Thursday, January 3, 2013

దళితులకు భూమి ఏది? -- పి.యస్‌. అజయ్‌ కుమార్‌



Sivakami-speach
తెలుగు మహాసభలకు ముస్తాబవుతున్న తరుణంలో తిరుపతి పట్టణానికి ఒక విశిష్టఅతిథి వచ్చారు. ఆమె పేరు శివగామి. తమిళనాడుకు చెందిన సీని యరు ఐ.ఎ.ఎస్‌.అధికారిణి. ఇప్పుడామె ఆ పదవిలో లేరు. స్వచ్ఛంద పదవీ వి రమణ తీసుకొని తమిళనాడులో దళిత భూమి హక్కులకోసం ఆమె పోరాడు తున్నారు. ఈ నెల (డిసెంబరు) 17, 18 తేదీలలో తిరుపతి పట్టణంలో భూసంస్క రణల కార్యాచరణ ఉద్యమం నిర్వహించిన ‘ప్రజా కోర్టు’లో ఆమె జ్యూరి సభ్యురా లుగా పాల్గొన్నారు. దళితులు, ఆదివాసీలు, పేదల భూ సమస్యలపై రెండు రోజులు జరిగిన ఈ ప్రజా న్యాయస్థానంగాని, దళిత కులంలో పుట్టి ఐ.ఎ. ఎస్‌.సాధించి ఒక ఆదర్శంకోసం దాన్ని పరిత్యజించి పల్లెల్లో పోరాడుతున్న శివగామి రాకగాని మీడి యాకు ఎలాంటి ఆశక్తిని కల్గించలేక పోయింది. 

అందులో ఆశ్చర్యం ఏమీలేదు. తన ఎదురుగా ఉన్న దళిత, అణగారిన వర్గాల భూ బాధితులను ఉద్దేశించి 18వ తేది మధ్యాహ్నం ఎస్‌.వి. యూనివర్శిటీ సెనేట్‌హాలులో ఆమె చేసిన లోతైన సుదీర్ఘ ప్రసంగం అనేక అంశాలను స్పృజించి, పలు ప్రశ్నలను ఆంధ్రప్రదేశ్‌ పౌర సమాజం ముందు ఉంచింది.
80 శాతం మంది దళితులు జీవిస్తున్నది గ్రామాలలో. వారు జీవిక కోసం ఆధార పడింది భూమి, వ్యవసాయం పైన. తొలినాళ్లలో శూద్ర వ్యవసాయదారులుగా ఉన్న వారు ఇప్పుడు అగ్ర కులాలుగా మారి ఇతర వ్యాపారాలు, వ్యవహారాలకు మళ్ళిపో యినా భూమిని అంటిపెట్టుకొని ఉన్నది దళితులు, ఆదివాసీలు, శూద్ర కులాల క్రింది పొర అయిన వెనుకబడిన కులాల ప్రజలే. 

భూమి తమ ప్రధాన జీవనాధారం కాకపోయినా అగ్రకులాలు భూమిని వదలడం లేదు. కొడుకులు, కూతుళ్లు, అల్లు ళ్లూ అమెరికాలోనే ఉన్నా, తమ మకాం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయ వాడ, విశాఖపట్నంవంటి నగరాలకు మారిపోయినా వారు భూమిహక్కు పత్రాలను చేతిలో పట్టుకొని సాగుదార్ల కష్టాన్ని పరాన్న భుక్కుల్లా మెక్కుతున్నారు. దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో జమిందారిరద్దు చట్టం వంటి మొదటితరం భూ సంస్కరణల వలన లబ్ధి పొందింది అప్పటి శూద్రకుల రైతు వర్గాలే. మధ్య దళారీలు పోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తద్వారా ‘ట్రికిల్‌ డవున్‌’ సూత్రంలో క్రిందనున్న వ్యవసా యకూలీలకు ఆ ఫలితాలు చేరుతాయని భావించారు.

వ్యవసాయంలో అభివృద్ధి శూద్ర కులాలను అగ్రకులాలుగా మార్చింది. కాని ఈ అభివృద్ధిలో దళితులకు భాగ స్వామ్యంలేదు. దేశ వ్యవసాయరంగంలో గరిష్ఠఅభివృద్ధి సాధించాయన్న పంజాబు, హర్యానా రాష్ట్రాల వ్యవసాయ కూలీలలో దళితులు 79, 55 శాతంగా ఉన్నారు. 1961 లో మొదటిసారి, 1973లో రెండవసారి తెచ్చిన భూ గరిష్ఠ పరిమితి చట్టాలలో ఒక కుటుంబా నికి నిర్ధారించిన ‘గరిష్ఠ పరిమితి’కి ఆధారం ఏమిటని శివగామి ప్రశ్నించారు. 

కేంబ్రిడ్జి భారతీయచరిత్ర ప్రకారం ఆనాటి బ్రిటిష్‌ ప్రభు త్వం ఒక కుటుంబానికి కావలసిన ఆర్ధిక కమతం 2.50 ఎకరాలు మాగాణి (తరి), లేదా 5 ఎకరాలు మెట్ట (కుష్కి) అని నిర్ధారించిందని ఆమెఅన్నారు. ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. 150 సంవత్సరాల కిందట మద్రాసు రెవిన్యూ బోర్డు రూపొందించిన ప్రభుత్వ భూముల నియమాలలో ఒక కుటుంబానికి 2.50 మాగాణి, లేదా 5 ఎకరాలు మెట్ట భూమి వరకు (10 శాతం తేడాతో) మంజూరు చేయవచ్చని చెపుతుంది. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల వరకు ప్రభుత్వ భూముల మంజూరుకు మన రాష్ట్రంలో ఇదే ప్రమాణం కొనసాగింది.

పేదలకు భూమి మంజూరు చేసే సందర్భంలో 2.50 ఎకరాల పల్లం (మాగాణి, తరి)ను ఒక ఎకరాకు, 5 ఎకరాల మెట్ట (కుష్కి/చేను)ను రెండు ఎకరాలకు తగ్గించమని కోనేరు కమిటీ తన 1.3 సిఫార్సులో చెప్పింది. అప్పటి ‘మహానేత’ ప్రభుత్వం దీనిని అంగీకరించింది. అదే కమిటీ సీలింగు మిగులు భూముల ‘గరిష్ఠ పరిమితి’ని తగ్గించమని మాత్రం చెప్పలేకపోయింది. విడతల వారి భూపంపిణీలో ప్రభుత్వం ఎకరాలను సెంట్ల(కుంట)కు దిగజార్చింది. 1961 భూ సంస్కరణల చట్టంలో ఒక కుటుంబ సభ్యుడ్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఒక కుటుంబానికి మాగాణి 180 నుండి 360 ఎకరాలు, మెట్ట 1080 నుండి 2160 ఎకరాలు ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. 

ఈచట్టంద్వారా 30 లక్షల ఎకరాలు వస్తాయ న్నారు. చివరికి స్వాధీనంచేసుకున్నది 2384ఎకరాలు. అందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు 14 లక్షలు. ఇక రెండవ భూ సంస్కరణల చట్టం 1973 ద్వారా బయటకు వచ్చిన సీలింగు మిగులు భూమి 5 లక్షల 25 వేల ఎకరాలను- 5 లక్షల 82 వేల మందికి పంపిణీచేశారు. ఇందులో 2 లక్షల 24 వేలమంది దళితులకు లభించింది 2 లక్షల 26 ఎకరాలు (2005 మార్చి 31 నాటికి). ఒక కుటుంబానికి సుమారు 1 ఎకరా వచ్చింది. పేదల ఆర్ధిక కమతం 2.50 ఎకరాలు తరికాగా ఇదే సీలింగు చట్టంలో ఈ పరిమితి 15 నుండి 27 ఎకరాలుగాఉంది. అదే మెట్టభూమి తీసుకుం టే పేదల ఆర్ధిక కమతం 5 ఎకరాలైతే పెద్దలది 37 నుండి 54 ఎకరాలుగా ఉంది. అదిచాలదని చట్టానికి సవరణతెచ్చి ‘మేజర్ల’కు అదనపు విస్తీర్ణం చేర్చారు. తెల్లకాగి తాలపై జరిగిన అమ్మకాలు చెల్లుతాయన్నది హైకోర్టు.

‘ఆర్ధిక కమతం’ నిర్ధారణలో అసలు కుట్ర ఉంది. గ్రామీణ పేదరికం పెరుగు తుంటే దానితోబాటు వారి ఆర్ధిక కమతం తగ్గిపోయింది. 1973లో నిర్ధారించిన గరిష్ఠ పరిమితి మాత్రం నేటికీ అలాగే కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వం నియమించిన బందోపాధ్యాయ కమిటీ (మన రాష్ట్రం నుండి బాలగోపాల్‌ ఇందులో సభ్యులు) ఈ విషయాన్నిగుర్తించి గరిష్ఠ పరిమితిని కనిష్ఠపరిమితిగా మార్చమంది. సహజంగానే మన ప్రధాన మంత్రి ఆ నివేదికను చెత్తబుట్ట సమర్పయామి చేశారు.
రెండవ భూ సంస్కరణల చట్టం (1973) అనుసరించి 10 ఎకరాల పైబడి ఉన్న వారందరూ భూ సంస్కరణల ట్రిబ్యునల్‌ ముందు ‘డిక్లరేషన్‌’ (రూఢిప్రకటన) దాఖలు చేయాలి.

ఈ ప్రకటనలు ‘పబ్లిక్‌ డాక్యుమెంట్లు’. నిజానికి ప్రతి డిక్లరేషన్‌ ఒక వర్గ పోరాట సాధనం. భూమి లేని కూలీలను సమీకరించి ట్రిబ్యునళ్ళను వర్గ పోరాటకేంద్రాలుగా మార్చేయడానికి అవకాశంఉన్నా కామ్రేడ్లు వాటి జోలికిపోలే దు. భూస్వాముల నుండి భూములు సేకరించే పనిని ప్రభుత్వానికి, ట్రిబ్యునల్స్‌కు వదిలేశారు. 1976-77 కమతాల లెక్కలను, ట్రిబ్యునళ్ళ ముందు దాఖలైన రూఢి ప్రకటనలను పరిశీలిస్తే కోస్తా ఆంధ్రాలో 41శాతం, రాయలసీమలో 63శాతం, తెలంగాణలో 57శాతం కమతదార్లు అసలు డిక్లరేషన్‌లేఇవ్వలేదు. ఇది చట్ట ప్రకా రం నేరం. ప్రకటన ఇవ్వకుండా భూములు అమ్మడానికి లేదు. అయినా ఏం జరిగిందో చూశాం. 

శూద్ర రైతు కులాలకు భూమి హక్కులు కల్పించే జమిందారీ వ్యతిరేకపోరాటం, దళిత పేదలకు భూములను అందించే భూసంస్కరణల పోరా టంలో కామ్రేడ్ల పాత్రను తులనాత్మకంగా పరిశీలించవలసి ఉంది. అయితే ఇందు కు రెండు మినహాయింపులున్నాయి. అవి తెలంగాణ సాయుధపోరాటం, జగిత్యాల నాగేటిచాళ్ళ పోరాటం, అవి రెండూ తెలంగాణలో జరిగాయి.2005 వరకు ఉన్న లెక్కల్ని తీసుకొని చూస్తే, మన రాష్ట్రంలో పంపిణీ అయిన ప్రభుత్వ భూమి 42 లక్షల ఎకరాలు. 23 జిల్లాలలో ఆయా సామాజిక వర్గాలకు పంపిణీ అయిన భూవిస్తీర్ణం అన్ని జిల్లాలలో, ఆ జిల్లాలో దళిత జనాభాతో సంబం ధం లేకుండా 22శాతంకు మించలేదు. 

రాష్ట్ర జనాభాలో దళితులు 18.45 శాతం (2001) ఉండగా, గ్రామీణ పేదలలో వారు 35 శాతం ఉన్నారు. పంపిణీ అయిన భూమిలో 40 శాతం పేదల నుండి పెద్దలకు అన్యాక్రాంతం అయ్యిందని అంచనా. దీనిని నివారించేందుకు 1977లో తెచ్చిన అన్యాక్రాంత నిషేథ చట్టాన్ని ప్రభుత్వం అమలుపరచనూ లేదు, అందుకు ఉద్యమాలు రానూలేదు. పేదలు ముఖ్యంగా దళిత ఎసైనీదార్లకు రక్షణకల్పించే ఈ చట్టాన్ని 2007 అప్పటి ‘మహానేత’ ప్రభుత్వం సవరణ తెచ్చి నీరుగార్చింది. ఈ సవరణ ఆధారం చేసుకొని కడప జిల్లా మొత్తాన్ని చట్టం పరిధి నుండి మినహాయించారు. ఎక్కడ ఎసైన్‌మెంటు భూములు ఎక్కువగా ఉంటే అక్కడ సవరణ చట్టాన్ని వాడుకొని పేదల నుండి భూములు లాక్కున్నారు. భూముల విషయంలో దళితులకు ఇంత పబ్లిక్‌గా జరిగిన మోసం, దగా బహుశా ఈ ఐదు దశాబ్దాలలో మరొకటి లేదు.

దళితులకు భూమి ఉండవలసిన అవసరాన్ని శివగామి నొక్కి చెబుతున్నారు. తాను ఎంత పేదరికంలోఉన్నా ఐ.ఎ.ఎస్‌. వరకు వెళ్ళడానికి కారణం తన తల్లిదండ్రులకు ఉన్న కొద్దిపాటి భూమేనని ఆమె అన్నారు. అంతేకాదు దేశంలో దళిత వర్గాల నుండి ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌. అయినవారు, ఇతర ఉన్నత స్థానాలలోకి వెళ్లగలిగిన వారి నేపథ్యం పరిశీలిస్తే ‘భూమి’ పోషించిన పాత్ర కనిపిస్తుందని చెప్పారు. భూమిలో వ్యవసాయం చేయకపోయినా ఫర్వాలేదు, అది దళితులకు భరోసాను, భద్రతను, ఆత్మగౌరవాన్ని పరపతిని ఇస్తుందని, కనుక ఎవరికంటే కూడా దళితులకు భూమి అవసరం ఉంటుందనీ అన్నారామె. 

శివగామి వంటి ఐ.ఎ.ఎస్‌.లకు ఆదర్శంగా నిలచిన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ దళిత గ్రామీణ పేదల అభివృద్ధిలో ‘భూమి’ ప్రాధాన్యతను గూర్చి ఇలాఅన్నారు- ‘భూమికి సంబంధించిన అన్నిసంబంధాలు లేదా భూమికి సంబంధించిన ఉత్పత్తి సంబంధా లను, భూమిలేని పేదలకు అనుకూలంగా పునర్నిర్మించడమే భూ సంస్కరణలు. భూ బదలాయిపు ద్వారా ఉన్నవారి నుండి లేని వారికి అధికారం, ఆస్తి, హోదా అన్నీ ఒక బృందం నుండి మరో బృందానికి మారుతాయి.

కొంత భూమి తమ స్వంతం అని పేదవారు అనిపించుకున్నపడు స్వతహాగా ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం, ఇతరు లతో తాము సమానం అనే భావనలు వారిలో కలుగుతాయి. దారిద్య్రానికి, పరాన్న భుక్కులకి, దోపిడీ అసమానత సంబంధాలకు మూలకారణంగా భూసమస్య కనిపి స్తుంది. పేదవారికి భూ పంపిణీ చేయడంద్వారా వారు దోపిడీ నుండి విముక్తి పొందగలరు. తద్వారా మార్కెట్‌లో కార్మిక శక్తి, రుణ లావాదేవీలు బలపడతాయి. లబ్దిదారులకు బ్రతికేందుకు ఒక బలమైన ఆధారం దొరుకుతుంది. అంతేగాకుండా వారి సాంఘిక, ఆర్ధిక హోదాలు మెరుగుపడతాయి’.

సాలుకు లక్ష రూపాయలు వ్యవసాయేత ఆదాయం ఉన్నవారికి భూమి ఉండన వసరం లేదన్నది శివగామి భావన. వ్యవసాయేతర రంగాలలో ఆదాయాలు పొందు తున్నవారు, పన్ను ఎగవేత కోసం వ్యవసాయ భూములను కొనసాగిస్తున్నారు. విదేశాలలో స్థిరపడి ‘గ్రీన్‌ కార్డు’లు పొందిన వారికి వ్యవసాయం భూమితో ఏమి పనని శివగామి సూటిగాప్రశ్నిస్తున్నారు. భూమిపై జీవనోపాధి పొందుతున్న వారికి, వ్యవసాయంపై జీవిస్తూ భూమిపై హక్కులేని వారికి ఇచ్చేందుకు దేశంలో కావలసి నంత భూమి ఉందని ఆమె అంటారు. 

వామపక్ష పార్టీలను మినహాయిస్తే రాష్ట్రంలోని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీ లు, వాటి నాయకులు పల్లెబాటలు, కాలిబాటలు, సురాజ్యాలు ఇలా రకరకాల పేర్ల తో యాత్రలు చేస్తున్నారు. ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. దళిత, పేద ప్రజలారా జాగ్రత్తగా చెవి ఒగ్గి వినండి. అందులో ‘భూమి’, ‘పంపకం’ అనే మాటలు మీకు వినిపించవు, కనిపించవు. కలెక్టరుగా తాను ఆదేశాలు ఇవ్వగలను గాని అవి తమ దళితులకు చేరాలంటే ముందువారు సంఘటితం కావాలని శివగామి గుర్తించారు. అదే జరిగి తే కలెక్టరుగా తాను లేకపోయినా పనులు జరుగుతాయని భావించారు. తమిళనా డు దళితభూఉద్యమానికి,పంచమిభూముల సాధనకు ప్రజలను సమీకరి స్తున్నారు ఆమె. గొప్ప చరిత్రకలిగిన దళితఉద్యమం- దారి ఎక్కడతప్పిందో గ్రహిస్తుందా!?


పి.యస్‌. అజయ్‌ కుమార్‌

Surya News Paper Dated : 30/12/2012

No comments:

Post a Comment