Monday, October 15, 2012

'లక్షింపేట' కులసమస్యే - దుడ్డు ప్రభాకర్



భూమిలేని కారణంగానే దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ, దాడులు ఆగాలంటే భూపోరాటం చెయ్యాలనే అగ్రకుల భావజాలం కలిగిన కులదాటవేత దారులకు ఒక ప్రశ్న. ఈ దేశంలో భూమిలేని మిగిలిన కులాల ప్రజలపై ఇలాంటి సామూహిక దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎందుకు జరగడం లేదో చెప్పాలి. భూమి ఉన్నాగాని ఖైర్లాంజిలో భయ్యాలాల్ కుటుంబం మొత్తం అత్యాచార హత్యలకు ఎందుకు బలయ్యిందో చెప్పాలి. 

అవును లక్షింపేటలో దళితులపైన, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాలలపైనే దాడి జరిగింది. మాలలు భూమి సాగు చేసుకుంటామంటేనే దాడి జరిగింది. సాగుచేసుకుంటున్న వారు మాలలు కాబట్టే దాడి జరిగింది. 60 ఎకరాలు సాగుచేసుకుంటున్న వాళ్ళను, వారికి నాయకత్వం వహించిన వాళ్ళను మాత్రమే లక్ష్యం చేసుకొని మారణకాండ జరగలేదు. 200 మంది తూర్పుకాపులు ఆడ, మగ కారం, బాంబులతో మాలపల్లెపై పడి విధ్వంసం సృష్టించారు. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా, ఆడా మగా, తేడాలేకుండా విచక్షణా రహితంగా బరిసెలతో పొడిచారు, గొడ్డళ్ళతో నరికారు.

అందుకే ఈ దాడి ముమ్మాటికీ కులపరమైన దాడే. శ్రీకాకుళంలో బీసీలుగా చెలామణి అవుతున్న తూర్పు కాపులు అగ్రకుల దురహంకారంతో దళితులపై చేసిన దమనకాండ, కంచికచర్ల నుంచి లక్షింపేట దాకా జరిగిన అన్ని నరమేధాలకు అగ్రకుల దురహంకారమే కారణం. అంతేకాదు ఈ దేశంలో దళితులపై జరిగిన దాడులన్నీ కులపరమైన వివక్ష, అణచివేతలో భాగంగా జరిగే దాడులే. కేవలం సమాజంలో ఆత్మగౌరవంగా బతకాలనుకున్నందుకే ఈ దేశంలో దళితుల నెత్తురు ఏరులై పారింది. రెండు గ్లాసుల పద్ధతి వద్దన్నందుకు, రచ్చబండల మీద కూర్చున్నందుకు, అగ్రకుల వీధుల్లో చెప్పులేసుకొని నడిచినందుకు, దేవాలయ ప్రవేశం అడిగినందుకు దళితుల కుత్తుకలు తెగుతున్నాయి. ఒక చోట భూమి అడిగినందుకు కావచ్చు. ఇంకొక చోట నీళ్ళ చెరువు దగ్గర కావచ్చు.

మరొక చోట సినిమాహాలులో కుర్చీ దగ్గర కొట్లాట కావచ్చు. దాడికి సాకులు ఏమైనా కావచ్చు. దాడి చేసిన కులం ఏదైనా కావచ్చు. కానీ దాడులకు బలౌతుంది మాత్రం దళితులే. అంటరాని వారిగా, హీనంగా, దీనంగా వెలివాడల్లో బతకాల్సిన వారు మనువు గీసిన విభజన రేఖల్ని తుడిపే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే దాడులు జరుగుతున్నాయి.

భూమిలేని కారణంగానే దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ, దాడులు ఆగాలంటే భూపోరాటం చెయ్యాలనే అగ్రకుల భావజాలం కలిగిన కులదాటవేత దారులకు ఒక ప్రశ్న. ఈ దేశంలో భూమిలేని మిగిలిన కులాల ప్రజలపై ఇలాంటి సామూహిక దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎందుకు జరగడం లేదో చెప్పాలి. భూమి ఉన్నాగాని ఖైర్లాంజిలో భయ్యాలాల్ కుటుంబం మొత్తం అత్యాచార హత్యలకు ఎందుకు బలయ్యిందో చెప్పాలి. ఈ దేశంలో ముస్లింలపై, క్రైస్తవులపై, దళితులపై ముస్లింలైనందుకే, క్రైస్తవులైనందుకే, దళితులైనందుకే దాడులు జరుగుతున్నాయి. అందుకు భూమి లేకపోవడం, ఉండటం ప్రమాణం కాదు.

ముస్లింలపై, క్రైస్తవులపై సామూహిక హత్యాకాండకు హిందూ మతోన్మాదమే కారణం అంటున్నవారు దళితులపై దాడులు జరిగినపుడు అగ్రకుల దురహంకార దాడిగా చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు. ముస్లింలకు, క్రైస్తవులకు భూములుంటే ఇలాంటి దాడులు జరగవు అని అననివారు, భూమిలేని కారణంగానే దళితులపై దాడులు జరుగుతున్నాయని ఎందుకు పడికట్టు పదాలు వల్లిస్తున్నారు. భూమి ఎంతవసరమో దళితులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ దళితులు వ్యవసాయ రైతు కూలీలే. దుక్కి దున్నిన దగ్గర్నుంచి భూస్వామి గాదెలు నింపేదాకా మట్టితో పెనవేసుకుపోయిన జీవితం వాళ్ళది. అగ్రకుల భూస్వామ్య దోపిడీ, దౌర్జన్యాలు నిత్యం ప్రత్యక్షంగా అనుభవించిన సమూహమది.

కారంచేడు మారణకాండకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్దఎత్తున ఉద్యమించారు. లక్షింపేట నరమేధం సందర్భంగా ఆ స్పందన కరువయ్యింది. కనీసం దళితులు కూడా అంతగా స్పందించకపోవడం విషాదం. 1985 నాటి దళితుల సామాజిక ఆర్థిక, రాజకీయ స్థితితో పోల్చుకుంటే ఈ 27 ఏళ్ళలో దళితులు కొంతమేరకైనా అభివృద్ధి చెందారని చెప్పవచ్చు. కానీ అట్టడుగుస్థాయి దళితుల ఆక్రందనలు దళిత అధికారులకు, రాజకీయంగా అనేక అవకాశాలు అందిపుచ్చుకున్న దళిత నాయకుల చెవికెక్కడం లేదు. ఆ విషయాన్ని లక్షింపేట మరోసారి రుజువుచేసింది. 

వంగర ఎస్.ఐ, పాలకొండ సి.ఐ, డిఎస్‌పి, స్థానిక ఎమ్మెల్యే (మంత్రి కూడా) అందరూ దళితులే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాలలు. అయినప్పటికీ చట్టాన్ని అమలుచేసి లక్షింపేట మాలలకు న్యాయం అందించే చిన్న ప్రయత్నం చెయ్యకపోగా అగ్రకుల ఆధిపత్య శక్తులకు, హంతక మూకలకు అండగా నిలబడ్డారు. మరోవైపు అనేకమంది మేధావులు, ప్రజాస్వామికవాదులుగా గుర్తింపు ఉన్నవారు 'లక్షింపేట దళితులపై ఇంతటి అమానుషమైన దాడి జరిగితే కనీసం దళితులు కూడా స్పందించడం లేద'ని ఒక వ్యాఖ్యానం చేసి చేతులు దులుపుకుంటున్నారు. లక్షింపేట కులసమస్య కాబట్టి ఆ కులం వాళ్ళు స్పందించాలనే తప్పుడు అవగాహనతో సమాజం కుంచించుకుపోతుంది. అందుకే లక్షింపేటలో జరిగింది మానవహక్కులపై, జీవించే హక్కుపై, ప్రజాస్వామ్యంపై, సామాజిక న్యాయంపై, మొత్తంగా ఒక మానవ సమూహంపై జరిగిన అమానుషమైన దాడిగా బుద్ధిజీవులకు అనిపించడం లేదు. హంతకమూకలకు ప్రత్యక్ష అండదండలందిస్తున్న అగ్రకుల పాలకవర్గ పార్టీల నుంచి దళిత సమూహం ఆశించేదేమీ లేదు.

పేద ప్రజల పార్టీలు అనిచెప్పుకుంటున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని దళితులపై దాడుల విషయంలో గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయి. వీరికి తోడు విప్లవపార్టీలుగా చెప్పుకుంటూ దళితుల నెత్తురులో కూడా ఓట్లేరుకునే పార్టీలు. ఆ పార్టీల మేధావులు దళితులపై హత్యలు జరిగిన ప్రతి సందర్భంలో భూమి సమస్యను ముందుకు తెస్తూ దళితులు భూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉంటారు. 

ఈ మధ్యకాలంలో విప్లవాన్ని కోరుకునే కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు కూడా 'లక్షింపేట'లో కులసమస్యను గాలికొదిలి, భూమి సమస్యను ముందుకు తెస్తున్నారు. దళితులు దాడికి బలైన ప్రతీసారి భూమిని పోటీగా నిలబెడుతున్నారు. అగ్రకుల దురహంకారాన్ని, దాని తీవ్రతను మరుగుపరిచే ఇలాంటి వైఖరి అగ్రకుల భూస్వామ్య ఆధిపత్య శక్తులకు బలాన్నిచ్చేదిగా ఉంటుంది. ఆ విధంగా ప్రచారం చెయ్యడం ద్వారా ఈ ప్రచారకులకు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీరు పేదలందరి ప్రయోజనం, క్షేమం కోరేవారిగా అందరికీ భూములు పంచేవారిగా నిలబడుతూ దళితులు భూ పోరాటాలను వ్యతిరేకించే వారిగా, భూమి విలువ తెలియనోళ్లుగా, మిగిలిన పేదలందరికీ వ్యతిరేకులుగా తేల్చేస్తున్నారు. ఇది అత్యంత అమానుషమైన, వికృతమైన, నిగూఢమైన వివక్షారూపం.

పేదలకు, అందునా అంటరాని పేదలకు భూమి ప్రధానమైన అవసరం. ఎవ్వరూ కాదనరు. తరతరాలుగా భూమి కోసం జరుగుతున్న యుద్ధమే అందుకు సాక్ష్యం. తాజాగా లక్షింపేట మనముందుంది. భూమి కేంద్రంగా పేదలందర్ని ఐక్యం చేసి భూస్వామిని ఒంటరి చేసి భూములు పేదలకు పంచడం ఒక కార్యక్రమం. ఇది కొంచెం అటుఇటుగా కమ్యూనిస్టు పార్టీల వైఖరి. కానీ ఆ భూస్వామి కులాన్ని కేంద్రంగా చేసుకొని కుట్రలు చేసి పీడిత ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసి తన అగ్రకుల ఆధిపత్యాన్ని మరింత పటిష్ఠపరుచుకుంటున్నాడు. ఇది ఈ దేశంలో మాత్రమే ఉన్న ప్రత్యేక పరిస్థితి.

భూమి వ్యక్తిగత ఆస్తి కాబట్టి భూస్వామి భూములు ఆక్రమణకు గురైనపుడు అతని కుటుంబ సభ్యులు రాజ్యం మాత్రమే అండగా నిలబడుతుంది. దళితులు రచ్చబండ మీద కూర్చుంటే, అగ్రకుల రీతిలో చెప్పులేసుకొని నడిస్తే, దేవాలయ ప్రవేశం కోరితే, ఎవ్వరికీ ఏ నష్టం జరగడం లేదు. అయినప్పటికీ దళితులకు వ్యతిరేకంగా ధనిక, పేద తేడా లేకుండా దళితేతరులందరూ ఐక్యమవుతున్నారు. అందుకు రాజ్యం, అగ్రకుల భూస్వామ్య పెత్తందారీ వర్గం, సామ్రాజ్యవాదం, హిందూమతోన్మాదం అండగా ఉంటుంది. కాబట్టి దోపిడీ ఆధిపత్య శక్తులు తమకు రక్షణ వలయంగా కులవ్యవస్థను కట్టుదిట్టం చేసుకుంటున్నారు. ఆ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకుంటున్నవారు కుల వ్యవస్థను బలహీనపరిచే కార్యక్రమం రూపొందించుకోవాలి. కానీ అందుకు భిన్నంగా కుల అణచివేతకు వ్యతిరేకంగా ఆధిపత్య శక్తుల బహుముఖ దాడికి బలవుతూ, పోరాడుతూ నెత్తురోడుతున్న వాళ్ళను కులతత్వవాదులుగా కుదించి అపహాస్యం చేస్తున్నారు.

వెలివాడల్లో బతుకుతున్న దళితులు కుల వివక్ష రూపాలను వ్యతిరేకిచడం అంటే అగ్రకుల భూస్వామ్యాన్ని, దాని ఆధిపత్యాన్ని సవాల్ చెయ్యడం. దానికి అండగా ఉన్న రాజ్యానికి, పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదానికి, హిందూమతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడ్డం. వారి పోరాటం వర్గ పోరాటంలో అంతర్భాగమే. కాబట్టి కమ్యూనిస్టుల వర్గ దృక్పథం, దళితుల (కులదృక్పథం కాదు) కుల నిర్మూలన దృక్పథం వేరు వేరు కాదు. ఎవరెవరికి ఏమి అడ్డొస్తున్నాయో గానీ కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేవారిని కులతత్వ వాదులుగా, వారి పోరాటాలను అస్తిత్వ పోరాటాలుగా, అస్తిత్వ పోరాటాలు విప్లవోద్యమానికి అడ్డంకిగా చిత్రీకరిస్తూ ఒకదానికొకటి పోటీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇన్ని కుటిల ఎత్తుగడల మధ్య దళితుల కోసం బతికే వారిని, దళితులపై బతికేవారిని వేరుచేయడం దళితుల తక్షణ కర్తవ్యం కావాలి. ఆధునిక మనువాదుల అనేక ముసుగుల్ని బరాబదలు చేస్తూ మరో లక్షింపేట జరగకుండా పీడిత కులాల్ని ఐక్యం చెయ్యడం ఉద్యమశక్తుల ముందున్న సవాల్.

- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి

Andhra Jyothi News Paper Dated : 16/10/2012 

No comments:

Post a Comment