Tuesday, December 27, 2011

ఒక యోధుడి అడుగు జాడలు (మల్లోజుల కోటేశ్వర్‌రావు)



మల్లోజుల కోటేశ్వర్‌రావును తలుచుకోవడమంటే తెలంగాణ పీడిత ప్రజల వెతల తలపోతలను గుర్తుచేసుకోవడం. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమంటే, విప్లవోద్యమ నిర్మాణంలో అతని అడుగుజాడల్ని స్మరించుకుంటూ, అతనితో కలిసి నడిచిన అనుభవాలను మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడం. 


జగిత్యాల నుండి జంగల్ మహల్ వరకు సాగిన అతని ప్రస్థానాన్ని ప్రస్తావించుకోవడమంటే, భారత విప్లవ చరిత్రకు ప్రతీకగా నిలిచిన అతని పోరాటస్ఫూర్తిని, తుదిశ్వాస వరకు కనబరిచిన అతని అంకితభావాన్ని ఆదర్శంగా తీసుకోవడం. కళ్ళముందు మనిషిని మనిషే నిట్టనిలువుగా దోచేస్తుంటే, దౌర్జన్యంతో సమాజ మనుగడను తన కనుసన్నల్లో శాసిస్తుంటే, తెలంగాణ యావత్ సమాజం భూస్వామ్య విషపు కౌగిళ్లలో చిక్కి విలవిలలాడుతుంటే విముక్తి మార్గాన్ని అన్వేషిస్తూ, విప్లవ బాటలో సాగి పల్లెపల్లెల్లో ఎర్రమందారాల వనమై విస్తరించినవాడు కిషన్‌జీ! 

నాడు భూస్వాముల కోరలుపీకి, సబ్బండవర్ణాల ఆత్మగౌరవ జీవన విధానానికి నాంది పలికితే, నేడు ఛిద్రమవుతున్న ఆదివాసీ జీవితాల్లో వెలుగుపూలు పూయించి, వారి అటవీ సంపదలపై కన్నేసిన సామ్రాజ్యవాద, కార్పొరేట్ కంపెనీల కుట్రలను తిప్పికొట్టి, బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. 

18 రాష్ట్రాల్లో విప్లవోద్యమానికి బలమైన పునాదులు వేసి రెడ్ కారిడార్‌ను ఏర్పాటు చేసి, లాల్‌గఢ్‌ను తొలివిముక్తి ప్రాంతంగా ప్రకటించి, జీవితాన్ని సంపూర్ణంగా ఉద్యమానికే అంకితం చేసినవాడు. విప్లవోద్యమం నుండి విడివడిన నేను తెలంగాణ విమోచనోద్యమంలో కొనసాగుతూ, ఒక మహాయోధుని సమకాలికునిగా అతని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఆయనతో కలిసి పనిచేసినకాలం నా జీవిత గమనంలో అత్యంత విలువైనదిగా భావిస్తూ ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. 

అది 1973వ సంవత్సరం. కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు, ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో కోటేశ్వరరావు బి.ఎస్.సి చదువుతున్నాడు. ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. బి.విజయ్‌కుమార్ ద్వారా కోటేశ్వర్‌రావు నాకు పరిచయమయ్యాడు. విప్లవభావజాలం కలిగిన పెండ్యాల సంతోష్‌కుమార్, కోటేశ్వర్‌రావు, చందుపట్ల కృష్ణారెడ్డి, నేను, బి.విజయ్‌కుమార్ తరచూ కలుసుకునేవాళ్ళం. మా మొట్టమొదటి కార్యాచరణ ఆగస్టు 15, 1973నాడు ఆరంభమైంది. 

ఆనాడు పోలీస్‌గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో మంత్రి జాతీయ జెండా ఎగురవేసిన పిదప డెమోక్రటిక్ స్టూడెంట్స్ పేరిట వేసిన 'బూటకపు స్వాతంత్య్రాన్ని బద్దలు కొట్టండి' అన్న కరపత్రాన్ని ప్రజల్లో పంచి, మేము నలుగురం వెళ్ళిపోగా, చందుపట్ల కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆనాడు విప్లవపార్టీల్లో ప్రజాసంఘాల నిర్మాణం పట్ల, వివిధ ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమస్యలపై ప్రజాపోరాటాలు, లీగల్ నిర్మాణాల ఆవశ్యకత పట్ల భిన్నాభిప్రాయలు ఉండేవి. 

ప్రజల్లో పనిచేయడానికి పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం మాత్రమే అప్పుడు ఉన్నాయి. విప్లవ ప్రచారంలో విరసం ముందుభాగన ఉంటే, పౌరహక్కుల సంఘాన్ని విప్లవ భావజాల ప్రచారానికి వాడుకునేది. ఈ విధంగా విప్లవ ప్రచారం జరుగుతున్న క్రమంలో 1973వ సంవత్సరం పొడుగునా, కరీంనగర్, లక్షెట్‌పేట్, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మొదలైన చోట్ల శ్రీశ్రీ, వరవరరావుల ఆధ్వర్యంలో పౌరహక్కుల బహిరంగ సభలు జరగడం, వాటన్నింటిలో నేను, కిషన్‌జీ, ఇతర మిత్రులం పాల్గొనేవాళ్ళం. అవి కిషన్‌జీలో, నాలో ఇతరమిత్రుల్లో బలమైన విప్లవ బీజాలు నాటాయి. 

1974 మొదటి భాగంలో ఓ.యూ.లో డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డి.ఎస్.ఓ) నుండి విడిపోయి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పి.డి.యస్.యు) ఏర్పడి అక్టోబర్ నెలలో హైద్రాబాద్‌లోని ఎస్.డి. హాల్‌లో దాని మొదటి మహాసభలు జరుపుకోవడం జరిగింది. మ్యానిఫెస్టోలో సాయుధపోరాట పంథాను విధానంగా చేర్చాలన్న డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో, పిడిఎస్‌యు మితవాద పంథాను వ్యతిరేకిస్తూ కోటేశ్వర్‌రావు ఈ సభలను బహిష్కరించగా మేమంతా అనుసరించాము. 

వెనువెంటనే శ్రీశ్రీ, వరవరరావు, చెరబండరాజు, వంగపండు ప్రసాద్, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, ఎం.టి.ఖాన్, రంగనాథంల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అందులో నేను, కోటేశ్వరర్‌రావు, నల్లా ఆదిరెడ్డి, సాహు, అల్లం నారాయణ, చంద్ర ప్రభాకర్, చందుపట్ల కృష్ణారెడ్డి, నరెడ్ల శ్రీనివాస్, బి.విజయ్‌కుమార్, ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు, పోరెడ్డి వెంకట్‌రెడ్డి, తాటికొండ సుధాకర్‌రెడ్డి, గోపు లింగారెడ్డి, అల్లం వీరయ్య మొదలైన వారందరం పాల్గొన్నాం. 

ఈ సమావేశంలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్.ఎస్.యు) పేరుతో మరో విప్లవ విద్యార్థి సంఘం ఆవిర్భవించింది. ఈ పేరును శ్రీశ్రీ సూచించడం విశేషం. తరువాత కోటేశ్వరరావు, నేను, ఇతర మిత్రులు బాధ్యులుగా జిల్లాలో ఆర్.ఎస్.యు శాఖల ఏర్పాటు జరిగింది. 1975 ఫిబ్రవరిలో ఆర్ఎస్‌యు ప్రథమ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో రెండురోజులు జరిగాయి. 

కోటేశ్వర్‌రావుతో కలిసి మేమంతా పాల్గొన్నాం. 1975 మే 1 నాడు హుజురాబాద్‌లో శ్రీశ్రీ పాల్గొన్న జనసాహితీ సభలో కిషన్‌జీతో పాటు నేనూ పాల్గొన్నాను. ఈ రకంగా 1973లో పౌరహక్కుల సంఘం, విరసం, 1974లో విప్లవ విద్యార్థి సంఘాలు, 1975 జనవరి నుండి జూన్‌లో ఎమర్జెన్సీ విధించేవరకు ఆర్.ఎస్.యు.ల ఆధ్వర్యంలో జిల్లాలో జరిగిన అనేక విప్లవద్యోమాల ప్రచార సభలలో, సమావేశాలలో కోటేశ్వర్‌రావుతో మేమంతా పాల్గోవడం, చర్చించుకోవడం, కార్యాచరణను రూపొందించుకోవడం, తద్వారా జిల్లాలో విప్లవ బీజాలను నాటి, బలమైన విప్లవ భావజాల పునాదిని ఏర్పరచడం జరిగింది. 

ఈ సందర్భంలో తరచూ మేం కలుసుకోవడానికి మొదట్లో బి. విజయ్‌కుమార్ ఇల్లు, తర్వాత మా ఇల్లు షెల్టర్‌గా ఉండేవి. 1974లో కోటేశ్వర్‌రావు చొరవతో, ఆయన స్కాలర్‌షిప్ డబ్బులతో, నాలాంటి కొందరు మిత్రులు సమకూర్చిన డబ్బులతో పెట్టిన 'నిర్మలా ప్రెస్' మేము కలుసుకోవడానికి మరో సెంటర్‌గా ఉపయోగపడేది. వీటితోపాటు నాచే ప్రారంభించబడ్డ 'స్నేహ బుక్‌స్టాల్' విప్లవకారులంతా కలుసుకొని, కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడానికి మరో కేంద్రంగా ఉపయోగపడింది. 1975లో ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు సుల్తాన్‌పూర్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నపుడు ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలో కోటేశ్వర్‌రావు ఉపన్యాసకుడిగా పాల్గొనగా, నేను కూలీగా, నల్లా ఆదిరెడ్డి దొరజీతగానిగా వీధిబాగోతం వేయడం ఎప్పటికీ మరిచిపోలేని ఓ జ్ఞాపకం. 

ఈ సభ జరుగుతున్నపుడే అర్థరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఈ వార్త మాకు మరునాటి ఉదయం తెలిసింది. దాంతో కరీంనగర్‌లో కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 3 జిల్లాల ముఖ్యమైన విప్లవకారులకోసం నిర్వహించతలపెట్టిన రాజకీయ శిక్షణా తరగతులు వాయిదా వేయడం జరిగింది. శత్రువు బారినుండి రక్షించుకోవడానికి, ప్రజల వద్దకు వెళ్ళి పని చేయడానికి అందరం అండర్‌గ్రౌండ్ వెళ్ళాలని నిర్ణయించడం జరిగింది. 

దానితో ముఖ్యనాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్ళి, అప్పటికే ఉద్యమం బలంగా ఉన్న కొన్ని గ్రామాల్లో రహస్య స్థావరాలను ఏర్పరచుకొని, విప్లవ కార్యక్రమాలు కొనసాగిస్తూ, జిల్లాలోని పలుచోట్ల పార్టీ ఆధ్వర్యంలో భూస్వాముల ఆగడాలను అరికట్టడానికి, ప్రత్యక్ష దాడులకు దిగడానికి కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది. ఆ క్రమంలో 1976లో మద్దునూరు రాజేశ్వర్‌రావు, తపాలాపూర్ పీతాంబరరావులపై ప్రత్యక్షదాడులు జరిగాయి. ఈ దాడులలో కిషన్‌జీ వీరోచిత పాత్ర పోషించాడు. ఇవి తెలంగాణ విప్లవద్యోమంలో సాహసోపేత ఘటనలుగా చరిత్రలో నిలిచాయి. 

1978లో మొదటిసారి కోటేశ్వర్‌రావు అరెస్ట్ అయ్యాడు. విడుదల తరువాత రాడికల్ యువజన సంఘాల ఏర్పాటులో ముమ్మరంగా పాల్గొన్నాడు. 1978 ఏప్రిల్ వేసవి సెలవుల్లో 'గ్రామాలకు తరలండి' నినాదంతో విద్యార్థులకిచ్చిన కార్యాచరణ ద్వారా సుమారు 500 మంది విద్యార్థులు 150 బృందాలుగా ఏర్పాటై గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ కార్యక్రమంలో మేము ప్రజలకు మరింత చేరువై, వారి కష్టాలు, కన్నీళ్లు మరింత దగ్గరగా గమనించగలిగాం. మంథని వద్ద శాస్త్రులపల్లిలో 500 మంది విద్యార్థులకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో కోటేశ్వర్‌రావు వాక్పటిమ, సైద్ధాంతికతను దగ్గరి నుండి గమనించగలిగాను. 

1978 సెప్టెంబర్ 9 నాడు శక్తి ప్రదర్శనకోసం జగిత్యాలలో నిర్వహించిన రైతుకూలీల సభ జనసందోహంతో నిండిపోయి 'జగిత్యాల జైత్రయాత్ర'గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సభను విజయవంతం చేయడానికి కిషన్‌జీతో పాటు మేమంతా జగిత్యాల ప్రాంతంలో పల్లెపల్లెలో తిరిగి ముమ్మర ప్రచారం చేయడం జరిగింది. 1978లో ప్రభుత్వం జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నిర్భంధాన్ని పెంచినా కోటేశ్వర్‌రావు, చెక్కుచెదరని ధైర్యంతో ఉద్యమంలోకి ముందుకు సాగాడు. 

1980 జనవరిలో మంథని దగ్గర్లోని గాజులపల్లి గుట్టలో రెండు రోజులు ముఖ్యనాయకులతో జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం, ఉద్యమ విస్తరణ పట్ల అనేక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలోనే కోటేశ్వర్‌రావు జిల్లా సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. ఇదే సంవత్సరం అక్టోబర్‌లో హైద్రాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం జరగడం, కొండపల్లి సీతారామయ్య చొరవతో కోటేశ్వర్‌రావును రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. 

అప్పటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మా.లె) కొండపల్లి సీతారామయ్య పేరుతో చలామణి అవుతున్న పార్టీకి 'పీపుల్స్ వార్'గా ఈ సమావేశంలో నామకరణం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు, కోటేశ్వర్‌రావులను నేను కలుసుకున్నపుడు, నన్ను కరీంనగర్ పట్టణ, రూరల్ బాధ్యతల నుండి తప్పించి నిజామాబాద్ డి.సి.ఎం.గా బోధన్ కార్మిక కేంద్రంగా పనిచేసేటట్లు నిర్ణయించారు. 

అక్టోబర్ 2న కరీంనగర్‌లో సమావేశం కావలసిన మేము వేరువేరు షెల్టర్‌లలో ఉండగా, 1వ తేదీ రాత్రే నన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం, విడుదలైన పిదప వ్యక్తిగత కారణలతో నేను పార్టీలో కొనసాగలేని స్థితిన లెటర్‌ద్వారా తెలియపరచగా, పార్టీ సహేతుకంగా భావించడంతో ఉద్యమానికి దూరంగా ఉన్నాను. 1983 వరకు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగి, తరువాత విస్తృత ప్రాంతాల్లో బలమైన దండకారణ్య ఉద్యమాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించి, కోటేశ్వర్‌రావు కిషన్‌జీగా భారత విప్లవోద్యమంలో తనదైన చరిత్రను లిఖించుకున్నాడు. 

- నారదాసు లక్ష్మణరావు
శాసనమండలి సభ్యులు
Andhra Jyothi News Paper Dated 27/12/2011

No comments:

Post a Comment