Thursday, January 3, 2013

పురుషాధిక్య విష సంస్కృతి --డేవిడ్,



దేశ రాజధాని ఢిల్లీలో 23 ఏళ్ల మెడికో విద్యార్థి సామూహిక అత్యా చారానికి గురైన సంఘటన యావత్‌ దేశా న్ని కుదిపేసింది. దేశ రాజధాని సైతం మహి ళలకు ఏమాత్రం క్షేమ దాయకం కాదని మరోసారి ప్రపంచానికి రుజువు చేసింది. ఒక మహిళానేత కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తున్న, దేశాన్నెలా పాలించాలో చట్టా లుచేసే సభకు మరో మహిళ నాయకత్వం వహిస్తున్న, చట్టాలు చేసే సభకు ప్రధాన ప్రతిపక్షనేతగా ఒక మహిళ నేతృత్వం వహిస్తున్న ఈ దేశంలో నిత్యం ఏదో ఓ మూలన జరుగుతున్న అత్యా చారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేయడం, ప్రభుత్వాలు చట్టాలు చేస్తామని హమీలు గుప్పించడం తప్ప- సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలే పోతున్నాము. మెడికో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలోనే దేశ రాజధానితోపాటు అనేక ప్రాంతాల్లో ఇలాంటివే అనేక ఘటనలు వెలుగు చూశాయి. మళ్ళీ మళ్ళీ ఏదో ఒక రూపంలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. 

అసలు మానవ సంబంధాలు ఇంత హీనంగా ఎందుకు దిగజారుతున్నాయి? మనిషిపట్ల తోటి మనిషికి ఉండాల్సిన మానవ సంబంధం ఎందుకు మృగ వాంఛగా మారుతోంది? ఇలాంటి సంఘటనలు నిత్యం జరగడానికి కారణం ఏమిటి? నేటి సామాజిక, ఆర్థిక, రాజరీయ పరిస్థితులే కారణమా? లేక వ్యక్తులలోని మానసిన బలహీనతలే ఈ చర్యలకు కారణమా అనేది ఆలోచిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వలోఉన్న పెద్దలు అత్యాచారాలు జరగడానికి మహిళలలే కారకులంటూ నెపాన్ని వారిపైనే నెట్టి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నిసున్నారు. దేశంలో జరుగున్న వరుస అత్యాచారాలకు కారణం స్త్రీలు, పురుషులు రాసుకు పూసుకు తిరగడమే కారణమంటూ ఈ మధ్య పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. మొన్న హర్యానాలోని జింద్‌ జిల్లాలో 16ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైన సందర్భంగా అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడానికి బాలికలకు 16 ఏళ్లకే పెళ్ళిళ్ళు చేయాలని ఆ గ్రామ ఖాప్‌ పెద్దలు సూచించారు. 

ఇందుకు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా కూడా వంత పాడారు. ఇదే హర్యానాలో ఇంకో పెద్దమనిషి అత్యాచారాలకు కారణం పురుషులు మంసాహారం తినడమే కారణమంటూ ఇంకో విచిత్ర ఆరోపణ చేశాడు. గతంలో మన రాష్ర్ట డీజీపీ దినేష్‌ రెడ్డి కూడా స్త్రీలపై అత్యాచారాలు జరగడానికి వారు ధరిస్తున్న వస్త్రాలు కూడా ఒక కారణం అంటూ వ్యాఖ్యానిం చారు. మహిళలపై, బాలికలపై ఈవ్‌ టీజింగ్‌ ఘటనలు పెరిగిపోవడానికి స్త్రీలు ధరిస్తున్న కురచ దుస్తులు, స్కర్టులు కారణమని, అవి యువకులను రెచ్చగొడుతున్నాయి’ అని తృణమూల్‌ ఎమ్మెల్యే చిరంజీత్‌ చక్రబర్తి కూడా వ్యాఖ్యానించారు.
అత్యాచారం చేయడం, బలహీనులపై శారీర కంగా, మానసికంగా దౌర్జన్యం చేయడం వంటివి అర్థనగ్న దుస్తులవల్ల జరగటం లేదు. ఎందు కంటే నేడు దేశంలో, రాష్ర్టంలో జరుగుతున్న అత్యాచారాల్లో పురుష మద మృగాలు 3 సంవత్సరాల పసి పిల్లల నుంచి పండు ముసలివాళ్లను సహితం వదలడం లేదు. ఈ మధ్యనే నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో దేశంలో మహిళలపై జరిగిన అత్యాచారాల రికార్టును బయట పెట్టింది. దేశ వ్యాప్తంగా గత సంవత్సరం 24,003 అత్యాచార సంఘటనలు జరిగితే వాటిలో మైనారిటీ తీరని పసి పిల్లలపై 7058 అత్యాచారాలు జరిగినట్లు ఆ లెక్కలు చెబుతున్నాయి. అంటే అత్యాచార బాధితుల్లో 30 శాతం మంది పసిపిల్లలు ఉంటున్నారు.

ఇక మన రాష్ర్టంలో గత సంవత్సరం 1442 అత్యాచార సంఘటనలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతుంటే వాటిలో 646 మంది బాధితులు పసిపిల్లలు ఉన్నారు. అంటే మన రాష్ర్టంలో దాదాపు 44.7 శాతం అత్యాచారాలు బాలికలపై, చిన్న పిల్లలపై జరిగినట్లు తెలుస్తోంది. మమత బెనర్జీ పరిపాలిస్తున్న రాష్టంలో గత సంవత్సరం మొత్తం 2363 మందిపై అత్యాచార ఘటనలు జరిగితే, వాటిలో మైనారీటి తీరని 345 మంది పసిపిల్లలు ఉన్నారని జాతీయ నేరపరిశోధన విభాగం చెబుతోంది. మరి ఇంత మంది పసి పిల్లలు అత్యాచారానికి గురికావడానికి ఆ పిల్లలు ఎవరిని రాసుకు పూసుకు తిరిగారో మమతా బేనర్జీయే సెలవివ్వాలి. ఒక మహిళగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అత్యాచారాలకు ఇలాంటి చౌకబారు కారణాలు చెప్పడం భావ్యంకాదు. ఇక బాల్యవివాహాలు అత్యా చారాలను అరికడతాయని ఖాప్‌ పెద్దలు అంటున్నారు. అయితే హర్యానా వంటి రాష్ర్టంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను పరిశీలిస్తే అది వాస్తవం కాదని తెలుస్తోంది. గత సంవత్సరం హర్యానాలో మొత్తం 725 అత్యాచారాలు జరిగితే వారిలో 661 మంది బాధితులు వివాహితులే (30 ఏళ్లకు పైబడిన వాళ్లే) అని జాతీయ నేర పరిశోధన విభాగం లెక్కలు చెబుతున్నాయి. 

devidఅంటే బాల్య వివాహాలు చేసినంత మాత్రాన ఈ అత్యాచారాలు ఆగిపోవని, పైగా ఈ బాల్యవివాహాలవల్ల బాలి కలనుఇంకా అంధకారంలోకి నెట్టివేయడమేతప్ప సమస్యను పరిష్కరిం చడంకాదని అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా మహిళలు ముఖ్యమంత్రు లుగా, హోంమంత్రులుగా అధికారంలోఉన్న రాష్ట్రాల్లో సైతం (ఉదా: ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌) స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఈ అత్యాచారాలకు పాల్పడుతున్న వాళ్లలో ఎక్కువమంది బాధితులకు తెలిసిన వ్యక్తులు, బంధువులే! నేడు మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు కారణం- పురుష స్వామ్యం, లేదా ఆపోజిట్‌ సెక్స్‌ని బలవంతంగా లోబర్చుకోవడం. అది అదిమకాలం నుంచి నేటివరకు కొనసాగుతోంది. ఇందుకు కారణం మన చుట్టూ కొనసాగుతున్న సామాజిక కారణాలే తప్పితే వస్త్రధారణో, బాల్య వివాహాలు చేయక పోవడమో కారణం కాదు.

Surya News Paper Dated : 4/1/2013

No comments:

Post a Comment