Monday, May 21, 2012

దళితోద్యమ వేగుచుక్క---సంగిశెట్టి శ్రీనివాసు



భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు వేసిండు. ఇదే 1913 నాటికి మాన్యసంఘంగా మారింది. అంబేద్కర్ కన్నా ముందు భారతదేశం గర్వించతగ్గ దళిత నాయకుడు. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగే సభలకు ముఖ్యఅతిథిగా హాజరై తన ఉపన్యాసాల ద్వారా దళితోద్యమ కార్యకర్తలను చైతన్య పరిచిండు. భారతదేశంతో పాటు ఆంధ్రవూపాంతంలో కూడా దళితోద్యమాలకు దారులు వేసిండు. వినూత్న రీతిలో ఆయన తీసుకొచ్చిన చెతన్యం భవిష్యత్తరాలను తీర్చిదిద్దింది. దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి, నిర్వహించాడు. భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికలకు సంపాదకత్వం వహించి అనేక రచనలు చేసిండు. 1911లో దేవదాసీ (జోగిని) నిర్మూలన సంఘాన్ని, 1912లో స్వస్తిదళ్ స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటుచేసి ప్రజాహిత కార్యక్షికమాలు చేపట్టిండు. రెడ్‌క్రాస్ సొసైటీ మాదిరిగా నడిచిన ఈ సంస్థ హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు అనా థ శవాలను తొలగించి, నగరాన్ని పరిశువూభంగా ఉంచినందుకు గాను నిజాం ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించిం ది. సేవా పతకాలను అందజేసింది.

అనేక సంస్థలు స్థాపించి ఇటు అనంతపురం నుంచి అటు అమలాపురం వర కు, లక్నో నుంచి ఔరంగాబాద్ వరకు (హైదరాబాద్, తెలంగాణ సరేసరి) ఆయన అనేక సభల్లో సభాధ్యక్షుడిగా, ముఖ్యఅతిథిగా హాజరయ్యిండు. ఆయన విజయవాడ వస్తుండని తెలియడంతో దళితులు బలవంతంగా ఎక్కడ దుర్గ గుడిలో ప్రవేశిస్తారో అన్న భయంతో పూజారులు గుడిని మూసేశారంటే ఆయన ప్రభావం అర్థమవుతుంది. అంతెందుకు ఉన్నవ లక్ష్మినారాయణ రాసిన మాలపల్లి నవలకు స్ఫూర్తి భాగ్యడ్డి వర్మ. అందులో హీరో భాగ్యడ్డి వర్మే. తాము పంచములం కాము ఈ దేశ మూలవాసులం, ఆదిహిందువులం (మతానికి సంబంధం లేదు) అని నినదించిండు. విజయవాడలో మొదట పంచమ మహాసభ అని ప్రారంభించి సాయంవూతానికి అది ఆదిహిందూ మహా జనసభగా మారేలా చేసిండు. ఈ విజయవాడ సభనే మొత్తం తెలుగునాట దళిత చెతన్యానికి పునాదులు వేసింది. 

ప్రస్తుత ఆంధ్రవూపదేశ్ అంతటిలో మొట్టమొదటిసారిగా దళితుల సంఘటిత సమావేశం 1917 నవంబర్ 4,5,6 తేదీల్లో విజయవాడలో జరిగింది. ఈ సభకు ఆంధ్రవూపాంతంలోని అన్ని జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి హైదరాబాద్ నుంచి వచ్చిన భాగ్యడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. ఇందులో భాగ్యడ్డి వర్మతో పాటు హైదరాబాద్, తెలంగాణ జిల్లాలకు చెందిన దళిత కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మొదట ఈ సభను ప్రథమ ప్రాంతీయ పంచమ మహాసభ పేరిట విజయవాడ టౌన్ హాల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. సంప్రదాయ వాదుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు టౌన్‌హాల్‌లో సభను నిర్వహించడానికి అనుమతి నిరాకరించారు. దీంతో మైలవరం రాజాకు చెందిన డ్రామా హాల్‌లో సభ జరుపుకున్నారు. అయితే సాయంత్రం అయ్యే సరికి తాము పంచములం కాము ఆది హిందువులం ‘ఈదేశ మూలవాసులం అని ఉద్ఘాటిస్తూ సమావేశం పేరును ప్రథమ ఆది హిందూ మహాజన సభ పేరిట జరుపుకున్నారు. అందుకు ప్రధాన కారణం భాగ్యడ్డి వర్మ తన ప్రసంగంలో పంచములు అని ఏ శాస్త్రంలోనూ లేదు. ఆత్మన్యూనతతో కాదు మనం ఈ దేశ మూలవాసులుగా ఆత్మగౌరవంతో బతకాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు సభలో ఒక తీర్మానం కూడా చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని గౌరవిస్తూ పంచమ పదాన్ని తొలగిస్తూ 25 మార్చి 1922లో 817 జీవోను విడుదల చేసింది. ఈ సమావేశంలో ఆదిహిందువులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. దళిత విద్యార్థులకు అందరితోపాటు చదువుకునే అవకాశం కల్పించాలని, మాల, మాదిగ పల్లెల్లోనే పాఠశాలలను ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కూడా తీర్మానాలు చేశారు. 

ఈ చారివూతాత్మక సభ ఏర్పాటుకు గూడూరు రామచంవూదరావు, చుండ్రు వెంకయ్య తదితరులు పూనుకున్నారు. ఈ సమావేశంలోనే పశ్చిమగోదావరి జిల్లా పిప్పరకు చెందిన మంగిపూడి వెంకటశర్మ రాసిన నిరుద్ధ భారతం పుస్తకం విడుదల చేశారు. ఈ సమావేశం తెలుగునేలపై దళితోద్యమాలపై వేసిన ప్రభావం అత్యంత ప్రభావశీలమైనది. మూడ్రోజుల పాటు ఈ సమావేశాలు జరగ్గా ఆ మూడు రోజులు విజయవాడలోని దుర్గ గుడి తలుపులు మూసి ఉంచారు. సమావేశానికి హాజరైన దళితులు దుర్గగుడిలోకి చొచ్చుకువచ్చే అవకాశం ఉందని ఏకంగా గుడినే మూసేశారు. ఈ సమావేశం వల్ల ప్రభావితుడెన ఉన్నవ లక్ష్మినారాయణ మాలపల్లి నవల రాసిండు. ఈనవల్లో హీరో భాగ్యడ్డి వర్మే. అలాగే కుసుమ ధర్మన్న (1900‘1946) కూడా మా కొద్ది నల్లదొరతనము అనే కవితా పుస్తకాన్ని 1921లో అచ్చేశాడు. విజయవాడ సభ స్ఫూర్తితో వరుసగా ఆంధ్రవూపాంతంలోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయి. 

ఒక వైపు నిరంతరం సభలు సమావేశాలు అంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూనే తాను పుట్టి పెరిగిన హైదరాబాద్‌లోని దళిత బస్తీల్లో మద్యపానం వల్ల కలిగే నష్టాలను బు‘రకథలు, హరికథల ద్వారా ప్రచారం చేసేవాడు. ఈ నాటకం చూడ్డానికి వచ్చే ప్రేక్షకులకు వాటి ప్రదర్శన కన్నా ముందూ తన ఉపన్యాసాల ద్వారా వారిలో చెతన్యం తీసుకురావడానికి ప్రయత్నించేవాడు. బస్తీల్లోని ప్రజల్లో తాగుడు మాన్పించేందుకు ఆయన ఒక వినూత్న ప్రయోగాన్ని చేసి సఫలీకృతుడయ్యాడు. రోజూ ఎక్కడో ఒక దగ్గర బస్తీల్లోని కూలీలు పని చేసుకునేవారు. ఐదారు కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసే ఒక ప్రదేశానికి వెళ్ళి ప్రతి కుటుంబం రోజూ తమకు వచ్చే ఆరణాల కూలీలో ఒక అణా మాకు చందాగా ఇవ్వాలని కోరాడు. కూలీలు మొదట కొంత తటపటాయించినా భాగ్యడ్డి వర్మ వారిని ఒప్పించి తలా ఒక అణా పైసని వారి నుంచి వసూలు చేసిండు. ఇలా నెల రోజులు వరుసగా వసూలు చేసి ఆ డబ్బుతో 31వ రోజు ఒక తులం బంగారం కొని వాటితో పుస్తెలు చేయించి చిన్న సమావేశం ఏర్పాటు చేసి అందులో తాళి కట్టించేవాడు. దీంతో అణా పైసలు తక్కువ కావడంతో వారు ఆమేరకు కల్లు, సారాయి తాగడం మానేయడమే గాకుండా నెల రోజు ల తర్వాత తులం బంగారం దక్కించుకుండ్రు. ఇలాంటి కార్యక్షికమాలు భాగ్యడ్డి వర్మ హైదరాబాద్, సికింవూదాబాద్‌లోని అనేక బస్తీల్లో విజయవంతంగా నిర్వహించిండు. 

దళితుల అవస్థలకు అవిద్యే ప్రధాన కారణమని భావించి విద్యారంగంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేసిండు. హైదరాబాద్‌లోని గణేశ్‌మల్ సింఘ్వీ, వామన నాయక్ లాం టి వితరణ శీలుర ప్రోత్సాహంతో తానే వివి ధ ప్రదేశా ల్లో దళిత బాల, బాలికల కోసం పాఠశాలలు నెలకొల్పిండు. ఈ దశలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు వాటిని సవ్యంగా నడిపించే షరతుమీద పాఠశాలల నిర్వహణ బాధ్యతను భాగ్యడ్డి వర్మ నిజాం ప్రభుత్వానికి అప్పజెప్పిండు. ఆ పాఠశాలలే పష్తక్వామ్ పాఠశాలలుగా ప్రసిద్ధి. భాగ్యడ్డి వర్మ ఆర్యసమాజ్, బ్రహ్మసమాజ్ అన్నింట్లో పాలు పంచుకొని అవి ఏవి దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని భావించి చివరికి బుద్ధిజం పట్ల మక్కువ చూపిండు. దాన్నే ఆచరించిండు. ప్రతి యేటా పెద్ద ఎత్తున బుద్ధ జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించేవాడు. చివరికి తన కొడుక్కు గౌతమ్ అని పేరు పెట్టుకుండు. 

తెలుగునాట దళితోద్యమానికి దారులు వేసి వేగుచుక్కై వెలిగిన భాగ్యడ్డి వర్మ గురించి ఏ తరగతి పాఠ్యపుస్తకంలోనూ సమాచారం లేదు. ఆంధ్రవూపాంతంలో డజనుకు పైగా వార్షిక సభలకు అధ్యక్షుడుగా హాజరై అనేకమంది అనుచరుల్ని సంపాదించికున్నాడు. అయినప్పటికీ అటు ఆంధ్రవూపాంతంలోనూ, ఇటు హైదరాబాద్‌లోనూ ఒక్క విగ్రహమూ లేదు. వచ్చే సంవత్సరం భాగ్యడ్డి వర్మ 125వ జయంతి. ఆ సందర్భంగానెనా దళితులు, సామాజిక కార్యకర్తలు పూనుకొని ఆయనపై పోస్టల్ స్టాంప్ వచ్చే విధంగా, ట్యాంక్‌బండ్‌తో పాటు హైదరాబాద్‌లోని కూడలి ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని నిలబెట్టాలి. అంతేగాదు అందుబాటులో లేకుండాపోయిన ఆయన నడిపిన పత్రికలు భాగ్యనగర్, ఆదిహిందూలను సేకరించి వాటిల్లోని ఆయన రచనలను సంకలనాలుగా అచ్చేయించాల్సిన అవసరముంది. ఇదే ఆ మహానాయకుడికి మనమిచ్చే నివాళి.


సంగిశెట్టి శ్రీనివాసు 

నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ 22/05/2012 

No comments:

Post a Comment