Wednesday, July 11, 2012

మార్పులకు ఒక క్రమం - రంగనాయకమ్మ

అంబేద్కర్ ప్రకారం జరిగే విప్లవంగా, వెంకటేశ్వర్లు, తర్వాత జరిగేది కూడా చెపుతున్నారు. ఆ చివరి దశ ఏమిటంటే : 'భూమిలో అగ్ర కులాల ఆధిపత్యాన్ని తొలిగించి, భూమిని జాతీయం చేయడం. ఉద్యోగాల్లో, ఇతర అవకాశాల్లో, అగ్ర కులాలకు రిజర్వేషన్లు కల్పించడం.' అగ్ర కులాలకు రిజర్వేషన్లు! ఇంత విప్లవాన్ని అంబేద్కర్ కూడా కలగనలేదు! అగ్రకులాలకు రిజర్వేషన్లు ఎప్పుడు? భూముల్ని జాతీయం చేశాకా, చెయ్యక ముందా? చెయ్యక ముందైతే, అగ్రకులాల భూములూ, వాళ్ళ మేధా శ్రమలూ, వాళ్ళకు చెక్కు చెదరకుండానే వుంటాయి. ఆ దశలో, వాళ్ళకి రిజర్వేషన్లేమిటి? లేదా, భూమిని జాతీయం చేసిన తర్వాత అయితే, అప్పుడు సమాజంలో అందరికీ సమాన పరిస్థితులే ఏర్పడాలి.

అందరికీ చదువులూ, ఉద్యోగాలూ, జీతాలూ! అప్పుడు అగ్ర కులాలకు, రిజర్వేషన్లు అవసరమయ్యే బికారి స్థితే వస్తుందా? అంబేద్కర్ విప్లవం జరిగాక కూడా కొంత జనాభాకి అలాంటి స్థితి ఏర్పడితే, అది విప్లవం అవుతుందా? సరే, రిజర్వేషన్లు ఎక్కడ వున్నా అవి తాత్కాలికమే కదా? ఆ తాత్కాలిక పరిస్థితిని తీసివేసి, అందరినీ సమానం చేసే చివరి విప్లవ దశ ఏమిటి? దాన్ని వెంకటేశ్వర్లు చెప్పలేదు! భూముల జాతీయాల తర్వాత కూడా అగ్ర కులాలన్నీ రిజర్వేషన్ల కులాలు గానూ, నిమ్న కులాలన్నీ అవి లేని కులాలు గాను మారితే, ఇక కుల నిర్మూలన కలలెందుకూ?

ఇక్కడ అసలు వాదం, స్పష్టంగా వుంది. 'మాకు కుల నిర్మూలన అంతిమ లక్ష్యం' అన్నారు. దాని తర్వాత కూడా ఒక చివరి దశ వుంది. అది, 'అగ్ర కులాల ఆధిపత్యాన్ని తొలగించి, భూముల్ని జాతీయం చేయడం.' అంటే, దోపిడీదారుల ఆధీనంలో వున్న ఆస్తుల్ని తీసివెయ్యడం కన్నా ముందే, అగ్ర కులాల ఆధిపత్యాన్ని తొలగించడం కన్నా ము ందే, అంటే కులాల నిర్మూలన చేసేస్తారు. అది మొదటి లక్ష్యం! అంటే, అగ్ర కులాలు, వా ళ్ళ కులాలతో వాళ్ళు, వాళ్ళ ఆధిపత్యాలతో వాళ్ళు, ఎప్పటిలా వుండగానే, కులాల్ని తీసేస్తారు! కులాలు వుండగానే కులాల్ని తీసేస్తారు! అది ఎలా చేస్తారో తప్పకుండా చూడాలి!

కులాలనే వర్గాలుగా భావిస్తే, కులాల నిర్మూలనే మొదట జరుగుతుందనీ, ఆ నిర్మూలనే దోపిడీ నిర్మూలన కూడా అవుతుందనీ, అర్ధం వస్తుంది. ఈ వాదాన్ని వ్యతిరేకిస్తూ, డాక్టర్ విద్య చాలా మంచి వాదన చేసింది. కులాలే వర్గాలైతే, అందులో అగ్రకులాలే దోపిడీ వర్గాలైతే, కుల నిర్మూలన జరిగిపోతే, దోపిడీ నిర్మూలన జరిగిపోయినట్టు కాదా? మళ్ళీ ఆ దశ తర్వాత ఇంకో దశ ఏమిటి? - అని ఆమె వాదం. కుల నిర్మూలన తర్వాత కూడా భూముల జాతీయం కోసం ఇంకో పోరాటం అంటే, కుల నిర్మూలనతో దోపిడీ నిర్మూలన జరగదనీ, జరగలేదనీ అర్ధం. కుల నిర్మూలన తర్వాత కూడా వర్గాలూ, వాటి భేదాలూ, దోపిడీ, ఎప్పట్లాగే వున్నాయనీ, అందుకే ఇంకో దశ అనీ, అర్ధం రాదూ? కులాలు తొందరగా పోవాలని ఆశించడం తప్పు కాదు; కానీ, అది ఒక ఆశ! ఒక ఊహ! కులాలే వర్గాలు కావు కాబట్టీ, అవి లంకెలు పడి వున్న శ్రమ సంబంధాలు కాబట్టీ, శ్రమ సంబంధాల దృష్టి లేకపోతే, వర్గాలూ, కులాలూ, దోపిడీ ఆస్తి హక్కులూ, కలిమి లేములూ, ఏవీ చలించవు.

మనువాద వ్యతిరేక కార్యక్రమాలు కమ్యూనిస్టు పార్టీల్లో లేవు - అని చెప్పి, వెంకటేశ్వర్లు ఆ తర్వాత అడిగిన ప్రశ్న: "ఇలాంటి విప్లవాలేనా బహుజన శ్రామిక వర్గానికి కావలసింది?'' అంబేద్కరు, దళిత కులాల రిజర్వేషన్ల కోసం తప్ప, ఇతర వెనకబాటు కులాల (బీసీల) రిజర్వేషన్ల కోసం ప్రయత్నించలేదనీ; రాజ్యాంగం రాసిన ఆయన ప్రయత్నాలు, మొత్తం దళితుల హక్కులకే పరిమితమయ్యాయి తప్ప బహుజనులందరి హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఆయనకు లేదనీ, బీసీల వాదం సమాజంలో వుంది.

దళితులూ, బీసీలూ, బహుజనులుగా, 'కులాల' వాదంతో కలుస్తారా, 'శ్రామిక వర్గ' వాదంతో కలుస్తారా? కులాలుగా అయితే, ఏ రెండు కులాలూ కలవడం లేదు. వారికి పెళ్ళిళ్ళ సంబంధాలు వుండడం లేదు. కాకపోతే, 'అగ్ర కులాలకు వ్యతిరేకంగా చిన్న కులాలు' అనే వాదంతో అయితే, కలవగలరు. కానీ అప్పుడు చిన్న కులాల్లో పిడికెడు మంది, బూర్జువా రాజ్యాంగంలోకీ, పదవుల్లోకీ, చేరగలరే గానీ, ఆ కలయికలతో దోపిడీ మీద పోరాటం చెయ్యలేరు. ఆ చిన్న కులాల్లో కోట్లాదిగా వుండే నిరుపేదల పరిస్థితి గురించి ఆలోచించడానికి, 'అది ఇప్పుడు వద్దు' అనడం, దాటవేత!

'దళితులు, ఎవరి సిద్ధాంతాల కోసమూ అడుక్కోవలసిన స్థితిలో, లేదా భావ దారిద్య్రంలో లేరని గ్రహించడం రంగనాయకమ్మకు మంచిది.'- దళితులు మార్క్సు సిద్ధాంతాన్ని అడుక్కోవలసిన స్థితిలో లేరనీ, వారికి అంబేద్కర్ చూపించిన రిజర్వేషన్ల మార్గమే భావ ఔన్నత్యాన్ని ఇచ్చిందనీ, వెంకటేశ్వర్లు తేల్చి చెప్పేశారు! మార్క్సిజాన్ని తిరస్కరిస్తే, మార్క్సుకేమీ నష్టం లేదుగానీ, దళిత బూర్జువాలకూ, వాళ్ళ బంట్లకూ, చాలా లాభం! ఇక దళిత బహుజన మేధావుల వాదాల వల్ల, ఆ కులాలలోని శ్రామిక జనాలకు జరిగేదంతా ద్రోహమే. ఆ జనాభా చరిత్ర ఎలా ఉండబోతోందంటే: వారిలో లక్షకి ఒకరు పెట్టుబడిదారుడు కావచ్చు. మిగతా లక్షలూ, కోట్లుగా మిగిలే జనం, ఇప్పటిలాగే వేతన కూలీలూ, పార్ట్ టైమ్ కూలీలూ, అవీ లేని నిరుద్యోగులూ, బిచ్చగాళ్ళూ, నేరస్తులూ! కులాంతర వివాహాల మాటా, కుల నిర్మూలనల మాటా, కట్టి పెడదాం మరి!

'దళితులు భూమి అడిగితే...' అంటూ బొజ్జా తారకం గారు రాసిన (ఆంధ్రజ్యోతి, జూన్ 22) వ్యాసం, నా 'సంస్కర్తల' వ్యాసానికి స్పందనగా రాసినది కాకపోయినా, 'కుల నిర్మూలన' చర్చలో చూడవలసిన అంశాలు ఇందులో కొన్ని వున్నాయి. లక్ష్మింపేటలో జరిగిన దురంతం పరమ నీచమైనదని ఆ దుష్టులకు తప్ప అందరికీ తెలుస్తుంది. అయితే, ఆ దురంతంలో, భూమి సమస్య చాలా స్పష్టంగా బైటపడింది. బహుజనులలో ఒక భాగంగా వుండే ఒక కులం వాళ్ళు, అక్కడ అగ్ర కులం వాళ్ళుగా ఎలా అయ్యారు? - భూమి ఆస్తి వల్లే. కూలీలుగా, పాలేళ్ళుగా, గత కాలం నించీ శ్రమలు చేస్తూ జీవించే దళితులు, భూమి దొరికితే, కూలీల జీవితాలు వదిలేసి, స్వతంత్ర రైతులుగా మారి, పొరుగున వున్న అగ్ర కులాల రైతులతో సమానులుగా మారితే, అది దేనివల్ల జరిగినట్టు? - 'భూమి' అనే ఉత్పత్తి సాధనం దొరికి పాత శ్రమ విభజన మారడం వల్ల జరిగినట్టే! దళితులు, తమతో సమానులవడం అగ్ర కులాలకు ఇష్టం లేదని - తారకం గారు అంటున్నారు.

ఇక్కడ స్పష్టంగా వున్న విషయాలేమిటి? దళితులు, కూలీలుగానే, ఆ రకం శ్రమలు చేసే వాళ్ళుగానే వుండాలని, అగ్ర కులాల వాళ్ళు కోరుతున్నారు. - ఇది ఒక నిజం. ఉత్పత్తి సాధనాలు లేని వాళ్ళకి, అవి దొరకడం వల్లే వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళతో సమానులవుతారు - ఇది ఇంకో నిజం. ఈ సమానత్వ మార్గం ప్రారంభం కావాలంటే, మొదట జరగాల్సింది ఏమిటి?- ఉత్పత్తి సాధనాల మీద దోపిడీ యాజమాన్యాలు వున్న వాళ్ళకీ, జీవనాధారాలు కూడా లేని వాళ్ళకీ మధ్య పోరాటమే. అది ఎలా జరిగినా, ఫ్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోవడం ద్వారా జరిగినా (ఈ పద్ధతిలో, మొత్తం శ్రామికులందరికీ జరగదు), భూమి విషయంలో జరిగేది, రెండు వర్గాల పోరాటమే. రెండు వేపులా వేరు వేరు కులాలు వున్నా, అది కుల పోరాటం కాదు. కులాలు లేని దేశాల్లో కూడా జరగవలసింది ఈ వర్గ పోరాటమే.

ఇక్కడ స్పష్టమైన ప్రశ్నలకు, స్పష్టమైన జవాబులు కావాలి. దళితులకు భూమి అంది, వారు స్వతంత్ర రైతులుగా మారడం గానీ, అలాగే నిరుపేద వేతన శ్రామికులకు విద్యలూ ఉద్యోగాలూ అందడం గానీ జరుగుతూ, పాత పరిస్థితుల సమానత్వం వేపు మారడం ముందు జరుగుతుందా; కుల భేదాలు పోవడం ముందు జరుగుతుందా? లేదా, దళితులకు భూమి రావడమూ, కులాలు పోవడమూ, కలిసి జరుగుతాయా? పేదలకు భూములు అందడం ఒక రోజున జరిగితే, కులాలు పోవడం ఆ రోజునే జరుగుతుందా?

ఏది ముందు, ఏది వెనక? ఒక క్రమం ఉందా? ఆ క్రమం ఎందుకు? కులాలే వర్గాలు కావు కాబట్టే వాటికి ముందు వెనుకల క్రమం వుంటుంది. వర్గ, కుల నిర్మూలనల కోసం ఎన్ని ఉద్యమాలైన కలిసి జరగవచ్చు. అది సాధ్యమే. కానీ, వర్గాలు అంతరించే సమానత్వ పరిస్థితులు ఏర్పడుతూ వున్నప్పుడు గానీ కులాల పద్ధతి మారదు. సమస్యల్ని మన ఆశల ప్రకారం, మన ఊహల ప్రకారం, మన ఇష్టాయిష్ఠాల ప్రకారం, చూడడం గాక, వైరుధ్యాలు అడ్డుపడని తర్కం ప్రకారం చూడగలిగితే, ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలం. సమస్యల వెంట పరిష్కారాలూ ఉంటాయి.

'రంగనాయకమ్మ కుల నిర్మూలన గురించి, ఏనాడైనా, ఏదైనా చెప్పిందా?' అట! 'దళిత సమస్య...' నాటి నించీ, అనేక వ్యాసాల్లో చెప్పిందంతా ఏమిటి మరి?

- రంగనాయకమ్మ
(అయిపోయింది) 
Andhra Jyothi News Paper Dated : 12/07/2012 

No comments:

Post a Comment