Wednesday, July 11, 2012

దళిత ఆదివాసీలపై రాజ్య హింస - సుజాత సూరేపల్లి

కారంచేడు, చుండూరు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. జూన్ 12న లక్షింపేట దళితులపై జరిగిన హింసాకాండ మరవకముందే, పుండుపై కారంలాగా జూన్ 28న ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల ఘటన వార్త. బాసగూడెంలో 19 మంది ఆదివాసీల మీద విచక్షణా రహితంగా కాల్పులు, ఊచకోత, నరికివేత. కోల్డ్‌బ్లడెడ్ ఓపెన్ మర్డర్స్! వారు ఆదివాసీలు, అడవులలో ఉంటారు, అనగా మావోయిస్టులు అనబడతారు. వీరు దళితులూ, ఊరికి చివర ఉంటారు, తమకు అన్యాయం జరుగుతుందని సంవత్సరాల తరబడి విన్నపాలు ఇచ్చుకున్నా ఎవరూ పట్టించుకోరు, వీరిని అంటరాని వారు అంటారు.

నరనరాన పేరుకుపోయిన కులం కుళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడింది. పోలీసుల అండదండలు ఉన్నాయి. అటు రాజ్యం, సామ్రాజ్యవాదం చేతిలో కీలుబొమ్మ అయింది. పాపం వారిది ఒకే కులం, ఒకే మతం. అమాయకులను బలగాలతో చంపిస్తారు. పేరు ఎన్‌కౌంటర్! వీరు నిరాయుధులు అయి ఉండొచ్చు, అమాయకులు అయినా కావొచ్చు. పిల్లలు, మొన్న బాసగూడెంలో కుమారి కాక, 15 ఏళ్ల ఆడపిల్ల, మిగిలిన పది మంది 15 నుంచి 28 ఏళ్ల వాళ్ళు. చంపడానికి వయో, లింగ బేధం లేదు బ్రదర్! వీరు కూడా మావోయిస్టులే లెక్కల్లో. ముసలి వాళ్ళు, లేడీస్ అంటే స్పెషల్ అట్రాక్షన్. ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు రంజుగా. వేట కొడవళ్ళు, గొడ్డళ్ళు, కత్తులు కటార్లు, ఏమి కావాలి ఇంకా? ఒక సమూహాన్ని, రకరకాల పేర్లతో విభజించి, పాలించి పాతిపెట్టడం ఇక్కడ లీగల్, అఫీషియల్, న్యాయ సమ్మతం! కుడోస్ టు భారత ప్రజాస్వామ్యం!

ఎవడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అన్నది? హక్కులు పుష్కలంగా ఉన్నాయి అని కూసేది? ఎవడికి స్వతంత్రం? ఎవడికి ప్రజాస్వామ్యం? ఎందుకు ఇంత నిర్లిప్తత? ఎన్నిసార్లు, ఎన్ని సంఘటనలు జరిగినా చరిత్ర పునరావృతం అవుతూనే వుంటుందా? స్థల, కాల, పరిస్థితులు మారినా కూడా సమాజంలో మార్పు రాకపోవడం ఎవరి తప్పు? రోజురోజుకీ ఇంకా దిగజారుతున్నాం ఎందుకు? కులం కొట్లాటలని రెండు సమూహాల మీద తోసేసి చోద్యం చూసే వారిని ఏమనాలి? పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా వెంటపడి వేధించే కులం కోరల్లోంచి కొన్ని కోట్ల మందిని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా?

కనీసం రక్షణ కల్పించడంలో కూడా విఫలమైతే ఇంకా ఎందుకు ఈ పనికిమాలిన వ్యవస్థలు? ఎందుకు మనం రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం? ఎందుకు ప్రభుత్వాలు, ప్రభుత్వ పథకాలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో తయారుచేసుకుంటున్నాం? అడవులలో ఆదివాసీలు ఉంటే ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇక్కడ కులం మాట్లాడకుండా విప్లవం లేదు అని చెప్పిన అంబేద్కర్‌ని ఎక్కడకు నెట్టివేసాం? ఇక్కడ స్వరాజ్యం మా జన్మ హక్కు అన్న వాళ్ళు రాడికల్ జాతికి చెందిన వారు అని పాఠ్య పుస్తకాలలో చేర్చి, గాంధీని మాత్రమే దేశానికి దిశ, దశగా చూపించడంలో ఎవరి పాత్ర ఎంత ఉంది? జల్, జమీన్, జంగల్ నినాదాలు కొందరివే ఎందుకయ్యాయి? సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు విడివిడిగా చూసినంత కాలం మనం మారము. మాట్లాడితే కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు, కొన్ని మాట్లాడకూడదు అని ఆంక్షలు విధించింది. నిర్బంధించే విద్యని పెంచిపోషిస్తూ, విభేదాలు పెంచుకుంటూ పోతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాం కదా? విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ సమానంగా లేనపుడు, ప్రాంతాల మధ్య, సమూహాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నప్పుడు, భిన్న జాతుల సమస్యలకు మూల కారణాలు కుల, మత, ఆర్థిక మూలాలలో ఉన్నట్టు ఇంకా కనుక్కోలేదా మనం? ప్రశ్నలు, ప్రశ్నలు.. గుండె రగిల్చే సంఘటనలు, నిరాశ, అశక్తతకి బలైపోతున్న యువత ఏం చేయాలి? మనముందు ఎన్నో ఉద్యమాలున్నాయి, వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలి.

ఫైళ్ళు పట్టుకొని, నాలుగు ధర్నాలు చేస్తే మారే రాజ్యాలు కావు ఇవి. ఇక్కడినుంచే జాతులమీద ఈ రాజ్యం ఎక్కుపెట్టిన హింస బాణం తిరగబడేటట్టు చేయాలి. చరిత్ర తిరగరాయకపోతే, మళ్లీ ఒక నిజ నిర్ధారణ కమిటీ నివేదిక తీసుకొని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, పోస్టుమార్టం సరిగ్గా జరగలేదని, అమాయకులు ఆదివాసీలు బలయ్యారని, దళితులూ ఊచకోతకు గురయ్యారని చదువుకుంటూనే ఉంటాం, రాస్తూనే ఉంటాం.

అగ్రకుల దౌర్జన్యం అని, సామ్రాజ్యవాద నిరంకుశ పరిపాలన అని నిరూపించి ఈ జీవిత కాలంలో శిక్షపడితే చాలు అని మళ్లీ ఒక సంఘటన కోసం వేచి చూస్తాం! ఇప్పటివరకూ జరిగింది ఇదే! ఇక ముందు జరగకుండా చూసే బాధ్యత మనందరిది! మనం అంటే నలుగురు దళిత సంఘాలు, మూడు ఆదివాసీల సంఘాలు అని కాదు అర్థం. దళితులూ, ఆదివాసులను వేరువేరుగా చూడకండి. రకరకాల పేర్లతో బలయ్యే వారిది ఒకటే జాతి, అది కూడా రాజ్యం చేతిలో! మేధావుల మౌనం ఎంతో ప్రమాదకరం! ఈ రాజ్యానికి ఏ భాష అర్థం అవుతుందో అదే భాష మాట్లాడండి!

- సుజాత సూరేపల్లి 
Andhra Jyothi News Paper Dated : 12/07/2012

No comments:

Post a Comment