Monday, September 3, 2012

బీసీ ఎజెండా ఫలిస్తుందా? - కంచ ఐలయ్య

బీసీ ఎన్నికల ఎజెండా ఒక రాజకీయ ప్రయోగం. ఇది ప్రజల జీవితాలను ఎంతో కొంత మార్చేది. ఆ మార్పు తేవడానికి రాజకీయ పార్టీలు పోటీపడాలి గానీ ఎత్తుగడలేసి వారిని మళ్ళీ మోసం చెయ్యాలనుకోవడం కుదరదు.

రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారంలో వాటా గురించిన చర్చ మళ్ళీ ఊపందుకున్నది. దీనితో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు స్పెషల్ ప్లాన్ ఏర్పాటు చేసి బడ్జెట్‌లో వాటా రూపొందించాలనే అంశం కూడా చర్చలో ఉంది. గత ఎన్నికల ముందు కూడా బలహీనవర్గాల సాధికార వేదిక సభలు, సమావేశాలు పెట్టాక బీసీలకు 100 సీట్లు ఇచ్చే అంశంపై చర్చ జరిగింది.

కానీ అప్పుడు అన్ని రాజకీయ పార్టీలను ప్రభావితం చెయ్యకముందే ప్రజారాజ్యం పార్టీ ఒక బీసీల పార్టీగా ముందుకు రావడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చూద్దాంలే అనే ధోరణిని అనుసరించాయి. కానీ 2014 ఎన్నికల నాటికే ఈ అంశాన్ని ఒక కొలిక్కినెట్టకపోతే తెలుగుదేశం పార్టీ ఉనికిలో లేకుండాపోయే దశ వచ్చింది. ఈ దశలోనే మేధావుల ఫోరం బీసీలకు స్పెషల్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది.

ఈ రెండు అంశాలను తమ ఎజెండాగా మలుచుకొని ఎన్నికల రంగంలో దిగకపోతే టీడీపీ బతికి బట్టకట్టలేదేమో అనే దశ వచ్చింది. అందుకే అది 2014 ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు, 10వేల కోట్ల రూపాయల స్పెషల్ ప్లాన్ రూపొందిస్తామని నిర్ణయాత్మకంగా ప్రకటించింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

ఈ స్థితిలో మిగతా రెండు పార్టీలు - కాంగ్రెస్, వైఎస్ఆర్‌సి- ఈ అంశాలపై తమ నిర్ణయాన్ని చెప్పకతప్పదు. కాంగ్రెస్‌లోని బీసీ వర్గం స్పెషల్ ప్లాన్‌పై మేధావులతో కలిసి కసరత్తు చేసిన మాట వాస్తవం. కానీ పార్టీపరంగా అది ఒక నిర్ణయం తీసుకోలేదు.

ఎందుకంటే ఇప్పటి వరకూ అది ప్రధానంగా 'రెడ్ల' పార్టీగా ఉంది కనుక. జాతీయస్థాయి పార్టీ ఇటువంటి నిర్ణయాన్ని ఒక్క రాష్ట్రంలో తీసుకుంటే దానికి అన్ని రాష్ట్రాల్లో సమస్యలొస్తాయి. వైఎస్ఆర్‌సి కూడా ప్రత్యామ్నాయ 'రెడ్డి' ప్రాంతీయ పార్టీగా రూపొందుతున్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎవరి పార్టీగా ఉండాలనే ప్రశ్న ముందుకొస్తుంది. తెలుగుదేశం ప్రధానంగా కమ్మల పార్టీ అయినప్పటికీ బీసీ, మాదిగల అండతో అది అధికారంలో కొనసాగింది. కానీ ముందు, ముందు టీడీపీ కమ్మల పార్టీగా కొనసాగడం కష్టం.

బీసీల ఆకాంక్ష దినదినానికి పెరుగుతోంది. యు.పి, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో బలమైన బీసీ నాయకత్వం ఎదిగింది. పార్టీ ఏదైనా అక్కడి బీసీ ప్రజల సింబాలిక్ కల పండిందనే భావన ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ కల కలగానే మిగిలి ఉంది. కులాలు అభివృద్ధిని కోరుకుంటాయి. అధికారాన్ని కోరుకుంటాయి. తమ సింబాలిక్ నాయకత్వాన్ని కూడా కోరుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొంత అభివృద్ధి ఉంది కానీ అధికారంలో వారికి అర్థవంతమైన వాటా లేదు.

సింబాలిక్ నాయకత్వం అంతకన్నా లేదు. టీడీపీ అధికారంలో వాటా 100 సీట్లతో ఇస్తానంటోంది. అభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందిస్తానంటోంది. ఆ మేరకు అది ఒక్క అడుగు ముందుకేసినట్లే. అయితే అది మేమూ చేస్తామని కాంగ్రెస్, వైఎస్ఆర్‌సి అనడం సులభమే. ఎందుకంటే పార్టీల మధ్య పోటీ ఒక అంశం చుట్టూ తిరుగుతున్నప్పుడు, అన్ని పార్టీలూ చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలనుకుంటాయి.

ప్రస్తుతానికి చర్చ మూడు అంశాల చుట్టూ ఉంది. (1) బీసీలకు వంద సీట్లు (2) ఈ వంద సీట్లలో అన్ని పార్టీలూ బీసీలనే పోటీ చేయించే విధంగా చూడడం (3) బీసీలకు సీట్లు జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు ఇవ్వడం, ప్రాతినిధ్యం వచ్చే విధంగా చూడడం. ఇందులో మొదటి ప్రతిపాదన టీడీపీ చేస్తే, రెండోది వైఎస్ఆర్‌సి చేసింది. మూడో ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి వచ్చింది. టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా యాంటీ-బీసీ పార్టీలు కనుక అవి చర్చలో కూడా పాల్గొనడం లేదు అనే అభిప్రాయం ఉంది. కమ్యూనిస్టు పార్టీలు చాలా కాలంగా బీసీలకు సంబంధించిన చర్చకు దూరంగా ఉంటున్నాయి. ఏదేమైనా పై మూడు ప్రతిపాదనలలో ఏది అమలు కాగలిగేది, ఏది కాలేనిది కూడా చూడాలి.

బీసీలకు వంద సీట్లు ఇవ్వాలనే చర్చ 2009 ఎన్నికల నాటి నుంచి ఉంది. బలహీన వర్గాల సాధికారత సంస్థ మీటింగుల తరువాత టీడీపీ వరంగల్‌లో బీసీ సభ జరిపి 100 సీట్లు ఇస్తామనే వాగ్దానం చేసింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఆ అంశాన్ని పట్టించుకోలేదు. 2014 ఎన్నికల్లో పోటీ రూపం మారబోతోంది. రాష్ట్రమంతటా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. తెలంగాణలో నాలుగు పార్టీలు పోటీ పడవచ్చు. ఇప్పుడున్న రూపం చూస్తే అన్ని పార్టీలూ అగ్రకులాల ఆధిపత్యంలోనే ఉన్నాయి.

ఈ చర్చను గ్రామస్థాయి బీసీలు కూడా అందిపుచ్చుకుంటే ఈసారి రాజకీయ పార్టీలన్నీ 100 సీట్లు బీసీలకివ్వకుండా ఉండలేని పరిస్థితి ఉండొచ్చు. ఈ స్థితిని అవసరం రీత్యానైనా టీడీపీ రాజకీయ పార్టీల ముందు ఉంచింది. అలాగే 10వేల కోట్ల రూపాయల స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్‌కు టీడీపీ కట్టుబడి ఉంటుందనే నమ్మకం బీసీల్లో కలిగితే ఆ పార్టీ పక్కన బీసీలు నిలబడే అవకాశం లేకపోలేదు.

అయితే వైఎస్ఆర్‌సి ఒక ప్రాక్టికల్ పాయింట్‌ను ముందుకు తెచ్చింది. పార్టీలు 100 సీట్లు బీసీలకు ఇచ్చి ఫలితమేమిటి? ఆ వందకు వంద ఓడిపోయే వాటినే ఇవ్వవచ్చు కదా అనేది? ఈ రెండు వాదనలకు ప్రత్యామ్నాయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జనాభా ప్రాతిపదికన కులాల వారీగా ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టారు. కానీ కులాల లెక్కలన్నీ తప్పుడు లెక్కలని చెప్పారు.

సరే లెక్కలు తేల్చవచ్చు అనుకున్నా ఆయన ఆచరణ అనువుగాని ప్రతిపాదన చేశారని భావించేందుకు అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ ముందు 100 సీట్లయినా ఇస్తామని చెప్పకుండా జనాభా ప్రాతిపదికన, కులాలవారీగా ఇస్తామని చెప్పడం ఎలా నమ్మదగ్గది? కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటికే ఓడేటివో, గెలిచేటివో 100 సీట్లు ఎప్పుడూ ఇవ్వలేదు. కనుక కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు ఒక వైఖరి తీసుకొని తమ పార్టీని ముందు 100 సీట్లకు, 10వేల కోట్ల స్పెషల్ బడ్జెట్‌కు ఒప్పించాలి కదా! అలా చెయ్యనప్పుడు వారిని ఎవరు నమ్ముతారు?

ఈ రెండు అంశాలను పక్కకు పెట్టి కాంగ్రెస్ బీసీ వ్యక్తిని 2014 నాటికి ముఖ్యమంత్రిని చెయ్యగలిగే అవకాశమున్న పార్టీ. మరి ఆ పని చేస్తుందా? అలా చేస్తే కాంగ్రెస్‌లో రెడ్లు లేకుండా వైఎస్ఆర్‌సిలోకి జంప్ అవుతారనే భయం దాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎలాగూ దెబ్బతినే పరిస్థితి రాష్ట్రంలో ఉంది కనుక (వైఎస్ఆర్‌సి, టీఆర్ఎస్ ఉనికి వల్ల) సర్వేలన్నీ ఆ స్థితినే సూచిస్తున్నాయి కనుక కాంగ్రెస్ బీసీ కార్డుతో పునఃనిర్మాణానికి పూనుకుంటే చంద్రబాబు కూడా ఇరకాటంలో పడతారు.

జగన్ పార్టీ జగన్‌మోహన్ రెడ్డిని తప్ప మరో ముఖ్యమంత్రిని అంగీకరించదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బీసీ వ్యక్తిని నియమించి బీసీ నాయకత్వాన్ని పైకి తెచ్చే పరిస్థితి లేదు. మేము గెలిస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని కూడా టీడీపీ అధ్యక్షుడు చెప్పడం లేదు. అంటే ఎంత కాలమైనా టీడీపీ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒక్క టీఆర్ఎస్ నాయకుడు మాత్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పడదనే నమ్మకంతో కావచ్చు ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని, ఒక బీసీ (స్వామిగౌడ్‌ను) మంత్రిని చేస్తానని 'చండేశి మంత్రం' చెబుతున్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్.

అందులోని బీసీలు మంత్రులుగా ఉండి రెడ్ల సేవ చేసి, చేసి ఇప్పుడు జైలుకు పోతున్నారనే చర్చ ఉండనే ఉంది. ఈ అన్ని పార్టీలనూ ఇరకాటంలో పెట్టాలంటే కాంగ్రెస్ ఏకంగా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చెయ్యాలి. అలా చేసి, బీజేపీ గుజరాత్‌ను, మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘ కాలం తమ చేతుల్లో ఉంచుకోగలుగుతోంది. అది ఇక్కడ ఆ పని చెయ్యవచ్చు.

ఎలాగూ కాంగ్రెస్ గానీ, వైఎస్ఆర్‌సి గానీ ఈ అంశంపై ఇనిషియేటివ్ తీసుకున్న పార్టీలు కావు. ఇప్పటికైనా ఇనిషియేటివ్ టీడీపీదే కనుక - అది ఇంకో అడుగు ముందుకేసి మేం సంపూర్ణ మెజారిటీ సాధిస్తే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తే ఆ పార్టీని ప్రజలు నమ్మే అవకాశముంది. 100 సీట్లు, 10వేల కోట్ల స్పెషల్ బడ్జెట్, ఒకరిని బీసీ ముఖ్యమంత్రి అని తేల్చినట్లయితే చంద్రబాబుకు రాజకీయ సంస్కర్త అనే పేరు దక్కే అవకాశముంది.

అది నామమాత్ర అధికారమా, నిజమైన అధికారమా వేరే విషయం. కానీ అది ఒక బీసీ నాయకుడిని (సింబాలిక్‌గానైనా) ప్రజల ముందు పెట్టకుండా బీసీలు సైతం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పార్టీపై నమ్మకం కోల్పోయిన వాతావరణం కూడా రాష్ట్రంలో ఉంది. అందుకే ఏ సర్వేలో కూడా తెలుగుదేశం గెలుస్తుందని చెప్పగలిగే ఓటర్లు లేకుండా పోయారు. సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలో గానీ, ఎన్‌డీటీవీ సర్వేలో గానీ తెలుగుదేశం గుర్తింపు గలిగిన పార్టీగా కూడా కనిపించడం లేదు.

ఈ సర్వేలు ఈ పార్టీ బీసీ ఎజెండానూ, మాదిగ ఎజెండానూ ప్రకటించక ముందు చేసినవో, తరువాత చేసినవో కూడా తెలియదు. ఏది ఏమైనా రాష్ట్రంలో బీసీల స్థితి మారాలంటే వారికో స్పెషల్ బడ్జెట్, 100 సీట్లు (అసెంబ్లీలో ఉండగలిగితే ఇంకా మంచిది) ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి గద్దెమీద కూర్చోబెట్టడం అనివార్యమౌతుంది. ఇందుకు టీడీపీ సిద్ధపడడంఅవసరమౌతుంది. అది దాని చిత్తశుద్ధిని ప్రకటించినట్లవుతుంది.

కరప్షన్ అంశంపై వైఎస్ఆర్‌సిని గానీ కాంగ్రెస్‌ను గానీ బలహీన పరుస్తామనుకుంటే అది సాధ్యం కాదు. ఎక్కడో పైన జరిగిన కరప్షన్‌ను ప్రజలు 'తమ సమస్య'గా చూడడం లేదు. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా కరప్షన్ అంశంపై ఎన్నికల్లో గెలవడమో ఓడిపోవడమో జరగలేదు. నాయకులు, పార్టీలు మాకేం ఇస్తారనే అంశంపైనే ప్రజలు తమ దృష్టిని కేంద్రీకరిస్తారు.

కనుక బీసీ ఎజెండాను ఒక కొలిక్కినెట్టి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలంటే ఇంతకు ముందు వారికిచ్చిన రాయితీల కంటే భిన్నమైనవి, నిర్దిష్టంగా వాళ్ళ జీవితాలను ప్రభావితం చెయ్యగలిగేవి నమ్మకంగా ఇస్తారనే ఆత్మవిశ్వాసం వారిలో కలగాలి. గత అనుభవాల వల్లో ఏమో టీడీపీ బీసీ ఎజెండాను ప్రజలు పూర్తిగా నమ్మడం లేదు. వారు ఒక సందిగ్ధ దశలో ఉన్నారు. వారు నమ్మడానికి కొన్ని ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలి. ఇవి వాగ్దానాలను నమ్మే రోజులు కావు. మనుషుల కంచంలో కాసులు కనబడాలి.

పైవాళ్ళంతా తింటారు. తిననియ్యండి. కానీ మాకేం ఇస్తారనేది ఈనాటి విలువ. ఇందులో ప్రజల ప్రాగ్మాటిజం ఇమిడి ఉంది. బీసీలు ఇంతకాలం ప్రాగ్మాటిజానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళూ అలా ఉండదలుచుకోవడం లేదు. కనుక ఏ మార్పు తేవాలన్నా కొన్ని ప్రయోగాలు చెయ్యకతప్పదు. ఈ బీసీ ఎన్నికల ఎజెండా కూడా ఒక రాజకీయ ప్రయోగం. అయితే ఇది ప్రజల జీవితాలను ఎంతో కొంత మార్చేది. ఆ మార్పు తేవడానికి రాజకీయ పార్టీలు పోటీపడాలి గానీ ఎత్తుగడలేసి వారిని మళ్ళీ మోసం చెయ్యాలనుకోవడం కుదరదు.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

No comments:

Post a Comment