Thursday, October 27, 2011

తెలంగాణ ఉద్యమం- సామాజిక న్యాయం By Chamakura Raju Dated 28/10/2011


తెలంగాణ ఉద్యమం- సామాజిక న్యాయం
- నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం
- రాబోయే తెలంగాణలో వారి వాటా కూడా ప్రశ్నార్ధకమే
- ఉద్యమంలో ముందుకు వచ్చిన రెండు అగ్రకులాలు
- బీసీల తెరమరుగుకు అన్ని పార్టీలలో కుట్రలు
- మంద కృష్ణ నినాదాన్ని ఎందుకు అందిపుచ్చుకోరు?
- ఇప్పటికైనా వాటా కోసం బీసీలు డిమాండ్‌ చేయాలి!


telanganaతెలంగాణ ఉద్యమం మహోద్యమంగా మారింది. తెలంగాణ ప్రజానీకం ఉద్యమంలో పాల్గొంటున్న క్రమంలో ఒక బలమైన వాదం వినిపిస్తోంది. అదే సామాజిక న్యాయ నినాదం. ఇంత మహా ఉద్యమం జరుగుతుంటే, ఈ సామాజిక న్యాయ నినాదం (కొందరు దీనిని కుల వాదంగా చూస్తున్నారు) ఇంత కీలక దశలో, సంక్లిష్ట సమయంలో అవసరమా అన్నది నేడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే ఈ వాదం వినిపించడానికి కారణాలను మాత్రం ఎవరూ విశ్లేషించడం లేదు. పైగా దీనిని ఒక శుష్క వాదంగా కొట్టివేస్తున్నారు. ఈ దశలో సామాజిక న్యాయ నినాదం ఆవశ్యకతపై విశ్లేషించవలసి ఉన్నది.
తెలంగాణ ఉద్యమం నడుస్తున్న చరిత్ర ప్రతి తెలంగాణ పౌరునికి తెలుసు.

ఉద్యమంతో అన్నీ తెలుసుకున్నారు. అయితే ఈ ఉద్యమంలో కనుపించని కోణం కూడా మరొకటి ఉంది. అవే అగ్రకులాలు వేస్తున్న ఎత్తుగడలు, పాచికలు, పకడ్బందీగా అమలు చేస్తున్న కుట్రలు. 2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఆవిర్భావానికి ముందు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో- నియోజక వర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ దేవేందర్‌ గౌడ్‌, శ్రీనివాస యాదవ్‌, కృష్ణ యాదవ్‌, కడియం శ్రీహరి, సుద్దాల దేవయ్య, ఎల్‌. రమణ వంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు చక్రం తిప్పగలిగారు. సమర్ధవంతమైన మంత్రులుగా రాణించగలిగారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఆవిర్భావం అనంతరం జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు సంభవించాయి. క్రమంగా నియోజక వర్గాల స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు అన్ని పార్టీల్లో కనుమరగయ్యారు.

అదే క్రమంలో వెలమ కుల నేతలు వెలగడం మొదలు పెట్టారు. మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్‌ వార్‌) పార్టీ హెచ్చరికలతో తమ గ్రామాలు, భూములు వదిలి నగరాలకు వలస వెళ్ళారు. అనంతరం ఉద్యమం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఎందరో వెలమ నాయకులు ఎదిగారు. 2004 ఎన్నికల అనంతరం డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కాంగ్రెస్‌ పార్టీ వల్ల కోమటిరెడ్డి, జానారెడ్డి, జీవన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు మంత్రులుగా ప్రముఖంగా ముందుకు వచ్చారు. వైఎస్‌ఆర్‌ మంత్రివర్గంలో చేరిన తెరాస మంత్రులుగా వెలమలే వెలిగారు. మొత్తంగా నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా వెలమ దొరలు, కాంగ్రెస్‌ ద్వారా రెడ్లు రాజ్యాలు (జిల్లాలలో) ఏలుతున్నారు.

అన్ని రాజకీయ పార్టీల్లో ఎదుగుదలను పరిశీలిస్తే, ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలను తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో కేవలం జెండాలు మోసే, జిందాబాద్‌ కొట్టే కార్యకర్తలుగా, ద్వితీయ శ్రేణి నాయకులుగా పరిమితం చేశారు. కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో ఎంతో మంది (ఆయన అల్లుడు, బిడ్డ, కుమారుడు సహా) ఇన్‌స్టంట్‌ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వెలమలే ఎదిగారు. కాంగ్రెస్‌లో రెడ్లే ఇన్‌స్టంట్‌ ఎంపీలుగా తయారయ్యారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే, మరో వైపు జాయింట్‌ ఏక్షన్‌ కమిటీ (జెఏసీ)ల ద్వారా మరొక వ్యూహం అమలులోకి వచ్చింది. ఈ తెలంగాణ జేఏసీల ఆవిర్భావం, పటిష్ఠం, ప్రస్తుతం నడుస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌లో చేసిన రెండవ ప్రకటన అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించేందుకు అందరూ (అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు) కలిసి ఒక కూటమి ఏర్పాటయ్యింది.

అదే తెలంగాణ జాయింట్‌ ఏక్షన్‌ కమిటీ. ఈ కమిటీని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రకటించారు. దీనికి కన్వీనర్‌గా ప్రొ కోదండరామ్‌ను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. అప్పుడు ఈ జెఏసీలో కాంగ్రెస్‌, బీజేపీ, టిడిపి, సిపిఐ (ఎం.ఎల్‌), న్యూ డెమోక్రసీ, టిఆర్‌ఎస్‌లతో బాటు ఎమ్మార్పీఎస్‌, తెలంగాణ మాల మహానాడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఎన్జీఓల సంఘం తదితర ప్రజాసంఘాలతో బాటు ఇతర కుల సంఘాలు కూడా భాగస్వామ్యం పొందాయి. ఈ జేఏసీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రాంతమంతటా వివిధ స్థాయిల్లో జెఏసీలు ఆవిర్భవించాయి. ఈ జెఏసీలు పల్లె పల్లెలో, పట్టణ స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో యూనిట్ల వారీగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చాయి. ఏ విధమైన స్వార్ధ రాజకీయ, కుల తదితర స్వార్ధ ప్రయోజనాలు లేకుండా ఏర్పడ్డాయ

ఈ జెఏసీల ఏర్పాటు వెనుక ఏ కులాల, రాజకీయ పార్టీల ప్రాబల్యం కూడా లేదు. అన్నీ స్వతంత్రంగా ఏర్పడినవే. ఈ జెఏసీలలో కీలకంగా నిలచి నాయకత్వం వహించినవారిలో అధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన విద్యావంతులు, విద్యార్థులు, యువకులు. ఈ జెఏసీలు ఎక్కడికక్కడ తమకు చేతనైన పద్ధతిలో ఉద్యమించాయి. వివిధ ప్రాంతాలలో సామాజిక వర్గాలు, ఉద్యోగులు, ఇతర ప్రైవేటు సంస్థలు నాయకత్వం వహిస్తున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో ఒక కుట్ర మొదలైంది. తెలంగాణ ప్రాంత జెఏసి కన్వీనర్‌గా ఉన్న కోదండరామ్‌ ఛైర్మన్‌గా మారి జెఏసిల పటిష్ఠం, సమన్వయం పేరుతూ ఊరూరా తిరగడం మొదలుపెట్టారు. తన పేరులో రెడ్డి కులాన్ని సూచించే పదాన్ని చేర్చుకోకుండా, ఈ ప్రొఫెసర్‌ వివిధ ప్రాంతాలలో ఉన్న జెఏసిలకు రెడ్డేతర వ్యక్తులు నాయకత్వం వహిస్తున్న స్థానాలలో రెడ్డి కులస్థులను ఛైర్మన్లుగా, కన్వీనర్లుగా నియమించాలని ఒత్తిడి తేసాగారు.

అలా నియోజక వర్గ స్థాయిలో ఒత్తిడికి లొంగనివారికి పైన సూపర్‌ న్యూమరి పోస్టులను సృష్టించి తన సామాజిక వర్గానికి చెందినవారిని- ఏ ఉద్యమ నేపథ్యం లేకున్నా, జెఏసీల ఏర్పాటులో వారి పాత్ర లేకున్నా నియామకం చేశారు. ఇలా నియామకం జరిగినవే- రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగం జెఎసి ఛైర్మన్‌, వరంగల్‌ జిల్లా జెఏసి ఛైర్మన్‌- ఇలా నియోజక వర్గాల మొదలు జిల్లా స్థాయి వరకూ తన సామాజిక వర్గానికి చెందినవారిని జెఏసీ నాయకులుగా నిలబెట్టారు. ఇదే తతంగం కొన్ని ఉద్యోగ సంఘాల జెఏసిల్లో కూడా జరిగిందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విధంగా తన సామాజికవర్గం వారిని నాయకులుగా తయారు చేసే విధంగా జెఏసిలను నాయకుల్ని చేస్తూ- పటిష్ఠం పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యమ నాయకులను అట్టడుగుకు తొక్కి వేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు ప్రజలు ఉధృతంగా పాల్గొంటూ ఉంటే, మరోవైపు కె. చంద్రశేఖర రావు వెలమలను, కోదండరామ్‌ రెడ్లను నాయకులుగా తయారు చేసే ఫ్యాక్టరీగా ఈ ఉద్యమాన్ని మార్చారు. మొత్తంగా ఉద్యమం చేస్తున్నది, త్యాగాలు చేస్తున్నది, అరెస్టుల్ని, లాఠీ చార్జ్‌లను, పోలీసు కేసులను ఎదుర్కొంటున్నది బడుగులైతే నాయకత్వం వహిస్తున్నది మాత్రం ఈ రెండు అగ్రకులాలే అని స్పష్టంగా అర్ధమవుతున్నది. ఈ కుట్రలను గమనించిన ఎమ్మార్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ- రేపటి తెలంగాణలో తమ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ సామాజిక తెలంగాణ కోసం డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే కొందరు అగ్రకుల నాయకులు, కొందరు కుహనా సామాజిక న్యాయవాదులు దీనిని కుల కోణంగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు తెలంగాణ అయితే రానివ్వండి, ఆ తర్వాత సామాజిక అంశాన్ని పరిశీలిద్దాం అంటూ సమస్యను దాటవేసే యుక్తులు పన్నుతున్నారు. ఈ కుట్రను గమనించలేని కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యావంతులు కూడా ఇదే అంటున్నారు. వేల సంవత్సరాల కిందట, బ్రాహ్మణవాదులు అమలు చేసిన బానిస భావజాలం లాగే నేడు బానిస రాజకీయ భావజాలాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మెదళ్ళకు తమ తమ మీడియాల ద్వారా ఎక్కిస్తున్నారు. అందుకే వారు ఖచ్చితంగా ప్రశ్నించలేకపోతున్నారు.

rajuగిరిజనుల గురించి, ముస్లింల గురించి, దళితుల గురించి రేపటి తెలంగాణలో ఖచ్చితమైన రాజకీయ వాటాను ప్రస్తావిస్తూ జనాభాలో 52 శాతం ఉన్న బీసీల వాటా గురించి ప్రస్తావించకపోవడం ఎంత రాజకీయ కుట్రో బీసీలు ఇంకా అర్ధం చేసుకోకపోవడం విచారకరం. ఆ విషయాన్ని ప్రస్తావించిన మంద కృష్ణపై అగ్రకుల నాయకత్వాలు ఎదురు దాడి చేయించడం ఖండనీయం. మంద కృష్ణ వాదనను బీసీలు అందిపుచ్చుకోక పోవడం తెలంగాణలోని బీసీల పరిస్థితిని తెలుపుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నది బీసీ సామాజిక వర్గాలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నవారిలో కూడా 50 శాతం మంది బీసీ వర్గాలవారే అనేది నిర్వివాదం. ఉద్యమంలో బలంగా పాల్గొంటున్నప్పుడు తమ వాటా గురించి నిలదీయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే మోసపోయేది బీసీలే, నష్టపోయేది కూడా వారే!

No comments:

Post a Comment