Wednesday, January 25, 2012

ఆత్మవిమర్శా? అంతర్యుద్ధమా? - కె.అరవిందరావు



'హిందూమతానంతర భారతదేశం'పై జరుగుతున్న చర్చను గమనించిన తర్వాత రెండు పక్షాలకు కొన్ని ప్రశ్నలు సంధించాల్సిన అవసరం ఉందని తోచింది. రెండు పక్షాల వారు కొంత ఆత్మవిమర్శ చేసుకోవాలనే ఈ ప్రశ్నలు. మొదటిగా హిందూ మతాన్ని అవలంబించే ఒక consumer లేదా వినియోగదారుడిగా ధర్మాధిపతులకు కొన్ని ప్రశ్నలు. 

1. అనాదిగా మన దేశంలో హిందూ ధర్మం/ మతం ఎన్నో దాడు లు ఎదుర్కొన్నా ఇంకా బలంగా ఉండడానికి కారణం ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన సమన్వయ దృక్పథం. పండితులు ఎన్ని రకాలుగా దేవుణ్ణి గూర్చి చెప్పినా సత్యం ఒకటే అని, భిన్నత్వంలో ఏకత్వం పాటించిన జాతి మనది. ఉపనిషత్ సిద్ధాంతాన్ని ప్రజల్లో ఎందుకు సరిగా ప్రచారం చేయడం లేదు? ఎందుకు ఆచరించడం లేదు? 

2. సమాజాన్ని సంఘటితంగా ఉంచటమే అన్ని మతాల ఉద్దేశం. అలా చేయడానికి దేశకాల పరిస్థితులను బట్టి ధర్మాన్ని అన్వయింపజేసుకోవాలి- శంకరాచార్యులే 'యస్మిన్ దేశే కాలే నిమిత్తేచ యాధర్మో అనుష్ఠీయతే తదేవదేశాంతరే కాలాంతరే అధర్మ ఇతివ్యవహ్రియతే' అన్నారు. అంటే ఒక ప్రదేశంలో, ఒక కాలంలో, ఒక సందర్భంగా ధర్మం అని అన్నదే మరొక ప్రదేశంలో, కాలంలో, నిమిత్తాలలో అధర్మం అనిపించుకుంటుంది. ధర్మం మూల స్వరూపం మారకుండా దాని ఆచరణలో మార్పును తెస్తూ సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. దళిత వాడల్లో కూడా సంచారం చేసి వారిలో మతం ఉన్నతమయినది అనే భావన తేవాలి కదా! 

3. ప్రజల అవగాహనా స్థాయిని బట్టి (అధికార భేదం అంటారు) వారికి విషయం బోధించాలని మన ప్రాచీనుల సిద్ధాంతం. ఇతిహాసాలు, పురాణాల ద్వారా వేదాంత శాస్త్రంలోని విలువల్ని బోధించడం మన ప్రాచీన ప్రణాళిక. వేదాంత సిద్ధాం తం మామూలుగా అందరికీ అర్థం కాదు కనుక దాన్ని కథల ద్వారా చెప్పడం జరిగింది. పురాణ కథల్లో మనకు సింబాలిజం (ప్రతీకవాదం) కనిపిస్తుంది. పురాణాల్ని ప్రవచనం చేసేవారు దార్శనిక దృష్టితో ప్రవచనం చేస్తే వాటి పట్ల సరైన అవగాహన కల్గుతుంది. కేవలం పురాణ ధోరణిలో చిలవలు పలవలుగా వర్ణించి చెప్పడం వల్ల వాటిపై వెగటు ఏర్పడుతుంది. సరైన ప్రవచనకారుల్ని నిర్మించడం పీఠాధిపతుల ధర్మం. ఇది జరుగుతున్నదా? 

4. మనం ఈనాడు శూద్రులని భావించే వారందరూ మన సిద్ధాం తం ప్రకారం ద్విజులే. ద్విజులంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు; 'కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్వకర్మ'అని భగవద్గీత చెప్పినదాని ప్రకారం సేద్యం, వాణిజ్యం చేసేవారు, పశువుల కాపర్లు (కృష్ణుడు ఈ కోవవాడే) వీళ్ళందరూ ద్విజులే. వేదం చదవడానికి అర్హులే. ఇవి మనం ఆచరణలో చూపవచ్చుకదా? 

5. మతం విశ్వాసాల సమాహారం. తత్త్వశాస్త్రం ఆలోచనకు సంబంధించింది. ఉపనిషత్తులలో భగవంతుని తత్త్వాన్ని గురించి విశ్లేషించేది తత్త్వశాస్త్రం. ప్రాథమిక దశలో మానవుడు దేవుడంటే ఒక రూపం, కొన్ని శక్తులు (గుణాలు) కల అంటే ఒక సాకార, సగుణ స్వరూపాన్ని ఏర్పా టు చేసుకుంటారు. కొంత ఆలోచించిన తర్వాత అన్ని దేవతారూపాలు ఒకటే అని గ్రహించి ఒక నిరాకార స్వరూపం, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ లాంటి గుణాలు ఉన్న స్వరూపం అంటే ఒక నిరాకార, సగుణ స్వరూ పం ఊహించుకుంటారు. మన దేశంలో సాంఖ్యులు, పతంజలియోగశాస్త్రం, తార్కికులు, ఇలాంటి దేవుణ్ణే చెపుతారు. పాశ్చాత్య మతాలు కూడా ఇలాంటి దేవుణ్ణే చెపుతాయి. 

ఈ మతాల్లో దేవుడొక్కడు నిరాకారుడైనా స్వర్గం, బంగారు వీథులు, అప్సరసలు, నరకయాతనలు వర్ణించబడ్డాయి. శైవం, వైష్ణవంలాగ ఈ మతాలు ఏకేశ్వరోపాసన ప్రతిపాదిస్తాయి. దేవుడు అనేది కేవలం నిరాకారమే కాక నిర్గుణమైన బ్రహ్మకు కేవలం ఉపాసకుల సౌకర్య నిమిత్తం సగుణ రూపకల్పన (ఉపాసనాకార సిధ్యర్థం బ్రహ్మోణో రూపకల్పనా) అన్ని అన్నారు. ఇట్టి ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం లేదు. ప్రజలింకా మూర్తి పూజ స్థాయిలోనే ఉన్నారని భావించి యజ్ఞయాగాదులు చేయించడం సరైనదేనా? 

6. మనది హిందూ మతం కాదు, హిందూ ధర్మం అని చెప్పడం వల్ల ప్రతి పక్షికి మీరే ఒక ఆయుధం ఇచ్చినట్లవుతుంది. మీకు మతమే లేదు అని ఎదుటివాడు వాదించే అవకాశం మనమే ఇస్తున్నాం. హిందూ మతం అనేక విశ్వాసాల సమాహారం. వైదిక తత్త్వం గొడుగు క్రింద ఉన్నవే శైవం, వైష్ణవం మొదలైనవి. అన్నీ వేదం ప్రామాణ్యాన్ని అంగీకరించాయి. మనకు మతమే లేదని వాదిస్తే విద్యాధికులు కూడా నిజమే అనుకునే పరిస్థితి వస్తుంది. ఏ విశ్వాసాల సమాహారమైనా మతమే. కాబట్టి మన మతంలో pluralism భిన్నత్వం ఉంది. దానిలోనే ఏకత్వం ఉంది. దీన్ని ఎందుకు ప్రచారం చేయడం లేదు? 

7. జ్ఞాని వేదాలకు, వర్ణాశ్రమాలకు అతీతంగా ఎదుగుతాడని వేద మే చెపుతుంది. జ్ఞాని స్థాయిలో తమ మత గ్రంథమే నిరర్ధకమవుతుందని ఏ మతమూ చెప్పలేదు. అంత ధైర్యంగా చెప్పిన గ్రంథాలు మన ఉపనిషత్తులు. ఇలాంటి వాటిపై ప్రతిపక్షిని ప్రశ్నించవచ్చు కదా? 

8. ఉపనిషత్తుల్లో చెప్పిన ఉదార, తాత్త్విక సత్యాలను పక్కనపెట్టి కర్మకాండలో చెప్పిన యజ్ఞాలు, ఆచారాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అవే హిందూమతం అని భావించే ప్రమాదం ఉంది. అలాగే కేవలం ధనవంతులు, కొన్ని వర్ణాల వారు మాత్రమే వీటిని ఆచరించగలరు. బహుళ ప్రజానీకం వీటికి దూరమవుతారు. వారి దృష్టిలో ఆచరణలో ఉన్నదే హిందూయిజం . కమ్యూనిస్టులు ఎంత చెప్పినా మతం అనేది మనిషి అవసరాలలో ఒకటి (basic human needs) తన అవసరం ఒక మతంలో తీరనప్పుడు మరొక మతాన్ని మనిషి ఆశ్రయిస్తాడు. ప్రజల ధార్మిక అవసరాన్ని తీర్చడానికి మన ప్రణాళిక ఏమిటి? 

9. మిగతా మతాల్లో మత విశ్వాసం వేరు, తత్త్వ శాస్త్రం వేరు. హిందూ మతంలో తత్త్వ శాస్త్రం , మతం రెండూ కలిసి ఉన్నాయి. తత్త్వశాస్త్రాన్ని పురాణకథల రూపంలో అందించడం వల్ల క్రమేణా తత్త్వాన్ని మరచి మూర్తి పూజకు ప్రాధాన్యం వచ్చింది. ఉదాహరణకు నిర్గుణ తత్త్వాన్ని ఆధారంగా చేసుకొని ఏదో ఒక శక్తి ప్రపంచాన్ని నిర్మించాలి అనే భావాన్ని పడుకున్న శివునిపై శక్తి కూర్చొని ఉన్నట్లు, మనస్సనే (కోరికలు తీర్చే) చెరకు విల్లును ధరించినట్లు ఐదు ఇంద్రియాలు బాణాలు అయినట్లు ఒక ప్రతీక రూపంలో చెప్పడం జరిగింది. చాలా పురాణ కథల్లో ఇలాంటి ప్రతీకలు కనిపిస్తాయి. దీనిలో భావం తెలియనంతవరకు మూఢనమ్మకాలుగా వ్యవహరింపబడతాయి. ఈ విషయాల్ని ఇటీవలి కాలం వరకూ అనేక మంది పండితులు ప్రవచనాల్లో పాఠాల్లో చెప్పేవారు. ఇప్పుడు అలాంటి పండితులు, పండిత పుత్రులు సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించడంతో ఆ రంగంలో ఒక శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేయడానికి మీకు ప్రణాళిక ఉండాలి కదా? 

10. శంకరాచార్యులు ఉపనిషణ్మత స్థాపన చేసినప్పుడు తత్కాలీన సిద్ధాంతాలను అంటే సాంఖ్య, బౌద్ధ, జైన, పాతంజల సిద్ధాంతాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారి వాదాల్ని ఎదుర్కొన్నారు. ఈనాటి దుష్ప్రచారాలను మ త విశ్వాసాలపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి పండిత వాతావరణం ఉందా? 

11. ప్రతిపక్షుల్ని కేవలం వాదంలో గెలిచే వారే కాని మిగతా దేశాల్లో లాగ రాజుల సహాయంతో మిగతా మతాల్ని మన దేశంలో అణచివేయలేదు. క్రీ.శ. 1వ శతాబ్దంలోనే క్రైస్తవ మతం కేరళలో వచ్చిం ది. అలాగే ఇస్లాం వచ్చింది. మతాధిపతులు విలన్లయితే వారిని ప్రారంభంలోనే అణచి వేసే వారు కాని అలా జరుగలేదు. మన మతంలోని ఉదారతత్త్వాన్ని గూర్చి గర్వంగా చెప్పవచ్చు కదా. కాళిదాసు, విశాఖదత్తుడు లాంటి వారి నాటకాలు చూస్తే అన్ని మతాల వారు ఒకే రాజు ఆస్థానంలో శాస్త్ర చర్చలు చేసినట్లు కనబడుతుంది. ఎవరినీ చంపించినట్లు చరిత్రలో లేదు. ఏదో ఒక రాజు మూర్ఖంగా ఒకరిని చంపడం ఉదాహరణగా చెప్పలేము. మిగతా ఖండాల్లో రాజులు క్రూరంగా మిగ తా మతాల్ని అణచివేయడం వల్ల ప్రాచీన మతాలు అంతరించాయి. ఇక్కడ రాజుల్లో సహనం వల్ల మిగతా మతాలు వెల్లి విరిశాయి. ఈ రెం డు పద్ధతుల్లో ఏది నాగరికత? దీన్ని, సరిగా గర్వంగా చెప్పాలి కదా? 

12. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు ఒకడికే భిక్షాటనం, సన్యాసం విధించబడింది. ఇతరులకు లేదు. భిక్షాటనం చేయడం వల్ల సమస్తాన్ని త్యజించి, దైన్యంలేని పేదరికంలో గడిపారు. శంకరాచార్యులు భిక్షాటనం చేయడం, ఆమలకం భిక్షగా తీసుకోవడం చరిత్రలో చదువుతాం. ఇలాంటి ఉదాహరణలు గర్వకారణాలు కదా? ఇన్ని శతాబ్దాలుగా ధర్మాన్ని అనుసరించిన బ్రాహ్మణులు నేడు కూడా దిశా నిర్దేశనం చేసి తద్వారా సిద్ధాంతాల్ని రక్షించాలి కదా? 

13. చాలా మంది మేధావులకు కూడా తత్త్వశాస్త్ర పరిజ్ఞానం లేకపోవడానికి కారణ ం ఏమిటి? ధర్మ రక్షకులు అధ్యాపనం అనే విధిని మరవడం వల్ల విషయాన్ని తెలిపేవారులేరు. దీని వల్ల మీరు ఋషి ఋణం ఎలా తీర్చుకుంటున్నారు? ఈనాడు రాష్ట్రం మొత్తంలో వేదాంత శాస్త్రం, పాఠం చెప్పగలిగినవారే వేళ్ళపై లెక్కించే సంఖ్యలో ఉండడానికి కారణం ఏమిటి? శాస్త్ర రక్షణలో మన ప్రణాళిక ఏమిటి? ప్రభుత్వం కాని, సమాజం కాని ఈ విషయంలో నిర్లిప్తతతో ఉన్నప్పుడు ధార్మిక సంస్థల పాత్ర ఏమిటి? 

హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారికి కొన్ని ప్రశ్నలు:
1. మేధావుల్లో ఋజుత్వం ఉండాలని అందరూ ఆశిస్తారు. అందర్నీ ఒకే కొలబద్దతో, ఒకే ప్రమాణంతో విశ్లేషించే పద్ధతి ఉండాలి. లేకుంటే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారు. ఒకే మతాన్ని నిందించడంలో మీ అజెండా ఏమిటి? మిగతా మతాల్లోని లోపాలను గూర్చి చాలా గ్రంథాలున్నాయి గదా? వాటిని ప్రజలకు తెలిపారా? ఉదా. Thomas payne అనే రచయిత క్రైస్తవంపై తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి గ్రంథాలను గూర్చి చెపుతున్నారా? 

2. ఈనాడు దేశంలో మతాల సంఘర్షణ తీవ్రంగా ఉందని మీకు తెలుసు. ఒకే మతాన్ని విమర్శించడం వల్ల మీరు మిగతా మతాలకు ఏజెంటుగా కనపడడం లేదా? మీ ప్రవర్తన ఒక మతాన్ని డిఫెన్స్‌లో పెట్టి మరొక మతాన్ని రెచ్చగొట్టే రీతిలో లేదా? 

3. Proxy war అనేది మీకు తెలుసు. ఉదాహరణకు మావోయిస్ట్‌లను బలపరచి దేశంలోని విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించి దేశాన్ని బలహీనపరచడం పొరుగురాజ్యాల పాలసీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి తోడు మత విషయంలో కూడా ఒక విధమైన politico-religious proxy war వేళ్ళూనుకుంటున్నది. మన దేశంలోని విచ్ఛిన్నకర శక్తులు, మేధావులు, వేర్పాటువాదులు లాంటి వార్ని చేరదీసి సత్కరించి వారి ద్వారా దళిత అధ్యయనాలు లేదా మానవహక్కుల అధ్యయనాలనే పేరిట అనేక సంస్థల ద్వారా ధనం రావడం, మేధావులైన వారు ఆ ప్రణాళికలో విదేశాలకు వెళ్ళడం, వారి ఆదేశాల మేరకు దళితుల్ని రెచ్చగొట్టే రచనలు చేయడం, వేర్పాటువాద ధోరణులు రెచ్చగొట్టడం proxy warకాదా? 

4. ఇటీవల రాజీవ్ మల్హోత్రా అనే అతను 'Breaking India' అనే గ్రంథంలో వ్యక్తిగతంగా కంచ ఐలయ్య ను ప్రస్తావిస్తూ వారు భారతదేశంలో 200 మిలియన్ దళితులు అణచివేతకు గురవుతున్నారని, ఆ జనులకు మానవహక్కులు లేవని, ఈ విషయంలో అమెరికా ప్రభు త్వం జోక్యం చేసుకోవాలని మెమొరాండం ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది నిజమైతే ఇది దేశ వ్యతిరేక చర్య కాదా? దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని మీరు తిరస్కరించినట్లే కదా? ఈ ఆరోపణ పట్ల మీ సమాధానం ఏమిటి? మీరు భారత ప్రభుత్వంపై ఉద్యమం చేయవచ్చు కాని, అమెరికా జోక్యాన్ని కోరడం తప్పుకాదా? 

5. ఒక కుటుంబంలోని వ్యక్తుల మధ్య మనస్పర్థలు కాని, అపోహలు కాని ఉన్నప్పుడు వాళ్ళ విభేదాల్ని మరింత రెచ్చగొట్టి పడగొట్టడం సరైనదా? వారికి సర్ది చెప్పి కుటుంబ సమైక్యత నిలపడం సరైన మార్గమా? మొదటి పక్షంలో పిల్లుల తగాదా కోతి తీర్చినట్లు పాశ్చాత్య దేశాలకు లాభం చేకూర్చడం ఎంతవరకు సమంజసం? 

ప్రభుత్వానికి కూడా కొన్ని విషయాలు తెలియడం అవసరం. అవి:
1. ఒక మతం అజ్ఞానం, మరో మతం అతి తెలివిగా వ్యూహాత్మకంగా దూసుకుపోవడం- రెంటి వల్ల demographic change జనాభాలో మార్పు గణనీయంగా ఉందనీ, ముఖ్యంగా దక్షిణ భారతదేశ catchment area గా ఆ మతం పరిగణిస్తున్నదని గమనించాలి. ప్రజల్లో ఏదో ఒక వర్గం critical mass of population దాటినప్పుడు, దాన్ని నియంత్రించే వారు పాశ్చాత్యులయినప్పుడు ఇండియాకు, సూడాన్‌కు తేడా లేదు ఒక మతం ఫాసిస్టు ధోరణితో ఇంకో మతాన్ని అణగద్రొక్కుతున్నారనే నెపంతో అంతర్జాతీయ శాంతి సేనల్ని దింపవచ్చ. బహుశ పదిహేనేళ్ళ తరువాత దేశ సమగ్రతలో ఇదొక మౌలిక మైన ప్రశ్న కావచ్చు. 

2. ఒక మతాన్ని రక్షించడం ప్రభుత్వ ధర్మం కాదు. కాని కొన్ని ప్రభుత్వ సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. అన్నీ మతాలకూ ఉన్నాయి. oriental కళాశాలలు మూత పడే స్థితిలో ఉండడం కూడా పై పరిస్థితికి ఒక ముఖ్య కారణం. వీటిలో తయారైన పండితులు ఒక తరం వారికి మార్గదర్శకంగా ఉన్నారు. ఇప్పుడా కళాశాలలు మూతపడడంతో ఒక మతానికి సంబంధించిన సిద్ధాంత గ్రంథాలన్నీ శాశ్వతంగా సమాధిలోకి వెళ్ళే స్థితి ఉంది. దీని పట్ల ఈ సంస్థలకు బాధ్యత లేదా? 

3. Cultural heritage అనే పేరిట తాళపత్రాలు, శిథిలాలు రక్షించడానికి వేల కోట్ల వ్యయంతో విభాగాలున్నాయి. మేధాపరమైన వారసత్వాన్ని కేవలం స్కాలర్స్ రూపంలోనే రక్షించాలి. దీనికి సరైన వాతావరణాన్ని నిర్మించడం పై ప్రభుత్వ సంస్థల బాధ్యత కాదా? ఈ పని చేపట్టకపోవడంతో ఒక మతం మరింత అజ్ఞానంలో కూరుకుపోవడం దాని వల్ల దేశ సమగ్రతకే సమ్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని కూడా ప్రభుత్వం గమనించాలి. 

మన దేశంలో అంతర్యుద్ధం వస్తుందని ఐలయ్య తమ గ్రంథం 'హిందూ మతానంతర భారతదేశం' లో స్పష్టంగా చెప్పారు. ప్రమాద ఘంటిక మోగిస్తే సరే గాని, అంతర్యుద్ధం వైపు ప్రయత్నం చేయకూడదని విజ్ఞప్తి. 

- కె.అరవిందరావు ఐపిఎస్ (రిటైర్డ్)
పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
Andhra Jyothi News Paper Dated 17/1/2012 

No comments:

Post a Comment