Friday, August 24, 2012

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట ----గటిక విజయ్ కుమార్



సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరాం పాల్గొన్నారు. పెద్దగా ప్రచారం లేకున్నా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు పెద్ద సంఖ్యలో ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్‌లాగే, దక్షిణ భారత దేశం లో ముఖ్య రాష్ట్రమైన ఆంధ్రవూపదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆ సభ విజయంతో అనిపించింది. 

బహుజనులకు రాజ్యాధికారం నినాదంతో కాన్షీరాం దేశవ్యాప్తంగా తిరిగారు. ఉత్తర ప్రదేశ్‌లో ఆయన శిష్యురాలు మాయావతి ప్రకంపనలు సృష్టించారు. అగ్రవర్ణాలను కాదని 1995 జూన్‌లో మాయావతి యూపీ 
ముఖ్యమంత్రి అయ్యారు. దానికి కొద్ది నెలల ముందే ఇటు ఆంధ్రవూపదేశ్‌లో ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నన్నాళ్లూ కమ్మలు, అదీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులదే అధికారమని జనం నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు ఐదేళ్లు పాలించిన కాంగ్రెస్‌పై కూడా బహుజనులకు నమ్మకం పోయింది. కాంగ్రెస్ అయితే రెడ్లకు, తెలుగుదేశం అయితే కమ్మలకు అధికారం అనే భావన ఏర్పడింది. ఈ సమయంలోనే కాన్షీరాం ప్రయోగం యూపీలో విజయవంతం కావడంతో బహుజనులకు, ముఖ్యంగా దళితులకు రాజ్యాధికారం దక్కించుకుంటామనే నమ్మకం ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చనే కాన్షీరాం మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

సరిగ్గా అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. దళితులు రాజకీయశక్తిగా మారుతున్న సమయంలోనే వర్గీకరణ అంశం ముందుకు రావడం అప్పటి పాలకుల కుట్ర అనే అనుమానాలు, విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఏదిఏమైనా మాల, మాదిగల మధ్య విభేదాలు పెరిగాయన్నది నిజం. దళితులు రెండు వర్గాలు గా చీలిపోయారు. దీంతో ‘దళితులకు రాజ్యాధికారం’ అనే నినాదమే కనుమరుగైపోయింది. సమీప భవిష్యత్‌లో కూడా బహుజన ఎజెండాతో ఓ రాజకీయ పార్టీ మనుగ డ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. 

పదిహేడేళ్ల కిందట రిజర్వేషన్ అనుభవించే విషయంలో మాల, మాదిగలకు గొడవ వచ్చిన విధంగానే, ఇప్పుడు ఎస్టీ తెగల్లో కూడా విభేదాల విష బీజం నాటుకుంటోంది. ఇది పెరిగితే రాష్ట్రంలో దళితశక్తి బీటలు వారినట్లే, గిరిజనశక్తి కూడా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నది. 2008 డీఎస్సీ ద్వారా ఏజెన్సీలో టీచర్ల నియామకాలు, హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ విషయంలో వివాదం ఉన్నది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలనే నిబంధనలున్నాయి. అయితే ఎవరు స్థానికులు అనే అంశంపై ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా చెప్పినప్పటికీ లంబాడాలు, కోయల్లో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. 

1950కి ముందు నుంచి ఏజెన్సీలో ఉన్న వారే స్థానికులని జీవో3 చెబుతుంది. కాబట్టి ఇతరులు ఎస్టీలు అయినప్పటికీ వారు ఈ పోస్టులకు అర్హులు కాదన్నది ఒక తెగ వాదన. ఎస్టీ రిజర్వేషన్‌పొందే విషయంలో తెగల పట్టింపు ఉండాల్సిన అవసరంలేదని మరో తెగ అభివూపాయం. ఈ వివాదం రెండు తెగ ల మధ్య చిచ్చు పెట్టింది. కోయలు, లంబాడాలు పెద్ద సంఖ్యలో ఉన్న వరంగల్ లాంటి జిల్లాలో అయితే పరిస్థితి విషమిస్తోంది. ఒక తెగకు వ్యతిరేకంగా మరో తెగ రోడ్డెక్కుతున్నది. లంబాడాలను ఎస్టీల జాబితా నుంచే తొలగించాలని కోయలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న జీవోలను రద్దు చేయాలని లంబాడాలు కోరుతున్నారు. కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోనే షెడ్యూల్ తెగల జాబితా ఉన్నది. 1976లో మన రాష్ట్రంలోని లంబాడ, యానాది, ఎరుకల కులస్తులను కూడా ఎస్టీలలో చేర్చారు. తద్వారా ఎస్టీలకు రాజ్యాంగం కల్పిస్తున్న అన్ని అవకాశాలు, హక్కులు ఈ కులాలకు కూడా సంక్రమించాయి. దేశవ్యాప్తంగా 620 జిల్లాల్లో 574 తెగలకు సంబంధించిన దాదాపు పదికోట్ల మంది గిరిజనులున్నారు. తెగలు వేరైనా వీరంతా షెడ్యూల్డ్ తెగల గొడుగు కింద ఉండబట్టే సంఖ్యా బలాన్ని చూసైనా ప్రభుత్వం వీరికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో గిరిజనులే ముఖ్యమంవూతులవుతున్నారు. మన రాష్ట్రంలో కూడా తెగలన్నీ కలవడం వల్ల గిరిజనుల సంఖ్య ఎక్కువైంది. ఫలితంగా 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు 80 నియోజకవర్గాల్లో ఎస్టీలు నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారు. ఐక్యత దెబ్బతింటే అది సాధ్యం కాదు. 

ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలవుతాయి కాబట్టి ఒక తెగ మరో తెగకు పోటీ కాదు. ఇప్పుడున్న ప్రజావూపతినిధుల్లో సైతం అందరూ ఒకే తెగవారు లేరు. అయినా సరే వారందరూ ఎస్టీల్లోని అన్ని తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా ములుగులో కోయలు, లంబాడీలు దాదాపు సమంగా ఉంటారు. అక్కడ లంబాడీ, కోయ నాయకులను ఎన్నుకున్న చరిత్ర ఉంది. అలాగే రాష్ట్రంలోని చాలాచోట్ల లంబాడ, కోయ, కొండడ్లు ఇలా తెగల తేడా లేకుండానే ఎస్టీలలోని ఏ తెగ అయినా సరే గిరిజనం వారిని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటోం ది. అంతెందుకు... వరంగల్ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువ కావడం వల్ల జనరల్ సీట్లలో కూడా గిరిజనులు ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ ఎంపీ స్థానం జనరల్‌గా ఉన్నప్పుడు చందూలాల్, రవీంవూదనాయక్ గిరిజనేతరులపై గెలవగలిగారు. జనరల్ స్థానమైన డోర్నకల్ ఎమ్మెల్యేగా డీఎస్ రెడ్యానాయక్ నాలుగుసార్లు గెలవడానికి కార ణం గిరిజనుల మధ్య ఐక్యతే. ఇప్పుడు చిన్ని చిన్న అంశాలపై ఉన్న విభేదాలు తెగల మధ్య అంతరం పెంచితే ఈ ఐక్యత దెబ్బతింటుంది. తద్వారా గిరిజనులకు రావాల్సిన అవకాశాల శాతం తగ్గుతుంది. తెగల మధ్య ఐక్యత పెంచుకుని ప్రభుత్వం నుంచి మరిన్ని అవకాశాలు పొందేలా, హక్కులను కాపాడుకునే విధంగా గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగాలి. 

స్థానికత విషయంలో కూడా ఎక్కువ రాద్ధాంతం చేస్తే అది 1/70 చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మేలు కలుగుతుంది. అనాదిగా అడవిని నమ్ముకున్న గిరిజనులకే అవకాశాలు రావాలని, గిరిజనులందరికీ అన్ని అవకాశాలు రావాలనడంలో తప్పులేదు. స్థానికత విషయంలో నిబంధనలను మార్చితే ఆంధ్రవూపాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా భవిష్యత్తులో వారే స్థానికులని చెప్పుకొనే ప్రమాదం ఉన్నది. అప్పుడు అడవిపైనే కాదు, గిరిజనులు బతుకుపై కూడా హక్కులు కోల్పోతారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మైదాన ప్రాంత ఐటీడీఏ ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు పెరిగేలా చూడాలి. తెగల మధ్య విభేదాలు వస్తే వీరి ఉనికికి కూడా ప్రమాదమ నే విషయం గమనించాలి. వలసవాదులంటూ ఒక తెగ మరోతెగను విమర్శించుకునే బదులు గోదావరి వెంట గిరిజనుల భూములను ఆక్రమించుకున్న సీమాంధ్ర వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడాలి. మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో గిరిజనులకు సంబంధించిన అన్ని తెగలు పాల్గొంటున్నాయి. వీరి మధ్య చిచ్చుపెట్టడం ద్వారా మెజారిటీ సెక్షన్‌ను నిర్వీర్యం చేయడం సీమాంవూధుల లక్ష్యం గా కనిపిస్తున్నది. దానికి ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం కూడా ఉన్నది. 

ప్రవీణ్ నాయక్ నుంచి భోజ్యానాయక్ వరకు 50 మందికి పైగా గిరిజన యువకులు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక దాన్ని గుర్తించలేదు. కాపీ చాలాకొద్ది మంది మాత్రమే మన్యసీమ రాష్ట్రం డిమాండ్ చేస్తే, శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో గిరిజనులు తెలంగాణ కోరుకోవడం లేదని రాశారు. అంటే చిన్న విభేదాన్ని కూడా వలస పాలకులు తమకు అనుకూలంగా మలుచుకోగలరనే విషయం గుర్తెరగాలి. గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి ప్రయోజనం పొందాలని ప్రభుత్వం, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే పెత్తందారులు కాచుకు కూర్చున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్, కొమురంభీం, సమ్మక్క సారల మ్మ వారసులైన గిరిజనులు దోపిడీదారులకు ఆ అవకాశం ఇవ్వద్దు. ఐక్యంగా పోరాడి విముక్తి వైపు పయణించాలి.

-గటిక విజయ్ కుమార్
టీన్యూస్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్

Namasete Telangana News Paper Dated : 25/08/2012 

Other Articles

No comments:

Post a Comment