Tuesday, October 18, 2011

లంబాడీలు ఆదివాసీలు కారు - వూకే రామకృష్ణ Andhra Jyothi 19/10/2011


లంబాడీలు ఆదివాసీలు కారు

- వూకే రామకృష్ణ

మన పాలకులు ఆదివాసీల అభివృద్ధికి పాటుపడకపోవడమే కాకుండా, వారిని అణగదొక్కే విధానాలకు పాల్పడుతున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు ప్రాణం పోస్తూ కులాలను తెగలలో విలీనం చేసి ఆదివాసీల భవితవ్యాన్ని ప్రశార్థకం చేస్తున్నారు. 1976లో ఎస్.టి. జాబితాలో అక్రమంగా కలుపబడిన లంబాడీలు ఆదివాసీల రిజర్వేషన్లు దోచుకుంటున్నా పాలకవర్గాలు ఏమీ పట్టనట్లుగా ఉంటున్నాయి.

దీనిని సహించలేని ఆదివాసీలు, రిజర్వేషన్‌లలో దగాకు వ్యతిరేకంగా పోరాట మార్గమే శరణ్యంగా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ చారిత్రక పోరాటానికి సిద్ధమవుతున్నారు. లంబాడీలను ఎస్‌టి జాబితా నుంచి తొలగిస్తేనే 'ఆదివాసీలకు మనుగడ' అని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇంతకూ లంబాడీలు షెడ్యూల్ తెగకు చెందినవారా? చరిత్ర కాలం నుంచి ఆదివాసీ తెగలతో సహజీవనం చేసినట్టూ, చారిత్రక పోరాటం చేసినట్లు ఏమైనా ఆధారాలున్నాయా? భారత రాజ్యాంగం ప్రకారం వీరిని ఎస్.టి.లుగా గుర్తించారా? అని ఒకసారి చరిత్ర పరిశీలిస్తే 'లేదు' అనే కారణం కనిపిస్తుంది.

భారతదేశ మూలవాసులుగా ప్రసిద్ధికెక్కిన వారు ఆదివాసీలు. వీరినే మొదటగా 'ద్రావిడ పూర్వ ఆదివాసీలుగా' పిలిచేవారు. ఈ వారసత్వ ఫలితమే ప్రస్తుత ఆదివాసీ తెగలు. మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమబెంగాల్ ఈ మధ్య భూభాగాన్ని 'గోండ్వానా రాజ్యమని' అంటారు. ఈ గోండ్వానా రాజ్యాన్ని ఏలిన వారు గోండులు, కోయతూర్ (కోయ) ఆదివాసీలు గోండ్వానా ప్రాంతంలో పరిపాలించిన చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్, ఉట్కూర్, చెన్నూర్, నిర్మల్ ప్రాంతాలను ఆత్రం వంశీయులు పాలించారు.

ఆదివాసీలకు రాచరిక పోరాటాలు, బ్రిటీష్ వ్యతిరేక పోరాటాలతో పాటుగా, స్వాతంత్య్ర అనంతరం కూడా పోరాటం చేయక తప్పడం లేదు. చరిత్రలో రామాయణం, మహాభారతం, పురాణాల్లో, రాచరిక పాలనలో స్వాతంత్య్ర సమరంలో, సాంస్కృతిక సంప్రదాయాల్లో వేషధారణలో, భౌగోళిక విస్తీర్ణంలో కూడా ఆదివాసీలతో 'లంబాడీ జాతికి' సంబంధం లేదు. షెడ్యూల్డ్ తెగలతో లంబాడీలనూ ఏ రాష్ట్రంలో కలపకున్నా మన రాష్ట్రంలో కలిపినందుకు ప్రతిఫలం ఏమిటనేది పరిశీలిస్తే 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 50,24,104 మంది గిరిజనులు నివసిస్తున్నారు.

ఈ జనాభాలో 41 శాతం షెడ్యూల్డ్ ప్రాంతంలో 30 ఆదివాసీ తెగలు నివసిస్తుండగా మైదాన ప్రాంతంలో 59 శాతం మందికి చెందిన ఐదు తెగలు నివసిస్తున్నాయి. మైదాన ప్రాంత గిరిజనుల అక్షరాస్యత 34 శాతం ఉంటే, షెడ్యూల్డ్ ఏరియా విద్యార్థుల అక్షరాస్యత 20 శాతంగా ఉంది. రాజ్యాంగంలో సూచించిన 360 ఆర్టికల్ 25 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అడవి ప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 30 తెగలను నిజమైన ఆదివాసీలుగా పేర్కొంది. కాని నేడు ఈ తెగలకు రిజర్వేషన్ ఫలాలు అందక నానాటికీ కనుమరుగయిపోతున్నారు.

1950 నుంచి 1975 వరకు అభివృద్ధి వైపు సాగిన ఆదివాసీల ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలను ఎస్‌టి జాబితాలో చేర్చాలనే నిర్ణయంతో అభివృద్ధి ఆగిపోయింది. అక్షర జ్ఞానం లేని ఆదివాసీ సమూహాలు మాకు అన్యాయం జరుగుతుందని గొంతు ఎత్తలేని పరిస్థితులలో, స్వార్థపర రాజకీయాలతో ఓటు బ్యాంకు కోసం 1970 వరకు బిసి(ఎ)లుగా జీవో ఎం.ఎస్. నెం.1773 (ఎస్‌డబ్ల్యు), 23 సెప్టెంబర్ 1970 ప్రకారం రిజర్వేషన్‌లను అనుభవించిన లంబాడీలతో పాటుగా ఎరుకల, యానాది కులాలనూ రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టకుండా 1976 అక్టోబర్ 29న షెడ్యూల్ తెగల చట్టం ప్రకారం 108 జాబితా నెం 29, జీవో ఎం.ఎస్ నెం.149 ప్రకారం డినోటిఫైడ్ ట్రైబ్స్‌గా ఐదు సంవత్సరాల ప్రాతిపదికన కలపడం జరిగింది.

1961 జనాభా ప్రకారం 96,174 జనాభా కల్గిన లంబాడీలు, 1971 జనాభా లెక్కల ప్రకారం 1,32,464కు పెరిగారు. 1976లో ఎస్‌టి జాబితాలో చేర్చిన తదుపరి మహారాష్ట్రలో బిసిలుగా, రాజస్థాన్‌లో ఓసిలుగా, కర్ణాటకలో ఎస్‌సిలుగా చెలామణి అవుతున్న వారు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి 1981 జనాభా లెక్కల ప్రకారం 11,58,342కి పెరిగారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో లంబాడీల ఆధిపత్యాన్ని గమనిస్తే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయాన్ని పాలకవర్గాలు ఏనాడో పాతర పెట్టారు. విద్యారంగంలో 2005 ఎస్‌టి రిజర్వేషన్ జాబితా పరిశీలిస్తే బి.ఇ/బి.టెక్ సీట్లు 6542లో 5,821 సీట్లు లంబాడీ, యానాది, ఎరుకల వారు పొందగా, 30 తెగలుగా ఉన్న ఆదివాసీలకు 127 మాత్రమే లభించాయి.

ఐఐటి, ఎన్.ఐ.టి. మెడిసిన్ కోర్సులలో చేర్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రతిభా పాఠశాలలు, గురుకుల కళాశాలలో లంబాడీ వర్గం పైచేయి సాధించింది. 2005లో వందశాతం ఉద్యోగాలలో 57 శాతం లంబాడీలు, 26 శాతం ఎరుకలు, 7 శాతం యానాదులు పొందారు. 30 ఆదివాసీ తెగలకు మాత్రం 10 శాతం ఉద్యోగాలు లభించాయి. మైదాన ప్రాంత ఏరియాల్లో ఎస్‌టిలుగా కొనసాగుతున్న లంబాడీలు షెడ్యూల్డ్ ఏరియాలోకి వచ్చి స్థానిక తహసీల్దార్ల దగ్గర అక్రమ ఏజెన్సీ సర్టిఫికెట్స్ పొంది రాజకీయ బలంతో ఉద్యోగాలు దోచుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఐ.ఏ.ఎస్.గాని, ఐ.పి.ఎస్‌గాని ఆదివాసీలు లేరంటే ప్రజాస్వామ్య పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ రంగంలో శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకూ అటవీప్రాంత ఏజెన్సీలో మూడు లోక్‌సభ స్థానాలు, 19 అసెంబ్లీ స్థానాలు, యస్.టిలకు కేటాయించారు. అందులో 30 తెగల నుండి 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 5 స్థానాలు లంబాడీలు ఉన్నారు.

రెండు పార్లమెంట్ స్థానాలు లంబాడీలు పొందారు. 70 శాతం ఆదివాసీ జనాభా కలిగిన మహబూబాబాద్ (వరంగల్) ఎం.పి స్థానం, ఖానాపూర్ (ఆదిలాబాద్) స్థానాలు 30 శాతం జనాభా కలిగిన లంబాడీలు పొందారంటే ఆదివాసీల నిరక్షరాస్య త, అమాయకత్వం అంచనా వేయవచ్చు. భారత రాజ్యాంగం 342(1) క్లాజు ప్రకారం భారత రాష్ట్రపతి కేంద్రంలో కొన్ని రాజ్యాంగ సంస్థలను కొన్ని భాగాలు షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించవచ్చు. 342(2) క్లాజు ప్రకారం రాష్ట్రంలో గవర్నర్‌ని సంప్రదించి షెడ్యూల్ తెగలను చేర్చే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. కాని కొన్ని కొలబద్దలు ప్రమాణాలు పరిగణనలోకి తీసుకోవాలి.

1) ఆదిమ లక్షణాలు గోచరించడం, 2) నిర్దిష్టమైన సంస్కృతి సాంప్రదాయాలు కల్గి ఉండటం, 3) భౌగోళికంగా అటవీ ప్రాంతంలో ఉం డటం, 4) ఇతరులతో సంబంధాలు నెరపడానికి బెరుకుగా చూపడం, 5) వెనకబాటుతనం. ఈ నిబంధనలకు లంబాడీలకు ఏమాత్రం పోలిక లేదు. ఆదివాసీలతో సంబంధం లేని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్‌టి జాబితాలో చేర్చబడిన లంబాడీలను ఏ నిబంధనతో కలిపారో ప్రజలకు తెలియజేయాలి. తద్వారా లంబాడీలను ఎస్‌టి జాబితా నుండి తొలగించాలి. పాలకులు లంబాడీల అభివృద్ధికి నిజంగా పాటు పడాలనుకుంటే ఎస్.టి.ల నుండి తొలగించిన తరువాత వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి.

(గుజరాత్ గుజ్జర్ల తరహాలో) జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఆదివాసులకూ కల్పించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆదివాసులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ మాత్రం లాభం ఉండదు. కెసిఆర్ ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్లు కూడా లంబాడీలు దోచుకుంటారు. కాబట్టి ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకూ ఉన్న ప్రతి ఆదివాసీ కొమరం భీం, మల్లు దొర, ఘంటం దొర, అల్లూరి పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పై డిమాండ్ల సాధన కోసం మిలిటెంట్‌గా పోరాడాలి.

- వూకే రామకృష్ణ
ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్, ఖమ్మం జిల్లా కార్యదర్శి

No comments:

Post a Comment