Friday, November 21, 2014

మన కాలం బోధిసత్వుడు - డాక్టర్‌ కదిరె కృష్ణ

కులమత వర్గరహిత వ్యవస్థను సాకారం చేయగలిగేది బౌద్ధం. రాహుల్‌ సాంకృత్యాయన్‌ చెప్పినట్లు మార్క్సిజం బాగా అర్థమైతే బౌద్ధం బాగా అర్థమైనట్లే! కారణం ఈ రెండిటిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్న భౌతికవాదం ప్రధానమైనది. ఈ సారాన్ని బాగా ఒంట బట్టించుకున్న వ్యక్తి ‘దొమ్మేటి సత్యనారాయణ బోధి’.
బోధి మొదట సంప్రదాయ హిందూ కుటుంబ ఆచారాలు కలవాడైనా బౌద్ధం పరిచయమైనప్పటి నుంచీ అదే జీవితంగా జీవించిన త్యాగశీలి. నిజానికి బౌద్ధం అంటే త్యాగం. మానవుడు తన భౌతికావసరాలను ప్రకృతి నుంచి పొంది ప్రకృతిలో కలిసిపోవడం,. ఈ మధ్యలో జీవితం నిస్వార్థంగా ఉండడం, ‘స్వంతం’ అనేది లేని సమాజహిత జీవనమే బౌద్ధం. ఇటువంటి జీవితం ఏ కొందరికో సాధ్యమవుతున్న ప్రస్తుత తరుణంలో స్మరించుకోవల్సిన వ్యక్తి సత్యనారాయణ బోధి.
యావద్భారతదేశంలో బౌద్ధ ప్రచాలనకు ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా కృషి చేశారు. అంతకు పూర్వం ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా, మార్క్సిస్టుగా ఆదర్శ జీవితం గడిపారు. 1926లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా వక్కలంక గ్రామంలో దొమ్మేటిసుబ్రహ్మణ్యం, మాచరమ్మ దంపతులకు సత్యనారాయణ జన్మించారు. 1952 నుంచి 1984 వరకు రైల్వే శాఖలో వివిధ ఉద్యోగాలు నిర్వహించారు ఎస్‌.ఇ రైల్వేలో షాప్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేశారు.
స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్‌-నాగపూర్‌ రైల్వేలో పనిచేస్తున్న కాలంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ట్రేడ్‌యూనియన్‌ రంగంలో కార్మికులను ముఖ్యంగా సూపర్వైజర్‌ క్లాస్‌ని సమకట్టి హక్కుల సాధన పోరాటంలో తిరుగులేని నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే 1974 మేలో దేశవ్యాప్తంగా జరిగిన చరిత్రాత్మక రైల్వే సమ్మెలో బలంగా పనిచేయడంతో ఉద్యోగం కోల్పోయారు. ఆ తరువాత జనతా ప్రభుత్వ హయాంలో తిరిగి ఉద్యోగం పొందగలిగారు. బెంగాల్‌ ప్రాంతంలో పనిచేస్తున్న క్రమంలో హేమాహేమీలైన కమ్యూనిస్టు నాయకులందరితో కలిసిపనిచేశారు. వారి ఉపన్యాసాలు వినడమే కాదు తాను వారితో కలసి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినట్లు నాతో చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ఈయన సహచరుడు. 1984లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత సత్యనారాయణ బౌద్ధం వైపు మళ్లారు. 1992 నుంచి ఆయన పూర్తిగా బౌద్ధం ప్రచారంలో మునిగిపోయారు. కేవలం బౌద్ధ ప్రచాలనకే పరిమితం కాక బౌద్ధ సిద్ధాంతాల వ్యాఖ్యానం, అపార జ్ఞానసంపద ఈయన సొంతం. సత్యనారాయణ బోధి రేడియోలో బౌద్ధాన్ని ప్రబోధిస్తుంటే భగవద్గీతను గానం చేసిన ఘంటసాలను మైమరిపిస్తారు. 1994-95లో దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదికకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఏ పని చేసినా ఆయనలో నిండైన చిత్తశుద్ధి, నిబ్బరం, వినయశీలత తొణికిసలాడేది.
1996 మే20న విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేసిన ‘మత సామరస్యం- జాతీయ సమగ్రత’ అంశంపై బౌద్ధరీతిలో ప్రారంభమైన ఆయన ఉపన్యాసాలు మొన్నటివరకూ కొనసాగాయి. ఎందరో ఔత్సాహిక బౌద్ధ ప్రచారకుల ప్రసంగాలను ఆయన ప్రోత్సాహంతో తెలుగు సమాజం వినగలిగింది. 1996లో కలకత్తాలోని ‘మహాబోధి’ నిర్వహించిన ‘లే బుద్ధిస్ట్‌ లీడర్స్‌ కాన్ఫరెన్స్‌’లో బోఽధి సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఎంతో కీలకమైనదిగా బౌద్ధ నిష్ణాతులు కొనియాడారు. 2001లో ఒక అంతర్జాతీయ సదస్పులో ‘బౌద్ధం-మానవాళి భవిష్యత్తు’ అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక వ్యాసం పలువురి ప్రశంసలు అందుకుంది. 1997లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ‘లుంబిని ఉత్సవం’లో ప్రపంచంలోని వివిధ దేశాల బౌద్ధ ప్రతినిధులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాల్గొన్న ఏకైక ప్రతినిధి సత్యనారాయణ బోధి. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘బౌద్ధ దర్శనం పునాదులు’ అనే పరిశోధనాత్మక వ్యాసం బౌద్ధ సంస్కృతిలోని ప్రాధాన్యాలను వివరణాత్మకంగా మనముందుంచింది. బోఽధి సారథ్యంలో సారనాథ్‌లో జరిగిన 2007 వార్షిక సమావేశాలు చరిత్రాత్మకమైనవి. బౌద్ధంలోని పారమితలపై సత్యనారాయణ బోధి వ్యాఖ్యానం నభూతో నభవిష్యతి. ఆంగ్ల మూలంలోని అనేక బౌద్ధ గ్రంథాలను ఆయన ఆంధ్రీకరించారు. బోధి రేడియో ప్రసంగాలు ‘బౌద్ధచింతన’ పేరుతో పుస్తకరూపం ధరించాయి. బౌద్ధ భిక్షువులు ఆయన సేవను గుర్తించి ‘ధర్మ ప్రియ’ బిరుదుతో కలకత్తాలో సన్మానించారు. నిజజీవితంలో బౌద్ధ ఆచారాలకు సంబంధించి జీవితంలో ప్రతి సందర్భాన్ని ఆచ రించే విధంగా వ్యాఖ్యానించారు. పుట్టుక నుంచి ప్రతి సందర్భంలో బౌద్ధం ఎలా ఆచరించాలో చాలా స్పష్టంగా విశదీకరించారు. పాళీ భాషలో ఆయనకు గల విశేష జ్ఞానం అందుకు సహకరించింది.
బౌద్ధ సారస్వతనిధి దొమ్మేటి సత్యనారాయణ బోధి. బౌద్ధ ధర్మం పట్ల ఆయన ఎంతో అంకిత భావంతో ఉండేవారు. కొన్ని వేల కరపత్రాలు, చిన్న బుక్‌లెట్లు ప్రచురించి ఉచితంగా పంపిణీ చేశారు. ఆఽధునిక సమాజాన్ని పీడిస్తున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, అలౌకిక ధోరణులు, అప్రజాస్వామ్య ఆలోచనలను నిర్మూలించడానికి, మానవతా విలువల పరిరక్షణకు బుద్ధుని ప్రబోధాలు మందు వంటివని బోధి విశ్వసించారు. నిష్పక్షపాత బుద్ధితో బౌద్ధాన్ని వ్యాఖ్యానించడం ఆయన ప్రత్యేకత. దేశవ్యాప్తంగా వివిధ బౌద్ధ సంఘాల నాయకులతో, మాంగ్‌లతో ఆయనకు సత్ససంబంధాలు ఉండేవి. బౌద్ధ మాంగ్‌లను బౌద్ధం విషయంలో నిలదీసేంతటి విషయ పరిజ్ఞానం గల మన కాలం బోధిసత్వుడుగా ఆయనను అభివర్ణిస్తారు. బోఽధిసత్వ గుణ సంపన్నుడు. ఆయన మాట, అక్షరం ప్రసన్నంగా, మానవ జీవితంలోని పరిమళాలను వికసింపజేసే విధంగా ఉంటాయి. తాను మాత్రమే గాక తన కుటుంబాన్నీ అదే మార్గంలో నడిపించిన ఆదర్శవంతుడు. స్వచ్ఛమైన మానవ జీవితానికి భాష్యం చెప్పుతూ జీవితాంతం అణగారిన బీద ప్రజానీకానికి అండగా అరమరికలులేని, సమసమాజం కోసం అనునిత్యం తపించిన మంచి మనిషి సత్యనారాయణ బోధి. ఈ నెల 13న కాకినాడలో ఆయన పరినిర్వాణం పొందారు. బోఽధి సేవలు, కృషి, ప్రేమ, కరుణ, దయశీల, ప్రజ్ఞ ఎందరికో ఆదర్శమైంది. అదే ఆయన్ను చిరస్మరణీయున్ని చేస్తుంది. నమో తస్స సమ్మసంబుద్ధస్స.
- డాక్టర్‌ కదిరె కృష్ణ
Andhra Jyothi Telugu News Paper Dated : 20/11/2014 

Wednesday, November 12, 2014

Justice for marginalised sections among Dalits By Chandraiah Gopani


Ever since united Andhra Pradesh is bifurcated into Andhra Pradesh and Telangana States, both the new governments have started attracting Dalits by announcing welfare programmes. 

As the two governments are introducing various developmental models to fulfil election promises, a discussion has started among the Dalits or the Scheduled Castes about their development. The initial period of new-born state is an important period for marginalised groups, particularly Dalits. Their alertness, questing, intervention in the naming of various institutions, bringing new symbols, setting new syllabus for school education, forming of various committees and making new legislations play a crucial role in shaping and reshaping the vision and development of the state. 

While the ruling class tries to divide Dalits, it is also true that they are forced to focus on development around the dominant numerically majority caste – either Mala or Madiga – within the Dalits. The numerically smaller castes like Dakkali, Chindu, Mehatar, Mochi, Mateen, Baindla, Gosangi etc., neither  form part of the negotiating agenda nor are politically taken into consideration. This sort of tendency excluded various numerically smaller castes and affected their education, employment, development and political representation for a long time. Until the Dandora Movement (MRPS-1994) demanded their representation in various fields, there had been no much discussion on these castes. 

However, it is shocking to hear that after 68 years of independence India, some of these castes don't have any legal identification proof. Historically, these castes are nomadic moving from one village to another village by performing art forms and begging for their livelihood. To get identification proof or caste and residential proof, they have to undergo many hurdles to get the RDO approval, whereas Mala and Madigas can get the same from the MRO.   

Because of negligence by officials and their lack of understanding about these castes, the smaller Dalit castes are forced to seek either Mala or Madiga caste certificates. There are many cases where Chindu caste people got Madiga certificates and Netakani got Mala certificates. Further, the population of these communities is recorded in government reports in thousands, whereas they exist in lakhs, Thereby, they are counted as a SC numerically minority caste. Consequently, they are counted as politically irrelevant force and neglected.   

Recently, the Telangana government announced some jobs for artistes and land distribution scheme. But, the pertinent question is to what extent these welfare measures will reach the lowest. Besides, both Telugu States announced financial assistance to Dalit students for foreign studies, It is said that already dominant scheduled castes have started negotiations with the governments for major share, which will put minority communities at disadvantage. As long as there is no separate allocation for these communities, they won't get any justice.        

There is an immediate need to revise the Scheduled Caste list because some castes are not present either in Telangana  or Andhra Pradesh – Relli, Adi-Andhra etc are not present in Telangana, while Netakani, Nulaka Chandaiah etc are not present  in Andhra Pradesh. 

In order to be more inclusive, governments should allocate sub-plan funds as per caste population proportion. They also need to recognize and preserve the art forms of the various SC castes.

Within the Dalit movement and among Dalit intellectuals and activists there is a feeling that supporting the SC reservation rationalization and building broader Bahujan politics are contradictory, but they are not contradictory. In fact, they are complimentary. 

The long pending SC reservation rationalization issue is yet to be resolved in the context of state division. Some groups are campaigning against the demand. But the existing inequality among the Dalits clearly demands the necessity of SC categorization. The early resolution of this issue will create feasible conditions for the Dalit unity and also independent politics. 

Therefore, the Dalit intelligentsia, activists and leaders should realise that justice for the most marginalised sections among the Dalits and their viewpoints have a great capacity to deepen the Phule, Ambedkar and Kanshiram philosophical praxis and create conditions for autonomous politics of the oppressed.

The Hans India English Daily News Paper : 12/11/2014 

Sunday, October 26, 2014

హైందవ పునాదులపై ఇండియా - డాక్టర్‌ భంగ్యా భూక్యా



పెరి ఆండర్‌సన్‌ రచించిన ది ఇండియన్‌ ఐడియాలజీ గత రెండు సంవత్సరాలుగా ఇండియన్‌ మేధావి వర్గంలో పెద్ద దుమారాన్నే లేపింది. ఈ వర్గం తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ అనువదించి ప్రజలకు పరిచయం చేయటం చాలా సంతోషం. ఇండియాను బ్రిటిష్‌ పాలకులే డిస్కవరీ చేశారన్న ఆండర్‌సన్‌ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవించను. కానీ అతను లేవనెత్తిన అనేక వాదనలు, ప్రశ్నలు భారత దేశంలోని వాస్తవాలను ఎత్తి చూపుతున్నాయి. ఎందుకు అత నితో ఏకీభవించనంటే ఇండియాను డిస్కవరి చేసింది హిందూ మేధావి వర్గం. రాజారామ మోహన్‌ రాయ్‌ దగ్గర నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు ఆంగ్ల విద్యను వంటబట్టించుకున్న తరం ఇండియాను డిస్కవరీ చేయటమే పనిగా పెట్టుకొని వేదకాలం నుంచి నేటి వరకు ఇండియాలో దాగి వున్న హిందూత్వాన్ని వెలికి తీశారు. ఇది ఇండియాను ఒక అప్రకటిత హిందూ దేశంగా తీర్చిదిద్దింది.
ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేదేమంటే ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా హైందవ సాంస్కృతిక పునాదుల మీద నిర్మించబడి ఆ సంస్కృతిని బలోపేతం చేసింది. అదే విధంగా సనాతన వాదులు, ప్రగతిశీలవాదులన్న తేడాలేకుండా ప్రతి హిందువూ ఇండియన్‌ హైందవ ధర్మరక్షణకే పాటు పడ్డాడు, పడతాడూ కూడా. ఆందుకే ఆ రోజు వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావాలని కోరాడు. ఇప్పుడు ఆరు వందల అడుగుల ఎత్తు పటేల్‌ విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) నిర్మించటానికి నరేంద్ర మోదీ తాపత్రయపడుతున్నారు. అంటే దేశంలోని ఐక్యత విషయం ప్రక్కన పెడితే, కాంగ్రెసుకి, బీజేపీకి హిందూత్వ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి తేడా లేదు. కాంగ్రెస్‌ లౌకికవాదానికి ఈ దేశం మోసపోయిందని ఈ పుస్తకం బలంగా చెబుతుంది. అంతేకాదు, కాంగ్రెస్‌ దాని నాయకులు గాంధీ, నెహ్రూలు చేసిన మోసాలు ఇన్నీ అన్నీ కావని ఈ పుస్తకం రూఢి చేస్తుంది.
సాధారణంగా వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన అధ్య యనాన్ని మనం జాతీయ ఉద్యమంలాగా భావిస్తాము. మన అగ్రకుల చరిత్రకారులు దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు. అయితే ఈ ఉద్య మం హైందవ ధర్మరక్షణకే జరిగిందన్న విషయం మనకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. గాంధీకి స్వరాజ్‌ మతపరంగా ఒక తప్పనిసరి ఆవశ్యకత. రాజకీయ రూపం అనేది దీనిని ముందుకు తీసుకెళ్ళే సాధనం తప్ప మరొకటికాదు. మతాన్ని రాజకీయాలతో జోడించి ఉద్యమాన్ని నిర్మించటం గాంధీ ప్రత్యేకత. ఈ క్రమంలో హైందవ మత ఉద్ధరణం ప్రధానాంశం కావటం చూస్తాము. రాజకీయ స్వేచ్ఛ రెండవ అంశం కావటం చూస్తాము. వాస్తవంగా గాంధీ చేసిన రాజకీయ ఉద్యమాలు ఏవీ కచ్చితమైన ఫలితాలను సాధించకుండానే ముగుస్తాయి. అట్టహాసంగా మొదలుపెట్టిన సహాయనిరాకరణ ఉద్యమం చౌరిచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో అర్థాంతరంగానే ముగుస్తూంది. కానీ అసలు కారణం హింసకాదు. ఈ ఉద్యమం కొద్ది రోజు ల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్‌ పాలన కంటే ప్రజా విప్లవమే ప్రమాదకరమని భావించి సహాయ నిరాకరణోద్యమాన్ని ముగిస్తారు. అప్పటికి ఇండియా హిందువైజేషన్‌ కాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం. దండి సత్యాగ్రహం ఒక ఢిఫెన్సివ్‌ ఆట. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది. ఇందులో గాంధీ ప్రమేయం అంతంత మాత్రమే. గాంధీ రాజకీయ ఉద్యమాల్లో విజయం సాధించలేదు. కానీ హైందవ మత విషయంలో విజయాన్ని సాధించారు.
గాంధీ తన ప్రజా జీవితం మొత్తాన్ని హిందూ ధర్మరక్షణ కోసమే వెచ్చించ్చారని ఈ పుస్తకం రూఢీ చేస్తుంది. వ్యక్తిగత, ప్రజా జీవితం రెండూ మత మౌఢ్యంలోనే నడిచాయి. గాంధీ బ్రహ్మచర్యం కూడా హిందువులం మైలపడతామన్న భయం నుంచి రూపు దిద్దుకుంది. వ్యక్తిగత స్థాయిలో అన్ని మతాలు సమానమని నమ్మిన, రాజకీయ స్థాయిలో మాత్రం హిందూ మతం, ఇస్లాం మతం కంటే కాస్త ఎక్కువ అని నమ్మేవారు. ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన కుమారునికి అది ‘ధర్మ విరుద్ధం’ అని హెచ్చరించారు. రాజకీయాల్ని పక్కనబెట్టి ఈ పెళ్లి కాకుండాచూశారు.
గాంధీ లౌకిక వాదంలో హిందూత్వం దాగి ఉందని ముస్లింలు చాలా కొద్దికాలంలోనే కనిపెట్టారు. నాటకీయంగా జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత గాంధీ ముస్లింలను వదిలివేశారు. ఆనాటి నుంచి అత్యధిక శాతం ముస్లింలు ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. లౌకిక వాదానికి ప్రతీకగా ఉన్న మహమ్మదలీ జిన్నా కూడా గాంధీ హిందూత్వ రాజకీయాలకు విసిగిపోయి కాంగ్రెస్‌ నుంచి బైటికి వచ్చేశారు. నిష్పక్షపాతి అయిన మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా హిందూ పార్టీయే అనడం గమనించదగ్గ విషయం. ఈ హైందవ రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయి. కానీ చరిత్రలో దేశ విభజనకు జిన్నాను దోషిగా నిలబెట్టారు.
కాంగ్రెస్‌ పార్టీయే పాకిస్థాన్‌ స్థాపనకు నాంది పలికింది. జిన్నా భారత దేశంలో ఒకటి కాదు, రెండు దేశాలున్నాయని 1940లో ప్రకటించారు. ఆ రెండు దేశాలు సహజీవనం చేసేందుకు భారత స్వాతంత్య్రం వీలుకల్పించాలి, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో వారికి స్వయంప్రతిపత్తినీ, సార్వభౌమాధికారాన్ని ఇవ్వాలన్నారు. అంటే జిన్నా ప్రత్యేక దేశం కావాలని కోరలేదు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకున్నారు. ఈ విషయాన్ని గందరగోళం చేసి కాంగ్రెస్‌ పార్టీ పాకిస్థాన్‌ ప్రతిపాదనను జిన్నాకు అంటగట్టింది. దే శ విభజన బ్రిటిష్‌ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. క్యాబెనెట్‌ మిషన్‌ ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రాం తాలన్నీ స్వయం పాలనాధికారంతో ఉండే విధంగా ప్లాన్‌ రూపొందించింది. కానీ అది నెహ్రూకు రుచించలేదు. ముస్లింలకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి, ఇవ్వడం కంటే దేశ విభజనే మేలని నెహ్రూ భావించారు.
విచిత్రమేమంటే, కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ దేశ విభజన గురించి మాట్లాడుతున్నప్పుడు జిన్నా మాత్రం అఖండ భారత దేశంలో సంకీర్ణ ప్రభుత ్వం గురించి కలలు కనేవారు. భారత దేశంలో ఆంక్ష లు లేని సంపూర్ణ అధికారంతో కూడిన బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలని నెహ్రూ కోరుకున్నారు. అది విభజనతోనే సాధ్యపడుతుందని భావించారు. చివరకు ఈస్ట్‌ బెంగాల్‌ని కూడా జిన్నా కోరుకోలేదు కానీ, ఈ ప్రాంతం ఇండియాతో ఉంటే కోల్‌కతాలో ముస్లింల ప్రాబల్యం పెరుగుతుందని పాకిస్థాన్‌కు అంటకట్టారు. రేపటి భారత్‌లో హిందువుల ఆధిపత్యమే పునాదిగా దేశవిభజన జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.
గాంధీ, నెహ్రూల కుల రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు. కుల రాజకీయాలు కాంగ్రెస్‌ పుట్టకలోనే ఉన్నాయి. గాంధీ ప్రకారం అంటరానితనానికి కులానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కానీ అంబేద్కర్‌ కులసమస్యను లేవనెత్తినప్పుడు అగ్రకుల హిందువులంతా ఏకమై అతని ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. గాంధీ దృష్టిలో అంటరానితనం పాపమే కావచ్చు కానీ, అది ఆమరణ దీక్ష చేయాల్సినంత నైతిక సమస్య కాదు. కానీ అంటరాని వాళ్లకి ప్రత్యేక నియోజకవర్గాలు మంజూరు చేయటం మాత్రం ఆయనదృష్టిలో చాలా తీవ్రమైన సమస్య వాటికి వ్యతిరేకంగా ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టడానికి సిద్ధం. అగ్రకుల హిందువుల ఒత్తిడికి, గాంధీ బ్లాక్‌మెయిలింగ్‌కు పూనా ఒప్పందం సమయంలో లొంగి పోయినందుకు అంబేద్కర్‌ తను చనిపోయేవరకు బాధపడ్డారు.
వలసవాద వ్యతిరేక ఉద్యమ రూపంలో హిందూయిజం, అగ్రకుల తత్వం బలంగా తన ఆధిపత్యాన్ని సాధించుకుంది. అందుకే స్వతంత్ర భారతంలో మత మైనార్టీలు, అణగారిన కులాలు, ఆదిమ జాతులు భయంకరమైన అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయి. రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని లిఖించుకున్నారు, కానీ రాజ్యాంగంలో హిందువులకు తప్ప మరే మతస్థులకు రక్షణ లేదు. హిందూ అణగారిన కులాలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డురాదు. కానీ ముస్లిం, క్రిష్టియన్‌ మతాల్లోని పేదలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డువస్తుంది. అంటే హిందూ మత రక్షణ మన రాజ్యాంగంలో బహిరంగంగానే దాగి ఉంది. ఎందుకు ఒక్క ముస్లిం కూడా ఇండియన్‌ రక్షణ పరిశోధన సంస్థల్లో లేరు? కానీ నేపాల్‌కు చెందిన గూర్ఖాలు ఆర్మీలో ఉండవచ్చు. ఎందుకు కాశ్మీరులోని ముస్లింల మీద, ఈశాన్య రాషా్ట్రల్లోని క్రిష్టియన్‌ ఆదివాసుల మీద నిరంతరం నరమేధం నడుస్తుంది? ఎందుకు ఈ దేశ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి? ఈ దేశ అగ్రకుల మేధావి వర్గం ఎందుకు ఈ హింస గురించి మాట్లాడదని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది.
- డాక్టర్‌ భంగ్యా భూక్యా
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
Andhra Jyothi Telugu News Paper Dated: 26/10/2014 

Wednesday, October 15, 2014

ఈ తరం దళిత సాహిత్యానికి ఆద్యుడు కుసుమ ధర్మన్న By డాక్టర్‌ కత్తి పద్మారావు


Posted on: Wed 15 Oct 00:58:14.626015 2014

                 సాహిత్యం బలహీనతను పెంచకూడదు. సాహిత్యం మార్పుకు దోహదం కావాల్సిఉంది. ఒక్కొక్కపాట ఒక జాతికి మేల్కొలుపుగా నిలిచింది. పాట కొన్నిసార్లు ఉద్యమాల నుంచి పుడుతుంది. కొన్ని సార్లు జీవితం నుంచి పుడుతుంది. పాట కొన్ని సార్లు ప్రేమ నుంచి పుడుతుంది. పాట తిరుగుబాటు బావుటా అవుతుంది. పాటలు మాటల మూటలేకాదు, అవి జీవితాన్ని సంచలన భరితం చేస్తాయి కూడా.
                 స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగు నేలను ఒక ఊపు ఊపిన దళిత కవి కుసుమ ధర్మన్న. మాకొద్దీ తెల్లదొరతనం అని ఒక పక్క మోగుతుంటే కుసుమ ధర్మన్న మా కొద్దీ నల్లదొరతనమని ఈ నల్లదొరలను నిలవేశాడు. సామాజిక ఆధిపత్యం ఉన్న కులాలకు రాజ్యాధికారం వస్తే దోచుకోవడం తప్ప మరొకటి ఉండదని నిగ్గు తేల్చాడు. జాతీయోద్యమం కాలంలో ఉన్న భూస్వామ్య, కులాధిపత్య, అస్పృస్యతలతో నలిగిపోతున్న దళితుల దుర్భర జీవితానికి తన పాటలతో అద్దం పట్టిన మహాకవి. కుసుమ ధర్మన్న లయాత్మకమైన తన పాటల్లో తెలుగు సామాజిక జీవనాన్ని దృశ్యీకరించాడు. ఇప్పటికీ గ్రామాల్లోని పెత్తందారీతనం గుట్టును బట్టబయలు చేశాడు. గుర్రం జాషువా కవికి, బోయి భీమ్మన్నకు స్ఫూర్తినిచ్చాడు. మహాకవి కుసుమ ధర్మన్న తన పాటల్లో తెలుగు పదాలు జాలెలు పోశాడు. పదాల్లో వాస్తవాలను, పదాల్లో ఆగ్రహాన్ని, పదాల్లో బతుకుని, పదాల్లో పెత్తందార్ల స్వభావాన్ని ఎండగట్టాడు.
పన్నెండు మాసాలు పాలేరుతనమున్న /పస్తులుబడుచు బతు కాలండి/ఆలి కూలీజేసి తీరాలండి/పిల్లగాడూ పశువుల గాయాలండి ి/పగలు రేయీ పాటుపడ్డానండి/కట్ట గుడ్డా-గూడూ గిట్టదండి/రోగమొస్తే ఆనగ దప్పదండి/అప్పు తీరదీ చిత్రమేమండి/ఈ నిప్పుపైనిక మేము నిలువలేమో తండ్రి/మాకొద్దీ నల్లదొరతనము /దేవ-కనికారము లేక కడుపుమాడ్చే రండి/మాకొద్దీ నల్లదొరతనము-బాబు /మాకొద్దీ నల్లదొరతనము-దేవ/పదిమంది తోపాటు పరువు గలుగకయున్న/మాకొద్దీ నల్ల దొరతనము/పాడిపంటలు మేము కూడబెడితె వారు/కూర్చోని తింటామంటారు/నాములిచ్చి నట్టేట ముంచేరు/యెంచి అప్పునప్పు బెంచుతారు /చెంపగొట్టి కంపలాగు తారు/కోర్టుకెక్కించి కుంగదీసేరు/చీలదీసి కులము చెరుపుతారు/దేవ కూడు గుడ్డ కొంప లేకుండ జేసేరు/మాకొద్దీ నల్లదొర తనము/మాలా మాదిగలంటే మండిపడిపోతారు/ఊరి వెలుపనున్న పూరిగుడిసెలె గాని/బారి కొంపలు మాకు లేవు/గాలి వెలుగు సుంత తొంగిరాదు/ సారమైన కూర కూడు లేదు/కోరికట్ట కోక పంచలేదు/నల్లపూస పుస్తె నగదు లేదు/ దున్ని తినగ పొలము దొడ్డిలేదు/దేశమందారికి మేము చేదు/మా దారిద్రియము జూడ దయపుట్టగారాదు.
                 ఈ పాటలో ధిక్కార స్వరముంది. సమాజ నిజ స్వభావం ఉంది. ఇందులో వాడిన పదజాలం పన్నెండు మాసాలు, పాలేరుతనం, పస్తులు, ఆలికూలి, పిల్లగాడు, గిట్టదు, ఆనగ, నిప్పుపై, పాడిపంటలు, నాము, నట్టేట, చెంపగొట్టి, చీలదీసి కులము, గాలి, వెలుగు, సుంత తొంగిరాదు, సారమైన కూడు కూడలేదు. నల్లపూస పుస్తే నగదు లేదు. దారిద్య్రము, దయాపుట్టగరాదు. ఇందులోని పదాలు, వాక్యాలు మనల్ని కదిలిస్తాయి. సామాజిక జీవన వాస్తవాలను చారిత్రక గతిలో నుంచి చూపిస్తాయి. తెలుగు సామాజిక చరిత్రను ఆనాటి నుంచి ఈనాటి వరకు అర్థం చేసుకొనాలన్నపుడు ఈ పాట నేర్చుకోవడం తప్పనిసరి. దీన్ని బుర్ర కథల్లోను, జెముకుల కథలోనూ కూడా పాడతారు. శృతిబద్ధమైన లయనిబద్ధతే కాక ప్రశ్న, నిలవేయడం, నిజాన్ని చెప్పడం, జీవనగాథను హృదయార్ద్రంగా పాడటం ఇందులోని గొప్పతనం. కరుణరస ప్రధానమైన ఈ పాటలో ద్వితీయార్ధంలో ఎంతో తిరుగుబాటు కూడా ఉంది. సామాజిక విప్లవ నినాదంగా ముందుకు నడిచిన ఈ పాట గుండె నిప్పును మండిస్తుంది. ఒక జాతిని అంటరానివాడుగా చేసి తమకు జీతగాళ్ళుగా, పాలేరులుగా మార్చుకొని వారి శ్రమకు అంటులేకుండా దోచుకొని వారిని అంటరానివారుగావించిన వైనం ఆ పాటలోనే చూడండి.
ఒంటినిండ గుడ్డెందు కంటారు/గోచిగుడ్డ కర్రే గోటంటారు/చుట్టు గుడిసె చాలా సుఖమంటారు/గంజికూడే గుంజు బలమం టారు/దేవ-నోరులేదని మమ్ము దూరాన గెంటేరు/ఆకలిచిచ్చూచేత అడలి చచ్చినగాని /యన్న సత్రము మాకులేదు/నోరుయెండి దోరిన నీరు లేదు/కుడువ పూటకూళ్ళు గానరావు/యెక్క బండి వక్కటైనరాదు/మొక్క దేవుడొక్కడైన లేడు/శ్రమను దీర్చ సత్రమొకటి లేదు/భ్రమలు దీర తాగ బావి లేదు/మేము మనుషులనూ మాట మరచిపోయారండి/మాలమాలని చాలా తూలనాడి మమ్ము/ అంటరాదని గెంటుతారు /ఆసుపత్రి మందుల డుగుతారు /మాల మందూలు చాలా తాగేరు/మాల చనుబాలు మందుకడిగేరు /మాలపొత్తులేక మసలలేరు/మామేలు మెప్పుపొంది మేకై తిరుగుతారు /కుక్క నక్కలకంటె తక్కువగా జూచి/నిక్క తక్కి నిగుడుతారు /సాని ప్రక్కజేర సాగుతారు /కుష్టురోగి సరస కూర్చుంటారు/కుక్క కోతిని కోరి పెంచేరు/పిల్లి పిట్టాల ప్రేమించుతారు /పందిగున్నాల బాధింపరారు/కాకి నీటిని తాకనిస్తారు/మమ్ము దరికి చేరునీరు దడదడ తిట్టేరు.
            ఈ రెండో భాగంలో పాట పాటగానే గాక పశ్న్రలు వెల్లువలా పొంగాయి. పాటలో నాటకీయత, సమాజాన్ని నిలవేసిన తిరుగుబాటు తత్వం, నిజమైన స్వాతంత్య్ర నినాదం మనకు కనిపిస్తుంది. ఈనాడు ఈ పరిస్థితి కోస్తా ఆంధ్రాలో ఎన్నో ఉద్యమాల వల్ల మారినా, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, రాయలసీమలో కొనసాగుతూనే ఉంది. ఒక కవి వెయ్యి పేజీల్లోని సామాజిక చరిత్రను ఒక పాట ద్వారా మనకు చెప్పాడు. పాట పాడుతున్నప్పుడు కనుకొలకునుల్లో నీరు తిరిగి పీడిస్తున్నవాడు కూడా ఇది తప్పే అనే మార్పుకు గురికావాల్సి ఉంది. ఎందరో భూస్వాముల, కులస్వాముల పిల్లలు ఇలాంటి సాహిత్యం వల్లే మారారు. సాహిత్యం బలహీనతను పెంచకూడదు. సాహిత్యం మార్పుకు దోహదం కావాల్సిఉంది. ఒక్కొక్కపాట ఒక జాతికి మేల్కొలుపుగా నిలిచింది. పాట కొన్నిసార్లు ఉద్యమాల నుంచి పుడుతుంది. కొన్ని సార్లు జీవితం నుంచి పుడుతుంది. పాట కొన్ని సార్లు ప్రేమ నుంచి పుడుతుంది. పాట తిరుగుబాటు బావుటా అవుతుంది. పాటలు మాటల మూటలేకాదు, అవి జీవితాన్ని సంచలన భరితం చేస్తాయి కూడా. పాటలో లాలిత్వం ఎంత ఉందో ధిక్కారం అంతే ఉంది. పాట తేనెల ఊట,దానికి కొంచెం రాగశుద్ధి, భావశుద్ధి కలిగిస్తే అది మెదడును, హృదయాన్ని ఒకేసారి కదిలిస్తుందనటంలో సందేహంలేదు. దళిత పాట తెలుగు సాహిత్యానికి ధికార స్వరాన్నిచ్చింది. కుసుమ ధర్మన్న ఈ తరం దళిత కవిత్వానికి ఆద్యుడు. ఆయన పాట ఒక ఉద్యమం. ఉద్యమాల్లో నుంచి వచ్చిన పాటలు, కవితలు సమాజాన్ని ఉత్తేజపరచటమే కాక చారిత్రక మలుపుకు మైలురాళ్ళుగా నిలుస్తాయి. జాతీయోద్యమ కాలంలో వర్గాధిపత్యాన్ని ఎదిరించే వాళ్ళు, కులాధిపత్యాన్ని ఎదిరించే వాళ్ళు తమ గొంతుల్ని, తమ అస్దిత్వాల్ని ఆనాడే ప్రకటించారు. కులాధిపత్యం, మతోన్మాదం, వర్గాధిపత్యం పునాదులన్నీ ఒక పాదులోనే ఉండడం వల్ల ఎదిరించే శక్తులు కూడా మిత్రత్వానే కలిగి ఉన్నాయి. కుసుమ ధర్మన్న దళిత అస్తిత్వ సాహిత్యాన్ని జాతీయోద్యమ కాలంలో ఉక్కు కంఠంతో వినిపించినవాడు. ఈనాటి దళిత కవులకు స్ఫూరి కుసుమ ధర్మన్న.

(వ్యాసకర్త సామాజిక ఉద్యమ నేత)

Prajashakti Telugu News Paper Dated : 15/10/2014 

Monday, October 6, 2014

బహుజన గీతాకారుడు - డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు

ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు.
మట్టి నవ్వితే పరమాన్నం
నిప్పు నవ్వితే వెలుతురు
నీరు నవ్వితే చైతన్యం
నింగి నవ్వితే తొలకరి
గాలి నవ్వితే ఊపిరి


ఈ పంచ నవ్వుల పరమార్థాలను కలగలిపి ఒకచోట రాశి పోస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ‘పైడి’ సాహిత్యంలా ఉంటుంది. నిద్రను నిట్టనిలువునా నరికే వైతాళిక గానం ఎలా ఉంటుంది? వేటగాడి గుండె జారిపోయే సింహనాదం ఎలా ఉంటుంది? నాలుగు పడగల హైందవ నాగరాజు కోరలు పీకే పౌరుషం ఎలా ఉంటుంది? సామ్రాజ్యవాదం పొగరణిచే సాహసం ఎలా ఉంటుంది? గొడ్లు కాసే పిలగాడి పిల్లంగోవి రాగం ఎలా ఉంటుంది? అన్నింటికీ మించి అంబేద్కర్‌ పల్లవైన పాటకు ఆపకుండా చిందేస్తే ఎలా ఉంటుంది? అమ్మతోడు తెరేష్‌బాబు కవిత్వంలా ఉంటుంది. సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యామ్నాయ భావవిస్ఫోటనం పైడి తెరేష్‌బాబు. అక్షరాలను చండ్ర నిప్పు కణికల్లా మార్చి, మాటలను మర ఫిరంగుల్లా పేల్చి, కవితా వాక్యాల్ని కరెంటు తీగల్లా తీర్చి, నడుస్తున్న కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ప్రసరించిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు తెరేష్‌బాబు. దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం లేదని సోకాల్డు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు, దళిత కవులకు వచన కవిత్వమెందుకని ఘనత వహించిన కవిపుంగవులు నోరుపారేసుకుంటున్నప్పుడు, రెప్పపాటులోనే ‘దళితవాదం’పై సవాలక్ష దాడులు జరుగుతున్నప్పుడు ఈ సంక్లిష్ట సందర్భంలో తెరేష్‌ బాబు సరైన జవాబుగా నిలబడ్డాడు. ‘రాత మాకు కొత్తకాదు/ మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనపుడు/ మేం నేలతల్లి గుండెల మీద పైరు పద్యాలమయ్యాం/ మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగితప్పడవలైనపుడు/ మేం కర్మాగారపు నెన్నొసట లోహలిపులమయ్యాం/ మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయ్యింది.’’ (నిశాని) అంటూ ‘పైడి’ దళిత పులిలా గాండ్రించి, సాంద్రతరమైన, తాత్విక సమన్వితమైన కవిత్వానికి సంకేతంగా భాసిల్లాడు. సంగీత, సాహిత్య కళా రంగాల్లోను, టి.వి. రేడియో వంటి దృశ్యశ్రవణ మాధ్యమాల్లోను తెరేష్‌బాబు పట్టిందల్లా బంగారమయింది. కవిత, కథ, నాటకం, పాట, గజల్‌ వంటి ప్రక్రియల్లో ఆయన రాసింది రత్నమయింది. ‘నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను/ నువ్వే ఒక మహా ఆయుధానివన్న స్పృహను నీచేతిలో పెట్టడానికొచ్చాను’ అని తెలుగు పాఠకుడి చేతిలో చేయివేసి బాస చేసిన తెరేష్‌బాబు మహత్తరమైన ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి మూడు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానాన్ని ముగించుకొని సెప్టెంబర్‌ 29 సాయంత్రం నేలతల్లి గుండెల్లో కలిసిపోయాడు. కవన నక్షత్రమై గగనమెక్కాడు. పైడి తెరేష్‌బాబు జీవిత సాహిత్య గ్రంథపుటలను తిరగేస్తే కొండంత స్ఫూర్తి కలుగుతుంది.
గాయకుడైన తండ్రి శాంతయ్య ప్రేరణతో, ఒంగోలు కళావాతావరణ ప్రభావంతో బాల్యంలోనే సంగీత సాధనచేసి 14 సంవత్సరాల వయస్సులోనే తెరేష్‌బాబు తబలిస్టుగా పేరు ప్రఖ్యాతులందుకున్నాడు. సాంఘీక, పౌరాణిక నాటకాలకు, పాటకచేరీలకు వాద్య సహకారమందిస్తూ ఆ చిరుసంపాదనతో తన నిరుపేద కుటుంబానికి అండదండలందించాడు. డా. ధారా రామనాథ శాసి్త్ర, పింగళి పాండురంగారావు లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంలో, వర్ధమాన సమితి, ఎఱ్ఱన పీఠం లాంటి సాహిత్య సంస్థల వెలుగు జాడ ల్లో తెరేష్‌బాబు తన సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. పైడిశ్రీ కలం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా రచనలు చేస్తూ కవిగా, నాటక కర్తగా, ప్రయోక్తగా తెరేష్‌బాబు అతి చిన్నవయస్సులోనే ఎంతో పరిణితి సాధించి ఉద్దండ పండితోత్తములకు గుండెల్లో గుబులు పుట్టించాడు. 
‘చీకటి శక్తుల పతనం కోసం/ చేస్తున్నా ఇదిగో శరసంధానం/ ఈ చైతన్య యాగంలో అయితే కాని ప్రాణం పతనం’ అంటూ తన సృజన లక్ష్యాన్ని ప్రకటిస్తూ తెరేష్‌బాబు శరసంధానం (1985) కవితా సంపుటి వెలువరించి ‘పెన్ను’ తిరిగిన సాహితీవేత్తల ప్రశంసలందుకున్నాడు. ‘సముజ్జ్వల కాంతిమతి’, ‘చిరంతన గీతికాస్మృతి’, ‘ఊహావిరచిత రసానందకృతి’, నిశాంత ధీనిధా, ‘గ్రీష్మ నిక్షిప్తాంగ ఘర్మధార’; చక్రడోలా విహారం, తరళ పరి మళ కిరణం లాంటి సంస్కృత సమాస భూయిష్ఠ పద ప్రయోగ శైలి ‘శరసంధానం’ కవి త్వంలో ఆద్యంతం తొణికిసలాడుతుంది. కారంచేడు, చుండూరు సంఘటనల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో వెల్లువెత్తిన ఆత్మగౌరవ పోరాటాలతో దళితవాద చైతన్యం దశ దిశలా వ్యాపించింది. దళిత సాహిత్య ఉధృతి వేగవంతమయింది. ఈ నేపథ్యంలో పైడిశ్రీ సాహిత్య ప్రస్థానం ఒక గుణాత్మకమైన మలుపు తిరిగింది. అప్పటి వరకూ శ్రీశ్రీ శాబ్దిక మహేంద్ర జాలంలో, తిలక్‌ అనుభూతివాదంలో మునిగితేలుతున్న పైడిశ్రీ జనరల్‌ సాహిత్య ఒరవడిని విడిచిపెట్టి నిర్దిష్టమైన ఎరుకతో తన సామాజిక అస్తిత్వ మూలాల ను తడుముకోవటం ప్రారంభించాడు. లౌకిక వాస్తవాల్ని అలౌకిక స్వప్నాలుగా వక్రీకరించే సాహిత్య నైజాన్ని తెరేష్‌ బాబు సమూలంగా తిరస్కరించాడు.
ఇలాంటి తిరస్కారంతో, ధిక్కారంతోనే ఆయన నిశాని అనే సంచలనాత్మక కవిత రాశాడు. మద్దూరి నగేష్‌ బాబు, జి. లక్ష్మీనరసయ్య (వరదయ్య) ఖాజా లాంటి తాత్విక బంధువులతో కలిసి తెరేష్‌బాబు వెలువరించిన ‘నిశాని’ కవిత దళితవాద చర్చోపచర్చలకు కేంద్రబిందువై వర్త మాన సాహిత్యాన్ని కదిపి కుదిపివేసింది. 
కేవలం దళిత కవిత్వంలోనే కాకుండా మొత్తం వచన కవిత్వంలోనే తెరేష్‌బాబు అల్పపీడనం (1996) సంకలనం విశిష్టమైనదని విమర్శకులు అంగీకరించారు. ‘అల్పపీడనం’లోని ‘ఏడుకట్ల సవారి’; ‘బండి చక్రం మీద ఈగ’ లాంటి కవితల ద్వారా తెరేష్‌బాబు దళిత ఉద్యమ నిశ్శబ్దాన్ని ఎత్తిచూపాడు. ‘శస్త్ర చికిత్స చేయడం ఉద్యమం/ కాకుల్ని కొట్టి గద్దలకేసే ఫార్మూలాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం’ అంటూ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పాడు. అందరిలాగా గాయాన్ని ఫోటో తీయడం ఈ కవికి చేతకాదు. కష్టపడైనా సరే గాయాన్ని ఎక్స్‌రే తీస్తాడు. అందుకే ‘అల్పపీడనం’లో గాయం తాలూకూ చీమూ నెత్తురులు కనిపించవు. గాయానికి కారణమైన వ్యవస్థ స్వరూప స్వభావాలను పాఠకుడి మనసుపై కవి స్పష్టంగా ముద్రిస్తాడు. తద్వారా పాఠకుడు దేన్ని ఎటాక్‌ చేయాలో తెరేష్‌బాబు సూచిస్తాడు. ‘ఐదోతనం’; ‘కుక్క కరిచిన వార్త’, ‘మట్టి బలపం’ వంటి కవితల్లో తెరేష్‌ స్ర్తీవాద చైతన్యాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు. ‘వాడి తొడల తీట సద్దుమణగటానికి/ కావల్సింది కండరాల చీలిక మాత్రమే’ అంటూ సజ్జెలగూడెం మాదేవమ్మపై జరిగిన అత్యాచారాన్ని రెండు మాటల్లో తెరేష్‌ బాబు ప్రతిభావంతంగా ఆవిష్కరించాడు. ‘పొద్దుపొడవటం ఆలస్యం/ వంటిళ్ళ మీద వర్షించి ఆహార పంటలౌతూ/ పొద్దు గూకటం ఆలస్యం కండరపు నాగేళ్ళు దిగమింగి కడుపు పంటలౌతూ’ అని స్ర్తీలెదుర్కొంటున్న రోజువారి హింసను అక్షరాల్లో తర్జుమా చేశారు. ఉత్పత్తిని, పునరుత్పత్తిని ఇంత ఆర్ద్రంగా కవిత్వీకరించిన దాఖలాలు స్ర్తీవాద సాహిత్యంలో లేవు.
పైడి తెరేష్‌బాబు అత్యుత్తమ ప్రయోగవాది. క్యాసెట్‌ రూపంలో ఆయన వెలువరించిన ‘హిందూ మహాసముద్రం’ తెలుగు దీర్ఘకవితల్లో అగ్రభాగాన నిలుస్తుంది. ‘దళిత సాంస్కృతిక రాజకీయ చైతన్యం పురివిప్పిన తరువాత వచ్చిన మొత్తం కవిత్వంలో ఈ శ్రవ్య కవిత అత్యుత్తమన శ్రేణికి చెందిందనవచ్చు. ఒక కవిత్వపరంగానే కాదు, చారిత్రక అవగాహన సాంస్కృతిక స్పహ విషయంలో కూడా ‘హిందూ మహాసముద్రం’ క్లాసిక్‌ లక్షణాలను సంతరించుకుంది’ అని యస్‌. రామకృష్ణ చెప్పిన మాట అక్షరాలా నిజం. ‘కుహనా సమైక్యతను పాడే సముద్రం నోట్లో కాండ్రించి ఉమ్మడానికి ఇంకా సందేహిస్తారే! ఇది పచ్చి దగా కోరు సముద్రం’ అంటూ హిందూ సామ్రాజ్యవాదంపై తెరేష్‌బాబు నిప్పులు కురిపించాడు. ‘యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం/ సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం’ అంటూ ప్రపంచీకరణ ప్రభంజనంలో కొట్టుకుపోతున్న గొర్రెల మందల్ని హెచ్చరించాడు తెరేష్‌బాబు. ఒక్క కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా అణువణువునూ ఆక్రమిస్తున్న పాలవన్నె విషం పట్ల జాగ్రత్త వహించమని హితవు పలుకుతాడు పైడి. అస్తిత్వ ఉద్యమాల ఉమ్మడి చైతన్యానికి అడ్డుకట్టవేస్తున్న హిందూ సామ్రాజ్యవాదం అమెరికన్‌ సామ్రాజ్యవాదాల పెను ప్రమాదాల తీరుతెన్నుల్ని ‘నాలుగో ప్రపంచం’ కవితా సంకలనం ద్వారా తెరేష్‌బాబు శిల్పసుందరంగా చాటిచెప్పాడు.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు. ప్రాణ స్నేహితుడిలా ప్రజాస్వామ్య పోరాటాలతో కరచాలనం చేశాడు. తెలంగాణ, దండో రా ఉద్యమాలకు మనసారా సంఘీభావం ప్రకటించాడు. ‘ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం/ కలిసి ఉంటే కలదు సుఖం/ దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం/ వేరుపడితే ప్రగతి సులభం’ (కావడి కుండలు) అంటూ సమైక్యవాద కుట్రల్ని త్రోసిరాజని, తెలంగాణ ప్రజల జీవనపోరాట సారాంశాన్ని నాలుగు పాదాల్లో ఉదాత్తంగా సూత్రీకరించాడు పైడి. అంతేకాకుండా ‘కుండల్లా విడిపోదాం, కావడి బద్దల్లా కలిసుందాం’ అనే చారిత్రాత్మక నినాదంతో తెలంగాణ సంఘీభావ కవిత్వానికి ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని అందించాడు. ఉన్నతమైన రాజకీయ దృక్పథం సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు డా. అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి/ తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య. జానపద గీతాల్లోని మౌఖిక ఛందోరీతులను తన కవితా నిర్మాణ పద్యాలతో మేళవించి సందర్భానుసారంగా తెరేష్‌బాబు వచన కవితా ప్రక్రియకు కొత్త నడకలు నేర్పాడు. ఒక్కొక్కసారి గజల్‌ నడకలను, ముక్తపదగ్రస్త శైలిని గమ్మత్తుగా సమన్వయపరిచి అపూర్వమైన రచనా శైలితో పాఠకుల్ని వశపరుచుకుంటాడు పైడి తెరేష్‌బాబు. అందుకే ఈ కవితా వీరబాహుడి శైలి సిరాల్లోకి ఇంకిపోకుండా, ఆపాదమస్తకం సిరల్లోకి ధమనుల్లోకి చొచ్చుకుపోతుంది. ‘చీకట్ల కత్తెరలో గొంతుక చిత్రంగా తెగిపోయినా/ నాకేమి కానట్టు/ నాదేమి పోనట్టు/ నవ్వుతూనే చేస్తాను నవగీతాలాపన’ అని సగర్వంగా ప్రకటించిన పైడి మృత్యువుతో పోరాడుతూ కూడా నిన్న మొన్న చుండూరు తీర్పుకు వ్యతిరేకంగా నేతిబీరకాయ లాంటి న్యాయస్థానాలపై అక్షరాల పిడుగులు కురిపించాడు. వార్తలకు, భక్తికి, సంగీతానికి, పర్యావరణానికి ఉన్నట్టే సాహిత్యానికి కూడా ఒక ప్రత్యేక చానల్‌ నెలకొల్పిన వాళ్ళే 21వ శతాబ్దపు వైతాళికులని దార్శనిక దృష్టితో పిలుపునిచ్చాడు. అందుకోసం పరితపించాడు. అందుకే పైడి తెరేష్‌బాబు 21వ శతాబ్దపు వైతాళికుడు. సాహిత్యంలో విజేతగా అందరి మన్ననలందుకున్న తెరేష్‌బాబు మద్యానికి బానిసయ్యాడు. ప్రమాదకరమైన ఈ మద్య బానిసత్వం నుండి దళిత బహుజన కవులు బయటపడకపోతే జాతి తీవ్రంగా నష్టపోతుంది. 
- డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు
9440480274

Andhra Jyothi Telugu News Paper Dated : 06/10/2014 

Thursday, September 25, 2014

చెదిరిన ప్రజాస్వామిక తెలంగాణ స్వప్నం By నలమాస కృష్ణ


తెలంగాణ ప్రజల సుదీర్ఘమైన పోరాటం ఫలితంగా రాష్ర్టం ఏర్పడిరది. పోలవరం ప్రాజెక్టువంటి అమానవీయమైన అప్రజాస్వామిక ప్రాజెక్టుతోపాటు అనేక షరతులు విధించడానికి కాంగ్రెస్‌, బిజెపి సహా అన్ని పార్టీల పాత్ర ఉంది. భౌగోళికంగా అసంపూర్ణమైన షరతులతో కూడిన తెలంగాణ ఏర్పడిరది. తెలంగాణ రాష్ర్టంలో తెలంగాణ రాష్ర్ట సమితి అధికారంలోకి వచ్చింది. 60 సంవత్సరాల కోస్తాంధ్ర దోపిడీ పాలనకు ప్రత్యామ్నాయమైన ప్రజాపాలనను అందిస్తామని వాగ్దానం చేసిన టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండునెలలు అయింది. అధికారంలోకి వచ్చి కేవలం 3 నెలల్లో ప్రభుత్వం పూర్తి ఆచరణను సమీక్షించడం సాధ్యంకాదు. కానీ అది చేపడుతున్న కార్యక్రమాలు, రూపొందిస్తున్న విధానాలు, కోస్తాంధ్ర పాలకులు అనుసరించిన అభివృద్ధి, అణచివేత నమూనాకు భిన్నంగాలేవు. గత 60 ఏండ్లలో తెలంగాణలో జరిగిన దోపిడీ, విధ్వంసం, వివక్ష, అణచివేత, పౌర, ప్రజాస్వామిక హక్కుల హననం, హత్యాకాండ, భూమి సమస్య, విద్య, వైద్యం, పారిశ్రామిక విధానం మొదలైన మౌలిక అంశాలపై ప్రభుత్వ అవగాహన-విధానాలు స్థూలంగా స్పష్టం అయినాయి.రైతుల రుణ మాఫీతోపాటు ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన ప్రతి అంశానికి టిఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందంటూ- మొదటి క్యాబినెట్‌ సమావేశం అనంతరం 40కి పైగా నిర్ణయాలు కెసిఆర్‌ ప్రకటించారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలుపరచడం అధికార పార్టీ బాధ్యత.

తెలంగాణలో ఆదివాసులు, దళితులు, సబ్బండ కులాలు ఒక్కటై ఉద్యమించింది ఈ ప్రాంత పీడితప్రజల విముక్తి కోసమే. నేటి తెలంగాణ ఉద్యమం కూడా దోపిడీ, పీడన, వివక్ష, అణచివేత లేని ప్రజాస్వామిక తెలంగాణను కోరుకుంటోంది. కోస్తాంధ్ర, రాయలసీమ దోపిడీవర్గం పోయి ఆ స్థానాన్ని తెలంగాణ బూర్జువా వర్గం ఆక్రమించడాన్ని తెలంగాణ ప్రజలు ఏమాత్రం అంగీకరించరు. తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమ, విద్యార్ధి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మహిళా, మైనార్టీ, కుల సంఘాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రభుత్వ నిర్ణయాలు రెండు ప్రజానుకూలం, నాలుగు వ్యవతిరేకం అన్న విధంగా తయారు కావడం తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం విధించిన షరతులైన ఉమ్మడి రాజధాని, గవర్నర్‌ పాలన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైన అంశాలను- టిపిఎఫ్‌ మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. బిజెపి నేత మోడీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంతంపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టుకున్నారు. పోలవరం డిజైన్‌ మార్పు అంటూ ద్వంద్వ విధానాలు కొనసాగిస్తూ ఆదివాసుల అంతానికి పరోక్షంగా సహకరిస్తున్న టిఆర్‌ఎస్‌ వైఖరి క్షమార్హం కాదు. గరవ్నర్‌కు విశేష అధికారాలు కట్టబెడుతూ కేంద్రం జులై 4న కేంద్రం లేఖ పంపింది. ఇది తెలంగాణ రాష్ట్రానికున్న అధికారాలను, హక్కులను కేంద్రం హరించడమేనని గర్జించిన టిఆర్‌ఎస్‌ అందుకు చేపట్టిన కార్యాచరణ ఏమీలేదు. పైగా వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్‌ దౌత్యంతో కొత్త రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. 

భారతీయ రాజకీయ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రజాస్వామికంగా ఉండవలసిన ఫెడరల్‌ సంబంధాలను కేంద్రం ఏకపక్షంగా అణచివేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా టిఆర్‌ఎస్‌ రాజీ వైఖరి అవలంభిస్తున్నది. ఆంక్షలను అడ్డుకోని టిఆర్‌ఎస్‌, కనీసం అధికారం దక్కినాక కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోతున్నది. హైద్రాబాద్‌పై సర్వాధికారాలు గవర్నర్‌కు కట్టబెడుతుంటే అడ్డుకోలేకపోయిన టిఆర్‌ఎస్‌ వైఖరి- దాని దళారీ బూర్జువా స్వభావానికి, అవకాశవాదానికి నిదర్శనం.తెలంగాణ ప్రజలను ఏ అభివృద్ధి నమూనా దశాబ్దాలుగా పీల్చి పిప్పి చేస్తున్నదో- అదే సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ అనుకూల అభివృద్ధి నమూనాను ప్రభుత్వం బహిరంగంగా, సగర్వంగా ప్రకటించింది. కేంద్రీకృతాభివృద్ధి సమాజ వినాశనానికి దారి తీస్తుందనేది అనుభవమే. ఓవైపు గ్రామ ప్రణాళిక అంటూనే మరోవైపు హైద్రాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధి దాటి దక్షిణ తెలంగాణను కలుపుకుంటూ మరో 60 కి.మీ. పరిధి అవతలి నుండి రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం ప్రతిపాదన చేశారు. దీనివల్ల దక్షిణ తెలంగాణ ఉనికే ఉండదు. హైద్రాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు సృష్టించిన విధ్వంసంనుండి సమీప ప్రాంతాలు కోలుకోలేకుండా అయినాయి. అశాస్త్రీయంగా నగరాల వృద్ధి శాశ్వత సమస్యలకు దారితీస్తుంది. పెద్ద నగరాలు దోపిడీ కేంద్రాలవుతాయి. అనివార్యంగా వలసలకు ప్రోత్సాహం లభిస్తుంది. తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పడే శ్రామిక జీవితాలు దుర్భరంగా మారుతాయి.

పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను దుర్భర దారిద్య్రంలోకినెట్టే పథకానికి మరోపేరే నగరీకరణ-సుందరీకరణ. దీన్ని ప్రోత్సహించడమంటే ప్రపంచ బ్యాంక్‌ కార్యక్రమాన్ని అమలు చేయడమే. కోటిన్నర జనాభాతో హైద్రాబాద్‌ నగరాన్ని నిర్మించాలనే కోరికలో శాస్త్రీయత, హేతుబద్ధత లేదు.ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, ఇన్వెస్‌‌టమెంట్‌ రీజియన్‌గా హైద్రాబాద్‌ను ప్రకటించడం, ఎగుమతుల ఆధారిత ఫార్మా ఇండస్ట్రీని నెలకొల్పడమంటే రాజధాని నగరాన్ని ఎమ్‌ఎన్‌సిలకు అప్పగించడమే. పారిశ్రామిక విధానం వ్యవసాయాధారితమైనదిగా ఉండాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వవిధానం ఉంది. వ్యవసాయ ఆధారితమైన పారిశ్రామిక విధానం చేపడ తామని టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో హామీ యిచ్చింది. కాని ఆచరణలో ఐటి ఎగుమతులు, మందుల కంపెనీల ఎగుమతుల కోసం ప్రపంచబ్యాంక్‌ సిఈవో పాత్రను కెసిఆర్‌ స్పష్టంగా నెత్తికెత్తుకున్నారు. సామ్రాజ్యవాద, బహుళజాతి కంపెనీల ప్రతినిధులకు తెలంగాణ నిత్య దర్శమ కేంద్రంగా మారింది. అజిమ్‌ ప్రేమ్‌జీ, అనిల్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, టాటా, జిందాల్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, మైక్రోస్టాఫ్‌ యిండియా చైర్మన్‌ భాస్కర్‌ ప్రామాణిక బడా బడా తిమింగలాలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నారు. నాడు రాజశేఖర్‌ రెడ్డి, అంతకు పూర్వం చంద్రబాబు నాయుడు కంటే వేగంగా బడా పెట్టుబడులను ఆకర్షించే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమెంది. దీని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో గత అనుభవాల నుండి అర్థం చేసుకోవచ్చు.

ప్రతి పేద రైతుకు, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అని ప్రభుత్వం ప్రకటిం చింది. తెలంగాణలో ఉన్న మిగులు భూమి ఉన్నదెంత? భూస్వాముల చేతుల్లో ఉన్నదెంత? ప్రభుత్వ భూమి ఎంత? ఇప్పటికీ స్పష్టమైన గణాంకాలు ఏవీ లేవు. జిల్లాకు ఒక్కరిద్దరికి భూమి పట్టాలిచ్చి ఇదే ప్రపంచంలో గొప్ప విప్లవం అంటూ తమకు తామే కితాబులిచ్చుకోవడం, అందుకు కొంతమంది ప్రభుత్వ ఆస్థాన మేధావులు భజన చేయడం తెలంగాణ రాష్ట్రంలోనే చెల్లింది. భూమి సమస్యను తరతరాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని దోపిడీ వర్గ ప్రభుత్వాలు ఎంతమేరకు చూపించగలవో 60 ఏండ్ల భారతదేశ చరిత్రలో జరిగిన భూపంపకాలు, భూసంస్కరణ చట్టాలు నిరూపించాయి. అయినా తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలుచేయించుకోవడం ప్రజల బాధ్యత. దళితులకు భూ పంపిణీతో పాటు సమాజంలో 90 శాతం భూమిలేని రైతుకూలీలకు సంబంధించిన సమస్య పరిష్కరించడమే భూమి సమస్యకు నిజమైన పరిష్కారం. 

గోల్కొండ ఖిల్లాపైన జెండా ఎగరేసి నలుగురికి పట్టాలిచ్చారు. 2004 మావోయిస్టు చర్చల ఫలితంగా రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన కుహనా భూ పంపిణీ కార్యక్రమంవలె ఇది కావద్దంటే భూసేకరణ పంపకం శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. దున్నేవాడికే భూమి ప్రాతిపదికన ఈ ప్రభుత్వం భూ పంపకం ఎలాగూ చేయలేదు. కనీసం చట్టబద్ధంగానైనా భూ గరిష్ఠ పరిమితి చట్టాలు అమలు చేయవచ్చుగదా! కాని దళితులకి భూ పంపకం గొప్ప విప్లవమని ప్రజలను మభ్యపెడుతూ- 2000 ఎకరాలు రాజకొండ ప్రాంత భూములను సినిమా పరిశ్రమకు కేటాయించారు. లక్షల ఎకరాలు పరిశ్రమల అధిపతులకు కట్టబెట్టడానికి సర్వే చేయించారు. కాని 80 గజాల యింటి స్థలం కూడా లేని పేదవాని గురించి ఆలోచించే అవసరం ప్రభుత్వానికి లేకుండా పోయింది.భూ అక్రమాలపై సమీక్ష జరపాలనేది తెలంగాణ ఉద్యమంనుంచి వచ్చిన డిమాండ్‌. ప్రభుత్వ నిర్ణయం విధానపరంగా సరైనదే. కానీ అక్రమార్కుల చిట్టా విప్పడం తిమింగలాల నుండి ప్రారంభం ఎందుకు కాలేదో ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. యన్‌ కన్వెషన్‌ గురుకుల్‌ ట్రస్టు భూముల అక్రమాలపై చూపించిన ప్రతాపం బడా అక్రమార్కులపై ఎందుకు చూపించడంలేదు? తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసుల ఎత్తివేతకు 2001 డెడ్‌లైన్‌ విధించింది ప్రభుత్వం. కానీ, అంతకుముందు 1995 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ కొరకు పోరాడినవారి కేసులు సంగతి ఏమిటి? కేసుల ఎత్తివేతల గురించి అధికారిక ఉత్తర్వులు నేటికీ రాలేదు.

ప్రక్క రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిపై చంద్రబాబు కేసులు ఎత్తివేశారు. కేసుల ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనది. స్వాతంత్య్రోద్యమంలో నిజాయితిగా పోరాడిన వారు బ్రిటిష్‌ వలస పాలన అనంతరం కూడా జైళ్లల్లో మగ్గారు. ఆ రకమైన చరిత్రనే పునరావృతంచేస్తూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేటికి కేసులు ఎత్తివేయకపోగా తెలంగాణ ప్రజలపై పరోక్ష, ప్రత్యక్ష నిర్బంధ, నిషేధాలను అమలుచేస్తున్నది. సిపిఐ(మావోయిస్టు)తో పాటు దాని అనుబంధ ప్రజాసంఘాలపై నిషేధాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వ విధానం స్పష్టంచేస్తుంది. చట్టాన్ని వ్యతిరేకించేవారిని చట్టవ్యతిరేక పద్ధతుల్లో హత్యలు చేస్తామని హైదరాబాద్‌ శివార్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ద్వారా రుజువుచేశారు. 
తెలంగాణ ఉద్యమానికి పాటలతో, మాటలతో, కార్యాచరణతో ఊపిరిలూదిన అనేక మందిని టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పొట్టన బెట్టుకున్నాయి. ప్రజాస్వామిక తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన బెల్లి లలిత, శ్రీకాంత్‌, అయిలయ్య, రవీందర్‌ రెడ్డి, కనకాచారి, సుదర్శన్‌, నల్లావసంత్‌, వనిపెంట వెంకటేశ్వర్లు మొదలుకొని- టిపిఎఫ్‌ అధ్యక్షులు ఆకుల భూమయ్య వరకూ, తెలంగాణలో జరిగిన ప్రతి హత్యపైన నిష్పక్షపాత దర్యాప్తుకు ఆదేశించి నిజాన్ని నిగ్గుతేల్చడం ప్రభుత్వ విధి. తెలంగాణలో ఆరు దశాబ్దాలుగా జరిగిన చట్ట ఉల్లంఘ నలు, అక్రమ కేసులు, నిర్బంధాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, నల్లదండు ముఠాల హత్యలపై ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈనాటికీ తెలంగాణలో అక్రమ అరెస్టులు, పోలీసుల వేధింపులు, నిర్బంధాలు, రాజకీయ భావాలకు అప్రకటిత నిషేధాలు నిత్యకృత్యంగా కొనసాగు తున్నాయి. విద్యార్థులపై హైద్రాబాద్‌లో జరిగిన లాఠీచార్జి, మెదక్‌ జిల్లా రైతాంగంపై జరిగిన లాఠీచార్జీలు ప్రభుత్వ పోకడ ఎటో స్పష్టం చేస్తున్నాయి

మహిళల స్వావలంబన కోసం కట్టుబడి ఉన్నామన్న పాలకులు మద్య రహిత తెలంగాణ బదులు మద్యం ఏరులు పారే ఎకై్సజ్‌పాలసీని చేపట్టారు. వరకట్నంగా 51 వేలు `సౌభాగ్యలక్ష్మి' పథకం ద్వారా అందిస్తామంటున్న ప్రభుత్వం, ఈ జనాకర్షణ నినాదం యిచ్చేముందు మహిళల స్థితికి కారణం అయిన వరకట్న దురాచారం కనీసం త…ప్పు అని కూడా అనడం లేదు. వరకట్న నిషేధచట్టం అమలుచేస్తామని అనగకపోగా, వరకట్నం చెల్లిస్తామంటున్నది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీకి, విద్యారంగంలో ఫీజు రీయంబర్‌‌సమెంటుకు వరకట్నానికి కూడా ప్రభుత్వానికి కనబడనంత స్పృహలేని స్థితి తెలంగాణ ప్రభుత్వానిది. హైదరాబాద్‌ చుట్టూ, తెలంగాణలో పట్టపగలు అర్ధరాత్రిఅనే తేడాలేకుండా మహిళలపై దాడులు, అత్యాచారాలు చాలా సాధారణ మైనాయి. వందలాది ఇన్నోవ కార్లు, హైఫై టెక్నాలజితో నేరాలను నిరోధిస్తామని, మహిళలకు రక్షణకల్పిస్తామని పదే పదే మాట్లాడుతున్న ప్రభుత్వాధినేతలకు కనీసం సంఘటనలు కూడా పట్టినట్టుగా కల్పించడంలేదు.

విద్య, వైద్యం- ప్రైవేటు వ్యాపారం అయిన నేపథ్యంలో కెజీ నుండి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్య అని చెప్పిన టిఆర్‌ఎస్‌ ఈనాటికీ స్పష్టమైన విధానం ప్రకటించలేదు. కార్పొరేటు విద్యావిధానాన్ని రద్దుచేయకుండా ప్రభుత్వరంగంలోనే అందరికీ విద్య ఎలా సాధ్యం? తెలంగాణకు చెందిన పెద్ద విద్యాసంస్థల అధిపతులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. కార్పొరేట్‌ సంస్థలతో టిఆర్‌ఎస్‌ గతం నుండి ఒప్పందాల్లో భాగంగానే ప్రభుత్వం విద్యారంగాన్ని విధానం లేని నినాదంగానే కాలం వెళ్ళదీస్తున్నది. వారసత్వ కట్టడాలను, చారిత్రక ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న… కేసిఆర్‌ చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి కనీస వసతులులేక శిథిలావస్థలోవుంటే దాన్ని పట్టించుకోకుండా కార్పొరేట్‌ ఆస్పత్రుల భజనచేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆలోచనా తీరుకు చిన్న ఉదాహరణ మాత్రమేకాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం సరైన మార్గదర్శకాలను రూపొందించక పోగా భవిష్యత్‌పై కోటి ఆశలతో ఉన్న తెలంగాణ విద్యార్ధి- నిరుద్యోగుల మధ్య వైరుధ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వ విధానంఉంది. ఆందోళనకు పరిష్కారమార్గంగా పోలీసులపై ఆధారపడుతున్నది. లక్ష ఉద్యోగాలు వెంటనే ప్రకటించే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నది.

వక్‌‌ఫ భూములు, ఓపెన్‌కాస్‌‌ట మైనింగ్‌, కరీంనగర్‌ గుట్టల తరలింపు, ఇసుక అక్రమ రవాణా, ఆదివాసుల స్వయంపాలన, అసంఘటిత కార్మికుల జీవనభద్రత అంశాలపై ప్రభుత్వ అవగాహన, వైఖరి పై విషయాలకు భిన్నంగా లేదు. ఆదిలాబాద్‌ జిల్లాల్లో కాశీపేట మండలంలో తలపెట్టిన కళ్యాణికుని ఉపరితల బొగ్గుగని ప్రజల పోరాటం వల్ల సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గింది. తెలంగాణ ప్రభుత్వం బలవంతపు భూసేకరణ కోసం ప్రజలను భయ భ్రాంతులు చేస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటవీ మంత్రి జోగురామన్న కవ్వాల్‌ టైగర్‌జోన్‌ నిర్మాణంలో ప్రజలను తరిమికొట్టే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. కరీంనగర్‌లోని గుట్టలను టిఆర్‌ఎస్‌ నాయకత్వం, వారి అనుచరణగణం వాటాలుగా పంచుకొని ఎదురులేని అక్రమాలకు పాల్పపడుతున్నారు.తెలంగాణ ఉద్యమంలో మేధోపరంగా కీలకపాత్ర వహించిన వారిలో కొంత సెక్షన్‌ను, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలలోని కొందరిని తమవైపు తిప్పుకుని వారికి అధికార పదవుల్లో కొంత వాటా ఇచ్చి ప్రశ్నించే గళాలను మూయించే ప్రయత్నం జరుగుతున్నది. ఉద్యమంలో పేరుపొందిన వారిని ఆకర్షించడం, తమలో భాగం చేసుకోవడమే విధానంగా సాగిస్తున్నది. టిఆర్‌ఎస్‌ను విమర్శించే వారికి జవాబు యివ్వడానికి మేధోపరమైన రక్షణ కవచంగా వీరిని ఉపయోగించుకుంటున్నది. పశ్చిమ బెంగాల్‌లో సింగూర్‌ ప్రజలు టాటా కంపెనీని తన్ని తరిమితే, ఆ ప్రజా ఉద్యమానికి మద్దతిచ్చిన తెలంగాణ ప్రజాస్వామికవాదులు అదే రతన్‌ టాటాకు తెలంగాణ సర్కార్‌ ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించి తెలంగాణ భూములను ధారాదత్తం చేస్తామంటే నోరు మెదపడంలేని దుస్థితి దాపురించింది.

టాటాలను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ కావాలని కెసిఆర్‌ కోరుకుంటున్నారు. 50వేల ఎకరాల భూములు పారిశ్రామిక వేత్తలకు యిస్తామన్నారు. ఇంతకు వారు ఏర్పాటుచేయనున్న పరిశ్రమలేమిటో స్పష్టంగా చెప్పనప్పటికీ సులభంగా గ్రహించవచ్చు. ఈ దేశీ, విదేశీ, బడా, దళారీ పెట్టుబడిదారులు దేశ కార్మికవర్గ మూలుగులను పీల్చి పిప్పిచేస్తూ ప్రజలపై ఘోర అణచివేతకు కారణం అయితున్నారు. ఈదళారీ పెట్టుబడి- కేవలం పెట్టుబడిగానే గాక ప్రజల జీవనాడులను నియంత్రిస్తుంది. రాజకీయ పార్టీలపై అదుపు సాధిస్తుంది. అనేక చారిత్రక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలతోపాటు ప్రపంచీకరణ ద్వారా ఉత్పన్నం అయిన అసమానతలు మలిదశ ఉద్యమానికి కారణం అయినాయి. ప్రపంచీకరణ మూలంగా తలెత్తిన సంోభాన్ని ఎత్తిచూపుతూ ఉద్యమ వేడిని రగిలించడానికి శిథిలావస్థలో ఉన్న చేతివృత్తులు, ప్రత్యామ్నాయంలేని వృత్తి కులాలు, విధ్వంసకర అభివృద్ధి నమూనాను - ఉద్యమం విమర్శించింది. తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు గుత్త పెట్టుబడి దారులను తెలంగాణపై దండయాత్రకు దింపింది. యిప్పటికే మూలుగులు పీల్చుతున్న దోపిడీ పెట్టుబడిదారులకు ఈ తిమింగలాలు తోడైతే రేపు రానున్న కాలం ఎంత దుర్భరమో ఊహించడమే కష్టంగా వుంది. m

గుత్తపెట్టుబడికి ఒకనొక లక్షణం ఆర్థిక వ్యవస్థను సైనికీకరించడం దానిలో భాగంగానే వరల్‌‌డ క్లాస్‌ పాలసింగ్‌ సిస్టమ్‌ కొత్త ఇన్నెవా కార్లు, సైకిల్‌ మోటార్లు తప్ప ప్రజలకోసం అనుకుంటె పొరపాటు. ఒకవేళ హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కోసమైతే ఉస్మానియా దావఖానా నుండి మొదలుకొని వందలాది చారిత్రక నిర్మాణాలు సంస్థలు పునరుద్ధరణకు నోచుకునేవి. సబ్బండ కులాలు, సకలశ్రామికుల ఆకాంక్షలు నెరవేరే తీరుగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు రూపొందే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచవలసి ఉంది. అసాధారణమైన త్యాగాల ఫలమైన తెలంగాణను అవకాశవాద స్వార్ధపరుల చేతిలో దోపిడీ కాకుండా కాపాడుకుందాం! అదే సమయంలో కేంద్రంలోని ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం, పక్కలో బల్లెంలాగా తెలంగాణ ప్రజా వ్యతిరేకిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ టిడిపి ప్రభుత్వం- అనుసరిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లాంటి విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాల్సి ఉంది. మేకవన్నె పులుల్లా ఉంటే దోపిడీ వర్గపాలకుల స్వభావాన్ని విప్పి చెప్పి విశాలమైన ప్రజాస్వామిక ఉద్యమానికి నిర్మాణం చేయడమే ఈనాటి తక్షణ కర్తవ్యం. తెలంగాణ రాష్ర్టం కోసం అమర వీరులు కన్న కలలు సాకారం కావాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ ఉద్యమం ఇచ్చిన పోరాట స్ఫూర్తితోని ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించుకోవడం ముందున్న కర్తవ్యం.

Surya Telugu News Paper Dated: 26/09/2014 


రచయిత సెల్‌ నెం: 98499 96300

Friday, August 29, 2014

ఉపకులాలకు రాజ్యాంగ న్యాయం By -గోపని చంద్రయ్య, -కొంగర మహేష్

              

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68ఏళ్ళవుతున్నా.. అది కేవలం భౌగోళిక స్వతంత్రత పరమితిని దాటలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఈదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్క్రుతిక అసమానతలు ప్రస్ఫుటంగా విస్త్రుతం కావడమే. దీనివల్ల ‘స్వాతంత్ర్యం’ అన్నివర్గాలకు ముఖ్యంగా అంటరానితనం, అణిచివేతలకు గురైన అణగారిన వర్గాలకు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఫలితంగా భారతరాజ్యాంగంలో రాసుకున్న స్వేచ్చా, సమానత్వం, సోదరభావం కాగితాలపై రాతలుగానే ఉండిపోయాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. పాలకుల సంకుంచిత స్వభావం, కులాధిపత్య పరిపాలన వల్లే అసమానతలు పెరిగి ధనవంతులు ఆకాశాన్నంటే రీతిలో శ్రీమంతులు అవుతుంటే...పేదలు మరింత పేదలుగా మారి పూరిగుడెసెల్లో బతుకులీడుస్తూ దుర్భరజీవితాలను వెళ్లదీస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు, సంక్షేమరంగాల్లో కొంతమేరకు అవకాశాలు దక్కుతున్నప్పటికీ అవి అత్యంత అణిచివేతకు గురైన, అసలైన అర్హులకు అందకుండాపోతున్నాయి. రాజ్యాంగ ఫలాలు కేవలం కొన్ని కులాలకు వారివాటాకు మించి లభిస్తే... అదేజాబితాలో ఉండే మరికొన్ని కులాలకు అవి అందకుండా పోతున్నాయి. రాజ్యాంగం అమలైన ఇన్నేళ్లలో దళిత, ఆదివాసీజాతుల్లో కొన్నికులాలు ఇప్పటికీ ఓటరు లిస్టులకెక్కేందుకు నానాతంటాలు పడుతున్నాయి. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, ప్రాథమిక ఆరోగ్యం, విద్య వంటివి ఇంకా వారిని వెక్కరిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా ఎప్పటిలాగే పాలకప్రభుత్వాలు పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దళితుల అభివ్రుద్ధి ఎజెండాను ముందుకు తెస్తున్నాయి. ఈరెండు రాష్ట్రాల్లో దళితులు లేదా ఎస్సీలంటే కేవలం మాలలు, మాదిగలు అనే అవగాహనతో చర్చ జరగడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కల్గిస్తోంది.  షెడ్యూల్డుకులాల్లోని అల్పసంఖ్యాక కులాలు ఉనికి, అస్థిత్వంకోసం ఇంకా ఆరాటపడుతూనే ఉన్నాయి. అటు పాలకులు సైతం ఎస్సీలంటే కేవలం మాలలు, మాదిగలు అనే అపోహలో పడి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మిగతా ఉపకులాలను కాలగర్భంలో కలిసేలా చేస్తున్నారు.

ఆగస్టు 7, 2014న ఉస్మానియా యూనివర్సిటీ, ఐ.సీ.ఎస్.ఎస్.ఆర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మాదిగ, మాల ఉపకులాలు: అస్థిత్వపోరాటాలు అనే అంశంపై గోపని చంద్రయ్య ఆధ్వర్యంలో ఒకరోజు జాతీయ సదస్సులో అస్థిత్వం కోల్పోతున్న ఎస్సీకులాలవారు పాల్గొని తమగోడును వినిపించారు. ఈ సదస్సుకు హాజరైన అత్యంత వెనుకబడిన డక్కలి, చిందు, గోసంగి, మాస్టిన్, మేహతర్, సమగర, మోచి, నులకచందయ, దొంబర, బుడగజంగాలు వంటి ఎస్సీకులాల ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, లెక్కలు విస్మయానికి, ఆందోళనకు గురిచేశాయి. అసలు తాము మాల,మాదిగలకు అనుబంధకులాలు, ఆశ్రిత కులాలు, ఉపకులాలుగా లేమని, తమకో అస్థిత్వం, చరిత్ర, సాంస్క్రుతి, వారసత్వాలున్నాయని చాటారు. ఎస్సీలంటే కేవలం మాల,మాదిగలే కాదు మోర్రో తాము కూడా షెడ్యూల్డుకులాలకు చెందినవారమేనని చెబుతున్నా గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటుదాకా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరుకావడం సభికులను కూడా కంటతడిపెట్టించింది. కులద్రువీకరణ పత్రం పొందాలంటే తమజాతులకు అదో ‘డిగ్రీ’సాధించనట్లే! అంతలా కష్టపడాల్సిందే. మాల,మాదిగేతర సామాజిక, సాంస్ర్కుతి పరిస్థితుల ద్రుష్ట్యా ఎస్సీకులాలది ఒక్కోదానికి ఒక్కోనేపథ్యం, జీవన విధానాలున్నాయి. మాల,మాదిగ కులాలకు ఆశ్రిత కులాలుగా పిలువబడే ఉపకులాలు సంచారజీవనం చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. ఉపకులాలుగా ఉన్న బైండ్ల, నులకచందయ కులాలవారు పౌరోహిత్యం చేస్తే... చిందు, డక్కలి, మాస్టీన్ సంచార కులాలుగా ఉంటూ తమకళలతో ఊరురూ తిరుగుతూ అణగారిన కులాల తత్వాన్ని ప్రచారం చేస్తాయి. తమ కన్నీళ్లను రంగుల మాటున దాచుకొని కళలకు జీవం పోస్తున్నారు.  కొన్ని కులాలు ఇప్పటికీ యాచకవ్రుత్తిలోనే మమేకమై బతుకులీడుస్తున్నాయి. మరికొన్నికులాల ఆడవారిని మాతంగులు, బసివినిల పేరిట హిందూఅగ్రకుల సమాజం ఇప్పటికీ ‘ఆటవస్తువులు’గానే పరిగణిస్తోంది. దేవుని పేరిట ‘అనాగరిక’ ఆటవిక కార్యక్రమాలు ఇంకా పల్లెల్లో కొనసాగుతూనే ఉన్నాయి.

మాల,మాదిగలుకాక ఈఉపకులాల జనాభా దాదాపు లక్షల్లో ఉంటే ప్రభుత్వ లెక్కలు వందలు, వేలల్లో చూపించి వారి ఉనికి, అస్థిత్వాన్ని మాయం చేస్తున్నాయి.  ఇప్పటివరకు జరిగిన జనాభా లెక్కల్లో వీరిలో కొన్ని కుటుంబాలు మాల,మాదిగలజాబితాల్లో పరిగణించడంతో తమ అస్థిత్వం కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు కులద్రువీకరణ పత్రాలు మిగతా కులాలు పొందినట్లు తహాసిల్దార్ నుంచి కాకుండా ఆర్డీవో నుంచి అందుకోవడం వీరిని నానాఇబ్బందులకు గురిచేస్తోంది. అదికూడా పలుదఫాలుగా ‘విచారణ’లు జరిగాకే ‘ద్రువీకరణ’ పత్రాలు అందుకోవడం ఈకులాల ప్రజలను ఆత్మన్యూనతకు, అవమానాలకు గురిచేస్తున్నాయి..  ‘ఫలానా కులం ఉన్నదని మాకు తెలియదు, అయినా మీరు అదే కులానికి చెందినవారని గ్యారంటీ ఏంటనీ’ అధికారులు వేధింపులకు గురిచేస్తుండటంతో  కొంతమంది అసలు కులం సర్టిఫికేట్లు పొందకుండాపోతుంటే...మరికొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో మాలగానో ,మాదిగగానో ‘గుర్తింపు’ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం నేటి ‘సామాజిక అభద్రత’ను బహిర్గతం చేస్తోంది.

 ఇప్పటికీ తమ కులాల్లో ప్రాథమికవిద్యా స్థాయినిదాటి  డిగ్రీస్థాయికి వచ్చినవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చని చెప్పడం రిజర్వేషన్ల అమలు తీరును ప్రశ్నించడమేకాదు నేటి  ప్రభుత్వాలు చేపట్టే ‘అందరికి విద్య’ కార్యక్రమాలను సైతం నిలదీస్తోంది. తమ వర్గాలనుంచి ఇప్పటి వరకు కనీసం గ్రామపంచాయతీల్లో వార్డు మెంబరు కూడా కాకపోవడానికి కారకులెవరని ఎస్సీ కోటాలో అందుతున్న ఫలాలు అనుభవిస్తున్న మాల, మాదిగలను సూటిగానే ప్రశ్నించారు. ఎస్సీలంటే కేవలం మాల,మాదిగలు మాత్రమే కాదు ‘మేమూ ఉన్నాం. కాస్తా పట్టించుకోండి’ అంటూ విన్నవించుకోవడం అందరినీ ఆలోచింపజేసింది. జనాభా పరంగా మాదిగలు, మాలలు అధికంగా ఉండటం... వారు స్థిరనివాసం కలిగి గ్రామపరిపాలన వ్యవహారాల్లో భాగస్వాములవడంతో సహజంగానే విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో రాజ్యాంగ పరంగా అందుతున్న వాటాలో వీరిదే సింహభాగమైంది. అదే జాబితాలో ఉండి సంచార జీవనం, యాచకవ్రుత్తితో దినదినగండంగా బతుకులు వెళ్లదీస్తున్న ఉప కులాలు, అధికారుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా అన్నిరంగాల్లో తీవ్రఅన్యాయానికి గురవుతున్నాయి. ఇక పక్కా ఇళ్లు, రేషన్ కార్డుల జారీ వంటివైతే వీరికి నామమాత్రంగానే అందుతున్నాయి.  ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తలదాచుకోడానికి ఇళ్లు లేక ఉపకులాల ప్రజలు నానాఅగచాట్లు పడుతున్నారు. కొన్నిచోట్లా ఊరిచివర ప్లాస్టిక్ కవర్లు, ప్రచారాలకు వినియోగించే ప్లెక్లీలతో గుడిసెలు వేసుకొని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆడవారికి మరీముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ ‘తాత్కాలిక’ఏర్పాట్లు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, ప్లెక్లీల వేడికి అప్పుడే పుట్టిన బిడ్డలు మ్రుత్యువాతపడతున్నారు. దీనికితోడు పౌష్టికాహారలోపంతో అనేక రోగాలకు గురవుతున్నారు.

        ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డు కులాలకు రాజ్యాంగం ద్వారా విద్యా, ఉద్యోగ రంగాల్లో సంక్రమించిన రిజర్వేషన్లను కేవలం ఒక కులం అనుభవిస్తోందని మాదిగలు ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)పేరిట బలమైన ఉద్యమం నడిపేంతవరకు వాటి అమలు తీరుతెన్నులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ‘దండోరా ఉద్యమం’ తర్వాతే ఎస్సీజాబితాలో దాదాపు 60కులాలు ఉన్నాయని బాగాప్రచారంలోకి వచ్చింది. వెలుగులోకి అయితే వచ్చాయి కానీ వారి జీవితాల్లో మాత్రం ఏలాంటి వెలుగు రాకపోవడం కచ్చితంగా  పాలకుల చిన్నచూపు...సంఖ్యపరంగా మెజార్టీగాఉన్న మాల, మాదిగల ఆధిపత్యాలే కారణమని చెప్పాలి. ఇన్నాళ్లు మాదిగలు దళితుల్లోనే దళితులుగా మిగిలిపోయామని చెబుతుంటే..తాము అంటరాని వారికే అంటరానివారిగా మిగిలిపోయామని మిగిలిన ఉపకులాలు ఘోషిస్తుండటం... రాజ్యం అమలుచేసే ప్రతి సంక్షేమ పథకాన్ని పున:సమీక్షించుకోవాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రిజర్వేషన్ల ‘ఏబీసీడీ’వర్గీకరణ అమలైన నాలుగేళ్ల (2000 నుంచి 2004 )కాలంలోఎస్సీ ఉపకులాలకు కొంతమేరకు న్యాయం జరిగినప్పటికీ వాటిలో జనాభాపరంగా చెప్పుకోదగ్గస్థాయిలో ఉన్న కొన్నింటినీ మాల (సీ), మాదిగ (బీ) గ్రూపుల్లో చేర్చారు. దీంతో జనాభాపరంగా, విద్యా,ఉద్యోగపరంగా అప్పటికే ముందున్న మాలలతో పోటీపడలేక వచ్చిన అరకొర అవకాశాలు కూడా తమకు దక్కకుండాపోతున్నాయని మాల ‘సీ’గ్రూపులో ఉన్న గోసంగి వంటి కులాలవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 144జీవోజారీ చేసి బుడగజంగాలను ఎస్సీ జాబితాలో నుంచి తొలగించారని ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల తాము ఎస్సీ హోదాలేక ఏఅవకాశం తమ దరికి చేరడం లేదని, తమ బతుకులకు ఇక బిక్షాటనేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

        ఉమ్మడి తెలుగు రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయినా జనాభా దామాషా ప్రకారం,  సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా షెడ్యూల్డుకులాల రిజర్వేషన్ల హేతుబద్దీకరణ (వర్గీకరణ) జరగాలి. ఇది శాస్త్రీయబద్ధంగా ఉండాలి. బైండ్ల, చిందు, మాస్టీన్,డక్కలి వంటి కులాలు తెలంగాణలో ఉంటే ఆదిఆంధ్ర, రెల్లి,పైడి,పాకి వంటివారు ఆంధ్రాలో ఉంటారు. అందువల్ల ఈరెండురాష్ట్రాల్లో షెడ్యూల్డు కులాల జాబితాను పున:నిర్వచించాల్సిన అవసం ఎంతైనా ఉంది. ఇప్పటికీ ఈరెండు రాష్ట్రాల్లో 2001 జనాభా లెక్కలే ప్రామాణికం. మొన్న తెలంగాణలో జరిగిన సమగ్రసర్వే షెడ్యూల్డు కులాల జనాభాలో ఏకులం జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చేపట్టాలి. ఎస్సీ కులాల సమగ్ర అభివ్రుద్ధికి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతోపాటు ఆర్థిక సహాకార సంస్థ నుంచి అత్యంత వెనకబడిన కులాలకు ప్రత్యేక కోటా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టంతోపాటు అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు వీరికి చేరేలా పకడ్బందీ ప్రణాళిక రూపకల్పన చేసి రాజకీయరంగంలో వీరి జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలని సదస్సుకు వచ్చిన వక్తలు అభిప్రాయపడ్డారు. ఎస్సీల పేరుతో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్ని తొలుత ఈకులాల పంపిణీతోనే మొదలుకావాలి. ఉపకులాన్నింటికీ అల్పసంఖ్యాక కులాల పేరుతో విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. ప్రపంచీకరణ, ప్రభుత్వాల చిన్నచూపుతో క్షీణించిపోతున్న చిందు యక్షగాన కళారూపాలు, బహురూపుల కళావారసత్వాలను కొనసాగిస్తున్న  కళాకారులను అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు.  దీనికితోడుగా ఇన్నాళ్లు హక్కులు, అవకాశాల పేరుతో ఉద్యమించిన మాల, మాదిగలు సాటి దళితుల (అత్పల్పకులాల ప్రజల) దరిద్ర్యాన్ని పొగొట్టకపోయినా వాటి నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నంమాత్రం చేయవద్దు. తమకంటే కూడా అత్యంత వెనుకబడిన, అణగారిపోయిన కులాలు తమ‘జాబితా’లోనే ఉన్నాయనే వాస్తవాన్ని ‘పైరెండు కులాలూ’ గ్రహించాలి. దాంతోపాటు ఉపకులాల ప్రధాన సమస్యలకు ‘వర్గీకరణ’రెండు రాష్ట్రాల్లో జరగాల్సిన అవసరాన్ని ఉపకులాల ప్రతినిధులు తాము ఏర్పాటు చేసుకున్న ‘ఎస్సీ అల్పసంఖ్యాక ఉపకులాల ఐక్యవేదిక’ద్వారా డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగపరమైన అవకాశాలు, నిధులు, హక్కులు, వనరులు సమాజంలో అత్యంత అణిచివేతకు గురైన ఎస్సీ ఉపకులాల నేపథ్యంగా కేటాయింపులు జరగాలి. అందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దళితుల అభివ్రుద్ధి, సంక్షేమం పేరిట రాజకీయంగా ప్రాబాల్యం ఉన్న కులాలే లబ్ధిపొందే ప్రమాదముంది.  రాజ్యాంగం అందించే ఏ అవకాశన్నైనా ఒకటి, రెండు కులాలు మాత్రమే అనుభవిస్తూ ఉంటే అది చివరికి సామాజిక అశాంతికి, అంత్యర్యుద్ధానికి దారితీసిన ఆశ్యర్చపడాల్సిన పనిలేదు.

        చివరగా ఎస్సీ రిజర్వేషన్ల ‘వర్గీకరణ’కు మద్ధతు తెలపడం, బహుజన రాజకీయాలను నిర్మించడం రెండూ వైరుద్యమైన అంశాలు కావని అవి పరస్పర ప్రోత్సాహకర అంశాలుగా అర్థం చేసుకోవడం ద్వారానే ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ తాత్వికతను పెంచి విశాల రాజకీయాలను అణగారిన కులాలకు అందించగలమని రెండూ రాష్ట్రాల ఉద్యమకారులు, నాయకులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా  ఉంది.
       
                                                        -గోపని చంద్రయ్య
                                                        (09956377352)
అసిస్టెంట్ ప్రొఫెసర్, జి.బి.పంత్ సోషల్ సైన్స్ ఇన్సిట్యూట్, అలహాబాద్
-కొంగర మహేష్
                                                        (9866464567)
రిసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్


Article Published in Andhra Jyothi Telugu News Paper Dated: 28/08/2014