Thursday, January 3, 2013

నేరము-శిక్ష-రాజ్యము --పొఫెసర్ జి. హరగోపాల్



rape
డల్లీలో జరిగిన అత్యాచారం మీద సమాజంలో చాలామంది ఆవేశంగా మాట్లాడుతున్న సందర్భంలోనే బాధితురాలు మరణించడం, ఆగ్రహంగా ఉన్న మధ్యతరగతిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఉద్య మం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆందోళన రాజ్య వ్యవస్థను వెంటాడింది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అని మనం అనుకుంటున్న దేశంలో ప్రజావూపతినిధులకు ప్రజల మీద విశ్వాసం లేకపోవడం ఒక ఎత్తైతే, ప్రజలకు వ్యవస్థమీద ఏ మాత్రం విశ్వాసం లేకపోవడం మరొక ఎత్తు. ఈ విశ్వాసరాహిత్యం సర్వత్రా, అన్ని రంగాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. చిన్న సంఘటన జరిగినా ప్రజలు ఎక్కడికక్కడ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. పాలకులు మళ్లీ మళ్లీ ప్రజలకు చట్టబద్ధ పాలన గురించి నీతులు చెప్పడం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అనడం హాస్యాస్పదంగా తోస్తుంది. నిజానికి మన దేశంలో పాలకులకు చట్టం మీద ఏ మాత్రం గౌరవం లేదు. చట్టా న్ని అడ్డం పెట్టుకుని చాలా చాలా దుర్మార్గమైన, అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చట్టాన్ని అమలు చేయవలసిన సంస్థలను నిర్వీర్యం చేసే వాటిని చాలా వరకు దురుపయోగం చేస్తున్నారు. ఇంత చట్టరాహిత్యమున్న దేశంలో, రాజ్యానికి మరింత అధికారం ఇవ్వడానికి ఒత్తిడి పెట్టడం, రాజ్యం ఎంత క్రూర చట్టాన్నైనా చేయవచ్చు అనే ఆలోచనకు మద్దతును ప్రకటించడం ఒక విచిత్రం. ఏ మాత్రం తమకు విశ్వాసంలేని రాజ్యానికి ఎంత అధికారాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం చాలా ప్రమాదకర ధోరణి.

ఒక తెలుగు టీవీ ఛానల్ ఈ సమస్యమీద నిర్వహించిన ఒక సదస్సులో చాలామంది విద్యార్థులు, విద్యార్థినులు ఢిల్లీలో అత్యాచారానికి పాల్పడిన దోషులకు ఉరిశిక్ష వేయాలని ముక్తకం డిమాండ్ చేశారు. కొందరు సంఘటన జరిగిన వెంటనే వాళ్లను చంపివేయాలని వాదించారు. ఉరిశిక్ష వేయాలని ఎవ్వరూ అన్నా చప్పట్లు కొట్టా రు. ఈ డిమాండ్ చేసిన వాళ్లలో తెలంగాణ విద్యా ర్థి సంఘానికి చెందిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. తెలంగాణలో రాజ్యం తన అధికారా న్ని ఎంత దుర్వినియోగం చేసిందో అతనికి పూర్తి గా అవగాహన లేదు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసులు ఎలా ప్రవర్తించారో చూసి కూడా దాని నుంచి ఏమీ నేర్చుకున్నట్లు లేదు. ఆంధ్ర ప్రాంతంలోని కొందరు ఆవేశపరు లు తెలంగాణ ఉద్యమాన్ని సైన్యం సహాయంతో అణచివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి మనం అంగీకరిస్తామా? అలాగే ఒక పీడీఎస్ యూ అమ్మాయి, ఒక ఏఐఎస్‌ఎఫ్ అమ్మాయి కూడా అందరూ వాదించినట్లుగానే వాదించారు. వామపక్ష రాజకీయాలలో ఉన్న విద్యార్థుల అవగాహన మిగతా వాళ్లకంటే భిన్నంగా లేదు. మార్క్సిస్టు అవగాహన ఉన్నవాళ్లు నేరాన్ని ఎలా చూడాలి? రాజ్యాన్ని ఎలా చూడాలి అనే విషయంలో వాళ్ల రాజకీయ అవగాహన, రాజకీయార్థిక దృక్పథం భిన్నంగా లేకపోవడం ఎంత విషాదం.

ఇలా వాదించడం నేరస్థులకు శిక్ష వెయ్యవద్దని కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో నేరస్థులకు శిక్ష వెయ్యవలసిందే. కానీ ఆ శిక్ష ఎలా ఉండాలి అన్న దానిమీద ఆవేశంలో ఉండేవారు చేసే డిమాండ్ న్యాయసూవూతాలకు, నాగరికత ప్రమాణాలకు విరుద్ధంగా ఉండకూడదు. చారివూతికంగా నేరం-శిక్ష చాలా మార్పులకు గురైంది. చట్టబద్ధ పాలన ఆవిర్భావానికి ఒక ప్రధాన కారణం ఒక వ్యక్తి నేరం చేస్తే, నేర బాధితులు చాలా ఆగ్రహంగా ఉండి నేరాలపై ప్రత్యక్షంగా తామే చర్య తీసుకుంటే, ప్రతీకార చర్య నేరం కంటే తీవ్రంగా ఉండవచ్చు. ఆవేశకావేశాలలో వ్యక్తులు నిగ్రహం కోల్పోవడం, సంయమనం పాటించకపోవడం సహజమే. అందుకే నేరం చేసిన వ్యక్తులను, లేదా నిందితులను, పోలీసుల కస్టడీలోకి తీసుకుని, వాళ్ల చేసిన నేరాన్ని న్యాయస్థానాలకు తీసుకెళ్లి, అమలులో లేదా మనం చట్టబద్ధంగా అంగీకరించిన శిక్షను వేయాలి. కస్టడీ అంటే రక్షణ. కానీ పోలీసుల రక్షణలో భద్రంగా ఉండవలసిన వాళ్లను చంపడం కస్టోడియల్ మరణాలు ఎంత చట్ట వ్యతిరేకం. కానీ ఇప్పుడున్న ఆవేశంలో ఢిల్లీలో ఈ నేరానికి పాల్పడ్డ వాళ్లను ఎవరో పోలీసు అధికారి ఎన్‌కౌంటర్ చేస్తే సంతోషపడేవాళ్లు చాలామందే ఉన్నారు. ఆ ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారి రేపు ఎన్నికల్లో పాల్గొని ఢిల్లీ ప్రభుత్వంలో హోంమినిస్టర్ కూడా కావచ్చు. మన రాష్ట్రంలో దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. కానీ పోలీసులకు మనం అలాంటి అధికారాలు ఇస్తే, రేపు అమాయకులను చంపితే రక్షణ ఏమిటి? నిందితులను ఉరితీయండి అని ఎంత బలంగా డిమాండ్ చేస్తున్నామో, అంతే బలంగా అమాయకులను చంపినప్పుడు పోలీసుల మీద చర్య తీసుకోండి అని డిమాండ్ చేసే సంస్కృతి సమాజంలో ఉందా?

నేరము-శిక్ష-రాజ్యము

నిజానికి ఢిల్లీ సంఘటనలో అమానత్ చాలా పోరాటమే చేసి చనిపోయిం ది. కాబట్టి దీంట్లో అత్యాచారమే కాక హత్య కూడా ఉంది. ఈ నేరానికి చట్టపరిధిలోనే ఉరిశిక్ష వేయవచ్చు. (ఉరిశిక్ష అనాగరికం అనేది మరొక అంశం) ఉన్న చట్టాలను అమలు చేయండి అని అడిగే బదులు, కఠినాతి కఠినమైన శిక్ష వేయండి అనే డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన జస్టిస్ వర్మ కమిటీని నియమించి, శిక్షాస్మృతిని పరిశీలించవలసిందిగా కోరింది. కొన్ని పార్టీలు పార్లమెంటు అత్యవసర సమావేశం జరపాలని కోరుతున్నాయి. జరిగిన దుర్మార్గాన్ని వాళ్ల వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నా రే కానీ బాధితురాలి పట్ల అది నమ్మదగిన కన్‌సర్న్ కాదు. కన్‌సర్న్ ఉంటే అసలు పరిస్థితి ఇంత దిగజారేది కాదు. చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లను అనుమానంగా చూడడం మానవీయం కాదు. కానీ ఈ కన్నీళల్లలో మనదేశంలో స్త్రీలు అనుభవిస్తున్న హింస ఉందా, ఈ కన్నీళ్ల వెనుక అమానుషంగా మారుతున్న స్త్రీ, పురుష సంబంధాలున్నాయా? ఒక మానవీయ సమాజాన్ని నిర్మించాలనే తపన ఉందా? ఈ ప్రశ్నలు మనం రాజకీయ నాయకులను అడగవలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్లు విధానాలను నిర్ణయిస్తున్నారు. మానవ సంబంధాలను మానవీకరించే రాజకీయ, ఆర్థిక ప్రక్రియ చేపట్టకుండా, దుర్మార్గమైన ఆర్థిక విధానాలను దేశం మీద రుద్ది, లక్షలాదిమంది స్త్రీలు తమ శరీరాన్ని అమ్ముకునే స్థితికి నెట్టారు.

పాలకులు ఏ మాత్రం జ్ఞానం లేకుండా అమెరికా వాడు, అంతర్జాతీయ ఆర్థికశక్తులకు దాసోహం అని, తాము దిగుమతి చేసుకున్న విధానంలో మానవీయత ఏమైనా ఉందా? ఈ విధాన ప్రభావం సామాజిక సంబంధాల మీద ఏం ఉంటుందో ఎవరైనా ఆలోచించారా? ఈ ఆర్థిక నమూనా మౌలిక విలువలు ఏమిటి? ఆస్తి, అధికారం, సౌఖ్యం. అందుకే ప్రపంచంలోని అతి సంపన్నులలో మన వాళ్లున్నారు. అధికారం నియంతృత్వం వారిలో ఉంది. ఈ రెంటికి మించి సౌఖ్యం సామాజిక పునాదులను కూలుస్తున్నది. సౌఖ్యం అంటే ఏమిటి? ఏడు నక్షవూతాల హోటలు, అతిఖరీదైన కారు, కళ్లు తిరిగే బంగళా, ఇంటినిండా విలాసవస్తువులు. ఇది వస్తువులకు సంబంధించిందే అయినా ఈ వస్తువులలో ఈ వర్గం మహిళను కూడా చేర్చింది. సాంస్కృతిక విలువలు సినిమా పరిక్షిశమ వీటి చుట్టే తిరుగుతుంది. మహిళల పట్ల ఇంత జుగుప్సాకరమైన సంస్కృతిని అల్లి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని కళ్లనీళ్లు పెట్టుకుంటే ఏం లాభం?

సమాజంలో ఏ నేరానికైనా చాలావరకు ఆర్థి క వ్యవస్థలో పాలకుల ‘విలువల ఛట్రం’లో వేళ్లు ఉంటాయి. ఒక్క సంఘటనకు స్పందిస్తూ.. చట్టాలను మార్చండి, మరింత కఠినమైన చట్టాలను తీసుకరాండి అని అడిగి ఏం లాభం? ఈ మధ్యే ఒక వ్యాసంలో మాజీ ఐఎఎస్ అధికారి యుగంధర్ ఒక మానవ సమూహం పైనుంచి ప్రవహిస్తున్న ఒక నదిలో రోజూ శవాలు వస్తుంటే, ఈ శవాలను ఏం చేయాలి అని బాధలు పడుతూనే ఉంటారు. ఆ శవాలకు అంతిమక్షికియలు చేస్తూనే ఉంటారు. కానీ ఈ శవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని పైకి వెళ్లి మాత్రం చూడరని ఉదహరించా డు. వీళ్లు ఎందుకు చస్తున్నారో, చంపబడుతున్నారో కనుక్కొనడానికి మాత్రం ప్రయత్నం చేయరు. ఇప్పుడు మనం కూడా అత్యాచార బాధితులను చూస్తున్నాం కానీ వీటికి మూలాలు వెతకడానికి సిద్ధంగా లేము. అలా సిద్ధంగా లేని సమాజమే శిక్షతో సరిపుచ్చుకుని, అప్పుడప్పుడు వీధుల్లోకి వెళ్లి ఆందోళన చేస్తుంటారు. ఆందోళన అవసరం. కానీ అది ఆరంభం మాత్రమే. అక్కడే ఆగి రాజ్యానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం మన గోతిని మనం తవ్వుకోవడమే.

మన సమాజంలో ప్రజాస్వామ్య సంస్కృతి చాలా బలహీనంగా ఉంది. నిజానికి ఇది పునాదులు లేని ప్రజాస్వామ్యం. అందుకే నియంతృత్వంవైపు మనకు తెలియకుండానే ప్రయోగిస్తున్నాం. ఏ రాజకీయపార్టీ సంస్కృతి చూస్తున్నా, వాళ్ల నాయకులు విచ్ఛలవిడి అధికారాలు కలిగి ఉన్నారు. అది జయలలితే కావచ్చు, మమతాబెనర్జే కావచ్చు, చిదంబరమే కావచ్చు, వీళ్లకు నాయకుడు నరేంవూదమోడీయే కావచ్చు. గుజరాత్‌లో స్త్రీలపై జరిగిన అత్యాచారాల గురించి ఇంతకు ముందు వ్యాసంలో నేను ప్రస్తావించాను. నేరాన్ని గురించి కాక శిక్ష గురించే ఆలోచిస్తే గుజరాత్ దుర్మార్గమే పునరావృతమౌతుం ది. నేరం మూలాలను వెతికే ధైర్యం లేని సమాజానికి నరేంద్ర మోడీయే పరిష్కారంగా కనిపిస్తాడు. ఢిల్లీ సంఘటన మీద స్పందన స్త్రీ గౌరవాన్ని, స్త్రీ, పురు ష సంబంధాలను మానవీకరించే దిశగా కాక, మోడీ లాంటి నియంత ఎదుగుదలకు దారి తీస్తుంది. నేరము, శిక్ష చర్చలో సమాజ బాధ్యత, ప్రజల స్వేచ్ఛ, రాజ్యాధికారం ప్రధాన అంశాలుగా ఉండాలి. ఇప్పటి చర్చ నేరము, రాజ్యాధికారానికి మాత్రమే పరిమితం కావడం అపరిపక్వ సమాజ లక్షణం. ఈ ప్రక్రియలో శిక్ష పేర రాజ్యం బలపడడం ఎంత నిజమో, ప్రజలు స్వేచ్ఛను కోల్పోవడం కూడా అంతే నిజం, నేరాన్ని నియంవూతించడం మాత్రం అనుమానమే.
పొఫెసర్ జి. హరగోపాల్

Namasete Telangana Telugu News Paper Dated: 3/1/2013

No comments:

Post a Comment