Saturday, April 28, 2012


వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె
ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వాస్తుశాస్తం, నిర్మాణపరమైన సాంకేతిక నైపుణ్యాలు మొత్తం వడ్డెర కులస్థులకే సొంతం. మట్టికి సంబంధించిన పనుల్లో వడ్డెరల శక్తియుక్తి అంతులేనిది. దేశమంతటా వ్యాపించిన కులాల్లో వడ్డెర కులం కూడా ఒకటి. రాతిపని, మట్టిపని ప్రధాన జీవన వృత్తిగా వడ్డెరలు మన రాష్ట్రం లో లక్షలాదిగా ఉన్నారు. పేదరికం, నిరాక్షరాస్యతతో సంఘం లో అస్పృశ్యులుగా చూడబడుతున్నారు. 

బ్రిటిష్ ఇండియాలో ప్రాజెక్టుల నిర్మాణం మొదలైన తర్వాత మొట్టమొదటగా సంచార కార్మికులుగా మారిన వారు వడ్డెరలే. కాలువల ద్వారా వ్యవసాయం సాగులోకి వచ్చేటప్పటికి బావు లు,చెరువులు తగ్గిపోయాయి. వీటి ప్రాముఖ్యం కూడా తగ్గిపో యింది. దీనికి పర్యావరణ సమస్యలు కూడా వడ్డెరల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో వడ్డెరలు తమ కుల వృత్తిలో భాగమైన బావులు, చెరువులు తవ్వడం, మట్టి పని, రాతి పనులను కోల్పోయారు.

ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని బీదర్, బీజాపూర్, రాయచూర్‌లను గుల్బర్గా జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలోని బల్లారి జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలో చేర్చడం జరిగింది. ఈ జిల్లాలోని వడ్డెరలను ఆ రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో చేర్చారు. ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోయిన వారు మాత్రం బీసీ లుగా ఉండిపోయారు. జీవో 1973, విద్యాశాఖ 23-9-1970 అనుసరించి ఆదిమ జాతులు, విముక్తి జాతులు, సంచార జాతులను మిగిలిన వెనుకబడిన కులాలను అన్నింటిని బీసీలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణలో వడ్డెర కులాన్ని ‘ఎ’గ్రూప్‌లో చేర్చారు. అయితే గతంలో విముక్తి జాతులుగా ఉన్న లంబాడీ, ఎరుకల, యానాదులను 1976లో ఎస్సీ,ఎస్టీ అమెండ్‌మెంట్ యాక్టు ద్వారా షెడ్యూల్డ్ జాతులల్లో చేర్చారు. 

వారితోపాటు సమాన ప్రతిపత్తి కలిగిన వడ్డెర, దొమ్మర, తదితర జాతుల గురించి ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు.ఎన్‌డీఏ ప్రభుత్వం సమాజంలో అత్యంత వెనుకబడిన 92 కులాల జాబితాను తయారు చేసి ఎస్సీలో చేర్చాలని నిర్ణయించింది. ఈజాబితాలో వడ్డెరలను చేర్చలేదు. దీనికి ఏ అంశాన్ని ప్రాతిపది కగా తీసుకున్నారో అర్థంకాదు. ఆ జాబితాలో వడ్డెరలను చేర్చకపోవడం చాలా అన్యాయంయకమంగా చేతి వృత్తుల వారిని నిర్మూలించడమే ప్రభుత్వాల లక్ష్యంగా అర్థం చేసుకోవాల్సి వస్తున్నది. బ్రిటిష్ కాలం నుంచి నేటి దాకా వడ్డెరలు క్వారీల లో, రైల్వే పనులలో, చెట్టు పుట్టలల్లో ఏ రక్షణ లేని బానిసలుగా,కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం వడ్డెరల పాలిట శాపంగా మారింది.

బోరింగులు, రిగ్‌లు, క్రషర్‌లు వచ్చి వడ్డెరల కులం నడ్డివిరిచాయి. సంప్రదాయ సిద్ధమైన బావి, చెరువులు, తవ్వడం నిలిచిపోయినపుడు వడ్డెరలు తమ కుల వృత్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆధునిక, సాంకేతిక రంగాలలో భాగమైన బోర్లు, రిగ్‌లు, క్రషర్‌ల యాజమానులుగా వడ్డెరలు మారలేదు. నాటి నుంచీ నేటి దాకా కాయ కష్టం మీదనే, దినకూలీలుగా, సంచార జీవులుగా, కాంట్రాక్టు కార్మికులుగానే మిగిలిపోయారు. 

బ్రిటిష్ పాలనానంతరం భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దుర్మార్గమైన చట్టాల వల్ల అనేక కులాలు, తెగలు, సంచార జీవితాల్ని గడపాల్సిన దుస్థితి వచ్చింది. ఈ ప్రజల్ని నిర్బంధించి ‘సెటిప్మూంట్స్’ ప్రాంతాలు అని ఏర్పాటుచేసి అనేక చిత్రహింసలకు గురిచేశారు. కొన్ని జాతులను దొంగలుగా ముద్రవేశారు. ఆస్తికి, అధికారానికి, విద్యకు దూరం చేశారు. పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా హత్య చేశారు. ఈ దమనకాండలో వడ్డెరలు బలై ఎంతోమంది అంగవైకల్యానికి గురయ్యారు. అక్రమంగా జైళ్లలో నిర్బంధించబడ్డారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వాపు కార్యదర్శి క్రిమినల్ ట్రైబ్స్ (సీటీ యాక్టుపతిపాదకుడు జేఎం స్టీఫెన్ 1924లో సృష్టించిన సీటీ యాక్ట్ చట్టాలకు వ్యతరేకంగా ఎరుకల, లంబాడీ, యానాది తదితర తెగలతో కలిసి వడ్డెరలు అనేక పోరాటాలు చేశారు. బ్రిటిష్‌వారితో తలపడిన వడ్డెర ప్రజలకు స్వేచ్ఛ లభించలేదు. ముప్ఫై సంవత్సరాల అనంతరం దేశ వ్యాప్తంగా సీటీ యాక్టును లంబాడీ,ఎరుకల తెగలపై ఎత్తివేసినా వడ్డెరలపై అలాగే కొనసాగిస్తున్నారు.

1956 సెప్టెంబర్ 26న కేంద్ర ప్రభుత్వం ఎరుకల, లంబాడీ, యానాది తెగలను ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎస్టీలుగా గుర్తించింది. వడ్డెరలను డీఎన్‌టీ (డీ నోటిఫైడ్ ట్రైబ్స్)గానే ఉంచారు. ఒకే తెగను కొన్ని జిల్లాల్లో ఎస్టీ జాబితాలో,మరికొన్ని ప్రాంతాల్లో డీఎన్‌టీ జాబితాలో చేర్చి విడదీసి అణగదొక్కిన చరిత్ర ఆంధ్రవూపదేశ్ అగ్ర కుల పాలకులదే. అయితే 1956 నుంచి 1976 వరకు ఆంధ్రప్రదే శ్‌లోని మొత్తం వడ్డెరలను, తెలంగాణలోని ఎరుకల, లంబా డీ, యానాది తెగలను డీఎన్‌టీ బీసీ(ఎ)లోనే ఉంచి ఎస్సీ జాబితాలో చేర్చలేదు. ఎస్సీ జాబితాలో చేర్చడానికి తెలంగాణలోని డీఎన్‌టీ తెగలతో వడ్డెరలు కలిసి పోరాటాలు చేస్తే అక్కడ కూడా వడ్డెరలకు తీరని అన్యాయం జరిగింది. ఎస్టీ జాబితాలో వడ్డెరలను చేర్చకుండా బీసీ (ఎ) గ్రూప్‌లో ఉంచి డీఎన్‌టీకు ఇచ్చే అన్ని హక్కులను రాయితీలను రద్దు చేశారు. 

1924నుంచి 192 వరకు సీటీ యాక్టుకు వ్యతిరేకంగా వడ్డెర, ఎరుకల, లంబాడీ, యానాది జాతులు కలిసి పోరాటాలు చేశాయి. 1952 నుంచి 1956 వరకు రిజర్వేషన్ కోసం గిరిజన జాబితాలో చేర్చడం కోసం వడ్డెరలకు మిత్రులైన ఎరుకల, లంబాడీ, యానాదులతో కలిసి అనేక పోరాటాలు చేశా రు. ఈ తెగలకు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కినా వడ్డెరలకు దక్కలేదు. కర్ణాటకలో వడ్డెరలు ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నారు. కనుక మన రాష్ట్రంలోని వడ్డెరలను ఎస్సీ రిజర్వేషన్ జాబితాలో చేర్చాలనీ డిమాండ్ చేస్తూ బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అగ్రకుల ప్రభుత్వాలు అనుసరించిన లోపభూష్టమైన విధానాల వల్ల వడ్డెరలు తీవ్రంగా నష్టపోయారు. ఈ కోల్పోయిన హక్కులను ఐక్యంగా ఉద్యమించి సాధించుకోవాలి.

-పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కో- కన్వీన

Namasete Telangana News Paper Dated : 29/04/2012 

No comments:

Post a Comment