Monday, October 29, 2012

నేటి పోరాటాలకు స్ఫూర్తి (కొమురం భీం)----


నేటి పోరాటాలకు స్ఫూర్తి
ఆ దివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీం. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం.పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు.ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటి కి డ్బ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపు ఎరగకుండా ఉద్యమిస్తున్న సందర్భం నేడున్నది. స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కండ్లముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్బాలు అనేకంఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్‌లు,తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల దోపిడీ, పీడనలను ఎదిరించారు. చరివూతలో అనేకసార్లు ఓటమి చెందినా తమ జీవితమే యుద్ధమై న చోట తమ అస్తిత్వం కోసంఅలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈవేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే..ఆదిలాబాద్ గోండన్నలు పోరుబాట పట్టారు.తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లొద్దుల్లో తుడుం మోగించాయి. కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్ లొద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది. 

ఏహక్కుల కోసమైతే..నాడు భీం ఉద్యమించాడో.. ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేయవలసే వస్తున్నది. ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా..ఆదివాసుల అవస్థలు ఏమీ తీరలేదు. నిజాం రాజు నియమించిన హైమన్‌డార్ఫ్ సూచనలను కూడా నేటి పాలకులు పాటించడంలేదు. కానీ నాటి నిజాం ప్రభువయినా.. గిరిజనుల అభ్యున్నతి కోసం హైమన్‌డార్ఫ్ సూచనలను పాటించాడు. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాడు. కానీ..నేటి పాలకులు ఇవేవీ పట్టకుండా ఆదివాసులపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కొమురం భీం స్ఫూర్తితో విప్లవ సంఘాల నాయకత్వంలో మరొకసారి ఆదివాసులు సంఘటిత పోరాటాలు చేశారు. దీంతో.. ఆదివాసుల ఐక్యతను చూసి తట్టుకోలేని ప్రభుత్వం ఇంద్ర మారణకాండను సృష్టించింది. ఇది ఆధునిక కాలంలోని మరో జలియన్‌వాలా బాగ్‌గా ప్రజాస్వామికవాదులు పిలుస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆదివాసుల పోరాటానికి సంఘీభావం వచ్చింది. ప్రభుత్వ దమననీతిని ఖండించారు. రాజ్యం తన హేయమైన చర్యలు చేస్తూ నే.. మరోవైపు సంస్కరణలు చేపట్టింది. ఆదివాసుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా..పైపూత మాటలతో జోకొట్టే ప్రయత్నం చేసింది. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలును తుంగలో తొక్కి ఆదివాసులపై అన్నివైపుల నుంచి దాడులు జరుగుతున్నా యి. ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పేరుతో నిర్వాసితులను చేస్తున్నది.

ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలు పర్చడంలేదు. అన్యాక్షికాంతమవుతున్న అడవులను, భూములను పట్టించుకోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్‌డార్ఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన ఉన్నది. వలస వచ్చిన వాళ్ళు ప్రజావూపతినిధులవడంతో వీరికష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమా జం వీరి వల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు మదనపడుతున్నారు. ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయినప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడంలేదు. ప్రతిఏటా రెండు వందల నుంచి మూడు వందల మలేరియా మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కేలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికి తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణా లు క్షీణిస్తున్నాయి. భీం పోరాటం జరిగి డెభ్బైఏళ్లు అవుతున్నా, ఆపోరాట స్ఫూర్తినేటికీ ఉన్నది. అది మరోఇంద్ర పోరాట రూపం గా పెల్లుబకవచ్చు. ప్రభుత్వాలు మరో ఉప్పెన రాక మునుపే మేల్కొనాలి.

అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లొద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది.జల్,జంగల్,జమీన్ కోసం ఆదివాసులు కొమురంభీం బాటలో పయనిస్తున్నారు. కొమురం భీంను ప్రేమించే వాళ్లుగా.. ఆదివాసుల అస్తిత్వ పోరాటాలకు అండగా నిలుద్దాం. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రజలు అస్తి త్వంకోసం,స్వయంపాలన కోసం పోరాడుతున్నారు. సందర్భాలు వేరు కావచ్చు. కాని పోరాట లక్ష్యాలు ఒకటే. తెలంగాణ ప్రజలు కొమురం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పరపీడన నుంచి విముక్తి కోసం ఆయుధమెత్తి పోరాడిన భీం వారసులుగా కదం తొక్కాలి. వలస పాలనను అంతం చేయాలి. అదే.. కొమురం భీంకు నిజమైన నివాళి. 

-బి. వేణుగోపాల్‌
Namasete Telangana Telugu News Paper Dated : 29/10/2012 

No comments:

Post a Comment