Monday, March 19, 2012

మహద్‌’పోరాటం



amb-tank
దళితులు విప్లవానికి శంఖారావం పూరించిన దినం 1927 మార్చి 20 వ తేదీ. భారతదేశపు జాతీయ జీవితంలోనూ, సాంఘిక జీవితంలోనూ ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన దినం. దళిత సమాజం మొట్టమొదటి సారిగా వాస్తవమైన ఆందోళనలో పాల్గొన్న దినం. ఒక అస్పృశ్యుడి నాయకత్వంలో తరతరాలుగా తమను అంటరానివారిగా చూస్తూ, సాటి మానవుని కంటే హీనంగా చూస్తున్న మనువాద సమాజానికి సమాధి కట్టేందుకు అంకురార్పణ చేపట్టిన దినం. అదే తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది. ‘చవదార్‌ చెరవులో’ (మహాద్‌ చెరువు) నీళ్ళు తాగి తతిమ్మా జనం లాగే దళితులు మనుషూలే అని చాటి చెబుతూ డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ నాయకత్వాన సమానత్వానికై జరిగిన పోరాటానికి ప్రారంభ సూచిక అయిన చవ్‌దార్గ చెరువు ఘటన జరిగి మార్చి 20 నాటికి 85 సంవత్సరాలు గడుస్తూంది. 

డాబి.ఆర్‌.అంబేడ్కర్‌ అప్పటి వరకు అస్పృశ్య సమాజంలో ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని మేలుకొల్ప డానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దళిత సమాజంతో ఆత్మగౌరవం కలిగేటట్టు చూశాడు. మానసికంగా అస్పృశ్య సమాజం ఎంత ముందుకు వెళ్ళిందో అంచనా వేసుకున్నాడు. అస్పృశ్యుల గుండెల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని అయితే నాటగలిగాడు కాని వస్తాదుకు పోటిలో దిగేంతవరకూ తన శక్తి మీద తనకు నమ్మకం కుదరదు, తన బలాన్ని శత్రు సైనిక బలంతో పోల్చి అంచనా వేయడం కుదరదు. అట్లాగే ప్రయత్న పూర్వకంగా పోరాటంలోకి దిగిన తర్వాతే అస్పృ శ్య సమాజానికి ఉన్న శక్తి ఎంత అనేది పరీక్షిం చడానికి వీలు కలుగుతుంది. అంబేడ్కర్‌కు కూడా ఇదే భావం కలిగింది. అస్పృశ్య సమాజం తన శక్తి సామార్థ్యాలను నిరుపించుకునేందుకు సమయం ఆసన్నమైంది, దానికి మూహుర్తాన్ని మార్చి 20న నిర్ణయించారు.

నిచ్చనమెట్ల కుల సమాజంలో మూడువేల సంవత్సరాలుగా పంచమ కులంగా అగ్రవర్ణ సమాజంచే చీదరించబడుతూ, మంచి నీటి చెరువులకు, నదులకు, విద్యాసంస్థలకు, కోర్టులకు, దేవాలయాలవంటి సార్వజనిన స్థలాలన్నింటికి దూరంగా ఉంచిన మనుధర్మాన్ని ధిక్కరించడానికి పూనుకున్నాడు. దీనికి వేదికగా మహాదను ఎన్నుకున్నాడు. దీనికి కారణం మహాద ఆయనకు బాగా తెలిసిన ప్రాంతం. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్‌ పుచ్చుకున్న మహార్‌ జాతికి చెందిన జనం మహాదలోనే నివాసాలు ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా అక్కడ నివశిస్తున్న వారిలో చాలామందికి సాంఘీక కార్యకలాపాల గురించి అవగాహన ఉంది. వీళ్ళందరూ అవసరం వచ్చినపడు జాతికోసం తమ ప్రాణాలని సైతం ఫణంగా పెట్టడానికి సిద్దపడతారనే నమ్మకం బాబాసాహెబ్‌కు ఉంది. 

అనుకున్నట్టుగానే మార్చి 19న మహాదలో పరిషత్‌ను ప్రారంభించడానికి నిర్ణయించారు. దీనిలో పాల్గొనడానికి గుజరాత్‌, మహారాష్ర్టకి చెందిన పల్లెలనుండి సుమారు ఐదువేల మంది జనం వచ్చారు. సాయంత్రం పరిషత్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేయబోయే కార్యాన్ని గురించి బాబసాహెబ్‌ ప్రారం భసూచకంగా ప్రసంగాన్ని ఇచ్చాడు. 1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగి లి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఊహని మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. అస్పృశ్య వర్గం వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. దళితుల ఆత్మగౌరవాన్ని మేలుకొలిపేటట్లు ఆయన ఉపన్యసించాడు.ఈ ఉపన్యాసం ఆయన కోరు కున్న ప్రభావాన్ని జనంలో కలిగించింది. మహాద చెరువు విషయంలో ఆ సమయంలోనే మహాద్‌ మున్సిపాలిటీ ఒక తీర్మానం చేసింది. ‘ఈ చెరువు సార్వజనికమైనదని దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చు’అని ఈ తీర్మానం సారాంశం. 

devid
ఈ తీర్మానం బాబాసాహెబ్‌కు పోరాటానికి మార్గాన్ని సులభతరం చేసినట్టయింది. రెండవరోజు మార్చి 20న ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం మొదలయ్యింది. ముందస్తుగా మహాద మున్సిపాలిటి చేసిన తీర్మానాన్ని అమోదించారు. ఈ తీర్మానాన్ని వెంటనే అమలు పెట్టాలని లక్ష్యంతో బాబాసాహెబు ముందు నడవగా ఐదువేల మంది దళిత సమాజం ఊరేగింపుగా, ఉత్సాహాంగా పాటలు పాడుతూ చవ్‌దార్‌ చెరువు గట్టుకు చేరుకున్నారు. బాబాసాహెబ్‌, ఆ తర్వాత దళిత సమాజం అంతా తరతరాలుగా తమ జాతికి దూరంగా ఉంచబడిన మంచి నీటిని దోసిట్లోకి తీసుకుని తాగి మనుధర్మాన్ని ధిక్కరించారు. ఈ తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది అయిన సంఘటన జరిగి నేటికి 86 సంవత్సరాలు గడిచిపోయింది. స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కులవివక్షత, అంటరాతనం వివిధ రూపాల్లో నేటికి కొనసాగుతోంది. 

1927 మార్చి20మహద్‌చెరువుపోరాటంజరిగిరోజు
Surya News Paper Dated : 20/03/2012  

No comments:

Post a Comment