Tuesday, April 10, 2012

నయా ఉదారవాదం - పేదరికం--సీతారాం ఏచూరి



ధనికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేయకుండా, పేదరికాన్ని తగ్గించకుండా ద్రవ్య లోటు తగ్గించాలని ప్రభుత్వం సూచిస్తున్నది. కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను అభివృద్ధికి ప్రోత్సాహకాలుగా పేర్కొంటున్నది. పేద ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేయడం ద్వారా లోటును తగ్గించాలని నిర్దేశిస్తున్నది. ఆ ప్రకారమే ప్రస్తుత బడ్జెట్‌లో ఇంధనాలపై రు. 25,000 కోట్లు, ఎరువులపై రు.6.000 కోట్లు సబ్సిడీలను తగ్గించారు. ఈ సబ్సిడీల్లో అధిక భాగం పేదరిక రేఖకు దిగువున జీవిస్తున్న కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని నిర్ణయించినవే. ఈ సబ్సిడీలను తగ్గించాలంటే ఒక్కటే మార్గం. అదే బిపిఎల్‌ కుటుంబాల సంఖ్యను తగ్గించడం.


నయా ఉదారవాద ఆర్థిక విధానాలు శ్రమ జీవులపై ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా భారాలను మోపు తున్నాయి. ఈ సంస్కరణలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు ద్వారాలు తెరుస్తూ విస్తృత దోపిడీ ద్వారా పెద్దయెత్తున లాభాలు గుంజడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఈ దోపిడీ అన్ని రకాల హద్దులు దాటిపోతోంది. తీవ్రతరమవుతున్న పేదరికం నేరుగా ప్రభావం చూపుతోంది. భారతదేశంలో నెలకొన్న పేదరికంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ అధివాస్తవికత స్థాయిని చేరుకుంటోంది. ఈ పేదరికమే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ప్రాతిపదికగా ఉంది.
మన దేశంలో ఆర్థిక వనరుల లూటీ ముఖ్యంగా రెండు రకాలుగా జరుగుతోంది. సంస్కరణలు ప్రజల్లో ఆర్థిక అసమాతలను పెంచుతున్నాయి. విచ్చలవిడి దోపిడీ వల్ల వెలిగిపోతున్న భారతానికి, నలిగిపోతున్న భారతానికి మధ్య అంతరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రకృతి వనరుల లూటీకి ప్రయివేటు రంగానికి అవకాశం కల్పించడం ద్వారా రెండో రకమైన దోపిడీ జరుగుతోంది. అనేక మెగా అవినీతి కుంభకోణాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి తరహా దోపిడీకి చట్టబద్ధమైన అధికార ముద్ర అవసరం. ఈ నయా ఉదారవాద విధానాలు దేశంలో పేదరికం తగ్గడానికి దోహదం చేస్తున్నాయని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. పూర్తి కల్పిత గణాంకాలను సృష్టించి ఈ విధమైన వంచనా శిల్పాన్ని ప్రదర్శిస్తారు. ఇటువంటి విన్యాసమే మళ్లీ 2012 మార్చి 19న చోటుచేసుకుంది. 2009-10 సంవత్సరానికి ప్రణాళికా సంఘం పేదరికంపై అంచనాలను విడుదల చేసింది. 2004-05, 2009-10 సంవత్సరాల మధ్య దేశంలో పేదరికం తగ్గిందని ఆ అంచనాలు చెబుతున్నాయి. 2009-10లో పట్టణాల్లో పెట్టే రోజువారీ ఖర్చుల ప్రాతిపదికగా ఈ అంచనా వేశారు. పట్టణాల్లో 28 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 22 రూపాయలను ప్రామాణికంగా నిర్ధారించారు.
ఇటువంటి మహా వంచన గత కొద్దికాలంగా జరుగుతూనే ఉంది. ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజనాల వాజ్యంలో పట్టణాల్లోనైతే రోజువారీ ఇరవై రూపాయలు, గ్రామాల్లో పదిహేను రూపాయలు ఖర్చుచేసేవారు పేదల జాబితాలోకి రారని వాదించింది. నగరాల్లో రు. 578 ఖర్చు చేసేవారు పేదలు కింద పరిగణన లోకి రారని ప్రణాళికా సంఘం పేర్కొంది. అద్దె, కన్వేయన్స్‌ ఛార్జీలకు నెలకు రు.31, విద్యపై రు. 18, వైద్యానికి రు. 25, కూరగాయలకు రు.36.5 సరిపోతాయని పేర్కొంది. ఈ లెక్క ఎంత అసంబద్ధంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు.
ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ప్రభుత్వం ఈ హాస్యాస్పదమైన రేట్లను స్వల్పంగా సవరించింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పేదరికంపై గత ఏడాది సెప్టెంబర్‌లో సమావేశమై ఒక కచ్చితమైన అవగాహనకు వచ్చారని ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు తెలియజేసింది. ఇవి ఇంతకుముందు కోర్టుకు సమర్పించిన లెక్కల కంటే స్వల్పంగా మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. గ్రామాల్లో రోజుకు ఇరవై ఆరు రూపాయలు సంపాదించేవారు. పట్టణాల్లో రు.32 సంపాదించేవారు మన దేశంలో పేదల జాబితాలోకి రారని ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. ఇకముందు పేదరిక అంచనాలు కొత్త విధానం ప్రాతిపదికగా మాత్రమే ఉంటాయని పేర్కొంది. గ్రామీణాభివృద్ధి శాఖ, గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనా శాఖ పేదరిక రేఖకు దిగువున ఉన్న ప్రజల జాబితాను లెక్కిస్తారు.
సంపాదనపరులైన ఐదుగురు సభ్యులు గల కుటుంబ ఆదాయం సంవత్సరానికి రు.27,000 ఉంటే దారిద్య్ర రేఖ నుండి వారిని తొలగిస్తారు. నెలకు తలసరి ఆదాయం రు.447 ఉంటే వారిని పేదలుగా పరిగణించక్కర్లేదన్న సూత్రం ప్రాతిపదికగా ఈ లెక్కలు వేశారు. ప్రణాళికా సంఘం లెక్కలను వారు పరోక్షంగా ఆమో దించారు. అంతకంటే హీనమే మిటంటే ప్రణాళికా సంఘం ఈ హాస్యాస్పదమైన ఆదా యపు పరిమితులను మరింతగా కుదించి వేయడం. ఈ మోసపూరితమైన విన్యాసం ప్రజలను , వారి పేదరికాన్ని హేళన చేయడమే కాదు, ప్రభుత్వ వంచనకు పరాకాష్టగా కూడా దీనిని పేర్కొనవచ్చు. బతకడానికి మనిషికి రోజుకు 2,400 క్యాలరీల ఆహారం అవసరమని ప్రణాళికా సంఘం నిర్ణయించింది. 2010 నాటి ధరల ప్రకారం ఇందుకు కనీసం రు. 44 ఖర్చవుతుంది. నేడు అది మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గణాంకాలకు ఇది రెట్టింపు స్థాయిలో ఉంటుంది.
పేదరిక శాతం తగ్గిందని ప్రణాళికా సంఘం అంచనా. 2004-05లో ఇది 37.2 శాతం ఉండగా 2009-10లో 29.8 శాతానికి పడిపోయినట్లు ప్రణాళికా సంఘం చూపిస్తున్నది. జాతీయ సలహా మండలి దీనిని 46 శాతంగా అంచనా వేసింది. ఈ రెండు అంచనాలు అర్జున్‌ సేన్‌గుప్తా వేసిన అంచనా 77 శాతం కంటే బాగా తక్కువగా ఉన్నాయి. మన దేశంలో 77 శాతం మంది రోజుకు ఇరవై రూపాయల కన్నా తక్కువ ఆదాయంతో దుర్భర జీవితం గడుపుతున్నారని అర్జున్‌సేన్‌గుప్తా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల కింద ఉన్న వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికగా ఈ గణాంకాలను రూపొందించారు. నిత్యావసర సరుకుల ధరలు అడ్డు అదుపులేకుండా పెరిగిపోతుండటం వల్ల పరిస్థితి మరింతగా దిగజారింది.
అసమాతలు పెరగడం మాత్రమే గాక, ప్రజల జీవన స్థితిగతులు క్షిణిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఉత్సాపట్నాయక్‌ రచించిన ' ది రిపబ్లిక్‌ ఆఫ్‌ హంగర్‌' పుస్తకం మన ప్రజల యథార్థ వ్యథాభరిత గాథను ఆవిష్కరించింది. పి.సాయీనాథ్‌ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 1972 - 1991 మధ్య ఆహారధాన్యాల తలసరి అందుబాటు గణనీయంగా తగ్గింది. తృణ ధాన్యాలు, పప్పుధాన్యాలు అందు బాటు 434 నుండి 480 గ్రాములకు పెరిగింది. 1992-2010 మధ్య 440 గ్రాములకు పడిపోయింది. జనాభా పెరుగుదలే ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. 1981-1991 మధ్య జనాభా పెరుగుదల రేటు 2.16 శాతం వుండగా, ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.13 శాతం పెరిగింది. సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైన తరువాత జనాభా పెరుగుదల 1.95 శాతం ఉండగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.1 శాతం మాత్రమే పెరిగింది. 2001-11 మధ్య జనాభా పెరుగుదల 1.65 శాతం పెరగ్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.03 శాతం పెరిగింది. అయితే ఇక్కడ సమస్య జనాభా పెరుగుదల కాదు. దుర్భర పేదరికం అసలుసిసలు సమస్య. ఆమాద్మీకి ఆహార భద్రత కల్పించడం, జీవన ప్రమాణాలు పెంచేం దుకు చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. వారికి తగిన సబ్సిడీలు కల్పించాలి. పెరిగిపోతున్న ద్రవ్యలోటును తగ్గించుకునే సాకుతో సబ్సిడీలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుత బడ్జెట్‌ పత్రాల ప్రకారం ద్రవ్యలోటు 5.9 శాతం, అంటే 5.22 లక్షల కోట్ల రూపాయాలు ఉంది. అదే సంవత్స రంలో, కార్పొరేట్లు, సంపన్నులకు రు. 5.28 కోట్ల మేరకు పన్నుల్లో రాయితీలు కల్పించారు. గత ఏడాది సమర్పించిన బడ్జెట్‌లో పేర్కొన్న ఈ మొత్తాన్ని వసూలు చేసి ఉంటే, ద్రవ్యలోటు అసలు ఉండేది కాదు. చాలా మిగులు ఉండేది.
ధనికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేయకుండా, పేదరికాన్ని తగ్గించకుండా ద్రవ్య లోటు తగ్గించాలని అది సూచిస్తున్నది. కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను అభివృద్ధికి ప్రోత్సాహకాలుగా పేర్కొంటున్నది. పేద ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేయడం ద్వారా లోటును తగ్గించాలని నిర్దేశిస్తుంది. పేదలకు ఇచ్చే రాయితీలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా ప్రభుత్వం చూపిస్తున్నది . ప్రస్తుత బడ్జెట్‌లో ఇంధనాలపై రు. 25,000 కోట్లు, ఎరువులపై రు.6.000 కోట్లు సబ్సిడీలను తగ్గించారు. ఈ సబ్సిడీల్లో అధిక భాగం పేదరిక రేఖకు దిగువున జీవిస్తున్న కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని నిర్ణయించినవే. ఈ సబ్సిడీలను తగ్గించాలంటే ఒక్కటే మార్గం. అదే బిపిఎల్‌ కుటుంబాల సంఖ్యను తగ్గించడం. ఇదే ప్రణాళికా సంఘం మోసపూరిత ప్రయత్నం వెనుక ఉన్న పరమార్థం.
కారల్‌ మార్క్స్‌ 'ది పావర్టీ ఆఫ్‌ ఫిలాసఫీ' అనే పుస్తకంలో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే కాదు, మార్చాల్సిన అవసరం ఉందని ప్రబోధించాడు. ''వర్గాల మధ్య శత్రుత్వంతో ఏర్పాటైన ప్రతి సమాజంలో దళితులు అత్యంత కీలకపాత్ర పోషిస్తారు. దళిత జనోద్ధరణ అంటే కొత్త సమాజాన్ని సృష్టించడమే. దళితులు అణచివేత నుండి విముక్తి పొందాలంటే, వారు పొందిన నిర్మాణాత్మక అధికారాలు కొనసాగుతూనే, ప్రస్తుత సామాజిక సంబంధాల్లో సమగ్ర మార్పులు రావాలి. ఉత్పత్తి కారకాల్లో అన్నిటికంటే ముఖ్యమైంది కార్మికులే''.
శ్రమజీవులు, అణచివేతకు గురవుతున్న వర్గాల విమోచనలో విప్లవశక్తులను ఒక వర్గంగా సంఘటితపరచడం అత్యంత ముఖ్యం. ఇంకోమాటలో చెప్పాలంటే, శ్రమజీవుల నేతృత్వంలో అణచివేతకు గురవుతున్న వర్గాలు ఒక రాజకీయ శక్తిగా సంఘటితం కావడం అత్యవసరం. భారతదేశంలో నెలకొన్న పరిస్థితులకు అను గుణంగా ఇటువంటి వ్యవస్థను బలోపేతం చేయడంపై సిపిఎం దృష్టి కేంద్రీకరించింది. సామాజిక సంస్కరణ లక్ష్య సాధనలో ముందుగా జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు సరైన ఎత్తుగడలను రూపొందించింది. ఈ దిశలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలి. ఈ దేశ ప్రజల ప్రయోజనాల రీత్యా ఈ చారిత్రిక లక్ష్య సాధనకు మార్క్సిస్టు పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. 
-సీతారాం ఏచూ
Prajashakti news paper Dated : 11/04/2012 

No comments:

Post a Comment