Wednesday, September 7, 2011

వెన్నువిరిచే కౌలు ఆర్డినెన్స్ - ముప్పాళ్ళ భార్గవ శ్రీ Andhra Jyothi 08/09/2011


వెన్నువిరిచే కౌలు ఆర్డినెన్స్
- ముప్పాళ్ళ భార్గవ శ్రీ

కౌలు రైతుల మేలు కోసం తీసుకొచ్చిన రుణరహత కార్డుల ఆర్డినెన్స్‌ను అమలులోకి తెచ్చేందుకు జూలై 10 నుంచి కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ అసలు పేరు కౌలు రైతుల ఆర్డినెన్స్ అయితే దానికి మరికొంత నగిషీ చెక్కి కౌలు రైతులను మరింతగా మోసగించే విధంగా 'భూమి లైసెన్స్ పొందిన సాగుదారు'ల పేరుతో రుణఅర్హత కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

కౌలు రైతులు సేద్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో వీరి సంఖ్య 26 లక్షల వరకూ ఉంది. వీరు ఎక్కువగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వున్నారు. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బిసి సామాజిక వర్గాలకు చెందిన వ్యవసాయకులాల వారే. పేద, మధ్యతరగతి వర్గాల రైతులు అత్యధిక సంఖ్యలో వున్నారు. వీరి సేద్యం సమస్యలమయంగా మారింది. సరళీకృత ఆర్ధిక విధానాలతో వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న యాంత్రీకరణ, కాంట్రాక్టు కూలి విధానంతో సేద్యపు పనులు కుదించుకుపోయి, ఉపాధి అవకాశాలు తగ్గి కూలి పనులు దొరకడం లేదు.

ఈ పరిస్థితుల్లో కౌలు సేద్యం ద్వారా ఉపాధి లభిస్తుందనే ఆశతో ఈ సేద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులు నానాటికీ పెరుగుతుండటం, కావాల్సిన భూమి తక్కువగా ఉండటంతో కౌలురేట్లు పెరుగుతూ వస్తున్నాయి. వీటికి తోడు బ్యాంకులు అప్పులివ్వకపోవడంతో పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడి సేద్యం చేస్తున్నా పంట చేతికి వచ్చేదాకా ఏ ఉపద్రవం వచ్చిపడుతుందోననే భయం వారిని పట్టిపీడిస్తున్నది.

పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోవాల్సి వస్తోంది. చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్నవి అమ్మి రోడ్డున పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన పంటకు ప్రభుత్వమిచ్చే సాయం వీరికి అందదు. బ్యాంకులు రుణాలిచ్చేందుకు మొండి చేతులు చూపటంతో అనాథలుగా మారిపోయారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో సర్వంకోల్పోయి, అప్పులు తీర్చలేక, వడ్డీవ్యాపారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నా రు. రైతు ఆత్మహత్యల్లో కౌలు రైతులే ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం.

గత ఏడాది వరదలు, భారీ వర్షాలకు అపార పంట నష్టం జరిగి రైతులు బాగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన వారికి ప్రకటించిన నామమాత్రపు సహాయం కూడా కౌలురైతులకు అందకపోవటంతో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వచ్చిందే కౌలు రైతులకు రుణ పరపతి ముసాయిదా బిల్లు. దీని ద్వారా కౌలు రైతులకు రుణ పరపతి కార్డులు అందజేస్తామని, ఆ కార్డుల ద్వారా బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది. ఇది కూడా కౌలు రైతులను వంచించడానికేనని అర్ధం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు.

ఇప్పటికే రాష్ట్రంలో కౌలుదారీ చట్టం ఉంది. ఈ చట్టంలోని కొన్ని లొసుగుల వలన కౌలు విధానంలో చట్టం అమలు కాకుండా చేస్తున్నారు. ఈ చట్టం వలన కౌలుదారులకు కొన్ని హక్కులు ఏర్పడతాయి. కౌలుదారునిగా గుర్తింపు లభిస్తుంది. భూమి నుండి కనీసం ఆరు సంవత్సరాల పాటు కౌలుదారుణ్ణి తొలగించడానికి అవకాశం ఉండదు. బ్యాంకుల నుండి రుణాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం యిచ్చే పరిహారాలు, సహాయం నేరుగా వీరికి అందుతుంది.

ఈ చట్టం కొద్ది మంది కౌలు దారులకే వర్తించటంతో అత్యధికులు మూజువాణి కౌలుదారులుగా ఎలాంటి హక్కులు లేకుండా ఉన్నారు. ఈ చట్టాన్ని కౌలురైతులకు వర్తించే విధంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చట్టాన్ని నిర్వీర్యం చేసి కౌలుదారులకు చట్టబద్ధమైన హక్కులు లేకుండా చేయటం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దీనిలో భాగంగానే రుణపరపతి కార్డులు ప్రవేశపెట్టింది. ముసాయిదాలో కౌలుదారులను గుర్తించి, భూ యజమానులకు ఇష్టం ఉన్నా లేకపోయినా సర్వేనంబరుతో రుణపరపతి కార్డులు అందజేస్తామని చెప్పి రైతులు, కౌలుదారుల మధ్య తగువు పెట్టింది.

రుణపరపతి కార్డుల వల్ల ప్రభుత్వం సహాయం కొం త మేర అందవచ్చేమో గాని బ్యాంకు రుణాలు మాత్రం అందవు. హామీ లేకుండా అప్పు ఇవ్వటానికి బ్యాంకులు అంగీకరించకపోవటం అందుకు కారణం. ప్రతి సంవత్సరం కౌలు ఒప్పందం చేసుకోవాల్సిందే. కౌలుదారు లు మారవచ్చు. భూమిపై కౌలుదారునికి ఎటువంటి హక్కు ఉండదు. దీనిపై రైతులు-కౌలుదారులు లేని ప్రాంతీయ సమావేశాలు జరిపి ప్రభు త్వం తుది ముసాయిదాను తయారుచేసింది. దీన్ని గత అసెంబ్లీలోనే ప్రవేశపెడతామని చెప్పి, అలా చేయకుండా కేంద్ర పరిశీలనకు పంపింది.

మార్చి-ఏప్రిల్ లోపే రుణ పరపతి కార్డులు అందజేయటానికి చట్టాన్ని తేవలసి ఉండగా అందుకు చర్యలు తీసుకోలేదు. రుణ పరపతి కార్డులు ఈ సంవత్సరం అందే పరిస్థితి లేకపోవటం, కార్డులను అందజేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల కౌలు రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో గత జూన్ 8న హడావుడిగా కౌలు రైతుల లైసెన్స్ ఆర్డినెన్స్‌ను విడుదల చేసి గవర్నర్‌చే ఆమోదముద్ర వేయించింది. దీని ద్వారా జూన్ 21 నుండి గ్రామ సభలు జరిపి కౌలుదారులను గుర్తించి వారికి కార్డులు అందజేస్తామని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.

ఈ కార్డుల ద్వారా బ్యాంక్ రుణాలు, పంట నష్టపరిహారాలు, ఇన్‌పుట్ సబ్సిడీ లాంటి సహాయం పొందవచ్చని పేర్కొంది. కార్డులు పొందటానికి, బ్యాంకు రుణాలు పొందడానికి భూయజమానుల అనుమతి తప్పనిసరి అని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. కాబట్టి ఇది ఆచరణలో అమలు జరగదు. ప్రభుత్వమే రైతుల్లో కొన్ని అనుమానాలు సృష్టించటం వలన కౌలుకిచ్చే రైతు, కౌలుదారు అప్పుతీసుకోవడానికి అంగీకారం తెలిపే పరిస్థితి ఉండదు. హామీ లేకుండా బ్యాంకులు అప్పులు ఇవ్వనంటున్నాయి. కాబట్టి ఈ ఆర్డినెన్స్ వలన కౌలు రైతులకు రుణాలు రావు.

కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా వర్తింపచేయటానికి ఇష్టపడని ప్రభుత్వం ముసాయిదాలు, ఆర్డినెన్స్‌లు తయారు చేయటం, అవి అమలు జరగకపోవటం కంటే, ప్రభుత్వమే హామీ ఉండి కౌలు రైతులకు బ్యాంకుల నుండి రుణాలు ఇప్పంచటానికి చొరవ చూపటం లేదు. కౌలుదారీ చట్టాన్ని అమలు జరపకుండా రుణ పరపతి ముసాయిదా బిల్లు, కౌలు లైసెన్స్ ఆర్డినెన్స్‌ల పేర రైతులు-కౌలుదారుల మధ్య వైషమ్యాన్ని సృష్టిస్తోంది. వారికి రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తూ కౌలురైతులను సేద్యం నుండి తొలగించే పరిస్థితి కల్పించి, కాంట్రాక్ట్, కార్పొరేట్ వ్యవసాయమే దిక్కు అనే పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

కౌలు రైతులను సంయుక్త బాధ్యతా బృందాలు గా ఏర్పాటు చేసి, ఐటిసి వంటి కంపెనీలు ప్రతిపాదిస్తున్న రైతు క్లబ్బుల వంటి కాంట్రాక్టు సాగుకు అవసరమయ్యే విధంగా రైతాంగ సంస్థల ఏర్పాటుకు దారివేసే ప్రయత్నంలో భాగంగానే కౌలు లైసెన్స్ తీసుకొచ్చింది. వ్యవసాయానికి అండగా వున్న కౌలురైతుల వెన్నెముకను విరవడానికి పూనుకుంది. భూ యజమానులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వమే హామీగా వుండి కౌలు రైతులకు రుణ సౌకర్యం కల్పించాలి. వీటి కోసం వ్యవసాయ కూలీలు, పేద, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు సమైక్యపోరాటం చేసేందుకు ముందుకు రావాలి.

- ముప్పాళ్ళ భార్గవ శ్రీ
సిపిఐ(ఎం-ఎల్) రాష్ట్రకమిటీ సభ్యులు

No comments:

Post a Comment