Thursday, August 23, 2012

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..---డి మార్కండేయ


సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..
‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోలుకున్నాను. అయితే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిరి గి వచ్చిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.రాయ్‌పూర్ జైలులో నాపై వేధింపులు, చిత్రహింసలు రెట్టింపయ్యాయి. నగ్నంగా కూర్చోబెడుతున్నారు. తనిఖీల పేరుతో శరీరభాగాలను తడుముతున్నారు. బూతులు తిడుతున్నారు. ఆకలితో మాడ్చుతున్నారు. మందులు తేవడం లేదు. ఆస్పవూతికి తీసుకెళ్లడం లేదు. చిత్రవధ చేస్తున్నారు. నా మానమర్యాదలను మంటగలుపుతున్నారు. నేనేం తప్పు చేశాను యువరానర్? నా హక్కుల రక్షణకై గొంతెత్తడమే నేర మా? పోలీసుల అకృత్యాలను మీ దృష్టికి తేవడమే ద్రోహమా? ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నాపై ఎందుకింత కక్ష? ఇంతకంటే మీరు నాకు మరణశిక్ష వేసి నా బాగుండు.. ఇక్కడ నన్ను చంపేటట్టున్నారు.. కాపాడండి!’

పోలీసుల దౌష్ట్యానికి బలైన ఆదివాసీ మహిళ సోని సోరి జైలు నుంచి సుప్రీంకోర్టుకు ఇటీవల రాసిన లేఖ సారాంశమిది. పది నెలలకు పైగా ఛత్తీస్‌గఢ్ పోలీసుల చేతుల్లో నరకయాతన అనుభవిస్తున్న ఈ ప్రభుత్వోపాధ్యాయురాలిపై 2011 సెప్టెంబర్ చివరలో మావోయిస్టు పార్టీకి కొరియర్‌గా పనిచేస్తోందన్న ఆరోపణలను పోలీసులు నమోదు చేశారు. మేనల్లుడు లింగారాం కొడిపె తదితరులతో కలిసి మైనింగ్ కంపెనీ ఎస్సార్ నుంచి ఆమె రూ. 15 లక్షలు స్వీకరించి నక్సలైట్లకు చేరవేసిందని కేసు పెట్టి వారంటు జారీ చేశారు. తనకే పాపం తెలీదన్న సోని మొరను ఎవరూ ఆలకించకపోవడంతో జాతీయ మీడియాను ఆశ్రయించింది. పోలీసులు మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మొత్తుకుంది. కొందరు మిత్రుల సలహా మేరకు ఢిల్లీ వెళ్లింది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయ సిద్ధమైంది. ఈ లోపలే ఉప్పందుకున్న ఆ రాష్ట్ర పోలీసులు దేశ రాజధానిలో అక్టోబర్ 4న ఆమెను అరెస్టు చేశారు. కోర్టులో పోలీసు కస్టడీ కి అనుమతి పొంది దంతేవాడకు తీసుకువచ్చారు. రెండురోజుల పాటు లాకప్‌లో నిర్బంధించి తీవ్రమైన చిత్రహింసలకు గురి చేశారు. లైంగికదాడికి పాల్పడ్డారు.

జననాంగంలోకి బలవంతంగా లాఠీలను, రాళ్ల ను చొప్పించారు. కరెం టు షాకులిచ్చారు. తిండి పెట్టకుండా ఆకలికి మాడ్చారు. సుప్రీంకోర్టు కు వెళతావా అంటూ దంతేవాడ ఎస్పీ అంకిత్ గార్గ్ ఆమెపై విరుచుకుపడ్డాడు. బట్టలు విప్పించి బూతు పదజాలం తో అవమానించాడు. తీవ్ర గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న సోనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్న ట్లు, ఎలాంటి గాయాలు లేనట్లు ప్రభుత్వాస్ప త్రి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్నే మేజిస్ట్రేట్ నమ్మారు. రాయపూర్ జైలుకు పంపారు. 

చేయని నేరానికి తనకీ శిక్ష ఏమిటంటూ, థర్డ్ డిగ్రీ పద్ధతులను ప్రయోగించిన పోలీసుల పాశవికత్వాన్ని నిరసిస్తూ సోని అక్టోబర్ 11న జైలులోనే ఆమరణదీక్ష ప్రారంభించింది. పోలీ సు హింస, ఆమరణ దీక్ష సోనిని మృత్యువు అంచుల్లోకి తీసుకెళ్లాయి. చివరకు కోర్టు ఆదేశాల మేరకు అదే నెల 26న ఆమెను జైలు అధికారులు కోల్‌కతా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్ట ర్లు ఆమె జననాంగంలో, రెక్టమ్‌లో మూడు రాళ్లను గుర్తించి తొలగించారు. వెన్నెముకపై, ఇతర శరీరాంగాలపై గాయాలను కనుగొన్నారు. నెల రోజుల చికిత్స అనంతరం తిరిగి సోని రాయ్‌పూర్ జైలుకు చేరింది. అయితే, ఛత్తీస్‌గఢ్ సర్కారు ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆమె ను హింసించడాన్ని కొనసాగించారు. తిండి పెట్టకుండా, మందులు అందించకుండా చీటికి మాటికి నక్సలైటువంటూ వేధించారు. నెల తర్వాత కోల్‌కతా కు తీసుకెళ్లాల్సివుండగా పట్టించుకోలేదు. తీవ్ర రక్తవూసావమవుతున్న పరిస్థితుల్లో సోని ఫిబ్రవరి 8న మరోసారి ఆమరణ దీక్షకు పూనుకుంది. 19 రోజులు కొనసాగిన ఈ దీక్ష ఫలితంగా దంతేవాడలోని సెషన్స్ కోర్టు స్పందించింది. రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పవూతిలో చికిత్స అందించాలని ఆదేశించింది. విషాదకరమైన విషయమేమిటంటే ఇదే ఆస్పత్రి వైద్యులు అక్టోబర్ 10న తీవ్రగాయాలతో పోలీసులు సోనిని తీసుకువస్తే, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని, నొప్పినటిస్తోందని నివేదికలిచ్చారు. ఈసారి కూడా వాళ్లు పోలీసుల సూచనలనే పాటించారు. సోనికి అరకొర వైద్యం చేసి జైలుకు పంపించారు.

బాహ్య ప్రపంచంలో అప్పటికే సోని ఉదంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. వివిధ కోర్టులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఆమె పెట్టుకున్న పిటిషన్లు వాస్తవాలను బహిర్గతం చేశాయి. అక్టోబర్‌లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించగా, ఈ విషయంలో దేశ ప్రధాని చొరవ చూపాలని హ్యూ మన్ రైట్స్ వాచ్ కోరింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం సోనిని బంధించడం ఆలోచనలను బంధించడమేనని వ్యాఖ్యానించింది. బేషరతుగా ఆమెను విడుదల చేయాలంటూ ఉద్యమించాల్సిందిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. సోని ఆరో గ్య పరిస్థితి క్షీణిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ చామ్‌స్కీ, అరుంధతీరాయ్ సహా 250 మంది మేధావులు, సామాజిక కార్యకర్తలు మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. సోని విడుదలను డిమాండు చేస్తూ దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నిరసన ఫలితంగా చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పవూతికి ఆమెను తరలించాల్సిందిగా ఆదేశించింది. అలా మే 10న ఎయిమ్స్‌లో చేరిన సోని తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఐదు వారాల పాటు చికిత్స చేసి రాయ్‌పూర్‌కు పంపించారు. అయితే, జైలులో సీన్ మళ్లీ రిపీటవుతోందనడానికి సోని సుప్రీంకు తాజాగా రాసిన పై లేఖే సాక్ష్యం.

సోనిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది? బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటోన్న ఇద్దరు పిల్లలున్న ఓ ఆదివాసీ మహిళను ఎందుకు వేధిస్తోంది? కోర్టుల ఆదేశాలను, జైలు మాన్యువల్స్‌ను తుంగలో తొక్కి అమానవీయ పద్ధతులు ఎందుకు అవలంభిస్తోంది? మావోయిస్టులకు సహకరిస్తున్నాడంటూ ఆమె భర్తను ఏడాదిగా జైలులో ఎందుకు పెట్టింది? మేనల్లుడిపై నేరస్తుడి ముద్ర ఎందుకు వేసింది? మావోయిస్టులు ఇన్ఫార్మరువంటూ తండ్రి ని కాల్చిగాయపర్చితే, తన అరెస్టుతో తల్లిని సైతం కోల్పోయిన సోని చేసిన నేరం ఏమిటి? ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలు. అంతం లేని వ్యథలు. 

ఇలాంటి వ్యథలను అనుభవించడంలో సోని ఒంటరి కాదు. మధ్యభారత వనరులను బహుళజాతి కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టడాన్నిఅడ్డుకుంటున్న మావోయిస్టులను నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ గ్రీన్‌హంట్ ప్రారంభమైనప్పటి నుంచీ రాజ్యం బాధితులు పెరిగారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, బెంగాల్, మహారాష్ట్రలలో మానవ హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడింది. లక్షకు పైగా బలగాలను దించి నక్సల్స్ వేట ముసుగులో డజన్ల కొలదీ అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారు.బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. బాసగూడెం లాంటి మారణకాండలకు పాల్పడుతున్నారు. దొరికిన వారిని చితకబాదుతున్నారు. కేసులు పెట్టి జైళ్లు నింపుతున్నా రు. సల్వాజుడుంను సుప్రీం నిషేధిస్తే కోబ్రా బెటాలియన్‌గా మార్చి జనం పైకి వదిలారు.ఈ అకృత్యాలను వెలుగులోకి తెస్తుందనే భయం తో మీడియానూ నిషేధించారు.

ఇక మిగిలింది హక్కుల సంఘాలు, కార్యకర్తలు.. వీరిని నయానో భయానో అదుపులో పెట్టకపోతే మానవహక్కుల ఉల్లంఘనంటూ గొంతు చించుకుని అరుస్తారని, అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత్ ప్రతిష్ఠను దిగజారుస్తారని రాజ్యం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే హక్కుల నేత బినాయక్‌సేన్‌పై అక్ర మ కేసులు బనాయించి జైలు కు పంపారు. కళాకారుడు జీతన్ మరాండికి చేయని నేరం అంటగట్టి ఉరిశిక్ష విధించారు. జర్నలిస్టు సీమా ఆజాద్‌కు, ఆమె భర్త విశ్వవిజయ్‌కు యావజ్జీవ కారాగారం విధించారు. రాజ్యం కర్కశత్వానికి ఇవి కొన్ని ఉదహరణలు మాత్రమే. సోని వ్యథాభరిత గాథ వెనకాల కారణమూ ఇదే. జాబెలి గ్రామంలో స్కూలుటీచర్‌గా ఉంటూ పోలీసుల, కోబ్రా బలగాల అరాచకాలను ప్రశ్నించింది. వనరుల దోపిడీకై తిష్టవేసిన కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న స్థానిక నేతల వైఖరిని ఎండగట్టింది. అదే పాలకుల కంటగింపునకు కారణం.

సొంత ప్రజలపైనే యుద్ధానికి తెగబడిన విధానాలకు యూపీఏ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలి. ఆదివాసుల హననానికి కారణమవుతున్న గ్రీన్‌హంట్‌ను నిలిపేయాలి. బూటకపు ఎన్‌కౌంటర్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. హక్కుల కార్యకర్తలపై వేధింపులు ఆపాలి. సోనిసోరిని జైలు నుంచి విడుదల చేసి మెరుగైన వైద్యచికిత్స అందించాలి. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. లేనిపక్షంలో ఈ దేశంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యం కాదని, బహుళజాతి కంపెనీల సేవలో తరించే నియంతృత్వ ప్రభుత్వమే ఇక్కడ రాజ్యమేలుతున్నదని ప్రజలు భావిస్తారు.

-డి మార్కండేయ
dmknamaste@gmail.co

Namasete Telangana News Paper Dated : 24/08/2012 

No comments:

Post a Comment