Friday, May 3, 2013

అత్యాచారాలపై అలసత్వమేల?---ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి



పట్టుమని ఐదేళ్లు లేని పసిపిల్ల మీద ఢిల్లీలో జరిగిన దారుణ అత్యాచారానికి జనం అవాక్కయ్యారు. నిరసించారు. ఆ ఘటనను నిలువరించలేకపోయిన అధికారులను, ప్రభుత్వాన్ని నిలదీశారు.నేరాన్ని ఆపలేకపోయినందుకు అపరాధ భావన అసలే లేదు. సరికదా సంఘటనను రిపోర్టు చేయడానికి వెళ్ళిన పసిపిల్ల తల్లిదంవూడులను సర్దుకొమ్మని చెప్పిన సంబంధిత పోలీస్ అధికారుల మీద ప్రజల కు కోపం రాదా? అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాన్ని ప్రజలు వ్యతిరేకించరా? అందువల్లనే ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. దానికి ఆయన స్పందనను తప్పనిసరిగా చర్చించవలసిందే. ఆయన మాటల్లోనే ‘నేను రాజీనామా చేస్తే పరిస్థితి చక్కబడుతుందంటే వెయ్యిసార్లు రాజీనామా చేస్తానని’ అన్నారు. ఇది నిజమే. 

వ్యక్తి, అధికారంలో ఉన్నా రాజీనామా చేసినా పరిష్కారం దొరకదు. కానీ వ్యవస్థ మాటేమిటి? పోలీసు వ్యవస్థ ప్రజలను రక్షిస్తుందని ప్రజలు విశ్వసించాలంటే, వాళ్లు తమ అధికార పరిధిలో ఏ చర్యలు తీసుకోవాలి? తమ విధులను నిజాయితీగా, చిత్తశుద్ధితో నిర్వహించటానికి ఎటువంటి విధి విధానాలను రూపొందించుకోవాలి? అసలు పోలీసు వ్యవస్థను మొత్తంగా పక్షాళన చేయాలంటే ఏం చేయాలి? ఇవన్నీ అధికార వ్యవస్థ, ప్రభుత్వం ఆలోచించవలసిన అంశాలు కావా? అధికారులు, వ్యక్తులుగా ఏమైనా చేయవచ్చు. చేయకపోవచ్చు. కానీ వ్యవస్థ మొత్తంగా సమర్థవంతంగా పనిచేయడానికి ఎటువంటి చర్యలు అవసరమోఇప్పుడైనా సీరియస్‌గా ఆలోచించటం అవసరం లేదా? 

ఇదే సమస్య మీద పార్లమెంటులో సీరియస్‌గా చర్చ జరుగుతుంటే స్వయనా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే దేశమంతటా ఈ ఘోరాలు జరుగుతూ ఉంటే ఢిల్లీలో జరిగినప్పుడే యాగీ చేయటం ఎందుకు? అని (ఢిల్లీ మాత్రమే తన పరిధిలోకి వస్తుందేమో?)అంటే మన పాలకుల దృష్టిలో ‘యాగీ’ చేయటమే సమస్య. కానీ ‘అత్యాచారం జరగటం’ సమస్య కాదన్నమాట. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే పాపమైనట్టు పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ విధంగా జరుగుతున్న, పెరుగుతున్న వీటికి కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించవలసిన అవసరం లేదా? ఢిల్లీలో జరిగితే, అది కూడా యాగీ చేసినప్పుడు మాత్రమే ఆయన బాధ్యత వహిస్తాడా?ఇవన్నీ పౌరులకు వచ్చే సందేహాలు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే శ్రేయో ప్రభుత్వాలకు ప్రజల శ్రేయస్సు, రక్షణ అవసరం లేదా? అని నిలదీసిన ప్రజ లు నేరస్తులవుతున్నారు? ఆవేదనతో ఉద్యమిస్తే అణచివేత మొదలవుతున్నది.

ఇటువంటి సందర్భంలో పోలీసు యంత్రాంగం పనితీరును మన కోర్టులే గర్హిస్తున్నాయి. 
కేంద్ర హోంమంవూతికి వత్తాసుగా 25-4-2013 న కేంద్ర మంత్రి ప్రకాశ్ జైస్వాల్ మాట్లాడడం. ‘దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలకు నైతికంగా హోం మంత్రి బాధ్యతే. కానీ జరగకుండా ఆపటం షిండే పనా అని అనటం ప్రజలకు ఆందోళన కలిగించే అంశమే. అంటే నేరాలు జరుగుతూనే ఉంటాయి. పెరుగుతూనే ఉంటా యి. హింస వికృతరూపాన్ని తీసుకుంటుంది. అయినా నేరాలకుమూలాలు ఎక్కడున్నాయో అన్వేషించే బాధ్య త పాలకులకు లేదా? నేరాలను అరికట్టడం ప్రభుత్వ కర్తవ్యం కాదా? నేరాలు బయటపడకుండా అణచివేసి నేరస్థులకు సపోర్టుచేస్తూ, బాధితులకు మద్దతుగా నిలిచిన ప్రజానీకాన్ని అణచివేస్తూ, నేరాలు జరగలేదన్న భ్రమలో ఉండడం, ప్రజలను భ్రమలో ఉంచాలని చూడటం ప్రమాదకరం కదా? పాలకవర్గానికి అత్యాచార బాధితులను చూసినా, వారి మద్దతుదారులను చూసి నా పట్టలేని ఆగ్రహం కలుగుతున్నట్టుంది. వీరిపట్ల అసహనం, నేరస్థులను ఏమి చేయలేని నిస్సహాయత, నేరాలను అరికట్టలేని అసమర్థతను పాలకవర్గం మాటలలో, చర్యలలో స్పష్టంగా కనిపిస్తున్నది.

మొన్న డిసెంబర్‌లో ‘నిర్భయ’ మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశమం తా వెల్లు ఉద్యమం, లేవనెత్తిన చర్చలన్నీ చివరకు నేరము-చట్టం- శిక్ష దగ్గర ఆగిపోయాయి. జస్టిస్ వర్మ కమిషన్ వేయటం, అందులో సమస్య మూలాలకు సంబంధించిన సూచనలను విస్మరించటం, హడావుడిగా ‘నిర్భయ చట్టం’ చేయ టం జరిగింది. కేవలం చట్టాలు రూపొందించటం, శిక్షను కఠినతరం చేయటం వల్ల సమస్య సమసిపోదు. అత్యాచారాలను నిరోధించడానికి కఠినమైన చట్టం వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలల్లోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 463 కేసులు నమోదయ్యాయి. 

ఇది దేన్ని సూచిస్తున్నది? చట్టాలు, సమస్యను పరిష్కరించవని పాలకులకూ అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది. మరొక విషయం ఎక్కడ ఎప్పుడు స్త్రీ మీద అత్యాచారం జరిగినా, బాధితురాలే బాధ్యురాలిగా చేయటం చాలా ‘సహజం’గా జరుగుతున్నది. ఆ అమ్మాయి రాత్రుళ్లు ఎందుకు తిరగాలి? అనో వస్త్రధారణ బాగాలేదనో, అబ్బాయి వెంట ఉన్నాడనో,ఆమె నేరస్థుడిని రెచ్చగొట్టిందనో, వ్యాఖ్యలు సర్వసాధారణం. తల్లితో వెళ్తున్న అమ్మాయి మీద, భర్తతో బయటికి వెళ్ళిన భార్య మీద, స్కూలుకు వెళ్తున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆమెమీద, చాక్లెటు ఆశ చూపించి పసిపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు,అవి పెరిగిపోతున్న తీరు- ఇక బాధితురాలినే సమస్యకు బాధ్యురాలు అని చూపించే పరిస్థితిలేదు. ఆడపిల్లలు అత్యాచారం బారిన పడకుండా ఎట్లా రక్షించుకోవాలన్నదే సీరియస్ సమస్యగా ముందుకొచ్చింది. అయినప్పటికీ, మధ్యవూపదేశ్ కాంగ్రెస్ నాయకుడు సత్యదేవ్ కటారే ఆడపిల్లలు చూపులతో రెచ్చగొట్టకపోతే మగపిల్లలు వాళ్ళ వైపు కన్నెత్తిచూడరు అనటం మన పాలకుల ఆలోచనా స్థాయిని తెలియచేస్తున్నది. 

ఇటువంటి పాలనలో ఉన్నందుకు ప్రజలు తమను తామే నిందించుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించలేని అశక్తత పాలకులకు స్పష్టంగా అర్థమైంది. సమస్య పరకా ష్ట దశకు చేరుకున్న తర్వాతనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన ప్రారంభమైంది. స్త్రీల, ఆడపిల్లల, పసిపిల్లలమీద హింసాత్మకమైన వికృత లైంగిక దాడులు భయాంకరమైన అంటువ్యాధిలా ఎందుకిట్లా వ్యాప్తిస్తున్నదనేది తీవ్రమైన ఆందోళన! శత్రువు ఏ రూపంలో రావచ్చో తెలియని స్థితి. స్త్రీల అభివృద్ధి సమానత్వం, సాధికారత లక్ష్యాల గురించి పూర్తిగా విస్మరించవలసిన దుస్థితి. ఆడపిల్ల లైంగిక దాడులకు బలికాకుండా ఎట్లా రక్షించుకోవాలన్నదే సమస్యయింది. 

దేశ యువత ఎందుకింత హీన స్థితికి దిగజారిపోయింది. ఇది కేవలం వైయు క్తిక మానసిక సమస్యా? మనం పెంచి పోషిస్తున్న సామాజిక, ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక నిర్మాణాల్లో వీటి మూలాలు లేవా? ప్రభుత్వ ఖజానా నిండుతుంద ని, కాంట్రాక్టర్లకు కోట్లకు కోట్లు సంపాదన ఉంటుందని , యువతను మద్యంలో ముంచే విధంగా బెల్టుషాపులు, విధానాలు ఒకవైపు, యువతను పక్కదారి పట్టించే దుర్మార్గపు భావజాలాన్ని టీవీలు, సినిమాలు ప్రచారం చేయటం మరొకవైపు ఈ పరిస్థితికి కారణమన్న దానికి ఇటీవల తెనాలిలో జరిగిన సంఘటననే సాక్ష్యం. అశ్లీలతే వినోదమని, హింసించడమే ఆనందమనే’ భావనలను బలపడటానికి టీవీ ప్రోగ్రాములు, సినిమాలు దోహదం చేయలేదా? విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలు సెల్‌ఫోన్లలో, ఇంట్నట్‌లో ఎట్లా ప్రచారమవున్నాయి? వాటిని ఆపగలిగే సామ ర్థ్యం మన ప్రభుత్వ యంత్రాంగానికి లేదా? ఒక ఛానల్‌లో ‘రియాల్టీ షో’ పేరిట పసిపిల్లల చేత అశ్లీలతతో నిండిన డాన్సులు చేపిస్తుంటే మహిళా సంఘాలు స్పందించారే కానీ ప్రభుత్వానికి బాధ్యత లేదన్నట్టు మిన్నకున్నది.

ఈ సమస్య ఇంత జటిలం కావడానికి కనీసం రెండు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఆడపిల్లల మీద దాడులు, రకరకాల మోసాలతో ఆడపిల్లలను ఈ ఊబిలోకి దింపటం చాపకింద నీరులా విస్తరిస్తున్నదని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నదని, అశ్లీల చిత్రాలే లైంగిక నేరాలకు కారణమవుతున్నాయని రెండుదశాబ్దాల క్రితమే మన రాష్ట్రం లో మహిళా సంఘాల, వివిధ ప్రజాస్వామిక సంఘా ల నిజనిర్ధారణ కమిటీలు వెల్లడి చేశాయి. అయితే ఈ ఆడపిల్లలు చాలావరకు అట్టడుగు వర్గాలకు చెందినవారు.
కల్లోలిత ప్రాంతాల ప్రత్యేక అధికారాల పేరిట సాయుధ దళాలను మహిళలపై జరిగే అత్యాచారాలకు నిరసనగా అసలు సాయుధ దళాలకు ఈ అధికారాన్నిచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌తో ఇరోమ్ షర్మిల గత పన్నెండేళ్ల నుంచి నిరాహారదీక్ష చేస్తున్న విషయం ఎంతమందికి తెలుసు? జస్టిస్ వర్మ కమిటీ నివేదిక కూడా సాయుధ దళాలు మహిళలపై జరిపే అత్యాచారాలను సాధారణ చట్టం పరిధిలోకి తీసుకరావాలని సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సూచనను తిరస్కరించింది. అదేవిధంగా భర్త కూడా భార్య మీద హింసాత్మక అత్యాచారం చేయటం కూడా శిక్షార్హమేనని జస్టిస్ వర్మ కమిటీ నివేదిక పేర్కొన్నది. దీనిని కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. 

ఆదివాసీ,దళిత మహిళల మీద ఎన్నటినుంచో దాడులు జరుగుతూనే ఉన్నా యి. వీటిని నిరసించి స్పందించిన వారెంతమంది? ఇప్పుడది మధ్యతరగతికి కూడా విస్తరించింది. నిత్యకృత్యమైంది. ఆడపిల్లకు ఇంటా బయట రక్షణ కరువైంది. ‘తోటకూరనాడే’ మనమంతా స్పందిస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈ సమస్య ఇంత జటిలమయ్యేదా? ఈ సమస్య నుంచి సమాజం విముక్తమై ఉన్నతమైన మానవీయ విలువల దిశగా అడుగులు వేయాలంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నిర్మాణాల్లో ఉన్న ఈ విష మూలాలను కూకటి వేళ్ళతో పెకిలించాలి. మనిషిలోని బలహీనతలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే అమానవీయ వాణిజ్య విలువలను అంతమొదించాలి. ఇందుకు ప్రజలు వ్యవస్థీకృతంగా ఉద్యమించాలి. దీనికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి.నిజాయితీగా,చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించే పరిస్థితులను ఏర్పర్చుకోవడం కూ డా ఇక ప్రజల బాధ్యతే. వీటన్నింటిలో సఫలమైతేనే ఆడపిల్లను రక్షించుకోగలుగుతాం. వైయుక్తింగా ఉన్న మన ఆవేదనను వ్యవస్థీకృతం చేసుకుందాం. సంఘటితమవుదాం. హింసారహిత సమాజానికి బాటలు వేద్దాం.

కాకతీయ యూనివర్సి


Namasete Telangana Telugu News Paper Dated : 3/5/2013

No comments:

Post a Comment