Thursday, December 6, 2012

సామాజిక విప్లవకారుడు (‘డా బి.ఆర్‌. అంబేడ్కర్‌’) --డేవిడ్



ambedkar
‘డా బి.ఆర్‌. అంబేడ్కర్‌’- ఈపేరు తలిస్తేనే దళి తుల గుండెల్లో ఉత్తేజం, ఉద్వేగం కలుగు తాయి. నిచ్చనమెట్ల కులసమాజంలో బానిసత్వంకంటే ఘోర మైన అస్పృశ్యత కారణంగా సమాజం చీదరింపులను, అవ మానాలను ఎదుర్కొన్న ఒక దళితుడు భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. పుట్టినప్పటినుండి పెరిగి పెద్దవాడై విదేశా లలో ఉన్నత చదువులు చదివికూడా ఈ కుల సమాజంలో అవమానాలను, బాధలను ఎదుర్కొనవలసి వచ్చింది. అస్పృ శ్యతకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి విశ్రమించి ఈ డిసెంబర్‌ 6 నాటికి 56 సంవత్సరాలు గతించిపోయాయి. 

చాలామంది అంబేడ్కర్‌ను దళితుల నాయకు డిగాగానే చూస్తారు. కానీ ఆయన దళితుల అభ్యున్నతి కొరకు ఎంత పోరాటం నిర్వహించాడో అంతకంటే ఎక్కువపోరాటాన్ని ఈ దేశంలో అణచివేతకు గురవుతు న్న కార్మికులు, రైతులు, స్త్రీల హక్కులకోసం పోరాడాడు. ఈ దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కుల, వర్గ పోరాటాలు రెండూ జరగాలని అంబేడ్కర్‌ అశించారు. అయితే సామాజికసమస్య పరిష్కారమైతేనే ఆర్థికసమస్యపై పోరాటం నిర్వహించడా నికి ప్రజలు ఏకమౌతారని వాదించాడు. ఆయన జీవించిఉన్న కాలమంతా కులవర్గ సమస్యలపై పోరాడాడు. కొందరు దళితమేధావులు, పోరాటాలు నిర్వహించకుండా కేవలం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమౌవుతాయని ప్రచారం చేస్తున్నారు. 

కులపరంగా విభజితమైన భారత్‌లో దోపిడీకి గురవుతున్న ప్రజలసమస్యలు పరిష్కరించేందుకు వర్గపోరాటాలు నిర్వహిస్తూనే సామాజిక న్యాయంకోసంకూడా పోరాడాలి. ఈ రెండింటి సమన్వయంద్వారా దోపిడీకి గురవు తున్న కులాలు, వర్గాలను సంఘటితపరచడం అవసరం. అంటే వర్గపోరాటాన్ని సామాజిక పోరాటంతో సృజనాత్మకంగా అన్వయించి అగ్రకుల బూర్జువా, భూస్వా మ్యవర్గాలపై పోరాటం నిర్వహించడంద్వారానే ఈదేశంలో కుల వర్గ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలం. కానీ దేశంలోని విప్లవోద్యమంనుంచి వామపక్షాల వరకు ఈ రెండు వర్గాలమధ్య ఐక్యతను సాధించక పోవడంవల్ల ఈ సమస్య జటిలంగా మారుతున్నది.

దున్నేవానికి భూమి దక్కాలనే నినాదంతో మహారాష్ర్టలోని కొంకణ ప్రాంత రైతు లను, రైతు కూలీలను ఏకంచేసి ‘ఖోటీ’లనే భూస్వాములకు, జమీందారులకు వ్యతి రేకంగా ఉద్యమాన్ని నిర్వహించి అంబేడ్కర్‌ విజయం సాధించిన విషయం చాలా మందికి తెలియదు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కంటే ముందే అంబేడ్కర్‌ ‘దున్నే వానికి భూమి’ నినాదంతో1937లో ఉద్యమించాడు. 1929 ఏప్రిల్‌ 14న రత్నగిరి జిల్లా చిప్లాన్‌లో జరిగిన రైతాంగమహాసభలో రైతాంగ రక్త మాంసా లను పీల్చి పిప్పి చేస్తున్న ఖోటీ పద్ధతికి స్వస్తి చెప్పాలని పిలుపు నిచ్చాడు. 

రత్నగిరి, సతారా, నాసిక్‌, ప్రాంతాల నుండి వేలాది మంది రైతుల్ని సమీకరించి, పెద్ద ఉరేగింపుతో బొంబాయి శాసనసభ వరకు వెళ్ళి ఖోటీ నిర్మూలనగూర్చి ఆందోళనచేశాడు. అంబేడ్కర్‌ ఆందోళన ఫలితంగా 1937 సెప్టెంబర్‌ 17న ఖోటీ నిర్మూలన బిల్లును ప్రవేశపె ట్టించడంలో విజయం సాధించాడు. ఫలితంగా భూస్వాములకు కొంత నష్టపరిహా రాన్నిచెల్లిస్తూ రైతులకు భూమి దున్నుకునే హక్కులను ప్రభుత్వం కల్పించింది. 

మహార్‌ కులాల ప్రజలు వెట్టిచాకిరి చేయడం, అగ్రకులాల పెద్దలను ఒక స్థలం నుండి మరో స్థలానికి భూజాలమీద, కావడీలమీద మోసుకెళ్లడం, చచ్చిన శవాలను పారేయడం, గ్రామాన్ని శుద్ధిచేయడం ఉండేవి. ఈ వెట్టి పనులకు చారెడు గింజలు పండించుకోవడానికి కొద్దిగా భూమిని ఉపయోగించుకోనిచ్చేవారు. దానినే ‘మహార్‌ వతన్‌’ అని పిలిచేవారు. దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌, కులకర్ణి, పటేల్‌ మొదలైన వాళ్ళు ఏ పన్నులు కట్టకుండా ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని నిరుపేదల చేత వెట్టి పనులు చేయించుకొనేవారు. వారిచేతనే పన్నులు కూడా కట్టించుకునేవారు. 

భూమి మీద వచ్చే ఫలితాలను ఉన్నత కూలాల వారు అనుభవించేవారు. ఇలాంటి అమానుషాన్ని వ్యతిరేకిస్తూ అంబేడ్కర్‌ ఆందోళన నిర్వహించి ‘మహార్‌వతన్‌’ నిర్మూ లనకు కృషిచేశాడు.1938 డిసెంబర్‌లో శ్రామికులు సమ్మెలు చేయడానికి వ్యతిరే కంగా పారిశ్రామికవివాదం గురించిన బిల్లును బొంబాయి విధానసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శ్రామికులు హర్తాళ్‌ చేయడం చట్టవిరుద్ధం. ఈ బిల్లు శ్రామికుల పాలిట శాపంఅని ఆంబేడ్కర్‌ వ్యతి రేకించాడు. ‘స్వాతంత్య్రం కోసం సహాయ నిరాకరణ ఒక పవ్త్రిమైన హక్కు అయితే, శ్రామికులకు హర్తాళ్‌చేసే హక్కు కూడా అంతే పవి త్రమైనది’అని, ఈ బిల్లు శ్రామికులకు పౌరస్వేచ్ఛని నేలరాసే చట్టం అవుతుందన్నాడు. 

ఈ బిల్లుకువ్యతిరేకంగా మజ్‌దూర్‌ యూనియన్‌, స్వతంత్ర మజ్‌దూర్‌ పార్టీలు హర్తాళ్‌ చేయడానికి యుద్ధఢంకా మోగించాయి. ఈ హర్తాళ్‌లో పరులేకర్‌, డాంగే,నింబ్‌కర్‌లతో పా టు అంబేడ్కర్‌ పాల్గొన్నాడు. ‘శ్రామికుల చేతికి పరిపాలనాధికారం రానంతవరకూ వారి సమస్యలు పరిష్కారంకావు’ అని అంబేడ్కర్‌ నినదించాడు.‘కార్మిక, కర్షకుల పాలనలోనే నా ప్రజలు ఈ దేశంలో సామ్యవాదాన్ని స్థాపించగలరు’ అని పేర్కొన్నాడు. అంబేడ్కర్‌ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నకాలంలో (1942-1946) శ్రామికుల ప్రయోజనార్థం అనేక చట్టాలు చేశాడు. టీ తోటల్లో పనిచేసే శ్రామికుల పరిస్థితి మెరుగుపడాలని ఇండియన్‌ టీ కంట్రోలు సంస్కరణ బిల్లును ఆమోదింపచేశాడు. 

కార్మికులకు యుద్ధకాలంలో నష్టంవాటిల్లితే వారికి నష్టపరిహారాన్ని యాజమాన్యమే చెల్లించే విధంగా బిల్లు అమలయ్యేటట్టు చూశాడు. గనుల్లో పనిచేసే గర్భవతులైన మిహళలకు ప్రసవకాలపు సెలవులు,జీతం కల్పించేబిల్లును 1945లో ఆమోదిం పచేశాడు.1846లో ఆయన 10 గంటల పనిదినాన్ని 8 గంటల పనిదినంగా తగ్గిం చడానికి బిల్లు పాసు చేయించాడు. 1943 లో ప్లీనరీ లేబర్‌ పరిషత్తులో పారిశ్రా మికీకరణమీద ఉపన్యాసమిస్తూ- పెట్టుబడిదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో- పనిచేసే వాళ్ళు బీదరికంలో ఉండవలసి వస్తుంది, పనిచేయని వారి దగ్గర లెక్కపెట్టలేనంత పెట్టుబడి పొగవుతుంది అని తెలిపారు. 

ఒక వైపు రాజకీయ అసమానత్వం రెండోవైపు ఆర్థికవ్యత్యాసాలతో, శ్రామికులకు కూడు, గూడు, గుడ్డ, ఆరోగ్యమైన జీవితం లభించనంతవరకు, గౌరవంగా తలెత్తుకుని నిర్భయంగా జీవి తాన్ని గడపనంతవరకు స్వాతంత్య్రానికి ఏమి అర్ధం లేదని అన్నాడు.కార్మిక నాయకులు తమ విభేదాలు మరచి, ఐక్యవేదికగా ఏర్పడి పెట్టుబడి దారీ విధానాన్ని ఎదుర్కొనాలని పిలుపునిచ్చాడు. కార్మికులు ఉద్యమించి బ్రిన్‌లో రెండు పర్యా యాలు ప్రభుత్వాన్ని చేజిక్కించుకోగలిగారు. బ్రిటన్‌లో వలె భారతీయ కార్మిక వర్గం ఈ దేశంలో కూడా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చాడు. 

65 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికీ కులవివ, అంటరాతనం వివిధ రూపాల్లో నేటికీ కొనసాగుతోంది. దళితులకు దున్నుకోవడానికి భూమి లేదు, స్వాతంత్య్ర ఫలాలు నేటికీ దళితులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. దళితులకు, జలయజ్ఞం పేరుతో కోట్ల రుపాయల కేటాయింపులు చేస్తున్నా, అసలు భూములేలేని దళితులకు ఒరిగేదేమిటని ప్రశ్నించేవారే లేరు. సీట్లదగ్గర కులాన్ని వాడుకోనే నాయకులు దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదు. అంబేడ్కర్‌ వారసులమంటూ చెలామణఇవుతూ, దళిత ప్రతినిధులుగా చట్టసభల్లో ఎన్నిక యిన నాయకులు చట్టసభల్లో వీటిగురించి పల్లెత్తు మాటైనా మాట్లాడలేకపోతున్నారు. 

devid
దళితులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు అనేక విధానాలు చేపడుతున్నా వాటి ని వ్యతిరేకించకుండా ప్రభుత్వాలకు వత్తాసు పలకడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. అంబేడ్కర్‌ వారసులుగా ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే నినాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన, దళిత వ్యతిరేక చర్యలపైన పోరాడాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగించడం అంటే కేవలం ఆయన జయంతికి, వర్థంతికి నివాళ్ళు అర్పించడమే అని నేటి నాయకులందరూ అనుకుంటున్నారు. ఆయన జయంతి వర్థంతి సందర్భాలలో తప్ప ఆయన పోరాటా లను గుర్తుకు తెచ్చుకోవడం లేదు. డా అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగానైనా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి పునరంకితం కావలసి ఉంది. 


- డిసెంబర్‌ 6 అంబేడ్కర్‌ వర్ధంతి

Surya Telugu News Paper Dated: 6/12/2012 

No comments:

Post a Comment