Saturday, October 22, 2011

ఐలమ్మే మా అమ్మ - మందకృష్ణ మాదిగ Andhra Jyothi 23/10/2011


ఐలమ్మే మా అమ్మ
- మందకృష్ణ మాదిగ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది తెలంగాణ లోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అణగారిన కులాల విద్యార్థుల, యువతీ యువకులు త్యాగాలతో ప్రబలంగా మారింది. లక్ష్యాన్ని సాధించటం కోసం జరుగుతున్న యుద్ధంలో తెలంగాణలోని 90 శాతం గల బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల ప్రజలే సైనికులు. అందుకు వారు సమిధలవుతున్నారు. తెలంగాణను సచ్చైనా సాధించాలని అణగారిన కులాల విద్యార్థినీ విద్యార్థులు యువతీ యువకులు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని చూడకముందే ఈ లోకాన్ని వీడుతున్నారు.

కాని తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పే వెలమ, వెలమ దొరల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అదే తెలంగాణ సాధించే లక్ష్యం కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఈనాటికీ ఆత్మహత్యలు చేసుకునే వైపు పోలేదు. తెలంగాణ సాధించటమే ఒక లక్ష్యంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని వారి త్యాగాలు వృ«ధా కావని దొరలు అంటున్నారు. ఆ సమున్నత లక్ష్య సాధన కోసమే అణగారిన కులాల పిల్లలు చేసుకుంటున్న ఆత్మహత్యలే త్యాగాలయితే ఆ స్థాయి త్యాగాలు తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నామని చెబుతున్న వెలమ దొరల సామాజిక వర్గీయులు ఒక్కరంటే ఒక్కరు ఎందుకు త్యాగాలు చెయ్యలేకపోయారో చెప్పటానికి దొరలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. దొర కులంలోని ఎవ్వరు త్యాగాలు చేసే అవకాశం లేదు.

వారికి ఆ అవసరం కూడా లేదు. పెద్దదొర కెసిఆర్ తెలంగాణ కోసం తలనరుక్కుంటానంటాడు. కాని నరుక్కోడు. అల్లుడు హరీశ్‌రావు మీడియా ముందు పోలీసుల ముందు కిరోసిన్ చల్లుకొనే ప్రయత్నం చేయడం ద్వారా ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టుగా నటిస్తుంటాడు. కాని చేసుకోడు. ఎందుకంటే, ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్నవారెవ్వరు నూటికి 99 శాతం మీడియా ముందు, పోలీసులు ముందు చేసుకోలేదు. దొర కొడుకు, తెలంగాణ కోసం జైలు కెళ్ళటానికయినా సిద్ధమేనని ఉద్యమకారుడి స్థాయిలో ప్రకటనలిస్తుంటాడు.

అయితే తెలంగాణ కోసం ఇప్పటివరకు ఉద్యమాలు చేసి జైలుకెళ్ళిన వేలాది అణగారిన కులాల విద్యార్థులు, యువకుల్లో ప్రగల్భాలు పలికిన దొర కొడుకు ఉండడు. ఎందుకంటే దొర కొడుకు జైలు కెళ్ళితే, అసెంబ్లీ కెళ్ళే ఇంకో కుమారుడు లేడు కనుక. దొర ఒకానొక కొడుకు జైలుకెందుకెళ్ళాలి? అసెంబ్లీకే వెళ్ళాలి. జైలుకెళితే ఖైదీగా ఉండాల్సివస్తుంది. కాని అసెంబ్లీ కెళితే ప్రజాప్రతినిధిగా అనుభవం వస్తుంది. తెలంగాణ రాక ముందే ప్రజాప్రతినిధిగా అనుభవం వస్తే, తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రిగా పరిపాలించటానికి ఆ అనుభవమే పనికి వస్తుంది.

ఇక తెలంగాణలో బతుకమ్మ సంస్కృతిని బతికించాలంటే బతికించటం కోసం ప్రజలను జాగృతం చేయాలంటే దొర కూతరుకు తప్ప తెలంగాణలోని ఏ ఆడపడుచుకు ఆ అర్హతే లేదు. జాగృతం చేసే అర్హత ఇంకో అణగారిన కుల మహిళ సాధిస్తే దొరలపాలనకే చరమ గీతం పాడే మాయావతి లాగా మారుతుందేమోనని భయం పెద్ద దొరను వెంటాడుతుంది. తెలంగాణ అనే నాలుగు అక్షరాలను, తన కుటుంబంగా చేసి, తాను, కొడుకు, అల్లుడు, కూతురు నాలుగున్నర కోట్ల ప్రజలకు సెంటిమెంటు రుద్దుతున్నారు. దొరలు రాసిన సెంటుకు గుబాళించే సువాసన లేదు. కాని అణగారిన కులాలను ఆత్మహత్యలకు ప్రోత్సహించే విషపూరిత మందు ఉంది.

ఆ విషపూరిత మత్తు మందును తమ సామాజికవర్గానికి పూయరు, వారి సామాజిక వర్గానికి రాయరు. అందువల్ల వెలమ దొరల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళెవరు ఆత్మహత్యలు చేసుకోరు. ఎందుకంటే గ్రామాల్లో ఉండే వెలమ దొరలు సెంటిమెంటుకు చిత్తయ్యేవారు కాదు. వారు, బతికి వుండి గ్రామాల్లో అణగారిన వర్గాల ప్రజల మీద తెలంగాణ వచ్చినా రాకపోయినా గ్రామాల్లో పెత్తనం చేయాలనుకుంటారు తప్ప చావాలనుకోరు. ఒక లక్ష్యం కోసం త్యాగాలు చేసేవారు అణగారిన వర్గాల జనులు.

అందుకే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణను పరిపాలించటం కోసం, తెలంగాణలోని అన్ని గ్రామాల మీద పెత్తనం చేయటమే లక్ష్యంగా బతికుండాలనుకునే వారు వెలమ దొరలు. అందుకు వీరు బతికి ఉండాలి. అందుకే వీరు ప్రాణ త్యాగాలు చెయ్యరు. ఇప్పటికి ఆత్మహత్యలకు పాల్పడ్డ దాదాపు 700 మందిలో ఒక్కరు కూడా వెలమ దొరల సామాజికవర్గానికి చెందినవారు లేకపోవడమే ఇందుకు సాక్ష్యం.

ఇక ఇప్పుడు తెలంగాణ రాకముందే దొరసానుల రూపముండే ఒక బొమ్మను పెట్టి ఆమెనే తెలంగాణ తల్లిగా అణగారిన కులాల చేతనే భజన చేయించటం ప్రారంభించారు. ఈ బొమ్మనే పీడిత కులాల వారందరికి అమ్మను చేసి సెంటిమెంటు ముసుగులో పీడితకులాలపై సాంస్కృతిక, మానసిక దాడిని ప్రారంభించారు. ఇప్పటివరకు దొరలు అణగారిన కులాలపై చేసిన భౌతిక, లైంగిక దాడుల కంటే దొరసాని రూపంలో ఉండబడే బొమ్మను అణగారిన కులాలందరి మీద అమ్మగా రుద్దే సాంస్కృతిక దాడి అతిభయంకరమైంది. శాశ్వతంగా తెలంగాణలో అణగారిన కులాలను అణచివేయటానికి ఈ బొమ్మ దొరల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం కాబోతుంది.

ఈ దాడిని ఇప్పుడే ఎదుర్కోవాలని ఇప్పుడు ఎదుర్కోకపోతే ఇక ముందు ఎదుర్కోవటం దాదాపు అసాధ్యమే అవుతుందని అణగారిన కులాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రపంచంలో జీవించిన, జీవిస్తున్న ప్రతి జీవికి తల్లి ఉంటుంది. మానవుడిగా జీవించిన, జీవిస్తున్న ప్రతి వ్యక్తికి తల్లి ఉంటుంది. ప్రతి తల్లికీ పేరుంటుంది. అంతెందుకు, మన దేశంలో మూడుకోట్ల దేవుళ్ళు, దేవతలున్నారని ఒక విశ్వాసం. దేవుడికయినా, దేవతకయినా ఖచ్చితంగా పేరుంటుంది. నాకు తల్లి వుంది. నా తల్లి పేరు కొమురమ్మ. నాకు తండ్రి వున్నాడు. నా తండ్రి పేరు కొమురయ్య. నాకు జిల్లా వుంది. అది వరంగల్. నాకు ఊరుంది.

హంటర్‌రోడ్ శాయంపేట. నా స్వగ్రామంలో, గ్రామప్రజలు పూజించే దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. మా ఊర్లో శివాలయం ఉంది. అక్కడ దేవుడు శివుడు. మా ఊరిలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. అక్కడ దేవుడు ఆంజనేయుడు. మా ఊరు చెరువుకట్ట మీదకట్ట మైసమ్మ దేవత ఉంది. మా ఊర్లో పెద్ద పండుగ పోచమ్మ పండుగ. పోచమ్మ తల్లినే దేవతగా పూజించే మా ఊరిలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఘనంగా పోచమ్మ పండుగ చేస్తారు. మా ఇంట్లో ఇంటిదేవతగా ఎల్లమ్మ తల్లిని పూజించే వారు. ఈ విధంగా ప్రతివ్యక్తికి తల్లితండ్రులున్నారు. వాళ్ళకు పేర్లున్నాయి. ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు పూజించే దేవుళ్ళు, దేవతలున్నారు.

ప్రతి దేవుడికి, ప్రతి దేవతకి పేరుంది. మా ఊర్లోనే కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా. మరి ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో తెలంగాణ పేరుతో వెలుస్తున్న ఈ బొమ్మకు తల్లిదండ్రులెవరు, వారి పేర్లేంటి? సాధారణంగా, హిందువుల్లో వితంతువులే బొట్టు తీస్తారు. ఈ బొమ్మరూపంగావున్న ఈ అమ్మకు పెళ్ళి అయితే భర్త ఎవరు, ఆ భర్త పేరేంటి? ఈమె పుట్టినిల్లెక్కడ, మెట్టినిల్లెక్కడ? ఎవరైనా చెప్పగలరా? కనీసం అమ్మ అని చెబుతున్న ఈ బొమ్మకు పేరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు.

ఇది వాస్తవం. ఇక ఈ బొమ్మ రూప శిల్పి దొరే గనుక దొరసాని రూపాన్ని చాలా అందంగా చిత్రించాడు. తన దగ్గరున్న శిల్పులతో అపురూపంగా చిత్రించారు. ఆ అపురూపమైన బొమ్మకు, తలమీద ధగధగమెరిసే బంగారు కిరీటం, కొట్టొచ్చినట్టు ఆకర్షణీయంగా కనిపించే ముక్కుపుడక, చెవులకు ఒదిగివుండే గంటీలు, మెడకు కంఠాహారము, దానికింద బంగారు చైన్, నెక్‌లెస్‌లు ధరించివున్నాయి, నడుముకు వడ్డాణము, రెండు చేతులకు బంగారు కడియాలు, అబ్బో ధగధగ మెరిసే ఎర్రటి పట్టు చీర, మొత్తానికి పీడిత కులాలు కూడా మైమరిచిపోయే విధంగా అందమైన బొమ్మను తయారుచేయించి ఈమెనే మీ అమ్మ అని చెప్పి గౌరవించడం, పూజించడం దొరలు చేయమంటున్నారు.

పీడిత కులాల, మహిళల సంస్కృతి సంప్రదాయం లేని ఈ బొమ్మ అందరికి అమ్మ ఎలా అవుతుంది? తినడానికే తిండి సరిగాలేని, బతకడమే కష్టంగా జీవించే కూలీనాలీ చేసుకునే అణగారిన కులాల తల్లులకు ఒంటినిండా బంగారం, వడ్డాణాలు, కిరీటాలు, నక్లెస్‌లు వేసుకుని తిరిగే పరిస్థితే లేదు, పట్టెడన్నమే సరిగా లేని నా తల్లులకు పట్టు వస్త్రాలు ఎక్కడివి. మోసం చేసేటోళ్ళ, దగా చేసేటోళ్ళ ఇండ్లలో బంగారు నాణేలు, వజ్రాలుంటాయి. కూలి చేసుకుని బతికే మా ఇండ్లలో కడుపు నిండా మా తల్లులకు తిండేలేదు, ఒంటి మీద పట్టు చీరలెక్కడివి, ఒంటినిండా బంగారమెక్కడిది. అందుకే, మీరు పెట్టే ఈ బొమ్మ మాకు అమ్మ ఏనాటికి కాదు. ఆ బొమ్మను బజారులో పెట్టడం కంటే, మీ గడీల్లో పెట్టుకుంటే మీకే మంచిదేమో ఆలోచించుకోండి.

తెలంగాణలో కాకతీయ రాజుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమణం పొందిన మా ఆదివాసీ గిరిజన వీరవనితలైన సమ్మక్క, సారక్కలను మేము దేవతలుగా కొలుస్తున్నాము. వారి త్యాగాలు అడవులను దాటి, సరిహద్దులను దాటి దేశ వ్యాప్తమైంది. రెండున్నర సంవత్సరాలకోసారి దాదాపు కోటి మంది ఒక్క దిక్కున చేరి (మేడారం జాతర) సమ్మక్క సారక్కలను పూజించుకునే సంప్రదాయం ప్రపంచాన్నే ఆకర్షిస్తుంది. ఆ ఇద్దరూ మా ఆదివాసీ మహిళలైనందుకు మేమెంతో గర్వపడుతున్నాము. వారే మా దేవతలుగా, అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మా ఇలవేల్పులుగ మేమెప్పుడూ పూజిస్తుంటాము.

ఆ కోవలోనే దాదాపు ఆరు దశాబ్దాల క్రితం, దేశ్‌ముఖ్‌లకు, భూస్వాములకు, వారి గూండాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి, పోరాడి విజయం సాధించిన చాకలి ఐలమ్మే మా అణగారిన కులాలకు మొత్తం వివక్షకు, దోపిడీకి గురిఅవుతున్న వర్గాలకు స్ఫూర్తి. దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి, వందలాది గ్రామాల్లో అణగారిన కులాల మహిళల్ని, ప్రజల్ని నిరంతరం వేధించే కిరాతకుడు. జనగామ తాలూకాలో విసునూరు రామచంద్రారెడ్డి తదితర భూస్వాములు సంఘంలో ఉన్నారనే నెపంతో ప్రజలపై తప్పుడు కేసులు బనాయించడం, హింసలకు గురిచేయడం పరిపాటిగా మారింది.

విసునూరు రామచంద్రారెడ్డి పరిపాలించే గ్రామంలో ఒకటైన జనగామ తాలూకా పాలకుర్తిలో సంఘాన్ని బలపరిచే దృఢ సంకల్పం గల చాకలి ఐలమ్మ అంటే కిరాతకుడైన రామచంద్రారెడ్డికి కన్నెర్రయింది. ఐలమ్మ పొలాన్ని స్వాధీనం చేసుకోటానికి పొలంలో ఉన్న పంటను కోయించుకెళ్ళటానికి వందలాది గుండాలను పంపించాడు. దేశ్‌ముఖ్‌కి అండగా వచ్చిన వందలాది గూండాలను ఎదుర్కొని చితకతన్ని, వారు పారిపోయేటట్లు చేయడంలో వీరోచితంగా పోరాడింది ఐలమ్మ. పంటను గాని, భూమిని గాని దొరలు, పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోవటానికి తమ భూమిని, తమ పంటను సంరక్షించుకోవటానికి ఐలమ్మ చేసిన పోరాటం ఆనాడు విజయవంతం అయింది.

పేరు మోసిన కిరాతకుడైన దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిపై చాకలి ఐలమ్మ సాధించిన ఈ విజయం మొత్తం తెలంగాణ పీడిత కులాల ప్రజల్ని ఉత్తేజపరిచింది, ధైర్యాన్నిచ్చింది. ఈనాటి దొరలు అవలంబిస్తున్న కుట్రలు కుతంత్రాల నుండి మా అణగారిన వర్గాలను రక్షించుకోటానికి సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని చెలాయించాలనుకున్న దొరల ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే పీడిత కులాలందరికీ చాకలి ఐలమ్మే ఆదర్శం. కులాలకు అన్ని రంగాల్లో న్యాయబద్ధంగా దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకునే మా పోరాటంలో అడ్డొచ్చే ఈనాటి దొరలను, దొరలకు వత్తాసు పలికే దళారులను మా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ఎదుర్కొంటాం. న్యాయమైన పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఐలమ్మను మా తెలంగాణ తల్లిగా, ఆ తల్లి విగ్రహాలను తెలంగాణ మొత్తం పెడతాం. మాకు ఐలమ్మే తెలంగాణ తల్లి. అంతేకానీ దొరలు పెట్టిన ఈ బొమ్మ మాకెన్నటికీ తల్లి కానే కాదు.

- మందకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

No comments:

Post a Comment