీ అనే భావనని ప్రపంచం పెంచి పోషిస్తూ వచ్చింది. అది వొక్కసారిగా బద్దలయి, ఇస్లాంలోని అభ్యుదయ శక్తులు ముందుకొచ్చి- ప్రతిఘటనని వ్యక్తం చేశాయి. ఇది మన దేశంలో కూడా జరగాల్సి వుంది. ఇస్లాంలో వున్న అభ్యుదయ శక్తులు బలపడితే తప్ప- ముస్లిం సమాజాలకు విముక్తి లేదు.

? అలాగే ఇక్కడ తెలుగులో మైనారిటీ డిస్కోర్సు ఒక సంకుచితత్వంలోకి పోయింది అంటే ఆ వాదాన్ని సమర్థవంతంగా తీసుకెళ్లడంలో మైనారిటీ కవుల లోపాన్ని ఎలా అంచనా వేస్తారు? ఇంతకు ముందే చెప్పినట్టు- ఇప్పుడు అంతర్జాతీయ సాహిత్యం అంతా వొక మైనారిటీ డిస్కోర్స్‌ని వెతుక్కుంటోంది. అంచులలో వున్న జీవన దృశ్యాల ఆవిష్కరణ అన్ని భాషల్లోనూ కనిపిస్తోంది. తెలుగులో ఈ ప్రక్రియ మొదట ప్రారంభమయినంత బలంగా కొనసాగలేకపోతోంది. దానికి ముఖ్య కారణం: అది కవిత్వం గుప్పిట్లో వుండిపోవడమే! ఈ విషయంలో వొక్క దళిత స్త్రీవాదులే కొంత మినహాయింపు. దళిత స్త్రీవాదులు తరవాతి దశలో వచనంలోకి చేసిన ప్రయాణం గొప్ప మలుపు నా దృష్టిలో. అది మిగిలిన మైనారిటీ వాదులకి ఆదర్శం కావాలి. ముఖ్యంగా ముస్లిం వాదులకి! ముస్లిం వాదం ఇప్పుడు రాస్తున్నది తక్కువ. వివాదాలు ఎక్కువ అన్నట్టుగా వుంది. వ్యక్తిగత అహంకారపూరిత రాజకీయాల వల్ల ముస్లింవాదంలోని బలం బలహీనతగా మారుతోంది. ఈ రాజకీయాలు మానేసి, ముస్లిం రచయితలు నిజంగా సృజనాత్మకత మీద దృష్టి పెడితే బాగుంటుంది. సృజనాత్మకత విషయంలో నాకు దళిత వాదం సృష్టించిన మాడల్స్ బాగా నచ్చాయి. ఏ వాదానికయినా ఆ వాదం పరిధిలోకి వచ్చే నిజ జన సమూహాలతో ఆత్మీయ సంబంధం వుండాలి. తెలుగు ముస్లిం రచయితలకు -ముఖ్యంగా కవులకు- వాళ్ల తక్షణ సమూహం అంటే ముస్లింలతో దగ్గిర సంబంధాలు లేవు. అది వాళ్ల రచనల్లో కూడా కనిపిస్తున్న లోపమే! అలా సమూహ సంబంధం లేని సాహిత్యం డొల్లగా వుంటుంది.

? ఆధునికత, ఉత్తరాధునికత తదితర భావజాలాల మీద పనిచేసిన మీరు తరవాత స్థానికత గురించి మాట్లాడడం మొదలెట్టారు. మీ విమర్శనీ, పరిశోధననీ తెలుగు సమాజం సరిగా అంచనా వేయలేకపోయిందని మీరు భావిస్తున్నారా?

స్థానికత అత్యాధునికతలో ప్రధానమైన కోణం. 1991లో వెలువడిన నా 'ఆధునికత-అత్యాధునికత' వ్యాసాలు మళ్లీ చదివితే ఆ వాదంలో స్థానికత పాత్ర ఏమిటో తెలుస్తుంది. తెలుగు సమాజం వీటిని ఎలా అంచనా వేస్తుంది అన్నది నాకు అంత పట్టింపు లేదు. నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను. అంతే! కానీ, ఆ వ్యాసాలు వెలువడినప్పుడు, తరవాత నేను అస్తిత్వ వాదాల మీద రాసినప్పుడు కూడా అనుకూల/వ్యతిరేక స్పందనలు గట్టిగానే వచ్చాయి. అయితే, నేను కవిని అన్న విషయం మీరు మరచిపోతే తప్ప, విమర్శకుడిగా నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. స్థానికత అనేది ఇప్పటికిప్పుడు అవసరమైన సాహిత్య ప్రమాణం అని ఇప్పటికీ నేను అనుకుంటున్నా- అది ప్రవాస స్థానికత కూడా కావచ్చు. అమెరికా తెలుగు రచయితలు ఇటీవలి కాలంలో వెతుక్కుంటున్న ప్రవాస స్థానికత కూడా ఇందులో భాగమే. ? దక్కనీ సమాజం దాదాపు 11 వందల ఏళ్ల పాటు సూఫీ ప్రభావంలో ఉంది. ఈ క్రమంలో మీరు చేస్తున్న దర్గాలు సూఫీ సంస్కృతుల మీద పరిశోధన మైనారిటీ డిస్కోర్సుకు ఏ విధంగా దోహదపడుతుందని భావిస్తున్నారు?

దక్కనీ సమాజ అధ్యయనాలలో మనం అంతగా పట్టించుకోని రంగం: సూఫీవాదం. సూఫీ అనగానే మనం రూమీ దాకా వెళ్తున్నాం కానీ, మన పక్కనే వున్న సూఫీల జోలికి మాత్రం పోవడం లేదు. మన స్థానికత మీద మనకి అంత శ్రద్ధ లేదనడానికి ఇదొక వుదాహరణ. నేను ఈసారి ట్రిప్‌లో ఆంధ్ర, తమిళనాడు, కర్నాటకలలో అనేక సూఫీ స్థలాలు తిరిగా. తిరిగిన చోటల్లా కుప్పలు పడి వున్న చరిత్ర కనిపిస్తున్నది. అది మనకు తెలియని మన చరిత్ర. కానీ, సాధారణ ప్రజానీకానికి ఈ చరిత్రకి సంబంధించిన చైతన్యం వుంది. లేనిదల్లా, చదువుకున్న మనలోనే! మనం కులాలుగా, మతాలుగా చీలిపోయాం.

విడదీసే అంశాల మీద వున్నంత ఆసక్తి మనల్ని కలిపే అంశాల మీద లేదు. సూఫీ వాదం అందరినీ కలిపే సంస్కృతి. రూమీ గురించి కాదు, మన గ్రామాల సూఫీల గురించి ముందు నేర్చుకోవాలి. మైనారిటీ డిస్కోర్సుని బలంగా వినిపించిన వాళ్లు మొదట సూఫీలే! ఇవాళ మనం మాట్లాడుకుంటున్న చాలా అంశాలు ఆ రోజుల్లో వాళ్లు మాట్లాడారు. వాటి వర్తమానికతని మనం అర్థం చేసుకోవాలి. ? మీ పరిశోధనలో మీకు ఆసక్తికరంగా తోచిన విషయాలు వివరిస్తారా? 

చాలా వున్నాయి. ముఖ్యంగా, మానవ సంబంధాల గురించి సూఫీలు చెప్పిన విషయాలు, ప్రేమని వొక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా వాళ్లు దర్శించిన పద్ధతి. ఇటీవలి నా కవితల్లో ఆ ప్రేమ భావనకి సంబంధించిన భిన్న పార్శ్వాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ? ఈ పరిశోధన ద్వారా పశ్చిమ దేశాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా?

పశ్చిమ దేశాలు ఏం నేర్చుకుంటాయని కాదు, నా మొదటి లక్ష్యం నేనేం నేర్చుకుంటున్నానో అది ముఖ్యం. అది వొక వ్యక్తిగా, రచయితగా నాకు తక్షణ అవసరం. నా చుట్టూ వాళ్లకి దాని ద్వారా నేనేం చెప్పగలనన్నది రెండో అవసరం. ముస్లిం సమాజాల స్వభావం గురించి పశ్చిమ దేశాలే కాదు, మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా వున్నాయి. ముఖ్యంగా, ముస్లిం సమాజాలు సంకుచితం అనే అపోహ చాలా మందిలో వుంది. ముస్లిం సమాజాలు అభ్యుదయం వేపు చూడడం లేదన్న నిరంతర విమర్శ వుంది. ముస్లిం సమాజాల్లో వున్న అనేకత్వాన్ని చెప్పడానికి సూఫీజమ్ బాగా వుపయోగపడుతుంది -ఎందుకంటే- ముస్లింల వాస్తవ పరిస్థితి చెప్పేది వాళ్ల సూఫీ చరిత్ర మాత్రమే! ? ఈ పరిశోధన ద్వారా పశ్చిమ దేశాల కేంద్రిత అవగాహనను విభేదించే పరిశోధక అంశాలను మీరేమైనా స్పృశించారా?

మొత్తంగా ఈ పరిశోధన అంతా పశ్చిమ-కేంద్రిత అవగాహనతో విభేదించడమే. స్థానికత అనే వాదంలోనే ఆ విభేదం వుంది. స్థానిక సాహిత్యాల/సంస్కృతుల అధ్యయనం కేవలం వొక భాషకి సంబంధించిన విషయం కాదు. అది ఇంకో స్థాయిలో సైద్ధాంతిక/రాజకీయ ప్రకటన కూడా. వివిధ అంతర్జాతీయ పత్రికలలో/సంకలనాల్లో నా వ్యాసాలు చదివితే- ఇది నేనెలా చేశానో అర్థమవుతుంది. ఈ వ్యాసాల్లో కొన్నీటిని తెలుగులోకి అనువదించడానికి మిత్రులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ ప్రయత్నం చెయ్యడం అంటే తెలుగులో ఆ సైద్ధాంతిక పరిభాషని కూడా నిర్మించడమే! దానికి ముందు పశ్చిమ-కేంద్రిత పరిశోధన నించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా వున్నాయి. పరిశోధనా పద్ధతి, విశ్లేషణ, ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే దారి మనకి ఇంకా అంత స్పష్టంగా లేదు.

? గడిచిన కొన్ని దశాబ్దాలుగా వర్తమాన మేధో సమాజం యూరప్ కేంద్రకంగా ఒక తిరుగులేని స్థితిలో ఉంది. దానికి కౌంటర్‌గా మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికాలో జరిగిన (ఎడ్వర్డ్ సైద్, ఫాన్నోస్) ప్రత్యామ్నాయ మేధో స్రవంతి దక్షిణ ఆసియా నుండి రాలేకపోవడానికి, మన బుద్ధిజీవుల/మేధో వైఫల్యం ఉందని భావిస్తున్నారా? అలా జరగకపోవడానికి కారణాలు ఏమయి ఉంటవి అని అనుకుంటున్నారు?

సంఘర్షణ అనేది కేవలం సమాజాల్లో జరిగినంత మాత్రాన్న సరిపోదు. మేధో సమూహాలు ఆ సంఘర్షణలో పాల్గొన్నప్పుడే దానికి సరిదీటు అయిన సాహిత్యమూ, సిద్ధాంత చర్చా జరుగుతుంది. దక్షిణాసియా దాకా ఎందుకు గానీ, తెలుగు సమాజానికే పరిమితమయి మాట్లాడితే- పబ్లిక్ ఇంటలెక్చ్యువల్స్ మనకి లేరు. తెలుగులో అలా నిలబడేది వొక్క బాలగోపాల్ మాత్రమే. అయితే, గుండె లోతుల్లోంచి లేదా మేధో లోతుల్లోంచి మాట్లాడే బుద్ధిజీవిని తట్టుకునే శక్తి తెలుగు సమాజానికి ఎంత వుందో ప్రశ్నార్థకమే. మనకి ఆలోచించే వాళ్లంటే భయం. ఆలోచన పెరుగుతుందంటే భయం.

అందుకే, మన చర్చలు చాలా మటుకు ఉద్వేగ స్థాయికి మాత్రం వెళ్లి, కవిత్వంలో చతికిలబడ్తాయి. కవిత్వాన్ని చిన్న చూపు చూడడం కాదు, మరీ పెద్ద చూపు చూడడం వల్ల మన మేధో ప్రపంచం చిన్నదయిపోతున్నదని నా బాధ. మన మేధో వికాసానికి అదొక అడ్డంకి. ఆలోచనల్ని కూడదీసుకునే శక్తి లేని చోట సమూహాల్ని సమీకరించే శక్తి కూడా వుండదు. ఈ విషయంలో మన కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటివి చాలా నయం. వాళ్ల మేధో వికాసం, సాహిత్య వికాసం మనకి వొక నమూనా కావాలి. పాకిస్తాన్ స్త్రీవాద కవయిత్రులూ, బంగ్లాదేశ్ ముస్లిం రయితలూ ఏం చేస్తున్నారో వొకసారి గమనించాలి. మనకి ఆ తులనాత్మక దృష్టి పెరిగితే తప్ప మనకి మనంగా ఏం చెయ్యాలో తెలియదు.

రెండు: మన ప్రతిఘటన ఉద్యమాలలో వొక నిలకడ లేదు. రాజ్య హింస మీద ఇప్పటికీ మన ప్రతిఘటన బలహీనంగానే వుంది. తెలంగాణతో సహా వివిధ అస్తిత్వ ఉద్యమాలు నిజానికి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నడవడం లేదు. వొక వేపు కార్పొరేట్ శక్తుల విష కౌగిలిలో చిక్కుకొని వున్నాం కూడా. ఇంకోవేపు అగ్రవర్ణ ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. ఇక మిగిలిన అరకొర బుద్దిజీవులు నిశ్శబ్దంలోకి వెళ్లిపోతున్నారు లేదా ఉద్దేశపూర్వక మౌనం ప్రకటిస్తున్నారు. వొక విధమైన కృత్రిమ మేధో వాతావరణం మధ్య నిజమైన బుద్ధిజీవి నిజానికి భయంకరమైన వొంటరితనాన్ని అనుభవించే స్థితి తెలుగునాట వుంది.

మూడు: అంచుల నించి వస్తున్న అభిప్రాయాల మీద మనకి చిన్న చూపు. అంటే, వొక కొత్త అభిప్రాయాన్ని దళితులో, స్త్రీలో, ముస్లింలో, పల్లె నించి వచ్చే బుద్ధిజీవులో వ్యక్తం చేసినప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకునే సహనం ఇంకా మనకి రాలేదు. అదే అభిప్రాయం పట్టణ ప్రాంతాల అగ్రవర్ణాలు వ్యక్తం చేస్తే జయహో అంటున్నాం. ఈ ధోరణి మనలోని బానిసతత్వాన్ని, పరాధీనతని, వ్యక్తిత్వ లేమిని చెప్తుంది.

? ఇలాంటి ప్రతిఘటన లేకపోవడానికి ఈ దేశ సామాజిక పరిస్థితి, ఈ దేశ రాజకీయ వ్యవస్థకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది? దానికి ప్రత్యామ్నాయ ప్రతిఘటన సాహిత్య రూపాలు తీసుకొని రావడంలో దళిత బహుజన వైఫల్యం ఉందని అనుకుంటున్నారా?

ప్రజల్లో నిజమైన ప్రతిఘటన వుంది. దాన్ని గుర్తించినా ముందుకు తీసుకువెళ్లే రాజకీయ వాతావరణం మనకు లేదు. ఇక మన ప్రతిఘటన సాహిత్య రూపాల మీద కూడా మన చదువుల ప్రభావం వుంది. మన చదువులు, మన మేధోలోకం ఇంకా వలసవాద చట్రంలో వున్నాయి. ఆ చట్రం నించి బయట పడే శక్తి ఇంకా మనకి రాలేదు. విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ పని చేయాలని అనుకోవడం మన పొరపాటు. అలాగే ఎంతకాలం ఈ బ్రాహ్మణ పండిత వర్గాల్ని తిట్టుకుంటూ కూర్చుందాం. మన పరిస్థితికి ఇతరుల కంటే మనమే బలమైన కారణం. మనల్ని మనమే ముందు నిందించుకోవాలి. బ్రాహ్మణ అని కాదు కానీ, అగ్రవర్ణ అంటాను. వాళ్లలో వున్న ఐక్యత ఇంకెక్కడా లేదు. అలాగే, కుడిపక్షం ఎప్పుడూ ఐక్యంగా వుంటుంది. వామపక్షం చీలికలు పీలికలయి పోతూ వుంటుంది. విశ్వవిద్యాలయాలలో అగ్రవర్ణ ఆధిపత్యం ఇంకా వుంది. మైనారిటీలు, అణగారిన వర్గాలు తమ లోపలి బలహీనతల్ని గుర్తించి, తమ బలాన్ని పెంచుకునే శక్తి సంపాదించుకోవాలి.

? మీరు అమెరికాలో అధ్యాపకుడిగా మారాక మీ ఆలోచన/అవగాహన/మేధో శ్రమలో అస్తిత్వ రాజకీయాలలో ఏ మార్పులు గ్రహించారు? అధ్యాపకుడిగా పనిచేస్తూ వుండడం వల్ల కొత్త తరం సంవేదనలూ, అనుభవాలూ, ఆలోచనలూ నాకు తెలుస్తున్నాయి. అట్లాగే నా తరగతి గదుల్లో భిన్న దేశాల భిన్న సంస్కృతుల విద్యార్ధులు వుండడం వల్ల ఆ భిన్నత్వం నా ఆలోచనల్ని తప్పనిసరిగా మారుస్తుంది. నా విద్యార్థులు నా నించి ఎంత నేర్చుకుంటున్నారో నేనుగా చెప్పలేను గాని, ప్రతి విద్యార్థి నించీ నేను నేర్చుకుంటూనే వుంటాను. అధ్యాపకుడయినా, వ్యక్తి అయినా నిరంతరం ఆ విద్యార్థి స్థితిలో వుండాలి అనుకుంటా. అందువల్ల మీ లోపల పీఠాలు ఏమైనా నిర్మితమవుతూ వుంటే, అవి వెంట వెంటనే కుప్పకూలిపోతాయి వాటికి అవే! ఇందులో చాలా మేధో శ్రమ వుంటుంది. మీ అస్తిత్వం నిరంతరం ప్రశ్నల మధ్య వూగిసలాడడమూ వుంటుంది. ఇది మేధో ఆరోగ్యానికి చాలా మంచిది. వొక్క ప్రశ్న కూడా పుట్టని రోజు నేను నిలవ నీరయిపోయినట్టే లెక్క. వొక కవితలో రాసుకున్నట్టు 'ఎక్కడో వొక చోట గడ్డ కట్టుకుపోలేను.'

అఫ్సర్

Andhra Jyothi Telugu News Paper Dated: 17/12/2012 

ఆదివాసీలకు అందని ఐటీడీఏ ఫలాలు---వూకే రామకృష్ణ




దేశానికి స్వాతంత్య్ర వచ్చి 65 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఆదివాసీలకు మాత్రం నిజమైన స్వాతంత్య్రం రాలేదు. సర్వసత్తాక, సామ్యవాద, గణతంత్ర రాజ్యంలో ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పాలక వర్గాలు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఆదివాసీల కోసం చేపడుతున్నామని ప్రచారం చేస్తున్నాయి. అయితే ఆదివాసీలకు మాత్రం అవి అందటం లేదు. ఐటీడీఏ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు 1970లో గిరిజనులను సమక్షిగంగా అభివృద్ధి చేయటం కోసం ప్రవేశపెట్టారు. ఆచరణలో ఐటీడీఏలు ఆదివాసీలను సమక్షిగంగా అభివృద్ధి చేయటంలో విఫలమవుతున్నాయి. ఐటీడీఏలో ఉన్నతాధికారిగా ఒక ఐఏఎస్‌ను ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ- ఐటీడీఏ)గా నియమిస్తారు. సాధారణంగా ఐఏఎస్ అధికారుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉంటున్నారు. అందులో ఎక్కువ శాతం ఆదివాసేతరులు కావటం వల్ల వారికి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, వారి చట్టాలపై సరైన అవగాహన ఉండదు. దీని మూలంగా ఆదివాసీలు చాలా నష్టపోతున్నారు.
ఆంధ్రవూపదేశ్‌లో మూడు తెగల గిరిజనులను నిజమైన ఆదివాసీలుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో కొన్ని కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆదివాసీల్లో కొన్ని తెగలకు మాత్రమే ఐటీడీఏ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్య, రంగాల్లో సమక్షిగమైన అభివృద్ధి లేక ఆదివాసీలు వెనుకబడిపోతున్నారు. జీవో 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీలను నియమించాలని ఉన్నప్పటికీ ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల్లో ఆదివాసీలను నియమించాల్సి ఉండగా, గిరిజనేతరులు దొంగ సర్టిఫికేట్లతోఅడ్డదారిలో ఉద్యోగాలు సంపాదిస్తూ, ఆదివాసీలను దెబ్బతీస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 1950 జీవో 3 ప్రకారం ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్స్ ఆదివాసీలకు మాత్రమే జారీ చేయాల్సి ఉండగా, రెవె న్యూ అధికారులు లంచాలకు ఆశపడి గిరిజనేతరులకు కూడా సర్టిఫికేట్లు ఇస్తున్నారు. దీంతో నిజమైన ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా ఐటీడీఏ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంఘాలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకునే వారులేరు. రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్డ్‌ను అమలు చేయాలని ఆదివాసీలకు న్యాయం చేయాలని ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఆదివాసీల అమాయకత్వం, నిరక్షరాస్యత మూలంగా ఐటీడీఏ ఫలాలు, సంక్షేమ పథకాలు అందటం లేదు. మన రాష్ట్రంలో ఉన్న 11 ఐటీడీఏల్లో మొత్తం ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. కొన్ని ఐటీడీఏ కేంద్రాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఐటీడీఏ కోసం వందల కోట్లు ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటికీ అవి ఎక్కడ ఖర్చుపెడుతున్నారో, ఐటీడీఏ అధికారులు కచ్చితంగా చెప్పడం లేదు. ఐటీడీఏ ఆఫీసులో ఏదైనా సమస్య, లేదా ‘లోను’ కోసం వెళితే ఆదివాసీలను వింతగా చూస్తూ వారిని అవమానపరుస్తున్నారు. ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లో చాలావరకు గిరిజనేతరులు ఉపాధ్యాయులుగా ఉంటున్నారు. ఆదివాసీల పేరుమీద గిరిజనేతరులు లోన్లు, ఇతర ఆర్థికపరమైన లావాదేవీలు జరుపుతున్నారు. అసలు ఐటీడీఏ ఉన్నది ఆదివాసీలను అభివృద్ధి చేయటం కోసమా నాశనం చేయడం కోసమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆశ్రమ పాఠశాలలో (ఐటీడీఏ పరిధిలో ఉన్నవి) ఆదివాసీలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ వారికి ప్రమోషన్లు లేక వెట్టిచాకిరి చేస్తున్నారు. పదేళ్ల సర్వీసు దాటిన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఐటీడీఏలో జీవోలు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయకుండాఅధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారు. వారిపై ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో వేలాది ఎకరాల ఆదివాసీలు భూములు అన్యాక్షికాంతం అవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు అవినీతిపరులుగా మారి ఆదివాసీల చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారు. దీంతో ఆదివాసీల భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో అగ్రవర్ణాల వలసలు పెరిగిపోయి ఆదివాసీలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు.ఖమ్మం జిల్లాలో కొన్ని ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో చాలామంది ఆదివాసీలను జైళ్లలో నిర్బంధిస్తున్నారు. ఆదివాసీలు నిత్యం బతుకు పోరులో బలవుతూ నేడు వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

ఈ సమాజం ఆదివాసులను కేవలం అడవి మనుషులుగా, అనాగరికులుగా చూస్తున్నది. అడవిలో జంతువులకు ఉన్న రక్షణ ఆదివాసులకు అవసరమన్న విషయాన్ని మన పాలకులు మరిచిపోతున్నారు. పులుల రక్షణ కోసం అభయారణ్యాలను ఏర్పాటు చేసి, టైగర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఆదివాసుల జీవితాలను ఆగం చేస్తున్నది. గిరిజనులను నిర్వాసితులను చేసి నిలవ నీడలేకుండా చేస్తున్నది. అభివృద్ధిపేర, వనరుల వెలికితీత పేర ఆదివాసీ భూములను కాజేస్తున్నారు. దీనికి తోడు ప్రపంచీకరణ తోడైంది. ఛత్తీస్‌గఢ్‌లోజరుగుతున్న గ్రీన్‌హంట్ కూడా ఆదివాసులే లక్ష్యంగా సాగుతున్నది. పచ్చటి అడవిలో నెత్తు పారిస్తున్నారు. మరోవైపు సీజనల్ వ్యాధులతో యేటా వందలాదిమంది గిరిజనులు చనిపోతున్నా పట్టించుకోవడంలేదు. కనీస వైద్య సదుపాయాలు, రక్షిత మంచినీరులేక మలేరియా, కలరా, భయంకరమైన చర్మవ్యాధులతో ఆదివాసులు అలమటిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పే పాలకులు ఆదివాసుల జీవించే హక్కును హరిస్తున్నారు. ఆదివాసులకు సంబంధించిన పథకాలన్నీ సక్రమంగా అమలు కావాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులనే ఉద్యోగాల్లో నియమించాలి. ఏజెన్సీ డీఎస్సీలాగే అన్ని శాఖల్లో ఆదివాసులకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ వేయాలి. గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి ఆ ప్రాంతంలో పనిచేసే పోలీస్‌లనూ, పోలీస్ శాఖనూ ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలి. చదువులో ఆదివాసీ యువతీ యువకులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించాలి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ లాగానే ట్రైబల్ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. లేకుంటే.. ఆదివాసులు తమ హక్కుల రక్షణ కోసం అనివార్యంగా పోరుబాట పట్టక తప్పదు. అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, వనరుల వెలికితీత పేరుతో ఆదివాసులను నిర్వాసితులను చేసే విధానాలకు పాలకులు స్వస్థి పలకాలి. ఆదివాసీ ప్రజలపై ప్రభుత్వం సాగిస్తున్న అన్ని రకాల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసులకు అండగా నిలబడాలి. ఆదివాసుల విముక్తి కోసం సాగుతున్న పోరాటాలకు మద్దతుగా నిలవాలి. 


ఆదివాసీ రచయితల సంఘం, రాష్ట్ర కార్యద
Namasete Telangana News Paper Dated: 16/12/2012

ఫ్యూడలిజం పూజలో విప్లవకారులు - కంచ ఐలయ్య



ఎం.ఎల్ రాజకీయాల నుంచి వచ్చిన ఏ వ్యక్తిని మందలిచ్చినా ఇప్పుడు తెలంగాణ తప్ప మరోటి మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడి దొరల మీద ఈగ వాలితే వారు కాల్చి చంపేంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ వచ్చినా, రాకున్నా తెలంగాణ పోరాటం ఆపొద్దు అంటున్నారు. భూస్వాముల పార్టీలకు ఓట్ల సమీకరణ మాజీ నక్సలైట్లే చేస్తున్నారు. ఇప్పుడు విప్లవం అనే పదం అర్థమే పూర్తిగా మారిందా? 

తెలంగాణకు విప్లవగడ్డ అని పేరుంది. క్లాసికల్ మార్క్సిజం పోరా ట రూపంలో ఇక్కడే ముందు పరీక్షకు పెట్టబడింది. 1969లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చాక మావోయిజం మౌలిక సిద్ధాంతాన్ని కేంద్రీకరించి పరీక్షకు పెట్టింది ఇక్కడే. శ్రీకాకుళంలో వర్గశత్రు నిర్మూలనకు తొలిరూపం ఇచ్చినా 1979-80లో సిరిసిల్ల, జగిత్యాల పోరాటాల్లో మావో రూపొందించిన వైరుధ్యాల సిద్ధాంతాన్ని బలంగా ఆచరణలో పెట్టే ప్రయత్నం ఒకటి జరిగింది. రష్యా విప్లవంలో ప్రధాన వైరుధ్యం కార్మిక వర్గానికి బూర్జువా (పెట్టుబడిదారీ) వర్గానికి మధ్య ఉంటుందని లెనిన్ సూత్రీకరించగా, మూడవ ప్రపంచ దేశాల్లో ఫ్యూడలిజం అంతమై పెట్టుబడి అభివృద్ధి చెందలేదు కనుక ఇక్కడ ప్రధాన వైరుధ్యం ఫ్యూడల్ దోపిడీదారులకూ రైతాంగంతో సహా విశాల ప్రజానీకానికి మధ్య ఉంటుందని మావో చెప్పాడు. అందువల్లే భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాన్ని తెలంగాణలో మావోయిస్టులు ప్రారంభించారు.

ఆ పోరాటం 1969 తెలంగాణ ఉద్యమం వచ్చి చల్లారినాక నడిచింది. ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌లో వెలమ భూస్వాములు కరుడుకట్టిన భూస్వాములుగా ఉన్నందువల్ల ఆ ప్రాంతపు బ్రాహ్మణులతో పోరాటంలోకి వచ్చారు. ఈ పోరాటం నుంచి మల్లోజుల కోటేశ్వరరావు, పులి అంజయ్య, నల్లా ఆదిరెడ్డి, కోనెపురి సాంబశివుడు (పుల్లయ్య) వంటి వారు ఈ ప్రాంతం నుంచి పి.డబ్ల్యు.జి. రాష్ట్ర కమిటీ సెక్రటరీలు అయ్యారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ పోరాటం వల్లనే ముప్పాల లక్ష్మణరావు ఆ పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ అయ్యాడు. పుల్లారెడ్డి గ్రూపుకు రాజన్న నాయకుడైందీ ఆ పోరాటాలు చెయ్యబట్టే. ఒకవేళ 1969 తెలంగాణ ఉద్యమం తరువాత తెలంగాణ వెనుకబాటుతనానికి ఇక్కడి భూస్వాములు బాధ్యులని అంచనాకు రాకుంటే ఆ పోరాటం ఎందుకు చేసినట్టు? ఆంధ్ర పెట్టుబడిదారులే ఈ ప్రాంత, రాష్ట్ర వెనుకబాటుతనానికి కారణమని సీరియస్ అంచనా వేసి ఉంటే ఈ ప్రాంతంలో రైతాంగ విప్లవం, గ్రామాలను విముక్తి చేసి, పట్టణాలను ఆక్రమించుకునే సిద్ధాంతం అసలు సరిపడదు గదా! ఆ ప్రాంతపు వెలమ దొరల నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభమైంది.

అప్పటి నుంచి అన్ని మావోయిస్టు గ్రూపులు ఇక్కడి ప్రధాన వైరుధ్యం తెలంగాణ ప్రాంతం (భూస్వాములతో సహా) ఆంధ్ర ప్రాంతం మధ్య ఉన్నదనే వాదన ముందుకు తెచ్చారు. ఇది ఏ మావో సిద్ధాంతంలో భాగం? ఈ వైరుధ్యం ఎప్పుడు మారింది? ఒకనాడు నక్సల్‌బరీ పోరాటంలో భాగంగా జగిత్యాల సిరిసిల్ల పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలు ఉత్తర తెలంగాణ అంతా విస్తృతంగా పాకాయి. ఈ పోరాటాల్లో వందలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులు/యువతులు ప్రాణాలకు తెగించి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ ప్రాంతపు భూస్వాములు పన్నిన కుట్రలో భాగంగా ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. సిరిసిల్ల, జగిత్యాల పోరాటాలు ఏ కుల భూస్వాములకు వ్యతిరేకంగా జరిగాయి? వెలమ, రెడ్డి భూస్వాములకు వ్యతిరేకంగానా? రాజ్య నౌకర్లైన పోలీసులతో ఇక్కడి యువతకు శత్రుత్వం ఎందుకు తలెత్తింది? వాళ్ళు భూస్వాముల రక్షకులుగా ఉన్నారనే కదా!

ఖమ్మం అడవులు మొదలుకొని ఆదిలాబాద్ అడవుల్లో తుపాకులు భుజాన పెట్టుకొని దళాలు తిరిగింది ఈ భూస్వాములను చంపడానికే కదా! మొత్తం నక్సలైట్ పోరాటాల్లో దాదాపు 6,000 మంది చనిపోతే దాదాపు 5,500 మంది తెలంగాణకు చెందినవారే కదా? తెలంగాణ వెనుకబాటు తనానికీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భూమి, భుక్తి లేకపోవడానికి ఆంధ్ర పెట్టుబడిదారులు కారకులై ఉంటే ఆనాడు అర్బన్ గొరిల్లా యుద్ధాలు చేసి హైదరాబాద్‌లో పెట్టుబడిదారులను చంపాల్సి ఉండింది కదా! ఆదిలాబాద్ నుంచి ఖమ్మం (ఇప్పుడు కేసీఆర్ చంకలోని న్యూడెమోక్రసీ ఖమ్మం అడవి ప్రాంతంలో ఉండేది) దాకా అడవుల్లో మాటుగాసి తెలంగాణ ప్రాంతపు భూస్వాముల మీద తుపాకులెందుకు ఎక్కుపెట్టినట్టు? వారి ఏజెంట్లు అయిన పోలీసులతో ఎందుకు తలపడినట్టు! అంతమంది యోధులను ఆ పోరాటంలో ఎందుకు కోల్పోయినట్టు!

2001లో కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టాక మావోయిస్టుల మౌలిక సిద్ధాంతం ఎట్లా మారింది? 'రావు' అని ఇక్కడి వెలమ దొరలకు, కొంతమంది బ్రాహ్మణులకు తగిలించుకున్న పేరు ఏనాడు తెలంగాణ ప్రాంతానిది కాదు. అది మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిందని మహారాష్ట్రలోని దేశ్‌ముఖుల, భూస్వాముల పేర్లు బట్టి చూస్తే సులభంగా అర్థమవుతుంది. మహాత్మా ఫూలే పేరు 1827లోనే జ్యోతిరావు గోవిందరావు. ఆనాటి తెలంగాణలో రావు అనే పేర్లు ఎవరికీ ఉన్న దాఖలాలు లేవు. అదే విధంగా 'రెడ్డి' అనే పేరు రాయలసీమ నుంచి దిగుమతి అయిందనీ తెలుసు మనకు. వేమన పేరు వేమారెడ్డి అని ఉన్నప్పుడు ఇక్కడ ఏ కాపుకూ రెడ్డి అని పేరు ఉన్న దాఖలాలు లేవు. ఈ పేర్లతో పాటు ఆ భూస్వామ్య దోపిడీ కూడా ఇక్కడికి దిగుమతి అయింది. ఈ రెడ్లు, రావులు మౌలికంగా ఫ్యూడల్స్. క్యాపిటలిజం కంటే ఫ్యూడలిజం ప్రధానమైంది కనుక ఆనాడు ఆంధ్రా రెడ్డి, రావుల కంటే తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రెడ్డి, రావులు ఎక్కువ శత్రువులు అనే అవగాహనతో ఆ పోరాటం సాగింది. ఇది ఆనాటి మావోయిజం. క్యాపిటలిజం కంటే ఫ్యూడలిజం ఎక్కువ ప్రమాదకరమైందని మావోయిజం అవగాహన కూడా.

ఇప్పుడది పూర్తిగా మారింది. తెలంగాణ రెడ్డి, రావులు, తెలంగాణ విశాల ప్రజల మిత్రులు, ఆంధ్ర పెట్టుబడిదారులు ప్రధాన శత్రువులని అన్ని నక్సలైట్ ఆర్గనైజేషన్లు తెలంగాణ, ఆంధ్ర మధ్య వైరుధ్యం ప్రధాన శత్రువైరుధ్యం అని చెబుతున్నారు. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమికొట్టాలంటే తెలంగాణ ఫ్యూడల్స్‌తో ఐక్యసంఘటన కట్టి (నిజానికి సంలీన సంఘటన) ఈ ప్రాంతాన్ని ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి విముక్తి చేయాలనేది ఈనాటి మావోయిజం. 1969 నాటికి సీపీఐ, సీపీఎం నుంచి బయటికొచ్చిన కామ్రేడ్స్ అందరికీ ఇదే అవగాహన ఉంటే ఆంధ్ర కొండపల్లి సీతారాంరెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల, జగిత్యాల పోరాటం ఎందుకు మొదలెట్టినట్టు! ఆనాటి నుంచే ప్రత్యేక తెలంగాణపోరాటమొక్కటే చేసిఉంటే పులి అంజయ్య, మారోజు వీరన్న, నల్లా ఆదిరెడ్డి, చంద్రమౌళి వంటి గొప్ప భూస్వామ్య వ్యతిరేకుల్ని కోల్పోయే వారం కాదు కదా!

వీరందరూ ఆ పోరాటంలో చనిపోయి ఉండకపోతే దేశాన్నే మార్చే నాయకులయ్యేవారేమోకదా? తెలంగాణ ఫ్యూడల్స్ స్వభావం, స్వరూపం ఏమైనా మారిందా అంటే 'కర్రు కాల్చి వాతపెడతం', 'చాకలి-మంగళి వేశాలెయ్యొద్దు' అనే రావు, రెడ్ల భాష ఉద్యమాల్లోనే ఉంది కదా! ఏం మారింది. ఈ మొత్తం తెలంగాణ ఉద్యమంలో 'దొరల బంగ్లాలో' మాజీనక్సలైట్లు, ప్రజా సంఘాల నాయకులు- గాయకులు తప్ప ఎవరున్నారు? దొరల ఉపన్యాసాలకు ముందు ధూంధాం పాటలు పాడుతూ బట్టలిప్పుకొని అర్ధనగ్నంగా ఎగిరే వారం తా ఏ సిద్ధాంత భూమికలో పుట్టి పెరిగారు? ఈ భూస్వాముల్ని రేపొచ్చే ఎన్నికల్లో అదే సిరిసిల్ల, జగిత్యాల్లో (పోరాటగడ్డల్లో) గెలిపించబొయ్యేది ఎవరు? భూస్వామ్య శక్తులకు విశాల ప్రజల మధ్య ఉండే ప్రధాన మావోయిస్టు వైరుధ్యం హైదరాబాద్‌లో మారిందా, అడవుల్లోనే మారిందా?

నక్సల్‌బరీ పోరాటం చుట్టూఉన్న జర్నలిస్టులు, పౌర హక్కుల నాయకులు, మేధావులు బంజారాహిల్స్ బంగ్లాల్లోనే విముక్తి మార్గముందని చెబుతున్నారు. ఈ మార్పు ఎవరి రచనల ద్వారా వచ్చింది? నా ఆట తెలంగాణ; నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ అని సెల్‌ఫోన్ల మీద, టీవీలల్లో, పత్రికల్లో రోజూ వింటుంటే తెలంగాణలో పుట్టిన వాడెవ్వడూ, నేను విశ్వమానవున్ని, నేను ప్రపంచ కార్మికున్ని, అంటేనే చంపెయ్యాలనే పిచ్చి ఉన్మాదుల్ని మావోయిస్టులు ఎందుకు తయారుచేస్తున్నారు? ఎం.ఎల్ రాజకీయాల నుంచి వచ్చిన ఏ వ్యక్తిని మందలిచ్చినా ఇప్పుడు తెలంగాణ తప్ప మరోటి మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడి దొరల మీద ఈగ వాలితే వారు కాల్చి చంపేంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తెల ంగాణ వచ్చినా, రాకున్నా తెలంగాణ పోరాటం ఆపొద్దు అంటున్నారు. భూస్వాముల పార్టీలకు ఓట్ల సమీకరణ మాజీ నక్సలైట్లే చేస్తున్నారు. దానికోసం రోడ్ల మీద పోరాటం వాళ్ళే నడుపుతున్నారు. జనం చీమల పుట్టల్లా రోడ్లమీది కొచ్చిండ్రని ఒక విప్లవకారుడు రాస్తే, జనం తెలంగాణ కోసం వంద సీట్లు గెలిపించాలని మరో విప్లవకారుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విప్లవం అనే పదం అర్థమే పూర్తిగా మారిందా?

ఈ మొత్తం డ్రామా తెలంగాణ పవిత్ర ఫ్యూడలిజాన్ని కాపాడడానికే కదా! తెలంగాణ ఫ్యూడలిజానికి వ్యతిరేక పోరాటం పుట్టిందని చెప్పిన పాట, దాని స్వరూపం ఏమాత్రం మారక ముందే రాష్ట్రాన్ని విడగొట్టైనా, ఇక్కడి భూస్వాముల్ని తొందరగా అధికారంలోకి తేవాలని ఎందుకు చెబుతుంది? టీఆర్ఎస్ పుట్టినాక తెలంగాణ ప్రాంతంలో వారి అసలు విప్లవ కార్యక్రమం ఒక్కటి కూడా లేకుండా పోయింది. విప్లవకారులు ఎంతో మందిని చంపించిన జానారెడ్డి, కేసీఆర్‌లు ఏర్పాటు చేసిన జేఏసీ అనే ఫ్యూడల్ సంస్థలో విప్లవకారులంతా హుషారుగా, పట్టుదలతో పనిచేస్తున్నారు. తెలంగాణ పేరుతో మావోయిజం బీజేపీతో అలాయి, బలాయిలా ఉంటుంది. ఇక్కడో గుజరాత్ జరిగేదాకా నిద్రపట్టే పరిస్థితి లేదు. ఎవరిదో ఒకరిది రక్తం చూస్తే తప్ప సూర్యుని గురించి కవిత్వం రాయలేని కవిలా, విప్లవ వాదం కూడా ఏదో ఒక రకంగా ప్రజల చావు కోరుకుంటే ఎట్లా? 1969లో చెన్నారెడ్డితో చేతులు కలిపి నినదించారు. ఆయన ఆ నినాదం ఆపేస్తే విప్లవకారులు కూడా ఆపేసారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణే ఏకైక లక్ష్యం అని ముడుపులపాయ పార్టీ పెడితే విప్లవగ్రూపులన్నీ 'అవును తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యమని' కట్టిన గజ్జె ఇప్పకుండా ఎగురుతున్నాయి. 

మావోయిజానికీ, ఈ ఫ్యూడల్ ఉద్యమానికి సంబంధమేమిటి? ప్రపంచ సిద్ధాంతాలన్నిటినీ పక్కకు పెట్టి ఇక్కడ ఉద్యమ ఉద్యోగుల్ని తయారుచేసే కార్యక్రమం మావోయిస్టులకేమైనా ఉందా? ప్రత్యేక తెలంగాణ 1969 ఉద్యమంతో రాలేదు. ఇప్పుడు జరిగే ఉద్యమంతో రాదని మావోయిస్టులకు తెలువకపోయినా ఇంట్లో ఉన్న కేసీఆర్‌కూ తెలుసు, జైల్లో ఉన్న జగన్‌కు తెలుసు, నడుస్తున్న నాయుడికి తెలుసు, నిద్రపోతున్న కిరణ్‌కూ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమస్య చుట్టూ ప్రజల్ని ఇంకా తిప్పడమంటే పవిత్ర ఫ్యూడలిజానికి పూజ చెయ్యడం తప్ప మరేమీ కాదు. ఈ చండేశి యాగంలో ఇంకెంతమంది బలికావాలో అందరికన్నా ముందు ఈ ప్రాంతపు మావోయిస్టులు చెప్పాలి. ఏ సిద్ధాంత ప్రాతిపదికన విప్లవ సంఘాలన్నీ ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారో చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంది.

విప్లవకారులకు సిద్ధాంత అవగాహన లేకపోతే ఆ పార్టీల్లో యువకులు చేరి ప్రాణాలెందుకు కోల్పోవాలో కూడా చెప్పాలి. లెనిన్ చెప్పినట్లు విప్లవకారునికి ముందు సిద్ధాంతం ఉంటుంది, తరువాత దాని ఆచరణ ఉంటుంది. వేలాది ప్రాణాలు ఫ్యూఢలిజం వ్యతిరేక పోరాటంలో బలిగావడానికి కారకులైన విప్లవకారులు ఇప్పుడు అదే ఫ్యూడలిజం పూజచేస్తే ఇక ప్రాంతాన్ని కాదు, దేశాన్ని కూడా ఎవరూ కాపాడలేరు. ఇప్పుడు నడుస్తున్న తెలంగాణ ఓట్ల పోరాటానికీ, నోట్ల పోరాటానికీ మీ అండ ఎలా ఉంటుందో చెప్పండి

- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త
Andhra Jyothi News Paper Dated: 16/12/2012

Friday, December 14, 2012

ఢోకాలేని ముస్లింల సంక్షేమం - కె. కొండల రావు



ముస్లింలకు సామాజిక న్యాయం అందటం లేదు అనే దాంట్లో నిజం లేదు. వారి ఓటింగ్ సరళిలో సంఘటితత్వం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను కీలక సందర్భాల్లో నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తి వారికి ఉంది. ఇతర అణగారిన వర్గాలైనవారెవ్వరికీ తీసిపోకుండా ముస్లింలు రాజ్యప్రోత్సాహం పొందుతున్నారు. ముస్లింల విషయంలో రాజ్యాంగం విఫలమయ్యిందనడం ఏవిధంగానూ సబబుకాదు. 

'ముస్లింల బాగు కోరే వారెవరు?' అని ఎస్.పి.గఫార్ (నవంబర్ 6, ఆంధ్రజ్యోతి) ప్రశ్నించారు. 'ఎవ్వరికీ పట్టని మైనారిటీలు' అంటూ ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (నవంబర్ 11, ఆంధ్రజ్యోతి) వాపోయారు. వాస్తవమేమిటి? మన ప్రభుత్వాలు నిజంగానే, ముస్లిం సోదరులను ఇంతగా నిరాశానిస్పృహలకు లోను చేస్తున్నాయా? కేంద్ర ఉద్యోగరంగంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో, సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4.5 శాతం మైనారిటీ సబ్ కోటాకు ఉత్తర్వులిచ్చింది. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ముస్లింలకు ఈ కోటా కల్పించారు. ఈ విషయంలో జాతీయ బీసీ కమిషన్‌ను సంప్రదించలేదు. ఈ సబ్‌కోటా పట్ల దేశ వ్యాప్తంగా ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు.

తమకు అన్యాయం జరుగుతుంటే ఓబీసీలు ఎలా హర్షిస్తారు? రంగనాధ్ మిశ్రా కమిషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధం; జాతీయ బీసీ కమిషన్‌ను సంప్రదించకపోవడం చట్ట విరుద్ధం; ఓబీసీల వర్గీకరణ అవసరమైతే అది 'వెనుకబాటుతనం' స్థాయిని బట్టి మాత్రమే జరగాలి; మైనారిటీ ఓబీసీ, నాన్ మైనారిటీ ఓబీసీలుగా విభజించడం మతపరమైన వర్గీకరణ అవుతుంది కాబట్టి చెల్లదు; 4.5 శాతం సబ్ కోటాను సమర్థించడానికి అవసరమైన సర్వే గణాంకాలు కూడా లేవు... ముస్లింల సబ్ కోటాకు వ్యతిరేకంగా నేను చేసిన ఈ వాదనలను హైకోర్టు ఆమోదించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హిందూ ఓబీసీలకు ఆ మేరకు ఊరట లభించింది.

ప్రమోషన్లలో రిజర్వేషన్ల వ్యవహారాన్ని చూద్దాం. ఈ రిజర్వేషన్లు కూడదని 1992లో మండల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ సదుపాయాన్ని 1955 నుంచి పొందుతున్న ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు విఘాతం కల్గింది. ఆ సామాజిక వర్గాల నాయకత్వాల తీవ్ర ఒత్తిడిమేరకు, తమ రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని, నాటి ప్రధానమంత్రులు పి.వి.నరసింహారావు, ఏ.బి.వాజపేయి 1995-2001 మధ్యకాలంలో నాలుగు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు; తద్వారా అర్హత ప్రమాణాలను సడలించి, కాన్సీక్వెన్షియల్ సీనియారిటీతో సహా వెనక తేదీ 1995 జూన్17 నుంచి అమలయ్యేలా చూశారు. ఆ సదుపాయం ఎస్సీ, ఎస్టీ వర్గాలకే పరిమితం చేశారు. ఆనాటికే ప్రభుత్వ ఉద్యోగరంగంలో బీసీల ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీల కంటే ఎంతో అధ్వాన్నంగా ఉన్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయినా బీసీలను పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పునరుద్ధరించారు.

దరిమిలా సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు మేరకు ఈ సదుపాయాన్ని అమలుచేయడానికి ఇబ్బంది ఏర్పడింది. ఆ సందర్భంగా (గత సెప్టెంబర్‌లో) యూపీఏ ప్రభుత్వం మరొకసారి రాజ్యాంగ సవరణకు సిద్ధపడింది. ఎస్సీ, ఎస్టీలతో పోల్చినప్పుడు బీసీల ఉద్యోగ ప్రాతినిధ్య పరిస్థితి గతంలో కంటే ఎంతో అధ్వాన్నంగా ఉంది. అయినప్పటికీ బీసీలను మరలా పక్కన పెట్టారు. సహజంగా బీసీ వర్గాల నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 117వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగిపోయింది. చెప్పవచ్చిందేమిటంటే అసమానతలను సరిచేయడంలో కూడా ఆధిపత్య శక్తులు బీసీల విషయంలో వివక్ష ప్రదర్శిస్తున్నాయి. ఇది గర్హనీయం. తమ అభీష్టం మేరకు తమకు కావలసిన ఎటువంటి విద్యా సంస్థలనైనా స్థాపించి తామే నిర్వహించుకొనే హక్కు ముస్లింలకు ఉంది (ఎస్సీ, ఎస్టీలకు కూడా లేని ఈ ప్రత్యేక హక్కును అధికరణ 30 ద్వారా మైనారిటీలకు కల్పించారు).

ఈ హక్కును ఉపయోగించుకొనే దేశవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు ఎన్నో విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వృత్తి విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు వీటిలో ప్రముఖ మైనవి. దీనికి అదనంగా ఆయా రాష్ట్రాల్లో బీసీల్లో చేర్చబడిన ముస్లిం వర్గాలు రిజర్వేషన్ల ద్వారా ఆయా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ఈ రెండు విధాల ప్రత్యేక సహకారాన్ని, ప్రోత్సాహాన్ని రాజ్యం అందిస్తున్నప్పటికీ ముస్లింలు విద్యాపరంగా వెనుకబడి ఉండడం నిజమే. అయితే అందుకు కారణాల్ని పూర్తిగా నిర్ధారించకుండా రాజ్యాన్ని మాత్రమే తప్పుపట్టడం సమంజసం కాదు. ముస్లింల పట్ల వివక్ష, వ్యతిరేకత, అణచివేత ధోరణి అంటే కుదరదు. పేద ముస్లింలకు వారి మైనారిటీ విద్యా సంస్థలు అందుబాటులో ఉండడం లేదని సచార్ కమిటీ నిర్ధారించింది. మరి ఈ పరిస్థితికి కారకులెవరు? పార్టీలా? ప్రభుత్వాలా? ముస్లింల మీద ఇతరుల వివక్షా, వ్యతిరేకతా? లేక ఆ వర్గానికే చెందిన కొందరి వ్యాపార ధోరణా?

ఉన్నత విద్య, ప్రభుత్వోద్యోగాల మీద కంటే ముస్లింలకు అధిక ఆదాయాలకు అవకాశాలున్న గృహ పరిశ్రమలు, ఉత్పత్తి, వ్యాపార, సేవల రంగాలపై మక్కువ ఎక్కువ అని 2001 జనాభా గణన ద్వారా అర్థమవుతుంది. జాతీయ సగటు కంటే గృహపరిశ్రమ రంగంలో ముస్లింలు 92.65 శాతం అధికంగా ఉన్నారు. ఉత్పత్తి, వ్యాపార, సేవారంగాల్లో వీరు జాతీయ సగటు కంటే 30.6 శాతం ఎక్కువ ఉన్నారు. ఈ రీత్యా ఉన్నత విద్య, ప్రభుద్వోద్యోగ రంగాల్లో తగినంతగా ముస్లింలు లేకపోవటానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదనిపిస్తుంది. అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని పణంగా పెట్టి మైనారిటీల ప్రయోజనాలకే రాజ్యం ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 93వ రాజ్యాంగ సవరణ దీనికి ఒక చక్కని ఉదాహరణ. ఉన్నత విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు ప్రభుత్వ రంగంలో కంటే ప్రయివేటు రంగంలో వాసిలోనూ, రాసిలోనూ ఎక్కువగా పెరుగుతున్న సందర్భమిది. ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చట్టం ద్వారా రిజర్వేషన్ల కల్పనకు అవకాశమిచ్చిన ఈ 93వ రాజ్యాంగ సవరణ, మైనారిటీ విద్యా సంస్థలకు ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు నిచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ ప్రయోజనాల్ని విస్మరించారు. దీన్ని ముస్లింల మీద వ్యతిరేకత అందామా? ప్రత్యేక శ్రద్ధ అందామా?

సైకిళ్ళకు పంక్చర్లు, బిందెలకు మాట్లు వెయ్యడం, గొడుగులను, తాళాలను బాగుచేయడం, రిక్షాలు లాగడం, హమాలీ పనిచేయడం కేవలం ముస్లింలకే పరిమితమైన పనులుకావు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే స్థాయి, ఇంత కంటే అధమస్థాయి వ్యాపకాల్లో ఉంటున్నవారు ఇతర సామాజిక వర్గాల్లోనూ ఎందరో ఉంటున్నారు. ముస్లింలైనా, ముస్లిమేతరులైనా కేవలం పేదరికం కారణంగానే ఈ వృత్తుల్లో ఉంటున్నారు తప్ప పారంపర్య సంప్రదాయాలేమీ ఎవరినీ ఈ చిన్న వృత్తుల్లో బంధించడం లేదు. ఇటువంటి వృత్తుల్లో సామాజిక వెనకబాటుతనానికి గీటురాళ్ళు కాదని కోర్టు తీర్పుల సారాంశం.

'పాలక వర్గాలు గత నివేదికలకు లాగానే సచార్ నివేదికను బుట్ట దాఖలు చేశాయి. స్వాతంత్య్రం సిద్ధించి ఆరున్నర దశాబ్దాలైనా ముస్లింల స్థితిగతులు నాడు ఎలా ఉన్నాయో నేడూ అలానే ఉన్నాయి. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతను తలపోస్తుంది. పాలకులకు ముస్లింల సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు' అంటూ ఉస్మాన్ ఖాన్ రాళ్ళు వేస్తున్నారు. ఇక గఫార్ 'నెహ్రూ కాలం నుంచి నేటి వరకూ ముస్లింల కోసం ప్రభుత్వాలు కార్చింది మొసలికన్నీరే. గణాంక సాక్ష్యాధారాలతో సచార్ కమిషన్, మిశ్రా కమిషన్ దీన్ని స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెల్లంకొట్టిన రాయిలాగా ఏమీపట్టనట్లు చేష్టలుడిగి చూస్తున్నాయం'టూ బండరాళ్ళు వేస్తున్నారు. కమిషన్ల నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు, బుట్టదాఖలు చేశాయనడం బాధ్యతారాహిత్యం.

పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వాలుగానీ, పార్టీలుగానీ చేయవలసిన దానికి మించి, కొన్ని సందార్భలలో బీసీల్లాంటి వారి ప్రయోజనాల్ని కూడా పణంగా పెట్టి, ముస్లింల ప్రయోజనాల కోసం ఎంతోచేస్తున్నాయనడానికి పై విశ్లేషణ, సమాచారంతోపాటు ఎన్నో వాస్తవాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆ విధంగా ఎవ్వరికీ పట్టని మైనారిటీలు అనడానికి గానీ, ముస్లింల బాగుకోరే వారెవరు అని అడగడానికి గానీ ఏమాత్రం ఆస్కారం లేదు. జస్టిస్ బిలాల్ నజ్కీ సూచించినట్టుగా సచార్ కమిటీ తన నివేదికలో వ్యాఖ్యానించినట్టు ముస్లింలు తమ అభివృద్ధి కోసం తమను తామే పట్టించుకొని 'రూట్ కరక్షన్' చేసుకోవలసిన అవసరముందని చెప్పడానికయితే ఆస్కారముంది.

కేవలం ముస్లిం సమాజపు సామాజిక, ఆర్థిక విద్యాపరమైన అభివృద్ధి స్థాయిని పెంచడానికి సచార్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులన్నిటినీ అమలుచేయడానికి నిర్ణయించి 2007 నుంచే అనుక్రమ చర్యలు ప్రభుత్వం ప్రారంభించింది. అధికారిక సమాచారం ప్రకారమే, లక్ష కోట్ల ఖర్చుతో 25 రకాలుగా ఈ చర్యలు నడుస్తున్నాయి. సచార్ నివేదిక సిఫార్సులను ఇంచుమించు అన్నిటిని అనేక కార్యాచరణల ద్వారా ఎంతో వ్యయ ప్రయాసలతో నివేదిక అందిన క్షణం నుంచి నేటివరకు కేవలం మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల బహుముఖ అభివృద్ధి కోసం కోట్లాది కుటుంబాలకు మేలు జరిగే కృషి నడుస్తుంటే గత నివేదికలు లాగానే సచార్ నివేదికనూ పాలకులు బుట్టదాఖలు చేసాయి అనడంలో ఉస్మాన్ ఖాన్, ఇంచు మించు ఇదే ధోరణితో నడిచిన గఫార్ అభాండాల ఆంతర్యం అనుమానాస్పదం కాదా? ముస్లింలకు సామాజిక న్యాయం అందటం లేదు అనే దాంట్లో నిజం లేదు.

వారి ఓటింగ్ సరళిలో సంఘటితత్వం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను కీలక సందర్భాల్లో నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తి వారికి ఉంది. అయితే ఇది అన్నివేళల అన్ని సందర్భాల్లో ఒక స్థాయికి మించి ఉపయోగపడదు. ఇతర అణగారిన వర్గాలైనవారెవ్వరికీ తీసిపోకుండా ముస్లింలు రాజ్యప్రోత్సాహం పొందుతున్నారు. ముస్లింల విషయంలో రాజ్యాంగం విఫలమయ్యిందనడం ఏవిధంగానూ సబబుకాదు. దానికి ఎటువంటి ఆధారాలు లేవు. పనిగట్టుకుని ముస్లింలను వెనక్కు నెట్టేసే పరిస్థితి ఈ దేశంలో ఎవరికీ లేదు.

- కె. కొండల రావు
హైకోర్టు న్యాయవాది, కన్వీనర్ బీసీ మిత్రులు
Andhra Jyothi News Paper Dated: 15/12/2012

ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై పాలకపార్టీల 'నయవంచన' ఎంవిఎస్‌ శర్మ


  Thu, 13 Dec 2012, IST  

  • ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాలు జరిగాయి. కెవిపిఎస్‌ నడిపిన ఉద్యమం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు, ప్రజా సమీకరణలు ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి. అటు టిడిపిగానీ, ఇటు కాంగ్రెస్‌ కానీ సబ్‌ప్లాన్‌ అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ ఆందోళనల అవసరమే ఉండేదిగాదు. రూ.30,000 కోట్ల నిధులు మళ్లింపు జరిగి ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడున్న దయనీయ పరిస్థితిలో ఉండేవారూ కాదు. ప్రజా ఉద్యమాల ఒత్తిడికి దిగొచ్చి ప్రభుత్వం ఏదోవిధంగా స్పందించక తప్పలేదు.
''ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీలకు ఎవరైనా మేలు చేశారంటే అది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. ఎప్పటికీ ఎస్సీ, ఎస్టీలు మాతోనే ఉంటారు.'' గ్రామీణాభివృద్ధి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ డిసెంబర్‌ 11న శాసనమండలిలో బల్లగుద్ది మరీ చెప్పిన మాటలివి.
''ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి మేం అంకిత భావంతో పనిచేస్తున్నాం గనుకనే దేశంలోనే మొట్టమొదటిగా ఇటువంటి బిల్లు తెచ్చాం. దేశానికే ఆదర్శప్రాయంగా మనం ఉన్నాం. మా చిత్తశుద్ధిని శంకించకండి.'' ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదే రోజున అదే సభలో చేసిన ప్రసంగంలో భాగం ఇది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు డిసెంబర్‌ 11న శాసనమండలిలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గవర్నర్‌ ఆమోదముద్ర పడితే ఇది చట్టం అయినట్టే. ఈ చట్టంతో పదేళ్లలో సామాజిక సమానత్వాన్ని, సమతుల్యతను సాధించేయబోతున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు పోతోంది. ఆ ఘనత అంతా తమకే చెందాలని, ఇంకెవ్వరికీ దక్కరాదని వాదిస్తోంది. ఆ పార్టీ నాయకులు, మంత్రులు వాదిస్తున్నట్టు ఆ చట్టం ద్వారా అంత మేలు ఒనగూరితే అభ్యంతరమేముంది? కానీ బిల్లులోని కొన్ని క్లాజులను చూస్తే ఈ బిల్లు వల్ల ఎస్సీ, ఎస్టీలకు ఒరిగేదేముంది? అన్న సందేహం కలుగుతుంది. ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌) తరపున ముఖ్యమైన సవరణలను ఏడింటిని ప్రతిపాదించాము. ఆ సవరణలను ప్రవేశపెట్టడానికి సైతం అధికార పక్షం అంగీకరించలేదు. బిల్లు ఉద్దేశాలను, లక్ష్యాలను బలోపేతం చేసే ఈ సవరణలపై ముఖ్యమంత్రితో సహా ఎవరూ స్పందించలేదు. ఈ అధికారపక్షం తీరు చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిపై కచ్చితంగా అనుమానం కలుగుతుంది.
సబ్‌ప్లాన్‌ భావన 1980 నుంచీ ముందుకొచ్చింది. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు ఎంత శాతం ఉన్నారో, అంత శాతం నిధులను ప్రభుత్వం వారికి కేటాయించి వారి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్నది సబ్‌ప్లాన్‌ ఉద్దేశం. అయితే ఈ లక్ష్యం ఏమాత్రమూ నెరవేరలేదని ప్రభుత్వమే అంగీకరిస్తున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి - మార్చి నెలల్లో జరిగిన బడ్జెట్‌ సమావేశాలలో శాసనమండలిలో సబ్‌ప్లాన్‌పై రెండురోజుల పాటు చర్చ జరిగింది. ఆ చర్చలో కాంగ్రెస్‌, తెలుగుదేశం 'సబ్‌ప్లాన్‌ అమలు జరగకపోవడానికి కారణం మీరే అంటే ... కాదు మీరే'' అని పరస్పరం నిందించుకున్నాయి. సబ్‌ప్లాన్‌పై ప్రణాళికా సంఘం మార్గదర్శకాలు జారీచేసి 32 సంవత్సరాలైంది. ఈ కాలంలో తెలుగుదేశం 17 సంవత్సరాలు, కాంగ్రెస్‌ 15 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. సబ్‌ప్లాన్‌ అమలు పట్ల ఈ రెండుపార్టీలూ శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా రూ.30,000 కోట్లకు పైగా సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు అవకుండా మురిగిపోయాయి లేదా ఇతర పద్దులకు మళ్లించబడ్డాయి.
పున్నయ్య కమిషన్‌ మేమే వేశామని, సిఫార్సులను ఆమోదించామని టిడిపి చెప్పుకుంటూ ఉంటే కోనేరు రంగారావు కమిషన్‌ను నియమించి సిఫార్సులను ఆమోదించినది మేమని కాంగ్రెస్‌ చెప్పుకుంటోంది. ఈ రెండు కమిషన్ల సిఫార్సులనూ ఆచరణలో నీరుగార్చారు.
ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాలు జరిగాయి. కెవిపిఎస్‌ నడిపిన ఉద్యమం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు, ప్రజా సమీకరణలు ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి. అటు టిడిపిగానీ, ఇటు కాంగ్రెస్‌ కానీ సబ్‌ప్లాన్‌ అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ ఆందోళనల అవసరమే ఉండేదిగాదు. రూ.30,000 కోట్ల నిధులు మళ్లింపు జరిగి ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడున్న దయనీయ పరిస్థితిలో ఉండేవారూ కాదు. ప్రజా ఉద్యమాల ఒత్తిడికి దిగొచ్చి ప్రభుత్వం ఏదోవిధంగా స్పందించక తప్పలేదు. అయినా కిందపడ్డా నాదే పైచేయి అన్న చందాన కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోంది. ఎస్సీ, ఎస్టీల పట్ల మేమే మొనగాళ్లం అంటున్న కాంగ్రెస్‌ గడిచిన ఆరు దశాబ్దాల కాలంలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏమీ చేయలేకపోయామని సబ్‌ప్లాన్‌ చట్టాన్ని ఇప్పుడు చేయడం ద్వారా పరోక్షంగా అంగీకరించినట్టే గదా? ఇదే ప్రస్తావిస్తే మాత్రం ఉన్న మాటంటే ఉలుకెక్కువ అన్నట్టు కాంగ్రెస్‌ మంత్రులు ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు.
మా చిత్తశుద్ధిని శంకించవద్దంటూ ముఖ్యమంత్రి పదేపదే అంటున్నారు. కానీ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు, సిపిఐ(ఎం) ఎమ్మెల్సీ సీతారాములు ప్రతిపాదించిన సవరణలన్నింటినీ తిరస్కరించారు. ఈ సవరణలన్నీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పటిష్టం చేయడం కోసం ప్రతిపాదించినవే. చిత్తశుద్ధి ఉంటే ఈ సవరణలనెందుకు తిరస్కరించారో ముఖ్యమంత్రి చెప్పాలి.
1. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో 3వ క్లాజులో ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఉంది. పైకి చూస్తే ఇది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తికి మించి కేటాయించరాదు అని దీని అర్థం. దీనిపై ప్రతిపాదించిన సవరణలో ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తికి తగ్గకుండా కేటాయించాలని ఉంది. దీనినెందుకు ప్రభుత్వం తిరస్కరించింది?
ఈ చట్టం లేకపోయినా ప్రతి సంవత్సరమూ సబ్‌ప్లాన్‌లో జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయిస్తూనే ఉన్నారు. అవి పూర్తిగా ఖర్చు కాకుండా మురిగిపోతూనే ఉన్నాయి. ఒక సంవత్సరం కేటాయించిన నిధులు ఏ కారణం వల్లనైనా ఖర్చుకాకపోతే ఆ నిధుల్ని తరువాత సంవత్సరపు కేటాయింపులకు అదనంగా తోడు చేయాలి. బిల్లులో జనాభా నిష్పత్తి ప్రకారమే కేటాయించాలని నిర్దేశించాక ఈ అదనపు నిధుల్ని కేటాయించడం వీలు కాదు. ఒక సంవత్సరంలో కేటాయించిన నిధులు ఖర్చుగాకపోతే అవి మురిగిపోవడమే. ఆ మేరకు ఎస్సీ, ఎస్టీలు నష్టపోవడమే. కానీ పిడిఎఫ్‌ / సిపిఎం ప్రతిపాదించిన సవరణను అంగీకరించి ఉంటే ముందటేడాది ఖర్చుకాని నిధుల్ని తరువాయి ఏడాది కేటాయింపులకు అదనంగా కలిపే వీలుంటుంది.
బడ్జెట్‌ కేటాయింపులు అదే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసి తీరాలని చెప్పినా అది ఆచరణకు సంబంధించిన విషయం గనుక ఏవో కారణాల వల్ల, ఆటంకాల వల్ల ఖర్చు అవకపోవచ్చు. కనుక వాటిని తరువాతి సంవత్సరానికి 'క్యారీ ఓవర్‌' చేయడానికి చట్టంలో వీలుండాలి.
2. ఇప్పటివరకూ ఖర్చుకాని సబ్‌ప్లాన్‌ నిధులను గుర్తించి ఆ మొత్తాన్ని రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులుగా కేటాయించాలని ఇంకో సవరణ ప్రతిపాదించాము. దీనినీ తిరస్కరించింది ప్రభుత్వం.
3. ఎస్సీలలో, ఎస్టీలలో వివిధ కులాల మధ్య, తెగల మధ్య ఉన్న అంతరాలను గుర్తించి వారిమధ్య సమతుల్యత సాధించాలని ఆరో క్లాజులో పేర్కొన్నారు. అదే క్లాజులో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని పేర్కొన్నారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చకుండా ఉంచిన గిరిజన గ్రామాలు 840కి పైగా ఉన్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాలోకి వచ్చే అవకాశంలేని గిరిజన తండాలు వందలాది ఉన్నాయి. 840 గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలని, గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంటోంది. ఇప్పుడీ చట్టంలోనూ వారిని పట్టించుకోలేదు. మేము ప్రతిపాదించిన సవరణను సైతం తిరస్కరించింది. అయినా గిరిజనుల పట్ల మాకే చిత్తశుద్ధి ఉందని అంటుంటే ప్రభుత్వాన్ని నమ్మేదెలా?
4. సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చును పర్యవేక్షించడం కోసం ఒక ప్రత్యేక కార్యదర్శి ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఆ కార్యదర్శి ఆర్థికశాఖలో భాగంగా ఉండాలని అన్నారు. ఇప్పటివరకూ సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమగా ఖర్చుగాకుండా ఉంటే వాటిని దారి మళ్లించింది ఆర్థికశాఖే. మళ్లీ ఇప్పుడు ఆ శాఖ పరిధిలోనే ఈ సబ్‌ప్లాన్‌ కార్యదర్శి ఉండాలంటే దానివల్ల ఒరిగేదేమిటి? అందుకే మేము సబ్‌ప్లాన్‌ కార్యదర్శికి స్వయం ప్రతిపత్తి ఉండేలా, ఆర్థికశాఖకు లోబడకుండా నేరుగా నిధులు మంజూరు చేసే అధికారం ఉండాలని సవరణ ప్రతిపాదించాము. అలాగే ఆర్థికశాఖ బడ్జెట్‌ నిధులను ఆయా శాఖలకు నేరుగా ఇచ్చే విధానానికి బదులు బడ్జెట్‌ ఆమోదం పొందగానే ఆ నిధులు సబ్‌ప్లాన్‌ఖాతాలో నేరుగా జమకావాలని ప్రతిపాదించాము. వీటినీ ప్రభుత్వం తిరస్కరించింది.
5. సబ్‌ప్లాన్‌ చట్టం అమలును పర్యవేక్షించడానికి ఒక రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, దానికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో ప్రతిపాదించారు. మరి కౌన్సిల్‌లో తక్కిన సభ్యులు ఎవరు అన్నది బిల్లులో పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అన్ని పార్టీలూ, అన్ని పక్షాలూ కట్టుబడి ఉన్నాయి. కనుక ఈ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రితోబాటు వివిధ సంక్షేమ శాఖల మంత్రులు, శాసనసభ, శాసనమండలిలోని ఫ్లోర్‌లీడర్లు సభ్యులుగా ఉండాలని సవరణ ప్రతిపాదించాం. దానినీ తిరస్కరించారు.
6. సబ్‌ప్లాన్‌ అమలులో తేడా వస్తే జోక్యం కల్పించుకోవడానికి, సరిదిద్దడానికి వీలుగా అంబుడ్స్‌మన్‌ను నియమించాలని సవరణ ప్రతిపాదించాం. నిజానికి మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిని ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం తిరస్కరించింది. లోకాయుక్త వ్యవస్థ ఎటూ ఉంది గనుక అంబుడ్స్‌మన్‌ వేరే అవసరంలేదన్నది ముఖ్యమంత్రి వాదన. ఇది తప్పు. ముప్పై రెండేళ్లుగా సబ్‌ప్లాన్‌ ఉంది గదా? మరి ఈరోజు చట్టం ప్రత్యేకంగా ఎందుకు తేవాల్సి వచ్చింది? ఆచరణలో విఫలమైనందువల్లనే గదా? అటువంటి వైపల్యాలు మళ్లీ వస్తే వెంటవెంటనే జోక్యం చేసుకోడానికి అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ తోడ్పడుతుంది.
7. గత ఇరవై సంవత్సరాలుగా సరళీకరణ విధానాలు అమలవుతూనే ఉన్నాయి. వీటివలన అత్యధికంగా నష్టపోతున్నది ఎస్సీలు, ఎస్టీలు. ప్రాజెక్టుల భూ సేకరణలో, సెజ్‌ల భూసేకరణలో భూములు కోల్పోతున్నది వీరే. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం రద్దు వలన టౌన్లలో భూమి దొరకక శివార్లకు నెట్టివేయబడుతున్నదీ వీరే. జలయజ్ఞంలో నిర్వాసితులవుతున్నదీ వీరే. ముంపుకు గురవుతున్నవి గిరిజన గ్రామాలే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేర వేల కోట్లు కార్పొరేట్‌ విద్యా సంస్థల పరమౌతుంటే పశువులు కూడా మనలేని ఘోరమైన పరిస్థితుల్లో 'సంక్షేమ' హాస్టళ్లలో నానాపాట్లూ పడుతున్నది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే. ప్రైవేటు రంగానికి పెద్దపీట వేసిన కారణంగా, అక్కడ ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేని కారణంగా ఎస్సీ, ఎస్టీలు అన్యాయమైపోతున్నారు. మైనింగ్‌లో ప్రైవేటు శక్తుల ప్రవేశం వలన నిర్వాసితులవడమేగాక, దాని పర్యవసానంగా వాతావరణ కాలుష్యానికి బలవుతున్నదీ వీరే. సరళీకరణ విధానాల అమలు పర్యవసానంగా ఎస్సీలలో, ఎస్టీలలో పేదరికం పెరిగింది. సామాజిక అంతరాలు పెరిగాయి. ఇదంతా ప్రభుత్వం చలవే. ఈ సబ్‌ప్లాన్‌ చట్టానికున్న డొల్లతనాన్ని సరిచేయడానికి మేము ప్రతిపాదించిన సవరణలన్నింటినీ తిరస్కరించారు. పైగా తామే ఎస్సీ, ఎస్టీల తరపున నిలిచే మొనగాళ్లం అంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వారే తీరని అన్యాయం చేస్తూనే, తామే న్యాయం చేసిన, చేస్తున్న, చేయగల వాళ్లం అంటున్నారు. ఇదే కాంగ్రెస్‌ నయవంచన.
సబ్‌ప్లాన్‌ చట్టంలో ఒక భాగం మొత్తం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సరైన వాటా కేటాయించి ఖర్చు చేయడం, రెండో భాగం ఎస్సీలలో, ఎస్టీలలో ఉపకులాల మధ్య, వివిధ తెగల మధ్య అంతరాన్ని సరిచేయడం. మొదటి భాగాన్ని వదిలేసి రెండో భాగం మీదే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు యుద్ధం చేసుకున్నాయి. ఎందుకంటే మొదటి భాగానికి సంబంధించి రెండు పార్టీలూ యథాశక్తి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశాయి. ఆ విషయం ముందుకు రాకుండా ఉండడానికి, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ఎజెండాను వీలైన మేరకు రాజకీయ వివాదాస్పద అంశంగా మార్చడానికి రెండో భాగం మీదే చర్చంతా నడిచేలా చూశాయి. ఈ నాటకం కూడా ఎస్సీ, ఎస్టీలు గమనించాలి.
సామాజిక వివక్షత కేవలం ఎస్సీల సమస్యగానో, ఎస్టీల సమస్యగానో చూడడం తప్పు. దేశం, రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి చెందాలంటే ఆ క్రమంలో సామాజిక అంతరాలను, వ్యత్యాసాలను, అణచివేతను నిర్మూలించడం అవసరం. ఈ అంతరాలను, వ్యత్యాసాలను, అణచివేతను పెంచివేసే సరళీకరణ విధానాలను ఓడించే ఉద్యమంలో అందరూ కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. అందులో భాగంగా పాలక పార్టీల నయవంచనను ప్రజల ముందు బట్టబయలు చేయడం ఎంతైనా అవసరం.
(వ్యాసకర్త శానన మండలిలో పిడిఎఫ్‌ పక్ష నేత) 


సబ్‌ప్లాన్‌ చట్టం అమలును పర్యవేక్షించడానికి ఒక రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, దానికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో ప్రతిపాదించారు. మరి కౌన్సిల్‌లో తక్కిన సభ్యులు ఎవరు అన్నది బిల్లులో పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అన్ని పార్టీలూ, అన్ని పక్షాలూ కట్టుబడి ఉన్నాయి. కనుక ఈ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రితోబాటు వివిధ సంక్షేమ శాఖల మంత్రులు, శాసనసభ, శాసనమండలిలోని ఫ్లోర్‌లీడర్లు సభ్యులుగా ఉండాలని సవరణ ప్రతిపాదించాం. దానినీ తిరస్కరించారు. 
-ఎంవిఎస్‌ శర్మ
Prajashakti Telugu News Paper Dated: 13/12/2012
  

Wednesday, December 12, 2012

సెక్యులరిజం గాలిలో దీపమేనా? - సుదర్శన్ బాలబోయిన డాక్టర్ నాగం కుమారస్వామి



బాల్ ఠాక్రేను కీర్తించే చర్యలు ఈ దేశ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్ఠంగా నిలబెట్టగలవా? ప్రజాస్వామ్యమంటే హిందూ ఫాసిజానికి అండగా నిలబడటమని అర్థమా? 

ముంబయిలో 2008లో మారణకాండకు పాల్పడిన అజ్మల్ కసబ్‌కు నవంబర్ 21న ఎరవాడ జైల్లో ఉరిశిక్ష అమలైంది. ఈ సంఘటన నేపథ్యంలో 'కసబ్ ఉరి శిక్ష మొత్తం ప్రపంచానికి ఒక సంకేతం. ఇలాంటి చర్యలకు పాల్పడేవారెవరైనా ఇదేవిధంగా ప్రతిస్పందిస్తాం' అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. ఇది ఎంత వరకు వాస్తవమైందో, ఇదే ముంబయి నగరంలో హిందూ టెర్రరిజాన్ని నాలుగున్నర దశాబ్దాలుగా నిరభ్యంతరంగా నడిపిన బాలా సాహేబ్ ఠాక్రేను చూస్తే అర్థం అవుతుంది. ఇస్లాం టెర్రరిజానికి ఈ దేశంలో శిక్షల నుంచి ఎలాంటి మినహాయింపు లేదు. ఇందుకు ప్రభుత్వానికి మనమంతా ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిందే. కానీ హిందూ టెర్రరిజానికి లభించిన అనేక మినహాయింపుల్లో ఠాక్రే ఒకరు. ఈ వివక్షను పౌరుడిగా బాధ్యతతో ప్రశ్నించాల్సిందే.

శివసేన చీఫ్ అసలు పేరు బాల్ కేశవ్ ఠాక్రే. ఆదర్శవంతమైన సామాజిక కార్యకర్తగా, కుల నిర్మూలన భావజాలంతో 'సంయుక్త ముంబయి' ఉద్యమాన్ని నడిపిన కేశవ్ సీతారామ్ ఠాక్రే కొడుకే బాల్ ఠాక్రే. తన తండ్రి అనుసరించిన సామాజిక బాధ్యతకు పూర్తి విరుద్ధమైన మార్గంలో మత, ప్రాంతీయ ఉన్మాదంతో రాజకీయాలను రంగరించాడు. బాల్ ఠాక్రే జీవితంలో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. ఒకటి ఫాసిస్ట్ ధోరణి, మరొకటి ప్రాంతీయ ఉన్మాదం. ఎన్నో సామాజిక ఉద్యమాలకు నిలయమైన మరాఠా గడ్డ మీద బాల్ ఠాక్రే రక్త చరిత్రను లిఖించాడు.

విభిన్న కుల, మత, వర్గ, సాంస్కృతిక సమూహాలతో జీవిస్తున్న కోట్లాది ప్రజలను 'శివ సైన్యం'కు లోబడి ముంబయిలో ఎలా బతకాలో ఠాక్రే శాసించాడు. భయంతో బతకడాన్ని ఒక సంస్కృతిగా మార్చిన ఘనత ఆయనకే దక్కింది. బ్రిటిష్ పాలన అనంతర రాజకీయాల్లో 'మత హింసను' ప్రయోగించిన మొదటి నాయకుడు కూడా ఠాక్రేనే. ముంబయి నగరంలో 'రూల్ ఆఫ్ లా'ను ఉల్లంఘించి ఎవరైనా బతకవచ్చు, కానీ 'ఠాక్రే లా'ను ఎవరూ తప్పించుకోలేరు. ఠాక్రే శాసనాన్ని ధిక్కరించగల శక్తులు, సంస్థలు బొంబాయిలో లేవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మరాఠీయేతర వలసల నుంచి బొంబాయిని రక్షించే సాకుతో 1966లో శివసేన ఏర్పాటైంది. కానీ దాని లక్ష్యం హిందూ ఫాసిజం. కాబట్టే ఠాక్రే జీవిత కాలంలో ముస్లింలు, దళితులు, కమ్యూనిస్టులను అంతం చేయడమే సేన లక్ష్యం అని బాహాటంగా ప్రకటించాడు. గొప్ప సామాజిక ఉద్యమాలను నడిపిన గత చరిత్ర మహారాష్ట్రకు ఉంది. ఇక్కడ సంత్‌లు, సన్యాసులు (కబీర్) మత సంస్కరణ ఉద్యమాలు నడిపారు. బ్రాహ్మణీయ సామాజిక ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ మహాత్మ జ్యోతీరావ్ ఫూలే, సావిత్రి భాయి, ఛత్రపతి సాహు మహారాజ్‌లు సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు. 

సాంప్రదాయక మనువాదాన్ని ధ్వంసం చేసే సామాజిక విలువలకై పరితపించారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అంటరాని కులాల విముక్తితో పాటు, బొంబాయి కార్మిక ఉద్యమాలను నిర్మించాడు. కమ్యూనిస్టులు డాంగే, రణదివేలు చారిత్రాత్మక పారిశ్రామిక ఉద్యమాలను నిర్మించారక్కడ. ఆసియా పారిశ్రామిక ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చెందిన ముంబయిలో మహత్తర ఉద్యమాన్ని నడిపిన నిస్వార్థ కార్మిక నాయకుడు దత్త సామంత్, ఆయనకు కార్మిక వర్గంలో ఉన్న పట్టును నియంత్రించడానికి ఘోరంగా హత్య చేసిన ముఠాకు సేన అండగా నిలబడింది. మార్క్స్, అంబేద్కర్ భావజాల స్ఫూర్తితో కులాన్ని, వర్గాన్ని నిర్మూలించే లక్ష్యంతో దళిత పాంథర్స్ ఉద్యమం పుట్టింది ఇక్కడే. ఇలాంటి మహత్తర సామాజిక ఉద్యమాలు నడిచిన చోట 'హిందూ ఫాసిజాన్ని' నెలకొల్పిన వ్యక్తి ఠాక్రే.

బాలా ఠాక్రే హింసాకాండ 'జాగో లుంగీ' నినాదంతో దక్షిణ భారతీయ వ్యతిరేకతను మరాఠీయుల మనసుల్లో రేకెత్తించింది. 'మరాఠీ - మరాఠీయేతర' అంశాన్ని రాజకీయ వస్తువుగా మలిచాడు. లుంగీలు ఊడగొట్టి వేల మందిని తన్ని తరిమారు. 1966 దసరా ర్యాలీలో ఉడిపి, హోటల్స్, రెస్టారెంట్స్‌ను ధ్వంసం చేశారు. ప్రాంతీయ విద్వేషంతో చెలరేగిన శివసైనికులు 1969లో 59 మంది కన్నడిగులను క్రూరంగా హత్యచేశారు. శివ సైనికులు నార్త్ ఇండియన్స్‌ను కూడా తమ దాడుల నుంచి మినహాయించలేదు. మరాఠీయేతర ప్రజలను అత్యంత నీచంగా అవమానపర్చే సంస్కృతిని శివ సైనికులు నెలకొల్పారు. బీహార్, గుజరాతీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన లక్షలాది ప్రజలు వీరి దాడులు భరించలేక ముంబయి విడిచి వెళ్ళారు. 'ఉమ్మిన పళ్ళెంలోనే తింటారని' బీహారీల నుద్దేశించి ఠాక్రే చేసిన అవమానకరమైన వ్యాఖ్య పార్లమెంటులో ప్రాంతీయ దురభిమాన కుంపట్లను రేకెత్తించింది.

తమకు లొంగని మరాఠీయేతరులపై దాడులే కాకుండా, వారి ఆస్తులను స్వాధీనం చేసుకొనేవారు. సొంత హిందువులపైనే దాడిచేసే సంస్కృతి శివ సేన సొంతం. ఠాక్రే మరొక ముఖం హిందూ ఫాసిజం. 'హిందూయిజం తప్ప మరే ఇజాన్ని నేను సహించనని' బాహాటంగా చెప్పాడు. హిందువుల హృదయాలను గెలుచుకున్న విజేతగా శివసైనికులు ఈయనను కీర్తిస్తారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముంబయి నగరంలో ముస్లింలపై మారణకాండ జరిపించిన నాయకుడాయన. 1992 బాబ్రీ విధ్వంసం తరువాత సుమారు 700 మంది ముస్లింల హత్యలకు పథకం అమలు చేశాడు. ముంబయి మత ఘర్షణలకు శివసేన రగిలించిన మత విద్వేషం ఒక ప్రధాన కారణమని శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ముస్లింలపై దాడులు చేయడానికి పోలీసులు శివసైనికులకు సహాయం చేయాలని ఠాక్రే పిలుపిచ్చాడు. అక్కడ పోలీసులు ఖాకీలు ధరించిన శివసైనికులు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో శివసైనికులు పట్టించిన వందలాది ముస్లిం యువకులను పోలీసులు కాల్చి చంపారు. 

ముస్లింలు క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్నారని వారిని అడ్డుకోవడానికి ఈ దేశానికి శస్త్ర చికిత్స చేయాలని అంటాడు. ఠాక్రే టెర్రరిజానికి వ్యతిరేకం కాదు, అందుకే 'పెరుగుతున్న ఇస్లాం టెర్రరిజాన్ని కేవలం హిందూ టెర్రరిజమే అడ్డుకోగలదని' హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. పైగా సూసైడ్ బాంబర్స్‌గా అవతరించాలని హిందూ యువతకు పిలుపునిచ్చాడు. ఇంత పెద్దఎత్తున మత ఉన్మాదాన్ని(హింస) బాహాటంగా రాజకీయాలకు అన్వయించిన మరొక నాయకుడు ఈ కాలంలో మనకు కనిపించడు. ఈ దేశం హిందువులది, ఇస్లాంను హిందువుల మోకాళ్ల దగ్గర నిలబెట్టాలని హిందూ నేషనలిజాన్ని సామాన్యుల మనసుల్లో కసితో నూరిపోశాడు. కుల, వర్గ సామాజిక అంతరాలను నిర్మూలించే లక్ష్యంతో ఏర్పడిన మిలిటెంట్ సంస్థ 'దళిత్ పాంథర్స్'. శివసేన ఐడియాలజీ మనువాదం, హిందూయిజం. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది దళిత్ పాంథర్స్ భావజాలం. ఈ రెండింటి మధ్య యుద్ధం భావజాల స్థాయిని దాటి భౌతిక నిర్మూలనకు చేరుకుంది. దళిత్ పాంథర్స్ నాయకుడు భగవతి జాదవ్‌ను 1974లో అత్యంత క్రూరంగా హత్య చేశారు. 1984లో విదర్భలో దళితులపై 6 నెలల పాటు వరుస దాడులు జరిపారు, వందల మందిని తీవ్రంగా హింసించారు.

అంబేద్కర్ రచనల ప్రచురణ 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆయన రచనల్లోని 'హిందూ మతం - చిక్కుముడులు' చాప్టర్ ప్రచురించవద్దని అడ్డంకులు సృష్టించి అంబేద్కర్ భావజాల వ్యాప్తిని నిలువరించాలనే కుట్రలకు పాల్పడింది. హిట్లర్ నెలకొల్పిన 'గ్రేట్ డిటెక్టర్ షిప్' శివసేన పొలిటికల్ ఫిలాసఫీ. జాతి విద్వేషంతో లక్షల మందిని జ్యూవుస్‌ను అంతం చేసిన హిట్లర్ ఠాక్రే కు ఆదర్శవంతమైన నాయకుడు. నేను హిట్లర్ అడ్మైరర్‌ను అని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు. జర్మనీని తన ఉక్కు చేతులతో పాలించిన హిట్లర్ నియంతృత్వం భారతదేశానికి తక్షణావసరమని ప్రజాస్వామ్య వ్యతిరేక వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఇందిర ఎమర్జెన్సీకి మద్దతిచ్చిన కొద్దిమందిలో ఈయనొక ప్రముఖుడు. సంజయ్‌గాంధీని ఈ దేశ నియంత పాలకుడిగా నిలబెట్టడానికి ఠాక్రే చాలా ప్రయత్నించాడు. హిట్లర్ జర్మనీలో నాజీ సైన్యం (హంతక ముఠా) నెలకొల్పినట్టు ఈ దేశంలో ఠాక్రే శివ సైన్యాన్ని సృష్టించాడు. హిట్లర్‌ను తమపొలిటికల్ ఫిలాసఫర్‌గా బాహాటంగా ప్రకటించిన లీడర్ బహుశా ఠాక్రే మాత్రమే కావచ్చు. 'డెమోక్రసీ మీద నాకు నమ్మకంలేదు' దాన్ని నిర్మూలించే 'ఠాక్రే క్రసీ' నెలకొల్పుతానని ముం బయిలో ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టి నియంతృత్వాన్ని స్థాపించాడు. బయటి ప్రపంచానికి బాలా కేశవ్ ఠాక్రే మహారాష్ట్రీయుల అవకాశాలను రక్షించే నాయకుడు.

కానీ నాలుగున్నర దశాబ్దాల పాటు సల్మాన్ ఖుర్షీద్ చెప్పిన చట్టం ముంబయిలో చచ్చుపడింది. ముంబయి పారిశ్రామిక నగరాన్ని సాంప్రదాయక మనువాదంతో రక్త కాసారంగా మార్చాడు. ఇతడు నెలకొల్పిన రిలీజియస్, రీజనల్ ఫాసిజం ప్రజాస్వామ్యానికి, జాతీయ సమైక్యతకు గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్యాన్ని బొందపెడతానని చెప్పిన వ్యక్తిని 'దృఢమైన నాయకుడని' ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొనియాడటం సిగ్గుచేటు. ఠాక్రే ఎలాంటి రాజ్యాంగబద్ధ పదవిని (ఎంపీ, ఎమ్మెల్యే) అధిష్టించలేదు. అయినా పార్లమెంట్ ఆయనకు నివాళులు అర్పించింది. పార్లమెంట్ సభ్యుడు కాకుండానే ఇలాంటి గౌరవం దక్కిన ఏకైక నాయకుడు ఠాక్రే మాత్రమే. మరణానంతరం ఆయన దేహంపై జాతీయ జెండా కప్పి పోలీసు లాంఛనాలతో అంతిమ యాత్ర చేశారు.

ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. దాని గొంతు నులిమే లక్ష్యంతో జీవితాంతం పనిచేసిన వ్యక్తిని కీర్తించే చర్యలు ఈ దేశ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్ఠంగా నిలబెట్టగలవా? ప్రజాస్వామ్యమంటే హిందూ ఫాసిజానికి అండగా నిలబడటమని అర్థమా? ఈ దేశంలో సెక్యులరిజం గాలిలో దీపమేనా? ఇస్లాం టెర్రరిజాన్ని ఉరికంభం ఎక్కిస్తున్న పాలకులు హిందూ ఉన్మాది (టెర్రరిస్ట్) ఠాక్రేను చట్టం పరిధిలో ఎందుకు శిక్షించలేకపోయారు. ఠాక్రే అతని శివసైన్యం జరిపిన మారణకాండలకు ఖుర్షీద్, యూపీఏ ప్రభుత్వం ఏం శిక్ష విధించింది. అందరినీ సమానంగా ట్రీట్ చేస్తామంటున్న మన్మోహన్, సోనియా, ఖుర్షీద్ దీనికి జవాబివ్వగలరా?

- సుదర్శన్ బాలబోయిన
డాక్టర్ నాగం కుమారస్వామి
రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా యూనివర్సిటీ
Andhra Jyothi Telugu News Paper Dated: 13/12/2012+