Thursday, January 10, 2013

ఆదివాసీలకు ఉపాధి హామీ?----పి.యస్‌. అజయ్‌ కుమార్‌



ఆదివాసీలు గణనీయంగాఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఇక్కడ 9 జిల్లాలలో షెడ్యూల్డ్‌ (ఆదివాసీ) ప్రాంతంఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా గుర్తింపు పొందని నల్లమల (చెంచు) అటవీప్రాంతం, యానాదులువంటి మైదాన ప్రాంత ఆదివాసీలు, నాన్‌షెడ్యూల్‌ ఆదివాసీలు కూడా కలుపుకుంటే 23 జిల్లాలలో వారు జనాభాలో (2001 లెక్కల ప్రకారం) 6.59 శాతంగా ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం వలన నష్టం జరుగుతుందని గట్టిగా వాదించేవారు సహితం ఆదివాసీలకు, ఆదివాసీ ప్రాంతాలకు వచ్చే సరికి పథకం పట్ల(ఆదివాసీ ప్రాంతాలలోకి చొరబడి వారిభూములు కబళించినవారుతప్ప) సాను కూలత వ్యక్తం చేస్తుంటారు.
మెట్టు (కుష్కి) వ్యవసాయం, అటవీ ఫలసాయం తప్ప మరో విధమైన ఉపాధికి అవకాశం లేని ఆదివాసీ ప్రాంతాలు పేదరికంతో కూనరిల్లుతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారమే 61 శాతం ఆదివాసీలు పేదరికంలోఉన్నారు. మనరాష్ట్రంలో నోటిఫైచేసిన 35 తెగలలో 8 తెగలను అత్యంత పేదరికంలో ఉన్నవారిగా గుర్తించారు. పౌష్ఠికాహారలేమి, రక్తహీనతలలో జాతీయ, రాష్ట్ర సగటుకంటే ఆదివా సీ ప్రాంతాలు అధికంగా ఉంటాయి.

ఈనేపథ్యంలో ఉన్న గ్రామంలోనే ఉపాధి లభించడం చిన్నవిషయం కాదు. దేశ వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల ప్రణాళిక వ్యయం బాగాతగ్గిపోయిన ఈ రోజులలో ఆదివాసీప్రాంతాల వ్యవసాయ రంగం దుస్థితి ఎలా ఉంటుందో సులువుగా ఊహాంచవచ్చు.ఒక సంవత్సరంలో 100 రోజుల పని ద్వారా ఒక కుటుంబానికి ప్రస్తుతం ఉన్న రేటు (ఒక పని దినానికి రూ. 137) ప్రకారం రూ. 13,700 ఈ పథకం ద్వారా పొందే వీలుంది. ఒక మారుమూల ఆవాసానికి చెందిన ఒక ఆదివాసీ కుటుంబానికి ఈ నగదు తక్కువ మొత్తం ఏమీకాదు.12 నెలలపాటు రేషన్‌ దుకాణంలో సర కులు విడిపించుకోవడానికీ, సంతఖర్చులకు హామీ లభిస్తుంది. ఆదివాసీ ప్రాంతా లలో ఉపాధి సృష్టించాలంటే తప్పనిసరిగా భూమి, అడవి అభివృద్ధిపనులను చేపట్టి తీరాలి. కనుక ఆదివాసీ ప్రాంతాలలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన ‘భూ అభివృద్ధికి’ స్థిరమైన పెట్టుబడి వ్యయం లభిస్తుంది.అందుచేత ఏజెన్సీ ప్రాంతాలు, ఆదివాసీలకు సంబంధించినంత వరకు ఉపాధిహామీ పథకానికి చాలా ప్రాధాన్యతఉంది. ఆదివాసీ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం అమలు తీరు, సమస్యలు-మన రాష్ట్రంలో 9 జిల్లాలలో షెడ్యూల్డ్‌ ప్రాంతాల భౌగోళిక స్థితిగతులు అన్నీ ఒకే విధంగా లేవు. మైదాన ప్రాంతాలకు ఇవి భిన్నంగా ఉంటాయి.

మైదాన ప్రాంతా లతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాలలో, ఒక మండలానికి సగటు ఆవాసాల సంఖ్య ఎక్కు వ.మైదానాలకు, ఆదివాసీ ప్రాంతాలకు ఈతేడా 6373గాఉంది. శ్రీకాకుళం, విశాఖ పట్నం జిల్లాలలో ఈ తేడా 321, 231గా ఉంటుంది. ఆదివాసీ మండలాల్లో శివారుగ్రామాలు/ ఆవాసాలు అధికంగా ఉండటంతోబాటు వాటి మధ్య దూరం కూడా (మైదానాలతో పోలిస్తే) ఎక్కువ. అయితే ఆవాసాలలో జనాభా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఉపాధి పథకంలో నమోదైన శ్రామికులు గ్రామీణ ప్రాంత పంచాయితీలో సగటున 126 ఉంటే, ఆదివాసీ ప్రాంతంలో 166 కుటుం బాలు. గిరిజన సంక్షేమశాఖ లెక్కల ప్రకారం 5947 ఏజెన్సీ గ్రామాలు ఉంటే వాటిలో 1902 ఆవాసాలకు ఎలాంటి రహదారి మార్గం లేదు. మిగిలిన వాటికి కొద్దో గొప్పో దారి సౌకర్యం ఉంది. ఒక వర్షం పడితే రాకపోకలు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం అమలు తీరునుపరిశీలించవ లసి ఉంటుం ది.ఉపాధి పథకాన్ని రాష్ట్రంలో, దేశంలో అమలు పరుస్తున్నది గ్రామీణాభివృద్ధి శాఖ. దాని రాజ్యాంగ బాధ్యత గ్రామాల అభివృద్ధి. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, రక్షణకు గిరిజన సంక్షేమశాఖ ఉంది. 

దాని రాజ్యాంగబాధ్యత ఆదివాసీల సంక్షేమం. ఇక్కడే అసలుసమస్య ఎదురౌతుంది. మైదాన ప్రాంత గ్రామాలకు, ఆదివాసీ ప్రాంతాలకు మధ్య ఉన్న తేడాను గ్రామీణాభివృద్ధి శాఖ చూడలేదు. అది దాని బాధ్యతకూడా కాదు. ఉదాహరణకు మైదానప్రాంత పంచాయితీలు, ఆదివాసీ గ్రా మపంచాయితీలు ఒకటి కాదు. ఆదివాసీ ప్రాంతాల పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అంతేగాక ‘గ్రామం’ అంటే ఆదివాసీ ప్రాంతం అని అర్ధం, నిర్వచనంవేరు. ఈ తేడా గుర్తించకపోవడం వలన మైదాన ప్రాంతాల అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన పథకాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ యథా తథంగా ఆదివాసీ ప్రాంతాలకు విస్తరింపచేస్తున్నది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనల పరిధిలో ఉన్నప్పటికీ గ్రామీణాభివృద్ధిశాఖ తనఅధీనంలోని ‘జిల్లా నీటి పారుదల యాజమాన్యసంస్థ’ ద్వారా ఉపాధి హామీపథకాన్ని ఈ ప్రాంతాలలో అమ లుపరుస్తుంది. వర్షాలు పడినప్పుడు మెరక (కుష్కి) పొలాల్లో నీరు నిలిచి ఉండేం దుకు కందకాల (ట్రెంచ్‌) పనిని ఉపాధి హామీ పథకంలో రూపొందించారు. సుమా రు 2.50 మీటర్ల పొడవు ఉండే ఈ కందకపులోతును 0.50 మీటర్లుగా నిర్ణయించి రాష్ట్రంలో పనులు చేయించారు.

ఈ కందకాల వలన ఒనగూడె దీర్ఘకాలిక లాభాల్ని అనేక చోట్ల మెట్టప్రాంత రైతులకు సరిగ్గా వివరించలేదు. దాంతో కొందరు రైతులు తవ్వినవాటిని కప్పివేయడం మొదలుపెట్టారు. దీనికి విరుగుడుగా కందకం లోతు ను 0.50 మీటరు నుండి1 మీటరుకు పెంచారు. యథాలాపంగా ఈ నియమాన్ని ఆదివాసీ ప్రాంతాలకు వర్తింపచేశారు. విశాఖ జిల్లాలో మొత్తం ఆదివాసీ ప్రాంతం (11మండలాలు, 245పంచాయితీలు, 3914ఆవాసాలు, లక్ష 50 వేల ఆదివాసీ జాబ్‌కార్డు కుటుంబాలు) ఎత్తయిన కొండలపైఉన్నాయి. ఇక్కడ కొండల్లో ఆదివాసీ లు ఒక మీటరు లోతు ఎలాతవ్వగలరు? గ్రామీణాభివృద్ధి శాఖకు తెలీదు, గిరిజన సంక్షేమ శాఖకు పట్టదు. రెండవ ఉదాహరణ- గ్రామ పంచాయితీస్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని అమలుపర్చే కీలకమైన ఉద్యోగి విలేజ్‌ రిసోర్స్‌ పర్సన్‌/ ఫీల్డ్‌ అసి స్టెంట్‌/ రోజ్‌గార్‌ సేవక్‌.పేరు ఏదైనా చేసేపని ఒకటే).గ్రామీణాభి వృద్ధి శాఖ ఉత్త ర్వుల ప్రకారం ఒక పంచాయితీకి ఒక విఆర్‌పి ఉంటారు. ఆపంచాయితీలో 5కు మించి శివారుగ్రామాలు ఉంటే ఇద్దరు విఆర్‌పిలు ఉండాలని నియమం. విశాఖ జిల్లాలో మైదానప్రాంత మండలం టి.అర్జాపురం పంచాయితీలో 7 శివారు గ్రామాలున్నాయి.

కనుక అక్కడ ఇద్దరు విఆర్‌పిలను నియమించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతమై జి. మాడుగుల మండలం, సొలం పంచాయితీలో 56 శివారు గ్రామాలు న్నాయి. వీటిలో కొన్ని గ్రామాలకు వెళ్ళి పంచాయితీకేంద్రానికి రావాలంటే 2 నుం డి 3 రోజులు పడుతుంది.5 శివారు గ్రామాలు మించితే ఇద్దరు విఆర్‌పిలు గనుక ఈ పంచాయితీలోనూ ఇద్దరినే నియమించారు. ఈఇద్దరూ మహిళలే. 2008 ఏప్రిల్‌ నుండి విశాఖ జిల్లాల లో ఈపథకం అమలౌతుంది. ఈ ఐదు సంవత్సరాలలో టెక్నికల్‌ అసిస్టెంట్‌, అడిష నల్‌ ప్రోగ్రాంఆఫీసర్‌లు ఒక్కసారికూడా వెళ్ళని ఏజెన్సీ గ్రామాలు వందల సంఖ్యలో ఉంటాయి. అయినా విఆర్‌పిలు మస్తరు వేస్తున్నట్లు, టిఎలు కొలతలు తీస్తున్నట్లు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌లు చెక్‌ మెజెర్‌మెంట్‌ చేస్తున్నట్లు రికార్డులు చెపుతుంటా యి. కొలతలు నమోదు చేసే పుస్తకాలలో కొలతలు ఉండవు. కేవలం క్యూబిక్‌ మీటర్ల గుండగుత్త సంఖ్యలు ఉంటాయి. సోషల్‌ ఆడిట్‌లో వీటిపై ప్రజాఆడిటర్లు ఫిర్యాదులు వ్రాస్తుంటారు. ప్రిసైడింగ్‌ అధికారులు వాటిని బుట్టదాఖల చేస్తుంటారు. 

అసలు సమస్యలు, టిఎలు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లతో లేవు, గ్రామీణాభివృద్ధి శాఖతో ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలనుగూర్చి అందులో కొందరికి వ్యక్తులుగా తెలిస్తే తెలిసి ఉండవచ్చు. కాని ఒకశాఖగా దానికి ఆప్రాంతాల ప్రత్యేక పరిస్థి తులను గూర్చి తెలిసే అవకాశం లేదు, సొలభం వంటి 17 పంచాయితీలు ఉన్న జి.మాడుగుల మండలంలో ముగ్గురు టిఎలు ఉంటే వారందరూ కూడా ‘ఔట్‌ సోర్సింగ్‌’ పేరున నామమాత్రపు వేతనాలతో పనిచేస్తుంటారు.గ్రామీణ వేతన శ్రామికులకు ఉపాధి హామీ పథకంలో వారికి ఉన్న ‘హక్కు’లు రెండు. ఒకటి 100రోజుల పరిమితితో ‘పనిహక్కు’. ఆపనికి పొందే ‘వేతన హక్కు’. ఈ రెండు హక్కులఅమలులో ప్రభుత్వం విఫలమైతే రెండు రకాలైన నష్టపరిహా రాలను పొందే అవకాశం ఉంది. అవి పనిహక్కు కల్పనలో వైఫల్యానికి ‘నిరుద్యోగ భృతి’, 15 రోజులలో వేతన చెల్లింపులో విఫలమైతే అందుకు ‘నష్టపరిహారం’. గత ఐదు సంవత్సరాలలో పనికల్పించమని అధికారులనుఅడిగి, పని పొందని సందర్భా లు ఏజెన్సీ ప్రాంతాలలో వేలసంఖ్యలో ఉన్నాయి.

అయినా ఒక్క ఆదివాసీ శ్రామికు నికీ నిరుద్యోగభృతి చెల్లించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి చెల్లిం చిన కేసులు రెండే. ఒకటి మెదక్‌ జిల్లాలో, రెండవది శ్రీకాకుళం జిల్లా లకింపేట (హత్యాకాండ అనంతరం)లో.ఈ రెండు సందర్భాలలోను దళిత వేతనశ్రామి కులకు నిరుద్యోగభృతి చెల్లించారు. ఆదివాసీలకు నిరుద్యోగ భృతి ఎందుకు చెల్లిం చలేదని ప్రశ్నిస్తే, వారు అడిగిన వెంటనే 15 రోజులలో పని ఇచ్చేయడం వలన ఈ అవసరం రాలేదని వారంటారు. ఇది నిజం కాదు. ఇక్కడ కూడా కనిపించేది ‘వ్యవస్తాగత’సమస్య. నిరుద్యోగభృతి పొందాలంటే పనికి దరఖాస్తు పెట్టినట్లు నిరూ పించుకునే సాక్ష్యం ఆదివాసీ వద్ద ఉండాలి. అంటే అతను/ ఆమె పనికి దరఖాస్తు పెట్టి, దాన్ని అధికారికి సమర్పించి, వారి నుండి రశీదు పొందగలగాలి. ‘సొలభం’ పంచాయితీకి చెందిన మారుమూల ఆదివాసీలకు దరఖాస్తులు ఇచ్చేదిఎవరు?అవి నింపేదిఎవరు? అవన్నీ పూర్తిచేసుకొని పంచాయితీ కార్యాలయానికి వస్తే ఆ సమ యానికి విఆర్‌పి అక్కడ ఉంటాడన్న నమ్మకంలేదు.

అయితే దీనికి పరిష్కారం? ఆదివాసీలు సాధారణంగా వారపుసంతలకు వస్తుంటారు. అక్కడ ఆయా పంచాయి తీ దరఖాస్తు స్వీకరణ కేంద్రాలు పెట్టవచ్చు. ఖాళీ దరఖాస్తులు, వాటిని నింపే సహా యకులను ఏర్పాటు చేయవచ్చు. దీనిని నిర్వహిస్తే ఆదివాసీ వేతన శ్రామికులకు అది ఒక అలవాటుగా మారుతుంది. కాని గ్రామీణాభివృద్ధిశాఖ ఇటువంటి పనులు చేయదు. ఎందుకంటే దానికి ఆదివాసీప్రాంతాలంటే ఏమిటో తెలీదు, తెలుసుకో దు. ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి ఉపాధి హామీలో రెండు ముఖ్యమైన అంశాలు- ఒకటి, కనీస వేతనం పూర్తిగా అందడం, రెండవది, సకాలంలో అందడం. 100 రోజులకు కలిపి ఒక కుటుంబానికి 13,700 అందాలి. అప్పుడు పూర్తిస్థాయిలో పథకం వారికి చేరినట్లు. దిన వేతనం రూ 137వచ్చి 100 రోజు లు పని కల్పించకపోయినా,100 రోజులూ పనిలభించినా- ప్రతి పనిదినానికి రూ.137 అందకపోయినా నష్టపోయేది ఆదివాసీలే. 100 రోజులు పని పూర్తిగా లభించదు.

దిన కూలి రూ.137 పడదు. ఈ 8 ఐటిడిఎలలో 3నుండి 4 లక్షల కు టుంబాలు ఉపాధి పథకానికి బయట ఉండిపోతున్నాయి. సగటున 65 నుండి 85 పనిదినాల కల్పన జరుగుతోంది. 2008-09 మినహాయిస్తే ఏ సంవత్సరంలో ఆది వాసీలకు అందిన వేతనం కనీసవేతనాల కంటే తక్కువ ఉండటంతో బాటు ఈ తేడా పెరుగుతున్నది.100 రోజులు పూర్తిగా పనిపొందిన కుటుంబాలు మొత్తం కుటుం బాలలో 20 శాతం కంటే తక్కువ. ఈ వివరాలను ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న పేద రికం, రక్తహీనత, పోషకాహారలేమి గణాంకాలతో పోల్చి చూసినప్పుడు బడ్జెట్‌ కేటాయింపులు, పుష్కలంగా నిధులు ఉండికూడా ఆదివాసీలు అల్లాడుతున్నారని తెలుస్తుంది. ఈ పరిస్థితికి వ్యవస్థాగతమైన లోపాలు కాకపోతే కారణం మరి ఏమిటి? 5వ షెడ్యూల్‌ ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసేతరులకు ఆర్ధికంగా లబ్ధి కలి గించే కార్యక్రమాలను చేపట్టి వారిని మరింత శక్తిమంతులుగా చేయవచ్చునా? 

అది 1/70 చట్టం, సుప్రీంకోర్టు సమతతీర్పు, పీసా చట్టాల స్ఫూర్తికి వ్యతిరేకం కా దా?! ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి రాజ్యాంగం చెప్పిన ‘సత్‌ పరిపాలన’కు అర్ధం ఏమిటి? రాష్ట్రం మొత్తంమీద నమోదైన జాబ్‌కార్డులు కోటి 25 లక్షలు. వాటి లో ఆదివాసీల జాబ్‌కార్డులు 14 లక్షల 21 వేలు. ఇవి మొత్తం జాబ్‌కార్డులలో 11 శాతం. 8 జిల్లాల ఆదివాసీ ప్రాంతాలలో వారి జాబ్‌కార్డులు 5 లక్షల 34 వేలు. మొ త్తం జాబ్‌కార్డులో ఇవి 4 శాతం. రాష్ట్రంలో మొత్తం ఆదివాసీ జాబ్‌కార్డులలో షెడ్యూ ల్డ్‌ ప్రాంతాల జాబ్‌కార్డులు37 శాతం. అంటే 63శాతం ఆదివాసీ జాబ్‌కార్డు దారులు, వారి (నాన్‌షెడ్యూల్డ్‌) ప్రాంతాలు, ఉపాధి హామీ పథకం అమలులో వారు ఎదుర్కొం టున్న సమస్యలు ఈ చర్చలోకి రాలేదు. వాటన్నింటిని దగ్గరకు తేవలసి ఉంది. రచయిత ఎ.పి. వ్యవసాయ వృత్తిదారుల యూనియన్‌ కార్యదర్శి 
పి.యస్‌. అజయ్‌ కుమార్‌ 

sdg

Surya News Paper Dated: 10/1/2013

No comments:

Post a Comment