Thursday, September 19, 2013

పట్టాలెక్కని విద్యాహక్కు! By Ramesh Buddaram

September 19, 2013
ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయొగించే అత్యంత శక్తిమంతమెన ఆయుధం విద్య- అన్న నెల్సన్‌ మండేలా వ్యాఖ్యలు- స్వాతంత్య్రం సిద్ధించి 65 వసంతాలు గడిచినా, రాజ్యాంగం నిర్దేశించిన విద్యా ప్రాముఖ్యత బాగా తెలిసిన ఎందరొ మేధావులు ఈ దేశాన్ని పరిపాలించినా, అభివృద్ధికి మూలం విద్య అని తెలిసినా, ప్రపంచం విద్యను ఒక హక్కుగా గుర్తించాలంటూ 2000లో అందరికీ విద్యపై ఢాకర్‌ (సెనగల్‌)లో యునెస్కో ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు జరిగేంత వరకూ మన పాలకులు విద్యను ఒక హక్కుగా గుర్తించకపొవడం, అప్పుడు మాత్రమే భారత దేశంలో విద్యను ఒక హక్కుగా గుర్తిస్తామని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇవ్వడం గమనార్హం. ఈ అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగానే 2009 విద్యా హక్కు చట్టాన్ని రూపొందించి, 2015 నాటికి అందరికీ విద్య లక్ష్యాన్ని సాధిస్తామని మన దేశం వాగ్దానం చేసింది. 

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌- దేశంలోని 6-14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ జాతి మత లింగ భేదం లేకుండా విలువలు, నైపుణ్యాలు, జ్ఞానం పెంపొందించే ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నాం- అని విద్యాహక్కు చట్టం అమలుకు ముందు పేర్కొన్నారు. ఆర్టికల్‌ 21-ఎ ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనే అంశాన్ని హక్కుగా చేస్తూ 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం మూడు ఏళ్ళు గడిచాక ఎలాంటి నాణ్యమైన విద్యను అందించిందో దాని అమలు తీరు తెన్నుల ద్వారానే అవగతమవుతోంది. ఈ చట్టాన్ని రూపొందించినా దాని పర్యవేక్షణను, అమలును పట్టించు కోకపొవడంతో, ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ చట్టం నత్తనడక నడుస్తోంది. అమలులో లక్ష్యానికి ఆమడ దూరంగా ఉంటోంది. విద్యా హక్కు చట్టం నిర్దేశించిన ప్రకారం 2013 నాటికి దేశంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలి. ఒకటి నుంచి ఆరు తరగతుల వరకు విద్యార్థులు- ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30 ఉండాలని, ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఈ నిష్పత్తి 1:35 ఉండాలని ఈ చట్టం సూచించింది. కాని ప్రస్తుతం 7000 పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

పైగా 10 శాతం వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉండవచ్చని అధికారులు అంటున్నారు. విద్యార్థుల చదువులు సజావుగా సాగాలంటే పాఠశాలల్లో మౌలిక వసతులుండాలని, కానీ ఇవి 2012 నాటికి 8 శాతం పాఠశాలల్లో మాత్రమే సమకూర్చారని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 76,000 పాఠశాలలు ఉండగా, దాదాపు 3 లక్షల మంది టీచర్లు వాటిలో పని చేస్తున్నారు. టీచర్ల కొరత తీర్చాలన్న ఉద్దేశంతో నియమించిన దాదాపు 50 వేల మంది విద్యా వాలంటీర్లను తొలగించడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. సర్వ శిక్ష అభియాన్‌ లెక్కల ప్రకారం 53,801 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవని తెలుస్తోంది. ఇంకా 35,326 పాఠశాలల్లో అసలు మరుగుదొడ్ల సౌకర్యాలే లేవని ప్రభుత్వ లెక్కలే సెలవిస్తున్నాయి. 

ఏప్రిల్‌ 2013 నాటికల్లా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గత ఏడాది జూన్‌ మాసంలో విశాఖ పట్నంలో జరిగిన ఒక సమావేశంలో జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ప్రభుత్వం హామీ ఇవ్వడం గమనార్హం. కాని అవి ఏవీ ఇంకా పూర్తి కాక పోవడం శోచనీయం.
ఇక విద్యా హక్కు చట్టంలోని- ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాలనే సెక్షన్‌-12ను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. దీనితో చట్టంలోని ముఖ్యమైన ఈ అంశం అమలు కాకుండా జాప్యం జరిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల వాదనను తోసిపుచ్చి, 25 శాతం సీట్లను పేదవర్గాల పిల్లలకు ఇవ్వవలసిందేనని తేల్చిచెప్పింది. దీనితో ఈ విద్యా సంవత్సరంనుంచి అయినా విద్యాహక్కు చట్టం ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా ఆచరణలోకి వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు ఈ 25 శాతం సీట్ల కేటాయింపుపై సంపూర్ణ విధి విధానాలను రూపొందించుకోలేక పోయాయి. 

మన రాష్ట్రంలో మే నెలలో ఇందుకోసం ఒక కమిటీని నియమించారు. ఇంతవరకు దీనిపై నిర్దిష్టమైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. రాష్ట్ర నమూనా చట్టానికి లోబడి, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, కొన్ని మిషనరీ పాఠశాలలు, మరికొన్ని ఇతర ప్రైవేటు పాఠశాలలే 25 శాతం సీట్లను కేటాయిస్తున్నాయి.ప్రత్యేక అవసరాలు గల, శారీరక, మానసిక వైకల్యంగల 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలను విద్యాహక్కు చట్టం విస్మరించడం మరొక పెద్ద పొరపాటు. ఈ పొరపాటును గుర్తించిన ప్రభుత్వం, ఈ మధ్యే విద్యాహక్కు చట్టానికి సవరణ చేపట్టింది. ఆ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా తమ సమీపాన ఉన్న సాధారణ పాఠశాలలో చేరవచ్చు. కాని వీరి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి కావల్సిన భౌతిక వనరులుగాని, బౌద్ధిక వనరులుగాని ప్రస్తుత సాధారణ పాఠశాలల్లో లేవు.ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, నమూనా విద్యాహక్కు చట్టాన్ని అన్ని రాష్ట్రాలకన్నా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

కానీ, ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల నియంత్రణలో 25 శాతం సీట్ల కేటాయింపు విషయంలో పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థలను రూపొందించు కోలేదు. బడి మానేసిన పిల్లలకోసం ప్రత్యేక శిక్షణకు పాఠ్యపుస్తకాల సవరణకు చర్యలు చేపట్టింది. పరీక్షా సంస్కరణలు, సమగ్ర నిరంతర మూల్యాంకనానికి చర్యలు ప్రారంభించింది. కానీ, ఇవి ఆచరణలో సరైన ఫలితాలనిచ్చే స్థాయిలో లేవు. పాఠశాలల్లో మౌలిక వనరుల కల్పనలో మన రాష్ట్రం స్థానం అంతంత మాత్రమే. 2010 గణాంకాల ప్రకారం హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిపై సాలీనా రూ. 1709, కేరళలో రూ. 1537 ఖర్చు పెడుతుంటే, మనరాష్ట్రంలో రూ. 573 మాత్రమే ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది. ఇక రాష్ట్రంలోని ఉపాధ్యాయవిద్య నాణ్యతా అంతంతమాత్రమే. డి.ఇడి. పాఠ్య ప్రణాళికను పరిపుష్ఠం చేయడంలో, బి.ఇడి. విద్యాసంస్థల్లో ఎలిమెంటరీ విద్యా బోధన అంశాన్ని ప్రవేశపెట్టడంలో వెనకడుగే కనబడుతోంది. ఏన్సీ ప్రాంతాల్లో కేవలం మౌలిక సదుపాయలు అంటే గదుల నిర్మాణం తప్ప, చట్టంలో పేర్కొన్న ఇతర అంశాల అమలు పట్ల ఏ మాత్రం చొరవ చూపక పొవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. 

స్వాతంత్య్రానంతరం ఇంత కాలానికి విద్యను హక్కుగా గుర్తిస్తూ చట్టం తేవడం శుభ పరిణామం అయితే, దాని అమలు అంతంత మాత్రంగా ఉండడం విస్మయం కలిగించే విషయం. యావత్‌ భారతావనిలో బాల బాలికల భవిష్యత్‌ రూపు దిద్దుకునే ఈ చట్టమైతే తెచ్చారు కానీ, దాని అమలును విస్మరించడం, ఈ చట్టాన్ని కేవలం 6-14 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు చదువు చెప్పించే ఏర్పాటుగా కాక, సామాజిక అంతరాలను తొలగిస్తూ సుస్థిర అభివృద్ధికి బాటవేసే నాణ్యమైన విద్యనందించే పరికరంగా గుర్తించినప్పుడే ప్రపంచ దేశాల్లో మనం సగర్వంగా తలెత్తుకు నిలబడగలుగుతాం. భవిష్యత్‌ భారతావనికి నాణ్యమైన మానవ వనరులను అందించ గలుగుతాం. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవలసి ఉంది.


Surya Telugu News Paper Dated : 19/09/2013 

No comments:

Post a Comment