Saturday, October 13, 2012

'మా తొలి ప్రేరణ తెలంగాణ' - వరవరరావు



'ప్రజలున్న చోట, ప్రజా పోరాటాలు ఉన్న చోట నేనుంటాను. నా హృదయ స్పందనలతో ఉంటాను' అని మహాశ్వేతాదేవి పిడికిలి ఎత్తి అన్నారు.... 'తెలంగాణ ప్రజలు ఎప్పుడూ పోరాట ప్రజలే. ఎప్పుడూ ఉద్యమకారులే. అందుకే నాకు తెలంగాణ అంటే ప్రేమ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి చాలా చదివాను. చాలా తెలుసుకున్నాను. నక్సల్బరీ కన్నా ముందు మాకు అదే కదా తొలి ప్రేరణ'. 

మన మహా సాగరహారం 'చలో హైదరాబాద్' అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊళ్ళోనే ఉన్నారు. ఆ రోజు మహాశ్వేతాదేవిని మన మధ్యకు తెచ్చుకొని ఉంటే, బేగంపేట విమానాశ్రయమే ఉండి ఆమె ఆ రోజు అక్కడ కలకత్తా నుంచి వచ్చి దిగి ఉంటే బయటికి వస్తూనే చీమల దండులా వస్తున్న జనాన్ని చూసి ఆ మహా రచయిత్రి ఇటు వచ్చి ఉండేవారు. ఇప్పుడంతా బైపాస్‌లు కదా. జిఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగితే గచ్చిబౌలీ మీదుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి హైదరాబాద్ తాకకుండా అంతా సైబరాబాద్ ప్రయాణమే.

ఈ సైబరాబాద్ అల్లావుద్దీన్ అద్భుత దీపం సృష్టికర్త ఇప్పుడు, ఇన్నాళ్లకు, తొమ్మిదేళ్లకు పల్లెలను పలవరిస్తూ పల్లెబాట పట్టాడు. పల్లేరు కాయలు, పరిగ తప్ప పంటలు లేని పల్లె బాట. తానూ, తదనంతరం వారూ దక్కన్ పీఠభూమి మీంచి విధ్వంస పూర్వకంగా తుడిచివేసిన పల్లె బాట. ఎనభై గ్రామాలు, రైతుల జీవితాలు దురాక్రమించి నిర్మాణమైన ఈ సుందర విమానాశ్రయంలో ఇప్పుడేనట ఆమె దిగడం. 'ఎట్లా ఉంది ప్రయాణం?' అని అడిగాను. 'హంస తూలికా తల్పం' వలె ఉంది అన్నారు. పక్షులీకలన్నీ పీకి కుషన్ చేసి ఆ సోఫాల్లో కూర్చొని 'ఇక్కడే మీ దగ్గర జీవ వైవిధ్య సదస్సు చేస్తున్నారట కదా. నూటా తొంభై మూడు దేశాల జీవ విధ్వంసకారుల సభ'అన్నది.

'బేగంపేట విమానాశ్రయంలో దిగగానే అక్కడ మట్టి తీసుకొని నా నుదిటిలో పెట్టుకుంటాను' అన్నది చాలాకాలం క్రితం కలకత్తాలో కలిసినప్పుడు. అప్పటికింకా ఆమె జాదవ్ పూర్‌లో ప్రభుత్వ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ క్వార్టర్స్‌లో కిరాయికి ఉంటున్నారు. అప్పటికే ఆమెకు జ్ఞానపీఠ్‌లు, మ్యాగ్సేసే అవార్డులు వగైరా వచ్చి ఉన్నాయి. సీగల్ వాళ్లూ ఆమె రచనలన్నీ ఇంగ్లీష్‌లోకి తెచ్చారు. ఆ రోజుల్లో ఆమెకు నోబెల్ సాహిత్య బహుమానం కూడా వస్తుందనుకున్నారు. నేనూ, నా సహచరి హేమలత ఆమె దగ్గరికి వెళ్లగానే కావలించుకొని 'నీ కోసమే నిరీక్షిస్తున్నాను. కూర్చో'మని లోపలికి వెళ్లి వచ్చి నెల్సన్ మండేలా సంతకం ఉన్న జిరాక్స్ కాపీ నా చేతికిచ్చింది. 'ఇదిగో ఈ సంతకం కోసం, ఈ మనిషి కరచాలనం కోసమే మ్యాగ్సేసే అవార్డు తీసుకున్నాను' అని మహాశ్వేతాదేవి చెప్తుంటే ఆమె బలహీనమైన సంజాయిషీకి నాకు జాలేసింది. 'ఇప్పుడు మండేలా మాత్రం ఎక్కడ మండుతున్నాడు? నేనూ, శివసాగరూ, ఇంకా చాలా మంది తెలుగు కవులం గతంలో ఇట్లా మనిషంటే మండేలా లా ఉండాలని పులకించిపోయిన వాళ్లమే' అన్నాను.

అక్టోబర్ 1 సాయంత్రం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గెస్ట్‌హౌజ్‌లో 'మలుపు' ప్రచురణలు కె.బాల్‌రెడ్డితో పాటు, నేను నా సహచరి హేమలత వెళ్లి ఆమెను కలిసాం. బయట భోరున వర్షం కురుస్తున్నది. తెలంగాణ ప్రజల మీద కురిసిన బాష్పవాయు గోళాల దుర్మార్గానికి సెప్టెంబర్ 30 సాయంత్రం నుంచే ఆకాశం ఎడతెగకుండా దుఃఖిస్తున్నట్లున్నది. ఈ జీవ వైవిధ్య విధ్వంసం కాలంలో ఆ ఆకాశం కళ్లెవ్వరు తుడవాలి?! మహాశ్వేతాదేవి వెంట కలకత్తా నుంచే ఒక అటెండర్ వచ్చాడు. కలకత్తాలో ఆమె కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఆమెను కనిపెట్టుకొని ఉంటున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. మహాశ్వేతాదేవి సంతాల్ ఆదివాసుల కోసం దశాబ్దాలుగా నడుపుతున్న 'వృత్తికా' (వార్త, సమాచారం) అనే పత్రికా నిర్వహణలో కూడా సహకరిస్తున్న వ్యక్తి. విశ్వవిద్యాలయం వాళ్లు కూడా హెల్త్ సెంటర్ నుంచి ఒక మెడికల్ అసిస్టెంట్‌ను నియోగించారు.

ఆ ఇద్దరూ ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. కాళ్లు వాపులు తగ్గలేదు. ఏమైనా తినే ముందు ఇన్సులిన్ తీసుకోవాలి. అయినా కలకత్తాలో చూసినప్పటి కన్నా కొంచెం ఆరోగ్యంగానే కనిపించింది. 2013 జనవరి 14 మకర సంక్రాంతి రోజు ఆమె ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ప్రవేశిస్తుంది. సహస్ర చంద్ర దర్శనం ఎప్పుడో అయిపోయింది. బహుశా సహస్ర సూర్యదర్శనాలు కూడా అయిపోయాయేమో. 'ఎనభై ఏడేళ్లు పెద్ద వయస్సు కాదు రచయితకు' అన్నదామె. 'నిజమే, ప్రజానాట్యమండలి స్థాపన నుంచి విరసం, అరుణోదయల దాకా, ఇప్పటిదాకా మా తెలుగుసాహిత్య సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న కానూరి వెంకటేశ్వరరావుకు ఇప్పుడు 97 ఏండ్లు. తెలంగాణ వైతాళికులలో ఒకరు, ఆఖరి శ్వాసదాకా తెలంగాణ న్యాయం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన 97వ ఏట కన్నుమూశాడని' చెప్పాను.

'తిరగడం లేదు. హైదరాబాద్‌కు చాన్నాళ్లకు వచ్చాను. తెలంగాణ పోరాటాల గడ్డ మీద ఇక్కడి అమరుల రక్తసిక్త దేహాలతో, పాదాలతో తడిసిన మట్టి తీసి పాపిటలో సింధూరంలా పెట్టుకుందామంటే మీ కొత్త విమానాశ్రయంలో మట్టే కనిపించలేదు. మనం మట్టి మనుషులం కదా. మనకు మనుషులు కావాలి. మట్టి కావాలి. మట్టి మనుషులు కావాలి' అంది.

'తిరగడం లేదు గానీ పెద్ద ఇల్లు కట్టాను. రోజూ బెంగాల్ నాలుగు చెరుగుల నుంచి నా నుంచి ఏదో సహాయం కోరుతూ ఎవరో ప్రజలు వస్తూనే ఉంటారు. జంగల్ మహల్ నుంచి బాధితులు వస్తూంటారు. ఫోన్లు వస్తుంటాయి. అక్కడ వాళ్లకు తాగడానికి నీళ్లు లేవు. విద్యుత్తు లేదు. ప్రాథమిక చికిత్సకు ఆస్పత్రులు లేవు. మమతకు చెప్తే అక్కడామెకు అందరూ మావోయిస్టుల వలె కనిపిస్తారు. వాక్యానికి వాచ్యార్థం, వ్యంగ్యార్థం అని రెండు కర్తవ్యాలు ఉంటాయమ్మ అని ఆమెకు చెప్తే అర్థం కాదు. కార్టూన్ అంటే అర్థం కాని మనిషికి వ్యంగ్య ప్రయోజనం ఎక్కడ అర్థమవుతుంది?

ఎంఎ బెంగాలీ చదివిందట కాని ఆమె నా సంతాలీ ప్రజలంతటి విద్యావంతురాలు కాదు' అన్నది. 'బుద్ధదేవ్ బాగా పుస్తకాలన్నా చదివేవాడు. ఈమెకు భావాలంటే భయం' అన్నది.

'నిన్న సాయంత్రమే వస్తే మా మార్చ్‌కు తీసుకుపోయేవాళ్లం. మూడు లక్షల మందికి పైగా వచ్చారు' అన్నాను. 'విన్నాను' అంటుంటే మధుమేహ వ్యాధి వల్ల, వృద్ధాప్యం వల్ల తెల్లగా పాలిపోతూ, నీళ్లూరుతున్న ఆమె కళ్లు క్షణం సేపు మిలమిలా మెరిసాయి. 'ప్రజలున్న చోట, ప్రజా పోరాటాలు ఉన్న చోట నేనుంటాను. నా హృదయ స్పందనలతో ఉంటాను' అని పిడికిలి ఎత్తి అన్నది. మహాశ్వేతాదేవి రాకకు, ఆమె కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ సత్కారం చేయడానికి కృషి చేసిన ఆదివాసి, దళిత అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణ, సుప్రసిద్ధ హిందీ రచయిత జయప్రకాశ్ కదం, అడకమిక్ స్టాఫ్ కాలేజీలో ఉన్న హిందీ ప్రొఫెసర్ రాజు మొదలైన వారు కూడా అక్కడ ఉన్నారు. 'ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం' అని అడిగింది. 'తెలంగాణ ప్రజలు ఎప్పుడూ పోరాట ప్రజలే.

ఎప్పుడూ ఉద్యమకారులే. అందుకే నాకు తెలంగాణ అంటే ప్రేమ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి చాలా చదివాను. చాలా తెలుసుకున్నాను. నక్సల్బరీ కన్నా ముందు మాకు అదే కదా తొలి ప్రేరణ. ఇప్పుడు రాష్ట్ర సాధన పోరాట సాహిత్యం నాకు కావాలి. ఇంగ్లీష్‌లో ఉంటే పంపించండి' అన్నది. 'మలుపు' ప్రచురణలు తెలుగు చేయించి వేసిన ఆమె తొలి చారిత్రక నవల 'ఝాన్సీ కీ రాణి' ప్రతిని ప్రచురణకర్త కె. బాల్‌రెడ్డి ఆమెకు అందిస్తుంటే స్వీకరిస్తూ ఆమె ఝాన్సీలో ఇప్పటికీ జనపదాల్లో ప్రచారంలో ఉన్న ఒక జానపద గీతం పాడింది. 'నేను ఆ జానదప గీతాల నుంచి చరిత్రను, కథను అల్లాను. స్త్రీలు ఎప్పుడూ పోరాటకారులే. ఎందుకంటే వాళ్లు కష్టజీవులు. అణచివేతకు నిరంతరం గురవుతుంటారు. అందుకని వాళ్లకెప్పుడూ ధర్మాగ్రహం ఉంటుంది' అన్నది.

'ఆత్మకథ' రాస్తున్నారా అని అడిగాను. అందుకోసమే ఆమె ఇల్లు కట్టుకుని, అందరికీ తెలిసిన ఇంటి నుంచి మారిందని, అందుకే సాధారణంగా ఎక్కడికీ వెళ్లడం లేదని విన్నాను. అదే మాట అడిగితే 'ఈ ఇల్లు కూడా అందరికీ తెలిసిపోయింది కదా. పైగా నందిగ్రాం నుంచి వరుసగా సింగూరు, లాల్‌ఘడ్ ఇట్లా ప్రజా పోరాటాలు పెల్లుబికి తన పని పెరిగిందని, బాధితులకు మందులు సేకరించడం, వైద్య సహాయాన్ని పంపించడం - ఇదే పని పెరిగింద'ని చెప్పింది. రాజకీయ ఖైదీల విడుదల మొదలు, ఉద్యోగాలు కోల్పోయిన రైల్వే కార్మికుల సమస్యల వరకు ఎప్పుడూ ఏదో పని గురించి ప్రజలకు తెలియజేయడం, ప్రభుత్వాన్ని హెచ్చరించడం, రెగ్యులర్ బెంగాలీ పత్రికకు రాసే కాలమ్స్‌లో రాయడం - వృత్తికా పత్రిక పనులు - దాని కోసం ఆదివాసులను ఇంటర్వ్యూలు చేసి వాళ్ల భాషలోనే అచ్చెయ్యడం పనులే సరిపోతాయన్నది.

'ఇదే జీవితం కథ. నిత్య పోరాటాల కథ. ఇంకేం స్వీయ జీవితం' అన్నది. 'ఫ్రాంటియర్'లో 'నా బసాయిటుడు మరణించడు' (My Basai Tudu will not die) అని రాసిన చిన్న లేఖ వంటి రచన చదివాను - కేరళలో సిపిఎం పార్టీలో ఇద్దరు నాయకుల మధ్య వచ్చిన తగాదాలో ఒక కార్యకర్తను చంపడం గురించి రాసారు కదా అన్నాను. 'అతడు ఆదివాసి కార్యకర్త - సిపిఎంలో ఒక పక్షం అయినందుకు కాదు. కేరళలో తక్కువగా ఉన్న ఆదివాసి జనాభాలో ఎవ్వరూ వాళ్ల గురించి పట్టించుకోనపుడు ఒక మారుమూల పల్లెలో ఆయన వాళ్ల మధ్యలో పనిచేస్తున్నాడు. ఆయనను తమ స్వార్థ రాజకీయాల కోసం చంపేసారు. నా బసాయి టుడుకు నమూనా అయిన వ్యక్తికూడా బెంగాల్‌లో ఇటీవలనే తన తొంభై ఆరవ ఏట మరణించాడు' అని చెప్పింది. దాని మీంచి కాసేపు చర్చ వలసపాలన కాలం నుంచి ఆదివాసులను నేరస్థులుగా చూసే రాజ్య వ్యవస్థ మీదికి మళ్లింది.

ఆదివాసి సమస్యలపై ఆదివాసి దళిత అధ్యయన కేంద్రం, కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన సదస్సులో కూడా ఆమె పాల్గొన్నది. అక్కడ అనుకోకుండా గద్దర్ కలిసాడని, ఆయన ఉత్సాహంగా పాటలు పాడి, తనతో కూడా బలవంతంగా పాట పాడించాడని చెప్పింది. 'సభ్య సమాజం అనాగరికులుగా భావించుకునే ఆదివాసులంత నాగరికులు మరెవరూ కాదన్నది. వాళ్లు మన కోసం అడవులు, నదులు, పర్వతాలు కాపాడుతున్నారు. దానర్థం - అవి మానవ వనర్లని కాదు - అవి మానవ జీవితానికి పెనవేసుకున్న ప్రకృతి సంపద అని. మన కోసం అంటే మన భావితరాల కోసం కూడా అనాదిగా కాపాడుతున్నది వాళ్లే' అన్నది.

అంతే తప్ప ఖనిజాలుగా, నీళ్లుగా, రియల్ ఎస్టేట్‌గా, సరుకుగా మార్చి బడా కంపెనీలకు, విదేశాలకు అమ్ముకోవడానికి కాదు. పరస్పరం ఆధారాధేయాలుగా జీవించడానికి. వాళ్ల సామాజిక నిర్మాణం చూడండి - ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎవరూ ఎవరికన్నా ఎక్కువ కాదు. ఎవరూ ఎవరికన్నా తక్కువ కాదు. వరకట్నాలు, లైంగిక అత్యాచారాలు అక్కడ లేవు. భారతదేశంలో ఇంకేమైనా పర్యావరణ సమతుల్యత మిగిలిందంటే అది ఆదివాసుల వల్లనే. బ్రిటిష్ వాళ్లు అడవి కోసం చట్టాలు రచించి, వందలాది ఆదివాసి తెగలను 'నేరస్వభావం' గల జాతులుగా నమోదు చేసిన శిక్షా స్మృతి ఇంకా కొనసాగుతున్నదని అన్నది.

ప్రైవేట్ ఆస్తిని కాపాడుకోవడానికి ఆదివాసులను నేరస్థులుగా చిత్రిస్తున్న ఆధిపత్య నేర వ్యవస్థను ప్రశ్నిస్తూ, ప్రతిఘటిస్తూ ఆమె ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్నది. దేశంలో వివిధ ప్రాం తాల్లో ఆమె నాయకత్వంలో అటువంటి పోరాటాల ఫలితంగానే నేరస్థ జాబితాల నుంచి ఆదివాసి జాతుల Newsకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో స్టువర్ట్‌పురం వంటి చోట ఈ చట్టాలు, సభ్య సమాజం అట్లా చూసే దృష్టి మనకు తెలుసు. ఎరుకల, డక్కలి, చెంచు వంటి జాతులను చట్టంలోనే కాదు, సభ్య సమాజం అనుమానంగా చూడడం, నేరారోపణలకు లక్ష్యంగా చూడడం ఇప్పటికీ మన అనుభవంలో ఉన్న విషయాలే.

విడిపోయే ముందు మళ్లీ మళ్లీ దగ్గరికి తీసుకుంటూ, మళ్లీ కలుస్తామో లేదోనన్నట్లు వీడ్కోలు చెప్తున్నప్పుడు 'రచయితలం, సామాజిక కార్యకర్తలం కదా. మనది 'క్రిమినల్ ట్రైబ్' (నేరస్తుల జాతి) మనమెక్కడున్నా రాజ్యం మనను నేరారోపణలతో కలుపుతూనే ఉంటుంది' అంటూ అందరినీ ఒకరొక్కరిని కావలించుకొని నుదిటిపై ముద్దు పెట్టుకున్నది.

చక్రాల బండి (వీల్ చెయిర్)పై అట్లా ఆమె జీవన సంధ్యలోకి, ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న కాంతిపుంజం వలె అనిపించింది.

- వరవరరావు
Andhra Jyothi Telugu News Paper Dated : 14/10/2012 

No comments:

Post a Comment