Monday, October 17, 2011

ఉద్యమ సుడిలో బడుగుల విద్య - పాపని నాగరాజు Andhra Jyothi 18/10/2011


ఉద్యమ సుడిలో బడుగుల విద్య
- పాపని నాగరాజు

వేల సంవత్సరాలుగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థ శూద్రులను విద్యకు దూరం చేసింది. ఈ చారిత్రక అన్యాయాన్ని గ్రహించిన చార్వాకులు, లోకాయతులు మొదలు మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ వరకు విద్యతోపాటు సమస్త సకల జీవన రంగాలు, సంపద వరకు మాక్కావాలని పోరాడారు. ఈ క్రమంలో బ్రాహ్మణ-బనియాలతో ఫూలే; హిందూ దోపిడీ వర్గాల, బ్రిటీష్ వలసవాదులతో అంబేద్కర్‌లు పోరాడారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కొన్ని రిజర్వేషన్ ఫలాల్ని సాధించిపెట్టారు.

అయినా ఈ శూద్రకులాల పేదలు ఆ ఫలాల్ని చేజిక్కించుకోలేకపోతున్నారు. దానికి విద్యాలేమియే ప్రధాన కారణం. ఆనాడు మహాత్మ జ్యోతిరావు ఫూలే తలపెట్టిన మహోజ్వల ఆధునిక బ్రాహ్మణేతర పోరాట స్రవంతికి తన చదువుతోనే అంకురార్పణ జరిగింది. ఆధునిక జీవితం ఆరంభమయ్యేది స్కూలుతోనే, స్కూలు విద్యతోనే. కనుక ఫూలే విద్యకి అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ఆ ప్రాధాన్యాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. "విద్యలేనిదే వివేకం లేదు.

వివేకంలేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే (మానవీయ సమానవీయ) విలువలేదు. విలువలేనిదే పురోగతి లేదు. పురోగతిలేనిదే ప్రగతి లేదు. ప్రగతిలేకనే శూద్రులు (అతిశూద్రులు) అధోగతిపాలయ్యారు. ఇంతటి అనర్దమూ (అతిముఖ్యమైన) ఒక్క అవిద్యవల్లనే జరిగింది.'' అని పూలే అంటాడు. తెలంగాణలో భూస్వాముల వివక్ష, దాడులు, అసమానతలు, దోపిడీ ఆధిపత్యం మూలంగా విద్య వీరికి అందలేదు. ఈ క్రమంలో తెలంగాణ రైతాంగ పోరాటం నక్సలైట్ ఉద్యమం వారిలో చైతన్యాన్ని రగిలించింది.

ఆ స్ఫూర్తితో, ఆ మహానీయులు సాధించిన రిజర్వేషన్ ఫలాల మూలంగా శూద్రులైన బడుగులు ఇప్పుడిప్పుడే అనగా 15-20 ఏళ్ళుగా విద్యాఫలాల్ని అనుభవించడానికి దరిచేరుతున్నారు. వీరి విద్యాభివృద్ధి మూలంగా అధికారాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ ప్రమాదాన్ని గ్రహించిన అగ్రకుల ధనికవర్గాలు పాలకులు దుర్బుద్దితో మళ్ళీ ప్రైవేటీకరణను వెంటేసుకొచ్చి దూరంగా నెట్టారు.

వారే మరో రూపంలో వలసవాదులుగా కొనసాగినవారు తెలంగాణలో విద్య మొదలు సమస్త జీవన రంగాలు, వనరులు, సంపద ఇలా అనేక వాటిపై పెత్తనం చెలాయించి బడుగులను పాతాళంలోకి నెడుతున్నారు. మొత్తంగా తెలంగాణపైగానీ, బడుగులపైగానీ పెత్తనంచేసి తెలంగాణను అడ్డుకునేది రెండున్నర జిల్లాల రెండున్నర అగ్రకుల బడా పెట్టుబడిదారీ, పాలకవర్గాలే. కనుక రెండోదశ(1997)లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం వివిధ సామాజిక సర్వజనుల మహాసంగ్రామంగా మారి ఇప్పుడు కాక మరెప్పుడు తెలంగాణ రాదనే దృఢసంకల్పంతో ఏకోన్ముఖంగా సాగుతున్నది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మహిళలు, సామాజిక కులాల వారు, విద్యార్థి యువజనులు ఇలా ఎందరో పాల్గొంటున్నారు. పరిపాలన వ్యవస్థను స్థంభింపచేసేందుకు ఉద్యోగస్తులే కాదు న్యాయశాఖ, రక్షణ- పోలీసులుశాఖలతో పాటు, ఆదాయం వచ్చే బొగ్గుగని, రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, మద్యం, పన్నుల, ఎక్సైజ్ శాఖలు ఇలా అన్ని రంగాలను ఈ ఉద్యమంలోగాని, సమ్మెలోగాని పాల్గొనేలా చేస్తూ ప్రజాప్రతినిధులు త

మ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ కచ్చితంగా వచ్చితీరుతుంది. కానీ ఒక్కవిద్యాసంస్థల (పాఠశాల) విద్యార్థులు పాల్గొంటేనే తెలంగాణ వస్తుందనేదికాదు. కానీ ఉద్యమంలో విద్యార్థులు ఒకభాగంగా ఉంటున్నారు. నిజానికి ఈ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నది బడుగులేనన్నది కాదనలేని సత్యం. వీరు చదువులకు దూరంగా ఉద్యమాల్లో - ఆత్మబలిదానాలలో ముందుంటున్నారు. పాలకవర్గాల, పెట్టుబడిదారుల పిల్లలు విదేశాల్లో ఇతర బడా విద్యాసంస్థల్లో చదువుతున్నారు.

దళిత బహుజన - పేదలు ఈ అరకొర చదువుల మూలంగా అగ్రకుల - ఉన్నత వర్గాల - సీమాం«ద్రులతో పోటీని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితి ఇలా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఇంతటి పతాకస్థాయిలోకి తెచ్చింది ఈ 'బడుగు'లేనన్నది వాస్తవం. ఈ అభిప్రాయం సీమాం«ద్రులచే లోపాయికారి ఒప్పం దం కుదుర్చుకొన్నదని గానీ, ముందు షరతులతో కూడిన ఒప్పందాలను కుదర్చుకొన్నాకనే భౌగోళిక తెలంగాణకు అంగీకరించే వాదం అంతకన్న కాదు మాది. బేషరతుగా తెలంగాణ ఇవ్వాలంటున్నా, అందుకోసం పోరాడుతు న్న సామాజిక తెలంగాణవాదం మాది.

తెలంగాణలో ఏ పాలకులు అధికారంలోకి వచ్చిన బడుగుల విద్యాభివృద్ధి ఏనాడు కోస్తాం«ద్రులకన్న అభివృద్ధి కాలేదు. అందుకు కారణం పాలకులకు ప్రజలు దరిద్రులుగా ఉంటేనే వారిబూటకపు వాగ్దానాలతో ఓట్లేయించుకొని సమాజాన్ని దోచుకోవచ్చనే. సమైక్యాంధ్రప్రదేశ్‌లోని, తెలంగాణ ఉద్యమం మొదలుతో ఎన్నికైన మన ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలలో కనీసంగా ఏకోపాధ్యాయులను లేకుండా విద్యార్థుల 1:30 ప్రకారం కాకుండా తరగతి గదికొక్కరైన ఉపాధ్యాయుడిని నియమించిన చరిత్ర ఈ పాలకులకు ఉందా? భవనాలులేక పూరిగుడిసెల్లో, చెట్లకింద చదువులు, ఉన్న ఏకోపాధ్యాయ స్కూళ్లను ఎత్తివేయడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీటిసౌకర్యం లేనివి ఎన్నో బడులు ఉన్నాయి.

మూతపడున్నవి, మూతపడ్డవి కూడా కోకొల్లలు. పైగా తెలంగాణ అంతటా ప్రైవేటుగా చదివించలేని బడుగులకు ప్రతి గ్రామంలో ప్రైవేటు బడులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు బడుల ప్రభావం ఎంతటి స్థాయిలో ఉందంటే నేడు తెలంగాణ అంతటా 10వేల పాఠశాలల్లో చదువుతున్న 50 లక్షల మంది విద్యార్థులు సమ్మెలో పాల్గొంటున్నట్టు ఆ యాజమాన్యాలు ప్రకటించాయి. కనుక ప్రాథమికంగా 10వ తరగతి వరకు ప్రతి 100 మందిలో 30 మంది బడిగడపతొక్కుతున్న వారుగా, ప్రతి 300 మందిలో ఒక్కరే డిగ్రీగా, ప్రతి 600 మందిలో ఒక్కరే పీజీగా, ప్రతి 5000 మందిలో ఒక్కరు ఇంజనీరుగా, 12000 మందిలో ఒక్కడాక్టరుగా చదువుతున్నారు.

అంటే బడుగులకు ప్రాథమికంగా రావాల్సిన విద్య సరిగ్గా రాక, వచ్చినా ఇంగ్లీష్ రాక చదువులకు స్వస్తిపలకాల్సివస్తోంది. మరి పాలకులు వా రి రికార్డుల్లో ఈ ప్రాంతానికి - బడుగు ల విద్యాభివృద్ధికి అధికస్థాయిలో నిధు లు, విద్యాసంస్థల్ని కేటాయించినట్లు ఉ న్నా అవి దారిమళ్ళించబడి ప్రైవేటు విద్యాసంస్థలుగా వృద్ధిచెందుతున్నా యే తప్ప ప్రభుత్వాధీనంలోనివి కాదు. పాలకులకు చిత్తశుద్ధి లేదని పై విషయాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది.

కావున ఇంతటి చారిత్రక అన్యాయం తెలంగాణ బడుగులకు జరిగిందనే దృష్టిలో పెట్టుకొని నేటి తెలంగాణ ఉద్యమంలో బడుగులు చదివే విద్యాసంస్థలను మినహాయింపునిచ్చే ఉద్యమరూపాలను, ఎత్తుగడలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించమని ఉద్యమకారులను కోరుతున్నాను. విద్య బడుగుల దరిచేరడానికి ప్రస్తుతం భౌగోళిక తెలంగాణ ద్వారా సాధ్యం కాదు. సీమాంధ్ర బడా అగ్రకుల విద్యాపెట్టుబడిదారులకు బదులు తెలంగాణ అగ్రకుల బడా విద్యపెట్టుబడిదారులే విద్యాసంస్థల్ని నెలకొల్పుకుని మళ్లీ దోచుకోవడం జరుగుతుంది.

మెజార్టీ ప్రజలందరికీ విద్య చేరాలంటే దేశీయ ప్రగతిశీల భౌగోళిక సామాజిక స్వత్రంత విద్యా విధానంతోనే సాధ్యం. ఈ స్థితిలో నేడు సీమాం«ద్రులు పేరెంట్స్ కమిటీ పేరిట తెలంగాణను అడ్డుకునేవారుగా ఉన్నారు. నిజానికి వలసవాద అగ్రకుల బడా విద్యాపెట్టుబడిదారుల కార్పొరేట్ విద్యాసంస్థల్లో, ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలో చదివించే సీమాంధ్ర అగ్రకుల బ్యూరోక్రాట్సే ఆందోళనలు చేపడుతున్నారు. ఈ పేరెంట్స్ కమిటీవారు బడులు తెరవాలంటున్నారేగానీ తెలంగాణ ఇవ్వాలనడం లేదు.

తెలంగాణకు మేం వ్యతిరేకం కాదంటున్న వీరు తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర ఏస్థాయిలోఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే సీమాంధ్ర పెట్టుబడిదారులు, పాలకులు, మీడి యా వంతపాడుతుందే కానీ తెలంగాణ వాదులు కాదు. పైగా ప్రభు త్వం సమ్మె విరమింపజేయమని హెచ్చరిస్తుందే కానీ తెలంగాణను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వ మొండితనం ఎంతస్థాయి లో ఉందంటే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్ని పోలీసులచే కఠినంగా అణిచైనా అడ్డుకోకుండా నిర్వహించాలని తపిస్తుంది. అణిచివేతల్ని ప్రదర్శిస్తుందని అనేక ఘటనలు రుజువుచేస్తున్నాయి.

కేంద్రం తెలంగాణ ఇవ్వదని, తెలంగాణలో 'బడుగుల' చదువులు అభివృద్ధి కావని, సమ్మె ఆగదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ బడు(గు)ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఇలా కావడానికి అగ్రకుల దళారీ దోపిడీవర్గ వలసవాదులు, పాలకులు బాధ్యులు అవుతారు. ఈ అనిశ్చితిని పరిష్కరించాలని పాఠశాలేతర విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మహిళలు, సామాజిక కులాల వారు, యువజనులు, లాయర్లు, కోర్టుసిబ్బంది ఎక్సైజ్ పోలీసులు, న్యాయశాఖ, రక్షణ- పోలీసుశాఖలతో పాటు, ఆదాయంవచ్చే బొగ్గుగని, రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, మద్యం, ఎక్సైజ్ ఇలా అన్నిరంగాలను, అందర్ని పాల్గొనేలా చేసి భౌగోళిక తెలంగాణతో పాటు సామాజిక తెలంగాణను సాధించుకుందాం.

- పాపని నాగరాజు
తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు

No comments:

Post a Comment