Wednesday, November 13, 2013

అస్తిత్వం కోసం ఆదివాసీల పోరాటం -మైపతి అరుణ్‌కుమార్


ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో ఆదివాసీల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. తినటానికి తిండిలేక కట్టుకోవడానికి బట్టలు లేక, పూట తిండి కోసం ఆరాటపడుతూ దుర్భర జీవనాన్ని గడుపుతున్నారు. నేటికి 92శాతం మంది అడవిపై ఆధారపడుతూ జీవిస్తున్నారు.78 శాతం ఆదివాసీ గ్రామాలకు కరెంటు లేదు. 75 శాతం గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ప్రతి 1000 మందికి 80 మంది స్త్రీలు ప్రసవ సమయంలో బిడ్డతో సహా మరణిస్తున్నారు. ప్రతియేట మలేరియా, పచ్చకామెర్లు, అతిసార, డెంగ్యూ లాంటి విషజ్వరాలు వచ్చి వేలాదిమంది ఆదివాసీలు చనిపోతున్నారు. అభివృద్ధి పేరుతో శ్రీకాకుళంలో కన్నెధారకొండ గ్రానైట్ తవ్వి, కొండ, అటవీ ఫలసాయంతో జీవించే సవరలను నిర్వాసితులను చేస్తున్నారు. ఎలిఫెంట్ జోన్ పేరిట 30వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ప్రాంతంలో సవర, జాతాపులను అడవికి దూరం చేస్తున్నారు. విశాఖ మన్యంలో ఎనిమిది వేల హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలతో 274 కోందు గూడాలను ఛిద్రం చేస్తున్నా రు. జోలాఫుట్ డ్యాం కింద, బలిమెల రిజర్వాయర్ కింద నిర్వాసితులైన కోందులు, పోర్జలు, నూకదొరలు నిర్వాసితులై చెట్టు కొకరు, పుట్టకొకరుగా చెలా చెదురయ్యారు. సీలేరు డ్యాం క్రింద నిర్వాసితులైన ఆదివాసీలకు నష్టపరిహారం లేదు.

కానీ,దాని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును బయటి ప్రాంతాలకు పంపుతున్నారు. కేటీపీఎస్ (పాల్వంచ), బీపీఎల్.(భవూదాచలం), ఎ.పి. రేయాన్స్ (కమలాపురం), భారజల కర్మాగారం (మణుగూరు), దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ (మంచిర్యాల) లాంటి పరివూశమలు పెట్టి, దాని నుంచి వచ్చే బూడిదను ఆదివాసీల బతుకుల్లో నిం పుతున్నారు. దాని నుంచి వచ్చే కోట్లాది రూపాయల లబ్ధి పొందుతున్నారు. ఉద్యోగాలను సైతం ఐదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించి బయటి ప్రాంతాల వారితో భర్తీ చేస్తున్నారు. టైగర్‌జోన్ పేరుతో 244 గోండు, కోలామ్, పర్ధాన్ గూడాలను ఖాళీ చేయిస్తున్నారు. కుంటాల జలవిద్యుత్ ప్రాజెక్టు పేరుతో గోండుల సాంసృ్కతిక సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఓపెన్ కాస్టుల పేరిట బొగ్గును వెలికితీసి ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు.

ఆదివాసీల సాంసృ్కతిక సాంప్రదాయాలు క్రైస్తవ, హిందు మతాల ప్రభావంవల్ల విచ్ఛిన్నం అవుతున్నవి. ఆదివాసుల అభివృద్ధి కోసం ఏర్పా టు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ (ఐటీడీఏ)లు అవినీతికి నిలయాలుగా మారిపోయాయి. కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అత్యాచార నిరోధక చట్టం ఉన్నప్పటికి వాకపల్లి, భల్లుగూడ లాంటి అత్యాచారాలు ఆదివాసీలపై హింసకు తార్కాణాలు.

1/70 చట్టం అమలులో ఉన్నా 48 శాతం భూములు గిరిజనేతరుల చేతుల్లో ఉండటంతో, స్వంత భూమిలో ఆదివాసీలు కూలీలుగా మారుతున్నారు. 2006 అటవీ హక్కు చట్టం గిరిజనేతరులకు చుట్టంగా మారింది. దీంతో 30 ఆదివాసీ తెగలు అంతరించే స్థితికి చేరుకున్నాయి. 1950లో 30 ఆదిమ తెగలకు కల్పించిన రిజర్వేషన్ 4 శాతం.1976లో డినోటిఫైడ్‌గా లంబాడా, ఎరుకల, యానాదిలను ఎస్టీల్లో కలిపినపుడు రెండుశాతం రిజర్వేషన్‌ను పెంచి మొత్తం ఆరుశాతం చేశారు. కాని, మొత్తం రిజర్వేషన్లను కలుపబడిన లంబాడా, ఎరుకల, యానాదులే అనుభవిస్తున్నారు. అం దుకే మొదటగా ఉన్న 4 శాతం రిజర్వేషన్‌ను ఆదివాసీలకు కేటాయించి, తర్వాత కలిపిన రెండుశాతం రిజర్వేషన్‌ను మూడు కులాలకు వర్తింపచేయాలి.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడి ఐదున్నర దశాబ్దాలు అయినా, నేటికి తెలుగురాని సవర, గోం డు, కోలాం, కోందు గూడాలున్నాయి. ఐదవ షెడ్యూల్, పీసా చట్టం 4(ఓ) క్లాజు ప్రకారం ఆదివాసీ ప్రాంతాలను షెడ్యూల్డ్ ఆదివాసి జిల్లాలుగా ఉట్నూరు, ఆసిఫాబాద్ (ఆదిలాబాద్), మహదేవ్‌పూర్ (కరీంనగర్), ఏటూరునాగారం (వరంగల్), భద్రాచలం (ఖమ్మం),రంపచోడవరం (తూర్పు గోదావరి), పాడేరు (విశాఖపట్నం), కోట రాంచంవూదాపురం (పశ్చిమ గోదావరి),పార్వతిపురం (విజయనగరం), సీతంపేట (శ్రీకాకుళం) లాంటి ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ ఆదివాసీల మాతృభాషలోనే అమలు చేయాలి. దీంతో పాటు రాజ్యాం గంలోని 5వ షెడ్యూల్ 3వ భాగం క్లాజ్ (3) ప్రకారం కొత్తగా రాష్ట్రాలు ఏర్పడే క్రమంలో నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు షెడ్యూల్డ్ గ్రామాల జాబితాలో చేర్చాలి. దీని ప్రకారం 805 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు షెడ్యూల్డ్ గ్రామాలుగా ఏర్పాటుచేసి నూతనంగా విభజించబడే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అటానమస్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలి. లేదంటే నూతన రాష్ట్రాల అభివృద్ధి విధానంలో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉంది. 
-మైపతి అరుణ్‌కుమార్
ఆదివాసీ రచయితల సంఘం
(నేడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ విద్యార్ధి
సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బహిరంగ సభ సందర్భంగా)

Namasete Telangana Telugu News Paper Dated : 14/11/2013 

No comments:

Post a Comment