Saturday, July 6, 2013

రాజ్యాధికారం స్వాతంత్య్రం కోసమే! - కదిరె కృష్ణ


July 05, 2013
కుల విధానం గురించి ఫూలే' (ఆంధ్రజ్యోతి, జూన్ 6, 7) అన్న సుదీర్ఘ వ్యాసంలో రంగనాయకమ్మ పరిశోధించి మరీ కనుగొన్నది చాలా కాలంగా ఆమె పాడుతున్న పాత పాటే. 'వృత్తి నుంచి కులం వచ్చిందనీ, కులాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, కులం వృత్తి ధాతువు నుంచి జనించినందువల్ల దాన్ని శ్రమ సంబంధాల కోణంలోనే అర్థం చేసుకొని, వర్గ దృక్పథంతో మార్క్స్ వారసులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పోరాటం చేయాలనేది ఆ వ్యాస సారాంశం. ఈ వేదన రంగనాయకమ్మకు కొత్తేమీ కాదు. బుద్ధుడు, అంబేద్కర్ లాంటి భారతీయ మేధావులను ఆమె గత కొంత కాలంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వంతు వచ్చినట్లుంది. ఈ చర్చ కొత్తగా రంగనాయకమ్మతో ప్రారంభం కాలేదు. గతంలో దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో, పత్రికల్లో, రాజకీయ పార్టీల్లో పెద్దఎత్తున జరిగింది. ఈ కారణంగానే కొందరు మధ్యేవాదులు (మధ్యస్థ మార్గాలను అన్వేషించేవాళ్లు) 'వర్గకుల దృక్పథం' అనే మరో మార్గాన్ని కనిపెట్టి విఫలమైనారు.


'గులాంగిరి' (1873) పుస్తకానికి ఫూలే రాసుకున్న పీఠికను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఫూలే కుల విధానం సరైనది కాదని రంగనాయకమ్మ అన్నారు. 'ఆర్యులని విదేశీయులుగా భావిస్తూ, వారి దాడుల వల్లే ఈ దేశ మూలవాసులైన బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) శూద్ర (అంటరాని), అతిశూద్ర (మిక్కిలి అంటరాని) కులాలుగా వర్గీకరణ అయి బానిసత్వంలోకి నెట్టివేయబడ్డారని, ఆర్యుల దుర్రాకమణ దుర్నీతి, అసమాన నిచ్చెనమెట్ల కుల దొంతరల వ్యవస్థకు ప్రధాన కారణ'మని ఫూలే సూత్రీకరణ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. అంతేగాక ఆర్యుల దాడుల వంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయని, అది సర్వసాధారణమని ఆమె చెప్పారు. మరి అలాంటప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా వంటి దేశాలపై కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు దేశాలు ఎందుకు నిష్ఠూరంగా ఉండడం? దోపిడీ సహజమే అయినప్పుడు ఇంత రాద్ధాంతం దేనికి? బలవంతుడు, సాయుధుడు బలహీనుడిని, సామాన్యుడిని దోచుకోవడం, హింసించడం సహజమే అయినప్పుడు వర్గం (శ్రామిక-పేద/పెట్టుబడిదారుడు-ధనవంతుడు) ప్రాధాన్యం ఏమిటి? వర్గ పోరాటం ఎందుకు? అసలు మార్క్స్ ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరొక విషయం, ఈ దాడులు చాలా అనాది నుంచి జరుగుతూనే ఉన్నాయని రంగనాయకమ్మ అన్నారు. అలాగైతే పురుషులు స్త్రీలను హింసించడం, అనేక రకాలుగా దోపిడీ చేయడం ఈనాటిదా? అనాదిగా వస్తున్న ఈ పురుషాహంకారాన్ని ఇప్పుడు ప్రశ్నించడం ఎందుకు? రంగనాయకమ్మ ఫెమినిజం బేస్‌గా చేసిన రచనలన్నింటినీ ఇప్పుడు ఏమనాలి?


'విజేతలైనవాళ్లు ఎవరైనా దుర్లక్ష్యాలతోనే ఉంటారు. భారతీయులే ఇతర ప్రాంతాల మీద దాడులు చేసి విజేతలైవుంటే అప్పుడు వీళ్లూ అలాగే చేసి ఉండేవారు' అంటూ రంగనాయకమ్మ ఒక నూతన వ్యాఖ్యానం చెప్పారు. నిజమే! యజమానులు/పెట్టుబడిదారులు/సంపన్నులు గనుక విజేతలైతే అలాగే ప్రవర్తిస్తారు. బాధితుడు విజేత అయితే అలా జరగడానికి అవకాశం లేదు. అందుకే మార్క్సిస్టులు కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ అధికారానికి వచ్చి సంపన్నులై బహుజనుల త్యాగాలను పునాదులుగా చేసుకొని బలి పశువులను చేస్తున్నట్టుంది! ఇప్పుడున్న కమ్యూనిస్టులంతా భూస్వాములు, పెత్తందార్లు, పెట్టుబడిదారులే కదా! మూడు వేల సంవత్సరాలుగా జరిగిన, జరుగుతున్న విధ్వంసం రంగనాయకమ్మకు అంత మామూలుగా కనిపించడం వెనుక ఆంతర్యమేమై ఉంటుంది? ఫూలే కులాన్ని గురించిన అంశాన్ని లేవనెత్తిన రంగనాయకమ్మ, ఫూలే తనని బహుజనుల్లో ఒకడిగా గుర్తించుకొని 'ఇతర చిన్న కులాల గురించి...' అన్నారు. ఫూలే చిన్న కులాలుగా ఎవరినీ గుర్తించలేదు. రంగనాయకమ్మ సృష్టి ఈ చిన్న కులాలు. చిన్న కులాలు అంటే ఏ పరిమాణం (సైజు) ప్రకారం నిర్ణయించాలి? జనాభా పరంగానా? సామాజికంగానా? శ్రామికంగానా? ఎలా? వీటిలో దేన్ని తీసుకున్నా శూద్ర అతిశూద్ర కులాలు చిన్న కులాలేమీ కావు. అగ్రకులాలుగా చెబుతున్న ఆర్య బ్రాహ్మణ కులాలే నిజానికి చిన్న కులాలు.


భారతదేశంలో కుల వ్యవస్థకు విజేతలైన ఆర్యులే పేరు పెట్టారు అని ఫూలే చెప్పిన విషయాలను ఇంకొన్ని విషయాలను ఉదహరించి, ఇంతకంటే ఎలాంటి వివరాలను ఆయన ఏమీ ఇవ్వలేదని రంగనాయకమ్మ వాపోయారు. బహుశా రంగనాయకమ్మ 'గులాంగిరి' పీఠిక మాత్రమే చదివి ఉంటారు. కేవలం పీఠిక చదివి ఫూలేపై ఇలా ఒక వక్ర నిశ్చితాభిప్రాయానికి ఎలా వచ్చారు ఈవిడ? చదివినా మార్క్స్ అద్దాలతో చదివి ఉంటారు. ఆర్యుల రాక, దాడులు, దురాక్రమణ, స్థానిక జాతుల బానిసీకరణ క్రమాన్ని విశదంగా చర్చించారు ఫూలే. ఆయన మొత్తం సాహిత్యంలో ఈ దృక్పథమే ఎక్కువగా కనిపిస్తుంది. తరువాత వచ్చిన అనేకమంది చరిత్రకారులకు ఫూలే మార్గదర్శకుడయ్యారు. ఆర్యులు సృష్టించిన దశావతారాల గుట్టు మైథాలజీ రూపంలో ఉండగా, వాటిని పరిశోధించి దానిలోని చరిత్రను బట్టబయలు చేసినవాడు ఫూలే. ఆర్యులు భూదేవతలుగా తమను తాము ఎలా చేసుకోగలిగారో ఫూలే సహేతుక విమర్శ ద్వారా నిరూపించారు. భారతదేశ చరిత్రను ఇంత క్షుణ్ణంగా పరిశీలించి మూలవాసీ దృక్పథంతో చరిత్రను పునర్లిఖించి చరిత్ర రచనలో ఒక నూతన ఒరవడిని సృష్టించిన భారతీయుడు మరొకరు లేరు. రంగనాయకమ్మ ఇంకా ఏమంటారంటే 'ఫూలే విమర్శ పద్ధతి హిందూ మత గ్రంథాల్లోని రాతలను బట్టి ఊహించింది'.

ఈ పద్ధతి తప్పెలా అవుతుంది? ఆర్య బ్రాహ్మణులు చేసిన గందరగోళమంతా పురాణ, ఇతిహాస, స్మృతి, వేదాల రూపంలోనే ఉన్నది కదా? నిజానికి భారతీయ చరిత్ర పరిశోధనలో అవే కీలకం. పరిశోధనలో పటుత్వం, విషయ పరిశీలన, ప్రయోగం, వాస్తవాల వెలికితీతలో నిజాయితీ వుండడం ప్రధానం కానీ ఫలానా వాటిని ఆధారంగా చేసుకొని ఎలా నిర్ణయిస్తామనేది సరైంది కాదు. మార్క్సిస్టులు కట్టూ బొట్టూ కంకణం సంస్కృతిలో కొట్టుమిట్టాడుతూ బ్రాహ్మణవాదాన్ని మోస్తున్న విధానం గమనిస్తే ఫూలే తరహా విమర్శాదృక్పథం లోపించడమేనని స్పష్టమవుతుంది. కాలక్రమంలో శ్రమవిభజనే సామాజిక విభజన అయిందనేది వ్యాసకర్త అభిప్రాయం. అదే మార్క్సిస్టుల వాదన కూడా. రంగనాయకమ్మ ఊహే నిజమైతే మరి యాచక కులాల సంగతేమిటి?నాకు తెలిసి మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికన కుల నిర్మూలన జరుగదు. కానీ, ఫూలే అంబేద్కరిజపు సిద్ధాంత వెలుగుధారలో కుల నిర్మూలన జరిగి తీరుతుంది. విద్యా చైతన్యం (బోధన), సమీకరణ (విడిపోయిన కులాల ఐక్యత), పోరాటం (కోల్పోయిన ఓటు కోసం), కులనిర్మూలనకు ఫూలే-అంబేద్కర్ ప్రతిపాదించిన సోపానాలు, విద్య కులాంతర వివాహాలు, రాజకీయ అధికారం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. బోధించడం ద్వారా చైతన్యం, ఫలితంగా సాంస్కతిక విప్లవం, తదనంతరం మూలవాసీ చైతన్యధారతో అణగారిన స్టేట్ సోషలిజం, సమ విద్య, సమపాలన మొత్తంగా సామాజిక న్యాయం.

సమస్త కులాల సమానత్వమే సోషలిజం. శూద్రుల్లో పాలకులు బయలుదేరినా కులం పోదనేది తప్పుడు అవగాహన. దీన్నిలా సవరించాలి 'శూద్రుల్లో పాలకులు కాదు శూద్రులు పాలకులు కావాలి'.శూద్రులు పాలకులైనా ఏ మార్పూ ఉండదని రంగనాయకమ్మ అంటారు. కానీ కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నం నుంచి భూపతులు, సామంతులు, దండనాయకులుగా ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ కులాలు శూద్రత్వం నుంచి బయటపడి అగ్రకులాలుగా మారలేదా? డాక్టర్ బిఆర్ ఆంబేద్కర్ చెప్పినట్లు 'మన పోరాటం అధికారం కోసం కాదు. స్వాతంత్య్రం కోసం' అనే దిశగా నేటి బహుజనులు ఆలోచించాలి. ఫూలే-అంబేద్కర్ తాత్విక పునాదుల మీద ఉద్యమాలు ఉధృతం చేయడమే రంగనాయకమ్మలాంటి వారికి సరైన సమాధానం.

- కదిరె కృష్ణ
కన్వీనర్, మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్‌మెంట్

Andhra Jyothi Telugu News Paper Dated : 05/07/2013 

No comments:

Post a Comment