Saturday, July 6, 2013

దళిత సాంస్కృతిక శిఖరం (చంద్రశ్రీ దళిత ఉమెన్ థియేటర్ వ్యవస్థాపకురాలు) ----కృపాకర్ మాదిగ


July 07, 2013
ఆమె గొంతెత్తి అంబేద్కర్ సుప్రభాతం ఎత్తుకుంటే నల్ల సూరీళ్ళు, ఎర్ర సూరీళ్ళు నిద్ర లేచే వారు. ఆమె గొంతులో పల్లె పదాల కువ కువలుండేవి. సెలయేళ్ళు సాగిపోయేవి. ఆమె పద్యమందుకుంటే పక్షులు ఆలకించేవి. ఆమె మరియమ్మ వేషం కడితే, క్రీస్తు దళిత బిడ్డడై ఆమె వొడిలో పురుడు పోసుకుని, బాల యేసుడై ఆడుకునేవాడు. ఆమె గుర్రం జాషువా తాత 'శ్మశాన వాటిక'పద్యాలలోని మహాకారుణ్యాన్ని మరణచింతలనూ శ్రోతల చెవుల ద్వారాల్లోంచి పురా లోకాల నిండా నింపేది. ఆమె గజ్జె కట్టి ఆలాపన అందుకుంటే ఇళ్ళూ, మరపూ సమరోత్సాహంతో ఊగిపోయేవి. కులం, జెండర్, వయసు, ప్రాంతం, మతం, భాష, చిన్నా, పెద్దా గోడలను కూల్చుకుంటూ కదిలిపోయేది.

కదిలించేంది. ఆమె అడుగులు తప్పెట దరువులై వేదికలపై చిందులాడేవి. ఆమె-చంద్రశ్రీ. ఆమె ఒక గుంపు శ్రీ. దళిత సాంస్కృతిక శిఖరశ్రీ. చంద్రశ్రీ దళిత ఉమెన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. దళిత, విప్లవోద్యమాలలో అత్యద్భుత ప్రతిభ పాటవాలు సాగించిన అరుదైన కళాకారిణి. పాటలు పాడడంలో, చిందు ఆడడంలో నాటకం వెయ్యడంలో, స్క్రిప్టు రాయడంలో, దర్శకత్వం వహించడంలో, సంగీతం కూర్చడంలో, నటన, నిర్మాణంలో, బృంద నిర్వాహకురాలిగా, నాయకురాలిగా ప్రయోక్తగా తానే ఒక సైన్యంగా, ఆమెకు ఆమే సాటిగా చంద్రశ్రీ బ్రతికింది. దళిత సాంస్కృతిక కళారంగాల్లో చంద్రశ్రీ పెద్ద విదుషీమణి. కొండ గుర్తు వేగు చుక్క.

చంద్రశ్రీ జీవనరంగస్థలం నుంచి కనుమరుగయ్యే వరకు అంబేద్కరైట్ ఐడెంటిటీతో బతికింది. ఆమెది స్పష్టమైన దళిత దృష్టి కోణం. మహాకవులు గుర్రం జాషువా,బోయి భీమన్న, శివసాగర్, మాష్టార్జీ, కలేకూరి ప్రసాద్, గోరటి వెంకన్న వంటి ఎందరో ప్రజాకవుల పదాలు, పద్యాల నుంచి, స్వీయ గేయాల వరకూ ఆమె గొంతులో దళిత జీవన పోరాటాలే పల్లవించేది. బోయ భీమన్న గారి 'అంబేద్కర్ సుప్రభాతం'ని సొంతంగా సంగీతాన్ని సమకూర్చుకుని అద్భుతంగా పాడింది. రికార్డు చేసి భవిష్యత్తు తరాల కందించింది.

కుటుంబ రాజ్యం నుంచి బయటికొచ్చింది. కుటుంబ సంబంధాలు, స్త్రీ, పురుషసంబంధాలు ప్రజాస్వామ్యీకరించబడాలని కోరుకుంది. అందుకోసం పోరాడింది. స్త్రీపురుష సమానత్వం పాటించేతోడు కోసం వెతికింది తపించింది. పొందలేకపోయింది. జీవితాన్ని అణచివేతలపై తిరుగుబాటుగా మార్చుకుంది. ఎదురీదింది. హింసాత్మక సంప్రదాయాలను సమర్థంగా తోసిపుచ్చింది. అవమానాలను ప్రశ్నించే ధిక్కారంతో, స్వాభిమానంతోబతికింది.

దళిత సాంస్కృతిక వికాసానికి చంద్రశ్రీ 'దళిత ఉమెన్ థియేటర్' స్థాపించింది. నిరుపేద దళిత, ఆదివాసీ మహిళల్లో సాధికార చైతన్యం రగిలించడానికి సాంస్కృతిక శిక్షణలు ఇచ్చంది. అణగారిని సామాజిక వర్గాల మహిళలు, వారి అభివృద్ధికి వారే కారకులు కావడానికి చంద్రశ్రీ తనకున్న కళాసాంస్కృతిక నైపుణ్యాలను ఉపయోగించింది. డప్పు దరువులై పాడేది. తానున్న తావునల్లా దళిత సాధికార చైతన్యాన్ని పూయించేది, కాయించేది. కుల, లింగ వివక్షల నిప్పులపై మంచు వెన్నెలలు కురిపిస్తూ చంద్ర శ్రీ సాగిపోయింది.

దోపిడీ పీడనల వ్రణాలను చీల్చుకుంటూ చంద్రశ్రీ మిగిలిపోయింది. చంద్రశ్రీ గొప్ప స్నేహశీలి. మనిషిన మనిషే ప్రేమించాలనేది. దళిత మహిళలు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో తమ ముద్రలు, అడుగులు బలంగా వేస్తున్నారు. ఈ దారిలో చంద్రశ్రీ పెద్ద స్ఫూర్తికారి . మైలురాయి. అదిగో చంద్రశ్రీ గొంతుక! అంబేద్కర్ సుప్రభాతమై దళిత పొద్దుల్ని నిద్దర లేపుతోంది. స్నేహితురాలు చంద్ర శ్రీ కి కన్నీటి దండాలు. ఆమెకివే నా నిండు నివాళులు.

No comments:

Post a Comment