Tuesday, July 10, 2012

కులాలే వర్గాలు కావు - రంగనాయకమ్మ

'విప్లవకారులెవరు మరి?' అని వెంకటేశ్వర్లు అడగడంలో అర్ధం, 'చిన్న కులాల శ్రామికులే విప్లవకారులు కదా?' అని! ఇది చాలా పొరపాటు. శ్రామికులు అన్ని కులాల్లోనూ వున్నారు. శ్రామికుడిగా వున్నందుకే ఎవరూ విప్లవకారులు కాలేరు. బట్టలు ఉతికే చాకలి మనిషిని తీసుకుంటే, ఆ వృత్తి వల్లే అతను విప్లవకారుడు కాలేడు. పాకీ దొడ్లు కడిగే మనిషి అయినా, ఆ వృత్తితోనే విప్లవకారుడు కాలేడు. మేధా శ్రమలు చేసే టీచర్లు గానీ, డాక్టర్లు గానీ, సైంటిస్టులు గానీ, వేతన శ్రామికులుగా ఉన్నా, ఆ వృత్తుల వల్లే విప్లవకారులు కాలేరు. వృత్తుల వల్లే విప్లవకారులయిపోతే శ్రామికులందరూ విప్లవకారులయిపోయినట్టే. వర్గ పోరాట చైతన్యం గల విప్లవకారులవడానికి, వర్గాల జ్ఞానం కావాలి.

ఆ వర్గ జ్ఞానం, ఒక శాస్త్రం ద్వారా కలగాలి. పార్టీ నాయకత్వాల సంగతి చూస్తే, దానికి రిజర్వేషన్లు వర్తించవు. రిజర్వేషన్ల పాత్ర, స్కూలు సీట్లలోనూ, ఉద్యోగాల్లోనూ వున్నట్టు, వర్గ పోరాట సంఘాల్లో వుండకూడదు. పార్టీలో వున్న ఏ సభ్యుడికైనా నాయకత్వ పాత్ర దొరకడం గానీ, దొరకక పోవడం గానీ, ఆ సభ్యుడి శక్తి సామర్ధ్యాల్ని బట్టి జరగాలి గానీ, వారి కులాల్ని బట్టి కాదు. శాస్త్రీ, రెడ్డీ, చౌదరీలు, శక్తి సామర్ధ్యాలు కలవారని చెప్పినట్టు దీనికి అర్ధాలు తీస్తే, అది కలహం అవుతుంది గానీ, చర్చ అవదు.

నాయకత్వ స్థానాల్లో ఎక్కువ కాలం ఒకే వ్యక్తో, ఒకే బృందమో ఉంటే, అది రాజుల పద్ధతే అవుతుంది. శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్న వారికి కూడా అవకాశాలు లేకపోతే, ఆ శక్తులు పెరిగే మార్గమే ఉండదు. ఎంత శక్తివంతుడైన నాయకుడైనా, మెజారిటీ సభ్యుల ప్రకారం నడవవలసిందే గానీ, రాజులాగా ప్రవర్తించలేడు. 'పదవి' అనేది, ఒక కార్య నిర్వహణ బాధ్యత. 'నాయకత్వం' అనేది, సిద్ధాంత, ఆచరణల జ్ఞానం. ఆ నాయకత్వానికి కాల పరిమితి వుండదు. నాయకుడి కృషి, పదవి వున్నప్పుడూ లేనప్పుడూ కూడా ఒక్కలాగే వుంటుంది.

ఊ 'దోపిడీ కులాల చేతుల్లో బందీగా వున్న రాజ్యాన్ని ఆక్రమించుకోమని అంబేద్కర్ చెప్పాడు కదా? రంగనాయకమ్మ ఈ విషయం చదవలేదా?' ఏ అగ్ర కులాన్నయినా, 'దోపిడీ కులం' అనడం, మొదటి తప్పు! ఒక కులాన్ని, 'దోపిడీ కులం' అనే మాట ఎవరు చెప్పినా అది కుల జ్ఞానమూ కాదు, వర్గ జ్ఞానమూ కాదు. ఏ అగ్ర కులాన్ని తీసుకున్నా, అందులో అధిక సంఖ్య - పేదలే. కొంత సంఖ్య మేధా శ్రమలు చేసే వేతన శ్రామికులు. అగ్ర కులంలో, భూస్వాములుగా, రక రకాల పెట్టుబడిదారులుగా వుండే వాళ్ళ సంఖ్య, అదే కులంలో వుండే పేదల సంఖ్య కన్నా తక్కువ. ఒక వ్యక్తి పూర్తిగా దోపిడీదారుడు అయినట్టు, ఒక కులం అంతా, 'దోపిడీ కులం' అవదు. ఒక వ్యక్తి, పూర్తిగా శ్రామికుడైనట్టు, ఒక కులం పూర్తిగా 'శ్రామిక కులం' అవదు. ఏ కులాన్ని తీసుకున్నా, ఆ కులంలో, వేరు వేరు వర్గాలూ, ఆ వర్గాల్లో వేరు వేరు సెక్షన్లూ, ఉంటాయి.

ఒక వర్గాన్ని తీసుకుంటే, ఆ వర్గంలో, ఒకే కులం మనుషులంతా వుండరు. వేరు వేరు కులాల మనుషులు వుంటారు. దీన్ని క్లుప్తంగా చెప్పుకుంటే, మొత్తం అన్ని కులాల్లోనూ ఉన్న శ్రామికులందరి సంఖ్యా కలిసినది - శ్రామికవర్గం. అలాగే, అన్ని కులాల్లోనూ వున్న దోపిడీదారులందరి సంఖ్యా కలిసినది - దోపిడీవర్గం. ఒక కులం అంతా, ఒక వర్గం కాదు, ఒక వర్గం అంతా, ఒకే కులంతో నిండదు. ఒక అగ్రకులంలో ధనికులు, అదే కులంలో ఉన్న పేదల్ని ఎంత నిర్లక్ష్యంగా చూస్తారో, చిన్న కులంలో కూడా ధనికులు, అదే కులంలో వున్న పేదల్ని అంత నిర్లక్ష్యంగానే చూస్తారు. ఏ కులాన్ని తీసుకున్నా, అందులో జనాభాలో వుండే స్పృహ ప్రధానంగా ధనిక-పేద తేడాల స్పృహే.

ఊ 'శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన వుంది' అంటూ, దాన్ని పెద్ద తర్కంగా చెపుతున్నారు ఏనాటి నించో! 'శ్రామికుల విభజన' అనడంలో అర్ధం, 'శ్రామికుల్లో ఎక్కువ తక్కువ కుల భేదాలు వున్నాయి కదా; వాళ్ళు, వర్గ పోరాటంలో ఎలా కలుస్తారు?' అని! కానీ, శ్రామికులు పోరాడవలసింది, తోటి శ్రామికులతో కాదు; ఆ పని స్థలంలో, శ్రామికులందరి మీదా పెత్తందారుగా వుండే యజమానితో! అది, శ్రామికులకూ, యజమానికీ జరిగే వర్గ పోరాటం! జీతాలు పెరగాలనో, పని కాలం తగ్గాలనో, ఒక కొత్త చట్టం కావాలనో, యజమాని మీదా, ప్రభుత్వం మీదా, పోరాడితే జరిగే మెరుగుదలలు, అన్ని కులాల శ్రామికులకూ కావాలి.

ఒక బ్రాహ్మణ కార్మికుడికీ, ఒక మాల కార్మికుడికీ, భోజనాల సంబంధం ఉండకపోవచ్చు; పెళ్ళిళ్ళ సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఒక ఆర్ధిక మెరుగుదల ఇద్దరికీ సంబంధించిందే కాబట్టి, యజమాని మీద పోరాటంలో ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు; ఉండక తప్పదు. కులాల భేదాలు అలాగే వుండాలని చెప్పడం కాదు ఇది. కానీ, "కులాల విభజనే, యజమానితో పోరాటాన్ని ఆపదు'' - అని చెప్పడం ఇది.

అసలు వర్గ పోరాటాలే జరగకపోతే, దానికి కారణం, కులాల విభజన వుండడం కాదు; వర్గాల గురించి నేర్పడం జరగకపోవడం! 'కుల నిర్మూలనా పోరాటం చేపట్టకుండా, ప్రపంచ కార్మికులారా, ఏకం కండి - అని పిలుపు ఇస్తే, భారత కార్మికులు ఎలా ఏకం అవుతారు?' అని అదే రకం విమర్శ! సమాజంలో వున్న రకరకాల సమస్యల గురించి, పోరాటాలు చేపట్టనక్కరలేదనీ, ఉద్యమాలు లేకుండానే సమస్యలు పరిష్కారం అవుతాయనీ, ఏ విప్లవ మార్క్సిస్టూ అనడు. కుల భేదాల సమస్యలో, ఉద్యమాల వల్ల, రెండు గ్లాసుల పద్ధతి పోవడం, దేవాలయ ప్రవేశాలూ, అస్పృశ్యతా నివారణా - వంటివి తప్పకుండా జరుగుతాయి.

కానీ, అసమాన శ్రమ విభజన మారకపోతే, 'కులాల నిర్మూలన' జరగదు. కులాలు లేని దేశాల్లో కూడా, దోపిడీ శ్రమ విభజన మారకపోతే, అట్టడుగు శ్రమలు చేసే బృందాల పరిస్థితి ఎప్పటికీ మారదు. ఆ మార్పులు కమ్యూనిస్టులు కూడా సాధించలేరు. కాబట్టే, వర్గ పోరాటాన్నే ప్రధమ నినాదంగా చెప్పుకోవలసి వుంటుంది. 'ఫ్యూడల్ కుల వృత్తులు మారితే, కులాంతర వివాహాలు జరుగుతాయి - అంటారు, కొందరు. అది తప్పు' - అని ఒక వాదం. అది తప్పో ఒప్పో తెలియాలంటే, కులాంతరాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఒక మాల కులం యువకుడు, డాక్టర్ అవడం వల్ల, అతణ్ణి రెడ్డి కులం యువతి పెళ్ళికి ఇష్టపడింది.

ఒక క్షవరాల కులం యువకుడు ఆ వృత్తిలో గాక, మేధా శ్రమల వృత్తి వల్ల, అతణ్ణి బ్రాహ్మణ యువతి ఇష్టపడింది. ఒక మాదిగ కులం యువకుడు, ధనికుడూ - రాజకీయ నాయకుడు, మంత్రీ అయిన తండ్రికి పుత్రుడైన కారణంగా, అతనిని ఒక అగ్రకులం స్త్రీ పెళ్లాడింది. అంబేద్కర్ విషయంలో జరిగింది కూడా ఇదే. ప్రేమ పెళ్ళిళ్ళ విషయాల్లోనే గాక, అగ్రకులాల్లో సంస్కర్తలైన తల్లిదండ్రులు కుదిర్చే కులాంతరాల్లో కూడా, విద్యాస్థాయీ, ఆర్థికస్థాయీ కుదిరిన చోట్లే ఆ పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకా ఏ కులాంతర వివాహాన్నయినా చూడండి! ఆ సంబంధాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలుస్తుంది. ఆ నిమ్న కులాల యువకులకు కుల వృత్తులు మారకపోతే, అగ్ర కులాల యువతులతో పెళ్ళిళ్ళు జరిగేవి కావు. అయితే, ఆ 'క్షవరాలు చేసే' శ్రమల వంటివి ఆగిపోతాయని కాదు. ఆ శ్రమలు సమాజానికి ఎప్పటికీ అవసరమే. ఆ శ్రమలు ఎలా జరగాలి - అనే ప్రశ్నకి జవాబు కోసం, సమానత్వ శ్రమ విభజన దగ్గరికి వెళ్ళాలి.

ఊ చైనా కమ్యూనిస్టు పార్టీ, సమాజాన్ని 27 ఏళ్ళలోనే మార్చిందనీ, భారత పార్టీలు 60 ఏళ్ళు దాటినా అలా చెయ్యలేకపోవడానికి కారణం మొదట కుల నిర్మూలన చెయ్యకపోవడం అనీ - ఒక వాదం. చైనా పార్టీ, తన సమాజంలో ఆ నాడు వున్న వర్గాన్ని, బడా బూర్జువా - పెటీ బూర్జువా - జాతీయ బూర్జువా - అంటూ, ఆ వర్గాల్నీ, వాటి సెక్షన్లనీ పరిశీలించి, తన కార్యక్రమాలూ, ఎత్తుగడలూ నిర్ణయించుకుందంటే, అదంతా వర్గ దృష్టి! ఏ దేశ కమ్యూనిస్టు పార్టీలైనా చెయ్యవలసింది వర్గ దృష్టితోనే.

శ్రామిక ప్రజలకు వర్గ దృష్టిని నేర్పడం చేస్తూ, ఆ క్రమంలోనే కుల నిర్మూలన దృష్టీ, స్త్రీ-పురుష సమానత్వ దృష్టీ - వంటి నూతన భావాలన్నీ నేర్పే కార్యక్రమాలు పెట్టుకోవాలి. కానీ కుల నిర్మూలననే మొదట పూర్తి చెయ్యాలంటే, అది మొదట పూర్తి అయ్యే విషయం కాదు. 'మాకు కుల నిర్మూలనే అంతిమ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో, మొదటి దశ పోరాటం, 'బూర్జువా ప్రజాస్వామిక విప్లవం'. ఈ దశలో బ్రాహ్మణీయ హైరార్కీని బద్దలు చేయటం.' - వెంకటేశ్వర్లు. 'బూర్జువా ప్రజాస్వామ్యాన్ని' దళితులు కొత్తగా తీసుకురానక్కరలేదు. ఇప్పుడు వున్నది అదే. అందులో వున్నది 'బ్రాహ్మణీయ హైరార్కీ' కాదు. దోపిడీ ప్రైవేటు ఆస్తుల హైరార్కీ.

ఈ పాలనలో, దళితులే, ముఖ్యమంత్రులూ, ప్రధాన మంత్రులూ, ప్రెసిడెంట్లూ, ఎంపీలూ, స్పీకర్లూ, అలా ఎన్ని స్థానాల్లోకి వెళ్ళినా, మాయావతి పాలన కన్నా కొత్త పాలనేదీ రాదు. అది, ఆ కుర్చీల మీద కూర్చునే దళితులకు తప్ప, అది కూడా ఆ 5 సంవత్సరాలే తప్ప, నేల మీద తిరిగే దళితులకెవ్వరికీ విప్లవం అవదు. అగ్ర కులాల పెద్దల రాజ్యాధికారంలో, ఆ అగ్ర కులాల నిండా పేదలు ఎప్పటిలా వున్నట్టే, దళిత కులాల పెద్దల రాజ్యాధికారంలో కూడా ఆ దళిత కులాల పేదలు ఎప్పటిలాగే వుంటారు! బూర్జువా ప్రజాస్వామ్యం ద్వారా దళిత నాయకులు సాధించేది - తమ లాభం! అంతే! నాయకుల లాభం సరే, అదే కులాల్లో పేదల విముక్తి సంగతేమిటనేది ప్రశ్న!

- రంగనాయకమ్మ
(ముగింపు రేపు) 
Andhra Jytohi News Paper Dated ; 11/07/2012 

No comments:

Post a Comment