Thursday, January 10, 2013

ప్రియమైన ఓయూ విద్యార్థులారా.. ప్రొఫెసర్ జి.హరగోపాల్



Osmania
ప్రియమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు,
ఈ లేఖ మీకు రాయడానికి ప్రధాన కారణం ఇంత కాలంగా మీరు మమ్మల్ని గౌరవించారు. ఏ అంశం మీద మాట్లాడినా గంటల తరబడి విన్నారు. మేం కూడామిమ్మల్ని గౌరవించాం. మీలో చాలామంది మొదటి తరం విద్యార్థులు. మీరు ఈ ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించే నిర్ణేతలు. ఈ పీహెచ్‌డీ సీట్ల సమస్యకు పరిష్కారం తెలంగాణ ఉద్యమంలో భాగంగా వెతుకుతూనే... ఉద్యమంలో భాగం కండి. మీరులేని ఉద్యమం ద్వారా తెలంగాణ రావడం తెలంగాణకు మంచిది కాదు. మీకు మంచిది కాదు.
ఒకటి, రెండు వారాలుగా ఉస్మానియా క్యాంపస్‌లో సంఘటనలు మాలాంటి వాళ్లను చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయ పాలనాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ అగాథము ఇంకా పెరిగింది. ఈ సంఘటనలు రాబోయే కాలంలో విద్యార్థుల, అధ్యాపకుల మధ్య ఒక విజ్ఞానదాయకమైన సంబంధానికి దారితీస్తాయా? రేపు అధ్యాపకులు క్లాస్ గదులలో ఒక విశ్వాసంతో మీ మీద ప్రేమతో ఎలా బోధించగలరు. 

ఇప్పుడు కూడా కొందరు అధ్యాపకులు మీ పట్ల ఆసక్తి కలిగిలేరని, వాళ్ల వృత్తిని వారు సరిగా నిర్వహించడం లేదని మీరు అనవచ్చు. ఆ దూరాన్ని, ఆ పరస్పర అవగాహనను తెలంగాణ ఉద్యమం కొంత వరకు తీర్చగలదని, తెలంగాణ రాష్ట్ర మంటూ ఏర్పడితే, కొత్త రాష్ట్రంలో ఉద్యమ కాలంలో ఏర్పడిన బంధం మరింత బలపడి ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని పునః నిర్మించుకుంటుందని భావించాం. తెలంగాణ వస్తుందేమో, కేంద్రం ఏదైనా నిర్ణయం ఆ దిశగా తీసుకుంటుందేమోనని ప్రజలు ఆశపడుతున్న తరుణంలో మీ సంబంధాలు ఇంత సంక్షోభంలో పడితే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికాక ఈ బాధకరమైన అనుభవమే, మన జ్ఞాపకంగా నిలిచిపోతే మీరు ఎందుకు త్యాగాలు చేసినట్టు? బోలెడంత మంది ఎందుకు ప్రాణాలు ఇచ్చినట్టు? లక్షలాదిమందిని మీరు ఎందుకు సమీకరించినట్టు? మూడు, నాలుగు ఏళ్లుగా మీరు ఎందుకు పోరాటాలు చేసినట్టు?

ఒక నెలలోపలే తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి ప్రకటించి, ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అఖిలపక్షం మీటింగ్ పెట్టారు. ఈసారి అఖిలపక్షంలో జరిగిన చర్చ గతం కంటే కొంత మెరుగుగా ఉంది. సోనియాగాంధీ ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు అగుపిస్తున్నది. ఈ నిర్ణయ ప్రక్రియ దశదిశను నిర్దేశించడానికి తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ విభేదాలను పక్కకు పెట్టి, ఒకే వాయిస్‌తో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం తమకు అంగీకారం కాదని స్పష్టంగా ప్రకటించవలసి ఉన్నది. ఈ దిశగా మనం కదలాలని తెలంగాణ జర్నలిస్టు ఫోర మ్ నిర్వహించిన అఖిలపక్ష సదస్సులో అందరూ భావించారు. రాజకీయ పార్టీల మీద, కేంద్రం మీద అవసరమైన ఒత్తిడి ప్రజలు పెట్టాలని జర్నలిస్టు ఫోరమ్ విజ్ఞప్తి చేసింది. ఈ ఒత్తిడి పెట్టవలసిన దశ లో మీరు ఎక్కడున్నారు? మీరు పీహెచ్‌డీ సీట్ల కోసం ఆందోళనపడుతున్నారు. మీ ఆందోళన చూస్తే డాక్టర్ జయశంకర్ ఒక సందర్భంలో ‘తలకాయే పోతున్నప్పుడు ముక్కుపుల్ల కోసం ఆందోళన పడ్డ ట్టు’ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. 

ఇక పీహెచ్‌డీ సీట్ల విషయంలో మీరు ఆలోచించవలసిన కొన్ని అంశాలున్నాయి. పరిశోధన చేయడానికి బడుగు వర్గాలకు కొన్ని సౌకర్యాలు యూజీసీ వారు కల్పించారు. ఇందులో స్కాలర్‌షిప్‌ల డబ్బులను పెంచారు. దీనికి అప్పటి యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ థోరట్, అప్పటి ప్లానింగ్ కమిషన్ సభ్యు డు ప్రొఫెసర్ ముంగేకర్ చాలా ప్రయత్నం చేశారు. చాలామంది తమ పోస్ట్‌క్షిగాడ్యుయేషన్ అయిపోతూనే బయట అవకాశాలు లేకపోవడం వలన తమ అర్హతలను పెంచుకొనడానికి, లేదా ఒక ఉద్యోగం దొరికే దాకా ఇది ఒక తాత్కాలికమైన ఊరటగా చూస్తున్నారు. పేదరికం, అవకాశలేమి ఉన్న సమాజంలో ఉండే పరిస్థితే ఇది. పీహెచ్‌డీ అన్ని కోర్సులలాగా ఉండదు. ఒక్కొక్క అర్హత ఉన్నా అధ్యాపకుడి కింద ఆరుమందే పనిచేయాలని యూజీసీ ఒక నిబంధన విధించింది. (ఈ నిబంధన సహేతుకమా లేదా అన్నది మరోచర్చ) ఒక డిపార్టుమెంటులో ఉండవలసిన కనీస అధ్యాపకుల సంఖ్య ఆరుగా ఉండాలని యూజీసీయే నిర్ణయం చేసింది. ఈ లెక్క ప్రకారం ఆరు మంది దగ్గర కలిసి మొత్తం 36 మంది పరిశోధన చేయవచ్చు. ఒక స్కాలర్ చేరితే ఆయన ఐదు, ఆరు సంవత్సరాలు పనిచేయవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు చేయవలసిన డిమాండ్ ఉస్మానియాలో అన్ని ఖాళీ పోస్టులను నింపాలని, పరిశోధనకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలని.. అలాగే ప్రత్యేకంగా రీసెర్చ్ ప్రొఫెసర్స్‌ను నియమించి వాళ్లు కేవలం రీసెర్చ్ గైడెన్స్ చేయాలని డిమాండ్ చేస్తే మరికొన్ని సీట్లు పెరుగుతాయి.

ఇప్పుడు అధ్యాపకుల సంఖ్య బోధనా పీరియడ్స్ మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతం రీసెర్చ్‌కు రాష్ట్ర విశ్వవిద్యాలయంలో అంత ప్రాముఖ్యం లేదు. పాశ్చాత్య విశ్వవిద్యాలయంలో ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లో వందల అధ్యాపకులుంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మెడికల్ స్కూల్‌లో 8,000మంది అధ్యాపకులున్నారు. మన ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలను చూసి బుద్ధి తెచ్చుకోండి అని బుద్ధిలేని మాటలు మనకు చెబుతున్నది. మనం హార్వర్డ్ కావలసిన అవసరంలేదు. మన విశ్వవిద్యాలయాలు పేద వర్గాల నుంచి వచ్చే పిల్లల ప్రతిభ పెంచి, సామాజిక స్పృహ కలిగించగలిగేతే చాలు. పేద వర్గాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్న పిల్లల అవసరాలు తీరిస్తే చాలు. విశ్వవిద్యాలయాలలో అవకాశాలను పెంచే బదులు గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచబ్యాంకు ఒత్తిడి మేరకు సామ్రాజ్యవాద దుర్మార్గం వలన విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ తగ్గాయి, పోస్టులు తగ్గాయి, వసతులు తగ్గాయి. మీరు ఆవేశంలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్ని ఇప్పుడు అప్రస్తుతంగా తోచవచ్చు. కానీ మనుషులు ఆవేశంలో ఉన్నప్పుడే వాస్తవాలు చెప్పాలి. 

మీకు తెలుసో లేదో ప్రపంచబ్యాంకు ఉన్నత విద్యను ‘నాన్ మెరిట్ గూడ్’ గా పరిగణిస్తున్నది. వాళ్ల విభజీకరణలో, పబ్లిక్ గూడ్, మెరిట్ గూడ్, నాన్ మెరిట్ గూడ్ అని మూడు రకాలు. పబ్లిక్‌గూడ్‌లో సైన్యం, పోలీసు, పాలనా వ్యవస్థ; మెరిట్ గూడ్‌లో స్కూలు విద్య లాంటివి చేర్చారు. నాన్ మెరిట్ గూడ్ అంటే సమాజము ఒక సేవను అందిస్తే ఆసేవ నుంచి వ్యక్తి ఎక్కువ ప్రయోజనం పొంది, సమాజం తక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నదన్నది ఈ సూత్రీకరణకు ప్రధాన భూమిక. ఆ కారణం వల్లే చంద్రబాబు ప్రపంచబ్యాంకు కనుసన్నలలో పనిచేసినప్పుడు, వాళ్ల ఆదేశాల మేరకే కాలేజీ సర్వీస్ కమిషన్‌ను మూసేశారు. అప్పుడు విద్యార్థులు ఆందోళన చేసినట్టు నాకు గుర్తులేదు. అప్పటి ఉన్నత విద్య కమిషనర్‌ను కలిసినప్పుడు ఆయన ప్రపంచబ్యాంకు ఒత్తిడి మీద పనిచేయవలసి వస్తున్నదని చెప్పాడు. మీకు తెలుసో లేదో ప్రపంచ బ్యాంకు ఆంధ్రవూపదేశ్‌కు అప్పు ఆపివేయడానికి చెప్పిన ఐదు, ఆరు కారణాలలో స్కూలు విద్యలో ఉపాధ్యాయుల నియామకాలు రద్దు చేయలేదని, నియామకాలను పంచాయతీ వ్యవస్థలకు అప్పగించలేదన్న అంశంపై మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. పంచాయతీలకు ఉపాధ్యాయుల నియామక అధికారం ఇస్తే దానికి కావలసిన మొత్తం నిధులను ఆ సంస్థలకు ఇస్తారా, తెలియదు. చాలా కాలంగా ఆంధ్రవూపదేశ్ విద్యా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మేం ఈ ప్రశ్న లు అడుగుతూనే ఉన్నాం. రాష్ట్రంలోని, లేదా తెలంగాణ ప్రాంతంలోని విశ్వవిద్యాలయ అధ్యాపకులు చాలామంది తాము తీసుకోవలసిన చొరవ తీసుకోలేదు. ఇప్పు డు అధ్యాపకులు విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక ఉద్యమంలో భాగమైతే మనకుండే నైతిక ధైర్యం, మనకుండే స్పష్టమైన సమాధానాల వల్ల పరిస్థితి ఈ దశకు వచ్చేది కాదు. 

తెలంగాణ ఏర్పడితే విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలి అనే అంశం మీద మా లాంటి వాళ్లం మాట్లాడుతూనే ఉన్నాం. ఉద్యమ ఎజెండాలో భాగంగా ఈ సమస్యలు ఉండాలని వాదిస్తూనే ఉన్నాం. ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉండే విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు వివరించి, మనం ఎలాంటి విశ్వవిద్యాలయాలను తెలంగాణలో కోరుకుంటున్నాం. గత దశాబ్ద కాలంగా, ముఖ్యంగా ఉద్యమం ఉధృతంగా ఉన్న గత రెండు, మూడు సంవత్సరాలుగా మాట్లాడి ఉంటే పిల్లలకు సమస్యలకు కారణాలు, పరిష్కారాలు అర్థమయ్యేవి. అలా అవగాహన అయితే తొందరలోనే తెలంగాణ రాష్ట్రం మీద నిర్ణయం తీసుకుంటాం అని అంటున్న సందర్భంలో, పోరాటం దేనిమీద చేయాలో చేయక తమ అధ్యాపకుల మీదే పోరా టం చేసేవారు కాదేమో! ఇప్పటికైనా ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థి సంఘాలతో, ముఖ్యంగా బడుగు వర్గాల నుంచి వచ్చిన వారితో ఒక డైలాగ్ ప్రారంభించాలి. వాస్తవ విషయాలను చెప్పాలి. అది అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. కానీ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా మాట్లాడకపోతే విశ్వవిద్యాలయాల స్వ తంత్ర ప్రతిపత్తి మూలాలే ధ్వంసమైపోతాయి. 
విద్యార్థులకు చివరిగా ఒక విజ్ఞప్తి.

మీరు మా లాంటి వాళ్లను పిలిపించి ఎన్నో ప్రసంగాలు నిర్వహించారు. మీరు ఎప్పుడు కోరినా మీ యూనివర్సిటీకి నేను వచ్చాను. మీరు ఏ అంశం మీద మాట్లాడమంటే ఆ అంశంమీద మాట్లాడాను. మీ రు లక్షల మంది విద్యార్థులను సమీకరించగలిగినప్పుడు రాజకీయ నాయకులను రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించినప్పుడు, లాఠీదెబ్బలు తిన్నప్పు డు, జైళ్లకు వెళ్లినప్పుడు మేం గర్వపడ్డాం. ఇంత పోరాటం చేసి చివరకు తెలంగాణ ఒక కీలకమైన దశలో సంతృప్తికర సమాధానం లేని పీహెచ్‌డీ సీట్ల కోసం పోరాడే ఒక చిన్న ఉద్యమంలో ఇరుక్కుపోయారు, లేదా దాంట్లోకి నెట్టబడ్డారు. మీ తరం సామ్రాజ్యవాదంతో తలపడవలసి ఉంది. సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు తప్పు డు సలహాలు ఇస్తుంటే చరిత్ర తెలియని, సమాజం పట్ల బాధ్యత లేని నాయకులు వాటికి తల ఊపుతుంటే మౌలిక ప్రశ్నలు అడిగే సాహసమున్న మీరు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో సాహసం చేసిన మీరు, మాలాంటి వాళ్లకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చిన మీ చేతిలో తెలంగాణ భవిష్యత్తు భద్రంగా ఉందని మేం భావించాం.

ఈ లేఖ మీకు రాయడానికి ప్రధాన కారణం ఇంత కాలంగా మీరు మమ్మల్ని గౌరవించారు. ఏ అంశం మీద మాట్లాడినా గంటల తరబడి విన్నారు. మేం కూడామిమ్మల్ని గౌరవించాం. మీలో చాలామంది మొదటి తరం విద్యార్థులు. మీరు ఈ ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించే నిర్ణేతలు. ఈ పీహెచ్‌డీ సీట్ల సమస్యకు పరిష్కారం తెలంగాణ ఉద్యమంలో భాగంగా వెతుకుతూనే... ఉద్యమంలో భాగం కండి. మీరులేని ఉద్యమం ద్వారా తెలంగాణ రావడం తెలంగాణకు మంచిది కాదు. మీకు మంచిది కాదు. తక్షణమే తెలంగాణ ప్రకటిస్తే చరివూతలో మీ స్థానమేముంటుందో ఆలోచించండి. అధ్యాపకులతో చర్చలు ప్రారంభించండి. మీ ఆగ్రహానికి వివరణ ఇవ్వండి. అలాగే ఈ పిల్లలు మన పిల్లలు కాబట్టి పిల్లల ప్రవర్తనను ఒక సామాజిక నేపథ్యంలో విశాల మనసుతో అధ్యాపకులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి పాల్గొని ఆ పరస్పర సమష్టి అవగాహన పునాదిపై విశ్వవిద్యాలయ భవిష్యత్ సౌధాన్ని నిర్మించాలి.

మీ ప్రియమైన
ప్రొఫెసర్ జి. హరగోపా

Namasete Telangana New Paper Dated: 10/1/2013

No comments:

Post a Comment